03-08-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైన పిల్లలూ - మీకు సేవ చేయాలని ఎంతో ఉత్సాహం కలగాలి. మీలో జ్ఞానం మరియు యోగం ఉన్నట్లయితే ఇతరులకు కూడా నేర్పించండి, సేవను వృద్ధి చేయండి”

ప్రశ్న:-

సేవలో ఉత్సాహము కలగకపోవడానికి కారణమేమిటి? ఏ విఘ్నము కారణంగా ఉత్సాహం కలగదు?

జవాబు:-

అన్నిటికంటే పెద్ద విఘ్నము క్రిమినల్ (వికారీ) దృష్టి. ఈ రోగం సేవలో ఉత్సాహము కలగనివ్వదు. ఇది చాలా కఠినమైన రోగం. ఒకవేళ వికారీ దృష్టి శాంతించకపోతే, గృహస్థ వ్యవహారములో రెండు చక్రాలు సరిగ్గా నడవకపోతే గృహస్థము భారంగా అనిపిస్తుంది, అప్పుడు తేలికగా ఉంటూ సేవలో ఉత్సాహం చూపించలేరు.

గీతము:-

మేల్కోండి ప్రేయసులారా! మేల్కోండి.....(జాగ్ సజనియా జాగ్.....)

ఓంశాంతి. మధురాతి-మధురమైన పిల్లలు ఈ పాట విన్నారు. ఇటువంటి 2-4 మంచి పాటలు అందరి వద్ద ఉండాలి లేక టేపులో ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ పాట మనుష్యులు తయారుచేసిందని బాబా అంటారు. పిల్లలకు ఉపయోగపడతాయని డ్రామానుసారంగా టచ్ చేయడం జరిగింది. ఇటువంటి పాటలను వినడంతో పిల్లలకు నషా ఎక్కుతుంది. ఇప్పుడు మేము కొత్త రాజ్యాన్ని స్థాపన చేస్తున్నాము, రావణుని నుండి తీసుకుంటున్నాము అని పిల్లలకు నషా ఎక్కి ఉండాలి. ఎవరైనా యుద్ధము చేసేటప్పుడు వీరి రాజ్యాన్ని ఆక్రమించాలి, వీరి గ్రామాన్ని మేము మా చేతులలోకి తీసుకోవాలి - అన్న ఆలోచన ఉంటుంది కదా. ఇప్పుడు వారందరూ హద్దు కోసం యుద్ధం చేస్తున్నారు. పిల్లలైన మీకు మాయతో యుద్ధము జరుగుతోంది, దీని గురించి బ్రాహ్మణులైన మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. ఈ విశ్వముపై మనము గుప్తంగా రాజ్య స్థాపన చేయాలి మరియు తండ్రి నుండి వారసత్వము తీసుకోవాలి అని మీకు తెలుసు. వాస్తవానికి దీనిని యుద్ధం అని కూడా అనరు. డ్రామానుసారంగా సతోప్రధానము నుండి తమోప్రధానంగా అయిన మీరు మళ్ళీ సతోప్రధానంగా అవ్వాలి. మీకు మీ జన్మల గురించి తెలియదు. ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు. ఇతర ధర్మాల వారికి ఈ జ్ఞానము లభించదు. తండ్రి పిల్లలైన మీకు మాత్రమే కూర్చుని అర్థం చేయిస్తున్నారు. ధర్మములోనే శక్తి ఉంది అని గాయనం కూడా చేయబడుతుంది. తమ ధర్మం ఏమిటో భారతవాసులకు తెలియదు. మనది ఆది సనాతన దేవీ-దేవతా ధర్మం అని తండ్రి ద్వారా మీకు తెలిసింది. తండ్రి వచ్చి మళ్ళీ మిమ్మల్ని ఆ ధర్మంలోకి బదిలీ చేస్తున్నారు. మన ధర్మము ఎంత సుఖమునిచ్చేదో మీకు తెలుసు. మీరు ఎవరితోనూ యుద్ధము మొదలైనవి చేయకూడదు. మీరు మీ స్వధర్మములో స్థితులవ్వాలి మరియు తండ్రిని స్మృతి చేయాలి, ఇందులో కూడా సమయం పడుతుంది. కేవలం చెప్పడముతోనే స్థితులవ్వలేరు. ఆత్మనైన నేను శాంత స్వరూపాన్ని అని లోపల ఈ స్మృతి ఉండాలి. ఆత్మలైన మనమిప్పుడు తమోప్రధానంగా, పతితంగా అయ్యాము. ఆత్మలైన మనము శాంతిధామములో ఉన్నప్పుడు పవిత్రంగా ఉండేవారము, ఆ తర్వాత పాత్రను అభినయిస్తూ-అభినయిస్తూ తమోప్రధానంగా అయ్యాము. ఇప్పుడు మళ్ళీ పవిత్రంగా అయి మనము ఇంటికి తిరిగి వెళ్ళాలి. తండ్రి నుండి వారసత్వం తీసుకునేందుకు స్వయాన్ని ఆత్మ అని నిశ్చయం ఏర్పరుచుకొని తండ్రిని స్మృతి చేయాలి. మేము ఈశ్వరుని సంతానం అని మీకు నషా ఎక్కుతుంది. తండ్రిని స్మృతి చేయడంతోనే వికర్మలు వినాశనమవుతాయి. స్మృతి ద్వారా మనము పవిత్రంగా అయి మళ్ళీ శాంతిధామానికి వెళ్ళిపోతాము - ఇది ఎంత సహజమైన విషయం. ప్రపంచములోనికి ఈ శాంతిధామము, సుఖధామాల గురించి కూడా తెలియదు. ఈ విషయాలు ఏ శాస్త్రాలలోనూ లేవు. జ్ఞానసాగరునిది ఒక్క గీతను మాత్రమే, అందులో కేవలం పేరును మార్చేశారు. సర్వుల సద్గతిదాత, జ్ఞానసాగరుడు అని ఆ పరమపిత పరమాత్ముడినే అంటారు. ఇంకెవ్వరినీ జ్ఞానవంతులు అని అనలేరు. వారు జ్ఞానాన్నిచ్చినప్పుడే మీరు జ్ఞానవంతులుగా అవుతారు. ఇప్పుడు అందరూ భక్తి స్వరూపులు. మీరు కూడా అలాగే ఉండేవారు. ఇప్పుడు మళ్ళీ జ్ఞానవంతులుగా అవుతున్నారు. నెంబరువారు పురుషార్థానుసారంగా జ్ఞానము కొందరిలో ఉంది, కొందరిలో లేదు. మరి ఏమంటారు? ఈ లెక్కన ఉన్నత పదవిని పొందలేరు. సేవ చేయాలని తండ్రి ఎంతో ఉత్సాహ పడుతూ ఉంటారు. ఎవరికైనా బాగా అర్థము చేయించగలిగే శక్తి ఇప్పుడు ఇంకా పిల్లలలో రాలేదు. అటువంటి యుక్తులు రచించాలి. పిల్లలు శ్రమ చేసి కానఫెరన్స్ లు మొదలైనవి చేస్తున్నారు, గోపులలో కొంత శక్తి ఉంది, సేవని ఎలా వృద్ధి చేయాలనే యుక్తులను రచించే సంగఠన ఉండాలి అని వారికి ఆలోచన కలుగుతుంది. దాని కోసం కష్టపడుతూ ఉంటారు. శక్తి సైన్యం అని పేరు ఉంది కాని వారు చదువుకున్నవారు కాదు. కొందరు చదువుకోనివారు కూడా చదువుకున్నవారిని బాగా చదివిస్తారు. వికారీ దృష్టి చాలా నష్టపరుస్తుంది అని బాబా అర్థం చేయించారు. ఈ రోగం చాలా కఠినమైనది అందువలన ఉత్సాహం కలగదు. యుగల్ అయిన మీ రెండు చక్రాల సరిగ్గా నడుస్తున్నాయా అని బాబా అడుగుతారు. అటువైపు ఎంత పెద్ద-పెద్ద సైన్యాలున్నాయి, స్త్రీల గుంపు కూడా ఉంది, చదువుకున్నావారు కూడా ఉన్నారు. వారికి సహాయం కూడా లభిస్తుంది. మీరైతే గుప్తముగా ఉన్నారు. ఈ బ్రహ్మాకుమార కుమారీలు ఏమి చేస్తున్నారో ఎవ్వరికీ కూడా తెలియదు. మీలో కూడా నంబరువారుగా ఉన్నారు. గృహస్థ వ్యవహార భారము తలపై ఉండటం వలన వంగిపోయి ఉన్నారు. బ్రహ్మాకుమార కుమారీలుగా పిలువబడతారు కాని ఆ వికారీ దృష్టి చల్లబడదు. రెండు చక్రాలు ఒకే విధంగా ఉండడం చాలా కష్టము. బాబా పిల్లల చేత సేవ చేయించడం కోసం అర్థం చేయిస్తూ ఉంటారు. కొందరు ధనవంతులుగా ఉన్నా కూడా ఉత్సాహం చూపించరు. ధనం యొక్క ఆకలితో ఉంటారు, కొడుకులు లేకపోతే దత్తత తీసుకుంటారు. బాబా, మేమున్నాము, మేము పెద్ద ఇల్లు తీసుకొని ఇస్తాము అని చెప్పే ఉత్సాహం కలగదు.

బాబా దృష్టి విశేషంగా ఢిల్లీపై ఉంది ఎందుకంటే ఢిల్లీ రాజధాని, హెడ్ ఆఫీసు. ఢిల్లీలో విశేషంగా సేవను యొక్క విస్తారం చేయండి అని బాబా చెప్తున్నారు. ఎవరికైనా అర్థం చేయించేందుకు లోపలకు దూరిపోవాలి. పాండవులకు కౌరవుల నుండి మూడు అడుగుల భూమి కూడా లభించలేదు అని గాయనం కూడా ఉంది. కౌరవులు అనే ఈ పదము గీతలోనిది. భగవంతుడు వచ్చి రాజయోగాన్ని నేర్పించారు, దానికి గీత అని పేరు పెట్టారు. కాని గీతా భగవంతుడినే మర్చిపోయారు కావున ముఖ్యంగా ఈ పాయింట్ నే అర్థం చేయించాలని బాబా ప్రతి క్షణం చెప్తూ ఉంటారు. బనారస్ లోని విద్వాంసుల మండలి వారికి అర్థం చేయించండి అని బాబా ఇంతకుముందు చెప్పేవారు. బాబా యుక్తులనైతే తెలియజేస్తూనే ఉంటారు. కనుక మంచి రీతిగా ప్రయత్నించాలి. బాబా పదే-పదే అర్థం చేయిస్తూ ఉంటారు. నంబర్ వన్ అయిన ఢిల్లీలో యుక్తిని రచించండి. సంగఠనలో కూడా దీని గురించి ఆలోచించండి. పెద్ద మేళాలు మొదలైనవి ఢిల్లీలో ఎలా చేయాలి అన్నదే ముఖ్యమైన విషయము. వారైతే ఢిల్లీలో చాలా నిరాహార దీక్షలు మొదలైనవి చేస్తారు. మీరు అటువంటి పనులేవీ చేయరు. పోట్లాడడం, గొడవపడడం ఏమీ లేవు. మీరు కేవలం నిదురించి ఉన్నవారిని మేల్కొల్పుతారు. ఢిల్లీ వారే శ్రమ చేయాలి. మనము బ్రహ్మాండానికి కూడా యజమానులము, ఆ తర్వాత కల్పక్రితము వలె సృష్టికి కూడా యజమానులుగా అవుతామని మీకు తెలుసు. ఇది తప్పకుండా జరుగుతుంది. విశ్వానికి యజమానులుగా అవ్వాల్సిందే. ఇప్పుడు రాజధానిలో జ్ఞాన బాంబులను వేసేందుకు మీకు మూడు అడుగుల నేల అయినా కావాలి. నషా ఉండాలి కదా! పెద్దవారి నుండి శబ్దము రావాలి కదా. ఈ సమయంలో మొత్తం భారత్ నిరుపేదగా ఉంది. పేదవారికి సేవ చేసేందుకే తండ్రి వస్తారు. ఢిల్లీలోనైతే చాలా మంచి సేవ జరగాలి. బాబా సూచనలనిస్తూ ఉంటారు. బాబా మాకు అటెన్షన్ ఇప్పిస్తున్నారని ఢిల్లీ వారు భావిస్తారు. పరస్పరం క్షీర ఖండంలా ఉండాలి. మన పాండవుల కోటను తయారుచేయాలి. ఢిల్లీలోనే తయారు చేయవలసి ఉంటుంది. ఇందుకు చాలా మంచి బుద్ధి ఉండాలి. ఎంతో చేయవచ్చు. వారు భారత్ మా దేశము, మేము ఇలా చేస్తాము అని ఎంతగానో పాడుతారు. కాని స్వయంలో ఏ మాత్రం శక్తి లేదు. విదేశీయుల సహాయము లేకుండా చేయలేరు. మీకైతే అనంతమైన తండ్రి నుండి చాలా సహాయం లభిస్తుంది. ఇంత సహాయము ఎవ్వరూ ఇవ్వలేరు. ఇప్పుడు త్వరగా కోటను తయారుచేయాలి. పిల్లలైన మీకు తండ్రి విశ్వరాజ్యాన్నిస్తున్నారు కనుక చాలా ఉత్సాహం ఉండాలి. చాలామంది బుద్ధి వ్యర్థమైన పరచింతనలో చిక్కుకొని ఉంది. మాతలపై బంధనాల ఆపద ఉంది. పురుషులకు ఎటువంటి బంధనమూ లేదు. మాతలను అబలలు అని అంటారు. పురుషులు బలవంతులుగా ఉంటారు. నీవే గురువు ఈశ్వరుడు అన్నీ - అని వివాహ సమయంలో పురుషులకు బలమునిస్తారు. స్త్రీ తోక వలె ఉంటారు. వెనుక వేలాడేవారు నిజంగానే తోక వలె వేలాడుతూ ఉంటారు. పతి పట్ల మోహము, పిల్లల పట్ల మోహము ఉంటుంది. పురుషులకు ఇంత మోహము ఉండదు. వారు ఒక చెప్పు పోతే రెండవది, మూడవది తీసుకుంటారు. అలవాటైపోయింది. వార్తాపత్రికలలో ఈ విధంగా ముద్రించండి అని బాబా అర్థం చేయిస్తూ ఉంటారు. పిల్లలు తండ్రిని ప్రత్యక్షము చేయాలి. ఇది అర్థం చేయించడం మీ పని. బాబాతో పాటు దాదా కూడా ఉన్నారు. కనుక వీరూ వెళ్ళలేరు. శివబాబా, చెప్పండి, మాకు ఈ ఆపదలు వచ్చాయి, దీని కోసం మీరు సలహానివ్వండి అని అంటారు. అటువంటి విషయాలు అడుగుతారు. తండ్రి పతితులను పావనంగా తయారుచేసేందుకు వచ్చారు. పిల్లలైన మీకు మొత్తం జ్ఞానం లభిస్తుంది అని తండ్రి చెప్తున్నారు. పరస్పరము కలిసి ప్రయత్నించి సలహాలు తీయండి. పిల్లలైన మీరిప్పుడు విహంగమార్గపు సేవ యొక్క తమాషా చూపించండి. చీమ మార్గపు సేవ అయితే నడుస్తూ వస్తుంది. కాని అనేకుల కళ్యాణం జరిగే విధంగా అటువంటి తమాషాను చూపించండి. బాబా కల్పక్రితము కూడా అర్థం చేయించారు, ఇప్పుడు కూడా అర్థం చేయిస్తున్నారు. చాలా మంది బుద్ధి ఇక్కడా-అక్కడా చిక్కుకొని ఉంది. ఉత్సాహం లేదు. వెంటనే దేహాభిమానము వచ్చేస్తుంది. దేహాభిమానమే సర్వనాశనము చేసింది. ఇప్పుడు తండ్రి సత్యమైన, ఉన్నతమైనవారిగా తయారుచేసేందుకు ఎంత సహజమైన విషయాన్ని తెలియజేస్తున్నారు. తండ్రిని స్మృతి చేసినట్లయితే శక్తి వస్తుంది. లేకపోతే శక్తి రాదు. సెంటర్లను సంభాళిస్తారు, కాని నషా ఉండదు ఎందుకంటే దేహాభిమానము ఉంటుంది. దేహీ-అభిమానులుగా అయినట్లయితే నషా ఎక్కుతుంది. మవము ఎటువంటి తండ్రికి పిల్లలము. ఎంతగా మీరు దేహీ-అభిమానులుగా ఉంటారో అంత బలము వస్తుంది అని తండ్రి చెప్తున్నారు. అర్థకల్పము దేహాభిమానం యొక్క నషా ఉంది కనుక దేహీ-అభిమానులుగా అవ్వడానికి చాలా శ్రమ అనిపిస్తుంది. బాబా జ్ఞానసాగరుడు, మేము కూడా జ్ఞానము తీసుకున్నాము, అనేకులకు అర్థం చేయిస్తున్నాము అని అనుకోకూడదు కాని స్మృతి యొక్క పదును కూడా ఉండాలి. జ్ఞానమనేది ఖడ్గము. స్మృతి అనేది యాత్ర. రెండూ వేర్వేరు. జ్ఞానములో స్మృతియాత్ర యొక్క పదును కావాలి. అది లేకపోతే అది చెక్క కత్తిగా అయిపోతుంది. సిక్కులు ఖడ్గాన్ని ఎంతగా గౌరవిస్తారు. అది హింసాయుతమైనది, దానితో యుద్ధము చేశారు. వాస్తవానికి గురువులు యుద్ధము చేయకూడదు. గురువులు అహింసకులుగా ఉండాలి కదా. యుద్ధము ద్వారా సద్గతి కలగదు. మీది యోగం యొక్క విషయం. స్మృతి బలము లేకుండా జ్ఞాన ఖడ్గము పని చేయదు. వికారీ దృష్టి చాలా నష్టపరుస్తుంది. ఆత్మ చెవుల ద్వారా వింటుంది, మీరు స్మృతిలో ఆనందంగా నిమగ్నమై ఉన్నట్లయితే సేవ పెరుగుతూ ఉంటుంది అని తండ్రి చెప్తున్నారు. సంబంధీకులు వినడంలేదు అని బాబాతో అప్పుడప్పుడూ చెప్తూ ఉంటారు. స్మృతియాత్రలో అపరిపక్వంగా ఉన్నారు కనుక జ్ఞాన ఖడ్గము పని చేయడం లేదు అని బాబా చెప్తారు. స్మృతి యొక్క శ్రమ చేయండి. ఇది గుప్తమైన శ్రమ. మురళి నడిపించడమైతే ప్రత్యక్షమైనది. స్మృతియే గుప్తమైన శ్రమ, దీని ద్వారా శక్తి లభిస్తుంది. జ్ఞానము ద్వారా శక్తి లభించదు. మీరు స్మృతి బలంతో పతితం నుండి పావనంగా అవుతారు. సంపాదన కోసమే పురుషార్థము చేయాలి.

పిల్లల స్మృతి ఏకరసంగా ఉన్నప్పుడు, స్థితి బాగున్నప్పుడు, వారికి చాలా సంతోషం ఉంటుంది మరియు స్మృతి సరిగ్గా లేనప్పుడు, ఏ విషయములోనైనా ఆటంకము కలిగినప్పుడు సంతోషం మాయమైపోతుంది. విద్యార్థికి టీచరు స్మృతి ఉండదా. ఇక్కడైతే ఇంట్లో ఉంటూనే, అన్నీ చేస్తూనే టీచరును స్మృతి చేయాలి. ఈ టీచరు ద్వారా చాలా-చాలా ఉన్నతమైన పదవి లభిస్తుంది. గృహస్థ వ్యవహారములో కూడా ఉండాలి. టీచరు స్మృతి ఉన్నా కూడా తండ్రి మరియు గురువు స్మృతి తప్పకుండా వస్తుంది. ఎన్ని రకాలుగా అర్థం చేయిస్తూ ఉంటారు. కాని ఇంట్లో మళ్ళీ ధనం-సంపద, పిల్లలు మొదలైన వారిని చూసి మర్చిపోతారు. మీరు ఆత్మిక సేవ చేయాలని ఎంతగానో అర్థం చేయిస్తారు. తండ్రి స్మృతియే ఉన్నతాతి ఉన్నతమైన సేవ. మనసా-వాచా-కర్మణా బుద్ధిలో తండ్రి స్మృతి ఉండాలి. నోటి ద్వారా కూడా జ్ఞానం యొక్క విషయాలే వినిపించండి. ఎవ్వరికీ దుఃఖమునివ్వకూడదు. ఎటువంటి అకర్తవ్యము చేయకూడదు. మొదటి విషయమైన అల్ఫ్ ను అర్థం చేసుకోకపోతే ఇంకే విషయమూ అర్థము చేసుకోలేరు. మొదట అల్ఫ్ గురించి పక్కా చేయించండి, అప్పటివరకు ముందుకు వెళ్ళకూడదు. శివబాబా రాజయోగాన్ని నేర్పించి విశ్వానికి యజమానులుగా తయారుచేస్తారు. ఈ ఛీ-ఛీ ప్రపంచములో మాయ షో చాలా ఉంది. ఎన్ని ఫ్యాషన్లు ఉన్నాయి. ఛీ-ఛీ ప్రపంచము పట్ల అసహ్యము కలగాలి. ఒక్క తండ్రిని స్మృతి చేసిట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి, పవిత్రంగా అయిపోతారు. సమయాన్ని వ్యర్థం చేయకండి. బాగా ధారణ చేయండి. మాయా శత్రువు అనేకుల తెలివిని మాయం చేసేస్తుంది. కమాండర్ తప్పు చేస్తే వారిని డిస్మిస్ కూడా చేసేస్తారు. స్వయంగా కమాండరుకు కూడా సిగ్గుగా అనిపించి రాజీనామా కూడా చేసేస్తారు. ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది. మంచి-మంచి కమాండర్లు అప్పుడప్పుడూ నిరుత్సాహులైపోతారు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. స్మృతి యొక్క గుప్తమైన శ్రమ చేయాలి. స్మృతి యొక్క ఆనందంలో ఉన్నట్లయితే సేవ స్వతహాగానే పెరుగుతూ ఉంటుంది. మనసా-వాచా-కర్మణా స్మృతిలో ఉండే పురుషార్థము చేయాలి.

2. నోటి ద్వారా జ్ఞానం యొక్క విషయాలనే వినిపించాలి, ఎవ్వరికీ దుఃఖమునివ్వకూడదు. ఎటువంటి అకర్తవ్యమూ చేయకూడదు. దేహీ-అభిమానులుగా అయ్యే శ్రమ చేయాలి.

వరదానము:-

విజయం యొక్క నషా ద్వారా సదా హర్షితంగా ఉండే సర్వ ఆకర్షణల నుండి ముక్త భవ

విజయీ రత్నాల స్మృతిచిహ్నము - తండ్రి యొక్క కంఠహారము, అది ఈ రోజు వరకు పూజింపబడుతూ ఉంది. కనుక మేము బాబా కంఠహారములోని విజయీరత్నాలము, మేము విశ్వ యజమానికి పిల్లలము అన్న నషాలో సదా ఉండాలి. మాకు ఏదైతే లభించిందో అది ఎవ్వరికీ కూడా లభించదు - ఈ నషా మరియు సంతోషం స్థిరంగా ఉన్నట్లయితే ఏ రకమైన ఆకర్షణ నుండైనా అతీతంగా ఉంటారు. ఎవరైతే సదా విజయులుగా ఉంటారో, వారు సదా హర్షితంగా ఉంటారు. ఒక్క తండ్రి స్మృతి యొక్క ఆకర్షణలోనే ఆకర్షితులై ఉంటారు.

స్లోగన్:-

ఒక్కరి అంత్యములోనే లీనమవ్వడం అనగా ఏకాంతవాసులుగా అవ్వడం.