ఓంశాంతి. ఆత్మిక తండ్రితో ఉన్న మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఎందుకంటే తండ్రి జ్ఞానసాగరుడు. ఏ తండ్రి? శివబాబా. బ్రహ్మాబాబాను జ్ఞానసాగరుడని అనరు. శివబాబాను మాత్రమే పరమపిత పరమాత్మ అని అంటారు. ఒకరు లౌకిక శారీరిక తండ్రి, మరొకరు పారలౌకిక ఆత్మిక తండ్రి. వారు శరీరానికి తండ్రి, వారు ఆత్మలకు తండ్రి. ఇవి బాగా అర్థము చేసుకోవలసిన విషయాలు మరియు ఈ జ్ఞానాన్ని వినిపించేవారు జ్ఞానసాగరుడు. ఏ విధంగా, అందరికీ భగవంతుడు ఒక్కరే అని అంటారో, అదే విధంగా జ్ఞానాన్ని కూడా ఒక్కరే ఇవ్వగలరు. ఇక శాస్త్రాలు, గీత మొదలైనవి ఏవైతే చదువుతారో, భక్తి చేస్తారో, అదేమీ జ్ఞానము కాదు, వీటి ద్వారా జ్ఞాన వర్షము కురవదు, అందుకే భారత్ పూర్తిగా ఎండిపోయింది. నిరుపేదగా అయిపోయింది. ఆ వర్షాలు కురవకపోతే భూమి మొదలైనవన్నీ ఎండిపోతాయి. అది భక్తిమార్గము. దానిని జ్ఞానమార్గమని అనరు. జ్ఞానము ద్వారా స్వర్గ స్థాపన జరుగుతుంది. అక్కడ ఎల్లప్పుడూ భూమి సస్యశ్యామలంగా ఉంటుంది, ఎప్పుడూ ఎండిపోదు. ఇది జ్ఞానం యొక్క చదువు. ఈశ్వరుడైన తండ్రి జ్ఞానాన్నిచ్చి దైవీ సంప్రదాయస్థులుగా తయారుచేస్తారు. నేను ఆత్మలందరికీ తండ్రిని, కానీ నా గురించి మరియు నా కర్తవ్యం గురించి తెలియని కారణంగానే మనుష్యులు ఇంత పతితంగా, దుఃఖితులుగా, అనాథలుగా అయిపోయారు, పరస్పరము కొట్లాడుకుంటూ ఉంటారు అని తండ్రి అర్థం చేయించారు. ఇంట్లో తండ్రి లేకపోతే, పిల్లలు కొట్లాడుకుంటూ ఉంటే, మీ తండ్రి ఉన్నారా లేరా అని అంటారు కదా. ఈ సమయంలో కూడా మొత్తం ప్రపంచానికి తండ్రి గురించి తెలియదు. తెలియని కారణంగా ఇంతటి దుర్గతి ఏర్పడింది. తెలుసుకుంటే సద్గతి కలుగుతుంది. సర్వుల సద్గతిదాత ఒక్కరే. వారినే బాబా అని అంటారు. వారి పేరే శివ. వారి పేరు ఎప్పుడూ మారదు. సన్యాసము స్వీకరించినప్పుడు పేరు మారుస్తారు కదా. వివాహంలో కూడా కుమారి పేరును మారుస్తారు. ఇది ఇక్కడ భారత్ లోని ఆచారము. వేరే చోట అలా జరగదు. ఈ శివబాబా అందరికీ తల్లీ-తండ్రి. నీవే తల్లివి తండ్రివి...... అని కూడా పాడతారు. మీ కృపతోనే అపారమైన సుఖము ప్రాప్తిస్తుందని కూడా భారత్ లోనే పిలుస్తారు. అలాగని భక్తి మార్గములో భగవంతుడు కృప చూపిస్తూ వచ్చారని కాదు. అలా జరగదు, భక్తిలో అపారమైన సుఖం ఉండనే ఉండదు. స్వర్గములో చాలా సుఖముందని పిల్లలకు తెలుసు. అది కొత్త ప్రపంచము. పాత ప్రపంచంలో దుఃఖమే ఉంటుంది. ఎవరైతే జీవిస్తూ పూర్తిగా మరణించి ఉంటారో, వారి పేరు మార్చవచ్చు. కానీ మాయ విజయము పొందడం వలన బ్రాహ్మణుల నుండి శూద్రులుగా అయిపోతారు, అందుకే బాబా పేర్లు పెట్టరు. బ్రాహ్మణుల మాల ఉండదు. పిల్లలైన మీరు సర్వోత్తమ ఉన్నతమైన కులానికి చెందినవారు. ఉన్నతమైన ఆత్మిక సేవ చేస్తున్నారు. ఇక్కడ మీరు కూర్చుని ఉంటూ లేక నడుస్తూ-తిరుగుతూ విశేషంగా భారత్ కు మరియు మొత్తం విశ్వానికి సేవ చేస్తున్నారు. విశ్వాన్ని మీరు పవిత్రంగా తయారుచేస్తారు. మీరు తండ్రికి సహాయకులు. తండ్రి శ్రీమతంపై నడుస్తూ మీరు సహాయం చేస్తారు. ఈ భారత్ యే పావనంగా అవుతుంది. మేము కల్ప-కల్పము ఈ భారత్ ను పవిత్రంగా తయారుచేసి పవిత్రమైన భారత్ పై రాజ్యము చేస్తాము. బ్రాహ్మణుల నుండి మళ్ళీ మేము భవిష్య దేవీ-దేవతలుగా అవుతాము. విరాటరూప చిత్రము కూడా ఉంది. ప్రజాపిత బ్రహ్మాకు పిల్లలు బ్రాహ్మణులే. ప్రజాపిత సన్ముఖంలో ఉన్నప్పుడు బ్రాహ్మణులుగా ఉంటారు. ఇప్పుడు మీరు సన్ముఖంలో ఉన్నారు. మీరు ప్రతి ఒక్కరూ స్వయాన్ని ప్రజాపిత బ్రహ్మా సంతానంగా భావిస్తారు. ఇది యుక్తి. సంతానమని భావిస్తే సోదరీ-సోదరులుగా అవుతారు. సోదరీ-సోదరుల మధ్య వికారి దృష్టి ఎప్పుడూ ఉండకూడదు. 63 జన్మలుగా మీరు పతితులుగా ఉన్నారు, ఇప్పుడు పావన ప్రపంచమైన స్వర్గానికి వెళ్ళాలనుకుంటే పవిత్రంగా అవ్వండి అని ఇప్పుడు తండ్రి ఆర్డినెన్స్ జారీ చేస్తున్నారు. అక్కడికి పతిత ఆత్మలు వెళ్ళలేవు, అందుకే అనంతమైన తండ్రినైన నన్ను మీరు పిలుస్తారు. ఈ ఆత్మ శరీరము ద్వారా మాట్లాడుతుంది. నేను ఈ శరీరము ద్వారా మాట్లాడుతున్నాను అని శివబాబా కూడా అంటారు. లేకపోతే నేనెలా రాగలను? నా జన్మ దివ్యమైనది. సత్యయుగంలో దైవీ గుణాలు కలిగిన దేవతలుంటారు. ఈ సమయంలో ఆసురీ గుణాలు కలిగిన మనుష్యులున్నారు. ఇక్కడి మనుష్యులను దేవతలని అనరు. ఎవరెలా ఉన్నా, వారు పేర్లు మాత్రము చాలా గొప్ప-గొప్పవి పెట్టుకుంటారు. సాధువులు స్వయాన్ని శ్రీ శ్రీ అని చెప్పుకుంటారు మరియు మనుష్యులను శ్రీ అని అంటారు, ఎందుకంటే స్వయం పవిత్రంగా ఉన్నారు కనుక స్వయాన్ని శ్రీ శ్రీ అని పిలుచుకుంటారు. వారూ మనుష్యులే. వికారాలలోకి వెళ్ళకపోయినా కానీ వికారీ ప్రపంచములోనే ఉన్నారు కదా. మీరు భవిష్యత్తులో నిర్వికారీ దైవీ ప్రపంచంలో రాజ్యము చేస్తారు. అక్కడ కూడా మనుష్యులే ఉంటారు కానీ దైవీ గుణాలు కలిగిన వారిగా ఉంటారు. ఈ సమయంలో మనుష్యులు ఆసురీ గుణాలు కలిగిన వారిగా, పతితులుగా ఉన్నారు. భగవంతుడు మురికి పట్టిన వస్త్రాలను శుభ్రం చేస్తారని గురునానక్ కూడా అన్నారు. గురునానక్ కూడా తండ్రి మహిమను చేస్తారు.
ఇప్పుడు తండ్రి స్థాపన మరియు వినాశనము చేసేందుకు వచ్చారు. ఇతర ధర్మ స్థాపకులంతా కేవలం ధర్మ స్థాపన చేసేందుకే వస్తారు, వారు ఇతర ధర్మాలను వినాశనము చెయ్యరు, వారి ధర్మము వృద్ధి చెందుతూనే ఉంటుంది. ఇప్పుడు బాబా వృద్ధిని ఆపుతారు. ఒక్క ధర్మ స్థాపన మరియు అనేక ధర్మాల వినాశనము చేయిస్తారు. డ్రామానుసారంగా ఇది జరగవలసిందే. నేను ఆది సనాతన దేవీ-దేవతా ధర్మ స్థాపన చేయిస్తాను, దాని కోసమే మిమ్మల్ని చదివిస్తున్నాను అని తండ్రి చెప్తున్నారు. సత్యయుగములో అనేక ధర్మాలు ఉండనే ఉండవు. డ్రామాలో వీరందరూ తిరిగి వెళ్ళడం నిర్ణయించబడి ఉంది. ఈ వినాశనాన్ని ఎవ్వరూ ఆపలేరు. వినాశనం జరిగినప్పుడే విశ్వంలో శాంతి ఏర్పడుతుంది. ఈ యుద్ధము ద్వారానే స్వర్గపు ద్వారాలు తెరుచుకుంటాయి. ఈ మహాభారీ యుద్ధము కల్ప క్రితము కూడా జరిగిందని కూడా మీరు వ్రాయవచ్చు. మీరు ప్రదర్శినీల ప్రారంభోత్సవం చేయించేటప్పుడు ఈ విషయం వ్రాయండి - స్వర్గం యొక్క ప్రారంభోత్సవం చేయడానికి తండ్రి పరంధామము నుండి వచ్చారు అని. స్వర్గ రచయితనైన నేను స్వర్గం యొక్క ప్రారంభోత్సవం చేయడానికి వచ్చాను అని తండ్రి చెప్తున్నారు. స్వర్గవాసులుగా చేసేందుకు పిల్లల సహాయాన్ని తీసుకుంటాను. లేకపోతే ఇంతమంది ఆత్మలను ఇంకెవరు పావనంగా తయారుచేస్తారు. అనేకమంది ఆత్మలున్నారు. ప్రతి ఇంట్లోనూ మీరు ఇలా అర్థం చేయించవచ్చు - భారతవాసులైన మీరు సతోప్రధానంగా ఉండేవారు, మళ్ళీ 84 జన్మల తర్వాత తమోప్రధానంగా అయ్యారు, ఇప్పుడు మళ్ళీ సతోప్రధానంగా అవ్వండి. మన్మనాభవ. మేము శాస్త్రాలను అంగీకరించమని చెప్పకండి. శాస్త్రాలను మరియు భక్తిమార్గాన్ని మేము అంగీకరిస్తాము కానీ ఇప్పుడు ఈ భక్తిమార్గమనే రాత్రి పూర్తవుతుంది, జ్ఞానము ద్వారా పగలు ప్రారంభమవుతుంది, సద్గతినిచ్చేందుకు తండ్రి వచ్చారు అని చెప్పండి. అర్థము చేయించడానికి చాలా యుక్తి కావాలి. కొందరు చాలా బాగా ధారణ చేస్తారు, కొందరు తక్కువగా చేస్తారు. ప్రదర్శినీలలో కూడా మంచి-మంచి పిల్లలు బాగా అర్థము చేయిస్తారు. తండ్రి ఏ విధంగా టీచరుగా ఉన్నారో, అదే విధంగా పిల్లలు కూడా టీచరుగా అవ్వాలి. సద్గురువు తీరాన్ని చేరుస్తారని గాయనం కూడా ఉంది, తండ్రిని సత్య ఖండాన్ని స్థాపన చేసే సత్యమైన బాబా అని అంటారు. అసత్య ఖండాన్ని రావణుడు స్థాపన చేస్తాడు. ఇప్పుడు సద్గతినిచ్చేవారు లభించినప్పుడు మేమెలా భక్తి చేస్తాము? అనేకమంది గురువులు భక్తిని నేర్పిస్తారు. సద్గురువు అయితే ఒక్కరు మాత్రమే. సద్గురు అకాల్...... అని కూడా అంటారు, అయినా కానీ అనేకమంది గురువులుగా అవుతూ ఉంటారు. సన్యాసులు మొదలైన అనేక రకాల గురువులు ఉంటారు. సిక్కులు స్వయంగా సద్గురువు అకాల్...... అని చెప్తారు, అంటే వారిని మృత్యువు కబళించదు అని అర్థం. మనుష్యులనైతే మృత్యువు తినేస్తుంది. తండ్రి మన్మనాభవ అని అర్థం చేయిస్తున్నారు. ప్రభువును స్మరిస్తే సుఖము లభిస్తుంది...... అని కూడా అంటారు, ఈ రెండు పదాలే ముఖ్యమైనవి. నన్ను స్మృతి చేయండి - జప్ సాహెబ్ కో అని తండ్రి చెప్తున్నారు. ప్రభువు అయితే ఒక్కరే. గురునానక్ కూడా వారినే జపించమని సూచించారు. వాస్తవానికి మీరు జపించకూడదు, స్మృతి చేయాలి. వారిని నిరంతరము స్మృతి చేయండి. నోటితో ఏమీ అనకూడదు. శివ-శివ అని కూడా అనకూడదు. మీరు శాంతిధామానికి వెళ్ళాలి. ఇప్పుడు తండ్రిని స్మృతి చేయండి. నిరంతర జపము కూడా ఒకటే ఉంటుంది, అది తండ్రి నేర్పిస్తారు. వారు ఎన్ని గంటలు మ్రోగిస్తూ, శబ్దము చేస్తూ, మహిమ చేస్తారు. అచ్యుతమ్, కేశవమ్...... అని అంటారు. కానీ ఒక్క పదాన్ని కూడా అర్థము చేసుకోరు. సుఖానిచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమే. వారినే వ్యాసుడు అని కూడా అంటారు. వారిలో ఉన్న జ్ఞానమే వారు ఇస్తారు. సుఖాన్ని కూడా వారే ఇస్తారు. ఇప్పుడు మన ఎక్కే కళ జరుగుతోందని పిల్లలైన మీరు భావిస్తారు. మెట్ల చిత్రములో కళలు కూడా చూపించారు. ఈ సమయంలో కళలేవీ లేవు. నిర్గుణుడినైన నాలో ఏ గుణమూ లేదని పాడతారు. ఒక నిర్గుణ సంస్థ కూడా ఉంది. పిల్లలు మహాత్ముల సమానంగా ఉంటారని ఇప్పుడు తండ్రి చెప్తున్నారు. వారిలో ఎటువంటి అవగుణాలూ ఉండవు. నిర్గుణ బాలక్ అని మళ్ళీ వారికి పేరు పెడతారు. ఒకవేళ బాలకునిలో గుణాలు లేకపోతే తండ్రిలో కూడా లేనట్టే. అందరిలో అవగుణాలున్నాయి. దేవతలు మాత్రమే గుణవంతులుగా అవుతారు. తండ్రిని తెలుసుకోకపోవడమే నంబర్ వన్ అవగుణము. విషయ సాగరములో మునకలు వేయడం రెండవ అవగుణము. అర్థకల్పము మీరు మునకలు వేశారని తండ్రి చెప్తున్నారు. ఇప్పుడు జ్ఞానసాగరుడైన నేను మిమ్మల్ని క్షీరసాగరములోకి తీసుకువెళ్తాను. నేను క్షీరసాగరములోకి తీసుకువెళ్ళేందుకు మీకు శిక్షణనిస్తాను. వీరి ఆత్మ పక్కన వచ్చి నేను కూర్చుంటాను, నేను స్వతంత్రుడను. ఎక్కడికైనా వచ్చి-వెళ్ళగలను. మీరు పితృ దేవతలకు తినిపించేటప్పుడు ఆత్మకే తినిపిస్తారు కదా. శరీరమైతే భస్మమైపోతుంది. దానిని చూడలేరు. ఫలానా ఆత్మ యొక్క శ్రాద్ధం అని భావిస్తారు. ఆత్మను పిలవడం జరుగుతుంది - ఇది కూడా డ్రామాలో పాత్ర ఉంది. అప్పుడప్పుడూ ఆత్మ వస్తుంది, అప్పుడప్పుడూ రాదు. కొందరు చెప్తారు, కొందరు అస్సలు చెప్పరు. ఇక్కడ కూడా ఆత్మను పిలుస్తారు, వచ్చి మాట్లాడుతుంది. కానీ ఫలానా స్థానములో జన్మ తీసుకున్నానని చెప్పదు. నేను చాలా సుఖంగా ఉన్నాను, మంచి ఇంటిలో జన్మ తీసుకున్నాను అని మాత్రమే చెప్తుంది. మంచి జ్ఞానము ఉండే పిల్లలు మంచి ఇంటిలోకి వెళ్తారు. తక్కువ జ్ఞానముండేవారు తక్కువ పదవిని పొందుతారు కానీ సుఖమైతే ఉంటుంది. రాజుగా అవ్వడం మంచిదా లేక దాసిగా అవ్వడం మంచిదా? రాజుగా అవ్వాలంటే ఈ చదువులో నిమగ్నమవ్వండి. ప్రపంచమైతే చాలా అశుద్ధంగా ఉంది. ప్రాపంచిక సాంగత్యాన్ని కుసాంగత్యం అని అంటారు. ఒక్క సత్యమైన వారి సాంగత్యం మాత్రమే తీరానికి చేరుస్తుంది, మిగిలినవన్నీ ముంచేస్తాయి. తండ్రికి అందరి జన్మపత్రులు తెలుసు కదా. ఇది పాపపు ప్రపంచము, అందుకే ఎక్కడికైనా తీసుకువెళ్ళండి అని పిలుస్తారు. మధురాతి-మధురమైన పిల్లలూ, నాకు చెందినవారిగా అయ్యాక ఇక నా మతంపై నడుచుకోండి అని తండ్రి ఇప్పుడు చెప్తున్నారు. ఇది చాలా అశుద్ధమైన ప్రపంచం. అవినీతి ఉంది. లక్షల-కోట్ల రూపాయల మోసము జరుగుతుంది. ఇప్పుడు పిల్లలను స్వర్గానికి యజమానులుగా చేసేందుకు తండ్రి వచ్చారు కనుక అపారమైన సంతోషముండాలి కదా. వాస్తవానికి ఇది సత్యమైన గీత. తర్వాత ఈ జ్ఞానము ప్రాయః లోపమైపోతుంది. మీలో ఇప్పుడు ఈ జ్ఞానముంది, మళ్ళీ మరో జన్మ తీసుకుంటే జ్ఞానము సమాప్తమైపోతుంది. తర్వాత ప్రారబ్ధముంటుంది. మిమ్మల్ని పురుషోత్తములుగా చేసేందుకు తండ్రి చదివిస్తున్నారు. ఇప్పుడు మీరు తండ్రిని తెలుసుకున్నారు. ఇప్పుడు అమరనాథ యాత్ర జరుగుతుంది. ఎవరినైతే సూక్ష్మవతనంలో చూపించారో, వారు మళ్ళీ స్థూలవతనములోకి ఎలా వచ్చారు అని అడగండి. పర్వతాలు మొదలైనవి ఇక్కడే ఉన్నాయి కదా. పార్వతికి జ్ఞానమునివ్వడానికి అక్కడ పతితులు ఎలా ఉండగలరు? వారు కూర్చుని వారి చేతులతో మంచు లింగాన్ని తయారుచేస్తారు. అదైతే ఎక్కడైనా తయారుచేయవచ్చు. మనుష్యులు ఎన్ని ఎదురు దెబ్బలు తింటున్నారు. పావనంగా తయారుచేయడానికి శంకరుని వద్దకు పార్వతి ఎక్కడి నుండి వచ్చారు అన్నది అర్థము చేసుకోరు. శంకరుడు పరమాత్మ కాదు, వారు కూడా దేవత. మనుష్యులకు ఎంతగా అర్థము చేయించడం జరుగుతుంది, అయినా కూడా అర్థము చేసుకోరు. పారసబుద్ధి కలవారిగా అవ్వలేరు. ప్రదర్శినీలో చాలామంది వస్తారు. జ్ఞానమైతే చాలా బాగుంది, అందరూ తీసుకోవాలి అని వారు అంటారు. అరే, మీరైతే తీసుకోండి అని చెప్తే మాకు తీరిక లేదని అంటారు. ఈ యుద్ధానికి ముందే తండ్రి స్వర్గం యొక్క ప్రారంభోత్సవం చేస్తున్నారని కూడా ప్రదర్శినీలో వ్రాయాలి. వినాశనము తర్వాత స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయి. ప్రతి ఒక్క చిత్రములో పారలౌకిక పరమపిత పరమాత్మ త్రిమూర్తి శివ భగవానువాచ అని వ్రాయండి అని బాబా చెప్పారు. త్రిమూర్తి అని వ్రాయకపోతే శివుడు నిరాకారుడు, వారు జ్ఞానము ఎలా ఇస్తారు అని అంటారు. వీరే మొదట సుందరమైన కృష్ణుడిగా ఉండేవారు, ఇప్పుడు మళ్ళీ నల్లని మనిషిగా అయ్యారని అర్థం చేయించడం జరుగుతుంది. ఇప్పుడు మిమ్మల్ని మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేస్తారు. మళ్ళీ చరిత్ర పునరావృతమవుతుంది. మనుష్యుల నుండి దేవతలుగా చేశారని గాయనం కూడా ఉంది, మళ్ళీ మెట్లు దిగుతూ మనుష్యులుగా అవుతారు. మళ్ళీ తండ్రి వచ్చి దేవతలుగా తయారుచేస్తారు. నేను రావలసి వస్తుంది అని తండ్రి చెప్తున్నారు. కల్ప-కల్పము, కల్పము యొక్క సంగమయుగములో వస్తాను. ప్రతి యుగంలో వస్తాను అని చెప్పడం తప్పు. నేను సంగమయుగములో వచ్చి మిమ్మల్ని పుణ్యాత్మలుగా తయారుచేస్తాను. మళ్ళీ రావణుడు మిమ్మల్ని పాపాత్ములుగా చేస్తాడు. తండ్రియే పాత ప్రపంచాన్ని కొత్త ప్రపంచంగా తయారుచేస్తారు. ఇవి అర్థము చేసుకోవలసిన విషయాలు. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. తండ్రి సమానంగా టీచరుగా అవ్వాలి, చాలా యుక్తిగా అందరినీ ఈ అసత్య ఖండము నుండి బయటకు తీసి సత్య ఖండములోకి వెళ్ళేందుకు అర్హులుగా తయారుచేయాలి.
2. ప్రాపంచిక సాంగత్యము కుసాంగత్యము, కనుక కుసాంగత్యము నుండి దూరంగా ఉంటూ ఒక్క సత్యమైన వారి సాంగత్యాన్నే చేయాలి. ఉన్నత పదవి కోసం ఈ చదువులో నిమగ్నమవ్వాలి. ఒక్క తండ్రి మతంపైనే నడుచుకోవాలి.