20-08-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైన పిల్లలూ - మీ రక్షణ కోసం వికారాల రూపీ మాయ పంజా నుండి సదా సురక్షితంగా ఉండాలి, దేహాభిమానములోకి ఎప్పుడూ రాకూడదు”

ప్రశ్న:-

పుణ్యాత్మలుగా అయ్యేందుకు పిల్లలందరికీ తండ్రి ఏ ముఖ్యమైన శిక్షణనిస్తారు?

జవాబు:-

బాబా చెప్తున్నారు - పిల్లలూ, పుణ్యాత్మలుగా అవ్వాలంటే 1. శ్రీమతంపై సదా నడుస్తూ ఉండండి. స్మృతియాత్రలో పొరపాట్లు చేయకండి. 2. ఆత్మాభిమానులుగా అయ్యేందుకు పూర్తిగా పురుషార్థము చేసి కామమనే మహాశత్రువుపై విజయము ప్రాప్తి చేసుకోండి. పుణ్యాత్మలుగా అయి ఈ దుఃఖధామాన్ని దాటి సుఖధామములోకి వెళ్ళేందుకు ఇదే సమయం.

ఓంశాంతి. తండ్రియే రోజూ పిల్లలను అడుగుతారు. శివబాబాను పిల్లలు గలవారు అని అనరు. ఆత్మలైతే అనాదిగా ఉన్నాయి. తండ్రి కూడా అనాదిగా ఉన్నారు. ఈ సమయంలో తండ్రి మరియు దాదా ఇద్దరూ ఉన్నప్పుడే పిల్లలను సంభాళించడం జరుగుతుంది. ఎంతమంది పిల్లల్ని సంభాళించవలసి ఉంటుంది. ప్రతి ఒక్కరి లెక్కాపత్రాన్ని పెట్టవలసి ఉంటుంది. లౌకిక తండ్రికి కూడా చింత ఉంటుంది కదా. మా బిడ్డ కూడా ఈ బ్రాహ్మణ కులములోకి వచ్చేస్తే బాగుంటుంది, మా పిల్లలు కూడా పవిత్రంగా అయి పవిత్ర ప్రపంచములోకి రావాలి, ఈ పాత మాయ యొక్క కాలువలో కొట్టుకుపోకూడదు అని భావిస్తారు. అనంతమైన తండ్రికి పిల్లల చింత ఉంటుంది. ఎన్ని సెంటర్లున్నాయి, ఏ పిల్లలను ఎక్కడకు పంపిస్తే సురక్షితంగా ఉండగలరు. ఈ రోజుల్లో రక్షణ కూడా కష్టము. ప్రపంచములో ఎటువంటి రక్షణా లేదు, స్వర్గములోనైతే ప్రతి ఒక్కరికీ రక్షణ ఉంటుంది. ఇక్కడ ఎవ్వరికీ రక్షణ లేదు. ఎక్కడో అక్కడ వికారాల రూపీ మాయా పంజాలో చిక్కుకుంటారు. ఇప్పుడు ఆత్మలైన మీకు ఇక్కడ చదువు లభిస్తుంది. సత్యం యొక్క సాంగత్యం కూడా ఇక్కడే ఉంది. ఇక్కడే దుఃఖధామాన్ని దాటి సుఖధామములోకి వెళ్ళాలి ఎందుకంటే ఇప్పుడు దుఃఖధామమంటే ఏమిటో, సుఖధామమంటే ఏమిటో పిల్లలకు తెలిసింది. తప్పకుండా ఇప్పుడిది దుఃఖధామము. ఇక్కడ మనము చాలా పాపాలు చేశాము మరియు అక్కడ పుణ్యాత్మలే ఉంటారు. ఇప్పుడు మనము పుణ్యాత్మలుగా అవ్వాలి. ఇప్పుడు మీరు ప్రతి ఒక్కరు మీ 84 జన్మల చరిత్ర-భూగోళాలను తెలుసుకున్నారు. ప్రపంచములో ఎవ్వరికీ 84 జన్మల చరిత్ర-భూగోళాలు తెలియవు. ఇప్పుడు తండ్రి వచ్చి మొత్తం జీవిత కథను అర్థము చేయించారు. ఇప్పుడు మనము స్మృతియాత్ర ద్వారా పూర్తిగా పుణ్యాత్మలుగా అవ్వాలని మీకు తెలుసు. ఇందులో పొరపాట్లు చేయడం వలన చాలా మోసపోతారు. ఈ సమయంలో పొరపాట్లు చేయడము మంచిది కాదు అని తండ్రి చెప్తున్నారు. శ్రీమతంపై నడవాలి. అందులోనూ తండ్రి చెప్తున్న ముఖ్యమైన విషయం, ఒకటి స్మృతియాత్రలో ఉండాలి, రెండవది కామమనే మహాశత్రువుపై విజయమును పొందాలి. తండ్రిని అందరూ పిలుస్తారు ఎందుకంటే ఆత్మలకు వారి నుండి శాంతి మరియు సుఖం యొక్క వారసత్వము లభిస్తుంది. ఇంతకుముందు దేహాభిమానులుగా ఉండేటప్పుడు ఏమీ తెలిసేది కాదు. ఇప్పుడు పిల్లలను ఆత్మాభిమానులుగా తయారుచేయడం జరుగుతుంది. క్రొత్తవారికి మొట్టమొదట ఒకటి హద్దులోని తండ్రి, రెండవది అనంతమైన తండ్రి గురించి పరిచయాన్నివ్వాలి. అనంతమైన తండ్రి ద్వారా స్వర్గ భాగ్యము లభిస్తుంది. హద్దులోని తండ్రుల ద్వారా నరకపు భాగ్యము లభిస్తుంది. పిల్లలు పెద్దవారైనప్పుడు ఆస్తికి హక్కుదారులుగా అవుతారు. అన్నీ అర్థమైనప్పుడు, ఇక నెమ్మది-నెమ్మదిగా మాయకు ఆధీనం అయిపోతారు. అవన్నీ రావణరాజ్యం (వికారీ ప్రపంచం) యొక్క ఆచార-పద్ధతులు. ఇప్పుడు ఈ ప్రపంచము మారుతుంది, ఈ ప్రాత పపంచము వినాశనమవుతూ ఉంది అని పిల్లలైన మీకు తెలుసు. ఒక్క గీతలో మాత్రమే వినాశనము గురించి వర్ణించారు, ఇతర ఏ శాస్త్రాలలోనూ మహాభారత మహాభారీ యుద్ధం గురించి వర్ణన లేదు. ఇది గీతకు సంబంధించిన పురుషోత్తమ సంగమయుగము. గీతా యుగము అనగా ఆదిసనాతన దేవీ-దేవతా ధర్మస్థాపన జరిగే యుగము. గీతయే దేవీ-దేవతా ధర్మ శాస్త్రము. కనుక ఇది కొత్త ప్రపంచ స్థాపన జరుగుతున్నటువంటి గీతా యుగము. మనుష్యులు కూడా మారాలి. మనుష్యుల నుండి దేవతలుగా అవ్వాలి. కొత్త ప్రపంచములో తప్పకుండా దైవీ గుణాలు కలిగిన మనుష్యులు కావాలి కదా. ఈ విషయాలు ప్రపంచానికి తెలియదు. వారు కల్పం ఆయుష్షు యొక్క సమయాన్ని చాలా ఎక్కువగా చేసేశారు. ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి అర్థము చేస్తున్నారు - తప్పకుండా బాబా మమ్మల్ని చదివిస్తున్నారని మీకు తెలుసు. కృష్ణుడిని ఎప్పుడూ తండ్రి, టీచరు లేక గురువు అని అనలేరు. కృష్ణుడు టీచరైతే వారు ఎక్కడ నుండి నేర్చుకున్నారు? వారిని జ్ఞానసాగరుడని అనలేరు.

ఇప్పుడు పిల్లలైన మీరు పెద్ద-పెద్దవారికి అర్థము చేయించాలి. సేవను ఎలా వృద్ధి చేయాలి, విహంగ మార్గపు సేవను ఎలా చేయాలి అని పరస్పరము చర్చించి సలహాలు తీయాలి. ఏ బ్రహ్మాకుమారీల గురించైతే ఎంతో హంగామా చేసారో, వారు సత్యమైనవారు అని తర్వాత అర్థం చేసుకుంటారు. ఇక మిగతా ప్రపంచం అయితే అసత్యమైనది, అందుకే సత్యం యొక్క నావను కదిలిస్తూ ఉంటారు. తుఫానులైతే వస్తాయి కదా. మీరు తీరాన్ని దాటి వెళ్ళే నావ వంటి వారు. మనము ఈ మాయావీ ప్రపంచమును వదిలి వెళ్ళాలని మీకు తెలుసు. అన్నిటికన్నా మొదటి నంబరులో దేహాభిమానము యొక్క తుఫాను వస్తుంది. ఇది అన్నిటికన్నా చెడ్డది. ఇదే అందరినీ పతితంగా చేసింది. అందుకే తండ్రి కామము మహాశత్రువు అని చెప్తారు. ఇది చాలా తీవ్రమైన తుఫాను వంటిది. కొందరు దీనిపై విజయమును కూడా పొందారు. గృహస్థ వ్యవహారములోకి వెళ్ళిపోయినవారు దీని నుండి స్వయాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తారు. కుమార-కూమారీలకైతే చాలా సహజము, అందుకే కన్నయ్య అన్న పేరు కూడా గాయనం చేయబడింది. ఇంతమంది కన్యలు తప్పకుండా శివబాబాకే చెందినవారై ఉంటారు. దేహధారి కృష్ణుడికైతే ఇంతమంది కన్యలుండరు. మీరిప్పుడు ఈ చదువు ద్వారా పట్టపురాణులుగా అవుతున్నారు, ఇందులో ముఖ్యంగా పవిత్రత కూడా కావాలి. స్మృతి యొక్క చార్టు సరిగ్గా ఉందా అని మిమ్మల్ని మీరు చూసుకోవాలి. బాబా వద్దకు కొందరిది 5 గంటలు, కొందరిది 2-3 గంటల చార్టు కూడా వస్తుంది. కొందరు వ్రాయనే వ్రాయరు. చాలా తక్కువగా స్మృతి చేస్తారు. అందరి యాత్ర ఏకరసంగా ఉండదు. ఇంకా చాలామంది పిల్లలు వృద్ధి చెందుతారు. నేను ఎంతవరకు పదవిని పొందగలను? ఎంతవరకు సంతోషంగా ఉన్నాను? అని ప్రతి ఒక్కరు తమ చార్టును చూసుకోవాలి. ఉన్నతాతి ఉన్నతమైన తండ్రికి చెందినవారిగా అయినప్పుడు మేము సదా సంతోషముగా ఎందుకు ఉండకూడదు? డ్రామానుసారంగా మీరు చాలా భక్తి చేశారు. భక్తులకు ఫలమునిచ్చేందుకే తండ్రి వచ్చారు. రావణరాజ్యంలో వికర్మలు జరుగుతూనే ఉంటాయి. సతోప్రధాన ప్రపంచములోకి వెళ్ళేందుకు మీరు పురుషార్థము చేస్తారు. ఎవరైతే పురుషార్థము పూర్తిగా చేయరో వారు సతోలోకి వస్తారు. అందరూ ఇంత జ్ఞానాన్ని తీసుకోరు. ఎక్కడున్నా సరే తప్పకుండా సందేశాన్ని వింటారు, అందుకే మూలమూలలకు వెళ్ళాలి. విదేశాలకు కూడా సంస్థ వెళ్ళాలి. ఇక్కడ బౌద్ధులకు, క్రిస్టియన్లకు సంస్థలున్నాయి కదా. వారికి ఇతర ధర్మాల వారిని తమ ధర్మములోకి తీసుకొచ్చే మిషన్లు ఉంటాయి. మనము నిజానికి దేవీ-దేవతా ధర్మానికి చెందినవారమని మీరు అర్థం చేయిస్తారు. ఇప్పుడు హిందూ ధర్మానికి చెందినవారిగా అయ్యారు. మీ వద్దకు చాలా వరకు హిందూ ధర్మానికి చెందినవారే వస్తారు. అందులోనూ శివుని పూజారులుగా, దేవతల పూజారులుగా ఉన్నవారు వస్తారు. రాజుల సేవ చేయండి అని బాబా చెప్పారు కదా. వారు చాలా వరకు దేవతల పూజారులుగా ఉంటారు. వారి ఇంట్లో మందిరాలుంటాయి. వారి కళ్యాణము కూడా చేయాలి. మేము తండ్రితోపాటు దూరదేశము నుండి వచ్చామని మీరు కూడా భావించాలి. తండ్రి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేయడానికే వచ్చారు. మీరు కూడా చేస్తున్నారు. ఎవరైతే స్థాపన చేస్తారో వారు పాలన కూడా చేస్తారు. మేము శివబాబాతోపాటు దైవీ రాజ్యాన్ని స్థాపన చేయడానికి, మొత్తం విశ్వాన్ని స్వర్గంగా తయారుచేయడానికి వచ్చామని మీకు లోపల నషా ఉండాలి. ఈ దేశములో ఏమేమి చేస్తున్నారో చూసి ఆశ్చర్యము కలుగుతుంది. పూజలు ఎలా చేస్తున్నారు. నవరాత్రిలో దేవీల పూజలు జరుగుతాయి కదా. రాత్రి ఉంటే పగలు కూడా ఉంటుంది. మీది ఒక పాట కూడా ఉంది కదా - ఏమి విచిత్రము చూశామంటే...... మట్టి బొమ్మలను తయారుచేసి, వాటిని అలంకరించి పూజిస్తారు, వాటిపై మళ్ళీ ఎంతగా మనసు కలుగుతుందంటే, వాటిని ముంచేయడానికి వెళ్ళినప్పుడు ఏడుస్తారు. మనుష్యులు మరణించినప్పుడు పాడెను కూడా తీసుకువెళ్తారు. హరి బోల్, హరి బోల్ (హరి అని చెప్పు, హరి అని చెప్పు) అని అంటూ ముంచేస్తారు. చాలామంది వెళ్తారు కదా. నదులైతే సదా ఉంటాయి. ఈ యమునా నదీ తీరములో రాస విలాసాలు మొదలైనవి చేసేవారని మీకు తెలుసు. అక్కడైతే పెద్ద-పెద్ద మహళ్ళు ఉంటాయి. మీరే వెళ్ళి తయారుచేయాలి. ఎవరైనా పెద్ద పరీక్ష పాస్ అయినప్పుడు, పాస్ అయిన తర్వాత ఇది చేస్తాను, ఇల్లు కడతాను అని వారి బుద్ధిలో నడుస్తుంది. పిల్లలైన మీరు కూడా మేము దేవతలుగా అవుతామని అనుకోవాలి. ఇప్పుడు మనము మన ఇంటికి వెళ్తాము. ఇంటిని స్మృతి చేస్తూ సంతోషించాలి. మనుష్యులు యాత్ర చేసి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, ఇప్పుడు మేము మా జన్మ స్థానమైన ఇంటికి వెళ్తున్నాము అని సంతోషం కలుగుతుంది. ఆత్మలైన మన ఇల్లు కూడా మూలవతనము. ఎంత సంతోషముంటుంది. మనుష్యులు ముక్తి కోసమే ఇంత భక్తి చేస్తారు. కానీ డ్రామాలో తిరిగి వెళ్ళేటటువంటి పాత్ర ఎవ్వరికీ లభించదు. వారు అర్థకల్పము తప్పకుండా పాత్రను అభినయించాలని మీకు తెలుసు. ఇప్పుడు మనకు 84 జన్మలు పూర్తవుతాయి. ఇప్పుడు తిరిగి వెళ్ళాలి మరియు మళ్ళీ రాజధానిలోకి వస్తాము. కేవలం ఇల్లు మరియు రాజధాని గుర్తున్నాయి. ఇక్కడ కూర్చుని ఉన్నా కొంతమందికి తమ ఫ్యాక్టరీలు మొదలైనవి గుర్తుకొస్తూ ఉంటాయి. బిర్లాను చూడండి, వారికి ఎన్ని ఫాక్టరీలు మొదలైనవి ఉన్నాయి. రోజంతా వారికి ఆలోచనలు ఉంటూ ఉండవచ్చు. వారికి తండ్రిని స్మృతి చేయమని చెప్పినా, వారు ఎంతగా చిక్కుకొని ఉంటారు. క్షణ-క్షణము వ్యాపారమే గుర్తుకొస్తూ ఉంటుంది. స్మృతి చేయడం అందరికన్నా మాతలకు సహజము, వారి కన్నా కన్యలకు ఇంకా సహజము. జీవిస్తూనే మరణించాలి, మొత్తం ప్రపంచాన్ని మర్చిపోవాలి. మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ శివాబాబాకు చెందినవారిగా అవుతారు, దీనినే జీవిస్తూనే మరణించడం అని అంటారు. దేహ సహితంగా దేహం యొక్క సంబంధాలన్నీ వదిలి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ శివబాబాకు చెందినవారిగా అవ్వాలి. శివబాబానే స్మృతి చేస్తూ ఉండాలి ఎందుకంటే తలపై పాపాల భారము చాలా ఉంది. మేము జీవిస్తూనే మరణించి శివబాబాకు చెందినవారిగా అవ్వాలి అని అందరికీ మనసు ఉంటుంది. శరీర భానం ఉండకూడదు. మనము అశరీరిగా వచ్చాము, మళ్ళీ అశరీరిగా అయి వెళ్ళాలి. తండ్రికి చెందినవారిగా అయ్యాము కనుక తండ్రి తప్ప ఇంకెవ్వరి స్మృతి ఉండకూడదు. అలా త్వరగా తయారయితే, మళ్ళీ యుద్ధము కూడా త్వరగా మొదలవుతుంది. మనము శివబాబాకు చెందినవారము కదా అని బాబా ఎంతగా అర్థము చేయిస్తారు. మనము అక్కడ నివసించేవారము. ఇక్కడైతే ఎంత దుఃఖముంది. ఇప్పుడిది అంతిమ జన్మ. మీరు సతోప్రధానంగా ఉన్నప్పుడు మరెవ్వరూ ఉండేవారు కాదు అని తండ్రి చెప్పారు. మీరు ఎంత షావుకార్లుగా ఉండేవారు. ఈ సమయంలో ధనమున్నా కానీ అది అసలు ఏమీ కాదు. ఇవి గవ్వలవంటివి. ఇవన్నీ అల్పకాలిక సుఖము కోసం ఉన్నాయి. గతములో దాన-పుణ్యాలు చేసి ఉంటే ధనము కూడా చాలా లభిస్తుంది, ఆ తర్వాత మళ్ళీ దానము చేస్తారు, కానీ ఇది ఒక జన్మ యొక్క విషయం అని తండ్రి అర్థం చేయించారు. ఇక్కడైతే జన్మ-జన్మాంతరాలకు షావుకార్లుగా అవుతారు. ఎంత పెద్ద వ్యక్తులైతే, అంత ఎక్కువ దుఃఖాన్ని పొందుతారు. ఎవరి వద్దనైతే చాలా ధనముంటుందో, వారు మళ్ళీ చాలా చిక్కుకొని ఉన్నారు. ఎప్పుడూ నిలవలేరు. సాధారణమైన వారే, పేదవారే సమర్పణ అవుతారు. షావుకార్లు ఎప్పుడూ సమర్పణ అవ్వరు. వారు మా కులం నడుస్తూనే ఉండాలని మనవలు-మనవరాళ్ళ కోసం సంపాదిస్తూనే ఉంటారు. వారు స్వయం ఆ ఇంట్లో జన్మ తీసుకునేది లేదు. ఎవరైతే గతంలో మంచి కర్మలు చేశారో, ఆ మనవలు-మనవరాళ్ళు వస్తారు. ఎలా అయితే చాలా దానాలు చేసేవారు రాజులుగా అవుతారో, అలా. కానీ సదా ఆరోగ్యవంతులుగా అవ్వలేరు. రాజ్యము చేసినా లాభమేముంది, అవినాశి సుఖముండదు. ఇక్కడ అడుగడుగునా అనేక రకాలైన దుఃఖాలు ఉంటాయి. అక్కడ ఈ దుఃఖాలన్నీ దూరమైపోతాయి. మా దుఃఖాన్ని దూరము చేయండి అని తండ్రిని పిలుస్తారు. దుఃఖాలన్నీ దూరమవ్వనున్నాయి అని మీకు తెలుసు. కేవలం తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. ఒక్క తండ్రి నుండి తప్ప ఇంకెవ్వరి నుండి వారసత్వము లభించదు. తండ్రి మొత్తం విశ్వం యొక్క దుఃఖాన్ని దూరం చేస్తారు. ఈ సమయంలో జంతువులు మొదలైనవి కూడా ఎంత దుఃఖితులుగా ఉన్నాయి. ఇది దుఃఖధామము. దుఃఖము పెరుగుతూ ఉంటుంది, తమోప్రధానంగా అవుతూ ఉంటారు. ఇప్పుడు మనము సంగమయుగములో కూర్చున్నాము. వారందరూ కలియుగములో ఉన్నారు. ఇది పురుషోత్తమ సంగమయుగము. బాబా మనల్ని పురుషోత్తములుగా తయారుచేస్తున్నారు. ఇది గుర్తున్నా కూడా సంతోషముంటుంది. భగవంతుడు చదివిస్తున్నారు, విశ్వానికి యజమానిగా తయారుచేస్తున్నారు. ఇది గుర్తుంచుకోండి. వారి పిల్లలు చదువు ద్వారా భగవాన్-భగవతిగా అవ్వాలి కదా. భగవంతుడైతే సుఖమునిచ్చేవారు, మరి దుఃఖము ఎలా లభిస్తుంది? అది కూడా తండ్రి కూర్చుని అర్థము చేయిస్తున్నారు. భగవంతుని పిల్లలు, మరి దుఃఖములో ఎందుకున్నారు, భగవంతుడు దుఃఖహర్త సుఖకర్త కనుక తప్పకుండా దుఃఖములోనే వస్తారు, అందుకే పిలుస్తారు. తండ్రి మనకు రాజయోగము నేర్పిస్తున్నారని మీకు తెలుసు. మనము పురుషార్థము చేస్తున్నాము. ఇందులో సంశయము రాకూడదు. బి.కె.లైన మనము రాజయోగాన్ని నేర్చుకుంటున్నాము. అసత్యము చెప్పము. ఎవరికైనా ఈ సంశయము వస్తే - ఇది చదువు, వినాశనము ఎదురుగా నిలబడి ఉంది అని అర్థం చేయించాలి. మనము సంగమయుగ బ్రాహ్మణులము, పిలక స్థానంలో ఉన్నాము. ప్రజాపిత బ్రహ్మా ఉన్నారంటే బ్రాహ్మణులు కూడా తప్పకుండా ఉండాలి. మీకు కూడా అర్థము చేయించారు, అప్పుడే నిశ్చయము ఏర్పడింది. ఇక ముఖ్యమైన విషయం స్మృతి యాత్ర, ఇందులో విఘ్నాలు కలుగుతాయి. మీ చార్టును చూసుకుంటూ ఉండండి - ఎంతవరకు బాబాను స్మృతి చేస్తున్నాను, ఎంతవరకు సంతోషపు పాదరసం ఎక్కి ఉంది? మాకు తోట యజమాని, పతితపావనుడి చేయి లభించింది అన్న ఆంతరిక సంతోషముండాలి, మనము బ్రహ్మాబాబా ద్వారా శివబాబాకు హ్యాండ్-షేక్ చేస్తాము. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. మన ఇంటిని మరియు రాజధానిని స్మృతి చేసి అపారమైన సంతోషంలో ఉండాలి. ఇప్పుడు మా యాత్ర పూర్తయ్యింది, మేము మా ఇంటికి వెళ్తాము, మళ్ళీ రాజధానిలోకి వస్తాము - అని సదా గుర్తుండాలి.

2. మేము బ్రహ్మా ద్వారా శివబాబాకు హేండ్ షేక్ చేస్తాము, ఆ తోట యజమాని మమ్మల్ని పతితుల నుండి పావనంగా తయారుచేస్తున్నారు. మేము ఈ చదువు ద్వారా స్వర్గము యొక్క పట్టపురాణులుగా అవుతాము అన్న ఆంతరిక సంతోషంలో ఉండాలి.

వరదానము:-

అవ్యభిచారి మరియు నిర్విఘ్న స్థితి ద్వారా ఫస్ట్ జన్మ యొక్క ప్రారబ్ధాన్ని ప్రాప్తించుకునే సమీప మరియు సమాన భవ

ఏ పిల్లలైతే ఇక్కడ తండ్రి గుణాలకు మరియు సంస్కారాలకు సమీపంగా ఉంటారో, సర్వ సంబంధాలతో తండ్రి తోడును లేక సమానతను అనుభవం చేస్తారో, వారే అక్కడ రాయల్ కులములో ఫస్ట్ జన్మ యొక్క సంబంధములో సమీపంగా వస్తారు. 2. ఎవరైతే ఆది నుండి ఇంతవరకు అవ్యభిచారిగా మరియు నిర్విఘ్నంగా ఉన్నారో, వారే ఫస్ట్ లోకి వస్తారు. నిర్విఘ్నమంటే అర్థం అసలు విఘ్నాలు రాకుండా ఉండడం కాదు, కానీ విఘ్న వినాశకులుగా మరియు విఘ్నాలపై సదా విజయులుగా ఉండాలి. ఈ రెండు విషయాలు ఒకవేళ ఆది నుండి అంతిమం వరకు బాగుంటే, అప్పుడు ఫస్ట్ జన్మలో సహచరులుగా అవుతారు.

స్లోగన్:-

సైలెన్స్ శక్తి ద్వారా నెగెటివ్ ను పాజిటివ్ లోకి పరివర్తన చేయండి.