15-06-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైనపిల్లలూ - మేము 84 జన్మల చక్రాన్ని పూర్తి చేసాము, ఇప్పుడు ఇక మా ఇల్లైన శాంతిధామానికి వెళ్తున్నాము అని ఇప్పుడు మీకు స్మృతి కలిగింది, ఇంటికి వెళ్ళేందుకు ఇంకా కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది"

ప్రశ్న:-

ఇంటికి వెళ్ళాలనే స్మృతి ఉన్న పిల్లల గుర్తులు ఏమిటి?

జవాబు:-

వారు ఈ పాత ప్రపంచాన్ని చూస్తూ కూడా చూడరు. వారికి అనంతమైన వైరాగ్యముంటుంది, వ్యాపార వ్యవహారాలలో ఉంటూ కూడా తేలికగా ఉంటారు. ఇక్కడి-అక్కడి పరచింతన విషయాలలో తమ సమయాన్ని పోగొట్టుకోరు. స్వయాన్ని ఈ ప్రపంచంలో ఒక అతిథిగా భావిస్తారు.

ఓంశాంతి. మనము కొద్ది సమయం కొరకు ఈ పాత ప్రపంచంలో అతిథులుగా ఉన్నామని కేవలం సంగమయుగ బ్రాహ్మణ పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. మీ నిజమైన ఇల్లు శాంతిధామము. మనసుకు శాంతి కలగాలని, మనుష్యులు ఆ ఇంటిని చాలా గుర్తు చేస్తారు, మనసుకు శాంతి కలగాలని కోరుకుంటారు. కాని మనసు అనగా ఏమిటి, శాంతి అనగా ఏమిటి, అది మనకు ఎక్కడి నుండి లభిస్తుంది, ఇవేవీ అర్థం చేసుకోరు. ఇప్పుడు మన ఇంటికి వెళ్ళేందుకు చాలా కొద్ది సమయము మాత్రమే మిగిలి ఉందని మీకు తెలుసు. మొత్తం పపంచంలోని మనుష్యమాత్రులందరూ నంబరువారుగా అక్కడికి వెళ్తారు. అది శాంతిధామము మరియు ఇది దుఃఖధామము. ఇది స్మృతి చేయడమైతే సహజమే కదా. వృద్ధులైనా లేదా యువకులైనా, కనీసం ఇదైతే స్మృతి చేయగలరు కదా. ఇందులో మొత్తము సృష్టి జ్ఞానం వచ్చేస్తుంది. వివరాలన్నీ బుద్ధిలోకి వచ్చేస్తాయి. ఇప్పుడు మీరు సంగమయుగంలో కూర్చుని ఉన్నారు, మనము డ్రామా ప్లాన్ అనుసారంగా శాంతిధామానికి వెళ్తున్నామని బుద్ధిలో ఉంటుంది. ఇది బుద్ధిలో ఉండడం ద్వారా మీకు సంతోషము కలుగుతుంది, స్మృతి కూడా ఉంటుంది. మనకు మన 84 జన్మల స్మృతి కలిగింది. ఆ భక్తిమార్గము వేరు, ఇవి జ్ఞాన మార్గములోని విషయాలు. తండ్రి అర్థము చేయిస్తున్నారు - మధురమైన పిల్లలూ, ఇప్పుడు మీ ఇల్లు గుర్తొస్తుందా? మీరు ఎంతగా వింటూ ఉంటారు, ఎన్నో విషయాలు వింటూ ఉంటారు. ఇప్పుడు మనము శాంతిధామానికి వెళ్తాము, ఆ తర్వాత సుఖధామానికి వెళ్తాము, ఇదే ముఖ్యమైనది. పావన ప్రపంచానికి తీసుకువెళ్ళేందుకు తండ్రి వచ్చారు. సుఖధామంలో కూడా ఆత్మలు సుఖం మరియు శాంతిలో ఉంటాయి. శాంతిధామంలో కేవలము శాంతి ఉంటుంది, ఇక్కడైతే చాలా అలజడి ఉంటుంది కదా. ఇక్కడ మధువనము నుండి మీ ఇంటికి వెళ్తే, మీ బుద్ధి పరచింతన విషయాల వైపు, మీ వ్యాపార వ్యవహారాలు మొదలైనవాటి వైపుకు వెళ్ళిపోతుంది. ఇక్కడైతే ఆ జంఝాటాలేవి ఉండవు. ఆత్మలమైన మనము శాంతిధామ నివాసులమని, ఇక్కడ మనం పాత్రధారులుగా అయ్యామని మీకు తెలుసు, మనం పాత్రధారులుగా ఎలా అవుతామో ఇంకెవ్వరికీ తెలియదు. తండ్రి వచ్చి పిల్లలైన మిమ్మల్నే చదివిస్తారు, కోటిలో కొందరు మాత్రమే చదువుకుంటారు, అందరూ చదవరు. ఇప్పుడు మీరెంత వివేకవంతులుగా అవుతారు. ఇంతకుముందు తెలివిహీనులుగా ఉండేవారు. ఇప్పుడైతే యుద్ధాలు-కొట్లాటలు మొదలైనవి ఎన్ని ఉన్నాయో చూడండి, దీనిని ఏమంటారు? మనము పరస్పరంలో సోదరులమని మర్చిపోయారు. సోదరులు ఎక్కడైనా హతమార్చుకుంటారా? ఎక్కడైనా హతమార్చుకున్నా, అది కేవలం ఆస్తి కొరకే. మనమందరము ఒక్క తండ్రి పిల్లలము, సోదరులమని ఇప్పుడు మీకు తెలుసు. ఆత్మలైన మనల్ని బాబా వచ్చి చదివిస్తున్నారని మీరు ప్రాక్టికల్ గా అర్థం చేసుకున్నారు. 5 వేల సంవత్సరాల క్రితం వలె మనల్ని చదివిస్తున్నారు ఎందుకంటే వారు జ్ఞానసాగరుడు. ఈ చదువు గురించి ఇంకెవ్వరికీ తెలియదు. తండ్రినే స్వర్గ రచయిత అని కూడా పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. సృష్టిని రచించేవారని అనరు. సృష్టి అయితే అనాది అయినది. స్వర్గాన్ని రచించేవారని అంటారు, అక్కడ ఇక ఇతర ఏ ఖండము ఉండదు. ఇక్కడైతే చాలా ఖండాలున్నాయి. ఒకే ధర్మము, ఒకే ఖండము ఉన్న సమయం ఉండేది. ఆ తర్వాత మళ్ళీ వెరైటీ ధర్మాలు వచ్చాయి.

వెరైటీ ధర్మాలు ఎలా వస్తాయి అన్నది ఇప్పుడు మీ బుద్ధిలో కూర్చుంది. మొట్టమొదట ఆది సనాతన దేవీ-దేవతా ధర్మముండేది, సనాతన ధర్మము అని కూడా ఇక్కడే అంటారు. కాని అర్థం మాత్రము తెలియదు. మీరందరూ ఆది సనాతన దేవీ-దేవతా ధర్మానికి చెందినవారు, కేవలం పతితంగా అయిపోయారు, సతోప్రధానం నుండి సతో-రజో-తమోగా అవుతూ వచ్చారు. మనము ఆది సనాతన దేవీ-దేవతా ధర్మానికి చెందినవారము, మనం చాలా పవిత్రంగా ఉండేవారము, ఇప్పుడు పతితులుగా అయ్యామని మీరు అర్థం చేసుకున్నారు. మీరు తండ్రి నుండి పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అయ్యే వారసత్వాన్ని తీసుకున్నారు. మనము మొట్టమొదట పవిత్ర గృహస్థ ధర్మానికి చెందినవారిగా ఉండేవారము, ఇప్పుడు డ్రామా ప్లాన్ అనుసారంగా రావణరాజ్యంలో పతిత ప్రవృత్తి మార్గమువారిగా అయ్యామని అర్థం చేసుకున్నారు. ఓ పతిత-పావనా, మమ్మల్ని సుఖధామములోకి తీసుకువెళ్ళండి అని మీరే పిలిచారు. ఇది నిన్నటి విషయము. నిన్న మీరు పవిత్రంగా ఉండేవారు, ఈ రోజు అపవిత్రంగా అయి పిలుస్తున్నారు. ఆత్మ పతితంగా అయిపోయింది. బాబా, మీరు వచ్చి మమ్మల్ని మళ్ళీ పావనంగా తయారుచేయండి అని ఆత్మ పిలుస్తుంది. ఇప్పుడు ఈ అంతిమ జన్మ పవిత్రంగా అవ్వండి, తర్వాత మీరు 21 జన్మలు చాలా సుఖంగా ఉంటారు అని తండ్రి చెప్తున్నారు. బాబా అయితే చాలా మంచి విషయాలను వినిపిస్తున్నారు. చెడు విషయాల నుండి విడిపిస్తారు ఎందుకంటే మీరు దేవతలుగా ఉండేవారు కదా. ఇప్పుడు మళ్ళీ తయారవ్వాలి. పవిత్రంగా అవ్వండి. ఎంత సహజము. సంపాదన చాలా గొప్పది. శివబాబా వచ్చి ఉన్నారని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది, ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత వస్తారు. పాత ప్రపంచం తప్పకుండా కొత్తదిగా అవుతుంది. ఇది ఇంకెవ్వరూ తెలియజేయలేరు. శాస్త్రాలలో కలియుగము ఆయుష్షు చాలా ఎక్కువగా రాసేశారు. ఇదంతా డ్రామాలో రచింపబడి ఉంది.

ఇప్పుడు పిల్లలైన మీరు పాపాల నుండి ముక్తులయ్యేందుకు పురుషార్థము చేస్తున్నారు, ఇంకే పాపమూ జరగకూడదని ధ్యానము ఉండాలి. దేహాభిమానంలోకి రావడం వల్లనే ఇతర వికారాలు కూడా వస్తాయి, వాటి ద్వారా పాపము జరుగుతుంది, అందుకే భూతాలను పారద్రోలవలసి ఉంటుంది. ఈ ప్రపంచంలోని ఏ వస్తువుపైనా మోహము ఉండకూడదు. ఈ పాత ప్రపంచం పట్ల వైరాగ్యం ఉండాలి. ఈ పాత ఇంటిని చూస్తూన్నా, ఇందులో ఉంటున్నా కానీ బుద్ధి కొత్త ప్రపంచం వైపు జోడించబడి ఉండాలి. కొత్త ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కొత్త దానినే చూస్తూ ఉంటారు. ఈ పాత ఇల్లు సమాప్తయ్యే వరకు ఈ కనులతో పాతదాన్ని చూస్తున్నాసరే కొత్తదాన్ని స్మృతి చేయాలి. పశ్చాత్తాప పడవలసి వచ్చే విధమైన పనులేవీ చేయకూడదు. ఈ రోజు ఫలానావారికి దుఃఖము కలిగించాను, ఈ పాపము చేశాను, బాబా ఇది పాపమేనా అని బాబాను అడగవచ్చు. ఎందుకు గుటకలు మింగాలి. అడగకపోతే గుటకలు మింగుతూ ఉంటారు. బాబాను అడిగినట్లయితే బాబా వెంటనే తేలికగా చేసేస్తారు. మీరు చాలా భారాన్ని కలిగి ఉన్నారు. పాపాల భారం చాలా భారి అయినది. 21 జన్మలు మళ్ళీ పాపాల నుండి తేలికగా అయిపోతారు. జన్మ-జన్మాంతరాల భారము తలపై ఉంది. ఎంతగా స్మృతిలో ఉంటారో, అంతగా తేలికగా అవుతూ ఉంటారు. మాలిన్యం తొలగిపోతూ ఉంటుంది మరియు సంతోషము పెరుగుతూ ఉంటుంది. సత్యయుగంలో మీరు చాలా సంతోషంగా ఉండేవారు, ఆ తర్వాత మీ సంతోషం తగ్గిపోతూ-తగ్గిపోతూ పూర్తిగా మాయమైపోయింది. సత్యయుగం నుండి కలియుగం వరకు ఈ యాత్ర చేసేందుకు 5 వేల సంవత్సరాలు పట్టింది. స్వర్గం నుండి నరకంలోకి వచ్చే యాత్ర గురించి, స్వర్గం నుండి నరకంలోకి ఎలా వచ్చామో దానిని గురించి, ఇప్పుడే తెలిసింది. ఇప్పుడు మీరు మళ్ళీ నరకం నుండి స్వర్గంలోకి వెళ్తారు. ఒక్క సెకెండులో జీవన్ముక్తి లభిస్తుంది. తండ్రిని గుర్తించారు. తండ్రి వచ్చారంటే తప్పకుండా మనల్ని స్వర్గానికి తీసుకువెళ్తారు. కొడుకు పుట్టడంతోనే ఆస్తికి అధిపతి అవుతాడు. తండ్రికి చెందినవారిగా అయ్యారంటే నషా ఎక్కాలి కదా. మరి అది ఎందుకు తగ్గుతుంది. మీరైతే పెద్దవారే కదా. అనంతమైన తండ్రికి పిల్లలుగా అయినప్పుడు అనంతమైన రాజధానిపై మీకు హక్కు ఉంటుంది, అందుకే - అతీంద్రియ సుఖం గురించి అడగాలంటే గోపీవల్లభుని గోప-గోపికలనే అడగాలని గాయనము కూడా ఉంది. వల్లభుడు తండ్రినే కదా, వారిని అడగండి. నంబరువారు పురుషార్థానుసారంగానే సంతోషపు పాదరసం పైకెక్కుతుంది. కొందరైతే వెంటనే తమ సమానంగా తయారుచేస్తారు. అన్నింటినీ మరపింపజేసి తమ రాజధానిని గుర్తు తెప్పించడమే పిల్లల కర్తవ్యము.

మీరు స్వర్గానికి యజమానులుగా ఉండేవారు. ఇప్పుడు ఇది కలియుగ పాత ప్రపంచము, మళ్ళీ కొత్త ప్రపంచంగా అవుతుంది. ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత తండ్రి భారత్ లోనే వస్తారని ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. వారి జయంతిని కూడా జరుపుకుంటారు. తండ్రి వచ్చి మనకు రాజధానిని ఇచ్చి వెళ్తారని మీకు తెలుసు, ఇక తర్వాత స్మృతి చేసే అవసరమే ఉండదు, మళ్ళీ భక్తి ప్రారంభమైనప్పుడు స్మృతి చేస్తారు. ఆత్మ ఖజానాలను పొందింది కనుక బాబా, మీరు మళ్ళీ వచ్చి మమ్మల్ని శాంతిధామానికి, సుఖధామానికి తీసుకువెళ్ళండి అని స్మృతి చేస్తుంది. వారు మన తండ్రి అని, టీచర్ అని, గురువు కూడా అయ్యారని పిల్లలైన మీరిప్పుడు తెలుసుకున్నారు. సృష్టి ఆది-మధ్య-అంతాల చక్రం, 84 జన్మల జ్ఞానము మీ బుద్ధిలో ఉంది. లెక్కలేనన్ని సార్లు 84 జన్మలు తీసుకున్నారు, మళ్ళీ తీసుకుంటూ ఉంటారు. దీనికి ముగింపు ఎప్పుడూ ఉండదు. ఈ చక్రము మీ బుద్ధిలో మాత్రమే ఉంది, స్వదర్శన చక్రము ఘడియ-ఘడియ స్మృతిలోకి రావాలి. ఇదే మన్మనాభవ, తండ్రిని ఎంతగా స్మృతి చేస్తామో అంతగా పాపము భస్మమవుతుంది.

మీరు కర్మాతీత స్థితికి సమీపంగా చేరుకున్నప్పుడు మీ ద్వారా ఎటువంటి వికర్మలు జరగవు. ఇప్పుడింకా కొద్ది-కొద్దిగా వికర్మలు జరుగుతూ ఉంటాయి. సంపూర్ణ కర్మాతీత అవస్థ అప్పుడే తయారవ్వలేదు. ఈ బాబా కూడా మీతో పాటు ఒక విద్యార్థి. చదివించేవారు శివబాబా. వీరిలో ప్రవేశిస్తారు, కాని వీరు కూడా విద్యార్థియే. ఇవి కొత్త-కొత్త విషయాలు. ఇప్పుడు మీరు కేవలం తండ్రిని మరియు సృష్టి చక్రాన్ని స్మృతి చేయండి. అది భక్తిమార్గము, ఇది జ్ఞానమార్గము. రాత్రి-పగలుకు ఉన్నంత వ్యత్యాసం ఉంది. అక్కడ గంటలు మొదలైనవి ఎంతగా మోగిస్తూ ఉంటారు. ఇక్కడ కేవలం స్మృతిలో ఉండాలి. ఆత్మనైతే అమరమైనది, అకాల సింహాసనము కూడా ఉంది. కేవలం తండ్రి మాత్రమే అకాలమూర్తి అని కాదు, మీరు కూడా అకాలమూర్తులే. అకాలమూర్తి అయిన ఆత్మకు ఈ భృకుటి సింహాసనంగా ఉన్నది. తప్పనిసరిగా భృకుటిలోనే కూర్చుంటుంది. కడుపులో అయితే కూర్చోదు కదా. అకాలమూర్తి ఆత్మలైన మన సింహాసనము ఎక్కడుంటుందో ఇప్పుడు మీకు తెలుసు. ఈ భృకుటి మధ్యలో మన సింహాసనముంటుంది. అమృతసర్ లో అకాల సింహాసనముంది కదా. అర్థము ఏ మాత్రము తెలియదు. అకాలమూర్తి అని మహిమ కూడా పాడుతారు. వారి యొక్క అకాల సింహాసనము గురించి ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు మీకు తెలిసింది, ఆసనమైతే ఇదే, దీనిపై కూర్చొని వినిపిస్తారు. కనుక ఆత్మ అవినాశి, శరీరము వినాశి. ఇది ఆత్మ యొక్క అకాల సింహాసనము, ఈ అకాల సింహాసనము సదా ఉంటుంది. ఇది మీరు అర్థము చేసుకున్నారు. వారు మళ్ళీ ఆ సింహాసనము తయారుచేసి పేరు పెట్టేశారు. వాస్తవానికి అకాల ఆత్మ ఇక్కడ కూర్చుని ఉంది. పిల్లలైన మీ బుద్ధిలో అర్థముంది. ఏక్ ఓంకార్ అన్న పదం అర్థాన్ని మీరు అర్థం చేసుకుంటారు. మనుష్యులు మందిరాలకు వెళ్ళి అచ్యుతమ్, కేశవమ్.... అని అంటారు కాని అర్థము తెలియదు. అలాగే మహిమ చేస్తూ ఉంటారు. అచ్యుతమ్ కేశవమ్ రామ నారాయణమ్.... ఇప్పుడు రాముడెక్కడ, నారాయణుడెక్కడ. అవన్నీ భక్తి మార్గంలోని విషయాలని తండ్రి చెప్తున్నారు. జ్ఞానమైతే చాలా సాధారణమైనది, ఇతర ఏ విషయాన్ని అయినా అడిగే ముందు తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయాలి, ఆ శ్రమ ఎవరి వల్ల సాధ్యమవ్వడం లేదు, మర్చిపోతున్నారు. మాయ ఇలా చేస్తుంది, భగవంతుడు ఇలా చేస్తారు - అని దీని గురించి ఒక నాటకము కూడా ఉంది. మీరు తండ్రిని స్మృతి చేస్తున్నారు, మాయ మిమ్మల్ని ఇతర తుఫానులలోకి తీసుకువెళ్తుంది. బలవంతునితో బలవంతునిగా అయ్యి యుద్ధము చేయమని - మాయ యొక్క ఆజ్ఞ, మీరందరూ యుద్ధ మైదానంలో ఉన్నారు. ఇందులో ఎటువంటి యోధులున్నారో తెలుసు. కొందరు చాలా బలహీనంగా ఉన్నారు, కొందరు మధ్యస్థంగా బలహీనంగా ఉన్నారు, కొందరు చాలా చురుకైనవారిగా ఉన్నారు. అందరూ మాయతో యుద్ధము చేసేవారే. అంతా గుప్తంగా, అండర్ గ్రౌండ్ గా ఉంది. వారు కూడా అండర్ గ్రౌండ్ లో బాంబులను ట్రయల్ చేస్తూ ఉంటారు. తమ మృత్యువు కొరకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారన్నది పిల్లలైన మీకు తెలుసు. మీరు పూర్తి శాంతిగా కూర్చొని ఉన్నారు, వారిది సైన్స్ బలము. ప్రాకృతిక ఆపదలు కూడా చాలా ఉన్నాయి. అవైతే ఎవరి వశములోనూ ఉండవు. ఇప్పుడు కృత్రిమ వర్షాల కోసం కూడా ప్రయత్నము చేస్తున్నారు. కృత్రిమ వర్షాలు కురవడం వలన పంటలు బాగా పండుతాయని అనుకుంటారు. ఎన్ని వర్షాలు కురిసినా, ప్రకృతి వైపరీత్యాలు తప్పకుండా రావలసిందేనని పిల్లలైన మీకు తెలుసు. కుండపోత వర్షము కురుస్తే అప్పుడేం చేస్తారు. వీటినే ప్రకృతి వైపరీత్యాలని అంటారు. సత్యయుగంలో ఇవన్నీ ఉండవు. అవి ఇక్కడ జరుగుతాయి, వినాశనంలో సహాయము చేస్తాయి.

మనము సత్యయుగంలో ఉన్నప్పుడు యమునా నది తీరంపై బంగారు మహళ్ళు ఉంటాయని మీ బుద్ధిలో ఉంది. అక్కడ మనము చాలా కొద్దిమంది మాత్రమే ఉంటాము. కల్ప-కల్పము ఇలా జరుగుతూనే ఉంటుంది. మొదట కొద్దిమంది మాత్రమే ఉంటారు, తర్వాత వృక్షము వృద్ధి చెందుతుంది, అక్కడ అశుద్ధమైన వస్తువేదీ ఉండనే ఉండదు. ఇక్కడైతే చూడండి, పక్షులు కూడా పాడు చేస్తూ ఉంటాయి, అక్కడ అశుద్ధత అన్న మాటే ఉండదు, దానినే స్వర్గమని అంటారు. మనము ఈ దేవతలుగా అవుతున్నామని మీరిప్పుడు అర్థం చేసుకున్నారు, మరి లోలోపల ఎంత సంతోషముండాలి. మాయ రూపీ జిన్ను భూతము నుండి రక్షించుకునేందుకు పిల్లలైన మీరు ఈ ఆత్మిక వ్యాపారములో నిమగ్నమవ్వాలి అని తండ్రి చెప్తున్నారు. మన్మనాభవ, అంతే, ఇందులోనే మీరు జిన్నులా అవ్వండి. జిన్ను ఉదాహరణ ఇస్తారు కదా. నాకు పని ఇవ్వు అని అంటుంది..... అలాగే ఇప్పుడు బాబా కూడా పని ఇస్తారు. లేకపోతే మాయ తినేస్తుంది. తండ్రికి పూర్తి సహాయకులుగా అవ్వాలి. తండ్రి ఒక్కరూ ఒంటరిగా చేయరు కదా. తండ్రి అయితే రాజ్యం కూడా చేయరు. మీరు సేవ చేస్తారు, రాజ్యము కూడా మీ కోసమే. నేను కూడా మగధ దేశములోనే వస్తాను అని తండ్రి చెప్తున్నారు. మాయ కూడా మొసలి వంటిది, అది ఎంతోమంది మహారథులను మింగి తినేస్తుంది. అవన్నీ శత్రువులు. ఏ విధంగా కప్పకు పాము శత్రువు కదా, అలా మాయ మీకు శత్రువు అని మీకు తెలుసు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. స్వయాన్ని పాపాల నుండి ముక్తులుగా చేసుకునే పురుషార్థము చేయాలి, ఎప్పుడూ దేహాభిమానంలోకి రాకూడదు. ఈ ప్రపంచంలోని ఏ వస్తువు పట్ల మోహము ఉండకూడదు.

2. మాయ రూపీ జిన్ను భూతము నుండి రక్షించుకునేందుకు బుద్ధిని ఆత్మిక వ్యాపారంలో బిజీగా ఉంచుకోవాలి. తండ్రికి పూర్తి సహాయకులుగా అవ్వాలి.

వరదానము:-

నేను మరియు నాది అన్నదానిని సమాప్తం చేసి సమానతను మరియు సంపూర్ణతను అనుభవం చేసే సత్యమైన త్యాగీ భవ

ప్రతి క్షణము, ప్రతి సంకల్పంలో బాబా, బాబా అన్నది స్మృతిలో ఉండాలి, నేను అనేది సమాప్తమైపోవాలి. నేను అనేది లేనప్పుడు నాది అన్నది కూడా ఉండదు. నా స్వభావం, నా సంస్కారం, నా నేచర్, నా పని లేక డ్యూటి, నా పేరు, నా ప్రతిష్ఠ... ఎప్పుడైతే ఈ నేను మరియు నాది అన్నది సమాప్తమవుతుందో అప్పుడు అదే సమానత మరియు సంపూర్ణత. ఈ నేను మరియు నాది అన్నదానిని త్యాగం చేయడమే అత్యంత గొప్ప సూక్ష్మమైన త్యాగము. ఈ నేను అనే అశ్వాన్ని అశ్వమేధ యజ్ఞంలో స్వాహా చేయండి, అప్పుడు అంతిమ ఆహుతి పడుతుంది మరియు విజయ ఢంకా మోగుతుంది.

స్లోగన్:-

హాజీ అంటూ సహయోగమనే చేతిని అందించడం అంటే ఆశీర్వాదాల మాలలను ధరించడము.