ఓంశాంతి. ప్రపంచము రంగు-రంగులుగా ఉన్నదని బాబాతో ఎవరు చెప్పారు? ఇప్పుడు దీని అర్థము ఇతరులెవ్వరూ అర్థము చేసుకోలేరు. ఈ ఆట రంగు-రంగులుగా ఉన్నదని తండ్రి అర్థము చేయించారు. సినిమాలు మొదలైనవాటిలో కూడా చాలా రంగు-రంగుల దృశ్యాలు మొదలైనవి ఉంటాయి కదా. ఇప్పుడు ఈ అనంతమైన ప్రపంచము గురించి ఎవ్వరికీ తెలియదు. మొత్తం విశ్వము యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞానం మీలో కూడా నంబరువారు పురుషార్థానుసారంగా ఉంది. స్వర్గము ఎంత రంగు-రంగులుగా, సుందరంగా ఉంటుందో మీరు అర్థము చేసుకున్నారు. దాని గురించి ఎవ్వరికీ తెలియదు. అది అద్భుతమైన రంగు-రంగుల ప్రపంచము అని ఎవరి బుద్ధిలోనూ లేదు. వండర్ ఆఫ్ ది వరల్డ్ అని గాయనం చేయబడుతుంది. వండర్ ఆఫ్ ది వరల్డ్ కోసం మీరు మాత్రమే తమ-తమ భాగ్యానుసారముగా పురుషార్థము చేస్తున్నారు. లక్ష్యము-ఉద్దేశ్యము అయితే ఉన్నాయి. అది వండర్ ఆఫ్ ది వరల్డ్, చాలా రంగు-రంగుల ప్రపంచము, అక్కడ వజ్ర-వైఢూర్యాల మహళ్ళు ఉంటాయి. మీరు ఒక్క క్షణంలోనే అద్భుతమైన వైకుంఠములోకి వెళ్ళిపోతారు. ఆడుకుంటారు, రాస-విలాసాలు మొదలైనవి చేస్తారు. అది అద్భుతమైన ప్రపంచమే కదా. ఇక్కడ మాయా రాజ్యముంది. ఇది కూడా ఎంత అద్భుతమైనది. మనుష్యులు ఏమేమో చేస్తూ ఉంటారు. మనము నాటకములో అభినయిస్తున్నామని ప్రపంచములో ఎవ్వరికీ కూడా తెలియదు. ఒకవేళ నాటకమని భావించినట్లయితే నాటకము యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞానము కూడా ఉండేది. తండ్రి కూడా ఎంత సాధారణమైనవారో పిల్లలైన మీకు తెలుసు. మాయ పూర్తిగా మరపింపజేస్తుంది. ముక్కు పట్టుకొని మరపింపజేస్తుంది. ఓహో! మేము వండర్ ఆఫ్ ది వరల్డ్ స్వర్గానికి యజమానులుగా అవుతున్నాము అని ఇప్పుడిప్పుడే స్మృతిలో ఉంటారు, చాలా హర్షితంగా ఉంటారు, మళ్ళీ మర్చిపోగానే వాడిపోతారు. ఎంతగా వాడిపోతారంటే ఆటవికులు కూడా ఆ విధంగా వాడిపోయి ఉండరు. మనం స్వర్గములోకి వెళ్తున్నామని, మనల్ని అనంతమైన తండ్రి చదివిస్తున్నారని కొద్దిగా కూడా భావించరు. పూర్తిగా శవము వలె అయిపోతారు. ఆ సంతోషం, నషా ఉండదు. ఇప్పుడు వండర్ ఆఫ్ ది వరల్డ్ స్థాపన జరుగుతుంది. వండర్ ఆఫ్ ది వరల్డ్ కు యువరాజు శ్రీ కృష్ణుడు. ఇది కూడా మీకు తెలుసు. కృష్ణ జన్మాష్టమి నాడు కూడా, ఎవరైతే జ్ఞానములో తెలివైనవారుంటారో, వారు అర్థము చేయిస్తూ ఉండవచ్చు. శ్రీకృష్ణుడు వండర్ ఆఫ్ ది వరల్డ్ కు రాకుమారుడు. ఆ సత్యయుగము ఎక్కడకు వెళ్ళిపోయింది! సత్యయుగము నుండి మొదలుకొని మెట్లు ఏ విధంగా దిగారు. సత్యయుగము నుండి కలియుగముగా ఎలా అయ్యింది? దిగేకళ ఎలా ఏర్పడింది? పిల్లలైన మీ బుద్ధిలోకే వస్తాయి. ఆ సంతోషంతో అర్థం చేయించాలి. శ్రీకృష్ణుడు వస్తున్నాడు. కృష్ణుని రాజ్యము మళ్ళీ స్థాపనవుతూ ఉంది. ఇది విని భారతవాసులకు కూడా సంతోషము కలగాలి. కానీ ఎవరైతే భాగ్యశాలురుగా ఉంటారో, వారికి మాత్రమే ఉత్సాహము కలుగుతుంది. ప్రపంచములోని మనుష్యులైతే ఈ రత్నాలను, రాళ్ళుగా భావించి పారేస్తారు. ఇవి అవినాశి జ్ఞానరత్నాలు కదా. ఈ జ్ఞానరత్నాల సాగరుడు తండ్రి. ఈ రత్నాలకు చాలా విలువ ఉంది. ఈ జ్ఞానరత్నాలను ధారణ చేయాలి. మీరిప్పుడు జ్ఞానసాగరుని నుండి డైరెక్ట్ గా వింటున్నారు కనుక ఇంకేదీ వినవలసిన అవసరమే లేదు. సత్యయుగములో ఇవి ఉండవు. అక్కడ యల్.యల్.బి.గా, సర్జన్ మొదలైనవారిగా అవ్వాల్సిన అవసరముండదు. అక్కడ ఈ జ్ఞానమే ఉండదు. అక్కడైతే మీరు ప్రారబ్ధాన్ని అనుభవిస్తారు. కనుక జన్మాష్టమి గురించి పిల్లలు బాగా అర్థము చేయించాలి. అనేక సార్లు మురళీ కూడా నడిపించడం జరిగింది. పిల్లలు విచార సాగర మథనము చేసినప్పుడే పాయింట్లు వెలువడుతాయి. భాషణ చేయాలంటే ఉదయమే లేచి రాయాలి, ఆ తర్వాత చదువుకోవాలి. మర్చిపోయిన పాయింట్లను మళ్ళీ చేర్చాలి. దీని వలన ధారణ బాగా జరుగుతుంది, అయినా కూడా వ్రాసుకున్నట్లుగానే అందరూ చెప్పలేరు. ఎన్నో కొన్ని పాయింట్లు మర్చిపోతారు. కనుక కృష్ణుడు ఎవరు అన్నది అర్థము చేయించవలసి ఉంటుంది, వారైతే వండర్ ఆఫ్ ది వరల్డ్ కు యజమానిగా ఉండేవారు. భారత్ యే స్వర్గముగా ఉండేది. ఆ స్వర్గానికి యజమాని శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు వస్తున్నారని మేము మీకు సందేశము వినిపిస్తున్నాము. భగవంతుడే రాజయోగాన్ని నేర్పించారు. ఇప్పుడు కూడా నేర్పిస్తున్నారు. ద్వికిరీటధారులైన దేవతలుగా తయారుచేసేందుకు, పవిత్రత కోసమే పురుషార్థము చేయిస్తున్నారు. ఇవన్నీ పిల్లల స్మృతిలోకి రావాలి. ఎవరికైతే అభ్యాసముంటుందో వారు బాగా అర్థము చేయించగలరు. కృష్ణుని చిత్రములో రాసినవి కూడా చాలా ఫస్ట్ క్లాస్ గా ఉన్నాయి. ఈ యుద్ధము తర్వాత స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయి. ఈ యుద్ధములో స్వర్గము ఇమిడి ఉంది. పిల్లలు కూడా చాలా సంతోషంగా ఉండాలి, జన్మాష్టమి నాడు మనుష్యులు కొత్త వస్త్రాలు మొదలైనవి ధరిస్తారు. కానీ మనమిప్పుడు ఈ పాత శరీరాన్ని వదిలి కొత్త కాంచన శరీరాన్ని తీసుకుంటామని మీకు తెలుసు. కాంచన కాయము అని అంటారు కదా, అంటే బంగారు శరీరము. ఆత్మ కూడా పవిత్రము, శరీరము కూడా పవిత్రంగా ఉంటుంది. ఇప్పుడు కాంచనముగా లేదు. నంబరువారుగా తయారవుతుంది. స్మృతియాత్ర ద్వారానే కాంచనంగా అవుతారు. స్మృతి చేసే తెలివి కూడా లేనివారు ఎంతోమంది ఉన్నారని బాబాకు తెలుసు. స్మృతి యొక్క శ్రమ చేసినప్పుడే వాణి పదునైనదిగా అవుతుంది. ఇప్పుడు ఆ శక్తి ఎక్కడ ఉంది. యోగం లేదు. లక్ష్మీ-నారాయణులుగా అయ్యే ముఖము కూడా కావాలి కదా. చదువు కావాలి. కృష్ణ జన్మాష్టమి గురించి అర్థము చేయించడం చాలా సులభము. శ్యామ-సుందరుడు అని కృష్ణుడి కోసమే అంటారు. కృష్ణుడిని కూడా నల్లగా, నారాయణుడిని కూడా నల్లగా, రాముడిని కూడా నల్లగా తయారుచేసేశారు. మొదట జ్ఞానచితిపై కూర్చుని స్వర్గానికి యజమానులుగా అయిన నా పిల్లలు మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయారు అని బాబా స్వయంగా అంటారు. కామచితిపై కూర్చుని నంబరువారుగా పడిపోతూ వచ్చారు. సృష్టి కూడా సతోప్రధానంగా, సతో, రజో, తమోగా అవుతుంది. కనుక మనుష్యుల స్థితి కూడా అలాగే అయిపోతుంది. కామచితిపై కూర్చుని అందరూ శ్యామంగా అంటే నల్లగా అయిపోయారు. ఇప్పుడు నేను సుందరంగా తయారుచేసేందుకు వచ్చాను. ఆత్మను సుందరంగా తయారుచేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరి నడవడిక ద్వారా - వీరు మనసా, వాచా, కర్మణా ఎలా నడుచుకుంటున్నారు అన్నది బాబా అర్థం చేసుకుంటారు. కర్మలు ఏ విధంగా చేస్తున్నారు అన్నదాని బట్టి తెలిసిపోతుంది. పిల్లల నడవడిక అయితే చాలా ఫస్ట్ క్లాస్ గా ఉండాలి. నోటి ద్వారా సదా రత్నాలే వెలువడాలి. కృష్ణ జయంతి నాడు అర్థం చేయించడం చాలా మంచిది. శ్యామము మరియు సుందరము అన్న టాపిక్ ఉండాలి. కృష్ణుడిని, అదే విధంగా నారాయణుడిని, అదే విధంగా రాధను కూడా నల్లగా ఎందుకు తయారుచేస్తారు? శివలింగాన్ని కూడా నల్ల రాతితో చేస్తారు. వారైతే నల్లగా ఏమీ ఉండరు. శివుడంటే ఎవరు, కానీ వారిని ఎలా చూపిస్తారు. ఈ విషయాలు పిల్లలైన మీకు తెలుసు. నల్లగా ఎందుకు చేస్తారు అన్నదానిపై మీరు అర్థము చేయించవచ్చు. ఇప్పుడు మరి పిల్లలు ఏమి సేవ చేస్తారో చూస్తాను. ఈ జ్ఞానము అన్ని ధర్మాల వారికోసమని తండ్రి చెప్తున్నారు. నన్ను స్మృతి చేసినట్లయితే మీ జన్మ-జన్మాంతరాల పాపాలు నశిస్తాయని తండ్రి చెప్తున్నారు, పవిత్రంగా అవ్వాలి అని వారికి కూడా చెప్పాలి. మీరు ఎవరికైనా రాఖీ కట్టవచ్చు. యూరోప్ వాసులకు కూడా కట్టవచ్చు. ఎవరికైనా సరే - భగవానువాచ అనేది తప్పకుండా ఏదో ఒక తనువు ద్వారానే చెప్తారు కదా అని చెప్పండి. నన్నొక్కడినే స్మృతి చేయండి, దేహ ధర్మాలన్నిటినీ విడిచి స్వయాన్ని ఆత్మగా భావించండి అని చెప్తారు. బాబా ఎంతగా అర్థము చేయిస్తారు, అయినా అర్థము చేసుకోకపోతే వీరి భాగ్యంలో లేదని తండ్రి భావిస్తారు. శివబాబా చదివిస్తున్నారనైతే భావిస్తారు. వారు రథము లేకుండా చదివించలేరు, కేవలం సూచన ఇస్తే సరిపోతుంది. కొంతమంది పిల్లలకు అర్థము చేయించే అభ్యాసము బాగుంది. బాబా-మమ్మా ఉన్నత పదవిని పొందుతారని భావిస్తారు. మమ్మా కూడా సేవ చేసేవారు కదా. ఈ విషయాలను కూడా అర్థం చేయించవలసి ఉంటుంది. మాయకు కూడా అనేక రూపాలు ఉంటాయి. మాలో మమ్మా వస్తారు, శివబాబా వస్తారు అని చాలామంది అంటారు, కానీ కొత్త-కొత్త పాయింట్లు అయితే నిశ్చితమై ఉన్న తనువు ద్వారానే వినిపిస్తారు, అంతేకానీ వేరొకరి ద్వారా వినిపించరు. అలా జరగదు. ఈ విధంగా పిల్లలు కూడా చాలా రకాల పాయింట్లు తమవే వినిపిస్తుంటారు. మ్యాగజీన్ లో ఎన్ని విషయాలు వస్తాయి. అలాగని మమ్మా-బాబా వారిలోకి వచ్చి, వ్రాయిస్తారని కాదు. ఇక్కడైతే తండ్రి డైరెక్ట్ గా వస్తారు, అప్పుడే ఇక్కడకు మీరు వినేందుకు వస్తారు. ఒకవేళ మమ్మా-బాబా ఎవరిలోనైనా వస్తే, ఇక అక్కడే కూర్చుని వారి ద్వారానే చదువుకుంటారు. అలా జరగదు, ఇక్కడికి రావడానికి అందరికీ ఆకర్షణ కలుగుతుంది. దూరంగా ఉండేవారికి ఇంకా ఎక్కువ ఆకర్షణ కలుగుతుంది. కనుక పిల్లలు జన్మాష్టమి నాడు ఎంతో సేవ చేయవచ్చు. కృష్ణుని జన్మ ఎప్పుడు జరిగిందో ఎవరికీ తెలియదు. మీ జోలె ఇప్పుడు నిండుతుంది కనుక సంతోషముండాలి. కానీ కొందరిలో ఏమాత్రం సంతోషం లేదని బాబా గమనిస్తున్నారు. శ్రీమతంపై నడవము అనే ప్రతిజ్ఞ చేసినట్లుగా ఉంటారు. సేవాధారీ పిల్లలు కేవలం సేవంటే సేవ గురించే ఆలోచిస్తూ ఉంటారు. బాబా సేవ చేయకపోతే, ఎవరికైనా మార్గాన్ని తెలియజేయకపోతే, మేము అంధుల వంటి వారమని భావిస్తారు. ఇది అర్థము చేసుకునే విషయము కదా. బ్యాడ్జిలో కూడా కృష్ణుని చిత్రముంది, దాని గురించి కూడా మీరు అర్థము చేయించవచ్చు. వీరిని నల్లగా ఎందుకు చూపించారని ఎవరినైనా అడగండి, వారు చెప్పలేరు. రాముని పత్నిని అపహరించారు అని శాస్త్రాలలో వ్రాశారు. కానీ అక్కడ అటువంటి విషయాలేవీ ఉండవు.
భారతవాసులైన మీరే స్వర్గవాసులుగా ఉండేవారు, ఇప్పుడు శ్మశానవాసులుగా అయ్యారు, మళ్ళీ జ్ఞానచితిపై కూర్చుని దైవీ గుణాలను ధారణ చేసి స్వర్గవాసులుగా అవుతారు. పిల్లలే సేవ చేయాలి. అందరికీ సందేశమునివ్వాలి. ఇందులో చాలా వివేకం కావాలి. మమ్మల్ని భగవంతుడు చదివిస్తున్నారు, మేము భగవంతునితోపాటు ఉంటాము, మేము భగవంతునికి పిల్లలము మరియు మేము వారి ద్వారా చదువుకుంటాము కూడా అన్న నషా ఎంతో ఉండాలి. హాస్టల్ లో ఉన్నప్పుడు బయటివారి సాంగత్యము అంటదు. ఇక్కడ కూడా స్కూలు కదా. క్రిస్టియన్లలో కూడా మంచి మేనర్స్ ఉంటాయి, ఇప్పుడైతే అసలు మంచి మేనర్స్ లేవు, తమోప్రధానంగా, పతితంగా అయిపోయారు. దేవతల ముందుకు వెళ్ళి తల వంచి నమస్కరిస్తారు. వారికెంత మహిమ ఉంది. సత్యయుగములో అందరికీ దైవీ నడవడిక ఉండేది, ఇప్పుడు ఆసురీ నడవడిక ఉంది. ఈ విధంగా మీరు భాషణ చేస్తే విని చాలా సంతోషిస్తారు. నోరు చిన్నది మాటలు పెద్దవి అనే మాట కృష్ణుని గురించి చెప్తారు. ఇప్పుడు మీరు అంత గొప్పగా అయ్యేందుకు, ఎంత గొప్ప విషయాలను వింటున్నారు. మీరు ఎవరికైనా రాఖీని కట్టవచ్చు. తండ్రి యొక్క ఈ సందేశమును అందరికీ ఇవ్వాలి. ఈ యుద్ధము స్వర్గ ద్వారాలను తెరుస్తుంది. ఇప్పుడు పతితుల నుండి పావనంగా అవ్వాలి. తండ్రిని స్మృతి చేయాలి. దేహధారులను స్మృతి చేయకూడదు. ఒక్క తండ్రి మాత్రమే అందరికీ సద్గతినిస్తారు. ఇది ఇనుపయుగ ప్రపంచము. పిల్లలైన మీ బుద్ధిలో కూడా నంబరువారు పురుషార్థానుసారంగా ధారణ జరుగుతుంది, స్కూలులో కూడా స్కాలర్షిప్ తీసుకునేందుకు చాలా శ్రమ చేస్తారు. ఇక్కడ కూడా ఎంత పెద్ద స్కాలర్షిప్ లభిస్తుంది. సేవ చాలా ఉంది. మాతలు కూడా చాలా సేవ చేయవచ్చు, చిత్రాలు కూడా అందరూ తీసుకోండి. కృష్ణుడిని నల్లగా, నారాయణుడిని నల్లగా, రామచంద్రుని కూడా నల్లగా చూపించే చిత్రాలను తీసుకోండి, శివుని చిత్రాలు కూడా నల్లనివి తీసుకోండి..... తర్వాత కూర్చొని అర్థము చేయించండి. దేవతల చిత్రాలను ఎందుకు నల్లగా చేశారు? శ్యామ-సుందరుడు. శ్రీనాథ ద్వారానికి వెళ్ళినట్లయితే పూర్తిగా నల్లని చిత్రముంది. మరి అటువంటి చిత్రాలను సేకరించాలి. మీ చిత్రాలను కూడా చూపించాలి. శ్యామ-సుందరుడు అంటే అర్థము చెప్పి, మీరు కూడా ఇప్పుడు రాఖీ కట్టుకుని, కామచితి నుండి దిగి జ్ఞానచితిపై కూర్చుంటే సుందరంగా అయిపోతారని చెప్పండి. ఇక్కడ కూడా మీరు సేవ చేయవచ్చు. వీరిని నల్లగా ఎందుకు చేసారు అని చాలా బాగా భాషణ చేయవచ్చు. శివలింగమును కూడా నల్లగా ఎందుకు చేశారు! శ్యామం మరియు సుందరం అని ఎందుకు అంటారో, మేము అర్థము చేయిస్తాము. ఇందులో ఎవ్వరూ కోపగించుకోరు. సేవ అయితే చాలా సహజం. పిల్లలూ, మంచి గుణాలు ధారణ చేయండి, కులము పేరును ప్రసిద్ధము చేయండి అని తండ్రి అర్థము చేయిస్తూనే ఉంటారు. ఇప్పుడు మనము ఉన్నతాతి-ఉన్నతమైన బ్రాహ్మణ కులానికి చెందినవారమని మీకు తెలుసు. తర్వాత రాఖీ బంధన్ అర్థాన్ని మీరెవరికైనా అర్థము చేయించవచ్చు. వేశ్యలకు కూడా అర్థము చేయించి రాఖీ కట్టవచ్చు. చిత్రాలు కూడా మీతో పాటు ఉండాలి. నన్నొక్కడినే స్మృతి చేయండి అని తండ్రి చెప్తున్నారు - ఈ ఆజ్ఞను పాటిస్తే మీరు సుందరంగా అయిపోతారు. చాలా యుక్తులున్నాయి. ఎవ్వరూ కోపగించుకోరు. ఒక్కరు తప్ప మనుష్యమాత్రులెవ్వరూ ఎవ్వరికీ సద్గతినివ్వలేరు. రక్షాబంధన్ రోజు కాకపోయినా, ఎప్పుడైనా రాఖీ కట్టవచ్చు. దీని అర్థమును తెలుసుకోవాలి. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు రాఖీ కట్టవచ్చు. మీ వ్యాపారమే ఇది. తండ్రితో ప్రతిజ్ఞ చేయమని చెప్పండి. నన్నొక్కడినే స్మృతి చేసినట్లయితే పవిత్రంగా అయిపోతారు అని తండ్రి చెప్తున్నారు. మేము రాఖీ కట్టేందుకు వచ్చాము, ఈ విషయము అర్థము చేసుకునే హక్కు మీకు కూడా ఉంది అని మీరు మసీదుకు కూడా వెళ్ళి వారికి అర్థము చేయించవచ్చు. నన్ను స్మృతి చేసినట్లయితే పాపాలు తొలగిపోతాయి, పావనంగా అయి పావన ప్రపంచానికి యజమానులుగా అవుతారు అని తండ్రి చెప్తున్నారు. ఇప్పుడైతే పతిత ప్రపంచము కదా. స్వర్ణిమ యుగం తప్పకుండా ఉండేది, ఇప్పుడిది ఇనుప యుగం. మీరు స్వర్ణిమ యుగములో ఖుదా (భగవంతుడు) వద్దకు వెళ్ళరా? ఇలా వినిపించినట్లయితే వెంటనే వచ్చి కాళ్ళపై పడతారు. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. జ్ఞానరత్నాల సాగరుని నుండి అవినాశి జ్ఞాన రత్నాలేవైతే ప్రాప్తిస్తున్నాయో, వాటికి విలువనివ్వాలి. విచార సాగర మథనము చేసి స్వయంలో జ్ఞాన రత్నాలను ధారణ చెయ్యాలి. నోటి ద్వారా సదా రత్నాలే వెలువడాలి.
2. స్మృతియాత్రలో ఉంటూ వాణిని పదునైనదిగా చేసుకోవాలి. స్మృతి ద్వారానే ఆత్మ కాంచనంగా అవుతుంది కావున స్మృతి చేసే తెలివిని నేర్చుకోవాలి.