04-06-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైనపిల్లలూ - ఇప్పుడు మీరు అనంతమైన పవిత్రతను ధారణ చేయాలి, అనంతమైన పవిత్రత అనగా ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ గుర్తు రాకూడదు"

ప్రశ్న:-

తండ్రి ద్వారా వారసత్వాన్ని తీసుకునే ముందు చేసిన పురుషార్థానికి మరియు తర్వాత స్థితికి తేడా ఏమిటి?

జవాబు:-

మీరు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకున్నప్పుడు దేహ సంబంధాలన్నీ వదిలి ఒక్క తండ్రినే స్మృతి చేసే పురుషార్థం చేస్తారు, వారసత్వం లభించిన తర్వాత తండ్రినే మర్చిపోతారు. ఇప్పుడు వారసత్వం తీసుకోవాలి కావున ఎవ్వరితోనూ కొత్త సంబంధాన్ని జోడించకూడదు. లేకపోతే మర్చిపోవడం కష్టమవుతుంది. అన్నిటినీ మరచి ఒక్క తండ్రినే స్మృతి చేస్తే వారసత్వం లభిస్తుంది.

గీతము:-

ఈ సమయం వెళ్ళిపోతుంది....

ఓంశాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు తండ్రి అర్థం చేయిస్తున్నారు - జ్ఞానులు, అజ్ఞానులని ఎవరెవరిని అంటారో, ఇది కేవలం బ్రాహ్మణులైన మీకు మాత్రమే తెలుసు. జ్ఞానమనగా చదువు, దీని ద్వారా మేము ఆత్మలమని, వారు పరమపిత పరమాత్మ అని మీరు తెలుసుకున్నారు. మీరు అక్కడి నుండి మధువనానికి వచ్చినప్పుడు మొదట తప్పకుండా స్వయాన్ని ఆత్మగా భావిస్తారు. మేము మా తండ్రి వద్దకు వెళ్తున్నాము. బాబా అని శివబాబానే అంటారు. శివబాబా ప్రజాపిత బ్రహ్మా తనువులో ఉన్నారు. వారు కూడా బాబా అయ్యారు. మీరు ఇంటి నుండి బయలుదేరేటప్పుడు మేము బాప్ దాదా వద్దకు వెళ్తున్నామని భావిస్తారు. మీరు ఉత్తరంలో కూడా "బాప్ దాదా" అనగా శివబాబా మరియు బ్రహ్మా దాదా అని వ్రాస్తారు. మేము బాబా వద్దకు వెళ్తున్నాము. బాబా కల్ప-కల్పం మనల్ని కలుస్తారు. బాబా మనకు అనంతమైన వారసత్వాన్ని అనంతంగా పవిత్రంగా చేసి అందిస్తారు. పవిత్రతలో హద్దు, అనంతం రెండూ ఉన్నాయి. మీరు అనంతమైన పవిత్రులుగా, సతోప్రధానంగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు. నంబరువారుగా అయితే ఉంటారు కదా! అనంతమైన పవిత్రత అనగా ఒక్క అనంతమైన తండ్రి తప్ప ఇంకెవ్వరి స్మృతి రాకుండా ఉండడం. ఆ బాబా చాలా మధురమైనవారు. ఉన్నతోన్నతమైన భగవంతుడు మరియు అనంతమైన తండ్రి. అందరికీ తండ్రి. పిల్లలైన మీరే గుర్తించారు. అనంతమైన తండ్రి సదా భారతదేశంలోనే వస్తారు. వచ్చి అనంతమైన సన్యాసం చేయిస్తారు. సన్యాసం కూడా ముఖ్యమే కదా, దానినే వైరాగ్యం అని అంటారు. తండ్రి పూర్తి పురాతన ఛీ-ఛీ ప్రపంచంపై వైరాగ్యం కలిగిస్తారు. పిల్లలూ, దీని నుండి బుద్ధియోగాన్ని తొలగించండి. దీని పేరే నరకం, దుఃఖధామం. ఎవరైనా మరణించినట్లయితే స్వర్గస్తులయ్యారు అని స్వయం కూడా అంటూ ఉంటారు అంటే నరకంలో ఉండేవారనే కదా. అలా అనడం కూడా తప్పేనని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. స్వర్గవాసులుగా అయ్యేందుకు తండ్రి సరైన విషయాన్ని చెప్తారు. పురుషార్థం ఇప్పుడే చేయవలసి వస్తుంది. స్వర్గవాసులుగా అయ్యేందుకు కూడా తండ్రి తప్ప ఇంకెవ్వరూ పురుషార్థం చేయించలేరు. 21 జన్మలకు స్వర్గవాసులుగా అయ్యేందుకు మీరిప్పుడు పురుషార్థం చేస్తున్నారు. తయారుచేసేవారు తండ్రి. వారిని హెవెన్లీ గాడ్ ఫాదర్ అని అంటారు. వారు స్వయంగా వచ్చి - పిల్లలూ, నేను మొదట మిమ్మల్ని శాంతిధామానికి తీసుకువెళ్తాను అని అంటారు. యజమాని కదా. శాంతిధామానికి వెళ్ళి, పాత్రను అభినయించేందుకు మళ్ళీ సుఖధామానికి వస్తారు. మనం శాంతిధామానికి వెళ్తే అన్ని ధర్మాలవారు శాంతిధామానికి వెళ్తారు. బుద్ధిలో ఈ డ్రామా చక్రమంతటినీ పెట్టుకోవాలి. మనమందరం శాంతిధామానికి వెళ్ళి, మళ్ళీ మనమే మొట్టమొదట వచ్చి తండ్రి నుండి వారసత్వాన్ని పొందుతాము. ఎవరి ద్వారా వారసత్వాన్ని పొందాలో వారిని తప్పకుండా స్మృతి చేయాలి. వారసత్వం లభించిన తర్వాత తండ్రి స్మృతి మర్చిపోతామని పిల్లలకు తెలుసు. వారసత్వం చాలా సహజమైన రీతిలో లభిస్తుంది. తండ్రి సన్ముఖంలో చెప్తున్నారు - మధురమైన పిల్లలూ, మీ దేహ సంబంధాలు ఏవైతే ఉన్నాయో, అన్నింటినీ మర్చిపోండి. ఇప్పుడు క్రొత్త సంబంధం ఏదీ జోడించకూడదు. ఒకవేళ ఏదైనా సంబంధం జోడించినట్లయితే మళ్ళీ వారిని మర్చిపోవలసి ఉంటుంది. కొడుకు గానీ, కూతురు గానీ జన్మిస్తే అది కూడా సమస్యే. వారి స్మృతి అదనంగా పెరిగినట్లే కదా. అందరినీ మరచి, ఒక్కరినే స్మృతి చేయాలని తండ్రి చెప్తున్నారు. వారే మనకు తల్లి-తండ్రి, టీచర్, గురువు మొదలైన సర్వసమూ, ఒకే తండ్రి పిల్లలమైన మనం సోదరీ-సోదరులము. పినతండ్రి, మామయ్య మొదలైన సంబంధాలేవీ లేవు. సోదర-సోదరీల సంబంధం కేవలం ఈ సమయంలో మాత్రమే ఉంటుంది. బ్రహ్మాకు పిల్లలు, శివబాబాకు పిల్లలే కాక మనుమలు-మనుమరాళ్ళు కూడా. ఇది నంబరువారు పురుషార్థానుసారంగా పక్కాగా బుద్ధిలో గుర్తుంటుంది కదా. పిల్లలైన మీరు నడుస్తూ-తిరుగుతూ స్వదర్శన చక్రధారులుగా అవుతారు.

పిల్లలైన మీరు ఈ సమయంలో చైతన్యమైన లైట్ హౌసులు, మీకు ఒక కంటిలో ముక్తిధామం, మరో కంటిలో జీవన్ముక్తిధామం ఉన్నాయి. ఆ లైట్ హౌస్ లు జడమైనవైతే, మీరు చైతన్యమైనవారు. మీకు జ్ఞాన నేత్రం లభించింది. మీరు జ్ఞానవంతులై అందరికీ మార్గాన్ని చూపిస్తారు. తండ్రి కూడా మిమ్మల్ని చదివిస్తున్నారు. ఇది దుఃఖధామం, ఇప్పుడు మనం సంగమంలో ఉన్నాము, మిగిలిన ప్రపంచమంతా కలియుగంలో ఉందని మీకు తెలుసు. సంగమంలో తండ్రి పిల్లలతో కూర్చొని మాట్లాడుతారు మరియు పిల్లలు మాత్రమే ఇక్కడకు వస్తారు. బాబా, ఫలానా వారిని తీసుకురావాలా? మంచివారు, గుణాలనే తీసుకుంటారు, బహుశా బాణం తగలవచ్చు - అని కొందరు వ్రాస్తారు. కళ్యాణం జరగవచ్చు అని బాబాకు కూడా దయ కలుగుతుంది. ఇది పురుషోత్తమ సంగమయుగమని పిల్లలైన మీకు తెలుసు. ఈ సమయంలోనే మీరు పురుషోత్తములుగా అవుతారు. కలియుగంలో అందరూ కనిష్ఠ పురుషులే, ఉత్తమ పురుషులైన లక్ష్మీనారాయణులకు నమస్కరిస్తారు. సత్యయుగంలో ఎవ్వరూ ఎవ్వరికీ నమస్కరించరు. ఇక్కడి విషయాలేవీ అక్కడ ఉండవు. ఇది కూడా బాబా అర్థం చేయిస్తున్నారు - మంచి రీతిలో బాబా స్మృతిలో ఉండి సేవ చేస్తే మున్ముందు మీకు సాక్షాత్కారాలు మొదలైనవి జరుగుతూ ఉంటాయి. మీరు ఎవరికీ భక్తి మొదలైనవేవీ చేయరు. మీకు తండ్రి కేవలం చదివిస్తారు. ఇంట్లో ఉంటూనే వాటంతటవే సాక్షాత్కారాలు మొదలైనవి జరుగుతూ ఉంటాయి. చాలామందికి బ్రహ్మా సాక్షాత్కారమవుతుంది. వారి సాక్షాత్కారం కొరకు ఎవ్వరూ పురుషార్థం చేయరు. అనంతమైన తండ్రి వీరి ద్వారా సాక్షాత్కారం చేయిస్తారు. భక్తిమార్గంలో ఎవరికి ఎవరిపైన ఎటువంటి భావన ఉంటుందో, అటువంటి సాక్షాత్కారం జరుగుతుంది. ఇప్పుడు మీ భావన అందరికన్నా ఉన్నతోన్నతమైన తండ్రిపైన ఉంది. కావున ఎటువంటి శ్రమా లేకుండా తండ్రి సాక్షాత్కారాలు చేయిస్తూ ఉంటారు. మొదట్లో ఎంతమంది ధ్యానములోకి వెళ్ళేవారు, తమకు తామే పరస్పరం కూర్చుని ధ్యానంలోకి వెళ్ళిపోయేవారు. ఎవరూ భక్తి చేయలేదు. పిల్లలు ఎప్పుడైనా భక్తి చేస్తారా? పదండి వైకుంఠానికి వెళదాము అనేది ఒక ఆటలా అయిపోయింది. ఒకరినొకరు చూసుకుంటూ వెళ్ళిపోయేవారు. జరిగినదంతా మళ్ళీ రిపీట్ అవుతుంది. ఈ ధర్మానికి చెందినవారము మనమే అని మీకు తెలుసు. సత్యయుగంలో మొట్టమొదట ఈ ధర్మముంది, అందులో చాలా సుఖముంది. తర్వాత నెమ్మది-నెమ్మదిగా కళలు తగ్గిపోతూ ఉంటాయి. కొత్త ఇంట్లో ఉండే సుఖం పాత ఇంట్లో ఉండదు. కొద్ది సమయం తర్వాత ఆ వైభవం తగ్గిపోతుంది. స్వర్గం మరియు నరకంలో అయితే చాలా తేడా ఉంటుంది కదా. స్వర్గమెక్కడ, ఈ నరకమెక్కడ! మీరు సంతోషంగా ఉంటారు, తండ్రి స్మృతి కూడా పక్కాగా నిలుస్తుందని మీకు తెలుసు. నేను ఆత్మను అన్నదే మర్చిపోయినప్పుడు మళ్ళీ దేహాభిమానంలోకి వచ్చేస్తారు. ఇక్కడ కూర్చున్నప్పుడు కూడా ప్రయత్నం చేసి స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి. అప్పుడు తండ్రి స్మృతి కూడా ఉంటుంది. దేహంలోకి వస్తే దేహపు సర్వ సంబంధాలు స్మృతిలోకి వస్తాయి. ఇది ఒక నియమం. నాకు ఒక్కరు తప్ప మరెవ్వరూ లేరు, బాబా, మేము మీపై బలిహారమవుతాము అని మీరు పాడుతారు కూడా. ఆ సమయం ఇదే, ఒక్కరినే స్మృతి చేయాలి. కళ్ళ ద్వారా ఎవరినైనా చూడండి, తిరగండి కానీ కేవలం ఆత్మ, తండ్రిని స్మృతి చేయాలి. శరీర నిర్వహణ కొరకు కర్మలు కూడా చేయాలి. కానీ చేతులతో పని చేస్తూ, మనస్సు తండ్రి స్మృతిలో ఉండాలి, ఆత్మ తన ప్రియుడినే స్మృతి చేయాలి. ఎవరికైనా తన స్నేహితులతో ప్రీతి ఏర్పడినట్లయితే వారి స్మృతి నిలిచిపోతుంది. తర్వాత ఆ మోహం తెంచడం చాలా కష్టమవుతుంది. బాబా, ఇది ఏమిటి అని అడుగుతారు. అరే, మీరు నామరూపాలలో ఎందుకు చిక్కుకుంటున్నారు? ఒకటి, మీరు దేహాభిమానులుగా అవుతారు మరియు రెండవది మీ పాత లెక్కాచారాలు ఏవైతే ఉన్నాయో, అవి మోసం చేస్తాయి. ఈ కళ్ళ ద్వారా ఏదైతే చూస్తున్నారో, అటు వైపు బుద్ధి వెళ్ళకూడదని తండ్రి చెప్తున్నారు. మమ్మల్ని శివబాబా చదివిస్తున్నారు అన్నది మీ బుద్ధిలో ఉండాలి. ఇక్కడ కూర్చుని కూడా తండ్రిని ఎప్పుడూ స్మృతి చేయని పిల్లలు చాలా మంది ఉన్నారు. కొందరు ఇక్కడ కూర్చుని ఉన్నా స్మృతిలో ఉండలేరు. కావున స్వయాన్ని చూసుకోండి - నేను శివబాబాను ఎంత స్మృతి చేశాను? లేకపోతే చార్టులో నష్టం కలుగుతుంది.

మధురమైన పిల్లలూ, నన్ను స్మృతి చేయండి అని భగవంతుడు చెప్తున్నారు. మీ వద్ద నోట్ చేసుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు స్మృతిలో కూర్చోండి. భోజనం చేసి అటు ఇటు తిరిగి వచ్చి 10-15 నిమిషాలు స్మృతిలో కూర్చోండి ఎందుకంటే ఇక్కడ ఎటువంటి వ్యాపార వ్యవహారాలేవీ లేవు. అయినా ఏవైతే కార్యవ్యవహారాలను వదిలి వచ్చారో, అవి కొందరి బుద్ధిలో వస్తూ ఉంటాయి. చాలా గొప్ప గమ్యం, అందుకే స్వయాన్ని పరిశీలించుకోండి అని బాబా అంటారు. ఇది మీకు చాలా అమూల్యమైన సమయం. భక్తిమార్గంలో మీరెంత సమయాన్ని వ్యర్థం చేశారు. రోజు రోజుకూ దిగజారుతూనే ఉంటారు. కృష్ణుని సాక్షాత్కారమైతే చాలా సంతోషం కలుగుతుంది. కాని ఏమీ లభించదు. తండ్రి వారసత్వమైతే ఒక్కసారి మాత్రమే లభిస్తుంది, ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - నా స్మృతిలో ఉంటే జన్మ జన్మాంతరాల పాపం తొలగిపోతుంది. ఏ పిల్లలైతే స్మృతిలో ఉంటూ వికర్మలను వినాశనం చేసుకుని, కర్మాతీత స్థితిని పొందుతారో వారికే స్వర్గానికి పాస్ పోర్టు లభిస్తుంది. లేకపోతే చాలా శిక్షలు అనుభవించవలసి వస్తుంది. తమ కిరీటం మరియు సింహాసనం యొక్క ఫోటోను మీ జేబులో పెట్టుకున్నట్లయితే స్మృతి ఉంటుందని బాబా ఈ సలహా కూడా ఇస్తున్నారు. దీని ద్వారా మనమిలా తయారవుతాము. ఎంతగా చూస్తారో అంతగా స్మృతి చేస్తారు. తర్వాత దానిపైనే మోహం కలుగుతుంది. మేమిలా నరుని నుండి నారాయణుడిగా తయారవుతున్నాము అని చిత్రాన్ని చూస్తూ ఎంతో సంతోషం కలుగుతుంది. శివబాబా గుర్తుకువస్తారు. ఇవన్నీ పురుషార్థం చేసేందుకు యుక్తులు. సత్యనారాయణ కథ వినడం వల్ల ఏమవుతుంది అని ఎవరినైనా అడగండి. మా బాబా మాకు సత్యనారాయణ కథను వినిపిస్తున్నారు. 84 జన్మలను ఎలా తీసుకున్నారు, దీనికి లెక్క కూడా కావాలి కదా. అందరూ 84 జన్మలు తీసుకోరు. ప్రపంచానికి ఏమీ తెలియదు. కేవలం నోటి ద్వారా అంటూ ఉంటారు - దీనినే థియరీ అని అంటారు. కాని ఇక్కడ మీదంతా ప్రాక్టికల్ గా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏవైతే జరుగుతున్నాయో, అవే మళ్ళీ భక్తిమార్గంలో పుస్తకాలు... మొదలైనవిగా తయారవుతాయి. మీరు స్వదర్శన చక్రధారులుగా అయి విష్ణుపురిలోకి వస్తారు. ఇది కొత్త విషయం. రావణరాజ్యం అసత్య ఖండం, తర్వాత సత్యఖండంగా రామరాజ్యం అవుతుంది. చిత్రాల్లో చాలా స్పష్టంగా ఉంది. ఇప్పుడీ పాత ప్రపంచం అంతమవుతుంది, 5 వేల సంవత్సరాల క్రితం కూడా వినాశనమైంది. వైజ్ఞానికులు మొదలైన వారికంతా మమ్మల్ని ఎవరో ప్రేరేపిస్తున్నారు, అందుకే మేమిదంతా చేస్తూ ఉన్నాము అనిపిస్తుంది. మేము ఇవి తయారుచేస్తే వీటిద్వారా అందరూ అంతమైపోతారు అని కూడా భావిస్తారు. కాని పరవశులుగా ఉన్నారు, భయం అనిపిస్తూ ఉంది. ఇంట్లో కూర్చుని ఒక్క బాంబు వేస్తే అంతా సమాప్తమైపోతుందని తెలుసు. విమానాలు, పెట్రోలు మొదలైనవాటి అవసరం కూడా ఉండదు. వినాశనమైతే తప్పకుండా జరగవలసిందే. కొత్త ప్రపంచంగా సత్యయుగం ఉండేది, క్రీస్తు పూర్వం 3 వేల సంవత్సరాల క్రితం స్వర్గముండేది, ఇప్పుడు మళ్ళీ స్వర్గ స్థాపన జరుగుతోంది. స్థాపన తప్పకుండా జరగవలసిందేనని ముందు ముందు మీరు అర్థం చేసుకుంటారు. ఇందులో కొద్దిగా కూడా సంశయం లేదు.

కల్పక్రితం వలె ఈ డ్రామా తిరుగుతూనే ఉంటుంది. డ్రామా తప్పకుండా పురుషార్థం చేయిస్తుంది. డ్రామాలో ఏది ఉంటే అదే అవుతుంది... అని కూడా కాదు. పురుషార్థం గొప్పదా లేక ప్రారబ్ధం గొప్పదా అని అడుగుతారు. పురుషార్థమే గొప్పది ఎందుకంటే పురుషార్థం ద్వారానే ప్రారబ్ధం తయారవుతుంది. పురుషార్థం చేయకుండా ఎప్పుడూ ఎవ్వరూ ఉండలేరు. మీరు పురుషార్థం చేస్తున్నారు కదా. ఎక్కడెక్కడి నుండో పిల్లలు వస్తారు, పురుషార్థం చేస్తారు. బాబా మేము మర్చిపోతామని అంటారు. అరే, నన్ను స్మృతి చేయండి అని శివబాబా చెప్తున్నారు, ఎవరికి చెప్పారు? ఆత్మనైన నాకు చెప్పారు. తండ్రి ఆత్మలతోనే మాట్లాడుతారు. శివబాబాయే పతితపావనుడు. ఈ ఆత్మ కూడా వీరి నుండే వింటుంది. అనంతమైన తండ్రి మమ్మల్ని విశ్వాధికారులుగా తయారుచేస్తున్నారని పిల్లలకు నిశ్చయముండాలి. వారు ఉన్నతాతి-ఉన్నతమైన, ప్రియాతి-ప్రియమైన తండ్రి. భక్తిమార్గంలో వారినే స్మృతి చేసేవారు, మీ గతి, మతి అతీతమైనవి అని కూడా పాడేవారు. అంటే తప్పకుండా మతమును ఇచ్చి ఉంటారు. ఇంతమంది మనుష్యమాత్రులందరూ తిరగి ఇంటికి వెళ్ళిపోతారు అని ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. ఎంతమంది ఆత్మలున్నారో ఆలోచించండి, అందరి వంశ వృక్షం ఉంది. మళ్ళీ ఆత్మలందరూ నంబరువారుగా వెళ్ళి కూర్చుంటారు. క్లాసు ట్రాన్స్ఫర్ అయితే నంబరువారుగా వెళ్ళి కూర్చుంటారు కదా. మీరు కూడా నంబరువారుగా వెళ్తారు. చిన్న బిందువు అయిన ఆత్మ నంబరువారుగా వెళ్ళి కూర్చుంటుంది, తర్వాత నంబరువారుగా పాత్రలోకి వస్తుంది. ఇది రుద్రమాల. నా మాల ఇన్ని కోట్ల ఆత్మలదని తండ్రి చెప్తున్నారు. పుష్పమైన నేను పైన ఉంటాను, తర్వాత పాత్రను అభినయించేందుకు అందరూ ఇక్కడకే వస్తారు. ఈ డ్రామా తయారై ఉంది. ఇది తయారై తయారవుతూ ఉన్న డ్రామా అని కూడా అంటారు. ఈ డ్రామా ఎలా నడుస్తుందో మీకు తెలుసు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనమవుతాయని అందరికీ చెప్పండి, తర్వాత మీరు వెళ్ళిపోతారు. ఇందులోనే శ్రమించాలి. అందరికీ మార్గాన్ని తెలియజేయడం మీ కర్తవ్యం. మీరు ఏ దేహధారిలోనూ చిక్కుకునేలా చేయరు. మీరు నన్ను స్మృతి చేస్తే మీ పాపాలు భస్మమవుతాయని తండ్రి చెప్తున్నారు. తండ్రి ఏ డైరెక్షన్ అయితే ఇస్తారో, దానిని చేయవలసి ఉంటుంది, ఇందులో అడగవలసినది ఏముంది. ఎలాగైనాసరే స్మృతి తప్పకుండా చేయాలి. ఇందులో బాబా ఏం కృప చూపిస్తారు! స్మృతి మీరే చేయాలి, వారసత్వం మీరే తీసుకోవాలి. తండ్రి స్వర్గ రచయిత కావున స్వర్గ వారసత్వం తప్పకుండా లభిస్తుంది. ఈ వృక్షం ఇప్పుడు పాతదవ్వడం వలన ఈ పాత ప్రపంచంపై వైరాగ్యముందని మీకు తెలుసు. దీనిని అనంతమైన వైరాగ్యమని అంటారు. ఆ హఠయోగులది హద్దు వైరాగ్యం. వారు అనంతమైన వైరాగ్యాన్ని నేర్పించలేరు. అనంతమైన వైరాగ్యం కలిగిన వారు హద్దు వైరాగ్యాన్ని ఎలా నేర్పిస్తారు. చాలా కాలం తర్వాత కలిసిన పిల్లలూ అని ఇప్పుడు తండ్రి అంటారు, మీరు కూడా చాలా కాలం తర్వాత కలిసిన తండ్రి అని అంటారు. 63 జన్మలు తండ్రిని స్మృతి చేశారు, ఇక చాలు, మాకు ఒక తండ్రి తప్ప మరెవ్వరూ లేరు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. స్వర్గంలోకి వెళ్ళే పాస్ పోర్టును తీసుకునేందుకు తండ్రి స్మృతి ద్వారా మీ వికర్మలను వినాశనం చేసుకుని కర్మాతీత స్థితిని తయారుచేసుకోవాలి. శిక్షల నుండి రక్షించుకునే పురుషార్థం చేయాలి.

2. జ్ఞానవంతులై అందరికీ మార్గాన్ని చూపించాలి, చైతన్యమైన లైట్ హౌస్ లుగా అవ్వాలి. ఒక కంటిలో శాంతిధామం, మరో కంటిలో సుఖధామం ఉండాలి. ఈ దుఃఖధామాన్ని మర్చిపోవాలి.

వరదానము:-

తమ డబల్ లైట్ స్వరూపం ద్వారా వచ్చే విఘ్నాలను దాటే తీవ్ర పురుషార్థీ భవ

రాబోయే విఘ్నాలలో అలసిపోయేందుకు లేక వ్యాకులపడేందుకు బదులుగా సెకండులో స్వయం యొక్క ఆత్మిక జ్యోతి స్వరూపం మరియు నిమిత్త భావం యొక్క డబల్ లైట్ స్వరూపం ద్వారా సెకండ్ లో హైజంప్ చేయండి. విఘ్నమనే రాయిని పగులగొట్టడంలో సమయాన్ని పోగొట్టుకోకండి. జంప్ చేసి సెకండులో దాటివేయండి. కాస్త విస్మృతి కారణంగా సహజ మార్గాన్ని కష్టంగా చేసుకోకండి. తమ జీవితం యొక్క భవిష్య శ్రేష్ఠమైన గమ్యాన్ని స్పష్టంగా చూస్తూ తీవ్రపురుషార్థులుగా అవ్వండి. బాప్ దాదా మరియు విశ్వం మిమ్మల్ని ఏ దృష్టితో చూస్తున్నారో, అదే శ్రేష్ఠ స్వరూపంలో సదా స్థితులై ఉండండి.

స్లోగన్:-

సదా సంతోషంగా ఉండడం మరియు సంతోషాన్ని పంచడం - ఇదే అన్నిటికంటే గొప్ప గౌరవం.