18-06-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైన పిల్లలూ - తండ్రి మీకు కొత్త ప్రపంచము కోసం రాజయోగము నేర్పిస్తున్నారు, కావున ఈ పాత ప్రపంచ వినాశనం కూడా తప్పకుండా జరగాలి"

ప్రశ్న:-

మనుష్యులకు ఏ ఒక్క మంచి అలవాటు ఉంటుంది, అయినా ఆ అలవాటు ద్వారా కూడా ప్రాప్తి ఏమీ కలగదు?

జవాబు:-

మనుష్యులకు భగవంతుడిని స్మృతి చేయడం అలవాటుగా అయిపోయింది, ఏదైనా విషయము జరిగితే - ఓ భగవంతుడా! అని అంటారు. అప్పుడు వారి ఎదురుగా శివలింగము వచ్చేస్తుంది కాని యథార్థమైన పరిచయము లేని కారణంగా ప్రాప్తి ఉండదు, అంతేకాక సుఖ-దుఃఖాలన్ని వారే ఇస్తారని అంటారు. పిల్లలైన మీరిప్పుడు అలా అనరు.

ఓంశాంతి. తండ్రిని రచయిత అని అంటారు, వారు దేనికి రచయిత? కొత్త ప్రపంచానికి రచయిత. కొత్త ప్రపంచాన్ని స్వర్గము లేక సుఖధామమని అంటారు, అలా అంటారు కాని అర్థము చేసుకోరు. కృష్ణ మందిరాన్ని కూడా సుఖధామమని అంటారు. అది చిన్న మందిరము. కృష్ణుడైతే విశ్వానికి యజమానిగా ఉండేవారు. అనంతమైన యజమానిని హద్దు యజమానిగా చేసేస్తారు. కృష్ణుని చిన్న మందిరాన్ని సుఖధామమని అంటారు. వారు విశ్వానికి యజమానిగా ఉండేవారు అన్నది బుద్ధిలోకి రాదు. భారత్ లోనే ఉండేవారు. మీకు కూడా ఇంతకుముందు ఏమీ తెలిసేది కాదు. తండ్రికైతే అన్నీ తెలుసు, వారికి సృష్టి ఆది-మధ్య-అంతాలను గురించి తెలుసు. ఇప్పుడు పిల్లలైన మీరు బ్రహ్మా-విష్ణు-శంకరులు ఎవరు అన్నది తెలుసుకున్నారు, ఇది కూడా ప్రపంచములో ఎవ్వరికీ తెలియదు. శివుడైతే ఉన్నతాతి ఉన్నతమైన భగవంతుడు. అచ్ఛా, మరి ప్రజాపిత బ్రహ్మా ఎక్కడ నుండి వచ్చారు? వారు కూడా మానవుడే కదా. ప్రజాపిత బ్రహ్మా అయితే ఇక్కడే ఉండాలి కదా ఎందుకంటే వారి నుండి బ్రాహ్మణులు ఉత్పన్నమవుతారు. ప్రజాపిత అంటేనే ముఖము ద్వారా దత్తత తీసుకునేవారు, మీరు ముఖవంశావళి. ఏ విధంగా తండ్రి బ్రహ్మాను తనవారిగా చేసుకొని ముఖవంశావళిని తయారుచేశారో ఇప్పుడు మీకు తెలుసు. వీరిలోకి ప్రవేశించారు. ఆ తర్వాత, వీరు నా పుత్రుడు అని కూడా అన్నారు. బ్రహ్మాకు ఆ పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసు. వారు ఎలా జన్మించారు అన్నది ఇతరులెవ్వరికీ తెలియదు. పరమపిత పరమాత్మ ఉన్నతాతి ఉన్నతమైనవారని కేవలం మహిమను పాడుతారు కాని వారు ఉన్నతాతి ఉన్నతమైన తండ్రి అని ఎవరి బుద్ధిలోకి రాదు. ఆత్మలైన మనందరికి వారు తండ్రి. వారు కూడా బిందురూపులు, వారిలో సృష్టి ఆది-మధ్య-అంతాల జ్ఞానముంది. ఈ జ్ఞానము కూడా మీకు ఇప్పుడే లభించింది. ఇంతకుముందు ఈ జ్ఞానము కొద్దిగా కూడా లేదు. మనుష్యులు కేవలం బ్రహ్మా-విష్ణువు-శంకరులు అని అంటూ ఉంటారు, కాని వారికి ఏమాత్రమూ తెలియదు. కనుక వారికే అర్థము చేయించాలి. ఇప్పుడు మీరు వివేకవంతులుగా అయ్యారు. తండ్రి జ్ఞానసాగరులని, వారు మనకు జ్ఞానము వినిపిస్తున్నారని, చదివిస్తున్నారని తెలుసుకున్నారు. సత్యయుగ కొత్త ప్రపంచము కోసమే ఈ రాజయోగముంది కనుక తప్పనిసరిగా పాత ప్రపంచము వినాశనము అవ్వాలి. అందుకే ఈ మహాభారత యుద్ధము జరుగుతుంది. అర్థకల్పము నుండి మీరు భక్తిమార్గములోని శాస్త్రాలను చదువుతూ వచ్చారు. ఇప్పుడైతే డైరెక్ట్ తండ్రి నుండే వింటున్నారు. తండ్రి కూర్చుని శాస్త్రాలేవీ వినిపించరు. జపతపాలు చేయడం, శాస్త్రాలు మొదలైనవి చదవడం, ఇదంతా భక్తి. ఇప్పుడు భక్తులకు భక్తికి ఫలము కావాలి ఎందుకంటే భగవంతుడిని కలుసుకునేందుకే శ్రమిస్తారు. కాని జ్ఞానము ద్వారానే సద్గతి కలుగుతుంది. జ్ఞానము మరియు భక్తి రెండూ ఒకసారే నడవవు. ఇప్పుడున్నదే భక్తి రాజ్యము. అందరూ భక్తులు. ప్రతి ఒక్కరి నోటి నుండి ఓ గాడ్ ఫాదర్ అని తప్పకుండా వెలువడుతుంది. నేను చిన్న బిందువును అని తండ్రి తమ పరిచయాన్నిచ్చారని పిల్లలైన మీకిప్పుడు తెలుసు. నన్నే జ్ఞానసాగరుడని అంటారు. బిందువునైన నాలో మొత్తం జ్ఞానం నిండి ఉంది. ఆత్మలోనే జ్ఞానము ఉంటుంది. వారిని పరమపిత పరమాత్మ అని అంటారని పిల్లలైన మీకిప్పుడు తెలుసు. వారు సుప్రీమ్ సోల్ అంటే అందరికన్నా ఉన్నతాతి ఉన్నతమైన పతిత-పావనుడైన తండ్రియే సుప్రీమ్ కదా. మనుష్యులు ఓ భగవంతుడా అని అన్నప్పుడు శివలింగమే గుర్తొస్తుంది. అది కూడా యథార్థ రీతిలో కాదు. భగవంతుడిని స్మృతి చేయడమనేది ఒక అలవాటుగా ఏర్పడిపోయింది. భగవంతుడే సుఖ-దుఃఖాలు ఇస్తారని అంటారు. ఇప్పుడు పిల్లలైన మీరు అలా అనరు. తండ్రి సుఖదాత అని మీకు తెలుసు. సత్యయుగంలో సుఖధామముండేది. అక్కడ దుఃఖము యొక్క పేరే ఉండదు. కలియుగంలో ఉండేదే దుఃఖము, ఇక్కడ సుఖము యొక్క పేరే లేదు. ఉన్నతాతి ఉన్నతమైనవారు భగవంతుడు, వారు సర్వాత్మలకు తండ్రి. ఆత్మలకు తండ్రి కూడా వారేనని ఎవ్వరికీ తెలియదు, మనమందరమూ సోదరులము అని కూడా అంటారు. మరి తప్పకుండా అందరూ ఒక్క తండ్రి పిల్లలే కదా. అయినా కొందరు వారు సర్వవ్యాపి అని అంటారు - నీలోనూ ఉన్నారు, నాలోనూ ఉన్నారు..... అని అంటారు. అరే, నీవైతే ఒక ఆత్మ, ఇది నీ శరీరము, మరి మూడవది ఎలా ఉండగలదు! ఆత్మను పరమాత్మ అని అనరు. జీవాత్మ అని అంటారు. జీవపరమాత్మ అని అనరు. మరి పరమాత్మ సర్వవ్యాపి ఎలా అవుతారు! తండ్రి సర్వవ్యాపి అయినట్లయితే మరి అందరూ తండ్రులే అవుతారు, తండ్రికి తండ్రి నుండి వారసత్వం లభించదు. తండ్రి నుండి కొడుకులే వారసత్వము తీసుకుంటారు. అందరూ తండ్రులు ఎలా అవుతారు. ఇంత చిన్న విషయము కూడా ఎవ్వరికీ అర్థము కాదు. అందుకే తండ్రి చెప్తున్నారు - పిల్లలూ, నేను నేటికి 5 వేల సంవత్సరాల క్రితము మిమ్మల్ని చాలా వివేకవంతులుగా చేశాను, మీరు సదా ఆరోగ్యవంతులుగా, ఐశ్వర్యవంతులుగా, వివేకవంతులుగా ఉండేవారు. ఇంతకంటే ఎక్కువ వివేకవంతులు ఎవ్వరూ ఉండరు. ఇప్పుడు మీకు ఏదైతే వివేకము లభిస్తుందో అది మళ్ళీ అక్కడ ఉండదు. మళ్ళీ మనము పడిపోతామని అక్కడ తెలియదు. ఇది తెలిసినట్లయితే మరి సుఖం యొక్క అనుభూతినే ఉండదు. ఈ జ్ఞానము మళ్ళీ ప్రాయః లోపమైపోతుంది. ఈ డ్రామా జ్ఞానము కేవలం ఇప్పుడు మీ బుద్ధిలో మాత్రమే ఉంది. బ్రాహ్మణులే అధికారులుగా ఉంటారు. ఇప్పుడు మనము బ్రాహ్మణ వర్ణానికి చెందినవారమని మీ బుద్ధిలో ఉంది. తండ్రి బ్రాహ్మణులకే జ్ఞానాన్ని వినిపిస్తారు. బ్రాహ్మణులు మళ్ళీ అందరికీ వినిపిస్తారు. భగవంతుడే వచ్చి స్వర్గ స్థాపన చేసారు, రాజయోగాన్ని నేర్పించారని గాయనము కూడా ఉంది. చూడండి, కృష్ణ జయంతిని జరుపుకుంటారు, కృష్ణుడు వైకుంఠానికి యజమానిగా ఉండేవారని భావిస్తారు, కాని వారు విశ్వానికి యజమానిగా ఉండేవారు అన్నది బుద్ధిలోకి రాదు. వారి రాజ్యమున్నప్పుడైతే ఇతర ధర్మమేదీ లేదు. మొత్తం విశ్వములో వారి రాజ్యమే ఉండేది మరియు అది యమునా నది తీరములో ఉండేది. ఇప్పుడు మీకు ఎవరు అర్థం చేయిస్తున్నారు? భగవానువాచ. మిగిలిన వారెవ్వరైనా వేద-శాస్త్రాలు మొదలైనవి వినిపిస్తారు, అవి భక్తి మార్గానికి సంబంధించినవి. ఇక్కడైతే స్వయం భగవంతుడు మీకు వినిపిస్తున్నారు. ఇప్పుడు మనము పురుషోత్తములుగా అవుతున్నామని మీకు తెలుసు. మనం శాంతిధామములో ఉండేవారిమని, ఆ తర్వాత మనం వచ్చి 21 జన్మల ప్రారబ్ధమును అనుభవిస్తామని మీ బుద్ధిలో మాత్రమే ఉంది.

పిల్లలైన మీరు లోలోపల ఆనందముతో పులకరించిపోవాలి ఎందుకంటే అనంతమైన తండ్రి అయిన శివబాబా మనల్ని చదివిస్తున్నారు, వారు జ్ఞానసాగరుడు, వారికి సృష్టి ఆది-మధ్య-అంతాల గురించి తెలుసు. ఇటువంటి బాబా మన కోసమే వచ్చారంటే సంతోషముతో పులకరించిపోవాలి. బాబా, మేము మిమ్మల్ని మా వారసునిగా చేసుకున్నామని బాబాతో అంటారు. తండ్రి పిల్లలపై బలిహారం అవుతారు. భగవంతుడా, మీరు వచ్చినప్పుడు మేము మీపై బలిహారం అవుతాము అనగా పుత్రునిగా చేసుకుంటాము అని పిల్లలు అంటారు. వీరు కూడా తమ పిల్లలనే వారసులుగా చేస్తారు. బాబాను వారసునిగా ఎలా చేసుకోవాలి, ఇది కూడా గుహ్యమైన విషయమే. తమ సర్వస్వాన్ని బదిలీ చేసుకోవాలి, ఇది బుద్ధితో చేయవలసిన పని. పేదవారైతే వెంటనే బదిలీ చేసుకుంటారు, షావుకారులు కష్టము మీద చేస్తారు. ఎంతవరకైతే జ్ఞానము పూర్తిగా తీసుకోరో అంతవరకు అంత ధైర్యము ఉండదు. పేదవారైతే వెంటనే - బాబా, మేమైతే మిమ్మల్నే వారసులుగా చేసుకుంటాము అని చెప్తారు. మా వద్ద ఏముంది. వారసునిగా చేసుకుని మళ్ళీ తమ శరీర నిర్వహణ కూడా చేసుకోవాలి. కేవలం ట్రస్టీలుగా భావించి ఉండాలి. యుక్తులైతే చాలా తెలియజేస్తూ ఉంటారు. ఎటువంటి పాపకర్మలలోనూ ధనము వ్యర్థము చేసుకోవడం లేదు కదా అని తండ్రి గమనిస్తూ ఉంటారు. మనుష్యులను పుణ్యాత్మలుగా చేయడంలోనే ధనాన్ని వినియోగిస్తున్నారా? సేవను కూడా విధిపూర్వకంగా చేస్తున్నారా అన్నది పూర్తిగా పరిశీలించిన తర్వాతనే అన్ని సలహాలు ఇస్తారు. వీరు కూడా వ్యాపారములో ఈశ్వరార్థము భాగము తీస్తూ ఉండేవారు కదా! అదైతే పరోక్షంగా ఉండేది. ఇప్పుడు తండ్రి డైరెక్టుగా వచ్చారు. మనం చేస్తున్నదానికి ఫలితము ఈశ్వరుడు మరుసటి జన్మలో ఇస్తారని మనుష్యులు భావిస్తారు. ఎవరైనా పేదవారిగా, దుఃఖితులుగా ఉంటే, వారు చేసిన కర్మలే అలా ఉన్నాయని భావిస్తారు. మంచి కర్మలు చేసినట్లయితే సుఖంగా ఉంటారు. తండ్రి పిల్లలైన మీకు కర్మల గతి గురించి అర్థము చేయిస్తున్నారు, రావణ రాజ్యములో మీ కర్మలన్నీ వికర్మలే అవుతాయి. సత్యయుగం మరియు త్రేతా యుగాలలో రావణుడే ఉండడు కనుక అక్కడ ఏ కర్మలూ వికర్మలుగా అవ్వవు. ఇక్కడ చేసే మంచి కర్మలకు అల్పకాలిక సుఖము లభిస్తుంది. అయినా కూడా ఏదో ఒక అనారోగ్యము, గొడవ ఉంటూనే ఉంటుంది ఎందుకంటే ఇది అల్పకాలికమైన సుఖము. ఈ రావణ రాజ్యమే సమాప్తమవ్వనున్నదని ఇప్పుడు తండ్రి చెప్తున్నారు. శివబాబా రామరాజ్య స్థాపన చేస్తున్నారు.

ఈ చక్రము ఎలా తిరుగుతుందో మీకు తెలుసు. భారత్ మళ్ళీ నిరుపేదగా అయిపోతుంది. నేటికి 5 వేల సంవత్సరాల క్రితము భారత్ స్వర్గంగా ఉండేది, ఈ లక్ష్మీ-నారాయణుల రాజ్యముండేది. మొదట వీరి రాజ్యమే నడిచింది. కృష్ణుడు రాజకుమారుడు, మళ్ళీ స్వయంవరం అయిన తర్వాత రాజుగా అయ్యాడు. నారాయణుడనే పేరు లభించింది. ఇది కూడా ఇప్పుడు మీరు అర్థము చేసుకున్నారు కనుక మీకు ఆశ్చర్యమనిపిస్తుంది. బాబా, మీరు మొత్తం రచయిత మరియు రచనల జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. మీరు మమ్మల్ని ఎంత ఉన్నతంగా చదివిస్తున్నారు. మేము బలిహారం అవుతాము, మేము ఒక్క తండ్రిని తప్ప ఇతరులెవ్వరినీ స్మృతి చేయకూడదు అని అంటారు. అంతిమం వరకు చదువుకోవాలి కనుక టీచరును తప్పకుండా స్మృతి చేయాలి. స్కూలులో టీచరును గుర్తు చేసుకుంటారు కదా. ఆ స్కూలులో అయితే చాలామంది టీచర్లుంటారు. ప్రతి ఒక్క తరగతిలో వేర్వేరు టీచర్లుంటారు, ఇక్కడైతే ఒకే టీచరు ఉన్నారు. ఎంత ప్రియమైనవారు. తండ్రి ప్రియమైనవారు, టీచరూ ప్రియమైనవారు..... ఇంతకుముందు భక్తిమార్గములో అంధశ్రద్ధతో స్మృతి చేసేవారు. ఇప్పుడైతే డైరెక్టు తండ్రి చదివిస్తున్నారు కనుక ఎంత సంతోషం ఉండాలి, అయినా కూడా బాబా, మేము మర్చిపోతున్నామని అంటారు. మా బుద్ధి మిమ్మల్ని ఎందుకు స్మృతి చేయడం లేదో తెలియడం లేదని అంటారు. ఈశ్వరుని గతి - మతి అతీతమైనదని పాడుతారు కూడా. బాబా, మీ గతి మరియు సద్గతుల మతమైతే చాలా అద్భుతమైనది. ఇటువంటి తండ్రిని స్మృతి చేయాలి. స్త్రీ తన పతి గుణగానం చేస్తుంటుంది కదా. చాలా మంచివారు, ఇదంతా వారి ఆస్తి అని లోలోపల సంతోషం ఉంటుంది కదా. వీరైతే పతులకే పతి, తండ్రులకే తండ్రి, వీరి నుండి మనకు ఎంత సుఖము లభిస్తుంది. మిగిలిన వారి నుండైతే దుఃఖమే లభిస్తుంది. అవును, టీచరు నుండి సుఖము లభిస్తుంది ఎందుకంటే చదువు ద్వారా సంపాదన జరుగుతుంది. ఎల్లప్పుడూ వానప్రస్థములోనే గురువును ఆశ్రయిస్తారు. నేను వానప్రస్థములోనే వచ్చాను అని తండ్రి కూడా చెప్తున్నారు. వీరు కూడా వానప్రస్థీయే, నేను కూడా వానప్రస్థీనే. నా ఈ పిల్లలందరూ కూడా వానప్రస్థులే. తండ్రి, టీచరు, గురువు ముగ్గురూ కలిసే ఉన్నారు. తండ్రి, టీచరుగా కూడా అవుతారు, ఆ తర్వాత గురువుగా అయ్యి తమతోపాటు తీసుకువెళ్తారు కూడా. మహిమంతా ఆ ఒక్క తండ్రిదే, ఈ విషయాలు ఇంకే శాస్త్రాలు మొదలైనవాటిలో ఉండవు. బాబా ప్రతి విషయాన్ని మంచి రీతిగా అర్థము చేయిస్తున్నారు. దీనిని మించిన ఉన్నతమైన జ్ఞానమేదీ లేదు, ఇంకేదీ తెలుసుకోవలసిన అవసరము లేదు. మనమంతా తెలుసుకొని విశ్వానికి యజమానులుగా అవుతాము, ఇంకేమి కావాలి. పిల్లల బుద్ధిలో ఇది ఉన్నప్పుడే సంతోషంలో మరియు అదే స్మృతిలో ఉంటారు. పుణ్యాత్మలుగా అయ్యేందుకు తప్పకుండా స్మృతిలో ఉండాలి. మీ యోగాన్ని తెంచడం మాయ ధర్మము. యోగములోనే మాయ విఘ్నాలు కలిగిస్తుంది. మర్చిపోతారు. మాయా తుఫానులు చాలా వస్తాయి. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. అందరికంటే ముందు వీరున్నారు, కనుక వీరికి అన్నీ అనుభవమౌతాయి. నా దగ్గరకు వచ్చినప్పుడే అందరికీ అర్థము చేయిస్తాను కదా. ఈ మాయా తుఫానులన్నీ వస్తాయి. బాబా వద్దకు కూడా వస్తాయి. మీకు కూడా వస్తాయి. మాయ తుఫానులే రాకుండా, యోగము సదా జోడించబడే ఉన్నట్లయితే కర్మాతీత అవస్థ ఏర్పడిపోతుంది. అప్పుడు మనము ఇక్కడ ఉండము. కర్మాతీత అవస్థ ఏర్పడినట్లయితే ఇక అందరూ వెళ్ళిపోతారు. శివుని ఊరేగింపు అని గాయనం చేయబడింది కదా. శివబాబా వచ్చినప్పుడే ఆత్మలైన మనమందరము వెళ్తాము. మనందరినీ తీసుకువెళ్ళేందుకే శివబాబా వస్తారు. సత్యయుగములో ఇంతమంది ఆత్మలుండరు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. శివబాబాను తమ వారసునిగా చేసుకొని తమదంతా ఎక్స్ ఛేంజ్ చేసుకోవాలి. వారసునిగా చేసుకొని శరీర నిర్వాహణ కూడా చేసుకోవాలి, ట్రస్టీగా భావిస్తూ ఉండాలి. ఏ పాప కర్మలలోనూ ధనాన్ని వినియోగించకూడదు.

2. స్వయంగా జ్ఞానసాగరుడైన తండ్రి మమ్మల్ని చదివిస్తున్నారని లోలోపల సంతోషంతో పులకరించిపోవాలి. పుణ్యాత్మలుగా అయ్యేందుకు స్మృతిలో ఉండాలి, మాయా తుఫానులకు భయపడకూడదు.

వరదానము:-

ఆత్మికత యొక్క స్థితి ద్వారా వ్యర్థ విషయాల స్టాక్ ను సమాప్తం చేసే సంతోషపు ఖజనాలతో సంపన్న భవ

ఆత్మికత యొక్క స్థితి ద్వారా వ్యర్థ విషయాల స్టాకును సమాప్తం చేయండి, లేకపోతే పరస్పరం ఒకరి అవగుణాలను ఒకరు వర్ణన చేసుకుంటూ వ్యాధి యొక్క క్రిములను వాయుమండలంలో వ్యాపింపజేస్తూ ఉంటారు, దీని వలన వాతావరణం శక్తిశాలిగా అవ్వదు. మీ వద్దకు అనేక భావాలతో అనేకమంది ఆత్మలు వస్తారు కాని మీ దగ్గర నుండి శుభభావన కలిగించే విషయాలనే తీసుకువెళ్ళాలి. మీ వద్ద సంతోషము కలిగించే విషయాల స్టాక్ ఉన్నప్పుడే ఇది జరుగుతుంది. ఒకవేళ మనసులో ఎవరి పట్ల అయినా వ్యర్థ విషయాలు ఉన్నట్లయితే, విషయాలు ఉన్నచోట తండ్రి ఉండరు, పాపముంటుంది.

స్లోగన్:-

స్మృతి అనే స్విచ్ ఆన్ అయి ఉంటే మూడ్ ఆఫ్ అవ్వదు.