01-06-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైన పిల్లలూ - జీవించి ఉన్నంతవరకు చదువుకోవాలి మరియు చదివించాలి, సంతోషం మరియు పదవికి ఆధారం చదువు”

ప్రశ్న:-

సేవలో సఫలత పొందేందుకు ఏ ముఖ్యమైన గుణం అవసరము?

జవాబు:-

సహనశీలత. ప్రతి విషయంలో సహనశీలురై పరస్పరంలో సంగఠనను తయారుచేసుకొని సేవ చేయండి. ఉపన్యాసం మొదలైన ప్రోగ్రాంలకు అనుమతి తీసుకురండి. మనుష్యులను నిద్ర నుండి మేల్కొల్పేందుకు అనేక ఏర్పాట్లు వెలువడుతాయి. భాగ్యశాలిగా అయ్యేవారు ఎవరైతే ఉంటారో, వారు చదువును కూడా ఆసక్తిగా చదువుకుంటారు.

గీతము:-

మనం ఆ మార్గంలో నడవాలి..... (హమే ఉన్ రాహోం పర్ చల్ నా హై.....)

ఓంశాంతి. పిల్లలైన మీరు ఇక్కడ మధుబన్ కు ఏ ఆలోచనతో వస్తారు! ఏ చదువు చదువుకునేందుకు వస్తారు? ఎవరి వద్దకు వస్తారు? (బాప్ దాదా వద్దకు) ఇది కొత్త విషయం. బాప్ దాదా వద్దకు చదువుకునేందుకు వెళ్తున్నామని, అది కూడా బాప్ దాదా ఇద్దరూ ఒక్కటిగా ఉన్నారని, ఇలా ఎప్పుడైనా విన్నారా. ఇది అద్భుతం కదా. మీరు అద్భుతమైన తండ్రికి సంతానం. పిల్లలైన మీకు కూడా ఇంతకుముందు రచయిత, రచనల ఆదిమధ్యాంతములు తెలియవు. ఇప్పుడు ఆ రచయిత మరియు రచనలను మీరు నంబరువారు పురుషార్థానుసారంగా తెలుసుకున్నారు. ఎంతగా తెలుసుకున్నారో మరియు ఎంతగా ఇతరులకు అర్థంచేయిస్తారో అంతగా సంతోషం కలుగుతుంది మరియు భవిష్యత్తులో పదవి లభిస్తుంది. ఇప్పుడు మనం రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతములను తెలుసుకున్నాము, ఇదే ముఖ్యమైన విషయం. కేవలం బ్రాహ్మణ-బ్రాహ్మణీలైన మనమే తెలుసుకున్నాము. ఎప్పటివరకూ జీవించి ఉంటామో, అప్పటివరకు మేము బి.కె.లము మరియు శివబాబా నుండి మొత్తం విశ్వం యొక్క వారసత్వాన్ని తీసుకుంటున్నామని స్వయం నిశ్చయం ఏర్పరుచుకోవాలి. పూర్తిగా చదువుతారో లేక తక్కువ చదువుతారో, అది వేరే విషయం, కానీ తెలుసుకున్నారు కదా. మనం వారి పిల్లలము, తర్వాత చదవడం లేదా చదవకపోవడం అనే ప్రశ్న తలెత్తుతుంది. దాని అనుసారంగానే పదవి లభిస్తుంది. ఒడిలోకి వచ్చారంటే మేము రాజ్యానికి హక్కుదారులుగా అవ్వాలనే నిశ్చయమేర్పడుతుంది. తర్వాత చదువులో కూడా రాత్రికీ పగలుకు ఉన్నంత తేడా ఏర్పడుతుంది. కొంతమంది బాగా చదువుతారు మరియు చదివిస్తారు, ఇది తప్ప ఇంకేమీ తోచదు. కేవలం చదవడం మరియు చదివించడం, ఇది అంతిమం వరకు కొనసాగాలి. విద్యార్థి జీవితంలో చదువు అంతిమం వరకు కొనసాగదు, దానికి సమయ పరిమితి ఉంటుంది. కానీ మీరు ఎప్పటివరకైతే జీవించి ఉంటారో అప్పటివరకు చదవాలి మరియు చదివించాలి. రచయిత అయిన తండ్రి పరిచయాన్ని ఎంతమందికి ఇచ్చాను అని స్వయాన్ని ప్రశ్నించుకోవాలి. మనుష్యులైతే మనుష్యులే కదా, చూడడానికి తేడా ఏమీ ఉండదు. శరీరంలో తేడా ఉండదు. లోపల బుద్ధిలో ఈ చదువు ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. ఎవరు ఎంతగా చదువుతారో, అంతగా వారికి సంతోషం కూడా ఉంటుంది. మేము కొత్త విశ్వానికి యజమానులుగా అవుతామని లోపల ఉంటుంది. ఇప్పుడు మనం స్వర్గ ద్వారంలోకి వెళ్తాము. నాలో ఎంత మార్పు వచ్చింది అని మీ హృదయాన్ని సదా ప్రశ్నించుకుంటూ ఉండండి. తండ్రి మనల్ని తమవారిగా చేసుకున్నారు, మనం ఎలా ఉన్నవారము ఎలా అయిపోతాము, అంతా చదువుపైనే ఆధారపడి ఉంటుంది. చదువు ద్వారా మనుష్యులు ఎంత ఉన్నతంగా అవుతారు. అవన్నీ అల్పకాలిక క్షణభంగురమైన పదవులు. అందులో ఏమీ లేదు. అవి ఎందుకూ పనికిరానివి. లక్షణాలేవీ ఉండవు. ఇప్పుడు ఈ చదువు ద్వారా ఎంత ఉన్నతంగా అవుతున్నారు. చదువుపైనే పూర్తి అటెన్షన్ పెట్టాలి. ఎవరి భాగ్యంలోనైతే ఉంటుందో వారి మనసు చదువుపైనే ఉంటుంది. ఇతరులను కూడా చదివించేందుకు వారిచేత రకరకాల పద్ధతులలో పురుషార్థం చేయిస్తూ ఉంటారు. వారిని చదివించి వైకుంఠానికి యజమానులుగా తయారుచేయాలని అనిపిస్తుంది. మనుష్యులను నిద్ర నుండి మేల్కొల్పేందుకు ఎంతగా తల బాదుకుంటున్నారు (కష్టపడుతున్నారు) మరియు ఇంకా కష్టపడుతూనే ఉంటారు. ఈ ప్రదర్శిని మొదలైనవాటిలో ఏమీ లేదు, మున్ముందు అర్థం చేయించేందుకు ఇంకా ఏర్పాట్లు జరుగుతాయి. ఇప్పుడు తండ్రి పావనంగా తయారుచేస్తున్నారు కనుక తండ్రి ఇచ్చే శిక్షణలపై అటెన్షన్ పెట్టాలి. ప్రతి విషయంలోనూ సహనశీలురుగా కూడా అవ్వాలి. పరస్పరం కలిసి సంగఠన ఏర్పరుచుకొని ఉపన్యాసాలు మొదలైన ప్రోగ్రాంలు ఏర్పాటు చేసుకోవాలి. ఒక్క అల్ఫ్ (బాబా) పై కూడా మనం చాలా బాగా అర్థం చేయించవచ్చు. ఉన్నతాతి ఉన్నతమైన భగవంతుడు ఎవరు? ఒక్క అల్ఫ్ గురించి మీరు రెండు గంటలు ఉపన్యాసం చేయవచ్చు. అల్ఫ్ ను స్మృతి చేయడంతో సంతోషం కలుగుతుందని కూడా మీకు తెలుసు. ఒకవేళ పిల్లలకు స్మృతియాత్ర పై అటెన్షన్ తక్కువగా ఉంటే, అల్ఫ్ ను స్మృతి చేయకపోతే, తప్పకుండా నష్టం జరుగుతుంది. మొత్తం ఆధారమంతా స్మృతి పైనే ఉంది. స్మృతి చేయడం ద్వారా పూర్తిగా స్వర్గానికి వెళ్ళిపోతారు. స్మృతిని మర్చిపోవడం ద్వారానే కింద పడిపోతారు. ఈ విషయాలు ఇతరులెవ్వరూ అర్థం చేసుకోలేరు. శివబాబా గురించే తెలియదు. ఎవరు ఎంత ఆడంబరంగా పూజ చేసినా, స్మృతి చేసినా, వారు అర్థం చేసుకోరు.

మీకు బాబా నుండి చాలా గొప్ప జాగీరు లభిస్తుంది. భక్తిమార్గంలో కృష్ణుని సాక్షాత్కారం చేసుకునేందుకు ఎంత తల బాదుకుంటారు (కష్టపడతారు), అచ్ఛా, దర్శనమయిందనుకోండి, తర్వాత ఏమిటి? లాభమైతే ఏమీ లేదు కదా. ప్రపంచం ఏ విషయాల ఆధారంగా నడుస్తుందో చూడండి. మీరు చెరుకు రసం తాగుతుంటే మిగిలిన మనుష్యులందరూ చెరుకు పిప్పిని చప్పరిస్తున్నారు. మీరిప్పుడు రసం తాగి కడుపు నింపుకొని అర్థకల్పం సుఖం పొందుతారు, మిగిలిన వారందరూ భక్తిమార్గంలోని పిప్పిని చప్పరిస్తూ కిందకి దిగుతూ వస్తారు. ఇప్పుడు తండ్రి ఎంత ప్రేమగా పురుషార్థం చేయిస్తున్నారు. కాని అదృష్టంలో లేకపోతే అటెన్షన్ పెట్టరు. స్వయమూ అటెన్షన్ పెట్టరు, ఇతరులను అటెన్షన్ పెట్టనివ్వరు. అమృతాన్ని స్వయమూ తాగరు, ఇతరులను తాగనివ్వరు. చాలామంది ద్వారా ఈ విధమైన నడవడిక జరుగుతూ ఉంటుంది. ఒకవేళ పూర్తిగా చదువుకోకపోతే, దయాహృదయులుగా అవ్వకపోతే, ఎవరి కళ్యాణమూ చేయకపోతే, వారేం పదవి పొందుతారు! చదువుతూ, చదివించేవారు ఎంతటి ఉన్నత పదవిని పొందుతారు. చదువుకోకపోతే ఏ పదవి పొందుతారు - ఆ ఫలితం కూడా మున్ముందు తెలిసిపోతుంది. అప్పుడు, బాబా మాకు ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చేవారు అని అనుకుంటారు. ఇక్కడ కూర్చొని ఉన్నారు, బుద్ధిలో మేము అనంతమైన తండ్రి వద్ద కూర్చున్నామని ఉండాలి. వారు పై నుండి వచ్చి ఈ శరీరం ద్వారా కల్పక్రితం వలె చదివిస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ మనం తండ్రి ఎదురుగా కూర్చున్నాము. మనం వారితోనే నడవాలి. విడిచిపెట్టి వెళ్ళకూడదు. తండ్రి మనల్ని తమతోపాటు తీసుకువెళ్తారు. ఈ పాత ప్రపంచం వినాశనమైపోతుంది. ఈ విషయాలు ఇతరులెవ్వరికీ తెలియవు. మున్ముందు పాత ప్రపంచం తప్పకుండా సమాప్తమైపోతుందని తెలుసుకుంటారు. ఏమీ లభించదు. ఈ విషయాలు ఇతరులెవ్వరికీ తెలియవు. టూ-లేట్ అయిపోతారు. లెక్కాచారమంతా సమాప్తం చేసుకొని అందరూ తిరిగి వెళ్ళాలి. ఇది కూడా తెలివైన పిల్లలకే తెలుసు. ఎవరైతే సేవలో తత్పరులై ఉంటారో, తల్లి-తండ్రులను అనుసరిస్తారో వారే నిజమైన పిల్లలు. ఎలా అయితే తండ్రి ఆత్మిక సేవ చేస్తారో అలాగే మీరు చేయాలి. బాబా ఏ పిల్లలను మహిమ చేస్తారో, వారి వలె తయారవ్వాలనే చింత కొంతమంది పిల్లలకు ఉంటుంది. టీచరైతే అందరికీ లభిస్తారు. ఇక్కడకు కూడా అందరూ వస్తారు. ఇక్కడైతే పెద్ద టీచరు కూర్చొని ఉన్నారు. తండ్రిని స్మృతే చేయకపోతే ఎలా పరివర్తన చెందుతారు. జ్ఞానమైతే చాలా సహజం. 84 జన్మల చక్రం ఎంత సహజం. కాని ఎంతగా తల బాదుకోవలసి వస్తుంది (కష్టపడవలసి వస్తుంది). తండ్రి ఎంత సహజమైన విషయాలను అర్థం చేయిస్తారు. తండ్రిని మరియు 84 జన్మల చక్రాన్ని స్మృతి చేస్తే నావ తీరానికి చేరుకుంటుంది. ఈ సందేశం అందరికీ ఇవ్వండి. ఎంతవరకు సందేశకునిగా అయ్యాను అని తమ మనసును ప్రశ్నించుకోండి. ఎంతగా అనేకులను మేల్కొల్పుతారో అంతగా బహుమతి లభిస్తుంది, ఒకవేళ ఇతరులను మేల్కొల్పకపోతే తప్పకుండా ఎక్కడో నిద్రిస్తూ ఉన్నాను, అప్పుడు ఇంత ఉన్నత పదవి అయితే లభించదు. సాయంత్రంవేళ మీ రోజంతటి లెక్కాచారం చూసుకోండి అని బాబా ప్రతిరోజు చెప్తారు. సేవ కూడా చేయాలి. ముఖ్యమైన విషయం తండ్రి పరిచయమివ్వడం. తండ్రియే భారత్ ను స్వర్గంగా తయారుచేశారు. ఇప్పుడు నరకం మళ్ళీ స్వర్గంగా అవుతుంది. చక్రమైతే తిరగాల్సిందే. తమోప్రధానం నుండి సతోప్రధానంగా అవ్వాల్సిందే. తండ్రిని స్మృతి చేస్తే వికారాలు తొలగిపోతాయి. సత్యయుగంలో చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. మళ్ళీ రావణ రాజ్యంలో ఎంతగా వృద్ధి జరుగుతుంది. సత్యయుగంలో 9 లక్షల మంది ఉంటారు, తర్వాత నెమ్మది-నెమ్మదిగా వృద్ధి చెందుతారు. మొదట పావనంగా ఉన్నవారే తర్వాత పతితంగా అవుతారు. సత్యయుగంలో దేవతల పవిత్ర ప్రవృత్తి మార్గముండేది. వారే తర్వాత అపవిత్ర ప్రవృత్తి మార్గం కలవారిగా అయ్యారు. డ్రామానుసారంగా ఈ చక్రం తిరగాల్సిందే. ఇప్పుడు మళ్ళీ మీరు పవిత్ర ప్రవృత్తి మార్గానికి చెందినవారిగా అవుతున్నారు. తండ్రియే వచ్చి పవిత్రంగా తయారుచేస్తారు. నన్ను స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవుతాయని చెప్తున్నారు. మీరు అర్థకల్పం పవిత్రంగా ఉండేవారు, తర్వాత రావణ రాజ్యంలో మీరు పతితంగా అయిపోయారు. ఇది కూడా మీరు ఇప్పుడే అర్థం చేసుకున్నారు. మనం కూడా పూర్తిగా పైసకు కొరగానివారిగా ఉండేవారము. ఇప్పుడు ఎంతటి జ్ఞానం లభించింది. దీని ద్వారా మనం ఎలా ఉన్నవారము ఎలా అయిపోతాము! మిగిలిన ఇన్ని ధర్మాలేవైతే ఉన్నాయో, అవన్నీ సమాప్తమైపోతాయి. అందరూ జంతువులు మరణించినట్లుగా మరణించనున్నారు. మంచు కురిసినప్పుడైతే జంతువులు పక్షులు మొదలైనవి ఎన్ని మరణిస్తాయి. ప్రకృతి వైపరీత్యాలు కూడా సంభవిస్తాయి. ఇదంతా సమాప్తమైపోతుంది. వీరంతా మరణించి ఉన్నారు. ఈ కళ్ళతో మీరు ఏదైతే చూస్తున్నారో, అవేవీ తర్వాత ఉండవు. కొత్త ప్రపంచంలో చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. ఈ జ్ఞానం మీ బుద్ధిలో ఉంది, జ్ఞానసాగరుడైన తండ్రియే మీకు జ్ఞానపు వారసత్వాన్ని ఇస్తున్నారు. మొత్తం ప్రపంచంలో ఎక్కడ చూసినా అంతా చెత్తనే ఉందని మీకు తెలుసు. మనం కూడా చెత్తలో అశుద్ధంగా ఉండేవారము. తండ్రి ఆ చెత్త నుండి బయటకు తీసి ఇప్పుడెంతగా పుష్పాలుగా తయారుచేస్తున్నారు. మనం ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తాము, ఆత్మ పవిత్రమైపోతుంది.

తండ్రి అందరికీ ఒకే విధంగా చదువు చదివిస్తారు కాని కొందరి బుద్ధి పూర్తిగా మందబుద్ధిగా ఉంది, కొద్దిగా కూడా అర్థం చేసుకోలేరు. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. వారి అదృష్టంలో లేకపోతే నేను కూడా ఏం చేయగలను అని తండ్రి అంటారు. నేనైతే అందరినీ ఒకే విధంగా చదివిస్తాను. నంబరువారుగా చదువుకుంటారు. కొందరు బాగా అర్థం చేసుకుంటారు మరియు అర్థం చేయిస్తారు, ఇతరుల జీవితాలను కూడా వజ్రతుల్యంగా తయారుచేస్తారు. కొందరైతే ఎవరినీ తయారుచేయరు. తప్పుడు అహంకారం ఎంత ఉంది. సైన్సువారికి తమ తెలివి గురించి అహంకారం ఎంతగా ఉంటుంది, ఆకాశంలో, సముద్రంలో దూర-దూరాల వరకు చూడాలని అనుకుంటారు. దానివల్ల లాభమేమీ లేదు, అనవసరంగా సైన్సు గర్వితులు తమ తలలు పాడుచేసుకుంటున్నారు అని బాబా అంటారు. వారికి ఎంతెంతో జీతాలు లభిస్తాయి, అంతా వృథా చేస్తూ ఉంటారు. బంగారు ద్వారక కింద నుండి పైకి వస్తుందని కాదు. ఇది డ్రామా చక్రం, ఇది తిరుగుతూ ఉంటుంది. కొత్త ప్రపంచంములో తిరిగి సమయానికి మన మహళ్ళను మనం కట్టుకుంటాము. మళ్ళీ అటువంటి మహళ్ళు తయారవుతాయా అని కొంతమంది ఆశ్చర్యపడతారు. మీరు మళ్ళీ అటువంటి బంగారు మహళ్ళను తయారుచేస్తారని తండ్రి తప్పకుండా చూపిస్తారు. అక్కడైతే బంగారం చాలా ఉంటుంది. ఇప్పటికీ కూడా అక్కడక్కడా బంగారు పర్వతాలు చాలా ఉన్నాయి కాని వాటి నుండి బంగారం తీయలేరు. కొత్త ప్రపంచంలో బంగారు గనులు చాలా ఉండేవి, అవి సమాప్తమైపోయాయి. ఇప్పుడు వజ్రాల విలువ కూడా ఎంత ఉందో చూడండి. ఈ రోజు ఇంత విలువ గల వజ్రాలు, రేపు రాళ్ళ వలె అయిపోతాయి. తండ్రి పిల్లలైన మీకు చాలా అద్భుతమైన విషయాలను వినిపిస్తారు, అంతేకాక సాక్షాత్కారం కూడా చేయిస్తారు. ఆత్మలమైన మనం మన ఇంటిని విడిచి 5 వేల సంవత్సరాలయింది, దానిని ముక్తిధామమని అంటారని పిల్లలైన మీకిప్పుడు బుద్ధిలో ఉండాలి. భక్తిమార్గంలో మోక్షము కోసం ఎంతగా తల బాదుకుంటారు (కష్టపడతారు), కానీ తండ్రి తప్ప ఇతరులెవ్వరూ ముక్తినివ్వలేరని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. తోడుగా తీసుకువెళ్ళలేరు. ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో కొత్త ప్రపంచముంది, ఈ చక్రం తిరగాలని తెలుసు, మీరు ఇక ఇతర విషయాలలోకి వెళ్ళకూడదు. కేవలం తండ్రిని స్మృతి చేయాలి, తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయని అందరికీ ఇదే చెప్తూ ఉండండి. తండ్రి మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా చేసారు కదా. మీరు నా శివజయంతిని కూడా జరుపుకుంటారు. ఎన్ని సంవత్సరాలయింది? 5 వేల సంవత్సరాల విషయం. మీరు స్వర్గవాసులుగా ఉండేవారు, తర్వాత 84 జన్మల చక్రంలో తిరిగారు. ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. నేను వచ్చి మీకు ఈ సృష్టి చక్రం గురించి అర్థం చేయిస్తాను. ఇప్పుడు పిల్లలైన మీకు చాలా బాగా స్మృతి కలిగింది. మనం అందరికన్నా ఉన్నతమైన పాత్రధారులము. మన పాత్ర తండ్రితో ఉన్నది, మనం బాబా శ్రీమతాన్ని అనుసరించి బాబా స్మృతిలో ఉంటూ ఇతరులను కూడా మన సమానంగా తయారుచేస్తాము. కల్పక్రితం ఉన్నవారే తయారవుతారు. సాక్షిగా ఉండి చూస్తూ ఉంటారు మరియు పురుషార్థం కూడా చేయిస్తూ ఉంటారు. సదా ఉత్సాహంలో ఉండేందుకు రోజూ ఏకాంతంలో కూర్చొని మీతో మీరు మాట్లాడుకోండి. ఈ అశాంతి ప్రపంచంలో ఇక కొంత సమయం మాత్రమే ఉంది, తర్వాత అశాంతికి నామ రూపాలే ఉండవు. మనశ్శాంతి ఎలా లభిస్తుందని ఎవ్వరూ అనరు. శాంతి కోసం వెళ్తారు కానీ శాంతిసాగరుడైతే ఒక్క తండ్రి మాత్రమే, ఇతరులెవ్వరి దగ్గర ఈ వస్తువు లేనే లేదు. రచయిత మరియు రచనలను తెలుసుకోవడమే జ్ఞానం అని పిల్లలైన మీ బుద్ధిలో ప్రతిధ్వనిస్తూ ఉండాలి. శాంతి కోసం, సుఖం కోసం జ్ఞానం కావాలి. సుఖం ధనంతో లభిస్తుంది. ధనం లేకపోతే మనుష్యులు పనికిరారు. ధనం కోసమే మనుష్యులెన్నో పాపాలు చేస్తారు. తండ్రి అపారమైన ధనాన్నిచ్చారు. స్వర్గం బంగారముదైతే, నరకం రాళ్ళది. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. సమయాన్ని తీసి ఏకాంతంలో మీతో మీరు మాట్లాడుకుంటూ స్వయాన్ని ఉత్సాహంలోకి తీసుకురావాలి. మీ సమానంగా తయారుచేసే సేవతోపాటు సాక్షీగా అయి ప్రతి ఒక్కరి పాత్రను చూసే అభ్యాసం చేయాలి.

2. తండ్రిని స్మృతి చేస్తూ మిమ్మల్ని మీరు సరిదిద్దుకోవాలి. నేను సందేశకునిగా అయ్యానా, ఎంత మందిని నా సమానంగా తయారుచేశాను అని మీ హృదయాన్ని ప్రశ్నించుకోవాలి.

వరదానము:-

సైలెన్స్ శక్తి ద్వారా విశ్వంలో ప్రత్యక్షతా ఢంకాను మ్రోగించే శాంతి స్వరూప భవ

"సైన్సు పై సైలెన్స్ విజయము" అని గాయనం ఉంది, వాచాకు కాదు. సమయం లేదా సంపూర్ణత ఎంతగా సమీపానికి వస్తూ ఉంటాయో, అంతగా అధిక శబ్దంలోకి రాకుండా ఆటోమెటిక్ గా వైరాగ్యం వస్తూ ఉంటుంది. ఎలాగైతే ఇప్పుడు సైలెన్స్ గా ఉండాలనుకున్నా, అలవాటనేది శబ్దంలోకి తీసుకొస్తుందో, అలా మాట్లాడాలనుకున్నా కూడా శబ్దానికి అతీతంగా అవుతూ ఉంటారు. శబ్దంలోకి రావాలంటే ప్రోగ్రాం తయారుచేసుకొని వస్తారు. ఎప్పుడైతే ఈ మార్పు కనిపిస్తుందో అప్పుడు విజయ ఢంకా మోగనున్నదని అర్థం చేసుకోండి, దీనికోసం ఎంత సమయం లభిస్తే అంత, శాంతిస్వరూప స్థితిలో ఉండే అభ్యాసిగా అవ్వండి.

స్లోగన్:-

జీరో తండ్రితో ఉండేవారే హీరో పాత్రధారులు.