31-08-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైన పిల్లలూ- తండ్రితో నిజాయితీగా ఉండండి, మీ సత్యాతి-సత్యమైన చార్టును పెట్టండి, ఎవ్వరికీ దుఃఖమునివ్వకండి, ఒక్క తండ్రి శ్రేష్ఠ మతంపై నడుస్తూ ఉండండి"

ప్రశ్న:-

ఎవరైతే పూర్తిగా 84 జన్మలు తీసుకుంటారో, వారి పురుషార్థము ఎలా ఉంటుంది?

జవాబు:-

వారు నరుని నుండి నారాయణునిగా తయారయ్యే విశేష పురుషార్థము చేస్తారు. తమ కర్మేంద్రియాలపై వారికి పూర్తిగా కంట్రోల్ ఉంటుంది. వారి కళ్ళు వికారిగా (క్రిమినల్ గా) ఉండవు. ఒకవేళ ఇప్పటివరకూ కూడా ఎవరినైనా చూసినప్పుడు వికారీ ఆలోచనలు వస్తూ ఉంటే, వికారీ దృష్టి ఉన్నట్లయితే వారు పూర్తిగా 84 జన్మలు తీసుకునే ఆత్మ కాదు అని అర్థం చేసుకోండి.

గీతము:-

ఈ పాపపు ప్రపంచము నుండి ఎక్కడికైనా దూరంగా తీసుకువెళ్ళు...... (ఇస్ పాప్ కీ దునియా సే ......)

ఓంశాంతి. ఇది పాపపు ప్రపంచమని మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలకు తెలుసు. పుణ్య ప్రపంచము గురించి కూడా మనుష్యులకు తెలుసు. ముక్తి మరియు జీవన్ముక్తి అని పుణ్య ప్రపంచాన్ని అంటారు. అక్కడ పాపము జరగదు. దుఃఖధామమైన రావణ రాజ్యములో పాపము జరుగుతుంది. దుఃఖమునిచ్చే రావణుడిని కూడా చూశారు, రావణుడు ఒక వస్తువేమీ కాదు అయినా కూడా దిష్టిబొమ్మను కాలుస్తారు. మేము ఈ సమయంలో రావణ రాజ్యములో ఉన్నామని పిల్లలకు తెలుసు, కానీ అక్కడ నుండి పక్కకు వచ్చేశాము. మనమిప్పుడు పురుషోత్తమ సంగమయుగములో ఉన్నాము. పిల్లలు ఇక్కడకు వచ్చినప్పుడు, మమ్మల్ని మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేసే ఆ తండ్రి వద్దకు మేము వెళ్తున్నామని వారి బుద్ధిలోకి వస్తుంది. సుఖధామానికి యజమానులుగా చేస్తారు. సుఖధామానికి యజమానులుగా చేసేవారు బ్రహ్మా కానీ, ఏ దేహధారీ కానీ కాదు. చేసేవారు శివబాబా మాత్రమే, వారికి దేహము లేదు. మీకు కూడా దేహము ఉండేది కాదు, కానీ మీరు మళ్ళీ దేహం తీసుకొని జనన-మరణాలలోకి వస్తారు, కనుక మేము అనంతమైన తండ్రి వద్దకు వెళ్తున్నామని మీరు భావిస్తారు. వారు మనకు శ్రేష్ఠ మతమునిస్తారు. మీరు అటువంటి పురుషార్థము చేసినట్లయితే స్వర్గానికి యజమానులుగా అవ్వగలరు. స్వర్గాన్నైతే అందరూ స్మృతి చేస్తారు. కొత్త ప్రపంచము తప్పకుండా ఉందని భావిస్తారు. దానిని స్థాపించేవారు కూడా తప్పకుండా ఎవరో ఉన్నారు. నరకాన్ని కూడా ఎవరో స్థాపిస్తారు. సుఖధామములోని మీ పాత్ర ఎప్పుడు పూర్తి అవుతుందో కూడా మీకు తెలుసు. మళ్ళీ రావణ రాజ్యములో మీరు దుఃఖితులుగా అవ్వడం మొదలుపెడతారు. ఈ సమయంలో ఇది దుఃఖధామం. ఎంత కోటీశ్వరులైనా, పదమపతులైనా కానీ దీనిని తప్పకుండా పతిత ప్రపంచమనే అంటారు కదా. ఇది నిరుపేద ప్రపంచము, దుఃఖపు ప్రపంచము. ఎంత పెద్ద-పెద్ద భవనాలున్నా, సుఖ సాధనాలన్నీ ఉన్నా దీనిని పాత పతిత ప్రపంచమనే అంటారు. విషయ వైతరణీ నదిలో మునకలు వేస్తూ ఉంటారు. వికారాలలోకి వెళ్ళడం పాపమని కూడా అర్థం చేసుకోరు. వికారాలు లేకుండా సృష్టి ఎలా వృద్ధి చెందుతుందని అంటారు. ఓ భగవంతుడా, ఓ పతిత-పావనా, వచ్చి ఈ పతిత ప్రపంచాన్ని పావనంగా తయారుచేయండి అని పిలుస్తారు కూడా. ఆత్మ శరీరము ద్వారా అంటుంది. ఆత్మయే పతితంగా అయింది, అందుకే పిలుస్తుంది. స్వర్గములో ఒక్కరు కూడా పతితులు ఉండరు.

మేము 84 జన్మలు తీసుకున్నాము, మళ్ళీ లక్ష్మీ-నారాయణులతో పాటుగా మేము సత్యయుగంలో రాజ్యము చేస్తామని, సంగమయుగంలో మంచి పురుషార్థీలు మాత్రమే భావిస్తారు - ఇది పిల్లలైన మీకు తెలుసు. ఒక్కరు మాత్రమే 84 జన్మలు తీసుకోలేదు కదా. రాజుతో పాటు ప్రజలు కూడా కావాలి. బ్రాహ్మణులైన మీలో కూడా నంబరువారుగా ఉన్నారు. కొందరు రాజా-రాణులుగా అవుతారు, కొందరు ప్రజలుగా అవుతారు. పిల్లలూ, మీరు దైవీగుణాలను ధారణ చేయాలి అని తండ్రి చెప్తున్నారు. ఈ కళ్ళు అశుద్ధమైనవి, ఎవరినైనా చూసినప్పుడు వికారీ దృష్టి కలిగినట్లయితే వారికి 84 జన్మలు ఉండవు. వారు నరుని నుండి నారాయణుడిగా అవ్వలేరు. ఈ కళ్ళపై విజయము సాధించినప్పుడు కర్మాతీత స్థితి ఏర్పడుతుంది. ఆధారమంతా కళ్ళపైనే ఉంది, కళ్ళే మోసము చేస్తాయి. ఆత్మ ఈ కిటికీల ద్వారా చూస్తుంది, వీరిలో డబల్ ఆత్మ ఉంది. తండ్రి కూడా ఈ కిటికీల ద్వారానే చూస్తున్నారు. నా దృష్టి కూడా ఆత్మ వైపే వెళ్తుంది. తండ్రి ఆత్మకే అర్థం చేయిస్తారు. నేను కూడా శరీరము తీసుకున్నాను, అందుకే మాట్లాడగలుగుతున్నానని చెప్తారు. బాబా మనల్ని సుఖపు ప్రపంచములోకి తీసుకువెళ్తారని మీకు తెలుసు. ఇది రావణ రాజ్యము. మీరు ఈ పతిత ప్రపంచము నుండి పక్కకు వచ్చేశారు. కొందరు చాలా ముందుకు వెళ్ళిపోయారు, కొందరు వెనుకే ఉండిపోయారు. తీరాన్ని దాటించండి అని ప్రతి ఒక్కరూ అంటారు కూడా. ఇప్పుడు దాటేస్తూ సత్యయుగానికి వెళ్ళిపోతాము. కానీ అక్కడ ఉన్నత పదవిని పొందాలంటే పవిత్రంగా అవ్వాలి. శ్రమ చేయాలి. తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి అన్నది ముఖ్యమైన విషయము. ఇది మొట్టమొదటి సబ్జెక్టు.

ఆత్మలైన మనము పాత్రధారులమని మీకిప్పుడు తెలుసు. మొట్టమొదట మనము సుఖధామంలోకి వచ్చాము, మళ్ళీ ఇప్పుడు దుఃఖధామములోకి వచ్చేసాము. ఇప్పుడు మళ్ళీ సుఖధామములోకి తీసుకువెళ్ళేందుకు తండ్రి వచ్చారు. నన్ను స్మృతి చేయండి మరియు పవిత్రంగా అవ్వండి, ఎవ్వరికీ దుఃఖమునివ్వకండి అని చెప్తున్నారు. పరస్పరం చాలా దుఃఖమునిచ్చుకుంటూ ఉంటారు. కొందరిలో కామమనే భూతము వస్తుంది, కొందరిలో క్రోధము వస్తుంది, చేయి ఎత్తుతారు. వారైతే దుఃఖమునిచ్చే పాపాత్ములు అని తండ్రి అంటారు. ఇప్పటివరకూ పాపాలు చేస్తూనే ఉంటే, పుణ్యాత్మలుగా ఎలా అవుతారు. వారైతే పేరును పాడు చేస్తారు. అందరూ ఏమంటారు! మమ్మల్ని భగవంతుడు చదివిస్తున్నారు, మేము మనుష్యుల నుండి దేవతలుగా, విశ్వానికి యజమానులుగా అవుతున్నామని అంటారు, అయినా ఇటువంటి పనులు చేస్తారా ఏమిటి! అందుకే రోజూ రాత్రి స్వయాన్ని పరిశీలించుకోండి అని తండ్రి చెప్తున్నారు. సుపుత్రులైన పిల్లలైతే చార్టును పంపిస్తారు. కొందరు చార్టు వ్రాస్తారు కానీ దానితో పాటు మేము ఎవరికైనా దుఃఖమునిచ్చామా లేదా ఏదైనా తప్పు చేశామా అన్నది వ్రాయరు. స్మృతి చేస్తూ ఉంటారు మరియు వ్యతిరేక కర్మలు కూడా చేస్తూ ఉంటారు, ఇది కూడా సరైనది కాదు. దేహాభిమానులుగా అయినప్పుడే వ్యతిరేక కర్మలు చేస్తారు.

ఈ చక్రము ఎలా తిరుగుతుంది అన్నది చాలా సహజం. ఒక్క రోజులోనే టీచరుగా అవ్వవచ్చు. తండ్రి మీకు 84 జన్మల రహస్యాన్ని అర్థం చేయిస్తారు, శిక్షణనిస్తారు. తర్వాత వెళ్ళి మేము 84 జన్మలు ఎలా తీసుకున్నాము అన్నదాని గురించి మననము చేయాలి. కొందరు నేర్పించే టీచరు కన్నా కూడా ఎక్కువగా దైవీ గుణాలు ధారణ చేస్తారు. బాబా ఋజువు చేసి చెప్పగలరు. బాబా, మా చార్టు చూడండి, మేము ఎవ్వరికీ కొద్దిగా కూడా దుఃఖమునివ్వలేదు అని చూపిస్తారు. ఈ బిడ్డ అయితే చాలా మధురమైనవారు, మంచి సుగంధాన్ని ఇస్తారు అని బాబా అంటారు. టీచరుగా అవ్వడం అయితే క్షణంలోని పని. టీచరు కన్నా కూడా విద్యార్థులు స్మృతియాత్రలో చురుకుగా ముందుకువెళ్ళిపోతారు. అప్పుడు టీచరు కన్నా కూడా ఉన్నత పదవిని పొందుతారు. ఎవరికి నేర్పిస్తున్నారు అని బాబా అయితే అడుగుతారు. రోజూ శివుని మందిరాలకు వెళ్ళి, శివబాబా వచ్చి ఏ విధంగా స్వర్గ స్థాపన చేస్తారో, ఏ విధంగా స్వర్గానికి యజమానిగా తయారుచేస్తారో నేర్పించండి. ఇది అర్థం చేయించడం చాలా సహజం. బాబా, మా స్థితి ఇలా ఉంది అని బాబాకు చార్టు పంపిస్తారు. పిల్లలూ, ఎటువంటి వికర్మనైతే చేయడం లేదు కదా, వికారీ దృష్టి వ్యతిరేకమైన కర్మలు చేయించడం లేదు కదా అని బాబా అడుగుతారు. మీ నడవడికను, స్వభావాన్ని పరిశీలించుకోండి. వ్యవహారం-నడవడిక అంతా కళ్ళపైనే ఆధారపడి ఉంది. కళ్ళు అనేక రకాలుగా మోసము చేస్తాయి. ఏ వస్తువునైనా అడగకుండా తీసుకొని తినడం కూడా పాపమైపోతుంది, ఎందుకంటే అనుమతి లేకుండా తీసుకున్నారు కదా. ఇక్కడ చాలా నియమాలున్నాయి. శివబాబా యజ్ఞము కదా. నిమిత్తంగా ఉన్నవారిని అడగకుండా వస్తువును తినకూడదు. ఒకరు తిన్నట్లయితే ఇతరులు కూడా ఆ విధంగా చేయడం మొదలుపెడతారు. వాస్తవానికి ఇక్కడ ఏ వస్తువునూ తాళం వేసి లోపల పెట్టాల్సిన అవసరం లేదు. ఈ ఇంట్లోకి, వంట గదిలోకి అపవిత్రంగా ఉన్నవారెవరూ రాకూడదని లా చెప్తుంది. బయట అయితే అపవిత్రమైనవారు, పవిత్రమైనవారు అన్న ప్రశ్నే లేదు. కానీ వారు స్వయాన్ని పతితులు అని అంటారు కదా. అందరూ పతితులు. వల్లభాచార్యులను కానీ, శంకరాచార్యులను కానీ ఎవరూ తాకేందుకు అనుమతినివ్వరు ఎందుకంటే మేము పావనంగా ఉన్నాము, వీరు పతితంగా ఉన్నారు అని వారు భావిస్తారు. ఇక్కడ అందరి శరీరాలు పతితంగా ఉన్నాయి, అయినా కూడా పురుషార్థానుసారంగా వికారాలను సన్యాసం చేస్తారు. కనుక నిర్వికారుల ఎదుట వికారీ మనుష్యులు తల వంచుతారు. వీరు చాలా స్వచ్ఛమైన ధర్మాత్మ అని అంటారు. సత్యయుగంలోనైతే అపవిత్రమైనవారు ఉండరు. అది పవిత్ర ప్రపంచము. అక్కడ ఒకే కేటగిరీ ఉంటుంది. మీకు ఈ రహస్యాలన్నీ తెలుసు. ప్రారంభము నుండి మొదలుకొని సృష్టి ఆదిమధ్యాంతాల రహస్యం బుద్ధిలో ఉండాలి. మనకు అన్నీ తెలుసు. ఇక తెలుసుకోవలసిందేమీ లేదు. రచయిత అయిన తండ్రి గురించి తెలుసుకున్నారు, సూక్ష్మవతనం గురించి తెలుసుకున్నారు, భవిష్య పదవి గురించి తెలుసుకున్నారు, దీని కోసమే పురుషార్థము చేస్తున్నారు, అయినా ఒకవేళ నడవడిక పాడైపోతే ఉన్నత పదవిని పొందలేరు. ఎవరికైనా దుఃఖమునివ్వడం, వికారాలలోకి వెళ్ళడం లేదా చెడు దృష్టి కలిగి ఉండడం, ఇవి కూడా పాపాలు. దృష్టిని పరివర్తన చేసుకోవడంలో చాలా శ్రమ ఉంది. దృష్టి చాలా బాగుండాలి. వీరు క్రోధం చేస్తున్నారు అని మీ కళ్ళు చూస్తే, ఇక మీరు కూడా గొడవపడడం మొదలుపెడతారు. శివబాబా పట్ల కొద్దిగా కూడా ప్రేమ లేదు, స్మృతియే చేయరు. బలిహారం శివబాబాది. గురువైన మీదే బలిహారం........ గోవిందుడైన శ్రీ కృష్ణుని సాక్షాత్కారము చేయించిన ఆ సద్గురువుదే బలిహారం. గురువు ద్వారా మీరు గోవిందునిగా అవుతారు. కేవలం సాక్షాత్కారము ద్వారానే నోరు తీపి అవ్వదు. మీరా నోరు తీపిగా అయ్యిందా? వాస్తవానికి స్వర్గానికి వెళ్ళలేదు. అది భక్తిమార్గము, దానిని స్వర్గ సుఖమని అనరు. గోవిందుడిని కేవలం చూడడం కాదు, ఆ విధంగా తయారవ్వాలి. మీరిక్కడకు ఆ విధంగా తయారయ్యేందుకే వచ్చారు. మమ్మల్ని ఆ విధంగా తయారుచేసేవారి వద్దకు మేము వెళ్తున్నామన్న నషా ఉండాలి. నా కళ్ళు అయితే మోసం చేయలేదు కదా, పాపమైతే చేయలేదు కదా అన్నది చార్టులో వ్రాయమని బాబా అందరికీ సలహానిస్తున్నారు. కళ్ళు ఏదో ఒక విషయంలో తప్పకుండా మోసము చేస్తాయి. కళ్ళు పూర్తిగా శీతలంగా అయిపోవాలి. స్వయాన్ని అశరీరిగా భావించండి. ఈ కర్మాతీత స్థితి చివర్లో ఏర్పడుతుంది, అది కూడా బాబాకు తమ చార్టు పంపిస్తేనే అవుతుంది. ధర్మరాజు రిజిస్టరులో అన్నీ ఆటోమేటిక్ గా జమ అవుతాయి. కానీ తండ్రి సాకారంలో వచ్చారు కనుక సాకారునికి తెలియాలి అని అంటున్నారు. అప్పుడు అప్రమత్తం చేస్తారు. వికారీ దృష్టి లేక దేహాభిమానము కలవారిగా ఉన్నట్లయితే వాయుమండలాన్ని అశుద్ధం చేస్తారు. ఇక్కడ కూర్చుని ఉన్నా కూడా బుద్ధి యోగము బయటకు వెళ్ళిపోతుంది. మాయ చాలా మోసము చేస్తుంది. మనసు చాలా తుఫానులు తీసుకొస్తుంది. ఈ విధంగా తయారయ్యేందుకు ఎంతో శ్రమ చేయవలసి ఉంటుంది. బాబా వద్దకు వస్తారు, బాబా ఆత్మను జ్ఞానముతో అలంకరిస్తారు. మేము ఆత్మలము, జ్ఞానము ద్వారా పవిత్రంగా అవుతామని భావిస్తారు. తర్వాత శరీరము కూడా పవిత్రమైనది లభిస్తుంది. ఆత్మ మరియు శరీరము రెండూ సత్యయుగంలోనే పవిత్రంగా ఉంటాయి. అర్థకల్పము తర్వాత రావణరాజ్యం ఏర్పడుతుంది. భగవంతుడు ఇలా ఎందుకు చేశారు అని మనుష్యులు అంటారు. ఇది అనాదిగా తయారైన డ్రామా. భగవంతుడైతే ఏమీ చేయలేదు. సత్యయుగంలో ఒక్క దేవీ-దేవతా ధర్మమే ఉంటుంది. మరి అటువంటి భగవంతుడిని మేమెందుకు స్మృతి చేయాలి అని కొందరు అడుగుతారు. కానీ మీకు ఇతర ధర్మాలతో పని లేదు. ఎవరైతే ముళ్ళుగా అయ్యారో, వారే వచ్చి పుష్పాలుగా అవుతారు. భగవంతుడు కేవలం భారతవాసులనే స్వర్గానికి తీసుకువెళ్తారా, మేము అంగీకరించము, భగవంతుడికి కూడా రెండు కళ్ళు ఉంటాయా అని మనుష్యులు అడుగుతారు. కానీ ఇదైతే డ్రామా తయారై ఉంది. అందరూ స్వర్గములోకి వచ్చేస్తే, మరి అనేక ధర్మాల పాత్ర ఎలా నడుస్తుంది? స్వర్గంలో ఇన్ని కోట్లమంది ఉండరు. మొట్టమొదట భగవంతుడు ఎవరు అన్న ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకోండి. ఇది అర్థం చేసుకోకపోతే అనేక ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. స్వయాన్ని ఆత్మగా భావించినట్లయితే ఈ విషయము సరైనది అని అంటారు. మనము పతితుల నుండి పావనంగా తప్పకుండా అవ్వాలి. ఆ ఒక్కరినే స్మృతి చేయాలి. అన్నీ ధర్మాలలో భగవంతుడిని స్మృతి చేస్తారు.

పిల్లలైన మీకిప్పుడు ఈ జ్ఞానము లభిస్తుంది. ఈ సృష్టిచక్రము ఎలా తిరుగుతుందో మీకు తెలుసు. మీరు ప్రదర్శనీలలో కూడా ఎంతగానో అర్థం చేయిస్తారు. చాలా కొద్దిమంది మాత్రమే వెలువడతారు. కానీ ప్రదర్శినీలు ఇక చేయకూడదు అని కాదు. డ్రామాలో ఉంది, చేశాము, కొన్ని చోట్ల ప్రదర్శినీల ద్వారా కూడా వెలువడతారు. కొన్ని చోట్ల వెలువడరు. మున్ముందు వస్తారు, ఉన్నత పదవిని పొందే పురుషార్థము చేస్తారు. ఎవరైనా తక్కువ పదవి పొందేది ఉంటే అంత పురుషార్థము చేయరు. అయినా ఎటువంటి వికర్మా చేయకండి అని తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తూ ఉంటారు. మేము ఎవ్వరికీ దుఃఖమునైతే ఇవ్వలేదు కదా, ఎవరితోనూ గొడవపడలేదు కదా, విరుద్ధంగా మాట్లాడలేదు కదా, ఎటువంటి అకర్తవ్య కార్యాన్ని చేయలేదు కదా అని కూడా నోట్ చేసుకోండి. చేసిన వికర్మలను రాయండి అని తండ్రి చెప్తున్నారు. ద్వాపర యుగము నుండి మొదలుకొని వికర్మలు చేస్తూ ఇప్పుడు చాలా వికర్ములుగా అయిపోయారు అని మీకు తెలుసు. బాబాకు వ్రాసి ఇస్తే భారము తేలికైపోతుంది. మేము ఎవ్వరికీ దుఃఖమునివ్వము అని వ్రాస్తారు. అచ్ఛా, చార్టును తీసుకొని వస్తే చూస్తానని బాబా అంటారు. అటువంటి మంచి పిల్లలను చూడాలనుకుంటారు కనుక తండ్రి వారిని పిలుస్తారు. సుపుత్రులైన పిల్లలను తండ్రి చాలా ప్రేమిస్తారు. ఇప్పుడింకా ఎవరూ సంపూర్ణం కాలేదని తండ్రికి తెలుసు. పురుషార్థము ఎలా చేస్తున్నారని బాబా ప్రతి ఒక్కరినీ చూస్తారు. పిల్లలు చార్టు వ్రాయడం లేదంటే తప్పకుండా ఏవో లోపాలున్నాయి, వాటిని బాబా వద్ద దాచి పెడుతున్నారు. ఎవరైతే చార్టు వ్రాస్తారో వారే సత్యమైన నిజాయితీగల పిల్లలని భావిస్తాను. చార్టుతో పాటు మళ్ళీ నడవడిక కూడా ఉండాలి. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. స్వయంలోని భారమును తేలికగా చేసుకునేందుకు ఏ వికర్మలైతే చేశారో, వాటిని తండ్రికి వ్రాసి ఇవ్వాలి. ఇప్పుడు ఎవ్వరికీ దుఃఖమునివ్వకూడదు. సుపుత్రులుగా అయి ఉండాలి.

2. తమ దృష్టిని చాలా మంచిగా చేసుకోవాలి. కళ్ళు మోసము చేయకూడదు - వాటిని సంభాళించుకోవాలి. తమ నడవడికను చాలా-చాలా మంచిగా ఉంచుకోవాలి. కామ-క్రోధాలకు వశమై ఎటువంటి పాపమూ చేయకూడదు.

వరదానము:-

గతాన్ని చింతనలోకి తీసుకురాకుండా ఫుల్ స్టాప్ పెట్టే తీవ్రపురుషార్థీ భవ

ఇప్పటివరకు జరిగిన దానికి - ఫుల్ స్టాప్ పెట్టండి. గతించిన దానిని చింతనలోకి తీసుకురాకండి - ఇదే తీవ్ర పురుషార్థము. ఒకవేళ ఏదైనా గతించిన దానిని గురించి చింతన చేస్తే సమయం, శక్తి, సంకల్పము అన్నీ వృథా అయిపోతాయి. ఇప్పుడు వృథా చేసే సమయం కాదు ఎందుకంటే సంగమయుగంలోని రెండు ఘడియలు అనగా రెండు సెకండ్లు అయినా వృథా చేశారంటే అనేక సంవత్సరాలు వృథా చేసినట్లవుతుంది, అందువలన సమయం యొక్క మహత్వాన్ని తెలుసుకొని ఇప్పుడు గతించిన దానికి ఫుల్స్టాప్ పెట్టండి. ఫుల్స్టాప్ పెట్టడం అనగా సర్వ ఖజానాలతో ఫుల్ గా అవ్వడం.

స్లోగన్:-

ప్రతి సంకల్పం శ్రేష్ఠంగా ఉన్నప్పుడు స్వకళ్యాణము మరియు విశ్వకళ్యాణము జరుగుతుంది.