05-06-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైనపిల్లలూ - మీకు ఇప్పుడు జ్ఞాన దృష్టి లభించింది, దీనితో మీ భ్రమించడం సమాప్తమైపోయింది, మీరు శాంతిధామాన్ని మరియు సుఖధామాన్ని స్మృతి చేస్తారు"

ప్రశ్న:-

దేవతలలో ఏ శక్తి ఉంది మరియు ఆ శక్తి ఏ విశేషత కారణంగా ఉంది?

జవాబు:-

దేవతలలో మొత్తం విశ్వంపై రాజ్యం చేసే శక్తి ఉంది, ఆ శక్తి విశేషంగా ఐకమత్యం కారణంగానే ఉంది. అక్కడ ఐకమత్యం ఉన్న కారణంగా మంత్రి మొదలైనవారిని పెట్టుకోవలసిన అవసరముండదు. దేవతలు సంగమయుగంలో తండ్రి నుండి ఎటువంటి శ్రీమతాన్ని తీసుకున్నారంటే దాని ద్వారా వారు 21 జన్మలు రాజ్యం చేస్తారు. అక్కడ ఒకే రాజు యొక్క ఒకే ఒక దైవీ కుటుంబం ఉంటుంది, రెండవ మతమేదీ ఉండదు.

గీతము:-

నయనహీనులకు దారి చూపించు ప్రభూ..... ( నయన్ హీన్ కో రాహ్ దిఖావో ప్రభూ.....)

ఓంశాంతి. పిల్లలకు నేత్రాలు లభించాయి, ఇంతకుముందు నేత్రాలు ఉండేవి కావు, ఏ నేత్రాలు? జ్ఞాన నేత్రాలుండేవి కావు. అజ్ఞాన నేత్రాలైతే ఉండేవి. జ్ఞానసాగరులు తండ్రి ఒక్కరేనని పిల్లలకు తెలుసు. ఏ జ్ఞానం ద్వారా అయితే సద్గతి కలుగుతుందో అనగా శాంతిధామానికి మరియు సుఖధామానికి వెళ్ళగలమో, ఆ ఆత్మిక జ్ఞానం ఇంకెవ్వరిలోనూ లేదు. ఇప్పుడు ఏ విధంగా సుఖధామం మారి మళ్ళీ మాయా రాజ్యంగా లేక దుఃఖధామంగా అవుతుందో, అది పిల్లలైన మీకు దృష్టి లభించింది. నయనహీనులకు దారి చూపించండి అని పిలవడం మొదలుపెడతారు. భక్తి మార్గపు యజ్ఞాలు, దాన-పుణ్యాలు మొదలైనవాటి ద్వారా శాంతిధామానికి మరియు సుఖధామానికి వెళ్ళేందుకు మార్గం లభించదు. ప్రతి ఒక్కరూ తమ పాత్రను అభినయించవలసిందే. నాకు కూడా పాత్ర లభించిందని తండ్రి చెప్తున్నారు. భక్తిమార్గంలో ముక్తి-జీవన్ముక్తులకు మార్గం చూపించమని పిలుస్తుంటారు. దాని కోసం ఎన్నో యజ్ఞ-తపాలు, దాన-పుణ్యాలు మొదలైనవాటిని చేస్తారు, ఎంతగానో భ్రమిస్తూ ఉంటారు. శాంతిధామం మరియు సుఖధామంలో భ్రమించడమే ఉండదు. ఇది కూడా మీకు మాత్రమే తెలుసు, వారికి కేవలం శాస్త్రాలలోని చదువు మరియు దైహికమైన చదువు గురించి మాత్రమే తెలుసు. ఈ ఆత్మిక తండ్రి గురించి అస్సలు తెలియదు. ఎప్పుడైతే సర్వుల సద్గతి జరగాల్సి ఉంటుందో, పాత ప్రపంచం పరివర్తన అవ్వవలసి ఉంటుందో అప్పుడు ఆత్మిక తండ్రి వచ్చి జ్ఞానాన్నిస్తారు. మనుష్యుల నుండి దేవతలుగా అవుతారు, తర్వాత మొత్తం సృష్టిపై దేవీ-దేవతల రాజ్యం ఒక్కటే ఉంటుంది, దానినే స్వర్గమని అంటారు. ఆది సనాతన దేవీ-దేవతా ధర్మం భారత్ లోనే ఉండేదని, ఆ సమయంలో ఇంకే ధర్మమూ ఉండేది కాదని భారతవాసీయులకు మాత్రమే తెలుసు. పిల్లలైన మీ కోసం ఇప్పుడు ఇది సంగమయుగం, మిగిలినవారంతా కలియుగంలో ఉన్నారు. మీరు పురుషోత్తమ సంగమయుగంలో కూర్చుని ఉన్నారు. ఎవరైతే తండ్రిని స్మృతి చేస్తారో, తండ్రి శ్రీమతంపై నడుస్తారో, వారు సంగమయుగంలో ఉన్నారు. మిగిలినవారంతా కలియుగంలో ఉన్నారు. ఇప్పుడు ఏ సామ్రాజ్యమూ లేదు, రాజ్యాలూ లేవు. అనేక మతాల ద్వారా రాజ్యం నడుస్తుంది, సత్యయుగంలో అయితే ఒక్క మహారాజు మతమే నడుస్తుంది, మంత్రులుండరు. అంతటి శక్తి ఉంటుంది. తర్వాత పతితులుగా అయినప్పుడు మంత్రులు మొదలైనవారిని పెట్టుకుంటారు ఎందుకంటే ఆ శక్తి ఉండదు. ఇప్పుడిది ప్రజల రాజ్యం, సత్యయుగంలో ఒకే మతం ఉండడంతో శక్తి ఉంటుంది. ఇప్పుడు మీరు ఆ శక్తిని తీసుకుంటున్నారు, 21 జన్మలు స్వతంత్రంగా రాజ్యం చేస్తారు. తమదే అయిన దైవీ కుటుంబముంటుంది. ఇప్పుడిది మీ ఈశ్వరీయ పరివారం. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రి స్మృతిలో ఉంటారు కనుక మీరు ఈశ్వరీయ పరివారానికి చెందినవారు అని తండ్రి చెప్తున్నారు. ఒకవేళ దేహాభిమానంలోకి వచ్చి మర్చిపోతే ఆసురీ పరివారానికి చెందినవారిగా అవుతారు. ఒక్క క్షణంలోనే ఈశ్వరీయ సాంప్రదాయస్థులుగా మరియు తిరిగి ఒక్క క్షణంలోనే ఆసురీ సాంప్రదాయస్థులుగా అయిపోతారు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయడం ఎంత సహజం. కానీ పిల్లలకు శ్రమ అనిపిస్తుంది.

స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయని తండ్రి చెప్తున్నారు. దేహం ద్వారా కర్మలైతే చేయవలసిందే. దేహం లేకుండా మీరు కర్మలు చేయలేరు. కార్యవ్యవహారాలు చేస్తూ కూడా తండ్రిని స్మృతి చేసే ప్రయత్నం చేయాలి. కాని ఇక్కడైతే పని లేకపోయినా కూడా బాబాను స్మృతి చేయరు, మర్చిపోతారు. ఇందులోనే శ్రమ ఉంది. భక్తిలో రోజంతా భక్తి చేయమని ఎవ్వరూ చెప్పరు. సమయం అనుసారంగానే చేస్తారు ఉదయము, సాయంత్రము, రాత్రి. ఆ తర్వాత మంత్రాలు మొదలైనవి ఏవైతే లభిస్తాయో, అవి బుద్ధిలో ఉంటాయి. అనేక శాస్త్రాలున్నాయి. వాటిని భక్తిమార్గంలో చదువుతారు. మీరైతే పుస్తకాలు మొదలైనవేవీ చదవవలసిన అవసరం లేదు, తయారుచేయాల్సిన అవసరమూ లేదు. ఈ మురళి కూడా రిఫ్రెష్ అయ్యేందుకే ముద్రించబడుతుంది. అంతేకాని ఇతర పుస్తకాలు మొదలైనవేవీ ఉండవు. ఇవన్నీ సమాప్తమైపోతాయి. ఒక్క తండ్రిలో మాత్రమే జ్ఞానముంటుంది. ఇప్పుడు చూడండి జ్ఞాన-విజ్ఞాన భవనమని పేరు పెట్టారు, అక్కడ జ్ఞానం మరియు యోగం నేర్పిస్తున్నట్లు ఉంటుంది. అర్థం లేకుండా ఇటువంటి పేర్లు పెడతారు. జ్ఞానమంటే ఏమిటి, విజ్ఞానమంటే ఏమిటి కొంచెం కూడా తెలియదు. ఇప్పుడు మీకు జ్ఞానం మరియు విజ్ఞానం గురించి తెలుసు. యోగం ద్వారా ఆరోగ్యం లభిస్తుంది, దీనిని విజ్ఞానమని అంటారు. మరియు ఇది జ్ఞానం, ఇందులో ప్రపంచ చరిత్ర-భూగోళాల గురించి అర్థం చేయించడం జరుగుతుంది. ప్రపంచ చరిత్ర-భూగోళాలు ఎలా పునరావృతమవుతాయో తెలుసుకోవాలి. కాని ఆ చదువు హద్దుకు సంబంధించినది, ఇక్కడైతే మీకు అనంతమైన చరిత్ర-భూగోళాలు బుద్ధిలో ఉన్నాయి. మనమెలా రాజ్యాన్ని తీసుకుంటామో, ఎంత సమయం మరియు ఎప్పుడు రాజ్యం చేశామో, రాజధాని ఎలా లభించిందో - ఈ విషయాలు ఇంకెవ్వరి బుద్ధిలోకి రావు. తండ్రి నాలెడ్జ్ ఫుల్. ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుందనేది తండ్రి మాత్రమే అర్థం చేయిస్తారు. తయారై-తయారవుతున్న డ్రామా గురించి తెలియని కారణంగా మనుష్యులు - ఫలానావారు నిర్వాణం చెందారని లేక జ్యోతి జ్యోతిలో కలిసిపోయిందని అంటారు.

మనుష్యమాత్రులందరూ ఈ సృష్టి చక్రంలోకి వస్తారని, దీని నుండి ఒక్కరు కూడా ముక్తులుగా అవ్వరని ఇప్పుడు మీకు తెలుసు. మనుష్యాత్మ ఒక శరీరాన్ని విడిచి మరొకటి తీసుకుంటుంది, ఇది చాలా పెద్ద డ్రామా అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. అందరిలో ఆత్మ ఉంది, ఆ ఆత్మలో అవినాశి పాత్ర నిండి ఉంది. దీన్ని తయారై తయారవుతున్న డ్రామా...... అని అంటారు, ఇప్పుడు డ్రామా అని అన్నట్లయితే తప్పకుండా దీనికి కొంత సమయమంటూ ఉండాలి. ఈ డ్రామా 5 వేల సంవత్సరాలదని తండ్రి అర్థం చేయిస్తున్నారు. డ్రామాకు లక్షల సంవత్సరాలని భక్తిమార్గంలోని శాస్త్రాలలో వ్రాయబడి ఉంది. తండ్రి వచ్చి సహజ రాజయోగం నేర్పించిన ఈ సమయంలోనే కౌరవులు ఘోర అంధకారంలో ఉండేవారు మరియు పాండవులు ప్రకాశంలో ఉండేవారని గాయనం ఉంది. కలియుగం ఇంకా 40 వేల సంవత్సరాలు ఉందని వారు భావిస్తారు. భగవంతుడు వచ్చారని, ఈ పాత ప్రపంచపు మృత్యువు ఎదురుగా నిలబడి ఉందని వారికి తెలియదు. అందరూ అజ్ఞాన నిద్రలో నిద్రించి ఉన్నారు. యుద్ధాన్ని చూసినప్పుడు ఇది మహాభారత యుద్ధానికి చిహ్నము అని భావిస్తారు. ఈ రిహార్సల్స్ జరుగుతూ ఉంటాయి. తర్వాత నడుస్తూ-నడుస్తూ ఆగిపోతాయి. ఇప్పుడు ఇంకా మన స్థాపన పూర్తి కాలేదని మీకు తెలుసు. తండ్రి సహజ రాజయోగాన్ని నేర్పించి ఇక్కడే రాజ్య స్థాపన చేసారని గీతలో లేదు. గీతలో అయితే ప్రళయాన్ని చూపించారు. మిగిలిన అందరూ మరణించారని, కేవలం పంచ పాండవులు మాత్రమే మిగిలారని చూపించారు. వారు కూడా పర్వతాలపైకి వెళ్ళి కరిగిపోయి మరణించారని వ్రాశారు. రాజయోగం ద్వారా ఏం జరిగిందనేది కొద్దిగా కూడా తెలియదు. తండ్రి ప్రతి విషయాన్ని అర్థం చేయిస్తూ ఉంటారు. అవి హద్దులోని విషయాలు, హద్దు బ్రహ్మా హద్దు రచనను రచిస్తారు, పాలన కూడా చేస్తారు కాని ప్రళయం చేయరు. స్త్రీని దత్తత తీసుకుంటారు. తండ్రి కూడా వచ్చి దత్తత తీసుకుంటారు, నేను వీరిలో ప్రవేశించి పిల్లలకు జ్ఞానం వినిపిస్తాను, వీరి ద్వారా పిల్లలను రచిస్తాను అని తండ్రి చెప్తున్నారు. తండ్రి కూడా ఉన్నారు, పరివారం కూడా ఉంది, ఇవి చాలా గుహ్యమైన విషయాలు. చాలా గంభీరమైన విషయాలు. ఎవరి బుద్ధిలోనైనా అతికష్టంగా కూర్చుంటాయి. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, మొట్టమొదట స్వయాన్ని ఆత్మగా భావించండి, ఆత్మయే ఒక శరీరాన్ని విడిచి మరొక శరీరాన్ని తీసుకుంటుంది. శరీరానికే భిన్న-భిన్న పేర్లు పెట్టడం జరుగుతుంది. నామం, రూపం, ముఖ కవళికలు అన్నీ వేరు-వేరుగానే ఉంటాయి. ఒకరి ముఖ కవళికలు మరొకరితో కలవవు. ప్రతి ఒక్క ఆత్మకు ప్రతి జన్మలో తమ తమ రూపురేఖలు ఉంటాయి. తమ పాత్ర డ్రామాలో నిశ్చితమై ఉంటుంది, అందుకే దీన్ని తయారై తయారవుతున్న డ్రామా అని అంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయని ఇప్పుడు అనంతమైన తండ్రి చెప్తున్నారు. మరి మనమెందుకు ఆ తండ్రిని స్మృతి చేయకూడదు. ఇది శ్రమతో కూడుకున్న విషయం.

పిల్లలైన మీరు స్మృతియాత్రలో కూర్చున్నప్పుడు మాయా తుఫానులు వస్తాయి, యుద్ధం నడుస్తుంది, వాటికి భయపడకూడదు. మాయ ఘడియ-ఘడియ స్మృతి తెంచేస్తుంది. సంకల్ప-వికల్పాలు ఒక్కసారిగా తలను పాడుచేసే విధంగా వస్తాయి. మీరు శ్రమ చేయండి. ఈ లక్ష్మీ-నారాయణుల కర్మేంద్రియాలు ఎలా వశమయ్యాయి? వీరు సంపూర్ణ నిర్వికారులుగా ఉండేవారని తండ్రి అర్థం చేయించారు. ఈ శిక్షణ వీరికి ఎక్కడి నుండి లభించింది? పిల్లలైన మీకు ఇప్పుడు ఇలా తయారయ్యే శిక్షణ లభిస్తోంది. వీరిలో ఏ వికారాలూ ఉండవు. అక్కడ రావణరాజ్యమే ఉండదు. తర్వాత రావణ రాజ్యం వస్తుంది. రావణుడు అంటే ఎవరో, ఎవ్వరికీ తెలియదు. డ్రామానుసారంగా ఇది కూడా నిశ్చితమై ఉంది. డ్రామా ఆది-మధ్య-అంత్యములను గురించి తెలియదు, అందువలన నేతి-నేతి (మాకు తెలియదు-మాకు తెలియదు) అంటూ వచ్చారు. ఇప్పుడు మీరు స్వర్గవాసులుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు. ఈ లక్ష్మీ-నారాయణులు స్వర్గానికి యజమానులు కదా. వీరి ఎదుట తల వంచుకునేవారు తమోప్రధానమైన కనిష్ఠ పురుషులు. తండ్రి చెప్తున్నారు, మొట్టమొదట ఒక్క విషయాన్ని పక్కా చేసుకోండి - స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. ఇందులోనే శ్రమ ఉంది. ప్రభుత్వ ఉద్యోగం 8 గంటలు ఉంటుంది కదా. ఇప్పుడు మీరు అనంతమైన ప్రభుత్వానికి సహాయకులు. మీరు తక్కువలో తక్కువ 8 గంటలు పురుషార్థం చేసి స్మృతిలో ఉండాలి. ఈ స్థితి ఎంత పక్కా అయిపోతుందంటే ఇక మీకు ఎవ్వరి స్మృతి రాదు. తండ్రి స్మృతిలోనే శరీరాన్ని విడిచిపెడతారు. అటువంటివారే విజయమాలలో మణిగా అవుతారు. ఒక రాజుకు లెక్కలేనంతమంది ప్రజలుంటారు. ప్రజలు కూడా ఇక్కడే తయారవ్వాలి. మీరు విజయమాలలో మణులుగా పూజకు యోగ్యులుగా అవుతారు. 16,108 మాల కూడా ఉంటుంది. ఈ మాల ఒక పెద్ద బాక్సులో ఉంటుంది. 8 మణుల మాల, 108 మాల కూడా ఉంది. అంతిమంలో మళ్ళీ 16,108 మాల కూడా తయారవుతుంది. పిల్లలైన మీరే తండ్రి నుండి రాజయోగం నేర్చుకొని పూర్తి విశ్వాన్ని స్వర్గంగా తయారుచేశారు, కావున మిమ్మల్నే పూజించడం జరుగుతుంది. మీరే పూజ్యులుగా ఉండేవారు, తర్వాత పూజారులుగా అయ్యారు. నేను స్వయంగా మాలను జపించేవాడిని అని ఈ దాదా చెప్తున్నారు. లక్ష్మీ-నారాయణుల మందిరంలో అయితే రుద్రమాల ఉండాలి. మీరు మొదట రుద్రమాలకు చెందినవారిగా, తర్వాత విష్ణు మాలకు చెందినవారిగా అవుతారు. మొదటి నంబరులో రుద్రమాల ఉంటుంది, అందులో శివుడు కూడా ఉంటారు. రుండ మాలలో శివుడు ఎక్కడ నుండి వస్తారు. అది విష్ణుమాల. ఈ విషయాలు ఇతరులెవ్వరూ అర్థం చేసుకోలేరు. ఇప్పుడు మేము వెళ్ళి శివబాబా మెడలో హారంగా అవుతామని మీరు చెప్తారు. బ్రాహ్మణుల మాల తయారవ్వలేదు. బ్రాహ్మణుల మాల ఉండదు. మీరెంతగా స్మృతిలో ఉంటారో అక్కడ అంతే సమీపంలోకి వచ్చి రాజ్యం చేస్తారు. ఈ చదువు ఇంకెక్కడా లభించదు. ఇప్పుడు మనం ఈ పాత శరీరాన్ని విడిచి స్వర్గవాసులుగా అవుతామని మీకు తెలుసు. మొత్తం భారత్ స్వర్గంగా అవుతుంది. ముఖ్యంగా, భారత్ స్వర్గంగా ఉండేది. ఇది 5 వేల సంవత్సరాల విషయం, లక్షల సంవత్సరాల విషయం కాదు. దేవతలు 5 వేల సంవత్సరాల క్రితం ఉండేవారు, స్వర్గాన్ని మనుష్యులు మర్చిపోయారు. అందుకే అలా అనేస్తారు. అంతేకాని ఏమీ లేదు. ఇంత పాత శకాలు మొదలైనవి లేనే లేవు. సూర్యవంశము-చంద్రవంశము ఉండేవి, తర్వాత ఇతర ధర్మాలవారు వస్తారు. పాత వస్తువులెందుకు పనికొస్తాయి. వాటికోసం ఎంత ఖర్చు పెడతారు, పాత వస్తువులకు చాలా విలువ కడతారు. అందరికంటే విలువైనవారు శివబాబా, ఎన్ని శివలింగాలు తయారుచేస్తారు. ఆత్మ ఎంత చిన్న బిందువో, ఎవ్వరికీ అర్థం కాదు. అతి సూక్ష్మమైన రూపం. ఇంత చిన్న బిందువులో ఇంత పాత్ర రచింపబడి ఉందని తండ్రియే అర్థం చేయిస్తున్నారు. ఈ డ్రామా పునరావృతమవుతూ ఉంటుంది, ఈ జ్ఞానం అక్కడ మీకు ఉండదు. ఇది ప్రాయః లోపమైపోతుంది. తర్వాత సహజ రాజయోగాన్ని ఎవరైనా ఎలా నేర్పించగలరు. ఇవన్నీ భక్తిమార్గం కోసం కూర్చొని తయారుచేశారు. తండ్రి ద్వారా బ్రాహ్మణ, దేవత, క్షత్రియ - ఈ మూడు ధర్మాల స్థాపన భవిష్య కొత్త ప్రపంచం కోసం జరుగుతుందని ఇప్పుడు పిల్లలకు తెలుసు. మీరు ఆ చదువును ఏదైతే చదువుతున్నారో, అది కేవలం ఈ జన్మ కోసం మాత్రమే ఉన్నది. దీని ప్రారబ్ధము మీకు కొత్త ప్రపంచంలో లభిస్తుంది. ఈ చదువు సంగమయుగంలో ఉంటుంది. ఇది పురుషోత్తమ సంగమయుగం. సంగమయుగంలో మాత్రమే మనుష్యుల నుండి దేవతలుగా తయారవుతూ ఉంటారు. తండ్రి పిల్లలకు రహస్యాలన్నీ అర్థం చేయిస్తారు. రోజంతా మీరు ఈ స్మృతిలో ఉండలేరని, అది అసాధ్యమని బాబాకు కూడా తెలుసు, అందువల్లనే చార్టు పెట్టండి, మేము ఎంతవరకు స్మృతిలో ఉండగలము అని పరిశీలించుకోండి. దేహాభిమానం ఉన్నట్లయితే స్మృతిలో ఎలా ఉండగలరు! పాపాల భారం తలపై చాలా ఉంది, అందుకే స్మృతిలో ఉండమని బాబా చెప్తున్నారు. త్రిమూర్తి చిత్రాన్ని జేబులో ఉంచుకోండి, కాని మీరు ఘడియ-ఘడియ మర్చిపోతున్నారు. అల్ఫ్ (భగవంతుడు) ను స్మృతి చేసినట్లయితే బే (రాజ్యభాగ్యం) మొదలైనవన్నీ గుర్తుకొస్తాయి. సదా బ్యాడ్జ్ పెట్టుకొని ఉండాలి. లిటరేచర్ కూడా ఉండాలి, ఎవరైనా మంచి వ్యక్తిగా అనిపిస్తే వారికి ఇవ్వాలి. మంచి మనుష్యులు ఊరికే ఎప్పుడూ తీసుకోరు. దీని ఖరీదు ఎంత, చెప్పండి అని అడుగుతారు. అప్పుడు, ఇవి పేదలకైతే ఉచితంగా ఇవ్వబడతాయి, ఇక మీరెంత ఇస్తే అంత తీసుకుంటాము అని చెప్పండి. రాయల్ గా ఉండాలి. మీ ఆచార-వ్యవహారాలు ప్రపంచం నుండి పూర్తిగా అతీతంగా ఉండాలి. రాయల్ మనుష్యులు వారంతట వారే ఎంతో కొంత ఇచ్చేస్తారు. వీటిని మేము అందరి కళ్యాణం కోసం ఇస్తాము. కొంతమంది చదివి ధనం పంపుతారు. మీరు ఖర్చు అయితే పెడతారు కదా. మేము మా తనువు-మనసు-ధనములను భారత్ సేవలో ఖర్చు చేస్తాము అని చెప్పండి. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఈ అనంతమైన ప్రభుత్వానికి సహాయం చేసేందుకు తక్కువలో తక్కువ 8 గంటలు స్మృతిలో ఉండే పురుషార్థం చేయాలి. స్మృతిలో మాయ కలిగించే విఘ్నాలకు భయపడకూడదు.

2. ఈ పురుషోత్తమ సంగమయుగంలో ఈశ్వరీయ సాంప్రదాయస్థులుగా అయ్యి, ఈశ్వరుని మతమును అనుసరించాలి. కర్మలు చేస్తూ కూడా ఒక్క తండ్రి స్మృతిలో ఉండే అభ్యాసం చేయాలి.

వరదానము:-

బికారి నుండి రాకుమారుని పాత్రను ప్రాక్టికల్ గా అభినయించే త్యాగి మరియు శ్రేష్ఠ భాగ్యశాలీ ఆత్మా భవ

ఎలాగైతే భవిష్యత్తులో విశ్వమహారాజు దాతగా ఉంటారో, అలా ఇప్పటి నుండి దాతా సంస్కారాన్ని ఇమర్జ్ చేసుకోండి. ఎవరి నుండైనా ఏదైనా పరిష్కారాన్ని తీసుకుని, ఆ తర్వాత వారికి ఏదైనా పరిష్కారం ఇస్తాము అన్నది సంకల్పంలో కూడా రాకూడదు - ఇటువంటి వారినే బికారి నుండి రాకుమారుడని అంటారు. స్వయం తీసుకోవాలనే కోరిక లేనివారిగా ఉండాలి. ఈ అల్పకాలిక కోరికలు లేని బికారులుగా అవ్వాలి. ఇటువంటి బికారులే సంపన్నమూర్తులు. ఎవరైతే ఇప్పుడు బికారి నుండి రాకుమారుని పాత్రను ప్రాక్టికల్ గా అభినయిస్తారో వారిని సదా త్యాగి మరియు శ్రేష్ఠ భాగ్యశాలి అని అంటారు. త్యాగం ద్వారా సదాకాలపు భాగ్యం స్వతహాగా తయారవుతుంది.

స్లోగన్:-

సదా హర్షితంగా ఉండేందుకు సాక్షితనపు సీటుపై కూర్చొని సాక్షీదృష్టగా అయ్యి ప్రతి ఆటను చూడండి.