23-06-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైనపిల్లలూ - మిమ్మల్ని జ్ఞానము ద్వారా సుగంధభరితమైన పుష్పాలుగా తయారుచేసేందుకు తండ్రి వచ్చారు, మీరు ముళ్ళలా అవ్వకూడదు, ఈ సభలోకి ముళ్ళను తీసుకురాకూడదు"

ప్రశ్న:-

స్మృతియాత్రలో శ్రమ చేసే పిల్లల గుర్తులేమిటి?

జవాబు:-

స్మృతి విషయంలో శ్రమ చేసే పిల్లలు చాలా సంతోషంగా ఉంటారు. ఇప్పుడు మనం తిరిగి వెళ్తున్నాము, మళ్ళీ మనం సుగంధభరితమైన పుష్పాల తోటలోకి వెళ్ళాలి అని వారి బుద్ధిలో ఉంటుంది. మీరు స్మృతియాత్ర ద్వారా సుగంధభరితంగా అవుతారు మరియు ఇతరులను కూడా తయారుచేస్తారు.

ఓంశాంతి. తోట యజమాని కూడా కూర్చున్నారు, తోటమాలి కూడా ఉన్నారు, పుష్పాలు కూడా ఉన్నాయి. ఇది కొత్త విషయం కదా. ఎవరైనా కొత్తవారు వింటే వీరేమంటున్నారు అని అడుగుతారు. తోట యజమాని, పుష్పాలు ఇదంతా ఏమిటి? ఇటువంటి విషయాలను శాస్త్రాలలో కూడా ఎప్పుడూ వినలేదే అని అంటారు. తోటయజమానిని మరియు నావికుడిని స్మృతి కూడా చేస్తారని, పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు ఇక్కడ నుండి తీరానికి దాటించేందుకు, ఇక్కడికి వచ్చారు. స్మృతి యాత్రలో ఉండాలని తండ్రి చెప్తున్నారు. నేనెంత దూరము వెళ్తున్నాను అని మిమ్మల్ని మీరే పరిశీలించుకోండి. మీ సతోప్రధాన స్థితికి ఎంతవరకు చేరుకున్నారో పరిశీలించుకోండి. ఎంతగా సతోప్రధాన స్థితి తయారవుతూ ఉంటుందో, అంతగా మేము ఇప్పుడు తిరిగి వెళ్తున్నామని అర్థము చేసుకుంటారు. మనం ఎంతవరకు చేరుకున్నామో చూసుకోవాలి, ఆధారమంతా స్మృతియాత్రపైనే ఉంది. సంతోషము కూడా ఉంటుంది. ఎవరు ఎంతగా శ్రమ చేస్తారో అంతగా వారిలో సంతోషం పెరుగుతుంది. పరీక్షల రోజుల్లో తాము ఎంత వరకు పాస్ అవుతారో విద్యార్థులకు తెలుస్తుంది కదా. ఇక్కడ కూడా అంతే, మేమెంత వరకు సుగంధభరితమైన పుష్పాలుగా అయ్యాము, ఎంతవరకు ఇతరులను సుగంధభరితంగా చేస్తున్నాము అని పిల్లలు ప్రతి ఒక్కరికీ తెలుసు. ముళ్ళ అడవి అని గాయనం కూడా ఉంది. అది పుష్పాల తోట. ముస్లింలు కూడా గార్డన్ ఆఫ్ అల్లా అని అంటారు. అక్కడ ఒక తోట ఉందని, అక్కడకు వెళ్ళిన వారికి ఖుదా పుష్పాలనిస్తారని భావిస్తారు. అనగా మనసులోని కోరికలను తీరుస్తారని భావిస్తారు. అంతేకాని అక్కడ పుష్పాన్ని తీసి ఇస్తారని కాదు, ఎవరి బుద్ధిలో ఎలా ఉంటుందో అలా సాక్షాత్కారమౌతుంది. ఇక్కడ సాక్షాత్కారాల గురించి ఏమీ లేదు. భక్తిమార్గములోనైతే సాక్షాత్కారాల కోసం శిరస్సును కూడా ఖండించుకుంటారు. మీరా కు సాక్షాత్కారము కలిగింది కావున వారికెంత గౌరవముంది. అది భక్తిమార్గము. భక్తి అర్థకల్పము నడవాల్సిందే. అస్సలు జ్ఞానము అనేదే లేదు. వేదాలు మొదలైనవాటికి చాలా గౌరవముంది. వేదాలు మా ప్రాణం అని అంటారు. కాని ఈ వేద-శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తిమార్గములోనివని ఇప్పుడు మీకు తెలుసు. భక్తి విస్తారము ఎంత ఎక్కువగా ఉంది. అది పెద్ద వృక్షము. జ్ఞానము బీజము. జ్ఞానము ద్వారా మీరిప్పుడు ఎంతో శుద్ధంగా అవుతున్నారు. సుగంధభరితంగా అవుతున్నారు. ఇది మీ తోట. ఇక్కడ ఎవ్వరూ వికారాలలోకి వెళ్ళరు కనుక ఇక్కడ ఎవ్వరినీ ముళ్ళు అని అనరు. కనుక ఈ తోటలో ముళ్ళు ఒక్కరు కూడా లేరని అంటారు. ముళ్ళు కలియుగములో ఉన్నాయి. ఇప్పుడిది పురుషోత్తమ సంగమయుగము. ఇందులో ముళ్ళు ఎక్కడ నుండి వచ్చాయి. ఒకవేళ ముళ్ళు ఎవరైనా కూర్చుని ఉంటే, వారు తమను తామే నష్టపరుచుకుంటారు ఎందుకంటే ఇది ఇంద్రప్రస్థము కదా. ఇందులో జ్ఞాన దేవదూతలు కూర్చుని ఉన్నారు. జ్ఞాన నాట్యము చేసే దేవదూతలు. అతి ముఖ్యమైనవారి పేర్లు పుష్యరాగము, ఇంద్రనీలము మొదలైనవి ఉన్నాయి. వారే తర్వాత నవరత్నాలని గాయనము చేయబడ్డారు. కాని వారు ఎవరో, ఎవ్వరికీ తెలియదు. తండ్రి కేవలం నన్ను స్మృతి చేయండి అని చెప్తున్నారు. పిల్లలైన మీ బుద్ధిలో ఇప్పుడు వివేకముంది, 84 జన్మల చక్రము కూడా ఇప్పుడు బుద్ధిలో ఉంది. శాస్త్రాలలో అయితే 84 లక్షలని అనేశారు. మీరు 84 జన్మలు తీసుకున్నారని మధురాతి-మధురమైన చాలా కాలం తర్వాత కలిసిన పిల్లలకు తండ్రి అర్థం చేయించారు. ఇప్పుడు తమోప్రధానం నుండి సతోప్రధానంగా అవ్వాలి. ఎంత సహజము. పిల్లల కోసం భగవానువాచ, నన్ను ఒక్కరినే స్మృతి చేయండి. ఇప్పుడు పిల్లలైన మీరు సుగంధభరితమైన పుష్పాలుగా అయ్యేందుకు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. ముళ్ళుగా అవ్వకండి. ఇక్కడ అందరూ మధురాతి-మధురమైన పుష్పాలే. ముళ్ళు లేరు. అయినా మాయా తుఫానులు వస్తాయి. మాయ ఎంత కఠినమైనదంటే వెంటనే చిక్కుకునేలా చేస్తుంది. మేము ఇలా చేశామేమిటి, మా సంపాదనంతా సమాప్తమైపోయిందని తర్వాత పశ్చాత్తాపపడతారు.

ఇది పుష్పాల తోట. తోటలో మంచి-మంచి పుష్పాలు కూడా ఉంటాయి. ఈ తోటలో కూడా కొందరు ఫస్ట్ క్లాస్ పుష్పాలుగా అవుతూ ఉంటారు. ఉదాహరణకు మొఘల్ గార్డెన్ లో మంచి-మంచి పుష్పాలుంటాయి. వాటిని చూసేందుకు అందరూ వెళ్తారు. ఇక్కడ మీ వద్దకు చూసేందుకైతే ఎవ్వరూ రారు. మీరు ముళ్ళకు మీ ముఖాన్నేమి చూపిస్తారు. మురికిపట్టిన వస్త్రాలను శుభ్రపరిచారు అని గాయనం కూడా ఉంది..... బాబాకు జప సాహెబ్, సుఖమణి మొదలైనవన్నీ గుర్తుండేవి. అఖండ పఠనము కూడా చేసేవారు, 8 సంవత్సరాలున్నప్పుడే సిక్కుల తలపాగాను ధరించేవారు, మందిరములోనే ఉండేవారు. మందిరము బాధ్యతంతా నా పైనే ఉండేది. మురికి పట్టిన వస్త్రాలను శుభ్రము చేయడం అంటే అర్థమేమిటో, ఇప్పుడు తెలిసింది. మహిమ అంతా బాబాదే. ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి కూర్చుని అర్థము చేయిస్తున్నారు. మంచి-మంచి పుష్పాలను తీసుకురండి అని పిల్లలతో కూడా చెప్తారు. ఎవరైతే మంచి-మంచి పుష్పాలను తీసుకొస్తారో వారు మంచి పుష్పాలుగా భావించబడతారు. మేము శ్రీలక్ష్మీ-నారాయణులుగా అవుతామని అందరూ అంటారు అంటే గులాబి పుష్పాలైనట్లే కదా. అచ్ఛా, మరి పిల్లలైన మీ నోటిలో గులాబ్ జామ్ అని తండ్రి అంటారు. ఇప్పుడిక పురుషార్థము చేసి సదా గులాబీలుగా అవ్వండి. చాలా మంది పిల్లలున్నారు. ప్రజలైతే ఎంతో మంది తయారవుతున్నారు. అక్కడ ఉండేది కేవలం రాజా, రాణి మరియు ప్రజలు. సత్యయుగములో రాజుకే శక్తి ఉంటుంది కనుక మంత్రులే ఉండరు. మంత్రులు మొదలైనవారి నుండి సలహా తీసుకునే అవసరమే ఉండదు. లేకపోతే సలహానిచ్చేవారు పెద్దవారైపోతారు. అక్కడ భగవాన్-భగవతీలకు సలహా తీసుకొనే అవసరముండదు, ఎప్పుడైతే పతితులుగా అవుతారో అప్పుడు మంత్రులు మొదలైన వారు ఉంటారు. ఇది భారత్ విషయమే, రాజులే రాజులకు తల వంచి నమస్కరించే ఖండము ఎక్కడా ఉండదు. ఇక్కడే జ్ఞానమార్గములో పూజ్యులుగా, అజ్ఞాన మార్గములో పూజారులుగా అవుతారని చూపిస్తారు. వారు డబల్ కిరీటధారులు, వీరు సింగిల్ కిరీటధారులు. భారత్ వంటి పవిత్రమైన ఖండము మరేదీ లేదు. ప్యారడైజ్, బహిష్త్ గా ఉండేది. మీరు దాని కొసమే చదువుతున్నారు. ఇప్పుడు మీరు పుష్పాలుగా అవ్వాలి. తోట యజమాని వచ్చారు. తోటమాలి కూడా ఉన్నారు. తోటమాలులు నంబరువారుగా ఉంటారు. ఇది తోట అని, ఇందులో ముళ్ళు లేవని, ముళ్ళు దుఃఖమునిస్తాయని పిల్లలు కూడా అర్థం చేసుకుంటారు. తండ్రైతే ఎవ్వరికీ దుఃఖమునివ్వరు. వారు దుఃఖహర్త, సుఖకర్త. ఎంత మధురమైన తండ్రి.

పిల్లలైన మీకు తండ్రి పట్ల ప్రేమ ఉంది. తండ్రి కూడా పిల్లలను ప్రేమిస్తారు కదా. ఇది చదువు. నేను మిమ్మల్ని ప్రాక్టికల్ గా చదివిస్తున్నాను, వీరు కూడా చదువుకుంటున్నారు, చదువుకుని మళ్ళీ చదివిస్తూ ఉన్నట్లయితే ఇతరులు కూడా ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతారు అని తండ్రి చెప్తున్నారు. ఇప్పుడు పిల్లలైన మీరు మహాదానులుగా అవుతారు కనుక భారత్ మహాదాని అని గాయనం చేయబడింది. మీరు అవినాశి జ్ఞానరత్నాలను దానము చేస్తారు. ఆత్మనే రూపము మరియు సుగంధము కలిగినది అని బాబా అర్థం చేయించారు. బాబా కూడా రూపము మరియు సుగంధము కలవారు. వారిలో జ్ఞానమంతా ఉంది. పరమపిత పరమాత్మ జ్ఞానసాగరుడు, వారు అథారిటీ కదా. జ్ఞానసాగరుడు ఒక్క తండ్రియే, అందుకే మొత్తం సాగరాన్ని అంతా సిరాగా మార్చినా కూడా తరగదని గాయనముంది. మరియు ఒక్క క్షణములో జీవన్ముక్తి అన్న గాయనం కూడా ఉంది. మీ వద్ద శాస్త్రాలు మొదలైనవేవీ లేవు. అక్కడ ఎవరైనా పండితులు మొదలైనవారి వద్దకు వెళ్తే, ఈ పండితుడు ఎంతో చదివి ఉన్నారు, వారు అథారిటీ అని భావిస్తారు. వారు వేదశాస్త్రాలన్నింటినీ కంఠస్థము చేసి ఉంటారు, మళ్ళీ ఆ సంస్కారాన్ని తీసుకువెళ్ళి, దానితో బాల్యము నుండే వాటిని అధ్యయనం చేస్తారు. మీరు సంస్కారాలు తీసుకువెళ్ళరు. మీరు చదువు యొక్క ఫలితాన్ని తీసుకువెళ్తారు. మీ చదువు పూర్తి అవ్వగానే ఫలితము వెలువడుతుంది మరియు ఆ పదవిని పొందుతారు. ఎవరికైనా వినిపించేందుకు జ్ఞానాన్ని తీసుకువెళ్ళరు. ఇక్కడ మీరు చదువుకుంటారు, దీని ప్రారబ్ధము కొత్త ప్రపంచములో లభిస్తుంది. మాయ కూడా తక్కువ శక్తివంతమైనదేమీ కాదు అని పిల్లలైన మీకు బాబా అర్థం చేయించారు. దుర్గతిలోకి తీసుకువెళ్ళే శక్తి మాయకు ఉంది. కానీ దానినెవ్వరూ మహిమ చెయ్యరు. అది దుఃఖమునివ్వడంలో శక్తివంతమైనది కదా. తండ్రి సుఖమునివ్వడంలో శక్తివంతులు కనుక వారికి గాయనం ఉంది. ఇది కూడా డ్రామా రచించబడి ఉంది. మీరు సుఖమూ పొందుతారు, అలాగే దుఃఖము కూడా పొందుతారు. గెలుపు మరియ ఓటములు ఎవరివి అన్నది కూడా తెలిసి ఉండాలి కదా. తండ్రి కూడా భారత్ లోనే వస్తారు, జయంతిని కూడా భారత్ లోనే జరుపుకుంటారు, శివబాబా ఎప్పుడు వస్తారో, వచ్చి ఏం చేస్తారో కూడా ఎవ్వరికీ తెలియదు. నామ-రూపాలనే మాయం చేసేశారు. బాలుడైన కృష్ణుని పేరు పెట్టేశారు. వాస్తవానికి అతి ప్రియమైన తండ్రి మహిమ వేరు, కృష్ణుని మహిమ వేరు. వారు నిరాకారుడు, వీరు సాకారులు. కృష్ణుడిని సర్వగుణ సంపన్నుడు అని మహిమ చేస్తారు..... శివబాబాను ఇలా మహిమ చేయరు, ఎవరిలోనైతే గుణాలుంటాయో వారిలో అవగుణాలు కూడా ఉంటాయి కావున తండ్రి మహిమయే వేరు. తండ్రిని అకాలమూర్తి అని అంటారు కదా. మనము కూడా అకాలమూర్తులమే. ఆత్మను మృత్యువు కబళించలేదు. అకాలమూర్తి ఆత్మకు ఇది సింహాసనము. మన బాబా కూడా అకాలమూర్తియే. మృత్యువు శరీరాన్ని మాత్రమే కబళిస్తుంది. ఇక్కడ అకాలమూర్తి అని పిలుస్తారు. సత్యయుగములో పిలవరు ఎందుకంటే అక్కడైతే సుఖమే సుఖముంటుంది, అందుకే దుఃఖములో అందరూ స్మరిస్తారు, సుఖములో ఎవ్వరూ స్మరించరు అని గానం చేస్తారు. ఇప్పుడు రావణరాజ్యంలో ఎంత దుఃఖముంది. తండ్రి స్వర్గానికి యజమానులుగా తయారుచేస్తారు, తర్వాత అర్ధకల్పము వరకు అక్కడ ఎవ్వరూ పిలవనే పిలవరు. ఎలాగైతే లౌకిక తండ్రి పిల్లలను అలంకరించి, వారికి వారసత్వమునిచ్చి, వారు స్వయం వానప్రస్థమునకు వెళ్తారో, ఇది అంతే. సర్వస్వమూ పిల్లలకిచ్చి - ఇప్పుడు మేము సత్సంగానికి వెళ్తాము, తినేందుకు ఏమైనా పంపిస్తూ ఉండండి అని చెప్తారు. ఈ బాబా అయితే అలా చెప్పరు కదా. మధురాతి-మధురమైన పిల్లలూ, నేను మీకు విశ్వరాజ్యాధికారం ఇచ్చి వానప్రస్థములోకి వెళ్ళిపోతాను అని అంటారు. తినేందుకు ఏమైనా పంపించండి అని నేను చెప్పను. తండ్రిని చూసుకోవడం లౌకిక పిల్లల బాధ్యత. లేకపోతే ఎలా తింటారు? నేను నిష్కామ సేవాధారిని అని ఈ తండ్రి అయితే చెప్తున్నారు. మనుష్యులెవ్వరూ నిష్కాములుగా ఉండలేరు. అలా ఉంటే ఆకలితో మరణిస్తారు. నేనైతే అలా ఆకలితో మరణించను, నేను అభోక్తను. పిల్లలైన మీకు విశ్వరాజ్యాన్ని ఇచ్చి నేను వెళ్ళి విశ్రాంతి తీసుకుంటాను. తర్వాత నా పాత్ర పూర్తవుతుంది. మళ్ళీ భక్తిమార్గములో ప్రారంభమవుతుంది. ఇది అనాది అయిన డ్రామాగా రచింపబడి ఉంది, ఈ రహస్యాన్ని బాబాయే కూర్చుని అర్థం చేయిస్తారు. వాస్తవానికి మీ పాత్ర అందరికంటే ఎక్కువగా ఉంటుంది కనుక ప్రతిఫలము కూడా మీకే లభించాలి. నేను విశ్రాంతి తీసుకుంటాను. కావున మీరు బ్రహ్మాండానికి కూడా యజమానులుగా, విశ్వానికి కూడా యజమానులుగా అవుతారు. మీకు గొప్ప పేరు లభిస్తుంది. ఈ డ్రామా రహస్యము కూడా మీకు తెలుసు. మీరు జ్ఞాన పుష్పాలు. ఇలా ప్రపంచములో ఒక్కరు కూడా లేరు. రాత్రి-పగలుకు ఉన్నంత వ్యత్యాసం ఉంది. వారు రాత్రిలో ఉన్నారు, మీరు పగలులోకి వెళ్తారు. ఈ రోజుల్లో మనుష్యులు వనమహోత్సవాలు ఎలా చేస్తున్నారో చూడండి, ఇప్పుడు భగవంతుడు మనుష్యుల వనమహోత్సవాన్ని జరుపుతున్నారు.

తండ్రి ఎటువంటి అద్భుతము చేస్తారో చూడండి, మనుష్యులను దేవతలుగా, పేదవారిని రాజులుగా చేస్తారు. ఇప్పుడు మీరు అనంతమైన తండ్రి నుండి ప్రాప్తిని పొందేందుకు వచ్చారు. బాబా, మమ్మల్ని పేదవారి నుండి రాజులుగా చేయండి అని అంటారు. మీరైతే చాలా మంచి కస్టమర్లు. వారిని మీరు దుఃఖహర్త, సుఖకర్త అని కూడా అంటారు. ఇటువంటి దానము ఇంకేదీ ఉండదు. వారు సుఖమునిచ్చేవారు. భక్తిమార్గములో కూడా నేనే మీకు ఇస్తాను అని తండ్రి చెప్తున్నారు. సాక్షాత్కారాలు మొదలైనవి డ్రామాలో రచించబడి ఉన్నాయి. వారు ఏమేమి చేస్తారు అన్నది ఇప్పుడు తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. మున్ముందు అర్థం చేయిస్తూ ఉంటారు. అంతిమంలో మీరు నంబరువారుగా కర్మాతీత స్థితిని పొందుతారు. ఇదంతా డ్రామాలో రచించబడి ఉంది, అయినా తండ్రిని స్మృతి చేయండి అని పురుషార్థము చేయిస్తూ ఉంటారు. తప్పకుండా ఇదే మహాభారత యుద్ధము. అందరూ సమాప్తమైపోతారు. భారతవాసులు మాత్రమే మిగులుతారు, మీరు మళ్ళీ విశ్వముపై రాజ్యం చేస్తారు. ఇప్పుడు తండ్రి మిమ్మల్ని చదివించేందుకు వచ్చారు. వారే జ్ఞానసాగరుడు. ఇది కూడా ఆటయే, ఇందులో తికమకపడే విషయమేమీ లేదు. మాయ తుఫానుల్లోకి తీసుకొస్తుంది. వాటిని చూసి భయపడకండి అని బాబా చెప్తున్నారు. చాలా అశుద్ధమైన సంకల్పాలు వస్తాయి. అవి కూడా బాబా ఒడిలోకి వచ్చినప్పుడే వస్తాయి. ఒడిని తీసుకోనంతవరకు మాయ అంతగా కొట్లాడదు. ఒడిని స్వీకరించిన తర్వాతనే తుఫానులు వస్తాయి, అందుకే ఒడిని కూడా సంభాళించుకుని తీసుకోవాలి అని తండ్రి చెప్తున్నారు. బలహీనులుగా ఉంటే మళ్ళీ ప్రజలలోకి వచ్చేస్తారు. రాజ్యపదవిని పొందడం మంచిది, లేకపోతే దాస-దాసీలుగా అవ్వవలసి వస్తుంది. ఇక్కడ సూర్యవంశీ, చంద్రవంశీ రాజధాని స్థాపన జరుగుతూ ఉంది. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. రూపము మరియు సుగంధము కలవారిగా అయి అవినాశి జ్ఞానరత్నాలను దానము చేసి మహాదానులుగా అవ్వాలి. ఏ చదువునైతే చదువుతున్నారో, దానిని ఇతరుల చేత కూడా చదివించాలి.

2. ఏ విషయములోనూ తికమకపడకూడదు, భయపడకూడదు. మిమ్మల్ని మీరు సంభాళించుకోవాలి. నేను ఎటువంటి పుష్పాన్ని, నాలో ఎటువంటి దుర్గంధమూ లేదు కదా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి.

వరదానము:-

నిరాశ అనే చితిపై కూర్చున్న ఆత్మలకు కొత్త జీవితాన్ని దానమిచ్చే త్రిమూర్తి ప్రాప్తులతో సంపన్న భవ

సంగమయుగంలో తండ్రి ద్వారా పిల్లలందరికీ సదా ఆరోగ్యంగా, సంపన్నంగా మరియు సంతోషంగా ఉండే త్రిమూర్తి వరదానం ప్రాప్తిస్తుంది. ఏ పిల్లలైతే ఈ మూడు ప్రాప్తులతో సదా సంపన్నంగా ఉంటారో, వారి భాగ్యశాలి, హర్షిత ముఖాన్ని చూసి మానవ జీవితంలో జీవించేందుకు ఉల్లాస-ఉత్సాహాలు కలుగుతాయి ఎందుకంటే ఇప్పుడు మనుష్యులు జీవించి ఉన్నా కూడా నిరాశ అనే చితిపై కూర్చుని ఉన్నారు. ఇప్పుడు ఇటువంటి ఆత్మలను మరజీవాగా తయారుచేయండి. కొత్త జీవితాన్ని దానంగా ఇవ్వండి. ఈ మూడు ప్రాప్తులు మా జన్మసిద్ధ అధికారము అని సదా స్మృతిలో ఉండాలి. మూడు ధారణలను డబల్ అండర్లైన్ చేయండి.

స్లోగన్:-

అతీతంగా మరియు అధికారులుగా అయి కర్మలోకి రావడం - ఇదే బంధనముక్త స్థితి.