24-06-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"ఆత్మలైన మీరు స్వచ్ఛంగా అయినప్పుడే ఈ ప్రపంచము సుఖవంతంగా అవుతుంది, దుఃఖాలకు కారణం - 5 వికారాలకు వశీభూతమై చేసే కర్మలు" (మాతేశ్వరిగారి అమూల్యమైన మహావాక్యాలు)

గీతము:-

కనులు తెలుసుకోలేవు, కాని హృదయం గుర్తించగలదు..... (జానే న నజర్, పహ్ చానే జిగర్.....)

తమ అనంతమైన తండ్రి యొక్క మహిమను విన్నారు. సాధారణ మనుష్యులకు ఇటువంటి మహిమ ఉండదు. ఇది వారికి మాత్రమే ఉన్న మహిమ, వారే ఈ మహిమకు అధికారి ఎందుకంటే వారి మహిమ వారి కర్తవ్యానుసారముగా గాయనం చేయబడుతుంది. వారి కర్తవ్యము మనుష్యాత్మలందరి కర్తవ్యము కంటే మహోన్నతమైనది ఎందుకంటే వారి కర్తవ్యము మనుష్యాత్మలందరి కోసమే ఉన్నది. కనుక అందరికంటే ఉన్నతమైనవారయ్యారు కదా, ఎందుకంటే అందరి కోసం అందరి గతి సద్గతిదాత ఒక్కరే. కొందరికి మాత్రమే గతి సద్గతిని చేసారు అని అనరు. వారు సర్వుల గతి సద్గతిదాత. కనుక వారు అందరికీ అథారిటీ అయిపోయారు కదా. మామూలుగా చూసినా కూడా ఏదైనా కర్తవ్యము చేసినప్పుడే కదా వారి మహిమ జరుగుతుంది. చూడండి, ఎవరైనా ఏదైనా కాస్త అటువంటి పని చేసినట్లయితే వారికి మహిమ ఉంటుంది. కనుక తండ్రికి కూడా ఉన్నతాతి ఉన్నతమైనవారు అనే మహిమ ఉంది, అంటే వారు తప్పకుండా ఇక్కడకు వచ్చి మహోన్నతమైన కర్తవ్యాన్ని చేశారు మరియు వారు మన కోసం, మనుష్య సృష్టి కోసం మహోన్నతమైన కర్తవ్యము చేశారు ఎందుకంటే వారినే ఈ సృష్టికి హర్త-కర్త (హరించువాడు-చేసేవాడు) అని అంటారు. కనుక వారు వచ్చి మనుష్య సృష్టిని ఉన్నతంగా చేశారు. ప్రకృతి సహితంగా అన్నింటినీ పరివర్తన చేశారు. కాని ఏ యుక్తితో పరివర్తన చేశారు? వారు కూర్చొని అర్థము చేయిస్తున్నారు ఎందుకంటే మొదట మనుష్యాత్మ, ఆత్మలో పరివర్తన తీసుకొచ్చినట్లయితే, తర్వాత ఆత్మ బలముతో, తమ కర్మల బలముతో ఈ ప్రకృతి తత్వాలు మొదలైనవాటన్నింటిపై కూడా వారి బలము పని చేస్తుందని కాదు. కాని తయారుచేసేవారైతే వారే కదా, కనుక తయారుచేసేవారు వారు, కాని ఎలా తయారుచేస్తారు? ఎప్పటివరకైతే మనుష్యాత్మ ఉన్నతంగా అవ్వదో అప్పటివరకు ఆత్మ ఆధారముతో శరీరము, ప్రకృతి, తత్వాలు మొదలైనవన్నీ నంబరువారుగా అదే శక్తిలోకి వస్తాయి, దానితో మళ్ళీ మొత్తం సృష్టి సస్యశ్యామలంగా, సుఖవంతంగా అవుతుంది.

కనుక మనుష్య సృష్టి సుఖవంతంగా ఎలా తయారవుతుంది అన్నది మనుష్య సృష్టిని సుఖవంతముగా తయారుచేసే తండ్రికి తెలుసు. ఎప్పటివరకైతే ఆత్మలు స్వచ్ఛంగా అవ్వవో అప్పటివరకు ప్రపంచము సుఖవంతంగా అవ్వదు, కావున వారు వచ్చి మొట్టమొదట ఆత్మలనే స్వచ్ఛంగా తయారుచేస్తారు. ఇప్పుడు ఆత్మకు అపవిత్రత (అస్వచ్ఛత) అంటుకుని ఉంది. మొదట ఆ అపవిత్రతను తొలగించాలి. అప్పుడు ఆత్మ బలము ద్వారా ప్రతి వస్తువులోని తమోప్రధానత పరివర్తన చెంది సతోప్రధానంగా అవుతుంది, అందరూ బంగారు యుగములోకి వస్తారని దీనినే అంటారు, కనుక ఈ తత్వాలు మొదలైనవన్నీ బంగారుయుగ స్థితిలోకి వచ్చేస్తాయి. కానీ మొదట ఆత్మ యొక్క స్థితి మారుతుంది. కనుక ఆత్మలను మార్చేవారు అనగా ఆత్మలను పవిత్రంగా తయారుచేసే ఆథారిటీ వారే అవుతారు. ఇప్పుడు ప్రపంచము పరివర్తన చెందుతూ ఉందని మీరు చూస్తున్నారు కదా. మొదట స్వయాన్ని మార్చుకోవాలి, ఎప్పుడైతే మనము స్వయాన్ని మార్చుకుంటామో అప్పుడు దాని ఆధారముతో ప్రపంచము పరివర్తనవుతుంది. ఒకవేళ ఇప్పటివరకు మనలో మార్పు రాలేదంటే, స్వయాన్నే మార్చుకోలేదంటే, ఇక ప్రపంచము ఎలా మారుతుంది, కనుక ప్రతిరోజూ స్వయాన్ని చెక్ చేసుకోండి. ఉదాహరణకు లెక్కాపత్రము చూసుకునేవారు తమ ఖాతాలో ఈరోజు ఎంత జమ అయింది అని రాత్రి చూసుకుంటారు కదా. అందరూ తమ లెక్కఖాతాను పెట్టుకుంటారు. కనుక ఇక్కడ కూడా రోజంతటిలో నాకు ఎంత లాభము వచ్చింది, ఎంత నష్టపోయాను అని తమ లెక్కాపత్రం పెట్టుకోవాలి. ఒకవేళ ఎక్కువగా నష్టపోయి ఉంటే మరుసటి రోజు మళ్ళీ జాగ్రత్తపడాలి. ఈ విధంగా స్వయంపై అటెన్షన్ పెట్టుకుంటే మళ్ళీ మనము లాభంలోకి వెళ్తూ-వెళ్తూ మన పొజిషన్ ను అందుకోగలము. కనుక ఈ విధంగా చెక్ చేసుకుంటూ స్వయం మారాను అన్నది అనుభవం చేయాలి. అంతేగాని మేమైతే దేవతలుగా అవుతాము, కాని తర్వాత అవుతాము, ఇప్పుడు ఎలా ఉన్నామో అలా బాగానే ఉన్నాము..... అని అనుకోకూడదు. ఇప్పటి నుండే ఆ దేవతా సంస్కారాలను తయారుచేసుకోవాలి. ఇప్పటివరకు 5 వికారాలకు వశమై ఏ సంస్కారాలైతే నడిచాయో, ఆ వికారాల నుండి మేము దూరమౌతూ ఉన్నామా అని ఇప్పుడు చూసుకోవాలి. మాలో క్రోధము మొదలైనవి ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతున్నాయా? లోభము మరియు మోహము మొదలైన వికారీ సంస్కారాలన్నీ పరివర్తన అవుతూ ఉన్నాయా? ఒకవేళ (సంస్కారాలు) మారుతూ ఉన్నాయి, తొలగిపోతూ ఉన్నాయి అంటే మనము మారుతున్నామని భావించండి. ఒకవేళ తొలగిపోవడంలేదంటే ఇంకా మేము మారలేదు అని భావించండి. కనుక మార్పులో ఆ తేడా అనుభవమవ్వాలి, స్వయంలో మార్పు రావాలి. అంతేగాని రోజంతా వికారి ఖాతాలలోనే నడుస్తూ, మేము చాలా బాగా దాన-పుణ్యాలు చేశాము, చాలు అని అనుకోకూడదు. మన కర్మల ఖాతా ఏదైతే నడుస్తుందో, అందులో మనము జాగ్రత్తగా ఉండాలి. మనం ఏదైతే చేస్తున్నామో అందులో ఏ వికారానికైనా వశమై మన వికర్మల ఖాతానైతే తయారుచేసుకోవడం లేదు కదా? ఇందులో స్వయాన్ని స్వయం జాగ్రత్తపరుచుకోవాలి. ఈ మొత్తం లెక్కాపత్రం పెట్టుకోవాలి మరియు రాత్రి నిద్రించే ముందు, నా ఈ రోజంతా ఎలా గడిచింది అని 10-15 నిముషాలు స్వయాన్ని పరిశీలించుకోవాలి. కొంతమందైతే నోట్ చేసుకుంటారు కూడా ఎందుకంటే వెనుకటి పాపాల భారం ఏదైతే తలపై ఉందో, దానిని కూడా తొలగించుకోవాలి, అందుకొరకు తండ్రి ఆజ్ఞ - నన్ను స్మృతి చేయండి, మరి నేను ఎంత సమయం స్మృతి కోసం కేటాయించాను? ఎందుకంటే ఇలా చార్టు పెట్టుకుంటే మరుసటి రోజు జాగ్రత్తగా ఉంటారు. ఇలా జాగ్రత్త ఉంటూ-ఉంటూ జాగ్రత్త కలవారిగా అయిపోతారు, ఇక మన కర్మలు మంచివిగా ఉంటూ ఉంటాయి మరియు మళ్ళీ అటువంటి పాపం ఏదీ జరగదు. మరి పాపాల నుండే కదా రక్షించుకోవాలి.

మనల్ని ఈ వికారాలే చెడ్డవారిగా చేశాయి. వికారాల కారణంగానే మనము దుఃఖితులుగా అయ్యాము. ఇప్పుడు మనము దుఃఖము నుండి ముక్తులుగా అవ్వాలి, ఇదే ముఖ్యమైన విషయం. భక్తిలో కూడా మనము పరమాత్మను పిలుస్తాము, స్మృతి చేస్తాము. ఏ ప్రయత్నం (పురుషార్థం) చేసినా, దేనికోసం చేస్తాము? సుఖము మరియు శాంతి కోసమే చేస్తాము కదా! మరి వాటి ప్రాక్టికల్ అభ్యాసాన్ని ఇప్పుడు చేయించటం జరుగుతుంది. ఇది ప్రాక్టికల్ గా చేసే కాలేజి, ఈ అభ్యాసము చేయడంతో మనము స్వచ్ఛంగా అనగా పవిత్రంగా అవుతూ ఉంటాము. మళ్ళీ మన లక్ష్యమైన ఆది సనాతన పవిత్ర ప్రవృత్తిని మనం పొందుతాము. ఎవరైనా డాక్టరుగా అయ్యేందుకు మెడికల్ కాలేజికి వెళ్తారు, తర్వాత డాక్టరు ప్రాక్టీసు చేస్తూ డాక్టరుగా అవుతూ ఉంటారు. అలా మనము కూడా ఈ కాలేజీలో ఈ చదువు ద్వారా, ఈ అభ్యాసం ద్వారా ఈ వికారాల నుండి అనగా పాప కర్మలు చేయటం నుండి దూరమై స్వచ్ఛమైనవారిగా అవుతూ ఉంటాము. మరి స్వచ్ఛతకు వచ్చే డిగ్రీ ఏమిటి? దేవత.

ఈ దేవతలైతే గాయనం చేయబడ్డారు కదా, వారిని సర్వగుణ సంపన్నులు, 16 కళల సంపూర్ణులు, సంపూర్ణ నిర్వికారులు...... అని మహిమ చేస్తారు. మరి అలా ఎలా అవుతాము? మేమైతే అలా తయారయ్యే ఉన్నాము అని అనుకోకండి, తయారవ్వాలి. ఎందుకంటే మనమే పాడైపోయాము, మనమే బాగవ్వాలి. దేవతలకు వేరే ప్రపంచము ఉంటుందని అనుకోకండి. మనుష్యులైన మనమే దేవతలుగా అవ్వాలి. ఆ దేవతలే పడిపోయారు, ఇప్పుడు మళ్ళీ పైకెక్కాలి. కాని పైకెక్కే పద్ధతి బాబా నేర్పిస్తున్నారు. ఇప్పుడు మనము వారితో మన సంబంధాన్ని జోడించాలి. చివరకు మీరు నా వారు, ఇప్పుడు నా వారుగా అయ్యి ఎలా ఉండాలి అన్న ప్రకాశాన్ని (జ్ఞానాన్ని) ఇప్పుడు తండ్రి వచ్చి ఇచ్చారు. ఎలాగైతే లౌకికంలో తండ్రి పిల్లలకు, పిల్లలు తండ్రికి చెంది ఉంటారో, అలా మీరు తనువు, మనసు, ధనములతో నా వారిగా అయి నడవండి. ఎలా నడవాలి అన్నదానికి ఆదర్శం (ప్రమాణము) ఈ బాబా, వీరి శరీరంలోకి వస్తారు, వీరు తమ తనువు, మనసు, ధనము అంతా వారికి అర్పించి వారికి చెందినవారిగా అయి నడుస్తున్నారు. అలా ఫాలో ఫాదర్. ఇందులో ప్రశ్నించే మరియు తికమక చెందే విషయమేమి లేదు. సూటైన, స్పష్టమైన విషయం. మరిప్పుడు దానిపై నడుచుకోండి. వినటం ఎక్కువ మరియు ధారణ చేయడం తక్కువ, ఇలా ఉండకూడదు. వినటం తక్కువగా, ధారణ చేయడం ఎక్కువగా ఉండాలి. విన్నదానిని ఎలా ఆచరించాలి అన్నదానిపై పూర్తి ధ్యాస ఉంచుతూ ఉండండి. మీ అభ్యాసాన్ని పెంచుతూ ఉండండి. కేవలం వింటూనే ఉండటము, వింటూనే ఉండటము..... ఇలా కాదు. ఈ రోజు ఏదైతే విన్నారో, దానిని ఒకవేళ ఎవరైనా ఆచరణలోకి తీసుకొస్తే, చాలు, మనము ఈ రోజు నుండి అదే స్థితిలో నడుస్తాము. వికారాలకు వశమై ఎటువంటి పనినీ చేయము మరియు అటువంటి దినచర్యను తయారుచేసుకోము, మన చార్టును ఆ విధంగా పెట్టుకుంటాము. ఒకవేళ ఎవరైనా దీనిని ప్రాక్టికల్ గా అభ్యాసంలోకి తీసుకొస్తే ఇక చూడండి, అప్పుడేమైపోతుందో. కనుక ఇప్పుడేదైతే చెప్పామో, దానిని ప్రాక్టికల్ లోకి తీసుకురావాలి. ఏదైతే చెప్తారో, ఏదైతే వింటారో దానిని చేయండి, చాలు. మరో విషయమేమీ లేదు. కేవలం చేయడం పట్ల శ్రద్ధ పెట్టండి. అర్థమైందా. ఎలాగైతే బాబా మరియు దాదా, ఇద్దరి గురించి బాగా తెలుసుకున్నారు కదా, అలా ఇప్పుడు ఫాలో చేయండి. ఇలా ఫాలో చేసే సుపుత్రులైన పిల్లలు మరియు మధురాతి-మధురమైన పిల్లలు ఎవరైతే ఉంటారో, అటువంటి పిల్లలకు ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్.

రెండవ మురళి - 1957

పాట:- నా ఈ చిన్న ప్రపంచాన్ని చూడండి..... (మేరా చోటా సా దేఖో యే సంసార్ హై.....)

ఈ పాట ఏ సమయంలో గాయనం చేయబడింది, ఎందుకంటే ఈ సంగమ సమయమే మన బ్రాహ్మణ కులం యొక్క చిన్న ప్రపంచము. మన ఈ పరివారము ఎటువంటిది అన్నది, నంబరువారుగా తెలియజేస్తారు. మనము పరమపిత పరమాత్మ శివుని మనమలము, బ్రహ్మా సరస్వతులకు ముఖ సంతానము, విష్ణు, శంకరులు మన పెద్దనాన్నగార్లు మరియు మనం పరస్పరంలో సోదరీ సోదరులము. ఇదే మన చిన్న ప్రపంచం... ఇంతకుమించి మరే సంబంధాన్ని రచించ లేదు, ఈ సమయంలో కేవలం వీటినే సంబంధాలు అంటారు. మన సంబంధం ఎంత పెద్ద అథారిటీతో ఉందో చూడండి! మన తాతగారు శివుడు, వారి పేరు ఎంత గొప్పది, వారు మొత్తం మనుష్య సృష్టికి బీజరూపుడు. సర్వాత్మల కళ్యాణకారి అయిన కారణంగా వారిని హర హర భోళానాథ్ శివ మహాదేవ అని అంటారు. వారు మొత్తం సృష్టికి దుఃఖహర్త, సుఖకర్త, వారి ద్వారా మనకు సుఖము-శాంతి-పవిత్రతల పెద్ద హక్కు లభిస్తుంది, తర్వాత శాంతిలో ఎటువంటి కర్మ బంధనాల లెక్కాచారము ఉండదు. అయితే ఈ రెండు (సుఖము, శాంతి) పవిత్రత ఆధారంతోనే ఉంటాయి. ఎప్పటివరకైతే తండ్రి పాలన యొక్క పూర్తి వారసత్వాన్ని తీసుకోమో, తండ్రి నుండి సర్టిఫికెట్ లభించదో, అప్పటివరకు ఆ వారసత్వము లభించదు. బ్రహ్మాపై ఎంత పెద్ద కార్యం ఉందో చూడండి - నీచమైన 5 వికారాలతో మైలపడిన అపవిత్రమైన ఆత్మలను పుష్పాలుగా తయారుచేస్తారు, ఈ అలౌకిక కార్యానికి ప్రతిఫలంగా మళ్ళీ సత్యయుగంలో మొదటి నంబరు శ్రీకృష్ణుని పదవి లభిస్తుంది. ఇప్పుడు ఆ తండ్రితో మీ సంబంధం ఎటువంటిదో చూడండి! కనుక ఎంత నిశ్చింతగా మరియు సంతోషంగా ఉండాలి. మేము పూర్తిగా వారికి చెందినవారిగా అయ్యామా అని ఇప్పుడు ప్రతి ఒక్కరు తమ హృదయాన్ని ప్రశ్నించుకోవాలి.

పరమాత్మ తండ్రి వచ్చారు కనుక మేము వారి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి అన్నదాని గురించి ఆలోచించాలి. పూర్తిగా పురుషార్థము చేసి స్కాలర్షిప్ తీసుకోవడం విద్యార్థుల పని, కనుక మనము మొదటి నంబరు లాటరిని ఎందుకు గెలుచుకోకూడదు! వారే విజయమాలలో స్మరించబడతారు. మిగిలిన కొంతమంది ఉంటారు, వారు రెండు లడ్డూలను పట్టుకొని కూర్చుంటారు, ఇక్కడి హద్దు సుఖాన్ని తీసుకుంటాను మరియు అక్కడ వైకుంఠములోనూ ఎంతో కొంత సుఖాన్ని తీసుకుంటాను, ఇటవంటి ఆలోచనలు చేసేవారిని మధ్యమ మరియు కనిష్ఠ పురుషార్థీ అని అంటారు, వారిని సర్వోత్తమ పురుషార్థులని అనరు. తండ్రి ఇవ్వటానికి సాకులు చెప్పనప్పుడు, తీసుకునేవారు ఎందుకు చెప్తారు? అప్పుడు గురునానక్ అన్నారు, పరమాత్మ అయితే దాత, సమర్థుడు కానీ ఆత్మలకు తీసుకునేందుకు కూడా శక్తి లేదు, ఇచ్చేవారు ఇస్తారు కాని తీసుకునేవారు అలసిపోతారు (దేందా దే, లేందా థక్ పావే) అని సామెత ఉంది. మేము కూడా ఈ పదవిని పొందాలని ఎందుకు అనుకోము అని మీ మనసులో ఉండవచ్చు, కాని బాబా ఎంత కష్టపడుతున్నారో చూడండి, అయినా మాయ ఎన్నో విఘ్నాలు వేస్తుంది, ఎందుకని? ఇప్పుడు మాయా రాజ్యము సమాప్తమయ్యేది ఉంది. ఇప్పుడు మాయ మొత్తం సారమంతా తీసేసింది, అప్పుడే పరమాత్మ వస్తారు. వారిలో సారమంతా ఇమిడి ఉంది, వారి ద్వారా సర్వ సంబంధాల రసం (అనుభూతి) లభిస్తుంది, అందుకే త్వమేవ మాతాశ్చ పితా..... మొదలైన ఇటువంటి మహిమలు ఆ పరమాత్మకే గాయనం చేయబడ్డాయి, కనుక బలిహారమంతా ఇటువంటి సంబంధము ఏర్పడిన ఈ సమయానిదే.

మరి, 21 జన్మలకు సుఖము ప్రాప్తించే విధంగా పరమాత్మతో సంపూర్ణ సంబంధాన్ని జోడించాలి, ఇదే పురుషార్థం యొక్క సిద్ధి. కాని 21 జన్మలు అని వినగానే చల్లబడిపోకూడదు. 21 జన్మల కోసం ఈ సమయంలో ఇంతగా పురుషార్థము చేసినా కూడా, 21 జన్మల తర్వాత పడిపోవాల్సిందే, మరి సిద్ధి ఎలా అవుతుంది అని ఇలా ఆలోచించకూడదు. డ్రామాలో ఆత్మలకు ఎంతటి సర్వోత్తమమైన సిద్ధి నిశ్చితమై అయి ఉందో, అదైతే లభిస్తుంది కదా! తండ్రి వచ్చి మనల్ని సంపూర్ణ స్థితి వరకు చేరుస్తారు, కానీ పిల్లలైన మనము తండ్రిని మర్చిపోతాము కనుక తప్పకుండా పడిపోతాము, ఇందులో తండ్రి దోషమేమీ లేదు. ఇప్పుడు లోపం పిల్లలైన మనలోనే ఉంది, సత్యయుగం, త్రేతాయుగంలోని సుఖమంతా ఈ జన్మలో చేసే పురుషార్థముపైనే ఆధారపడి ఉంటుంది కనుక సంపూర్ణ పురుషార్థము చేసి మన సర్వోత్తమ పాత్రను ఎందుకు అభినయించకూడదు! పురుషార్థము చేసి ఆ వారసత్వమును ఎందుకు తీసుకోకూడదు. మనుష్యులు సదా సుఖము కోసమే పురుషార్థము చేస్తారు, సుఖ దుఃఖాల నుండి అతీతంగా అయ్యేందుకు ఎవ్వరూ పురుషార్థము చేయరు. వారైతే డ్రామా అంతిమంలో పరమాత్మ వచ్చి ఆత్మలందరినీ శిక్షించి, పవిత్రంగా చేసి పాత్ర నుండి ముక్తులుగా చేస్తారు అని అంటారు. ఇదైతే పరమాత్ముని కార్యము, వారు తమ నిశ్చితమైన సమయంలోనే వారికి వారే వచ్చి తెలియజేస్తారు. ఇప్పుడు ఆత్మలు మళ్ళీ పాత్రలోకి రావల్సి వస్తుంది అన్నప్పుడు సర్వోత్తమ పాత్రను ఎందుకు అభినయించకూడదు.

అచ్ఛా - మధురాతి-మధురమైన పిల్లలకు తల్లి ప్రియస్మృతులు. ఓం శాంతి.

వరదానము:-

బాబా అనే పదము యొక్క స్మృతి ద్వారా కారణాన్ని నివారణలోకి పరివర్తన చేసే సదా అచల స్థిర భవ

ఎంతటి ఆందోళనకర పరిస్థితి అయినా కూడా, బాబా అని అన్నారంటే అచలంగా అయిపోతారు. పరిస్థితుల గురించి చింతన చేస్తూ ఉంటే కష్టము అనుభవమవుతుంది. ఒకవేళ కారణానికి బదులు నివారణలోకి వెళ్ళారంటే, ఆ కారణమే నివారణగా అయిపోతుంది. ఎందుకంటే మాస్టర్ సర్వశక్తివంతులైన బ్రాహ్మణుల ముందు పరిస్థితులు చీమ సమానమైనవి కూడా కాదు. ఏమి జరిగింది, ఎందుకు జరిగింది అన్నది ఆలోచించేందుకు బదులుగా, ఏది జరిగినా, అందులో కళ్యాణము నిండి ఉంది, సేవ నిండి ఉంది..... అని భావించాలి. రూపము పరిస్థితిలా కనిపించవచ్చు కాని అందులో సేవ ఇమిడి ఉంది అన్న రూపముతో దానిని చూడండి, అప్పుడు సదా అచలంగా, స్థిరంగా ఉంటారు.

స్లోగన్:-

ఒక్క బాబా ప్రభావంలో ఉండేవారు, ఏ ఇతర ఆత్మ ప్రభావములోకి రాలేరు.