22-06-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైన పిల్లలూ - మీ ఉన్నతి కోసం రోజూ రాత్రి పడుకునే ముందు మీ లెక్కాపత్రాన్ని చూసుకోండి, నేను రోజంతటిలో ఎవ్వరికీ దుఃఖమునైతే ఇవ్వలేదు కదా అని చెక్ చేసుకోండి"

ప్రశ్న:-

మహాన్ సౌభాగ్యశాలి పిల్లల్లో ఏ ధైర్యము ఉంటుంది?

జవాబు:-

మహాన్ సౌభాగ్యశాలులెవరైతే ఉంటారో వారు స్త్రీ-పురుషులిద్దరూ కలిసి ఉంటూ కూడా సోదరులుగానే ఉంటారు. స్త్రీ-పురుషులము అన్న భావన ఉండదు. పక్కా నిశ్చయబుద్ధి కలవారిగా ఉంటారు. నేనూ విద్యార్థినే, తాను విద్యార్థియే, కనుక సోదరీ-సోదరులవుతాము, అని మహాన్ సౌభాగ్యశాలి పిల్లలు వెంటనే అర్థము చేసుకుంటారు. ఎప్పుడైతే స్వయాన్ని ఆత్మగా భావిస్తారో అప్పుడే ఈ ధైర్యము కొనసాగుతుంది.

గీతము:-

నీ ముఖాన్ని చూసుకో ప్రాణీ... (ముఖడా - దేఖ్ లే ప్రాణీ...)

ఓంశాంతి. ఎవ్వరికీ దుఃఖమునైతే ఇవ్వలేదు కదా మరియు ఎంత సమయం బాబాను స్మృతి చేశాను అని నిద్రించే సమయములో ఆంతరికంగా మీ లెక్కాపత్రాన్ని చూసుకోండి అని బాబా ప్రతి రోజూ పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఇది ముఖ్యమైన విషయము. నేను ఎంతవరకు తమోప్రధానం నుండి సతోప్రధానంగా అయ్యాను అని స్వయాన్ని చూసుకోండి అని పాటలో కూడా అన్నారు. రోజంతటిలో ఎంత సమయం నా మధురమైన తండ్రిని స్మృతి చేశాను? ఏ దేహధారినీ స్మృతి చేయకూడదు. మీ తండ్రిని స్మృతి చేయండి అని ఆత్మలందరికీ చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు తిరిగి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? శాంతిధామానికి వెళ్ళి కొత్త ప్రపంచంలోకి రావాలి. ఇదైతే పాత ప్రపంచము కదా. బాబా వచ్చినప్పుడు స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయి. ఇప్పుడు మనము సంగమయుగములో కూర్చున్నామని పిల్లలైన మీకు తెలుసు. సంగమయుగములోకి వచ్చి స్టీమరులో కూర్చొని మళ్ళీ దిగి వెళ్ళిపోతారు, ఇది కూడా విచిత్రమే. ఇప్పుడు మీరు సంగమయుగములో పురుషోత్తములుగా అయ్యేందుకు, తీరం దాటేందుకు నావలోకి వచ్చి కూర్చున్నారు. మరి పాత కలియుగ ప్రపంచము నుండి మనసును తొలగించుకోవలసి ఉంటుంది. ఈ శరీరము ద్వారా కేవలం పాత్రను అభినయించవలసి ఉంటుంది. ఇప్పుడు మనము చాలా సంతోషంగా తిరిగి వెళ్ళాలి. మనుష్యులు ముక్తి కోసం ఎంతగానో కష్టపడతారు కాని ముక్తి-జీవన్ముక్తికి అర్థం తెలుసుకోరు. శాస్త్రాలలోని పదాలు విన్నారు కాని అవి ఏమిటో, ఎవరిస్తారో, ఎప్పుడిస్తారో, ఇవేమీ తెలియదు. ముక్తి-జీవన్ముక్తుల వారసత్వమును ఇచ్చేందుకు తండ్రి వస్తారని పిల్లలైన మీకు తెలుసు. అది కూడా ఒక్కసారి కాదు, అనేక సార్లు ఇస్తారు. లెక్కలేనన్నిసార్లు మీరు ముక్తి నుండి జీవన్ముక్తిలోకి, మళ్ళీ జీవన బంధనంలోకి వచ్చారు. మనము ఒక ఆత్మ అని మీరిప్పుడు అర్థం చేసుకున్నారు, బాబా పిల్లలైన మనకు ఎంతో శిక్షణ ఇస్తారు. మీరు భక్తి మార్గములో దుఃఖంలో స్మృతి చేసేవారు కాని గుర్తించేవారు కాదు. ఇప్పుడు నేను మీకు ఏవిధంగా నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనమౌతాయో, ఆ నా పరిచయమిచ్చాను. ఇప్పటి వరకు ఎన్ని వికర్మలు జరిగాయి అన్నది, మీ లెక్కాపత్రాన్ని పరిశీలించుకోవడం ద్వారా తెలుస్తుంది. ఎవరైతే సేవలో తత్పరులై ఉంటారో వారికి తెలుస్తుంది, పిల్లలకు సేవ పట్ల ఆసక్తి ఉంటుంది. పరస్పరం కలుసుకుని, చర్చించుకుని మనుష్యుల జీవితాన్ని వజ్రతుల్యంగా తయారుచేసే సేవ చేసేందుకు వెళ్తారు. ఇది ఎంతటి పుణ్య కార్యము. ఇందులో ఖర్చు మొదలైన వాటి విషయమేమీ లేదు. వజ్ర సమానంగా అయ్యేందుకు కేవలం బాబాను స్మృతి చేయాలి. పుష్యరాగము, పచ్చ మొదలైన పేర్లు ఏవైతే ఉన్నాయో, అవన్నీ మీవే. ఎంతగా స్మృతిలో ఉంటారో అంతగా వజ్ర సమానంగా అయిపోతారు. కొందరు మాణిక్యము వలె, కొందరు పుష్యరాగము వలె అవుతారు. నవరత్నాలుంటాయి కదా. ఏదైనా గ్రహచారము వచ్చినప్పుడు నవరత్నాల ఉంగరాన్ని ధరిస్తారు. భక్తి మార్గములో ఎన్నో మంత్రాలిస్తారు. ఇక్కడైతే అన్ని ధర్మాల వారికి ఒకే మంత్రము - మన్మనాభవ ఎందుకంటే భగవంతుడు ఒక్కరే. మనుష్యుల నుండి దేవతలుగా అయ్యేందుకు లేదా ముక్తి - జీవన్ముక్తులను పొందేందుకు పురుషార్థము ఒక్కటే, కేవలం తండ్రిని స్మృతి చేయాలి, కష్టమైన విషయం ఏదీ లేదు. నాకు స్మృతి ఎందుకు నిలవడం లేదు, రోజంతటిలో ఇంత తక్కువగా ఎందుకు స్మృతి చేశాను అని ఆలోచించాలి. ఈ స్మృతి ద్వారా మనము సదా ఆరోగ్యవంతులుగా, నిరోగులుగా అవుతున్నప్పుడు మరి మనం చార్టు పెట్టుకొని ఉన్నతిని ఎందుకు పొందకూడదు. చాలా మంది 2-4 రోజులు చార్టు పెట్టి తర్వాత మర్చిపోతారు. ఎవరికైనా అర్థం చేయించడం కూడా చాలా సహజము. కొత్త ప్రపంచాన్ని సత్యయుగమని మరియు పాత ప్రపంచాన్ని కలియుగమని అంటారు. కలియుగము పరివర్తన చెంది సత్యయుగము వస్తుంది, పరివర్తన అవుతుంది, అందుకే మనం అర్థం చేయిస్తున్నాము.

ఆ నిరాకార తండ్రియే బ్రహ్మా తనువులోకి వచ్చి మనల్ని చదివిస్తునారు అన్న పక్కా నిశ్చయము కూడా కొంతమంది పిల్లలలో ఉండదు. అరే, బ్రాహ్మణులు కదా. బ్రహ్మాకుమార-కుమారీలని పిలువబడతారు, దాని అర్థమేమిటి, వారసత్వము ఎక్కడ నుండి లభిస్తుంది! ఎప్పుడైతే ఎంతో కొంత ప్రాప్తి లభిస్తుందో అప్పుడే దత్తత తీసుకోవడం జరుగుతుంది. బ్రహ్మా సంతానమైన మీరు బ్రహ్మాకుమార-కుమారీలుగా ఎందుకు అయ్యారు? నిజంగా అయ్యారా లేక ఇందులో కూడా ఎవరికైనా సంశయముందా. మహాన్ సౌభాగ్యశాలి పిల్లలైతే స్త్రీ-పురుషులు కలిసి ఉంటూ కూడా సోదరులుగానే ఉంటారు. స్త్రీ-పురుషులము అన్న భావన ఉండదు. పక్కా నిశ్చయబుద్ధి కలవారిగా లేకపోతే స్త్రీ-పురుషులము అనే దృష్టిని మార్చుకోవడానికి కూడా సమయం పడుతుంది. నేనూ విద్యార్థినే, తానూ కూడా విద్యార్థియే కనుక సోదరీ-సోదరులమవుతాము - అని మహాన్ సౌభాగ్యశాలి పిల్లలు వెంటనే అర్థము చేసుకుంటారు. స్వయాన్ని ఆత్మగా భావించినప్పుడే ఆ ధైర్యముతో నడవగలరు. ఆత్మలందరూ సోదరులే, తర్వాత బ్రహ్మాకుమార-కుమారీలుగా అవ్వడం వలన సోదరీ-సోదరులుగా అవుతారు. కొందరైతే బంధనముక్తులుగా కూడా ఉన్నారు, అయినా ఎంతో కొంత బుద్ధి అటువైపు వెళ్తుంది. కర్మాతీత స్థితి ఏర్పడడానికి సమయం పడుతుంది. పిల్లలైన మీలో చాలా సంతోషం ఉండాలి. ఇందులో ఎటువంటి జంజాటము లేదు. ఆత్మలమైన మనము పాత శరీరము మొదలైనవన్నీ వదిలి ఇప్పుడు బాబా వద్దకు వెళ్తాము. మనం ఎంతటి పాత్రను అభినయించాము. ఇప్పుడు చక్రము పూర్తి అవుతుంది. ఇలా-ఇలా స్వయంతో మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఎంతగా మాట్లాడుకుంటూ ఉంటారో, అంతగా హర్షితంగా కూడా ఉంటారు మరియు ఎంతవరకు మేము లక్ష్మీ-నారాయణులను వరించేందుకు యోగ్యులుగా అయ్యాము అని తమ నడవడికను కూడా చూసుకుంటూ ఉంటారు. ఇప్పుడు కొద్ది సమయంలోనే పాత శరీరాన్ని విడిచిపెట్టాలని బుద్ధి ద్వారా అర్థము చేసుకుంటారు. మీరు పాత్రధారులు కూడా. స్వయాన్ని పాత్రధారులమని భావిస్తారు. ఇంతకుముందు అలా అనుకునేవారు కాదు, ఇప్పుడు ఈ జ్ఞానము లభించింది కనుక లోలోపల చాలా సంతోషము ఉండాలి. పాత ప్రపంచము పట్ల వైరాగ్యము, అసహ్యం కలగాలి.

మీరు అనంతమైన సన్యాసులు, రాజయోగులు. బుద్ధి ద్వారా ఈ పాత శరీరాన్ని కూడా సన్యసించాలి. వీటితో బుద్ధిని జోడించకూదని ఆత్మ భావిస్తుంది. బుద్ధి ద్వారా పాత ప్రపంచాన్ని, పాత శరీరాన్ని సన్యసించారు. ఇప్పుడు ఆత్మలమైన మనము వెళ్ళి తండ్రిని కలుసుకుంటాము. ఒక్క తండ్రిని స్మృతి చేసినప్పుడే ఇది జరుగుతుంది. ఇతురులెవ్వరిని గుర్తు చేసినా తప్పకుండా వారి స్మృతి వస్తుంది. తర్వాత శిక్షలు కూడా అనుభవించాల్సి వస్తుంది మరియు పదభ్రష్టులుగా కూడా అయిపోతారు. మంచి-మంచి విద్యార్థులు ఎవరైతే ఉంటారో, వారు స్కాలర్షిప్ తీసుకొని తీరుతామని స్వయంతో ప్రతిజ్ఞ చేసుకుంటారు. అలాగే ఇక్కడ కూడా మేము బాబా నుండి పూర్తి రాజ్య-భాగ్యాన్ని తీసుకునే తీరుతామని ప్రతి ఒక్కరికీ ఈ ఆలోచన ఉండాలి. అప్పుడు వారి నడవడిక కూడా అలాగే ఉంటుంది. ముందు ముందు పురుషార్థము చేస్తూ-చేస్తూ గ్యాలప్ చేయాలి (చాలా వేగంగా వెళ్ళాలి). ప్రతి రోజూ సాయంకాలము తమ స్థితిని పరిశీలించుకున్నప్పుడే ఇది సంభవమవుతుంది. బాబా వద్దకు ప్రతి ఒక్కరి సమాచారమైతే వస్తుంది కదా. బాబా ప్రతి ఒక్కరిని అర్థము చేసుకోగలరు, కొంతమందికైతే మీలో ఆ లక్షణాలు కనిపించడం లేదని చెప్పేస్తారు. లక్ష్మీ-నారాయణులుగా అయ్యే ముఖకవళికలు వీరిలో కనిపించటం లేదు, నడవడిక, ఆహార-పానీయాలు మొదలైనవి చూసుకోండి, సేవ ఎక్కడ చేస్తున్నారు, మరి అక్కడ ఏమవుతారు అని అంటారు! అప్పుడు మేము ఏదైనా చేసి చూపించాలి - అని మనసులో అనిపిస్తుంది. ఇందులో ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా తమ భాగ్యాన్ని ఉన్నతంగా తయారుచేసుకునేందుకు చదువుకోవాలి. ఒకవేళ శ్రీమతానుసారముగా నడుచుకోకపోతే, అంత ఉన్నత పదవిని కూడా పొందలేరు. ఇప్పుడు పాస్ అవ్వలేదంటే కల్ప-కల్పాంతరాలూ పాస్ అవ్వరు. మేము ఏ పదవిని పొందేందుకు యోగ్యులుగా ఉన్నాము అనేది మీకు మొత్తం సాక్షాత్కారమవుతుంది. మీ పదవి కూడా సాక్షాత్కారము అవుతుంది. ప్రారంభంలో కూడా సాక్షాత్కారాలు పొందేవారు, తర్వాత వాటిని బాబా వినిపించేందుకు అనుమతించేవారు కాదు. అంతిమంలో, మనము ఏమవుతాము అనేది తెలిసిపోతుంది, తర్వాత ఏమీ చేయలేరు. కల్ప-కల్పాంతరాలకు ఇదే పరిస్థితి ఏర్పడుతుంది. డబల్ కిరీటాన్ని, డబల్ రాజ్య-భాగ్యాన్ని పొందలేరు. ఇప్పుడు పురుషార్థము చేసేందుకు ఎంతగానో మార్జిన్ ఉంది, త్రేతాయుగము అంతిమము వరకు 16,108 మణుల పెద్ద మాల తయారవ్వాలి. నరుని నుండి నారాయణునిగా అయ్యే పురుషార్థము చేసేందుకే మీరిక్కడకు వచ్చారు. ఎప్పుడైతే తక్కువ పదవి సాక్షాత్కారమవుతుందో, అప్పుడు ఆ సమయంలో స్వయంపై ద్వేషం కలగడం మొదలవుతుంది. మేమైతే పురుషార్థమేమీ చేయలేదు. చార్టు పెట్టండి, ఇది చేయండి అని బాబా ఎంతగా అర్థం చేయించారు అని తల దించుకుంటారు, అందుకే వచ్చిన పిల్లలందరి ఫోటోలు ఉండాలని బాబా చెప్పేవారు. గ్రూపంతా కలిసి ఉన్న ఫోటో అయినా ఉండాలి. పార్టీలను తీసుకు వస్తారు కదా. అందులో తారీఖు, ఫిలిమ్ మొదలైనవన్నీ పెట్టి ఉండాలి. ఎవరెవరు పడిపోయారో బాబా తర్వాత తెలియజేస్తూ ఉంటారు. బాబా వద్దకు సమాచారమంతా వస్తుంది, తెలియజేస్తూ ఉంటారు. ఎంతమందిని మాయ లాక్కుని వెళ్ళిపోయింది. సమాప్తమైపోయారు. ఆడపిల్లలు కూడా చాలామంది పడిపోతూ ఉంటారు. పూర్తిగా దుర్గతిని పొందుతారు, ఇక అడగకండి. అందుకే, పిల్లలూ, జాగ్రత్తగా ఉండండి అని బాబా చెప్తున్నారు. మాయ ఏదో ఒక రూపాన్ని ధరించి పట్టుకుంటుంది. అసలు ఎవ్వరి నామ-రూపాల వైపూ చూడకండి. ఈ కళ్ళతో చూస్తున్నా కాని బుద్ధిలో ఒక్క బాబా స్మృతినే ఉండాలి. మూడవ నేత్రం లభించింది, కావున తండ్రిని మాత్రమే చూడండి మరియు స్మృతి చేయండి. దేహాభిమానాన్ని వదిలేస్తూ వెళ్ళండి. అలాగని ఎవరితోనైనా తల వంచుకొని మాట్లాడమని కాదు. అలా బలహీనులుగా అవ్వకూడదు. చూస్తున్నా బుద్ధియోగము తమ ప్రియమైన ప్రియుని వైపు ఉండాలి. ఈ ప్రపంచాన్ని చూస్తూ ఇదంతా స్మశానవాటికగా అవ్వనున్నదని లోలోపల భావిస్తారు. దీనితో ఎందుకు సంబంధం పెట్టుకోవాలి. మీకు జ్ఞానము లభిస్తుంది - అది ధారణ చేసి దాని అనుసారంగా నడుచుకోవాలి.

పిల్లలైన మీరు ప్రదర్శిని మొదలైన వాటిలో అర్థం చేయించేటప్పుడు నోటి నుండి బాబా-బాబా అని వేలసార్లు వెలువడుతూ ఉండాలి. బాబాను స్మృతి చేస్తే మీకు ఎంత లాభం కలుగుతుంది. నన్నొక్కరినే స్మృతి చేస్తే వికర్మలు వినాశనమౌతాయి అని శివబాబా అంటున్నారు. శివబాబాను స్మృతి చేస్తే తమోప్రధానము నుండి సతోప్రధానంగా అవుతారు. నన్ను స్మృతి చేయండి, ఇది మర్చిపోకండి అని బాబా చెప్తున్నారు. మన్మనాభవ అని తండ్రి ఆదేశము లభించింది. బాబా అనే ఈ పదాన్ని మంచి రీతిలో నెమరువేస్తూ ఉండండి అని తండ్రి చెప్పారు. రోజంతా బాబా-బాబా అని అంటూ ఉండండి. ఇంక ఏ విషయమూ ఉండకూడదు. ముఖ్యమైన నంబరువన్ విషయం ఇదే. మొదట తండ్రిని తెలుసుకోవాలి, అందులోనే కళ్యాణముంది. ఈ 84 జన్మల చక్రమును అర్థము చేసుకోవడం చాలా సహజము. పిల్లలకు ప్రదర్శినిలో అర్థము చేయించేందుకు చాలా ఆసక్తి ఉండాలి. మేము అర్థం చేయించలేము అని ఒకవేళ ఎక్కడైనా అనిపిస్తే మేము మా పెద్ద అక్కయ్యను పిలుస్తాము అని చెప్పాలి, ఎందుకంటే ఇది కూడా పాఠశాలనే కదా. ఇందులో కొంతమంది తక్కువగా చదువుకుంటారు, కొంతమంది బాగా చదువుకుంటారు. ఇలా చెప్పడానికి దేహాభిమానము రాకూడదు. పెద్ద సెంటర్లలలో ప్రదర్శిని కూడా పెట్టాలి. గేట్ వే టూ హెవెన్ (స్వర్గానికి ద్వారము) - అన్న చిత్రము తగిలించి ఉండాలి. ఇప్పుడు స్వర్గ ద్వారాలు తెరుచుకుంటున్నాయి. జరగబోయే ఈ యుద్ధము కంటే ముందే మీ వారసత్వము తీసుకోండి. ఎలాగైతే మందిరాలకు ప్రతి రోజు వెళ్ళవలసి ఉంటుందో, అలాగే మీకు పాఠశాల ఉంది. చిత్రము తగిలించబడి ఉంటే అర్థము చేయించడం సులభమవుతుంది. మేము మా పాఠశాలను చిత్రశాలగా ఎలా తయారు చేయాలి అని ప్రయత్నించాలి. ఆర్భాటం కూడా ఉంటే మనుష్యులు వస్తారు. వైకుంఠానికి వెళ్ళే మార్గం, ఒక సెకండులో అర్థము చేసుకునే మార్గం. తమోప్రధానంగా ఉన్నవారెవ్వరూ వైకుంఠానికి వెళ్ళలేరు అని తండ్రి చెప్తున్నారు. కొత్త ప్రపంచములోకి వెళ్ళేందుకు సతోప్రధానంగా అవ్వాలి, ఇందులో ఎటువంటి ఖర్చు ఉండదు. మందిరం లేదా చర్చి మొదలైన వాటికి వెళ్ళే అవసరము లేదు. స్మృతి చేస్తూ-చేస్తూ పవిత్రంగా అయి నేరుగా మధురమైన ఇంటికి వెళ్ళిపోతారు. మీరు అపవిత్రము నుండి పవిత్రంగా అవుతారని నేను గార్యంటీ ఇస్తున్నాను. సృష్టి చక్రము చిత్రములో గేటు పెద్దదిగా ఉండాలి. స్వర్గము గేటు ఎలా తెరచుకుంటుంది అనేది చాలా స్పష్టంగా ఉంది. నరకము గేటు మూసి ఉండాలి. స్వర్గంలో నరకం యొక్క పేరే ఉండదు. కృష్ణుడిని ఎంత గుర్తు చేస్తారు. కాని కృష్ణుడు ఎప్పుడు వస్తారో, ఎవ్వరికీ తెలియదు, ఏ మాత్రము తెలియదు. తండ్రి గురించే తెలియదు. భగవంతుడు మనకు మళ్ళీ రాజయోగము నేర్పిస్తున్నారు అన్నది గుర్తున్నా ఎంతటి సంతోషముంటుంది. మేము ఈశ్వరీయ విద్యార్థులము అని సంతోషము కూడా ఉండాలి. ఇది ఎందుకు మర్చిపోవాలి. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. రోజంతా నోటి నుండి బాబా-బాబా అని వెలువడుతూ ఉండాలి, ప్రదర్శిని మొదలైనవి అర్థము చేయించే సమయంలో కనీసం వేయిసార్లు అయినా నోటి నుండి బాబా-బాబా అని వెలువడాలి.

2. ఈ కళ్ళ ద్వారా అంతా చూస్తున్నా కూడా, ఒక్క తండ్రి స్మృతి మాత్రమే ఉండాలి, పరస్పరము మాట్లాడుకుంటూ కూడా మూడవ నేత్రము ద్వారా ఆత్మను మరియు ఆత్మల తండ్రిని చూసే అభ్యాసము చేయాలి.

వరదానము:-

నీరస వాతావరణంలో సంతోషపు ప్రకాశాన్ని అనుభవం చేయించే ఎవర్ హ్యాపి భవ

ఎవర్ హ్యాపి అనగా సదా సంతోషంగా ఉండే వరదానము ప్రాప్తించినవారు. ఏ పిల్లలకైతే ఈ వరదానం ప్రాప్తించిందో, వారు దుఃఖపు అలలు ఉత్పన్నము చేసే వాతావరణంలో, నీరస వాతావరణంలో, అప్రాప్తిని అనుభవం చేయించే వాతావరణంలో సదా సంతోషంగా ఉంటారు, అంతేకాక తమ సంతోషపు ప్రకాశంతో దుఃఖము మరియు ఉదాసీన వాతావరణాన్ని సూర్యుడు అంధకారాన్ని పరివర్తన చేసినట్లుగా పరివర్తన చేస్తారు. అంధకారం మధ్యలో ప్రకాశాన్ని తీసుకురావడం, అశాంతిలో శాంతిని తీసుకురావడం, నీరస వాతావరణంలో సంతోషపు ప్రకాశాన్ని తీసుకురావడం, దీనినే ఎవర్ హ్యాపి అని అంటారు. వర్తమాన సమయంలో ఈ సేవ యొక్క అవసరం ఉంది.

స్లోగన్:-

ఎవరినైతే శరీరం యొక్క ఏ ఆకర్షణ తనవైపుకు ఆకర్షించదో, వారే అశరీరులు.