ఓంశాంతి. బాబా కూర్చొని పిల్లలకు అర్థము చేయిస్తారు, బాబా, మేము మీకు చెందినవారిగా అయ్యాము, చివరి వరకు అంటే మేము శాంతిధామము చేరుకునేవరకు, మిమ్మల్ని స్మృతి చేయడంతో మా తలపై ఉన్న జన్మ-జన్మాంతరాల పాపాలు భస్మమైపోతాయి అని అనంతమైన తండ్రితో పిల్లలు ప్రతిజ్ఞ చేస్తారు. దీనినే యోగాగ్ని అని అంటారు, ఇంకే ఉపాయమూ లేదు. పతిత-పావనుడు లేక శ్రీ శ్రీ 108 జగద్గురు అని ఒక్కరినే అంటారు. వారే జగత్తుకు తండ్రి, జగత్తుకు శిక్షకుడు, జగత్తుకు గురువు. రచన ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని తండ్రి మాత్రమే ఇస్తారు. ఇది పతిత ప్రపంచము, ఇందులో పావనమైనవారు ఒక్కరు ఉండడం కూడా అసంభవం. పతిత-పావనుడైన తండ్రి మాత్రమే అందరికీ సద్గతినిస్తారు. మీరు కూడా వారి సంతానముగా అయ్యారు. జగత్తును పావనంగా ఎలా చేయాలో మీరు నేర్చుకుంటున్నారు. శివ అన్న పేరుకు ముందు త్రిమూర్తి అని తప్పకుండా ఉండాలి. దైవీ సామ్రాజ్యము మీ జన్మ సిద్ధ అధికారము అని కూడా రాయాలి. అది కూడా కల్పము యొక్క సంగమయుగంలోనే ఇప్పుడే లభిస్తుంది అని వ్రాయాలి. స్పష్టంగా వ్రాయకపోతే మనుష్యులు ఏమీ అర్థము చేసుకోలేరు. ఇక రెండవ విషయం, కేవలం బి.కె. అన్న పేరు వచ్చినప్పుడు, అందులో ప్రజాపిత అన్న పదము తప్పనిసరిగా ఉండాలి ఎందుకంటే బ్రహ్మా అనే పేరు కూడా చాలామందికి ఉంది. ప్రజాపిత బ్రహ్మాకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయము అని వ్రాయాలి. ఒక్క బాబా మాత్రమే రాతివంటి విశ్వాన్ని పావనంగా, పారసంగా తయారుచేయగలరని మీకు తెలుసు. ఈ సమయంలో పావనమైనవారు ఒక్కరు కూడా లేరు. అందరూ పరస్పరంలో కొట్లాడుకుంటూ, తిట్టుకుంటూ ఉంటారు. బాబాను కూడా కూర్మావతారము, మత్స్యావతారము అని అంటూ ఉంటారు. అవతారము అని దేనినంటారో కూడా తెలియదు. అవతారము అనేది ఒక్కరిది మాత్రమే ఉంటుంది. వారు కూడా అలౌకిక రీతిలో శరీరములో ప్రవేశించి విశ్వాన్ని పావనంగా చేస్తారు. మిగిలిన ఆత్మలు అయితే తమ-తమ శరీరాలను తీసుకుంటాయి, వారికి తమ శరీరము లేదు. కానీ వారు జ్ఞానసాగరుడు, మరి జ్ఞానాన్ని ఎలా ఇస్తారు? శరీరము కావాలి కదా. ఈ విషయాలు మీకు తప్ప వేరెవ్వరికీ తెలియవు. గృహస్థ వ్యవహారములో ఉంటూ పవిత్రంగా అవ్వడమే - సాహసంతో కూడిన పని. మహావీరులనగా వీరత్వమును చూపించేవారు. ఏ పనినైతే సన్యాసులు చేయలేరో, అది మీరు చేయగలరు, ఇది కూడా వీరత్వమే. మీరు గృహస్థ వ్యవహారములో ఉంటూ ఈ విధంగా కమలపుష్ప సమానంగా పవిత్రంగా అవ్వండి అని బాబా శ్రీమతాన్నిస్తున్నారు, అప్పుడే ఉన్నత పదవిని పొందగలరు. లేకపోతే విశ్వ రాజ్యధికారం ఎలా లభిస్తుంది. ఇది ఉన్నదే నరుని నుండి నారాయణునిగా అయ్యే చదువు. ఇది పాఠశాల. ఇక్కడ చాలామంది చదువుకుంటారు కనుక ఈశ్వరీయ విశ్వవిద్యాలయము అని వ్రాయండి. ఇదైతే పూర్తిగా సరియైన పదము. మేము విశ్వానికి యజమానులుగా ఉండేవారము, ఇది నిన్నటి విషయము అని భారతవాసులకు తెలుసు. ఇప్పటికీ రాధా-కృష్ణులు లేక లక్ష్మీ-నారాయణుల మందిరాలు తయారవుతూ ఉంటాయి. కొందరైతే పతిత మనుష్యులవి కూడా నిర్మిస్తారు. ద్వాపరము నుండి మొదలుకొని పతిత మనుష్యులే ఉంటారు. శివుని మందిరాలు నిర్మించడం ఎక్కడ, దేవతల మందిరాలు నిర్మించడం ఎక్కడ, ఈ పతిత మనుష్యులవి ఎక్కడ. వీరేమీ దేవతలు కాదు. ఈ విషయాలపై బాగా విచార సాగర మథనము చేయాలని తండ్రి అర్థం చేయిస్తున్నారు. రోజు-రోజుకూ రాసేటటువంటి వివరణ చేంజ్ అవుతూ ఉంటుందని బాబా అర్థం చేయిస్తూ ఉంటారు, ముందే అలా ఎందుకు తయారుచేయలేదు, మన్మనాభవ అర్థాన్ని ముందే ఆ విధంగా ఎందుకు అర్థం చేయించలేదు అని అడగకూడదు. అరే, మొదటే అటువంటి స్మృతిలో ఉండలేరు. ప్రతి ఒక్క విషయానికి పూర్తిగా రెస్పాండ్ అవ్వగల పిల్లలు చాలా కొద్దిమంది మాత్రమే ఉన్నారు. భాగ్యములో ఉన్నత పదవి లేకపోతే, టీచరు కూడా ఏమి చేయగలరు. ఆశీర్వాదాలతో ఉన్నతంగా చేస్తారని కాదు. నేను ఎటువంటి సేవ చేస్తున్నాను అని స్వయాన్ని చూసుకోవాలి. విచార సాగర మథనము నడవాలి. గీతా భగవంతుడు ఎవరు, ఈ చిత్రము చాలా ముఖ్యమైనది. భగవంతుడు నిరాకారుడు, వారు బ్రహ్మా శరీరము లేకుండా వినిపించలేరు. వారు సంగమయుగములో బ్రహ్మా తనువులోనే వస్తారు. లేదంటే బ్రహ్మా-విష్ణు-శంకరులు ఎందుకున్నారు. వారి జీవిత చరిత్ర కావాలి కదా. అది ఎవ్వరికీ తెలియదు. బ్రహ్మా గురించి 100 భుజాల బ్రహ్మా వద్దకు వెళ్ళండి, 1000 భుజాల బ్రహ్మా వద్దకు వెళ్ళండి అని అంటారు. దీని గురించి ఒక కథను కూడా తయారుచేశారు. ప్రజాపిత బ్రహ్మాకు ఇంతమంది పిల్లలున్నారు కదా. పవిత్రంగా అయ్యేందుకే ఇక్కడకు వస్తారు. జన్మ-జన్మాంతరాలుగా అపవిత్రంగా అవుతూ వచ్చారు. ఇప్పుడు పూర్తిగా పవిత్రంగా అవ్వాలి. నన్నొక్కడినే స్మృతి చేయండి అని శ్రీమతము లభిస్తుంది. ఎలా స్మృతి చేయాలి అని కొందరికైతే ఇప్పటివరకూ అర్థం కాలేదు. ఇందులో తికమక పడిపోతారు. బాబాకు చెందినవారిగా అయ్యి వికర్మాజీతులుగా అవ్వకపోతే, పాపము నశించకపోతే, స్మృతియాత్రలో ఉండకపోతే, వారు ఏమి పదవిని పొందుతారు. సమర్పితులై ఉండవచ్చు కానీ దాని వలన లాభమేముంటుంది. ఎప్పటివరకైతే పుణ్యాత్ములుగా అయి ఇతరులను కూడా అలా తయారుచేయరో, అప్పటివరకు ఉన్నత పదవిని పొందలేరు. నన్ను ఎంత తక్కువగా స్మృతి చేస్తారో, అంత తక్కువ పదవిని పొందుతారు. డబల్ కిరీటధారులుగా ఎలా అవ్వగలరు, తర్వాత నంబరువారు పురుషార్థానుసారంగా ఆలస్యంగా వస్తారు. మేము అంతా సరెండర్ చేసేశాము కనుక డబల్ కిరీటధారులుగా అవుతాము అని కాదు. మొదట దాస-దాసీలుగా అవుతూ-అవుతూ, తర్వాత చివర్లో కొంత లభిస్తుంది. నేను అయితే సరెండర్ అని చాలామందికి ఈ అహంకారముంటుంది. అరే, స్మృతి లేకుండా ఏమి తయారవ్వగలరు. దాస-దాసీలుగా అవ్వడం కన్నా షావుకారు ప్రజలుగా అవ్వడం మంచిది. దాస-దాసీలు ఎవ్వరూ కృష్ణునితో పాటు ఊయలలో ఊగలేరు. ఇవి బాగా అర్థము చేసుకోవలసిన విషయాలు, ఇందులో చాలా శ్రమ చేయవలసి ఉంటుంది. కొంతలోనే సంతోషపడకూడదు. మేము కూడా రాజులుగా అవుతామని అంటారు. అలాగైతే లెక్కలేనంతమంది రాజులుగా అయిపోతారు. మొదట ముఖ్యమైనది స్మృతి యాత్ర అని బాబా చెప్తున్నారు. ఎవరైతే బాగా స్మృతిలో ఉంటారో, వారికి సంతోషం ఉంటుంది. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటుందని తండ్రి అర్థం చేయిస్తున్నారు. సత్యయుగంలో ఒక శరీరమును వదిలి మరొకటి సంతోషంగా తీసుకుంటారు. ఇక్కడైతే ఏడవడం మొదలుపెడతారు, సత్యయుగం యొక్క విషయాలే మర్చిపోయారు. అక్కడ సర్పము వలె శరీరాన్ని విడిచిపెడతారు. ఇప్పుడు ఈ పాత శరీరాన్ని విడిచిపెట్టాలి. నేను ఒక ఆత్మ, ఈ పాత శరీరాన్ని ఇప్పుడు విడిచిపెట్టాల్సిందేనని మీకు తెలుసు. తండ్రి స్మృతిలో ఉండే తెలివైన పిల్లలు, తండ్రి స్మృతిలోనే శరీరాన్ని విడిచిపెడతాము, తర్వాత వెళ్ళి బాబాను కలుస్తాము అని చెప్తారు. తండ్రిని ఎలా కలవచ్చు అనేది మనుష్యమాత్రులెవ్వరికీ తెలియదు. పిల్లలైన మీకు మార్గము లభించింది. ఇప్పుడు పురుషార్థము చేస్తున్నారు, జీవిస్తూ మరణించారు కానీ ఆత్మ కూడా పవిత్రంగా అవ్వాలి కదా. పవిత్రంగా అయి తర్వాత ఈ పాత శరీరాన్ని వదలి వెళ్ళాలి. కర్మాతీత స్థితి ఏర్పడితే ఈ శరీరము వదిలేస్తామని భావిస్తారు కానీ కర్మాతీత స్థితి ఏర్పడితే శరీరము దానంతట అదే వదిలిపోతుంది. ఇక అంతే, మేము బాబా వద్దకు వెళ్ళి ఉండాలి. ఈ పాత శరీరము పట్ల అసహ్యం కలుగుతుంది. సర్పానికి పాత శరీరముపై అసహ్యం కలుగుతూ ఉండవచ్చు కదా. మీ కొత్త శరీరము తయారవుతూ ఉంది. కానీ కర్మాతీత స్థితి ఏర్పడినప్పుడు, అంతిమంలో, మీకు అటువంటి స్థితి ఏర్పడుతుంది. ఇక మనమిప్పుడు వెళ్ళిపోతున్నాము, అంతే. యుద్ధము కోసం కూడా పూర్తిగా ఏర్పాట్లు జరుగుతాయి. వినాశనం యొక్క ఆధారమంతా మీరు కర్మాతీత స్థితిని చేరుకోవడంపై ఉంది. అంతిమంలో అందరూ నంబరువారుగా కర్మాతీత స్థితికి చేరుకుంటారు. ఎంత లాభముంటుంది. మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు కనుక తండ్రిని ఎంతగా స్మృతి చేయాలి. కేవలం లేస్తూ-కూర్చుంటూ తండ్రిని స్మృతి చేస్తూ ఉండేవారు చాలామంది వెలువడడం కూడా మీరు చూస్తారు. మృత్యువు ఎదురుగా నిలబడి ఉంది. ఇప్పుడిప్పుడే యుద్ధము ప్రారంభమవుతుందేమో అనే విధంగా పత్రికలలో చూపిస్తారు. పెద్ద యుద్ధము మొదలవుతే బాంబులు వేస్తారు. ఇందులో ఆలస్యమవ్వదు. తెలివైన పిల్లలు అర్థము చేసుకుంటారు, తెలివిలేని వారు ఏమీ అర్థము చేసుకోరు. కొద్దిగా కూడా ధారణ జరగదు. అవును-అవును అని అంటూ ఉంటారు కానీ ఏమీ అర్థము చేసుకోరు. స్మృతిలో ఉండరు. ఎవరైతే దేహాభిమానములో ఉంటారో, వారికి ఈ ప్రపంచమే స్మృతిలో ఉంటుంది, వారేమి అర్థము చేసుకోగలరు. దేహీ-అభిమానులుగా అవ్వండి అని ఇప్పుడు బాబా చెప్తున్నారు. దేహాన్ని మర్చిపోవాలి. చివర్లో మీరు చాలా ప్రయత్నం చేయడం మొదలుపెడతారు, ఇప్పుడు మీరు అర్థము చేసుకోవడం లేదు. చివర్లో చాలా-చాలా పశ్చాత్తాపపడతారు. ఈ-ఈ పాపాలు చేశారు, ఇప్పుడు శిక్షలు అనుభవించండి, పదవి కూడా చూసుకోండి అని బాబా సాక్షాత్కారము కూడా చేయిస్తారు. ప్రారంభంలో కూడా ఇటువంటి సాక్షాత్కారాలు అయ్యేవి, మళ్ళీ చివర్లో కూడా సాక్షాత్కారాలు జరుగుతాయి.
మీ గౌరవాన్ని పోగొట్టుకోకండి అని తండ్రి చెప్తున్నారు. చదువులో తత్పరులయ్యే పురుషార్థము చేయండి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్నొక్కడినే స్మృతి చేయండి. వారే పతిత-పావనుడు. ప్రపంచములో పతితపావనులు ఎవ్వరూ లేరు. శివ భగవానువాచ, సర్వుల సద్గతిదాత, పతిత-పావనుడు ఒక్కరే అని అంటారు. వారినే అందరూ స్మృతి చేస్తారు. కానీ స్వయాన్ని ఆత్మ బిందువుగా భావించినప్పుడే తండ్రి స్మృతి కలుగుతుంది. ఆత్మనైన నాలో 84 జన్మల పాత్ర ఫిక్స్ అయి ఉంది, అదెప్పుడూ వినాశనము కాదని మీకు తెలుసు. ఇది అర్థం చేసుకోవడం పిన్నమ్మ ఇంటికి వెళ్ళినంత సులువు కాదు, మర్చిపోతారు, అందుకే ఎవ్వరికీ అర్థము చేయించలేరు. దేహాభిమానము అందరినీ పూర్తిగా హతమార్చేసింది. ఇది మృత్యులోకంగా అయిపోయింది. అందరూ అకాలంగా మరణిస్తున్నారు. జంతువులు-పక్షులు మొదలైనవి ఎలాగైతే మరణిస్తున్నాయో, అదే విధంగా మనుష్యులు కూడా మరణిస్తున్నారు, తేడా ఏమీ లేదు. లక్ష్మీ-నారాయణులు అయితే అమరలోకానికి యజమానులు కదా. అక్కడ అకాల మృత్యువులుండవు. దుఃఖమే ఉండదు. ఇక్కడ దుఃఖము కలిగితే, వెళ్ళి మరణిస్తారు. అకాల మృత్యువును తమకు తామే తెచ్చుకుంటారు, ఈ గమ్యము చాలా ఉన్నతమైనది. ఎప్పుడూ వికారీ దృష్టి ఉండకూడదు, ఇందులో శ్రమ ఉంది. అంత ఉన్నత పదవిని పొందడం పిన్నమ్మ ఇంటికి వెళ్ళనంత సులువు కాదు. సాహసం కావాలి. లేకపోతే చిన్న విషయానికే భయపడిపోతారు. చెడు దృష్టితో ఎవరైనా లోపలికి దూరి చెయ్యి వేసినట్లయితే కర్రతో తరిమేయాలి. పిరికివారిగా ఉండకూడదు. స్వర్గ ద్వారాలు తెరిచే శివశక్తి పాండవ సైన్యం అని గాయనం చేయబడింది కదా. పేరు ప్రసిద్ధమైనప్పుడు మరి అలాంటి ధైర్యము కూడా ఉండాలి. సర్వశక్తివంతులైన తండ్రి స్మృతిలో ఉన్నప్పుడు ఆ శక్తి ప్రవేశిస్తుంది. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయాలి, ఈ యోగాగ్ని ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి, తర్వాత వికర్మాజీత్ రాజుగా కూడా అవుతారు. స్మృతియే శ్రమ, ఎవరైతే చేస్తారో వారు పొందుతారు. ఇతరులను కూడా సావధానపరుస్తూ ఉండాలి. స్మృతియాత్ర ద్వారానే నావ తీరానికి చేరుతుంది. చదువును యాత్ర అని అనరు. అది దైహిక యాత్ర, ఇది ఆత్మిక యాత్ర, నేరుగా తమ ఇంటికి, శాంతిధామానికి వెళ్ళిపోతారు. తండ్రి కూడా ఇంట్లో ఉంటారు. నన్ను స్మృతి చేస్తూ-చేస్తూ మీరు ఇంటికి చేరుకుంటారు. ఇక్కడ అందరూ పాత్రను అభినయించాలి. డ్రామా అయితే అవినాశీగా నడుస్తూనే ఉంటుంది. బాబా పిల్లలకు అర్థము చేయిస్తూనే ఉంటారు, ఒకటి తండ్రి స్మృతిలో ఉండండి మరియు పవిత్రంగా అవ్వండి, దైవీగుణాలు ధారణ చేయండి మరియు ఎంతగా సేవ చేస్తారో, అంతగా ఉన్నత పదవిని పొందుతారు. కళ్యాణకారులుగా తప్పకుండా అవ్వాలి. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. సర్వశక్తివంతుడైన తండ్రి నాతో ఉన్నారని సదా స్మృతి ఉండాలి, ఈ స్మృతి ద్వారా శక్తి ప్రవేశిస్తుంది, వికర్మలు భస్మమౌతాయి. శివశక్తి పాండవ సైన్యం అని పేరు ఉంది కనుక ధైర్యాన్ని చూపించాలి. పిరికివారిగా అవ్వకూడదు.
2. జీవిస్తూ మరణించిన తర్వాత, నేను అయితే సరెండర్ అనే ఈ అహంకారము రాకూడదు. సరెండర్ అయ్యి పుణ్యాత్ములుగా అయ్యి ఇతరులను తయారుచేయాలి, ఇందులోనే లాభముంది.