30-06-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైన పిల్లలూ - ఇప్పుడు మీరు పూజారుల నుండి పూజ్యులుగా అవుతున్నారు, మిమ్మల్ని తమ సమానంగా పూజ్యులుగా చేసేందుకు పూజ్యులైన తండ్రి వచ్చారు"

ప్రశ్న:-

పిల్లలైన మీలో ఎటువంటి దృఢ విశ్వాసముంది ?

జవాబు:-

మేము జీవిస్తూనే తండ్రి నుండి పూర్తి వారసత్వం తీసుకుని తీరుతాము, బాబా స్మృతిలో ఈ పాత శరీరాన్ని వదిలి తండ్రితోపాటు వెళ్తాము. బాబా మనకు ఇంటికి వెళ్ళేందుకు సహజమైన మార్గాన్ని తెలియజేస్తున్నారు అని మీకు దృఢ విశ్వాసము ఉంది.

గీతము:-

ఓం నమః శివాయ.....

ఓంశాంతి. ఓం శాంతి. ఓం శాంతి అని చాలామంది మనుష్యులు అంటూ ఉంటారు. పిల్లలు కూడా ఓంశాంతి అని అంటారు. లోపల ఉన్న ఆత్మ ఓం శాంతి అని అంటుంది. కానీ ఆత్మలకు స్వయం గురించి గాని తండ్రి గురించి గాని యథార్థ రీతిగా తెలియదు. పిలుస్తూ ఉంటారు కానీ నేను ఎవరు, ఎలా ఉంటాను అన్నది యథార్థ రీతిగా నా గురించి ఎవ్వరికీ తెలియదు అని తండ్రి చెప్తున్నారు. నేను ఎవరినో, ఎక్కడ నుండి వచ్చానో అన్నది నా గురించి నాకు ఇంతకుముందు తెలియదు అని వీరు (బ్రహ్మా) కూడా చెప్తున్నారు. ఆత్మ అయితే పురుషుడు కదా. ఆత్మ కొడుకు. పరమాత్మ తండ్రి. కనుక ఆత్మలు పరస్పరములో సోదరులవుతారు. తర్వాత శరీరములోకి వచ్చిన కారణంగా కొందరిని పురుషులని, కొందరిని స్ర్తీలని అంటారు. కాని యథార్థంగా ఆత్మ అంటే ఏమిటి అన్నది, మనుష్యమాత్రులెవ్వరికీ తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీకు ఈ జ్ఞానము లభిస్తుంది, దీనిని మళ్ళీ మీతో పాటు తీసుకువెళ్తారు. నేను ఒక ఆత్మను, ఈ పాత శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటాను అన్న ఈ జ్ఞానము అక్కడ ఉంటుంది. ఆత్మ పరిచయాన్ని తమతో పాటు తీసుకువెళ్తారు. ఇంతకుముందు ఆత్మ గురించి కూడా తెలియదు. తాము ఎప్పటి నుండి పాత్రను అభినయిస్తున్నారో కూడా ఏమీ తెలియదు. ఇప్పటికీ కొంతమంది స్వయాన్ని పూర్తిగా గుర్తించలేదు. స్థూల రూపములో తెలుసుకుంటారు మరియు పెద్ద లింగ రూపాన్నే స్మృతి చేస్తూ ఉంటారు. ఆత్మనైన నేను బిందువును, తండ్రి కూడా బిందువే, ఈ రూపములో స్మృతి చేసేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. బుద్ధి నంబరువారుగా ఉంది కదా. కొందరు బాగా అర్థము చేసుకుని ఇతరులకు కూడా అర్థం చేయించడం ప్రారంభిస్తారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయాలి అని మీరు అర్థం చేయిస్తారు, వారే పతిత-పావనుడు. మొదట మనుష్యులకు ఆత్మ పరిచయం కూడా లేదు, కనుక అది కూడా అర్థము చేయించవలసి ఉంటుంది. ఎప్పుడైతే స్వయాన్ని ఆత్మగా నిశ్చయము చేసుకుంటారో, అప్పుడే తండ్రిని కూడా తెలుసుకోగలరు. ఆత్మనే గుర్తించలేదు కనుక తండ్రిని కూడా పూర్తిగా తెలుసుకోలేదు. ఆత్మలైన మనము ఒక బిందువు అని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. ఇంత చిన్న ఆత్మలో 84 జన్మల పాత్ర ఉంది, ఇది కూడా మీరు అర్థం చేయించాల్సి ఉంటుంది. లేకపోతే కేవలం జ్ఞానము చాలా బాగుంది, భగవంతుడిని కలుసుకునేందుకు చాలా మంచి మార్గము తెలియజేస్తున్నారు అని అంటారు. కాని నేను ఎవరు, తండ్రి ఎవరు, అన్నది తెలియదు. కేవలం బాగుంది - బాగుంది అని అంటారు. కొందరైతే వీరు నాస్తికులుగా చేస్తారని కూడా అంటారు. జ్ఞానము యొక్క వివేకము ఎవ్వరిలోనూ కూడా లేదని మీకు తెలుసు. ఇప్పుడు మేము పూజ్యులుగా అవుతున్నాము, మేము ఎవ్వరినీ పూజించము ఎందుకంటే మేము అందరికీ పూజ్యులైన, ఉన్నతాతి ఉన్నతులైన ఆ భగవంతుని సంతానం అని మీరు అర్థము చేయిస్తారు. వారు పూజ్యులైన పితాశ్రీ. పితాశ్రీ మనల్ని తమవారిగా చేసుకుని చదివిస్తున్నారని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. అందరికన్నా ఉన్నతాతి ఉన్నతమైన పూజ్యులు వారొక్కరే, వారు తప్ప ఇంకెవ్వరూ పూజ్యులుగా చేయలేరు. పూజారులు తప్పకుండా పూజారులుగానే తయారుచేస్తారు. ప్రపంచములో అందరూ పూజారులే. ఇప్పుడు మీకు పూజ్యులు లభించారు, వారు తమ సమానంగా తయారుచేస్తున్నారు. మీచేత పూజను విడిపించేసారు. తమతోపాటు తీసుకువెళ్తారు. ఇది ఛీ-ఛీ ప్రపంచము. ఇది ఉన్నదే మృత్యులోకము. రావణ రాజ్యము ప్రారంభమైనప్పుడు భక్తి ప్రారంభమవుతుంది. పూజ్యుల నుండి పూజారులుగా అవుతారు. మళ్ళీ పూజారుల నుండి పూజ్యులుగా తయారుచేసేందుకు తండ్రి రావలసి ఉంటుంది. ఇప్పుడు మీరు పూజ్యులైన దేవతలుగా అవుతున్నారు. ఆత్మ శరీరము ద్వారా పాత్రను అభినయిస్తుంది. ఆత్మను పవిత్రంగా చేసేందుకు, ఇప్పుడు తండ్రి మనల్ని పూజ్య దేవతలుగా చేస్తున్నారు. కనుక తండ్రిని స్మృతి చేసినట్లయితే మీరు పూజారుల నుండి పూజ్యులుగా అవుతారు అని పిల్లలైన మీకు యుక్తిని తెలియజేశారు ఎందుకంటే ఆ తండ్రి సర్వులకు పూజ్యులు. అర్థకల్పము పూజారులుగా అయినవారే, మళ్ళీ అర్థకల్పము పూజ్యులుగా అవుతారు. ఈ పాత్ర కూడా డ్రామాలో ఉంది. డ్రామా ఆది-మధ్య-అంతాల గురించి ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు తండ్రి ద్వారా పిల్లలైన మీరు తెలుసుకున్నారు మరియు ఇతరులకు కూడా అర్థంచేయిస్తారు. మొట్టమొదట స్వయాన్ని ఆత్మ బిందువుగా భావించండి అన్న ముఖ్యమైన విషయము అర్థము చేయించాలి. ఆత్మల తండ్రి ఆ నిరాకారుడు, ఆ జ్ఞానసాగరుడే వచ్చి చదివిస్తున్నారు. సృష్టి ఆది-మధ్య-అంత రహస్యాలను అర్థం చేయిస్తారు. తండ్రి ఒక్కసారి మాత్రమే వస్తారు. వారిని తెలుసుకోవడం కూడా ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. ఒక్కసారి మాత్రమే సంగమయుగములో వస్తారు. వచ్చి పాత పతిత ప్రపంచాన్ని పావనముగా చేస్తారు. ఇప్పుడు బాబా డ్రామా ప్లాను అనుసారంగా వచ్చారు. కొత్త విషయమేమీ కాదు. కల్ప-కల్పము ఇలాగే వస్తాను. ఒక్క క్షణం కూడా ముందూ-వెనకా అవ్వదు. తప్పకుండా బాబా ఆత్మలమైన మనకు సత్యమైన జ్ఞానాన్నిస్తున్నారు, మళ్ళీ కల్పము తర్వాత కూడా తండ్రి రావలసి ఉంటుంది అని పిల్లలైన మీ మనసుకు అనిపిస్తుంది. ఈ సమయంలో తండ్రి ద్వారా ఎవరైతే తెలుసుకున్నారో వారు మళ్ళీ కల్పము తర్వాత తెలుసుకుంటారు. ఇప్పుడు ఇక పాత ప్రపంచము వినాశనమవుతుంది, మళ్ళీ మనము సత్యయుగములోకి వచ్చి మన పాత్రను అభినయిస్తామని కూడా తెలుసు. సత్యయుగ స్వర్గవాసులుగా అవుతాము. ఇదైతే బుద్ధిలో గుర్తుంది కదా. స్మృతిలో ఉండడం ద్వారా సంతోషము కూడా ఉంటుంది. ఇది విద్యార్థి జీవితము కదా. మనము స్వర్గవాసులుగా అయ్యేందుకు చదువుకుంటున్నాము. చదువు పూర్తి అయ్యేంతవరకు ఈ సంతోషము స్థిరంగా ఉండాలి. ఎప్పుడైతే వినాశనం కోసం సామాగ్రి తయారైవుతుందో, అప్పుడే ఈ చదువు పూర్తవుతుందని తండ్రి అర్థం చేయిస్తూ ఉంటారు. అప్పుడు తప్పకుండా నిప్పు అంటుకుంటుందని మీరు అర్థం చేసుకుంటారు. ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి కదా. ఒకరిపై ఒకరు ఎంతో వేడెక్కిపోతూ ఉంటారు. నలువైపులా రకరకాల సైన్యాలున్నాయి. అందరూ యుద్ధం చేసేందుకు సిద్ధమవుతూ ఉంటారు. యుద్ధము తప్పకుండా జరిగే విధంగా ఏదో ఒక అడ్డు వేస్తూ ఉంటారు. కల్పక్రితము వలె వినాశనమైతే జరగాల్సిందే. పిల్లలైన మీరు చూస్తారు. ఒక్క నిప్పురవ్వ ద్వారా ఎంత యుద్ధము జరిగిందో ఇంతకుముందు కూడా పిల్లలైన మీరు చూశారు. చెప్పినట్లు చేయకపోతే మేము ఈ బాంబులను ఉపయోగించవలసి ఉంటుందని ఒకరినొకరు బెదిరిస్తూ ఉంటారు. మృత్యువు ఎదురుగా వచ్చినప్పుడు ఇక తయారు చేయకుండా ఉండలేరు. ఇంతకుముందు కూడా యుద్ధము జరిగినప్పుడు బాంబులు ప్రయోగించారు. విధి అలా ఉంది కదా. ఇప్పుడైతే వేలాది బాంబులున్నాయి.

ఇప్పుడు అందరినీ తిరిగి తీసుకువెళ్ళేందుకు, తండ్రి వచ్చి ఉన్నారని పిల్లలైన మీరు తప్పకుండా అర్థం చేయించాలి. ఓ పతిత-పావనా రండి, మమ్మల్ని ఈ ఛీ-ఛీ ప్రపంచము నుండి పావన ప్రపంచంలోకి తీసుకువెళ్ళండి అని అందరూ పిలుస్తున్నారు. ముక్తి మరియు జీవన్ముక్తి - అనే రెండు పావన ప్రపంచాలున్నాయని పిల్లలైన మీకు తెలుసు. ఆత్మలందరూ పవిత్రంగా అయ్యి ముక్తిధామానికి వెళ్ళిపోతారు. మృత్యులోకంగా చెప్పబడే, ఈ దుఃఖధామము వినాశనమైపోతుంది. మొదట అమరలోకం ఉండేది, చక్రము తిరిగి ఇప్పుడు మళ్ళీ ఈ మృత్యులోకానికి వచ్చారు. మళ్ళీ అమరలోకము స్థాపన జరుగుతుంది. అక్కడ అకాల మృత్యువులుండవు కనుక దాన్ని అమరలోకమని అంటారు. శాస్త్రాలలో కూడా పదాలున్నాయి, కాని ఎవ్వరూ యథార్థ రీతిగా అర్థము చేసుకోరు. ఇప్పుడు తండ్రి వచ్చి ఉన్నారు, మృత్యులోకము తప్పకుండా వినాశనమయ్యేది ఉందని కూడా మీకు తెలుసు. ఇది వంద శాతము నిశ్చితము. మీ ఆత్మను యోగబలము ద్వారా పవిత్రంగా చేసుకోండి, నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమౌతాయి అని తండ్రి అర్థం చెప్తున్నారు. కానీ పిల్లలు ఇది కూడా స్మృతి చేయలేరు. తండ్రి నుండి వారసత్వము లేక రాజ్యాన్ని పొందేందుకు శ్రమించాలి కదా. ఎంత వీలైతే అంత స్మృతిలో ఉండాలి. ఎంత సమయం మేము స్మృతిలో ఉంటున్నాము మరియు ఎంతమందికి స్మృతినిప్పించాము అని స్వయాన్ని పరిశీలించుకోవాలి. మన్మనాభవ, దీనిని మంత్రము అని కూడా అనలేరు, ఇది తండ్రి స్మృతి. దేహాభిమానాన్ని విడిచిపెట్టాలి. మీరు ఒక ఆత్మ, ఇది మీ రథము. దీనితో మీరు ఎంత పని చేస్తున్నారు. సత్యయుగములో మీరు దేవీ-దేవతలుగా అయ్యి ఎలా రాజ్యము చేస్తారు, మళ్ళీ మీరు ఇదే అనుభవాన్ని పొందుతారు. ఆ సమయంలోనైతే ప్రాక్టికల్ గా ఆత్మాభిమానులుగా ఉంటారు. నా ఈ శరీరము ముసలిగా అయిపోయింది, దీనిని వదిలి కొత్తది తీసుకుంటాను అని ఆత్మ చెప్తుంది. ఇందులో దుఃఖం యొక్క విషయమేమీ లేదు. ఇక్కడైతే శరీరము విడిచిపెట్టకూడదని ఎంతగా డాక్టర్ల నుండి మందులు మొదలైనవి తీసుకుంటూ కష్టపడతూ ఉంటారు. పిల్లలైన మీకు అనారోగ్యము మొదలైనవి వచ్చిన సమయాలలో కూడా పాత శరీరముపై ఎప్పుడూ విసుగు రాకూడదు ఎందుకంటే ఈ శరీరములో జీవిస్తూనే తండ్రి నుండి వారసత్వాన్ని పొందాలని మీకు తెలుసు. శివబాబా స్మృతి ద్వారానే పవిత్రంగా అవుతారు. ఇందులోనే శ్రమ ఉంది. కాని మొదట ఆత్మను తెలుసుకోవాల్సి ఉంటుంది. మీకు స్మృతియాత్రయే ముఖ్యమైనది. స్మృతిలో ఉంటూ-ఉంటూ మనము మళ్ళీ మూలవతనానికి వెళ్ళిపోతాము. మనం అక్కడి నివాసులము, అదే మన శాంతిధామము. శాంతిధామాన్ని, సుఖధామాన్ని మీరు తెలుసుకుంటారు మరియు స్మృతి చేస్తారు. ఇంకెవ్వరూ తెలుసుకోరు. కల్పక్రితము తండ్రి నుండి వారసత్వము తీసుకున్నావారే, మళ్ళీ తీసుకుంటారు.

ముఖ్యమైనది స్మృతియాత్ర, భక్తి మార్గములోని యాత్రలు ఇప్పుడు సమాప్తమైపోతాయి. భక్తిమార్గమే సమాప్తమైపోతుంది. భక్తి మార్గము అంటే ఏమిటో జ్ఞానము తెలుసుకున్నప్పుడే అర్థము చేసుకుంటారు. భక్తి ద్వారా భగవంతుడు లభిస్తారని భావిస్తారు. భక్తికి ఏ ఫలమును ఇస్తారో, ఏమీ తెలియదు. తండ్రి పిల్లలకు తప్పకుండా స్వర్గ రాజ్యం యొక్క వారసత్వాన్నే ఇస్తారని పిల్లలైన మీకిప్పుడు తెలుసు. అందరికీ వారసత్వాన్నిచ్చారు, యథా రాజా-రాణి తథా ప్రజా అందరూ స్వర్గవాసులుగా ఉండేవారు. 5 వేల సంవత్సరాల క్రితము కూడా మిమ్మల్ని స్వర్గవాసులుగా తయారుచేశాను, ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని అలా తయారుచేస్తాను అని తండ్రి చెప్తున్నారు. మళ్ళీ మీరు 84 జన్మలు తీసుకుంటారు. ఇది బుద్ధిలో గుర్తుండాలి, మర్చిపోకూడదు. బాబా వద్ద సృష్టి ఆది-మధ్య-అంతాల జ్ఞానము ఏదైతే ఉందో, అది పిల్లల బుద్ధిలో తిరుగుతూ ఉంటుంది. మనము ఎలా 84 జన్మలు తీసుకుంటాము! ఇప్పుడు మళ్ళీ తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటారు. అనేకసార్లు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకున్నారు. ఏవిధంగా తీసుకున్నారో, అలాగే మళ్ళీ తీసుకోండి అని తండ్రి చెప్తున్నారు. తండ్రి అయితే అందరినీ చదివిస్తూ ఉంటారు. దైవీగుణాలు ధారణ చేసేందుకు కూడా అప్రమత్తం చేయడం జరుగుతుంది. నేను ఎంతవరకు పురుషార్థము చేస్తున్నాను అని స్వయాన్ని పరిశీలించుకునేందుకు సాక్షీగా అయ్యి చూసుకోవాలి. కొందరు తాము చాలా బాగా పురుషార్థము చేస్తున్నామని భావిస్తారు, భగవంతుడైన తండ్రి వచ్చి ఉన్నారని అందరికీ తెలియజేసేందుకు ప్రదర్శనీ మొదలైన వాటిని ఏర్పాట్లు చేస్తూ ఉంటాను అని అనుకుంటారు. పాపం మనుష్యులంతా ఘోరమైన నిద్రలో నిద్రిస్తున్నారు. జ్ఞానము గురించి ఎవ్వరికీ తెలియకపోవడంతో భక్తియే ఉన్నతమైనదని భావిస్తారు. ఇంతకుముందు మీలో కూడా జ్ఞానమేమైనా ఉండేదా? జ్ఞానసాగరుడు తండ్రి మాత్రమే, వారే భక్తి ఫలాన్నిస్తారని ఇప్పుడు మీకు తెలిసింది, ఎవరైతే ఎక్కువగా భక్తి చేశారో, వారికి ఎక్కువ ఫలం లభిస్తుంది, ఉన్నత పదవి పొందేందుకు వారే బాగా చదువుతారు. ఇవి ఎంత మధురాతి-మధురమైన విషయాలు. వృద్ధ మాతలు మొదలైనవారికి కూడా చాలా సహజము చేసి అర్థం చేయిస్తారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. ఉన్నతాతి ఉన్నతమైవారు భగవంతుడైన శివుడు. శివ పరమాత్మాయ నమః అని అంటారు, నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయని వారే చెప్తున్నారు. ఇది చాలు. ఇంకే కష్టమూ ఇవ్వడం లేదు. మున్ముందు శివబాబాను కూడా స్మృతి చేయడం ప్రారంభిస్తారు. వారసత్వమైతే తీసుకోవాలి, జీవిస్తూనే తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుని తీరుతామని అంటారు. శివబాబా స్మృతిలో శరీరాన్ని విడిచిపెట్టినట్లయితే మళ్ళీ ఆ సంస్కారాన్ని తీసుకువెళ్తారు. స్వర్గములోకి తప్పకుండా వస్తారు, ఎంతగా యోగము చేస్తారో అంతగా ఫలము లభిస్తుంది. ముఖ్యమైన విషయము - నడుస్తూ-తిరుగుతూ ఎంత వీలైతే అంత స్మృతిలో ఉండాలి. మీ తలపై నుండి భారాన్ని దించుకోవాలి, కేవలం స్మృతి అవసరము, తండ్రి ఇంకే కష్టమూ ఇవ్వరు. అర్థకల్పము నుండి పిల్లలు కష్టపడ్డారని తెలుసు, అందుకే వారసత్వం తీసుకునే సహజమైన మార్గాన్ని తెలియజేసేందుకే ఇప్పుడు వచ్చాను. కేవలం తండ్రిని స్మృతి చేయండి. ఇంతకుముందు కూడా స్మృతి చేసేవారు కాని అప్పుడు ఎటువంటి జ్ఞానము లేదు, ఈ విధంగా నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమౌతాయి అని ఇప్పుడు తండ్రి జ్ఞానాన్నిచ్చారు. ప్రపంచములో చాలామంది శివుని భక్తి చేస్తారు, ఎంతో గుర్తు చేస్తారు కాని పరిచయము తెలియదు. నన్ను స్మృతి చేయండి అని ఈ సమయంలో తండ్రే స్వయంగా వచ్చి తన పరిచయాన్నిస్తారు. మేము చాలా బాగా తెలుసుకున్నామని ఇప్పుడు మీరు భావిస్తారు. మేము బాప్ దాదా వద్దకు వెళ్తున్నామని మీరంటారు. బాబా ఈ భగీరథుడిని తీసుకున్నారు, భగీరథుడు కూడా ఎంతో ప్రసిద్ధమైనవారు. తండ్రి కూర్చుని వీరి ద్వారా జ్ఞానాన్ని వినిపిస్తారు. ఇది కూడా డ్రామాలోని పాత్రయే. కల్ప-కల్పము ఈ భాగ్యశాలి రథములోకి వస్తారు. శ్యామసుందరుడు అని ఎవరినైతే పిలుస్తారో వారు వీరేనని మీకు తెలుసు. ఇది కూడా మీరే అర్థము చేసుకున్నారు. మనుష్యులు అర్జునుడు అని పేరు పెట్టేశారు. బ్రహ్మానే విష్ణువుగా, విష్ణువే బ్రహ్మాగా ఎలా అవుతారో ఇప్పుడు తండ్రి యథార్థంగా అర్థం చేయిస్తున్నారు. మేము బ్రహ్మాపురికి చెందినవారము, మళ్ళీ విష్ణుపురికి చెందినవారిగా అవుతామని పిల్లల్లో ఇప్పుడు వివేకముంది. విష్ణుపురి నుండి బ్రహ్మాపురిలోకి రావడానికి 84 జన్మలు పడుతుంది. ఇది కూడా అనేకసార్లు అర్థం చేయించారు, దీన్ని మీరు మళ్ళీ వింటున్నారు. కేవలం నన్నొక్కడినే స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమౌతాయని ఇప్పుడు ఆత్మలకు తండ్రి చెప్తున్నారు కనుక మీకు సంతోషము కూడా కలుగుతుంది. ఈ ఒక్క అంతిమ జన్మ పవిత్రంగా అవ్వడం ద్వారా మనము పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతాము. మరి ఎందుకు పవిత్రంగా అవ్వకూడదు. ఒక్క తండ్రి పిల్లలైన మనం బ్రహ్మాకుమార్ కుమారీలము, అయినా కూడా ఆ దైహిక వృత్తి మారడానికి సమయం పడుతుంది. నెమ్మది-నెమ్మదిగా అంతిమంలో కర్మాతీత అవస్థ ఏర్పడుతుంది. ఈ సమయంలో కర్మాతీత స్థితి ఏర్పడడం ఎవరికైనా అసంభవమే. కర్మాతీత స్థితి ఏర్పడితే మరి ఈ శరీరము కూడా ఉండదు, విడిచిపెట్టాల్సి ఉంటుంది. యుద్ధము ప్రారంభమైనప్పుడు, ఒక్క తండ్రి స్మృతిలో ఉండడంలోనే శ్రమ ఉంది. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. మేము ఎంతవరకు పురుషార్థము చేస్తున్నాము? నడుస్తూ తిరుగుతూ, కర్మలు చేస్తూ ఎంత సమయం బాబా స్మృతిలో ఉంటున్నాము అని సాక్షిగా అయ్యి స్వయాన్ని పరిశీలించుకోవాలి.

2. ఈ శరీరముతో ఎప్పుడూ విసిగిపోకూడదు. ఈ శరీరములో జీవిస్తూనే తండ్రి నుండి వారసత్వాన్ని పొందాలి. స్వర్గవాసులుగా అయ్యేందుకు ఈ జీవితంలో పూర్తిగా చదువుకోవాలి.

వరదానము:-

మాస్టర్ రచయిత స్థితి ద్వారా ఆపదలలో కూడా మనోరంజనం అనుభవం చేసే సంపూర్ణ యోగీ భవ

మాస్టర్ రచయిత స్థితిపై స్థితులై ఉండడం ద్వారా అతి పెద్ద ఆపద కూడా ఒక మనోరంజకమైన దృశ్యంగా అనుభవమవుతుంది. ఎలాగైతే మహావినాశనపు ఆపదను కూడా స్వర్గ ద్వారాలను తెరిచే సాధనంగా చెప్తారో, అదే విధంగా ఏ రకమైన చిన్నా పెద్దా సమస్య లేక ఆపద అయినా మనోరంజన రూపంగా కనిపించాలి, అయ్యో-అయ్యో కు బదులుగా ఓహెూ అన్న పదం వెలువడాలి - దుఃఖము కూడా సుఖం యొక్క రూపంగా అనుభవమవ్వాలి. సుఖ-దుఃఖాల జ్ఞానము ఉంటూ కూడా వాటి ప్రభావంలోకి రాకూడదు, సుఖమునిచ్చే రోజులు వచ్చేందుకు దుఃఖం కూడా బలిహారమౌతుందని భావించాలి - అప్పుడే సంపూర్ణ యోగీలని అంటారు.

స్లోగన్:-

హృదయ సింహాసనాన్ని వదిలి సాధారణ సంకల్పాలు చేయడం అనగా భూమిపై కాలు పెట్టడం.