06-06-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైనపిల్లలూ - ఈ అనంతమైన ఆటలో ఆత్మలైన మీరు నటులు, పాత్రధారులు, ఆ స్వీట్ సైలెన్స్ హోమ్ (మధురమైన నిశ్శబ్ద ధామమే) మీ నివాస స్థానము, ఇప్పుడు అక్కడకు వెళ్ళాలి"

ప్రశ్న:-

ఎవరైతే డ్రామా ఆటను యథార్థంగా తెలుసుకున్నారో, వారి నోటి నుండి ఏ మాటలు వెలువడవు?

జవాబు:-

ఇది ఇలా జరిగి ఉండకపోతే అలా జరిగి ఉండేది..... ఇది జరగకుండా ఉండవలసింది అనేటటువంటి మాటలు డ్రామా ఆటను తెలుసుకున్నవారు మాట్లాడరు. ఈ డ్రామా ఆట పేను వలె తిరుగుతూ ఉంటుంది, ఏమి జరుగుతున్నా అదంతా డ్రామాలో నిశ్చితమై ఉంది, చింతించే మాటే లేదు అని పిల్లలైన మీకు తెలుసు.

ఓంశాంతి. బాబా పిల్లలకు ఎప్పుడైతే తమ పరిచయాన్ని ఇస్తారో, అప్పుడు పిల్లలకు తమ పరిచయం కూడా లభిస్తుంది. పిల్లలందరూ చాలా సమయం దేహా-అభిమానులుగా ఉంటారు. దేహీ-అభిమానులుగా ఉన్నట్లయితే తండ్రి యథార్థ పరిచయం ఉంటుంది. కాని డ్రామాలో అలా లేనే లేదు. భగవంతుడిని గాడ్ ఫాదర్, రచయిత అని అంటారు కూడా, కాని వారి గురించి తెలియదు. శివలింగ చిత్రం కూడా ఉంది. కాని వారు అంత పెద్దగా లేనే లేరు. యథార్థంగా తెలియని కారణంగా తండ్రిని మర్చిపోతారు. తండ్రి రచయిత కూడా, వారు తప్పకుండా కొత్త ప్రపంచాన్నే రచిస్తారు, అంటే పిల్లలైన మనకు తప్పకుండా కొత్త ప్రపంచ రాజధాని యొక్క వారసత్వం ఉండాలి. స్వర్గం పేరు కూడా భారత్ లో ప్రసిద్ధంగా ఉంది, కాని ఏమాత్రం అర్థం చేసుకోరు. ఫలానావారు మరణించారు, స్వర్గస్థులైయ్యారు అని అంటారు. ఎప్పుడైనా అలా జరుగుతుందా. నంబరువారుగా మనమంతా తుచ్ఛబుద్ధికలవారిగా ఉండేవారిమని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. ముఖ్యుల కోసమే అర్థం చేయించవలసి ఉంటుంది - నేను వీరిలోకి వస్తాను, అనేక జన్మల అంతిమ శరీరములో వస్తాను. వీరు నంబర్ వన్, ఇప్పుడు మనం వీరి పిల్లలుగా బ్రాహ్మణులుగా అయ్యామని పిల్లలకు తెలుసు. ఇవన్నీ అర్థం చేసుకోవలసిన విషయాలు. తండ్రి ఎంతోకాలంగా అర్థం చేయిస్తూనే వచ్చారు. లేకపోతే తండ్రిని గుర్తించడం సెకండు విషయమే. నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయని తండ్రి చెప్తున్నారు. నిశ్చయం ఏర్పడితే ఇంకే విషయంలో ప్రశ్నలూ మొదలైనవి ఉత్పన్నమవ్వవు. మీరు శాంతిధామంలో ఉన్నప్పుడు పావనంగా ఉండేవారు అని తండ్రి అర్థం చేయించారు. ఈ విషయాలు కూడా మీరే తండ్రి ద్వారా వింటున్నారు. ఇతరులెవ్వరూ వినిపించలేరు. ఆత్మలమైన మనం ఎక్కడి నివాసులమో మీకు తెలుసు. ఏ విధంగా నాటకంలోని పాత్రధారులు, మేమిక్కడి నివాసులము, వస్త్రాలు మార్చుకుని స్టేజ్ పైకి వచ్చామని అంటారో ఇదీ అంతే. మనమిక్కడి నివాసులము కామని ఇప్పుడు మీకు తెలుసు. ఇది ఒక నాటకశాల. మనం మూలవతన నివాసులము అన్నది ఇప్పుడు బుద్ధిలోకి వచ్చింది, దీనినే స్వీట్ సైలెన్స్ హోమ్ అని కూడా అంటారు. ఆత్మ దుఃఖంలో ఉన్నందుకు అందరూ దానినే (ఆ ఇంటినే) కోరుకుంటారు. మేము ఇంటికి ఎలా తిరిగి వెళ్ళాలి అని అడుగుతారు. ఇంటి చిరునామా తెలియని కారణంగా భ్రమిస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు భ్రమించడం నుండి విముక్తులైపోయారు. ఇప్పుడు మనం తప్పకుండా ఇంటికి వెళ్ళాలని పిల్లలకు తెలిసింది. ఆత్మనైన నేను ఎంత చిన్న బిందువును. ఇది కూడా అద్భుతమే, దీనిని సహజసిద్ధమైనది అని అంటారు. ఇంత చిన్న బిందువులో ఎంత పాత్ర నిండి ఉంది. పరమపిత పరమాత్మ పాత్రను ఎలా అభినయిస్తారో కూడా మీరు తెలుసుకున్నారు. అందరికంటే ముఖ్య పాత్రధారులు వారే, చేసేవారు మరియు చేయించేవారు కదా. మధురాతి-మధురమైన పిల్లలైన మీకిప్పుడు ఆత్మలైన మనం శాంతిధామం నుండి వస్తామని అర్థమయింది. శరీరంలో ప్రవేశించే ఆత్మలు కొత్తవేమీ వెలువడవు. ఆత్మలన్నీ మధురమైన ఇంటిలో ఉంటాయి. అక్కడ నుండి పాత్రను అభినయించేందుకు వస్తాయి. అందరూ పాత్రను అభినయించాలి. ఇది ఆట. ఈ సూర్య చంద్రులు, నక్షత్రాలు మొదలైనవి ఏమిటి! ఇవన్నీ దీపాలు, ఇందులో రాత్రి మరియు పగలు యొక్క ఆట నడుస్తుంది. కొందరు సూర్య దేవతాయ నమః, చంద్ర దేవతాయ నమః..... అని అంటారు కాని వాస్తవానికి అవి దేవతలు కావు. ఈ ఆట గురించి ఎవరికీ తెలియదు. సూర్య చంద్రులను కూడా దేవతలని అంటారు. వాస్తవానికి అవి మొత్తం విశ్వనాటకానికి దీపాలవంటివి. మనం స్వీట్ సైలెన్స్ హోమ్ నివాసులము. మనమిక్కడ పాత్రను అభినయిస్తున్నాము, ఈ చక్రం పేను వలె తిరుగుతూ ఉంటుంది, ఏం జరిగినా డ్రామాలో నిశ్చితమై ఉంది. ఇలా జరగకపోతే ఇలా జరిగి ఉండేదని ఎప్పుడూ అనకూడదు. ఇదైతే డ్రామా కదా. ఉదాహరణకు మీ తల్లి (మమ్మా) ఉండేవారు, వారు వెళ్ళిపోతారని సంకల్పంలో కూడా లేదు. అచ్ఛా, శరీరాన్ని విడిచిపెట్టేశారు - డ్రామా. ఇప్పుడు తమ కొత్త పాత్రను అభినయిస్తున్నారు. చింతించే విషయమేమీ లేదు. మనమంతా పాత్రధారులమని ఇక్కడ పిల్లలైన మీ అందరి బుద్ధిలో ఉంది, ఇది గెలుపు ఓటముల ఆట. ఈ గెలుపు ఓటముల ఆట మాయపై ఆధారపడి ఉంది. మాయతో ఓడిపోతే ఓటమి మరియు మాయతో గెలిస్తే గెలుపు. ఇది అందరూ పాడుతారు కాని బుద్ధిలో కొద్దిగా కూడా జ్ఞానం లేదు. మాయ అంటే ఏమిటో మీకు తెలుసు, వారు రావణుడు, వారినే మాయ అని అంటారు. ధనాన్ని సంపద అని అంటారు. ధనాన్ని మాయ అని అనరు. ఫలానావారి వద్ద ఎంతో ధనముంది, కావున వారికి మాయ నషా ఎంతో ఉందని అనుకుంటారు. కాని మాయ నషా ఎక్కడైనా ఉంటుందా! మాయను మనం జయించేందుకు ప్రయత్నిస్తాము. కావున ఏ విషయంలోనూ కూడా సంశయం రాకూడదు. అపరిపక్వమైన స్థితి ఉన్న కారణంగానే సంశయం కలుగుతుంది. ఇప్పుడు భగవానువాచ - ఎవరి గురించి? ఆత్మల గురించి. భగవంతుడు తప్పకుండా శివబాబానే, వారు ఆత్మలకు చెప్తున్నారు. కృష్ణుడైతే దేహధారి. వారు ఆత్మలకు ఎలా చెప్పగలరు. మీకు దేహధారి ఎవరూ జ్ఞానాన్ని వినిపించడం లేదు. తండ్రికి దేహమే లేదు. ఇతరులందరికీ దేహముంది, ఎవరిని పూజిస్తారో వారిని స్మృతి చేయడం సహజమే. బ్రహ్మా, విష్ణు, శంకరులను దేవతలని అంటారు. శివుడిని భగవంతుడని అంటారు. ఉన్నాతాతి ఉన్నతమైనవారు భగవంతుడు, వారికి దేహమే లేదు. మూలవతనంలో ఆత్మలున్నప్పుడు మీకు దేహముండేదా? లేదు. ఇది కూడా మీకు తెలుసు. ఆత్మలైన మీరు ఉండేవారు. ఈ బాబా కూడా ఆత్మనే. కాని వారు పరమ ఆత్మ, వారి పాత్ర మహిమ చేయబడింది. పాత్రను అభినయించి వెళ్ళారు, అందుకే పూజ జరుగుతుంది. 5 వేల సంవత్సరాల క్రితం కూడా రచయిత అయిన పరమపిత పరమాత్మ వచ్చారు, వారే స్వర్గ రచయిత అని తెలిసిన మనుష్యులు ఒక్కరు కూడా లేరు. ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత కల్పం యొక్క సంగమయుగంలో వారు వస్తారు, కాని కల్పం ఆయుష్షును చాలా ఎక్కువగా వ్రాసినందుకు అందరూ మర్చిపోయారు. పిల్లలైన మీకు తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు, బాబా మేము మిమ్మల్ని కల్ప-కల్పమూ కలుసుకుంటాము మరియు మీ నుండి వారసత్వాన్ని తీసుకుంటాము అని మీరే స్వయంగా అంటారు, మళ్ళీ ఎలా పోగొట్టుకుంటారో, ఇదంతా బుద్ధిలో ఉంది. అనేక రకాల జ్ఞానమైతే ఉంది కాని జ్ఞానసాగరుడని భగవంతుడినే అంటారు. వినాశనం తప్పకుండా జరుగుతుందని కూడా ఇప్పుడు అందరికీ తెలుసు. ఇంతకుముందు కూడా వినాశనం జరిగింది. ఎలా జరిగిందనేది ఎవ్వరికీ కూడా తెలియదు. శాస్త్రాలలో అయితే వినాశనం గురించి ఏమేమో వ్రాసేశారు. పాండవుల మరియు కౌరవుల యుద్ధం ఎలా జరగగలదు!

ఇప్పుడు బ్రాహ్మణులైన మీరు సంగమయుగంలో ఉన్నారు. బ్రాహ్మణులకైతే ఏ యుద్ధమూ లేనే లేదు. నా పిల్లలైన మీరు అహింసకులు, డబల్ అహింసకులు అని బాబా అంటారు. ఇప్పుడు మీరు నిర్వికారులుగా అవుతున్నారు. మీరు కూడా బాబా ద్వారా కల్ప-కల్పమూ వారసత్వాన్ని తీసుకుంటారు. ఇందులో ఏమాత్రం కష్టం లేదు. జ్ఞానం చాలా సహజమైనది. 84 జన్మల చక్రం మీ బుద్ధిలో ఉంది. ఇప్పుడు నాటకం పూర్తవుతుంది, ఇంకా కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది. షావుకార్లకు కూడా ధాన్యం లభించదు, నీరు లభించదు, ఇప్పుడు అటువంటి సమయం వస్తుందని మీకు తెలుసు. దీన్నే దుఃఖపు పర్వతం అని అంటారు, అనవసర రక్తసిక్తమైన ఆట కదా. అందరూ అంతమైపోతారు. ఎవరైనా తప్పు చేస్తే వారికి శిక్ష లభిస్తుంది, వీరేం తప్పు చేశారు? కేవలం ఒక తప్పు మాత్రమే చేశారు, తండ్రిని మర్చిపోయారు. మీరు తండ్రి ద్వారా రాజ్యాన్ని తీసుకుంటున్నారు. మిగిలిన మనుష్యులంతా ఇక మరణించినట్లే అని భావిస్తారు. మహాభారత యుద్ధం కొద్దిగా ప్రారంభమయినా అంతమైపోతారు. మీరైతే జీవించే ఉంటారు కదా. మీరు ట్రాన్స్ఫర్ అయ్యి అమరలోకానికి వెళ్ళిపోతారు, ఈ చదువుకు గల శక్తితో వెళ్తారు. చదువును సంపాదనకు ఆధారమని అంటారు. శాస్త్రాలది కూడా చదువే, దాని ద్వారా కూడా ఆదాయం లభిస్తుంది, కాని అది భక్తిమార్గంలోని చదువు. నేను మిమ్మల్ని ఈ లక్ష్మీ-నారాయణుల వలె తయారుచేస్తాను అని ఇప్పుడు తండ్రి చెప్తున్నారు. మీరిప్పుడు స్వచ్ఛబుద్ధి కలవారిగా అవుతారు. మనం ఉన్నతాతి ఉన్నతంగా అవుతామని, తిరిగి పునర్జన్మలు తీసుకుంటూ-తీసుకుంటూ కిందకు దిగుతామని మీకు తెలుసు. కొత్తదాని నుండి పాతదిగా అవుతుంది. మెట్లు తప్పకుండా దిగాలి కదా. ఇప్పుడు సృష్టిలో కూడా దిగేకళ ఉంది. పైకి ఎక్కే కళ ఉన్నప్పుడైతే ఈ దేవతల రాజ్యముండేది, స్వర్గముండేది. ఇప్పుడు నరకం ఉంది. ఇప్పుడు మీరు మళ్ళీ స్వర్గవాసులుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు. బాబా-బాబా అని అంటూ ఉంటారు.

ఓ గాడ్ ఫాదర్ అని పిలుస్తారు కాని వారు ఆత్మల తండ్రి ఉన్నతాతి ఉన్నతమైనవారు, వారి పిల్లలైన మనం ఎందుకు దుఃఖితులుగా ఉన్నామో ఎవరూ అర్థం చేసుకోరు. దుఃఖితులుగా అవ్వాల్సిందేనని మీకిప్పుడు తెలిసింది. ఇది సుఖదుఃఖాల ఆట కదా. గెలుపులో సుఖముంటుంది, ఓటమిలో దుఃఖముంటుంది. తండ్రి రాజ్యాన్ని ఇచ్చారు, రావణుడు లాక్కున్నాడు. తండ్రి ద్వారా మనకు స్వర్గ వారసత్వం లభిస్తూ ఉంటుందని ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. తండ్రి వచ్చారు, ఇప్పుడు కేవలం తండ్రిని స్మృతి చేస్తే పాపాలు సమాప్తమైపోతాయి. తలపై జన్మ-జన్మల భారముంది కదా. మీరేమీ చాలా దుఃఖితులుగా అవ్వరని మీకు తెలుసు. పిండిలో ఉప్పులా కొంత సుఖం కూడా ఉంది. దానిని కాకిరెట్టతో సమానమైన సుఖమని అంటారు. సర్వుల సద్గతిదాత ఒక్క తండ్రి మాత్రమే అని మీకు తెలుసు. జగద్గురువు కూడా ఒక్కరే. వానప్రస్థ సమయంలో గురువును ఆశ్రయిస్తారు. ఇప్పుడైతే చిన్నతనములోనే గురువు వద్దకు తీసుకువెళ్తారు ఎందుకంటే ఒకవేళ మరణించినట్లయితే సద్గతి పొందుతారని భావిస్తారు. వాస్తవానికి ఎవ్వరినీ గురువు అని అనలేరని బాబా చెప్తున్నారు. ఎవరైతే సద్గతినిస్తారో వారే గురువు. సద్గతిదాత అయితే ఒక్కరే. ఇక క్రీస్తు, బుద్ధుడు మొదలైనవారంతా గురువులు కారు. వారు వచ్చినప్పుడు అందరికీ సద్గతి లభిస్తుందా! క్రీస్తు వచ్చారు, వారి వెనుక వారి ధర్మంవారు అందరూ రావడం ప్రారంభించారు. తీసుకువచ్చేందుకు నిమిత్తమైనవారిని, గురువు అని ఎలా అంటారు. పతిత పావనుడని ఒక్క తండ్రిని మాత్రమే అంటారు, వారు అందరినీ తిరిగి తీసుకువెళ్ళేవారు. స్థాపన కూడా చేస్తారు, అందరినీ తీసుకువెళ్ళిపోతే ప్రళయం జరుగుతుంది. కాని నిజానికి ప్రళయమనేది ఏదీ ఉండదు. సర్వశాస్త్రమయి శిరోమణి శ్రీమద్భగవద్గీత అని గానము చేయబడింది. యదా యదాహి.... అన్న గాయనముంది. తండ్రి భారత్ లోనే వస్తారు. స్వర్గ రాజ్యాధికారం ఇచ్చేవారు తండ్రి, వారిని కూడా సర్వవ్యాపి అని అనేస్తారు. కొత్త ప్రపంచంలో మొత్తం విశ్వంపై మన ఒక్కరి రాజ్యమే ఉంటుందని పిల్లలైన మీకిప్పుడు సంతోషం కలుగుతుంది. ఆ రాజ్యాన్ని ఎవ్వరూ లాక్కోలేరు. ఇక్కడైతే చిన్నచిన్న ముక్కల కోసం పరస్పరంలో ఎంతో కొట్లాడుకుంటూ ఉంటారు. మీకైతే ఎంతో సంతోషముంది. సంతోషంలో గంతులు వేయాలి. కల్ప-కల్పమూ మనం బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటామంటే ఎంత సంతోషముండాలి. నన్ను స్మృతి చేయమని తండ్రి చెప్తున్నా కూడా మర్చిపోతారు. బాబా, యోగం తెగిపోతుందని అంటారు. యోగమనే పదాన్ని తీసేయండి. అది శాస్త్రాల పదం అని బాబా అంటారు. నన్ను స్మృతి చేయండి అని తండ్రి చెప్తున్నారు. యోగం అనే పదం భక్తి మార్గానికి చెందినది. తండ్రి నుండి స్వర్గ రాజ్యం లభిస్తుంది, మీరు వారిని స్మృతి చేయకపోతే వికర్మలు ఎలా వినాశనమవుతాయి. రాజ్యమెలా లభిస్తుంది. స్మృతి చేయకపోతే పదవి కూడా తగ్గిపోతుంది, శిక్షలు కూడా అనుభవించవలసి వస్తుంది. ఈ తెలివి కూడా లేదు. బాగా బుద్ధిహీనులైపోయారు. నేను కల్ప-కల్పమూ నన్ను ఒక్కరినే స్మృతి చేయమని మీకు చెప్తాను. జీవిస్తూనే ఈ ప్రపంచం నుండి మరణించండి. బాబా స్మృతి ద్వారా మీ వికర్మలు వినాశనమవుతాయి మరియు మీరు విజయమాలలో మణులుగా అయిపోతారు. ఎంత సహజం. ఉన్నతాతి ఉన్నతమైన శివబాబా మరియు బ్రహ్మా ఇద్దరూ శ్రేష్ఠమైనవారే. వారు పారలౌకికము మరియు వీరు అలౌకికము. ఎంతో సాధారణమైన టీచర్. ఆ టీచరైనా శిక్షిస్తారు, వీరైతే బుజ్జగిస్తారు. మధురమైన పిల్లలూ, తండ్రిని స్మృతి చేయండి, సతోప్రధానంగా అవ్వండి అని చెప్తారు. పతిత పావనుడు ఒక్క తండ్రి మాత్రమే. గురువు కూడా వారొక్కరే, ఇతరులెవ్వరూ గురువుగా అవ్వలేరు. బుద్ధుడు నిర్వాణం చెందారని అంటారు, అవన్నీ ప్రగల్భాలే. ఒక్కరు కూడా తిరిగి వెళ్ళలేరు. అందరికీ డ్రామాలో పాత్ర ఉంది. ఎంత విశాలమైన బుద్ధి ఉండాలి మరియు ఎంత సంతోషముండాలి. పై నుండి కిందవరకు జ్ఞానమంతా బుద్ధిలో ఉంది. బ్రాహ్మణులే జ్ఞానాన్ని తీసుకుంటారు. శూద్రులకు కాని, దేవతలకు కాని ఈ జ్ఞానం లేదు. ఇప్పుడు అర్థం చేసుకునేవారు అర్థం చేసుకుంటారు. ఎవరైతే అర్థం చేసుకోరో వారికి మరణమే. పదవి కూడా తగ్గిపోతుంది. స్కూల్లో కూడా చదువుకోకపోతే పదవి తగ్గిపోతుంది. అల్ఫ్ అంటే తండ్రి, బే అంటే రాజ్యాధికారం. మనం తిరిగి మన రాజధానిలోకి వెళ్తున్నాము. ఈ పాత ప్రపంచం సమాప్తమైపోతుంది. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఎవ్వరూ లాక్కోలేనటువంటి కొత్త విశ్వరాజ్యాన్ని తండ్రి మనకు ఇస్తున్నారు అన్న సంతోషంలో గంతులు వేయాలి.

2. విజయమాలలో మణిగా అయ్యేందుకు జీవిస్తూనే ఈ పాత ప్రపంచం నుండి మరణించాలి. తండ్రి స్మృతి ద్వారా వికర్మలు వినాశనం చేసుకోవాలి.

వరదానము:-

ఒక్కరితోనే సర్వ సంబంధాలు నిర్వర్తించే సర్వ హద్దుల నుండి ముక్తులయ్యే సంపూర్ణ ఫరిశ్తా భవ

ఏదైనా ఒక పదార్థాన్ని తయారుచేసేటప్పుడు, అది పూర్తిగా తయారైన తర్వాత అంచులను వదిలేస్తుంది, అలా సంపన్న స్థితికి ఎంతగా సమీపంగా వస్తూ ఉంటారో అంతగా సర్వుల అంచుల నుండి దూరమవుతూ ఉంటారు. ఎప్పుడైతే అన్ని బంధనాలనూ వృత్తి ద్వారా వదిలేస్తారో అనగా ఎవరిపైనా మోహము ఉండదో అప్పుడు సంపూర్ణ ఫరిశ్తాలుగా అవుతారు. ఒక్కరితోనే సర్వ సంబంధాలు నిర్వర్తించడమే గమ్యము, దీని ద్వారానే అంతిమ ఫరిశ్తా జీవితమనే గమ్యము సమీపంగా అనుభవమవుతుంది. బుద్ధి భ్రమించడం సమాప్తమవుతుంది.

స్లోగన్:-

స్నేహము ఎటువంటి అయస్కాంతమంటే అది నిందించేవారిని కూడా సమీపంగా తీసుకువస్తుంది.