11-06-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైనపిల్లలూ - ఈ రుద్ర జ్ఞాన యజ్ఞాన్ని స్వయంగా రుద్ర భగవానుడే రచించారు, ఇందులో మీరు మీదంతా స్వాహా చేయండి ఎందుకంటే ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి"

ప్రశ్న:-

సంగమయుగంలో ఏ అద్భుతమైన ఆట నడుస్తుంది?

జవాబు:-

భగవంతుడు రచించిన యజ్ఞములోనే అసురుల విఘ్నాలు కలుగుతాయి. ఈ అద్భుతమైన ఆట కూడా సంగమయుగంలోనే నడుస్తుంది. ఇటువంటి యజ్ఞం మళ్ళీ మొత్తం కల్పంలో ఎప్పుడూ రచించబడదు. ఇది స్వరాజ్యం పొందేందుకు, రాజస్వ అశ్వమేధ యజ్ఞం. ఇందులోనే విఘ్నాలు కలుగుతాయి.

ఓంశాంతి. మీరెక్కడ కూర్చున్నారు? దీనిని స్కూల్ లేక విశ్వవిద్యాలయమని కూడా అనవచ్చు. ఇది విశ్వవిద్యాలయం, దీనికి ఈశ్వరీయ శాఖలున్నాయి. బాబా అతి పెద్ద విశ్వవిద్యాలయాన్ని తెరిచారు. శాస్త్రాలలో రుద్ర యజ్ఞమనే పేరు వ్రాశారు, ఈ సమయంలో శివబాబాయే ఈ పాఠశాల లేక విశ్వవిద్యాలయాన్ని తెరిచారని పిల్లలైన మీకు తెలుసు. ఉన్నతాతి ఉన్నతమైన తండ్రి చదివిస్తున్నారు. భగవంతుడు మమ్మల్ని చదివిస్తున్నారని పిల్లల బుద్ధిలో గుర్తుండాలి. ఈ యజ్ఞం వారి ద్వారా రచింపబడింది, దీని పేరు కూడా ప్రసిద్ధమైనది. రాజస్వ అశ్వమేధ రుద్ర జ్ఞాన యజ్ఞము, రాజస్వ అనగా స్వరాజ్యం కోసం అని అర్థం. అశ్వమేధము అనగా కనిపించేదంతా స్వాహా చేస్తున్నారు, శరీరము కూడా స్వాహా అయిపోతుంది. ఆత్మ అయితే స్వాహా అవ్వదు. శరీరాలన్నీ స్వాహా అయిపోతాయి. ఆత్మలు తిరిగి వెళ్ళిపోతాయి. ఇది సంగమయుగం. చాలా ఆత్మలు తిరిగి వెళ్ళిపోతాయి, శరీరాలన్నీ సమాప్తమైపోతాయి. ఇదంతా డ్రామా, మీరు డ్రామాకు వశమై నడుస్తున్నారు. నేను రాజస్వ యజ్ఞాన్ని రచించాను అని తండ్రి చెప్తున్నారు. ఇది కూడా డ్రామా ప్లాన్ అనుసారంగా రచించబడింది. నేను యజ్ఞాన్ని రచించాను, అని చెప్పరు. డ్రామా ప్లాన్ అనుసారంగా పిల్లలైన మిమ్మల్ని చదివించేందుకు కల్పక్రితం వలె జ్ఞాన యజ్ఞం రచించబడింది. నేను రచించాను, అని అనడంలో కూడా అర్థం లేదు. డ్రామా ప్లాన్ అనుసారంగా రచించబడింది. కల్ప-కల్పమూ రచించబడుతుంది. ఇది తయారైన డ్రామా కదా. డ్రామా ప్లాన్ అనుసారంగా యజ్ఞము ఒకేసారి రచించబడుతుంది, ఇదేమీ కొత్త విషయం కాదు. దాదాపు 5 వేల సంవత్సరాల క్రితం కూడా సత్యయుగముండేది, ఇప్పుడు చక్రం మళ్ళీ పునరావృతమవుతుంది అని బుద్ధిలో కూర్చుంది. ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రపంచ స్థాపన జరుగుతుంది. మీరు కొత్త ప్రపంచంలో స్వరాజ్యాన్ని పొందేందుకు చదువుతున్నారు. తప్పకుండా పవిత్రంగా కూడా అవ్వాలి. డ్రామా అనుసారంగా ఎవరైతే కల్పక్రితం (పవిత్రంగా) అయ్యారో వారే ఇప్పుడు కూడా అవుతారు. సాక్షిగా అయి డ్రామాను చూడవలసి ఉంటుంది, అలగే మళ్ళీ పురుషార్థం కూడా చేయవలసి ఉంటుంది. పిల్లలకు మార్గం కూడా చూపించాలి, ముఖ్యమైన విషయం పవిత్రతకు సంబంధించినది. మీరు వచ్చి పవిత్రంగా తయారుచేసి మమ్మల్ని ఈ ఛీ-ఛీ ప్రపంచం నుండి తీసుకువెళ్ళండి అని తండ్రినే పిలుస్తారు. ఇంటికి తీసుకువెళ్ళేందుకే బాబా వచ్చి ఉన్నారు. పిల్లలకైతే ఎన్నో పాయింట్లు ఇవ్వడం జరిగింది. అయినా ముఖ్యమైన విషయం తండ్రి చెప్తున్నారు - మన్మనాభవ. పావనంగా అయ్యేందుకు తండ్రిని స్మృతి చేస్తారు, ఇది మర్చిపోకూడదు. ఎంత స్మృతి చేస్తారో, అంత లాభముంటుంది, చార్టు పెట్టుకోవాలి. లేకపోతే మళ్ళీ అంతిమంలో ఫెయిలైపోతారు. మనమే సతోప్రధానంగా ఉండేవారమని పిల్లలకు తెలుసు, నంబరువారు పురుషార్థానుసారంగా ఎవరైతే ఉన్నతంగా అవుతారో, వారు శ్రమ కూడా ఎక్కువగా చేయవలసి వస్తుంది. స్మృతిలో ఉండాలి. ఇంకా కొద్ది సమయమే ఉంది, తర్వాత సుఖమయమైన రోజులు రానున్నాయని అర్థం చేసుకున్నారు. మన అపారమైన సుఖమయమైన రోజులు తప్పకుండా రానున్నాయి. తండ్రి ఒక్కసారి మాత్రమే వస్తారు, దుఃఖధామాన్ని సమాప్తం చేసి మన సుఖధామానికి తీసుకువెళ్తారు. ఇప్పుడు మనం ఈశ్వరీయ పరివారంలో ఉన్నాము, తర్వాత దైవీ పరివారంలోకి వెళ్తామని పిల్లలైన మీకు తెలుసు. పురుషోత్తములుగా, ఉన్నతంగా అయ్యే యుగమని - ఈ సంగమ సమయానికే గాయనముంది. మనల్ని అనంతమైన తండ్రి చదివిస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు. మున్ముందు సన్యాసులు కూడా అంగీకరిస్తారు. ఆ సమయం కూడా వస్తుంది కదా. ఇప్పుడే మీ ప్రభావం అంతగా వ్యాపించదు. ఇప్పుడు రాజధాని స్థాపన జరుగుతుంది, ఇంకా సమయముంది. అంతిమంలో ఈ సన్యాసులు మొదలైనవారు కూడా వచ్చి సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో అర్థం చేసుకుంటారు. ఈ జ్ఞానం ఎవ్వరిలోనూ లేదు. పవిత్రత విషయంలో ఎన్నో విఘ్నాలు వస్తాయని పిల్లలకు కూడా తెలుసు. అబలలపై అత్యాచారాలు జరుగుతాయి. ద్రౌపది పిలిచింది కదా. వాస్తవానికి మీరందరూ ద్రౌపదులు, సీతలు, పార్వతులు. స్మృతిలో ఉండడం ద్వారా అబలలు, కుబ్జలు కూడా తండ్రి నుండి వారసత్వాన్ని పొందుతారు. స్మృతిలోనైతే ఉండగలరు కదా. భగవంతుడు వచ్చి యజ్ఞాన్ని రచించారు, అందులో అనేక విఘ్నాలు కలుగుతూ ఉంటాయి. ఇప్పుడు కూడా విఘ్నాలు కలుగుతూ ఉంటాయి. కన్యలకు బలవంతంగా వివాహాలు చేయిస్తారు, లేకపోతే కొట్టి బయటకు పంపించేస్తారు కనుక ఓ పతిత-పావనా రండి అని పిలుస్తారు, మరి వారు వచ్చి పావనంగా తయారుచేసేందుకు తప్పకుండా రథం కావాలి కదా. గంగా జలం ద్వారా పావనంగా అవ్వరు. తండ్రియే వచ్చి పావనంగా తయారుచేసి పావన ప్రపంచానికి యజమానులుగా చేస్తారు.

ఈ పతిత ప్రపంచ వినాశనం సమీపంలో నిలిచి ఉండడం మీరు చూస్తారు. మరి మనం తండ్రికి చెందినవారిగా ఎందుకు అవ్వకూడదు? స్వాహా ఎందుకు అవ్వకూడదు. ఎలా స్వాహా అవ్వాలి, ఎలా బదిలీ చేసుకోవాలి, అని అడుగుతారు. తండ్రి చెప్తున్నారు - పిల్లలూ, మీరు ఈ సాకార బాబాను చూస్తున్నారు కదా. వీరు స్వయంగా చేస్తూ నేర్పిస్తున్నారు. నేను ఎటువంటి కర్మలను చేస్తానో, నన్ను చూసి ఇతరులు చేస్తారు. తండ్రి వీరి ద్వారా కర్మలు చేయించారు కదా. యజ్ఞంలో పూర్తిగా స్వాహా చేశారు. స్వాహా అవ్వడంలో ఏ కష్టమూ ఉండదు. వీరు చాలా షావుకారూ కాదు, చాలా పేదవారూ కాదు. సాధారణమైనవారు. యజ్ఞం రచించబడింది కనుక అందులో అన్నపానాదుల సామాగ్రి అంతా కావాలి కదా. ఇది ఈశ్వరీయ యజ్ఞం. ఈశ్వరుడే వచ్చి ఈ జ్ఞాన యజ్ఞాన్ని స్థాపించారు. మిమ్మల్నిచదివిస్తున్నారు, ఈ యజ్ఞానికి చాలా ఎక్కువ మహిమ ఉంది. ఈశ్వరీయ యజ్ఞం నుండే మీ శరీర నిర్వహణ జరుగుతుంది. ఎవరైతే స్వయాన్ని అర్పితము అని భావిస్తారో, వారు, మేము ట్రస్టీలము, ఇదంతా ఈశ్వరునిదే, మేము శివబాబా యజ్ఞం నుండి భోజనం తింటున్నాము అని భావిస్తారు. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం కదా. అందరూ వచ్చి ఇక్కడ కూర్చునేదైతే లేదు కదా. వీరు ఏ విధంగా సర్వస్వాన్ని స్వాహా చేశారో - వీరి ఉదాహరణనైతే చూశారు. వీరు ఎటువంటి కర్మలు చేస్తారో, వీరిని చూసి ఇతరులకు కూడా అలా చేయడం వచ్చింది, ఎంతోమంది స్వాహా అయ్యారు అని తండ్రి అంటారు. ఎవరెవరైతే స్వాహా అయ్యారో, వారు తమ వారసత్వాన్ని తీసుకుంటారు. ఆత్మలైతే వెళ్ళిపోతాయి, శరీరాలన్నీ సమాప్తమైపోతాయి అని బుద్ధి ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఇది అనంతమైన యజ్ఞం, ఇందులో అందరూ స్వాహా అవుతారు. ఏ విధంగా బుద్ధి ద్వారా స్వాహా అయి నష్టోమోహులుగా అవ్వాలో, పిల్లలైన మీకు అర్థం చేయించబడుతుంది. ఈ సామాగ్రి అంతా బూడిదగా అవ్వనున్నదని కూడా మీకు తెలుసు. ఎంత పెద్ద యజ్ఞం, అక్కడ మళ్ళీ ఎటువంటి యజ్ఞమూ రచించబడదు. ఏ ఉపద్రవాలు సంభవించవు. భక్తిమార్గంలో ఏవైతే అనేక యజ్ఞాలున్నాయో, అవన్నీ సమాప్తమైపోతాయి. జ్ఞానసాగరుడు ఒక్క భగవంతుడే. వారే మనుష్య సృష్టికి బీజరూపుడు, సత్యమైనవారు, చైతన్యమైనవారు. శరీరమైతే జడము, ఆత్మనే చైతన్యము. వారు జ్ఞానసాగరులు, పిల్లలైన మిమ్మల్ని జ్ఞానసాగరుడు కూర్చుని చదివిస్తున్నారు. వారు కేవలం పాడుతూ ఉంటారు మరియు మీకు తండ్రి మొత్తం జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. జ్ఞానం ఎక్కువేమీ లేదు. కేవలం ప్రపంచ చక్రం ఎలా తిరుగుతుందో అర్థం చేయించవలసి ఉంటుంది.

స్వయంగా తండ్రి ఇక్కడ మిమ్మల్ని చదివిస్తున్నారు. సాధారణ తనువులో ప్రవేశిస్తానని కూడా చెప్తున్నారు. భగీరథడు కూడా ఎంతో ప్రసిద్ధమైనవారు, తండ్రి తప్పకుండా మానవునిలోకే వస్తారు కదా. వారికి ఒక్క శివ అన్న పేరే ఉంటుంది, మిగిలిన వారందరి పేర్లు మారుతాయి, వీరి పేరు మారదు. కాని భక్తిలో అనేక పేర్లు పెట్టేశారు. ఇక్కడైతే శివబాబాయే ఉన్నారు. శివుడిని కళ్యాణకారి అని అంటారు. భగవంతుడే వచ్చి కొత్త ప్రపంచమైన స్వర్గాన్ని స్థాపన చేస్తారు. కనుక వారు కళ్యాణకారియే కదా. భారత్ లో స్వర్గముండేదని మీకు తెలుసు. ఇప్పుడు ఇది నరకము, మళ్ళీ తప్పకుండా స్వర్గంగా అవుతుంది. దీనిని పురుషోత్తమ సంగమయుగమని అంటారు. తండ్రి నావికునిగా అయి మిమ్మల్ని ఈ తీరం నుండి ఆ తీరానికి తీసుకువెళ్తారు. ఇది దుఃఖమయమైన పాత ప్రపంచము, మళ్ళీ తప్పకుండా డ్రామానుసారంగా కొత్త ప్రపంచం వస్తుంది, దాని కోసమే ఇప్పుడు మీరు పురుషార్థం చేస్తున్నారు. బాబా స్మృతిని క్షణ-క్షణమూ మర్చిపోతారు, ఇందులోనే శ్రమ ఉంది కానీ మీ ద్వారా ఏ వికర్మలైతే జరిగాయో, వాటి శిక్షను కర్మభోగం రూపంలో అనుభవించాల్సిందే. కర్మభోగాన్ని చివరి వరకు అనుభవించాల్సిందే, అందులో క్షమాపణ లభించదు. బాబా, క్షమించండి అని అడగడము కాదు. అలా (క్షమాపణ) ఉండనే ఉండదు. అంతా డ్రామానుసారంగానే జరుగుతుంది. క్షమించడం మొదలైనవి ఉండవు. లెక్కాచారాలు సమాప్తం చేసుకునే తీరాలి. తమోప్రధానం నుండి సతోప్రధానంగా అవ్వాలి, దీని కోసం శ్రీమతం కూడా లభిస్తుంది, శ్రీ శ్రీ అయిన శివబాబా శ్రీమతం ద్వారా మీరు శ్రీ గా అవుతున్నారు. ఉన్నతాతి ఉన్నతమైన తండ్రి మిమ్మల్ని ఉన్నతంగా తయారుచేస్తారు. ఇప్పుడు మీరు అలా అవుతున్నారు, బాబా కల్ప-కల్పము వచ్చి మమ్మల్ని చదివిస్తున్నారనే స్మృతి ఇప్పుడు మీకు కలిగింది. అర్థకల్పం దాని ప్రారబ్ధం లభిస్తుంది. సృష్టిచక్రం ఎలా తిరుగుతుందనే జ్ఞానం అవసరముండదు. కల్ప-కల్పము ఒక్కసారి మాత్రమే తండ్రి వచ్చి ఈ సృష్టిచక్రం ఎలా తిరుగుతుందో తెలియజేస్తారు.

చదువుకోవడం మరియు పవిత్రంగా అవ్వడం మీ కర్తవ్యం. యోగంలో ఉండాలి. తండ్రికి చెందినవారిగా అయ్యి, పవిత్రంగా అవ్వకపోతే వందరెట్లు శిక్ష పడుతుంది. పేరు కూడా అప్రతిష్టపాలు అవుతుంది. సద్గురువుని నిందకులు ఉన్నత స్థానాన్ని పొందలేరని గానము కూడా చేస్తారు. వారు ఎవరు అన్నది మనుష్యులకు తెలియదు. సత్యమైన తండ్రియే సద్గురువు, సత్యమైన శిక్షకునిగా అవుతారు కదా. వారు మిమ్మల్ని చదివిస్తున్నారు, సత్యమైన సద్గురువు కూడా వారే. ఎలాగైతే తండ్రి జ్ఞానసాగరులో, మీరు కూడా జ్ఞానసాగరులే కదా. తండ్రి మొత్తం జ్ఞానంమంతటినీ ఇచ్చేశారు, కల్పక్రితం ఎవరు ఎంత ధారణ చేశారో, అంతే చేస్తారు. పురుషార్థం చేయాలి. కర్మలు చేయకుండా అయితే ఎవ్వరూ ఉండలేరు. హఠయోగం మొదలైనవి ఎన్ని చేసినా, అవన్నీ కర్మలే కదా. జీవనోపాధి కోసం, ఇది కూడా ఒక వ్యాపారమే. పేరు లభిస్తుంది. చాలా ధనం లభిస్తుంది, నీటిపై, అగ్నిపై నడిచి వెళ్తారు. కేవలం గాలిలో ఎగరలేరు. దానికైతే పెట్రోలు మొదలైనవి కావాలి కదా. కాని దీని వలన లాభమేమీ ఉండదు. పావనంగా అయితే అవ్వరు. సైన్స్ వారి రేస్ కూడా జరుగుతుంది. వారిది సైన్స్ రేస్ మరియు మీది సైలెన్స్ రేస్. అందరూ శాంతినే కోరుకుంటారు. శాంతి మీ స్వధర్మము, స్వయాన్ని ఆత్మగా భావించండి, ఇప్పుడిక మీ ఇల్లు అయిన శాంతిధామానికి వెళ్ళాలి అని తండ్రి చెప్తున్నారు. ఇది దుఃఖధామము. మనం శాంతిధామం నుండి మళ్ళీ సుఖధామానికి వస్తాము. ఈ దుఃఖధామం సమాప్తమవ్వనున్నది. ఇది బాగా ధారణ చేసి మళ్ళీ ఇతరులచేత కూడా ధారణ చేయించాలి. ఇక కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి, ఆ చదువు చదువుకొని మళ్ళీ శరీర నిర్వహణార్థము కష్టపడవలసి వస్తుంది. మేము ఏ చదువును చదవుకోవాలనే నిర్ణయం భాగ్యశాలి పిల్లలు వెంటనే తీసుకుంటారు. ఆ చదువు ద్వారా ఏం లభిస్తుంది మరియు ఈ చదువు ద్వారా ఏం లభిస్తుంది. ఈ చదువు ద్వారానైతే 21 జన్మల ప్రారబ్ధం తయారవుతుంది. కనుక నేను ఏ చదువును చదవుకోవాలి అని ఆలోచించాలి. ఎవరైతే అనంతమైన తండ్రి నుండి వారసత్వం పొందవలసి ఉంటుందో, వారు అనంతమైన చదువులో నిమగ్నమైపోతారు. కాని డ్రామా ప్లాన్ అనుసారంగా ఎవరి భాగ్యములోనైనా లేకపోతే, మళ్ళీ ఆ చదువును పట్టుకుంటారు, ఈ చదువును చదవరు. తీరిక దొరకడం లేదని చెప్తారు. ఏ జ్ఞానం మంచిది అని బాబా అడుగుతారు. దాని ద్వారా ఏం లభిస్తుంది మరియు దీని ద్వారా ఏం లభిస్తుంది అని బాబా ప్రశ్నిస్తారు. బాబా, భౌతిక విద్య ద్వారా ఏం లభిస్తుంది, ఏదో కొద్దిగా సంపాదించగలము, ఇక్కడైతే భగవంతుడు చదివిస్తున్నారు, మేమైతే చదువుకొని రాజ్యపదవిని పొందాలి అని అంటారు. మరి అలాంటప్పుడు ఏ విషయంపై ఎక్కువ ధ్యానముంచాలి. బాబా, ఆ కోర్సు పూర్తి చేసిన తర్వాత వస్తామని కొందరైతే చెప్తారు. వీరి భాగ్యంలో లేదని బాబాకు అర్థమవుతుంది. ఏమి జరుగనున్నదో మున్ముందు చూడాలి. శరీరంపై ఎటువంటి నమ్మకము లేదని అర్థం చేసుకుంటారు, మరి సత్యమైన సంపాదనలో నిమగ్నమవ్వాలి కదా. ఎవరి భాగ్యములోనైతే ఉంటుందో, వారే తమ భాగ్యాన్ని జాగృతము చేసుకుంటారు. పూర్తి ప్రయత్నం చేయాలి, మేమైతే బాబా నుండి వారసత్వాన్ని తీసుకునే తీరుతాము. అనంతమైన తండ్రి మనకు రాజ్యాన్నిస్తుంటే ఈ ఒక్క అంతిమ జన్మ మనం ఎందుకు పవిత్రంగా అవ్వము. ఇంతమంది పిల్లలు పవిత్రంగా ఉంటారు. అసత్యం చెప్పరు. అందరూ పురుషార్థం చేస్తున్నారు. చదువుతున్నారు, అయినా నమ్మరు. పాత ప్రపంచాన్ని కొత్తదిగా చేయవలసి వచ్చినప్పుడే అనంతమైన తండ్రి వస్తారు. పాత ప్రపంచ వినాశనం ఎదురుగా నిలిచి ఉంది. ఇది చాలా స్పష్టంగా ఉంది. సమయం కూడా అదే, అనేక ధర్మాలు కూడా ఉన్నాయి, సత్యయుగంలో ఒకే ధర్మముంటుంది. ఇది కూడా మీ బుద్ధిలో ఉంది. మీలో కూడా నిశ్చయం కలవారు ఇంకా కొంతమందే ఉన్నారు. అరే, నిశ్చయం ఉంచడంలో సమయం పడుతుందా? శరీరంపై కూడా నమ్మకం లేదు, కొద్దిగా కూడా అవకాశాన్ని పోగొట్టుకోకూడదు. ఎవరి భాగ్యములోనైనా లేకపోతే, బుద్ధిలోకి కొద్దిగా కూడా రాదు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. సత్యమైన సంపాదన చేసుకొని 21 జన్మలకు తమ భాగ్యాన్ని తయారుచేసుకోవాలి. శరీరంపై ఎటువంటి నమ్మకమూ లేదు కనుక కొద్దిగా కూడా అవకాశాన్ని పొగొట్టుకోకూడదు.

2. నష్టోమోహులుగా అయ్యి తమదంతా రుద్ర యజ్ఞంలో స్వాహా చేయాలి. స్వయాన్ని అర్పణ చేసుకుని ట్రస్టీలుగా అయ్యి సంభాళించాలి. సాకార తండ్రిని అనుసరించాలి.

వరదానము:-

నిందించే వారికి కూడా గుణమాలను ధరింపజేసే ఇష్టదేవ, మహాన్ ఆత్మా భవ

ఎలాగైతే ఈ రోజుల్లో విశేష ఆత్మలైన మీకు స్వాగతం పలికే సమయంలో, ఎవరైనా మీ మెడలో స్థూలమైన మాలను వేస్తే, అప్పుడు మీరు వెంటనే దానిని వేసినవారి మెడలోనే రిటర్న్ వేస్తారు, అలాగే నిందించేవారికి కూడా మీరు గుణమాలను ధరింపజేస్తే వారు స్వతహాగానే మీకు గుణమాలను రిటర్న్ వేస్తారు. ఎందుకంటే నిందించేవారికి గుణమాలను ధరింపజేయడమనగా జన్మ-జన్మలకు భక్తులుగా నిశ్చితం చేసుకోవడమే. ఇలా ఇవ్వడమే అనేకసార్లు తీసుకోవడంగా అవుతుంది. ఈ విశేషతయే ఇష్టదేవ, మహాన్ ఆత్మగా తయారుచేస్తుంది.

స్లోగన్:-

తమ మనసా వృత్తిని సదా మంచిగా, శక్తిశాలిగా తయారుచేసుకున్నట్లయితే చెడు కూడా మంచిగా అయిపోతుంది.