12-06-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైనపిల్లలూ - ఇప్పుడు మీరు ఈశ్వరీయ సంతానంగా అయ్యారు, మీలో ఎటువంటి ఆసురీ గుణము ఉండకూడదు. మీ ఉన్నతిని మీరే చేసుకోవాలి, పొరపాటు చేయకూడదు"

ప్రశ్న:-

సంగమయుగ బ్రాహ్మణ పిల్లలైన మీకు ఏ నిశ్చయం మరియు నషా ఉంటుంది?

జవాబు:-

ఇప్పుడు మేము ఈశ్వరీయ సాంప్రదాయానికి చెందినవారము. మేము స్వర్గవాసులుగా, విశ్వాధిపతులుగా అవుతున్నాము. సంగమయుగంలో మేము ట్రాన్స్ఫర్ అవుతున్నాము. ఆసురీ సంతానము నుండి ఈశ్వరీయ సంతానంగా అయ్యి 21 జన్మలకు స్వర్గవాసులుగా అవుతాము అన్న నిశ్చయం మరియు నషా పిల్లలైన మనకు ఉంది. ఇంతకన్నా గొప్ప విషయము ఇంకేదీ ఉండదు.

ఓంశాంతి. ఇప్పుడు తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - ఎక్కువగా మనుష్యులు శాంతిని ఇష్టపడతారు. ఒకవేళ ఇంట్లో పిల్లల గొడవలు ఉంటే అశాంతి ఉంటుంది. అశాంతి ద్వారా దుఃఖం అనుభవమవుతుంది. శాంతి ద్వారా సుఖం అనుభవమవుతుంది. ఇక్కడ పిల్లలైన మీరు కూర్చొని ఉన్నారు, మీకు సత్యమైన శాంతి ఉంది. తండ్రిని స్మృతి చేయండి, స్వయాన్ని ఆత్మ అని భావించండి అని మీకు చెప్పబడింది. శాంతిసాగరులైన తండ్రిని స్మృతి చేయడం ద్వారా ఆత్మలో ఉన్న అర్ధకల్పపు అశాంతి తొలగిపోతుంది. మీకు శాంతి వారసత్వము లభిస్తుంది. శాంతి ప్రపంచము మరియు అశాంతి ప్రపంచము పూర్తిగా వేరని మీకు తెలుసు. ఆసురీ ప్రపంచము, ఈశ్వరీయ ప్రపంచము, సత్యయుగము, కలియుగము అని వేటినంటారో మనుష్యమాత్రులెవ్వరికీ తెలియదు. ఎంత హెూదాలో ఉన్నవారమైనా, మాకు కూడా ఇంతకుముందు తెలియదని మీరు చెప్తారు. ధనవంతులను హెూదా కలిగినవారని అంటారు. పేదవారో, ధనవంతులో అర్థం చేసుకోగలరు కదా! అలాగే తప్పకుండా ఈశ్వరీయ సంతానము, ఆసురీ సంతానము గురించి కూడా మీరు అర్థం చేసుకోగలరు. మనం ఈశ్వరీయ సంతానమని మధురమైన పిల్లలైన మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. ఈ నిశ్చయము పక్కాగా ఉంది కదా! మేము ఈశ్వరీయ సాంప్రదాయులము, స్వర్గవాసులుగా, విశ్వాధికారులుగా అవుతున్నామని బ్రాహ్మణులైన మీరు అర్థం చేసుకున్నారు. ప్రతి క్షణము ఆ సంతోషం ఉండాలి. యథార్థంగా అర్థం చేసుకునేవారు చాలా కొద్దిమందే ఉన్నారు. సత్యయుగంలో ఈశ్వరీయ సాంప్రదాయము వారు ఉంటారు. కలియుగంలో ఆసురీ సంప్రదాయము వారు ఉంటారు. పురుషోత్తమ సంగమయుగంలో ఆసురీ సంప్రదాయము పరివర్తన అవుతుంది. ఇప్పుడు మనం శివబాబా సంతానంగా అయ్యాము. మధ్యలో మర్చిపోయాము. మళ్ళీ ఇప్పుడు ఈ సమయంలో మనం శివబాబా సంతానమని తెలుసుకున్నాము. సత్యయుగంలో స్వయాన్ని ఈశ్వరీయ సంతానమని ఎవ్వరూ చెప్పుకోరు. అక్కడ దైవీ సంతానముంటుంది. ఇంతకుముందు మనం ఆసురీ సంతానంగా ఉండేవారము. ఇప్పుడు ఈశ్వరీయ సంతానంగా అయ్యాము. బ్రాహ్మణులమైన మనము బి.కె.లము. రచన అంతా ఒక్క తండ్రిదే. మీరంతా సోదరీ-సోదరులు మరియు ఈశ్వరీయ సంతానము. బాబా ద్వారా రాజ్యం లభిస్తూ ఉందని, భవిష్యత్తులో మనం దైవీ స్వరాజ్యాన్ని పొందుతామని, సుఖంగా ఉంటామని మీకు తెలుసు. సత్యయుగము సుఖధామము, కలియుగము దుఃఖధామము. ఇది కేవలం సంగమయుగ బ్రాహ్మణులైన మీకు మాత్రమే తెలుసు. ఆత్మనే ఈశ్వరీయ సంతానము. బాబా స్వర్గాన్ని స్థాపన చేస్తున్నారని కూడా మీకు తెలుసు. వారు రచయిత కదా! నరక రచయిత అయితే కాదు కదా. అలాగైతే వారిని ఎవరు స్మృతి చేస్తారు? తండ్రి స్వర్గస్థాపన చేస్తున్నారని మధురాతి మధురమైన పిల్లలైన మీకు తెలుసు. వారు మన అతి మధురమైన తండ్రి. మనల్ని 21 జన్మలకు స్వర్గవాసులుగా చేస్తున్నారు. దీనికన్నా గొప్ప వస్తువు ఇంకేదీ ఉండదు. ఈ వివేకాన్ని ఉంచుకోవాలి. మనం ఈశ్వరీయ సంతానము కనుక మనలో ఎటువంటి ఆసురీ అవగుణాలు ఉండకూడదు. స్వఉన్నతిని చేసుకోవాలి. సమయం చాలా తక్కువగా ఉంది, ఇందులో పొరపాటు చేయకూడదు, మర్చిపోకండి. తండ్రి మన సమ్ముఖంలో కూర్చొని ఉండడం చూస్తున్నారు. మనం వారి సంతానము. మనం దైవీ సంతానంగా అయ్యేందుకు ఈశ్వరుడైన తండ్రి వద్ద చదువుకుంటున్నాము. కనుక ఎంత సంతోషముండాలి! కేవలం నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయని బాబా చెప్తున్నారు. తండ్రి అందరినీ తీసుకు వెళ్ళేందుకే వచ్చారు. ఎంతెంతగా స్మృతి చేస్తారో అంతంతగా వికర్మలు వినాశనమవుతాయి. అజ్ఞాన కాలంలో కన్యకు నిశ్చితార్థమైనప్పుడు వరుని స్మృతి తనలో ముద్రించుకుపోతుంది. అలాగే కొడుకు పుట్టగానే ఆ స్మృతి ముద్రించుకుపోతుంది. ఈ స్మృతి స్వర్గంలో కూడా ముద్రించుకుపోతుంది, నరకంలో కూడా ముద్రించుకుపోతుంది. వీరే మా తండ్రి అని కొడుకు చెప్తాడు. ఇప్పుడు వీరు మన అనంతమైన తండ్రి. వీరి ద్వారా స్వర్గ వారసత్వం లభిస్తుందంటే వారి స్మృతి ముద్రించుకుపోవాలి. తండ్రి ద్వారా మనం భవిష్య 21 జన్మల కోసం మళ్ళీ వారసత్వాన్ని తీసుకుంటున్నాము. బుద్ధిలో వారసత్వమే గుర్తుంటుంది.

అందరూ మరణించవలసిందే అని కూడా మీకు తెలుసు. ఒక్కరు కూడా ఉండేందుకు వీలు లేదు. ఎంత ప్రియాతి ప్రియమైనవారైనా, అందరూ వెళ్ళిపోతారని కూడా మీకు తెలుసు. ఈ పాత ప్రపంచం ఇప్పుడు అంతమైపోనున్నది అని కేవలం బ్రాహ్మణులైన మీకు మాత్రమే తెలుసు. అది సమాప్తమయ్యే ముందే పూర్తి పురుషార్థం చేయాలి. ఈశ్వరీయ సంతానమైనందుకు అపారమైన సంతోషముండాలి. పిల్లలూ, మీ జీవితాన్ని వజ్రతుల్యంగా తయారుచేసుకోండి అని తండ్రి చెప్తుంటారు. అది దైవీ ప్రపంచము, ఇది ఆసురీ ప్రపంచము. సత్యయుగంలో ఎంతటి అపారమైన సుఖముంటుంది! అది తండ్రియే ఇస్తారు. ఇక్కడ మీరు తండ్రి వద్దకు వచ్చారు. ఇక్కడే కూర్చుండిపోరు కదా. అందరూ ఇక్కడే ఉండిపోయేది కూడా లేదు ఎందుకంటే పిల్లలు అనంతముగా ఉన్నారు. ఇక్కడకు మీరు చాలా ఉత్సాహంతో వస్తారు. మేము అనంతమైన తండ్రి వద్దకు వెళ్తున్నాము, మేము ఈశ్వరీయ సంతానము, గాడ్ ఫాదర్ సంతానము, మరి మేము స్వర్గములో ఎందుకు ఉండము అని భావిస్తారు. గాడ్ ఫాదర్ అయితే స్వర్గాన్నే రచిస్తారు కదా! ఇప్పుడు మీ బుద్ధిలో మొత్తం ప్రపంచ చరిత్ర-భూగోళాలున్నాయి. హెవెన్లీ గాడ్ ఫాదర్ మనల్ని స్వర్గానికి యోగ్యులుగా చేస్తున్నారని తెలుసు. కల్పకల్పము తర్వాత తయారుచేస్తారు. మేము పాత్రధారులమని తెలిసిన మనుష్యమాత్రులు ఒక్కరు కూడా లేరు. గాడ్ ఫాదర్ సంతానమైన మనము ఎందుకు దుఃఖితులుగా ఉన్నాము! పరస్పరంలో ఎందుకు కొట్లాడుకుంటున్నాము! ఆత్మలమైన మనమంతా సోదరులము కదా! సోదరులు పరస్పరములో ఎలా కొట్లాడుకుంటారు? కొట్లాడుకొని సమాప్తమైపోతారు. ఇక్కడ మనం తండ్రి నుండి వారసత్వం తీసుకుంటున్నాము. సోదరులు పరస్పరంలో ఎప్పుడూ ఉప్పునీరుగా అవ్వకూడదు. ఇక్కడ తండ్రితో కూడా ఉప్పునీరుగా అవుతారు. మంచి మంచి పిల్లలు ఉప్పునీరుగా అయిపోతారు. మాయ ఎంత శక్తివంతమైనది! మంచి మంచి పిల్లలు ఎవరైతే ఉంటారో, వారు తండ్రికి గుర్తుకు వస్తారు కదా. పిల్లలపై తండ్రికి ఎంత ప్రేమ ఉంది! తండ్రికి స్మృతి చేసేందుకు పిల్లలు తప్ప ఇంకెవ్వరూ లేరు. మీకైతే చాలామంది ఉన్నారు. మీ బుద్ధి అటు-ఇటు వెళ్తుంది. వ్యాపారము మొదలైనవాటి వైపు కూడా బుద్ధి వెళ్తుంది. నాకు వ్యాపారము మొదలైనవేవీ లేవు. అనేకమంది పిల్లలైన మీకు అనేక వ్యాపారాలున్నాయి. నాకైతే ఒకటే వ్యాపారము. నేను వచ్చిందే పిల్లలను స్వర్గానికి వారసులుగా చేసేందుకు. అనంతమైన తండ్రికి ఆస్తి, కేవలం పిల్లలైన మీరే. గాడ్ ఫాదర్ కదా! ఆత్మలందరూ వారి ఆస్తియే. మాయ ఛీ-ఛీగా చేసేసింది. ఇప్పుడు తండ్రి పుష్పాలుగా తయారుచేస్తారు. తండ్రి అంటారు - నాకున్నది మీరు మాత్రమే, నాకు మీపై మోహము కూడా ఉంది. ఉత్తరం వ్రాయకపోతే చింత కూడా కలుగుతుంది. మంచి-మంచి పిల్లల నుండి కూడా ఉత్తరాలు రావు. మంచి-మంచి పిల్లలను మాయ ఒక్కసారిగా సమాప్తం చేసేస్తుంది. తప్పకుండా దేహాభిమానము ఉంటుంది. మీ క్షేమ సమాచారాలు వ్రాస్తూ ఉండండి అని తండ్రి చెప్తూ ఉంటారు. తండ్రి పిల్లలను అడుగుతారు - పిల్లలూ! మాయ మిమ్ములను కలవర పెట్టదు కదా. సాహసవంతులుగా అయి మాయపై విజయం పొందుతున్నారు కదా! మీరు యుద్ధ మైదానంలో ఉన్నారు కదా! ఏ మాత్రమూ చంచలత్వం లేని విధంగా కర్మేంద్రియాలను వశం చేసుకోవాలి. సత్యయుగంలో కర్మేంద్రియాలన్నీ వశంలో ఉంటాయి. కర్మేంద్రియాల చంచలత్వం ఉండదు. నోటి యొక్క, చేతుల యొక్క, చెవుల యొక్క..... ఎలాంటి చంచలత్వం యొక్క మాటే ఉండదు. అక్కడ ఎటువంటి అశుద్ధమైన వస్తువూ ఉండదు. ఇక్కడ యోగబలం ద్వారా కర్మేంద్రియాలపై విజయాన్ని పొందుతారు. తండ్రి చెప్తారు - అక్కడ అశుద్ధమైన విషయాలేవీ ఉండవు. ఇక్కడ కర్మేంద్రియాలను వశపరచుకోవాలి. పురుషార్థము బాగా చేయాలి. సమయం చాలా తక్కువగా ఉంది. ఎంతో గడిచిపోయింది, ఇంకా కొద్దిగా మాత్రమే మిగిలి ఉంది (బహుత్ గయీ, థోడీ రహీ....) అని గాయనము కూడా ఉంది. ఇప్పుడు కొద్దిగా మాత్రమే మిగిలి ఉంది. కొత్త ఇల్లు తయారవుతున్నప్పుడు బుద్ధిలో ఇక కొద్ది సమయము మాత్రమే ఉంది, ఇప్పుడిది తయారైపోతుంది, ఇక కొద్ది పని మాత్రమే మిగిలి ఉందని ఉంటుంది కదా. అది హద్దులోని విషయము, ఇది అనంతమైన విషయము. వారిది సైన్స్ బలమైతే మీది సైలెన్స్ బలము అని కూడా పిల్లలకు అర్థం చేయించబడింది. వారిది కూడా బుద్ధి బలమే. మీది కూడా బుద్ధి బలమే. సైన్స్ లో చాలా పరిశోధనలు చేస్తున్నారు. ఇప్పుడు ఎటువంటి బాంబులను తయారుచేస్తున్నారంటే, వాటిని ఎక్కడో కూర్చొని వదిలితే మొత్తం నగరమంతా సమాప్తమైపోతుంది. ఆ తర్వాత ఈ సైన్యాలు, విమానాలు మొదలైనవి కూడా ఉపయోగపడవు. కనుక అది సైన్స్ బుద్ధి. మీది సైలెన్స్ బుద్ధి. వారు వినాశనం కోసం నిమిత్తంగా ఉన్నారు. మీరు అవినాశి పదవిని పొందేందుకు నిమిత్తమైనవారు. ఇది అర్థం చేసుకునే బుద్ధి కూడా కావాలి కదా!

తండ్రి చాలా సహజమైన మార్గాన్ని తెలియజేస్తున్నారని పిల్లలైన మీరు అర్థం చేసుకోగలరు. ఎటువంటి అహల్యలైనా, కుబ్జలైనా కేవలం రెండు పదాలను గుర్తుంచుకోవాలి - తండ్రి మరియు వారిచ్చే వారసత్వము. ఆపై ఎవరు ఎంత స్మృతి చేస్తారో, అంత పొందుతారు. ఇతర సాంగత్యాలను వదిలి ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. తండ్రి చెప్తారు - నేను మన ఇల్లు అయిన పరంధామంలో ఉన్నప్పుడు, భక్తి మార్గంలో మీరు - "బాబా, మీరు వచ్చినట్లయితే మేము మా సర్వస్వాన్ని అర్పణ చేస్తాము అని నన్ను పిలిచేవారు". వీరు శ్మశాన పురోహితుని వంటివారు. శ్మశాన పురోహితునికి పాత సామానులు ఇవ్వడం జరుగుతుంది. మీరు తండ్రికి ఏమిస్తారు? ఇతనికైతే (బ్రహ్మాకు) ఇవ్వరు కదా! ఇతను కూడా తన సర్వస్వాన్ని ఇచ్చేశారు. ఇతను కూర్చొని మహళ్ళనైతే నిర్మించుకోరు కదా. ఇదంతా శివబాబా కోసమే. వారి డైరెక్షన్ అనుసారంగా చేస్తున్నారు. వారు చేసేవారు, చేయించేవారు. డైరెక్షన్ ఇస్తూ ఉంటారు. బాబా, మాకు మీరు ఒక్కరే, మీకైతే చాలామంది పిల్లలున్నారు అని పిల్లలు అంటారు. బాబా అంటారు - నాకు కేవలం పిల్లలైన మీరే, మీకైతే చాలామంది ఉన్నారు, ఎంతోమంది దేహ సంబంధీకుల స్మృతి ఉంటుంది. మధురాతి మధురమైన పిల్లలకు తండ్రి చెప్తున్నారు - సాధ్యమైనంత ఎక్కువగా తండ్రిని స్మృతి చేయండి మరియు మిగిలిన వారందరినీ మర్చిపోతూ ఉండండి. స్వర్గ రాజ్యమనే వెన్న మీకు లభిస్తుంది. ఈ ఆట రచన ఎలా ఉందో కొద్దిగా ఆలోచించండి. మీరు కేవలం తండ్రిని స్మృతి చేస్తారు మరియు స్వదర్శన చక్రధారులుగా అవ్వడం ద్వారా చక్రవర్తీ రాజులుగా అవుతారు. ఇప్పుడు పిల్లలైన మీరు ప్రాక్టికల్ గా అనుభవజ్ఞులుగా అయ్యారు. మనుష్యులు భక్తి పరంపరగా కొనసాగుతూ వస్తుందని భావిస్తారు, వికారాలు కూడా పరంపరగా కొనసాగుతున్నాయని భావిస్తారు. ఈ లక్ష్మీనారాయణులకు, రాధాకృష్ణులకు కూడా సంతానముండేవారు కదా అని అంటారు. అరే! పిల్లలు ఎందుకుండరు? అయితే వారిని సంపూర్ణ నిర్వికారులని అంటారు. ఇక్కడుండేవారు సంపూర్ణ వికారులు. ఒకరినొకరు నిందించుకుంటూ ఉంటారు. ఇప్పుడు పిల్లలైన మీకు శ్రీ శ్రీ అయిన తండ్రి నుండి శ్రీమతము లభిస్తుంది. మిమ్మల్ని శ్రేష్ఠంగా తయారుచేస్తారు. ఒకవేళ తండ్రి చెప్పినట్లు వినకపోతే శ్రేష్ఠంగా తయారవ్వరు. ఇక మీరు ఒప్పుకోండి, ఒప్పుకోకపోండి, మీ ఇష్టం. సుపుత్రులైన పిల్లలైతే వెంటనే అంగీకరిస్తారు. పూర్తి సహయోగాన్ని ఇవ్వకపోతే స్వయాన్ని నష్టపరచుకుంటారు. "నేను కల్ప-కల్పము వస్తాను, ఎంత పురుషార్థము చేయిస్తాను! ఎంతటి సంతోషంలోకి తీసుకొస్తాను!” అని తండ్రి చెప్తున్నారు. తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవడంలోనే మాయ పొరపాటు చేయిస్తుంది. కాని మీరు ఆ పాశంలో చిక్కుకోకూడదు. మాయతోనే యుద్ధం జరుగుతుంది. చాలా పెద్ద-పెద్ద తుఫానులు వస్తాయి. అందులోనూ వారసులపైనే మాయ ఎక్కువగా దాడి చేస్తుంది. రుస్తుంలతో రుస్తుంగా అయి యుద్ధం చేస్తుంది. ఏ విధంగా వైద్యుడు మందు ఇచ్చినప్పుడు వ్యాధి అంతా బయటకు వెలువడుతుందో, అలాగే ఇక్కడ కూడా నా వారిగా అయితే అందరి స్మృతి రావడం మొదలవుతుంది. తుఫాన్లు వస్తాయి. ఇందులో లైన్ క్లియర్ గా ఉండాలి. మనం మొదట పవిత్రంగా ఉండేవారము, తర్వాత అర్ధకల్పం అపవిత్రులుగా అయ్యాము. ఇప్పుడు మళ్ళీ తిరిగి వెళ్ళాలి. నన్ను స్మృతి చేసినట్లయితే ఈ యోగాగ్ని ద్వారా మీ వికర్మలు వినాశనమవుతాయి అని తండ్రి అంటారు. ఎంతగా స్మృతి చేస్తారో, అంత ఉన్నత పదవిని పొందుతారు. స్మృతి చేస్తూ చేస్తూ మీరు ఇంటికి వెళ్ళిపోతారు, ఇందులో పూర్తి అంతర్ముఖత కావాలి. జ్ఞానము కూడా ఆత్మలోనే ధారణ అవుతుంది కదా! ఆత్మయే చదువుతుంది. ఆత్మ జ్ఞానము కూడా పరమాత్మ అయిన తండ్రియే వచ్చి ఇస్తారు. విశ్వానికి యజమానులుగా అయ్యేందుకు మీరు ఇంత భారీ జ్ఞానాన్ని తీసుకుంటున్నారు. నన్ను మీరు పతితపావనుడు, జ్ఞానసాగరుడు, శాంతిసాగరుడు అని పిలుస్తారు. నా వద్ద ఏదైతే ఉందో, అదంతా మీకు ఇస్తాను. కాని కేవలం దివ్యదృష్టి తాళంచెవిని మాత్రము ఇవ్వను. దానికి బదులు మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా చేస్తాను. సాక్షాత్కారాలలో ఏమీ లేదు. ముఖ్యమైనది చదువు. చదువు ద్వారా మీకు 21 జన్మలకు సుఖము లభిస్తుంది. మీరా యొక్క సుఖముతో మీరు మీ సుఖాన్ని పోల్చి చూసుకోండి. తాను కలియుగంలో ఉండేవారు. సాక్షాత్కారం పొందారు, ఆ తర్వాత ఏమిటి? భక్తి మాలనే వేరు. జ్ఞానమార్గపు మాల వేరు. రావణుని రాజ్యము వేరు, మీ రాజ్యము వేరు. దానిని పగలు, దీనిని రాత్రి అని అంటారు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. స్మృతిబలము ద్వారా ఎటువంటి చంచలత్వం లేని విధంగా మీ కర్మేంద్రియాలను వశములో ఉంచుకోవాలి. సమయం చాలా తక్కువగా ఉంది కావున బాగా పురుషార్థం చేసి మాయాజీతులుగా అవ్వాలి.

2. ఏ జ్ఞానాన్ని అయితే తండ్రి ఇస్తారో, దానిని అంతర్ముఖులై ధారణ చేయాలి. ఎప్పుడూ పరస్పరంలో ఉప్పునీరుగా అవ్వకూడదు. తండ్రికి మీ క్షేమ సమాచారాలను తప్పకుండా తెలియజేస్తూ ఉండాలి.

వరదానము:-

ప్రతి ఆత్మను భ్రమించడం నుండి, బికారితనం నుండి రక్షించే నిష్కామ దయాహృదయ భవ

ఏ పిల్లలైతే నిష్కాములుగా, దయాహృదయులుగా ఉంటారో, వారి దయా సంకల్పాల ద్వారా ఇతర ఆత్మలకు కూడా తమ ఆత్మిక రూపము లేక ఆత్మిక గమ్యము ఒక సెకండులో స్మృతిలోకి వచ్చేస్తుంది. వారి దయా సంకల్పం ద్వారా బికారులకు సర్వ ఖజానాల యొక్క ప్రకాశం కనిపిస్తుంది. భ్రమిస్తున్న ఆత్మలకు ముక్తి లేక జీవన్ముక్తుల తీరము మరియు గమ్యము ఎదురుగా ఉన్నట్లు కనిపిస్తుంది. వారు సర్వుల దుఃఖహర్త, సుఖకర్తలుగా ఉండే పాత్రను అభినయిస్తారు. దుఃఖితులను సుఖవంతులుగా చేసే యుక్తి మరియు సాధనము వారి వద్ద సదా ఇంద్రజాలపు తాళంచెవి వలె ఉంటుంది.

స్లోగన్:-

సేవాధారులుగా అయి నిస్వార్థ సేవ చేసినట్లయితే సేవకు ఫలము తప్పకుండా లభిస్తుంది.