ఓంశాంతి. ఇప్పుడు తండ్రి పిల్లలకు స్వయాన్ని ఆత్మగా భావించమని ప్రతి రోజూ చెప్పవలసిన అవసరము ఉండదు. ఆత్మాభిమాని భవ! లేక దేహీ అభిమానిభవ!..... పదాలు అయితే అవే కదా. స్వయాన్ని ఆత్మగా భావించండి అని తండ్రి చెప్తున్నారు. ఆత్మలోనే 84 జన్మల పాత్ర నిండి ఉంది. ఒక శరీరాన్ని తీసుకుంటుంది, పాత్రను అభినయిస్తుంది, ఆ తర్వాత శరీరము సమాప్తమైపోతుంది. ఆత్మ అయితే అవినాశి. పిల్లలైన మీకిప్పుడే ఈ జ్ఞానము లభిస్తుంది, ఇతరులెవ్వరికీ ఈ విషయాలు తెలియవు. ప్రయత్నము చేసి ఎంత వీలైతే అంత తండ్రిని స్మృతి చేయండి అని ఇప్పుడు తండ్రి చెప్తున్నారు. వ్యాపార వ్యవహారాలలో మునిగిపోతే స్మృతి అంతగా నిలువదు, గృహస్థ వ్యవహారములో ఉంటూ కమలపుష్ప సమానంగా పవిత్రంగా అవ్వాలి. ఎంత వీలైతే అంత నన్ను స్మృతి చేయండి. అంతేకానీ మమ్మల్ని నిష్ఠలో కూర్చోపెట్టండని అనడం కాదు. నిష్ఠ అనే పదము కూడా తప్పే. వాస్తవానికిది స్మృతి. ఎక్కడ కూర్చుని ఉన్నా తండ్రిని స్మృతి చేయండి. మాయా తుఫానులు అయితే చాలా వస్తాయి. ఒకరికి ఒకటి గుర్తొస్తుంది, ఇంకొకరికి ఇంకొకటి గుర్తొస్తుంది. తుఫానులు తప్పకుండా వస్తాయి, అప్పుడు అవి రాకుండా ఉండేందుకు ఆ సమయంలో వాటిని సమాప్తం చేయాల్స ఉంటుంది. ఇక్కడ కూర్చుని ఉండగా కూడా మాయ చాలా విసిగిస్తుంది. యుద్ధమంటే ఇదే కదా. ఎంతగా తేలికగా ఉంటారో, అంతగా బంధనాలు తగ్గిపోతాయి. మొదట ఆత్మ నిర్భంధనంగా ఉంటుంది. జన్మ తీసుకున్న తర్వాత తల్లిదండ్రుల పైకి బుద్ధి వెళ్తుంది. ఆ తర్వాత భార్యను దత్తత తీసుకుంటారు. అప్పటివరకు ఎదురుగా లేనిది ఎదురుగా వస్తుంది, పిల్లలు పుట్టగానే వారి స్మృతి పెరుగుతుంది. ఇప్పుడు మీరు ఇదంతా మర్చిపోవాలి. ఒక్క తండ్రినే స్మృతి చేయాలి, ఎందుకంటే తండ్రికే మహిమ ఉంది. మీ తల్లి-తండ్రి, సర్వస్వము వారే కనుక వారినొక్కరినే స్మృతి చేయండి. వారు మీకు భవిష్యత్తు కొరకు అన్నీ కొత్తవే ఇస్తారు. నూతన సంబంధములోకి తీసుకువస్తారు. సంబంధాలైతే అక్కడ కూడా ఉంటాయి కదా. అంతేకానీ ఏదో ప్రళయం జరిగిపోతుందని కాదు. మీరు ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటారు. ఎవరైతే చాలా మంచి వారిగా ఉన్నారో, వారు తప్పకుండా ఉన్నతమైన కులంలో జన్మ తీసుకుంటారు. మీరు చదువుతున్నదే భవిష్య 21 జన్మల కొరకు. చదువు పూర్తి అవ్వగానే ప్రారబ్ధము ప్రారంభమవుతుంది. స్కూలులో చదువుకుని బదిలీ అవుతారు కదా. మీరు కూడా శాంతిధామము, సుఖధామానికి బదిలీ అవుతారు. ఈ ఛీ-ఛీ ప్రపంచము నుండి విడుదలైపోతారు. దీని పేరే నరకము. సత్యయుగాన్ని స్వర్గమని అంటారు. ఇక్కడ మనుష్యులు ఎంత గాఢాంధకారములో ఉన్నారు. మా కొరకు స్వర్గం ఇక్కడే ఉందని ధనవంతులు భావిస్తారు. స్వర్గము నూతన ప్రపంచములోనే ఉంటుంది. ఈ పాత ప్రపంచమైతే వినాశనమవ్వనున్నది. కర్మాతీత స్థితి కలవారు ధర్మరాజుపురిలో శిక్షలను ఏమీ అనుభవించరు. స్వర్గములో అయితే శిక్షలే ఉండవు. అక్కడ గర్భము కూడా మహల్లా ఉంటుంది. దుఃఖము కలిగించే మాటే ఉండదు. ఇక్కడ గర్భము జైలువంటిది. అందులో శిక్షలు అనుభవిస్తూ ఉంటారు. మీరు ఎన్నిసార్లు స్వర్గవాసులుగా అవుతారో, అది స్మృతి చేసుకున్నా మొత్తం చక్రమంతా స్మృతిలో ఉంటుంది. 'ఒక్క మాటే' లక్షల రూపాయల సమానమైనది. ఇది మర్చిపోయి దేహాభిమానములోకి రావడం వలన మాయ నష్టము కలుగజేస్తుంది. ఇందులోనే శ్రమ ఉంది. కష్టపడకుండా ఉన్నతపదవిని పొందలేరు. బాబాతో - "బాబా, మాకు చదువు రాదు, మాకేమీ తెలియదు" అని చెప్తారు. బాబా అయితే సంతోషిస్తారు ఎందుకంటే ఇక్కడ చదువుకున్నదంతా మర్చిపోవాల్సి ఉంటుంది. శరీర నిర్వహణ మొదలైనవాటి కొరకు కొంత సమయం చదువుకోవాలి. ఇవన్నీ సమాప్తమైపోతాయని తెలుసు కదా. ఎంత వీలైతే అంత తండ్రిని స్మృతి చేయాలి మరియు సంతోషంగా రొట్టె ముక్కను తినాలి. ఈ సమయంలోని పేదరికమా వాహ్! సుఖంగా రొట్టె ముక్కను తినాలి, లోభముండకూడదు. ఈ రోజుల్లో ధాన్యము ఎక్కడ దొరుకుతుంది! పంచదార మొదలైనవి కూడా రాను రాను ఇక లభించనే లభించవు. మీరు ఈశ్వరీయ సేవ చేస్తున్నారు కనుక మీకు ప్రభుత్వము ఇస్తుందని కూడా కాదు. ప్రభుత్వానికి ఏమీ తెలియదు. మేమంతా కలిసి తల్లిదండ్రుల వద్దకు వెళ్తాము, వారు పిల్లల కొరకు టోలి పంపించవలసి ఉంటుంది అని ప్రభుత్వానికి అర్థం చేయించండి అని పిల్లలకు చెప్పబడుతుంది. ఇక్కడైతే అసలు ఏమీ లేదని స్పష్టంగా చెప్పేస్తారు. విధి లేక కొద్దిగా ఇస్తారు. ఎలాగైతే షావుకార్లు ఫకీర్లకు పిడికిలి నిండా ఇస్తారు, పేదవారైతే కొద్దిగా ఇస్తారు. పంచదార మొదలైనవి రాగలవు కానీ పిల్లల యోగము తక్కువైపోతుంది. స్మృతి లేని కారణంగా, దేహాభిమానములోకి వచ్చిన కారణంగా, ఏ కార్యమూ జరగదు. ఈ పని యోగము ద్వారా జరిగినంతగా చదువు ద్వారా జరగదు. అది చాలా తక్కువగా ఉంది. మాయ స్మృతిని తొలగించేస్తుంది. శక్తివంతులను ఇంకా గట్టిగా పట్టుకుంటుంది. మంచి-మంచి ఫస్టుక్లాసు పిల్లలపై కూడా గ్రహచారము కూర్చుంటుంది. గ్రహచారము కూర్చునేందుకు ముఖ్య కారణము, యోగము తక్కువ అవ్వడమే. గ్రహచారము వలన నామ-రూపాలలో చిక్కుకొని మరణిస్తారు. ఇది చాలా పెద్ద గమ్యము. ఒకవేళ సత్యమైన లక్ష్యమును పొందాలంటే స్మృతిలో ఉండవలసి ఉంటుంది.
ధ్యానము కన్నా జ్ఞానము మంచిది, జ్ఞానము కన్నా స్మృతి మంచిది అని తండ్రి అంటారు. ధ్యానములోకి ఎక్కువగా వెళ్ళడం వలన మాయావి భూతాల ప్రవేశం జరుగుతుంది. చాలా మంది వ్యర్థంగా ధ్యానములోకి వెళ్తూ ఉంటారు. ఏమేమో చెప్తూ ఉంటారు. వాటిని నమ్మకండి. జ్ఞానమైతే బాబా మురళీలో లభిస్తూ ఉంటుంది. తండ్రి అప్రమత్తం చేస్తూ ఉంటారు. ధ్యానము ఎందుకూ పనికిరాదు. అందులో మాయ ఎంతగానో ప్రవేశిస్తూ ఉంటుంది. అహంకారము వచ్చేస్తుంది. జ్ఞానము అందరికీ లభిస్తూ ఉంటుంది. జ్ఞానము ఇచ్చేవారు శివబాబా. మమ్మాకు కూడా ఇక్కడి నుండే జ్ఞానము లభించేది కదా. వారికి కూడా మన్మనాభవ అని చెప్తారు. తండ్రిని స్మృతి చేయండి. దైవీగుణాలను ధారణ చేయండి. నేను దైవీగుణాలను ధారణ చేస్తున్నానా అని స్వయాన్ని పరిశీలించుకోవాలి. ఇక్కడే దైవీగుణాలను ధారణ చేయాలి. కొందరిని చూస్తే, ఇప్పుడు ఫస్టుక్లాస్ అయిన స్థితి ఉంటుంది, సంతోషంగా పని చేస్తారు, గంట తర్వాత క్రోధ భూతము వస్తే సమాప్తం అయిపోతారు. అయ్యో! మేము తప్పు చేశామే అని తర్వాత గుర్తుకొస్తుంది. మళ్ళీ బాగుపడతారు. గంటల గడియారంలా బాబా వద్ద చాలామంది ఉన్నారు, ఇప్పుడు చూస్తే చాలా మధురంగా ఉంటారు, ఇటువంటి పిల్లలపైనైతే బలిహారమవుతానని బాబా అంటారు. గంట తర్వాత ఏదో ఒక విషయంలో కోపగించుకుంటారు. క్రోధము వచ్చిందంటే, చేసిన సంపాదనంతా సమాప్తమైపోతుంది. ఇప్పుడిప్పుడే సంపాదన, ఇప్పుడిప్పుడే నష్టము వాటిల్లుతుంది. ఆధారమంతా స్మృతి పైనే ఉంది. జ్ఞానము చాలా సహజము. చిన్న పిల్లలు కూడా అర్థం చేయించగలరు. కాని నేను ఎవరో, ఎలా ఉన్నానో, యథార్థ రీతిగా తెలుసుకోవాలి. స్వయాన్ని ఆత్మగా భావించాలి, ఈ విధంగా చిన్న పిల్లలు స్మృతి చేయలేరు కదా. మనుష్యులు మరణించేటప్పుడు భగవంతుడిని స్మృతి చేయమని చెప్తారు. కాని యథార్థంగా తెలియనందుకు ఎవ్వరూ స్మృతి చేయలేరు. ఎవ్వరూ తిరిగి వెళ్ళలేరు. వికర్మలు కూడా వినాశనమవ్వవు. రచయిత, రచనల గురించి మాకు తెలియదని ఋషులు, మునులు తరతరాల నుండి చెప్తూ వచ్చారు. వారు ఎంతైనా సతోగుణము కలవారిగా ఉండేవారు. ఈనాటి తమోప్రధాన బుద్ధి కలవారు ఎలా తెలుసుకోగలరు. ఈ లక్ష్మీనారాయణులకు కూడా తెలియదు అని తండ్రి చెప్తున్నారు. రాజా-రాణులకే తెలియకపోతే ప్రజలు ఎలా తెలుసుకుంటారు. ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు కేవలం పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. మీలో కూడా ఎవరో కొందరికి మాత్రమే యథార్థంగా తెలుసు. "బాబా, క్షణ-క్షణము మర్చిపోతున్నాము" అని చెప్తారు. ఎక్కడకు వెళ్ళినా కేవలం తండ్రిని స్మృతి చేయండి అని తండ్రి చెప్తున్నారు. ఇది చాలా గొప్ప సంపాదన. మీరు 21 జన్మలకు నిరోగులుగా అవుతారు. ఇటువంటి తండ్రిని అంతర్ముఖులుగా అయి స్మృతి చేయాలి కదా. కాని మాయ మరిపించి తుఫానుల్లోకి తీసుకొచ్చేస్తుంది. ఇందులో అంతర్ముఖులుగా అయి విచార సాగర మథనము చేయాలి. విచార సాగర మథనము చేసే విషయము కూడా ఇప్పటిదే. ఇది పురుషోత్తములుగా అయ్యే సంగమయుగము. ఇది కూడా ఆశ్చర్యమే - ఒకే ఇంటిలో, మేము సంగమయుగవాసులము మరియు భార్య-పిల్లలు మొదలైనవారు కలియుగవాసులు అని పిల్లలైన మీరు చూసారు. ఎంత తేడా ఉంది! తండ్రి చాలా లోతైన విషయాలను అర్థం చేయిస్తున్నారు. ఇంట్లో ఉంటూ కూడా మేము పుష్పాలుగా అయ్యేందుకు పురుషార్థము చేస్తున్నామని బుద్ధిలో ఉంటుంది. ఇవి అనుభవం యొక్క విషయాలు. ప్రాక్టికల్ గా శ్రమ చేయాలి. స్మృతి చేసే శ్రమ చేయాలి. ఒకే ఇంటిలో ఒకరు హంసగా ఉంటే మరొకరు కొంగగా ఉన్నారు. కొంతమంది చాలా ఫస్టుక్లాసుగా ఉంటారు. వికారాల సంకల్పము కూడా ఎప్పుడూ రాదు. కలిసి ఉంటూ కూడా పవిత్రంగా ఉంటారు, ధైర్యము చూపిస్తారు కనుక వారికి ఎంతో ఉన్నతమైన పదవి లభిస్తుంది. ఇటువంటి పిల్లలు కూడా ఉన్నారు కదా. కొంతమంది వికారాల కొరకు ఎంతగా కొడతారు, దెబ్బలాడతారు. సంకల్పములో కూడా అపవిత్రమయ్యే ఆలోచన రాకూడదు, అటువంటి స్థితి ఉండాలి. బాబా అన్ని రకాలుగా సలహాలు ఇస్తూ ఉంటారు. శ్రీ శ్రీ మతము ద్వారా మనము శ్రీ లక్ష్మి, శ్రీ నారాయణునిగా అవుతామని మీకు తెలుసు. శ్రీ అంటేనే శ్రేష్ఠము. సత్యయుగంలో నంబరువన్ శ్రేష్ఠులుగా ఉంటారు. త్రేతా యుగములో రెండు డిగ్రీలు తగ్గిపోతాయి. ఈ జ్ఞానము పిల్లలైన మీకు ఇప్పుడే లభిస్తుంది.
ఎవరికైతే జ్ఞానరత్నాల పట్ల విలువ ఉంటుందో, ఎప్పుడూ ఆవలింతలు మొదలైనవి తీయరో, అటువంటివారే ముందు కూర్చోవాలి అన్నది ఈ ఈశ్వరీయ సభలోని నియమము. కొంతమంది పిల్లలు తండ్రి ముందు కూర్చొని కూడా ఆవలిస్తూ, కునికిపాట్లు పడుతూ ఉంటారు. అటువంటివారు వెళ్ళి వెనుక కూర్చోవాలి. ఇది పిల్లల ఈశ్వరీయ సభ. కాని చాలామంది బ్రాహ్మణీలు ఇటువంటివారిని కూడా తీసుకువస్తారు. వాస్తవానికి తండ్రి ద్వారా ధనము లభిస్తుంది. ఒక్కొక్క మహావాక్యము లక్షల రూపాయల విలువైనది. జ్ఞానము లభించేది సంగమయుగములోనే అని మీకు తెలుసు. బాబా, మేము మళ్ళీ అనంతమైన వారసత్వాన్ని తీసుకునేందుకు వచ్చామని మీరు అంటారు. మధురాతి మధురమైన పిల్లలకు బాబా అనేకసార్లు చెప్తున్నారు - ఇది ఛీ-ఛీ ప్రపంచము. దీనిపై మీకు అనంతమైన వైరాగ్యము ఉంది. ఈ ప్రపంచములో మీరు ఏమేమి చూస్తున్నారో, అవి రేపు ఉండవు అని బాబా చెప్తున్నారు. మందిరాలు మొదలైన వాటి నామ రూపాలే ఉండవు. అక్కడ స్వర్గములో ఉన్నవారికి పాత వస్తువులను చూడవలసిన అవసరముండదు. ఇక్కడైతే పాత వస్తువులకు చాలా విలువ ఉంటుంది. వాస్తవానికి ఒక్క తండ్రికి తప్ప ఏ వస్తువుకూ విలువ లేదు. నేను రాకపోతే మీరు రాజ్యాన్ని ఎలా తీసుకుంటారు అని తండ్రి అంటున్నారు. ఎవరికైతే తెలుసో, వారే వచ్చి తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటారు. అందుకే కోట్లాదిమందిలో ఏ ఒక్కరో అని అంటారు. ఏ విషయములోనూ సంశయం కలగకూడదు. భోగ్ పెట్టడము మొదలైన ఆచార-పద్ధతులు కూడా ఉన్నాయి. దీనికి జ్ఞానము మరియు యోగముతో ఏ సంబంధమూ లేదు. మీకు ఇక ఏ ఇతర విషయాలతోనూ సంబంధము లేదు. కేవలం రెండు విషయాలు - అల్ఫ్(పరమాత్మ), బే(రాజ్య వారసత్వము). అల్ఫ్ అని భగవంతుడిని అంటారు. వ్రేలి ద్వారా కూడా పైకి సూచిస్తారు కదా. ఆత్మ సూచిస్తుంది కదా. భక్తి మార్గములో మీరు నన్ను స్మృతి చేస్తారు అని తండ్రి చెప్తున్నారు. మీరందరూ నా ప్రేయసులు. బాబా కల్ప-కల్పము వచ్చి మనుష్యమాత్రులందరినీ దుఃఖము నుండి విడిపించి సుఖ-శాంతులను ఇస్తారని కూడా మీకు తెలుసు. అందుకే బాబా - అనంతమైన తండ్రి విశ్వములో శాంతిని ఎలా స్థాపిస్తున్నారో వచ్చి తెలుసుకోండి అని బోర్డుపై వ్రాయమని చెప్తుంటారు. ఒక్క క్షణములో 21 జన్మలకు విశ్వాధికారులుగా అవ్వాలంటే వచ్చి అర్థం చేసుకోండి అని వ్రాయండి. ఇంట్లో బోర్డు తగిలించండి. మూడు అడుగుల స్థలంలో మీరు అతి పెద్ద ఆసుపత్రిని, విశ్వవిద్యాలయాన్ని తెరవచ్చు. స్మృతి ద్వారా 21 జన్మలకు నిరోగులుగా అవుతారు, చదువు ద్వారా స్వర్గ రాజ్యాధికారం లభిస్తుంది. మేము స్వర్గానికి అధికారులమని ప్రజలు కూడా అంటారు. నేటి మనుష్యులకు సిగ్గు కలుగుతుంది ఎందుకంటే నరకవాసులుగా ఉన్నారు. మా తండ్రి స్వర్గస్థులయ్యారు అని అంటున్నారంటే మరి మీరు నరకవాసులనే కదా అర్థము. మరణించినప్పుడు స్వర్గములోకి వెళ్తారు. ఇది ఎంత సహజమైన విషయము! మంచి పనులు చేసేవారి గురించి విశేషంగా వీరు చాలా మహాదానులుగా ఉండేవారని చెప్తారు. వీరు స్వర్గస్థులయ్యారని చెప్తారు. కాని స్వర్గానికి ఎవ్వరూ వెళ్ళరు. నాటకము పూర్తి అయినప్పుడు అందరూ స్టేజి పైకి వచ్చి నిలబడతారు. పాత్రధారులందరూ ఇక్కడకు వచ్చేసిన తర్వాత యుద్ధము ప్రారంభమౌతుంది. మళ్ళీ తిరిగి వెళ్తారు. శివుని ఊరేగింపు అని అంటారు కదా. శివబాబాతో పాటు ఆత్మలందరూ వెళ్తారు. ఇప్పుడు 84 జన్మలు పూర్తి అయ్యాయి, ఇదే ముఖ్యమైన విషయము. సర్పము పాత కుబుసాన్ని వదిలి కొత్తది ధరించినట్లుగా మీరు ఇప్పుడు ఈ చెప్పును వదలాలి. మీరు నూతన శరీరాన్ని సత్యయుగములో తీసుకుంటారు. శ్రీ కృష్ణుడు చాలా సుందరమైనవారు. వారిలో చాలా ఆకర్షణ ఉంటుంది. వారిది ఫస్టుక్లాసు శరీరము. అటువంటి శరీరాన్ని మనము తీసుకుంటాము. మేము నారాయణుడిగా అవుతామని అంటారు కదా. ఇది కుళ్ళిపోయిన ఛీ-ఛీ శరీరము. దీనిని వదిలి మనము నూతన ప్రపంచములోకి వెళ్తాము. మేము నరుని నుండి నారాయణునిగా అవుతున్నామని అన్నప్పుడు ఆ విషయము స్మృతి చేస్తూ ఉంటే సంతోషం ఎందుకుండదు! ఈ సత్యనారాయణ కథను బాగా అర్థము చేసుకోండి. మీరు ఏది చెప్తారో, అది చేసి చూపించండి. చెప్పడం, చేయడం ఒకే విధంగా ఉండాలి. వ్యాపారాలు మొదలైనవి కూడా చేయండి. చేతులు పని వైపు, హృదయం తండ్రి స్మృతి వైపు ఉండాలి. ఎంతెంతగా ధారణ చేస్తారో, అంతంతగా మీ వద్ద జ్ఞాన విలువ పెరుగుతూ ఉంటుంది. జ్ఞాన ధారణ ద్వారా మీరు ఎంత ధనవంతులుగా అవుతారు. ఇది ఆత్మిక జ్ఞానము. మీరు ఆత్మలు. ఆత్మయే శరీరము ద్వారా మాట్లాడుతుంది. ఆత్మయే జ్ఞానాన్నిస్తుంది. ఆత్మయే ధారణ చేస్తుంది. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఈ పాత ప్రపంచపు పాత వస్తువులను చూస్తూ కూడా చూడకుండా ఉండాలి. నరుని నుండి నారాయణునిగా అయ్యేందుకు చెప్పడము, చేయడము సమానంగా తయారుచేసుకోవాలి.
2. అవినాశి జ్ఞాన రత్నాలకు విలువనివ్వాలి. ఇది చాలా గొప్ప సంపాదన, ఇందులో ఆవలింతలు లేక కునికిపాట్లు రాకూడదు. నామ-రూపాల గ్రహచారము నుండి రక్షింపబడేందుకు స్మృతిలో ఉండే పురుషార్థం చేయాలి.