ఓంశాంతి. మధురాతి-మధురమైన చాలా కాలం తర్వాత కలిసిన పిల్లలు పాట విన్నారు. పిల్లలైన మీ జన్మ-జన్మాంతరాల దుఃఖాలేవైతే ఉన్నాయో అవన్నీ దూరమైపోవాలి. ఈ పాటలోని వాక్యాన్ని విన్నారు, ఇప్పుడు మన దుఃఖపు పాత్ర పూర్తైపోతుంది మరియు సుఖపు పాత్ర ప్రారంభమౌతుందని మీకు తెలుసు. ఎవరైతే పూర్తిగా తెలుసుకోలేదో వారు ఏదో ఒక విషయములో తప్పకుండా దుఃఖం చూస్తూ ఉంటారు. ఇక్కడ బాబా వద్దకు వచ్చినా కూడా ఏదో ఒక రకమైన దుఃఖము అనుభవమవుతుంది. చాలామంది పిల్లలకు కష్టము కలుగుతూ ఉండవచ్చని బాబా భావిస్తారు. తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడైతే ఒక్కోచోట జనం చాలా ఎక్కువైపోతారు, వర్షాలు పడతాయి, అప్పుడప్పుడు తుఫాన్లు వస్తాయి. సత్యమైన భక్తులెవరైతే ఉంటారో, వారైతే భగవంతుని వద్దకు వెళ్తున్నాము, ఫరవాలేదని అంటారు. అక్కడ భగవంతుడు ఉన్నారని భావిస్తూనే యాత్రలకు వెళ్తారు. మనుష్యులకు అనేకమంది భగవంతులు ఉన్నారు. కావున వారిలో బాగా దృఢ నిశ్చయంతో ఉండేవారు - ఏమి జరిగినా ఫరవాలేదు, మంచి కార్యములో సదా విఘ్నాలు కలుగుతూ ఉంటాయి, అంతమాత్రాన తిరిగి వెళ్ళిపోము కదా అని అంటారు, కొందరైతే తిరిగి వెళ్ళిపోతారు కూడా. అప్పుడప్పుడు విఘ్నాలు వస్తాయి, అప్పుడప్పుడు రావు. పిల్లలూ ఇది కూడా మీ యాత్ర అని బాబా చెప్తున్నారు. మేము అనంతమైన తండ్రి వద్దకు వెళ్తున్నాము అని మీరంటారు, ఆ తండ్రి అందరి దుఃఖమును హరించేవారని మీకు నిశ్చయం ఉంది. ఈ రోజుల్లో మధువనానికి ఎంతమంది వస్తున్నారో చూడండి, చాలా మందికి ఇబ్బంది కలుగుతుందేమో అని బాబాకు చింత ఉంటుంది. నేలపై పడుకోవలసి వస్తుంది. నేలపై పడుకోబెట్టాలని బాబా ఎప్పుడూ అనుకోరు. కాని డ్రామానుసారముగా ఎక్కువ మంది వచ్చేశారు, కల్పక్రితము కూడా జరిగింది, మళ్ళీ జరుగుతుంది, ఇందులో ఎవరూ దుఃఖపడకూడదు. చదువుకునేవారిలో కొందరు రాజులుగా అవుతారు, కొందరు మళ్ళీ సేవకులుగా కూడా అవుతారని మీకు తెలుసు. కొందరికి ఉన్నతమైన పదవి, కొందరికి తక్కువ పదవి లభిస్తుంది. తప్పకుండా సుఖము ఉంటుంది. కొందరు పిల్లలు చాలా కచ్చాగా (అపరిపక్వముగా) ఉన్నారు, కొద్దిగా కూడా సహించలేరని బాబాకు తెలుసు. వారికి కొంచెం కష్టము కలిగినా, మేము అనవసరంగా వచ్చామని లేక మమ్మల్ని బ్రాహ్మణి బలవంతంగా తీసుకొచ్చారని అంటారు. బ్రాహ్మణి మమ్మల్ని అనవసరంగా చిక్కులలో పడేసారని అనేవారు కూడా ఉంటారు. విశ్వవిద్యాలయములోకి వచ్చామని పూర్తిగా గుర్తించరు. ఈ సమయములోని చదువు ద్వారా భవిష్యత్తులో కొందరు రాజులుగా అయితే మరి కొందరు సామాన్యులుగా అయ్యేవారుంటారు. ఇక్కడి పేదలకు, ధనవంతులకు మరియు అక్కడి పేదలకు, ధనవంతులకు రాత్రికి-పగలుకు ఉన్నంత వ్యత్యాసం ఉంటుంది. ఇక్కడ ధనవంతులూ దుఃఖితులే, పేదవారు కూడా దుఃఖితులే. అక్కడ ఇరువురూ సుఖంగానే ఉంటారు. ఇదైతే పతిత వికారి ప్రపంచము. ఎవరి వద్దనైనా చాలా ధనముంటే, ఈ ధనము సంపద అంతా మట్టిలోనే కలిసిపోతుంది అని బాబా చెప్తున్నారు. ఈ శరీరము కూడా సమాప్తమైపోతుంది. ఆత్మ వెళ్ళి మట్టిలో కలవదు. బిర్లావంటి ఎంతో పెద్ద-పెద్ద ధనవంతులున్నారు, కాని ఇప్పుడు ఈ పాత ప్రపంచము పరివర్తన అవుతూ ఉందని వారికేమి తెలుసు. తెలిసి ఉంటే వెంటనే వచ్చేస్తారు. భగవంతుడు ఇక్కడకు వచ్చి ఉన్నారంటే ఇక ఎక్కడకు వెళ్తాము అని అంటారు. తండ్రి లేకుండా ఎవ్వరికీ సద్గతి లభించదు. ఒకవేళ ఎవరైనా అలిగితే సద్గతిపై అలిగారని అంటారు. ఇలా చాలా మంది అలుగుతూ ఉంటారు, కింద పడిపోతూ ఉంటారు. ఆశ్చర్యంగా వింటారు, నిశ్చయము ఏర్పరచుకుంటారు.... కొంతమందైతే ఇది తప్ప వేరే మార్గము లేదని అర్థము చేసుకుంటారు. వీరి ద్వారా మాత్రమే సుఖశాంతుల వారసత్వము లభిస్తుంది. వీరు లేకుండా సుఖశాంతులు లభించడం అసంభవము అని కూడా భావిస్తారు. ధనము ఎక్కువగా ఉన్నప్పుడు సుఖము లభిస్తుంది. ధనములోనే సుఖముంటుంది కదా. అక్కడ మూలవతనములో ఆత్మలు శాంతిగా ఉంటాయి. మాకు పాత్ర లేకపోతే మేము సదా అక్కడే ఉండేవారిమి అని అంటారు, కాని అలా అన్నంత మాత్రాన అది జరగదు. ఇది తయారై-తయారవుతున్న ఆట అని పిల్లలకు అర్థం చేయించబడింది. ఏదో ఒక సంశయంలోకి వచ్చి వదిలి వెళ్ళిపోయేవారు ఎందరో ఉన్నారు. బ్రాహ్మణిపై అలుగుతారు లేక పరస్పరములో అలిగి చదువును విడిచిపెట్టేస్తారు.
ఇప్పుడు మీరిక్కడ పుష్పాలుగా అయ్యేందుకు వచ్చారు. తప్పకుండా మనము ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతున్నామని అనుభవం చేస్తారు. తప్పకుండా పుష్పాలుగా అవ్వాలి. కొందరికి సంశయముంటుంది, ఫలానావారు ఇలా చేస్తున్నారు, వీరిలాంటివారు, కనుక మేము రాము అని అంటారు. అంతే, అలిగి వెళ్ళిపోయి ఇంట్లో కూర్చుంటారు. అందిరితో అలిగితే అలగండి కాని ఒక్క తండ్రిపై ఎప్పుడూ అలగకండి. శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి అని బాబా వార్నింగ్ ఇస్తున్నారు. గర్భములో కూడా ఏ శిక్షలైతే లభిస్తాయో, అవన్నీ సాక్షాత్కారము చేయిస్తారు. సాక్షాత్కారము చేయించకుండా శిక్షలు లభించవు. మీరు చదువుతూ-చదువుతూ పరస్పరములో కొట్లాడుకుని-గొడవపడి, అలిగి చదువును వదిలేశారు అని ఇక్కడిది కూడా సాక్షాత్కారమౌతుంది. మేము తండ్రి ద్వారా చదువుకోవాలని పిల్లలైన మీరు భావిస్తున్నారు. చదువును ఎప్పుడూ విడిచిపెట్టకూడదు. మీరిక్కడ మనుష్యుల నుండి దేవతలుగా అయ్యేందుకు చదువుతున్నారు. ఇటువంటి ఉన్నతాతి ఉన్నతమైన తండ్రిని కలిసేందుకు మీరు వస్తారు. అప్పుడప్పుడు ఎక్కువగా వచ్చేస్తారు, డ్రామానుసారముగా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. పిల్లలకు అనేక తుఫాన్లు వస్తాయి. ఫలానా వస్తువు లభించలేదు, ఇది దొరకలేదు, అది దొరకలేదు... అని అంటారు, ఇవి అసలు విషయాలే కావు. మృత్యువు సమయము వచ్చినప్పుడు అజ్ఞానులైన మనుష్యులు, మేమేం తప్పు చేశాము, అనవసరంగా కారణము లేకుండా మమ్మల్ని హతమారుస్తున్నారు అని అంటారు. ఆ అంతిమ సమయములోని పాత్రనే అనవసర రక్తసిక్తిమైన పాత్ర అని అంటారు. అకస్మాత్తుగా బాంబులు పడతాయి. ఎంతోమంది మరణిస్తారు. ఇది అనవసర రక్తపాతమే కదా. అజ్ఞాని మనుష్యులు ఆర్థనాదాలు చేస్తారు. పిల్లలైన మీరు మాత్రము చాలా సంతోషిస్తారు, ఎందుకంటే ఈ ప్రపంచము వినాశనమవ్వాల్సిందేనని మీకు తెలుసు, అనేక ధర్మాల వినాశనం అవ్వకపోతే ఒక్క సత్యధర్మ స్థాపన ఎలా జరుగుతుంది. సత్యయుగంలో ఒకే ఆది సనాతన దేవీ-దేవతా ధర్మముండేది. సత్యయుగము ఆదిలో ఏముండేదో ఎవ్వరికీ తెలియదు. ఇది పురుషోత్తమ సంగమయుగము. అందరినీ పురుషోత్తములుగా చేసేందుకే తండ్రి వచ్చారు. అందరికీ తండ్రి కదా. డ్రామా గురించి అయితే మీరు తెలుసుకున్నారు. అందరూ సత్యయుగములోకి రారు కదా. ఇంతమంది, కోట్లాది ఆత్మలు సత్యయుగములోకి రారు. ఇవన్నీ విస్తారమైన విషయాలు. ఏమీ అర్థము చేసుకోలేని పిల్లలు చాలామంది ఉన్నారు. భక్తిమార్గానికి అలవాటుపడి ఉన్నారు. జ్ఞానము బుద్ధిలో కూర్చోదు. భక్తికి అలవాటు పడ్డారు. భగవంతుడు చేయలేనిదేముంది అని అంటారు. మరణించిన వారిని కూడా బ్రతికించగలరని అంటారు. బాబా వద్దకు వస్తారు, ఫలానా వ్యక్తి అయితే మరణించిన వారిని బ్రతికించారు, మరి భగవంతుడు అది చేయలేరా అని అంటారు. ఎవరైనా మంచి పని చేస్తే చాలు వారిని మహిమ చేయడం ప్రారంభిస్తారు. తర్వాత వారికి వేలాది మంది అనుచరులు తయారవుతారు. మీ వద్దకు చాలా కొద్దిమందే వస్తారు. భగవంతుడు చదివిస్తున్నారంటే మరి ఇంత తక్కువ మంది ఎందుకున్నారు అని చాలామంది అడుగుతారు. అరే, ఇక్కడైతే మరణించాల్సి వస్తుంది. అక్కడ కేవలం కర్ణరసముంటుంది (చెవులకు ఇంపైనది). చాలా ఆర్భాటంగా కూర్చుని గీతను వినిపిస్తారు, భక్తులు వింటారు. ఇక్కడ కర్ణ రసం విషయమేమీ లేదు. ఇక్కడ కేవలం తండ్రిని స్మృతి చేయమని చెప్పడం జరుగుతుంది. గీతలో కూడా మన్మనాభవ అనే పదముంది. తండ్రిని స్మృతి చేస్తే వికర్మలు వినాశనమౌతాయి. బ్రాహ్మణిపై అలిగారు లేక సెంటరుపై అలిగారు, సరే, కనీసం ఇతర సాంగత్యాలను వదిలి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఒక్క తండ్రిని స్మృతి చేయండి. తండ్రియే పతిత-పావనుడు. కేవలం తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉండండి. కాస్త స్మృతి చేసినా కూడా స్వర్గములోకి తప్పకుండా వచ్చేస్తారు. పురుషార్థానుసారంగానే స్వర్గములో ఉన్నత పదవి లభిస్తుంది. ప్రజలను తయారుచేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఎవరిపై రాజ్యం చేస్తారు. ఎవరైతే ఎక్కువగా శ్రమ చేస్తారో, వారే ఉన్నత పదవిని పొందుతారు. ఉన్నత పదవి కోసమే ఎంతగా కష్టపడుతూ ఉంటారు. పురుషార్థము చేయకుండా ఎవ్వరూ ఉండలేరు. ఉన్నతాతి ఉన్నతమైనవారు పతిత-పావనుడైన ఒక్క తండ్రి అని పిల్లలైన మీకు తెలుసు. మనుష్యులు మహిమ చేస్తారు కానీ అర్థము తెలియదు. భారత్ ఎంతో సంపన్నంగా ఉండేది. భారత్ స్వర్గము, ప్రపంచములోని అద్భుతము. ఆ ఏడు అద్భుతాలు మాయకు సంబంధించినవి. మొత్తం డ్రామాలో ఉన్నతాతి ఉన్నతమైనది స్వర్గము, నీచాతి నీచమైనది నరకము. ఇప్పుడు మీరు తండ్రి వద్దకు వచ్చారు, మధురమైన తండ్రి ఇంత ఉన్నతాతి ఉన్నతంగా పైకి తీసుకువెళ్తారని మీకు తెలుసు. మరి వారిని ఎవరు మర్చిపోగలరు. బయట ఎక్కడకు వెళ్ళినా కేవలం ఒక్క విషయం గుర్తుంచుకోండి, తండ్రిని స్మృతి చేయండి. తండ్రే శ్రీమతమునిస్తారు - భగవానువాచ, అంతేకాని బ్రహ్మా భగవానువాచ కాదు.
పిల్లలూ, నేను మిమ్మల్ని ఇంత ధనవంతులుగా చేసి వెళ్ళాను, మరి మీ దుర్గతి ఏ విధంగా జరిగింది అని అనంతమైన తండ్రి పిల్లలను అడుగుతున్నారు. కాని ఏమీ అర్థము కానట్లు వింటూ ఉంటారు. పిల్లలకు కాస్త ఇబ్బంది కలుగుతుంది, సుఖదుఃఖాలు, నిందస్తుతి, మానావమానాలు అన్నీ సహనం చేయవలసి వస్తుంది. ఇక్కడి మనుష్యులు ఎలా ఉన్నారో చూడండి, ప్రధానమంత్రిని కూడా రాళ్ళతో కొట్టేందుకు వెనుకాడరు. స్కూలు పిల్లలలో కొత్త రక్తముంటుందని అంటారు. వారిని చాలా మహిమ చేస్తారు. వారు భవిష్యత్తు కోసం కొత్త రక్తమని భావిస్తారు. కాని ఆ విద్యార్థులే దుఃఖం కలిగించేవారిగా అవుతారు. కాలేజీలను తగులబెడ్తారు. ఒకరినొకరు తిట్టుకుంటూ ఉంటారు. ప్రపంచ పరిస్థితి ఎలా ఉందో తండ్రి అర్థం చేయిస్తున్నారు.
డ్రామాలో పాత్రధారులుగా అయ్యి కూడా డ్రామా ఆది-మధ్య-అంతాలు మరియు ముఖ్యమైన పాత్రధారులు మొదలైనవారి గురించి తెలియకపోతే వారినేమనాలి! ఉన్నతోన్నతమైనవారు ఎవరో, వారి జీవిత చరిత్ర గురించైతే తెలుసుకోవాలి కదా కాని వారి గురించి ఏమీ తెలియదు. బ్రహ్మా-విష్ణు-శంకరుల పాత్ర ఏమిటో, ధర్మస్థాపకుల పాత్ర ఏమిటో తెలియదు. మనుష్యులు అంధశ్రద్ధతో అందరినీ గురువులు అని అనేస్తారు. గురువంటే సద్గతిని కలిగించేవారు. ఇప్పుడు సర్వుల సద్గతిదాత ఒక్క పరమపిత పరమాత్మ మాత్రమే. పరమ గురువు కూడా వారే, అలాగే వారు జ్ఞానాన్ని కూడా ఇస్తారు. పిల్లలైన మిమ్మల్ని చదివిస్తారు కూడా, వారి పాత్రే అద్భుతమైనది. ధర్మాన్ని స్థాపన కూడా చేస్తారు మరియు ఇతర ధర్మాలన్నింటినీ సమాప్తము కూడా చేస్తారు. ఇతరులైతే కేవలం ధర్మస్థాపన మాత్రమే చేస్తారు, స్థాపన మరియు వినాశనము చేసేవారినే గురువు అని అంటారు కదా. నేను కాలుడికే కాలుడను అని తండ్రి చెప్తున్నారు. ఏకధర్మ స్థాపన, మిగిలిన అన్ని ధర్మాల వినాశనము జరుగుతుంది, అనగా ఈ జ్ఞాన యజ్ఞములో స్వాహా అయిపోతాయి. ఆ తర్వాత ఎలాంటి యుద్ధమూ ఉండదు, ఏ యజ్ఞమూ రచించబడదు. మీకు మొత్తం విశ్వము యొక్క ఆది-మధ్య-అంతాలు తెలుసు. మిగిలినవారంతా నేతి-నేతి అని అంటూ ఉంటారు. మీరు అలా అనరు. తండ్రి తప్ప ఇతరులెవ్వరూ అర్థము చేయించలేరు. కనుక పిల్లలైన మీకు చాలా సంతోషముండాలి, కాని మాయ ఎలా ఎదురిస్తుందంటే, దానితో స్మృతినే తొలగిపోతుంది. పిల్లలైన మీరు సుఖదుఃఖాలు, మానావమానాలు, అన్నింటినీ సహనం చేయాలి. ఇక్కడ ఎవరినీ అవమానపర్చడం జరగదు, కాని అటువంటి విషయమేదైనా ఉంటే తండ్రికి రిపోర్ట్ చేయాలి. రిపోర్ట్ చేయకపోతే చాలా పాపం అంటుకుంటుంది. తండ్రికి వినిపిస్తే వారిని వెంటనే హెచ్చరించడం జరుగుతుంది. ఈ సర్జన్ నుండి ఏదీ దాచిపెట్టకూడదు. వీరు చాలా గొప్ప సర్జన్. ఇది జ్ఞాన ఇంజెక్షన్, దీనిని అంజనము (కాటుక) అని కూడా అంటారు. అంజనాన్ని జ్ఞానాంజనము అని కూడా అంటారు. ఇందులో ఇంద్రజాలము మొదలైన విషయాలేవీ లేవు. మీకు పతితుల నుండి పావనంగా అయ్యే యుక్తిని తెలియజేసేందుకు నేను వచ్చాను, పవిత్రంగా అవ్వకపోతే ధారణ కూడా జరగదు అని తండ్రి చెప్తున్నారు. ఈ కామం కారణంగానే మళ్ళీ పాపాలు జరుగుతూ ఉంటాయి. దానిపై విజయం పొందాలి. స్వయమే వికారాల్లోకి వెళ్తూ ఉంటే ఇతరులెవ్వరికీ చెప్పలేరు. అలా చెప్తే అది మహాపాపమైపోతుంది. రామ-రామ అంటూ సముద్రాన్నే దాటవచ్చు అని చెప్పే పండితుని కథను కూడా తండ్రి వినిపిస్తారు. మనుష్యులు నీటి సాగరమని భావిస్తారు. ఎలాగైతే ఆకాశానికి అంతము తెలుసుకోలేరో అలా సాగరం యొక్క అంతాన్ని కూడా తెలుసుకోలేరు. బ్రహ్మమహాతత్వానికి కూడా అంతము లేదు. ఇక్కడ మనుష్యులు వాటి అంతాన్ని పొందేందుకు పురుషార్థము చేస్తారు, కానీ అక్కడ ఎవ్వరూ పురుషార్థము చెయ్యరు. ఇక్కడ ఎంత దూరము వెళ్ళినా మళ్ళీ తిరిగివస్తారు. పెట్రోల్ లేకపోతే ఎలా రాగలరు? ఇది సైన్సు వారి అతి అహంకారము, దానితో వినాశనము చేస్తారు. విమానాల ద్వారా సుఖమూ ఉంది, అలాగే అతి దుఃఖము కూడా ఉంది. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఏ కారణము వలన కూడా చదువును విడిచిపెట్టకూడదు. శిక్షలు అత్యంత కఠినంగా ఉంటాయి, వాటి నుండి రక్షించుకునేందుకు ఇతర సాంగత్యాలన్నీ వదిలి ఒక్క తండ్రినే స్మృతి చేయాలి, అలగకూడదు.
2. జ్ఞాన ఇంజెక్షన్ లేక అంజనాన్ని ఇచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమే, ఆ అవినాశీ సర్జన్ నుండి ఏ విషయాన్నీ దాచిపెట్టకూడదు. తండ్రికి వినిపిస్తే వెంటనే హెచ్చరిక లభిస్తుంది.