29-09-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైన పిల్లలూ - మీ చదువుకు ఆధారమంతా యోగముపైనే ఉంది, యోగము ద్వారానే ఆత్మ పవిత్రంగా అవుతుంది, వికర్మలు వినాశనమౌతాయి”

ప్రశ్న:-

చాలా మంది పిల్లలు తండ్రికి చెందినవారిగా అయి మళ్ళీ చెయ్యి వదిలేస్తారు, కారణమేమిటి?

జవాబు:-

తండ్రిని పూర్తిగా గుర్తించని కారణంగా, పూర్తి నిశ్చయబుద్ధి కలవారిగా అవ్వని కారణంగా 8-10 సంవత్సరాల తర్వాత కూడా తండ్రికి విడాకులిచ్చేస్తారు, చెయ్యి వదిలేస్తారు. పదభ్రష్టులుగా అయిపోతారు. 2. వికారీ దృష్టి ఉండడం వలన మాయా గ్రహచారము కూర్చుంటుంది, స్థితి కింద-మీద అవుతూ ఉన్నా కూడా చదువును వదిలేస్తారు.

ఓంశాంతి. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు. మనమంతా అనంతమైన ఆత్మిక తండ్రి పిల్లలమని, వారిని బాప్ దాదా అంటారని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. మీరెలాగైతే ఆత్మిక పిల్లలో, అలాగే వీరు (బ్రహ్మా) కూడా శివబాబాకు ఆత్మిక పుత్రుడు. శివబాబాకు రథమైతే తప్పకుండా కావాలి కదా కనుక ఎలాగైతే ఆత్మలైన మీకు కర్మలు చేసేందుకు కర్మేంద్రియాలు లభించాయో, అదే విధంగా శివబాబాకు కూడా ఇది రథము, ఎందుకంటే ఇది కర్మక్షేత్రము, ఇక్కడ కర్మలు చేయడం జరుగుతుంది. అది ఆత్మలు నివసించే ఇల్లు. మన ఇల్లు శాంతిధామమని ఆత్మలు తెలుసుకున్నాయి, అక్కడ ఈ ఆట ఉండదు. లైట్లు మొదలైనవేవీ ఉండవు, కేవలం ఆత్మలు మాత్రమే ఉంటాయి. పాత్రను అభినయించేందుకు ఇక్కడకు వస్తాయి. ఇది అనంతమైన డ్రామా అని మీ బుద్ధిలో ఉంది. ప్రారంభము నుండి మొదలుకొని చివరివరకు పాత్రధారులందరి పాత్ర పిల్లలైన మీకు నంబరువారు పురుషార్థానుసారంగా తెలుసు. ఇక్కడ సాధు-సత్పురుషులు మొదలైనవారు ఎవరూ అర్థం చేయించడం లేదు. ఇక్కడ పిల్లలైన మనము అనంతమైన తండ్రి వద్ద కూర్చున్నాము, ఇప్పుడు మనము తిరిగి వెళ్ళాలి, ఆత్మ అయితే తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. అలా అని శరీరము కూడా ఇక్కడే పవిత్రంగా అవ్వాలని కాదు. ఆత్మ పవిత్రంగా అవుతుంది. పంచ తత్వాలు కూడా సతోప్రధానంగా అయినప్పుడు శరీరము కూడా పవిత్రంగా అవుతుంది. ఇప్పుడు ఆత్మలైన మీరు పురుషార్థము చేసి పావనంగా అవుతున్నారు. అక్కడ ఆత్మ మరియు శరీరము రెండూ పవిత్రంగా ఉంటాయి. ఇక్కడ అలా ఉండవు. ఆత్మ పవిత్రంగా అయినప్పుడు మళ్ళీ పాత శరీరాన్ని వదిలేస్తుంది, మళ్ళీ కొత్త తత్వాలతో కొత్త శరీరము తయారవుతుంది. ఆత్మనైన నేను అనంతమైన తండ్రిని స్మృతి చేస్తున్నానా లేదా అన్నది మీకు తెలుసు. ఇది ప్రతి ఒక్కరూ స్వయాన్ని ప్రశ్నించుకోవాలి. చదువు ఆధారమంతా యోగము పైనే ఉంది. చదువు అయితే సహజము, చక్రము ఎలా తిరుగుతుందో అర్థము చేసుకున్నారు, ముఖ్యమైనది స్మృతియాత్రయే. ఇది లోపల గుప్తంగా ఉంటుంది. ఇది కనిపించదు. వీరు ఎక్కువ స్మృతి చేస్తున్నారా లేక తక్కువ చేస్తున్నారా అని బాబా చెప్పలేరు. అవును, జ్ఞానము కోసమైతే వీరు జ్ఞానములో చాలా చురుకుగా ఉన్నారని బాబా చెప్పగలరు. స్మృతి అనేది కనిపించదు. జ్ఞానము నోటి ద్వారా చెప్పడం జరుగుతుంది. స్మృతి అయితే నిరంతరం జరిగేది. జపమనే పదము భక్తి మార్గానికి చెందినది, జపమనగా ఎవరి పేరునైనా జపించడం. ఇక్కడైతే ఆత్మ తన తండ్రిని స్మృతి చేయాలి.

మనము తండ్రిని స్మృతి చేస్తూ-చేస్తూ పవిత్రంగా అవుతూ-అవుతూ ముక్తిధామము-శాంతిధామంలోకి వెళ్ళిపోతామని మీకు తెలుసు. అలాగని డ్రామా నుండి ముక్తులైపోతామని కాదు. ముక్తికి అర్థము - దుఃఖము నుండి ముక్తులై, శాంతిధామానికి వెళ్ళి మళ్ళీ సుఖధామములోకి వస్తాము. పవిత్రంగా అయినవారే సుఖాన్ని అనుభవిస్తారు. అపవిత్రమైన మనుష్యులు వారికి సేవ చేస్తారు. పవిత్రతకే మహిమ ఉంది, ఇందులోనే శ్రమ ఉంది. కళ్ళు చాలా మోసము చేస్తాయి, ఇక పడిపోతారు. అందరూ కింద-మీద అవ్వడం జరుగుతుంది. అందరికీ గ్రహచారము పడుతుంది. పిల్లలు కూడా అర్థం చేయించవచ్చు అని బాబా చెప్తారు. అయినా మాతా గురువు కావాలని అంటారు ఎందుకంటే ఇప్పుడు మాతా గురువు సిస్టమ్ నడుస్తోంది. ఇంతకుముందు పితల సిస్టమ్ ఉండేది. ఇప్పుడు మొట్టమొదట మాతలకు కలశము లభిస్తుంది. మాతలు మెజారిటీ ఉన్నారు, కుమారీలు పవిత్రత కోసం రాఖీ కడతారు. కామము మహాశత్రువు, దీనిపై విజయము పొందండి అని భగవంతుడు చెప్తున్నారు. రక్షాబంధనం పవిత్రతకు గుర్తు, వారు రాఖీ కడతారు. పవిత్రంగా అయితే అవ్వరు. అవన్నీ కృత్రిమ రాఖీలు, అవేమీ పావనంగా చేయవు, ఇందులో జ్ఞానము కావాలి. ఇప్పుడు మీరు రాఖీ కడతారు. అర్థము కూడా తెలుపుతారు. ప్రతిజ్ఞ చేయిస్తారు. సిక్కులకు కంకణం గుర్తుగా ఉంటుంది కానీ పవిత్రంగా అవ్వరు. పతితులను పావనంగా చేసేవారు, సర్వుల సద్గతిదాత ఒక్కరే, వారు దేహధారి కాదు. నీటి గంగనైతే ఈ కళ్ళతో చూడగలము. సద్గతిదాత అయిన తండ్రిని ఈ కళ్ళతో చూడలేము. ఆత్మ అంటే ఏమిటి అనేది ఎవ్వరూ చూడలేరు. నా శరీరములో ఆత్మ ఉందని అంటారు కూడా, మరి దానిని చూశారా అని అడిగితే, లేదు అని అంటారు. పేర్లున్న మిగిలిన వస్తువులన్నీ ఈ కళ్ళకు కనిపిస్తాయి. ఆత్మకు కూడా పేరుంది. భృకుటి మధ్యలో అద్భుతమైన నక్షత్రము ప్రకాశిస్తుంది అని అంటారు కానీ అది ఈ కళ్ళకు కనిపించదు. పరమాత్మను కూడా స్మృతి చేసుకుంటారు కానీ వారు కనిపించరు. లక్ష్మీనారాయణులను ఈ కళ్ళతో చూడడం జరుగుతుంది. లింగాన్ని పూజిస్తారు కానీ అది యథార్థమైన పద్ధతేమీ కాదు కదా. పరమాత్మను చూస్తున్నా కూడా వారెవరో తెలియదు. ఈ విషయాన్ని ఎవ్వరూ తెలుసుకోలేరు. ఆత్మ అయితే చాలా చిన్న బిందువు. అది చూడడానికి కనిపించదు. ఆత్మను గానీ, పరమాత్మను గానీ చూడలేరు, తెలుసుకోవడం జరుగుతుంది. మన బాబా వీరిలో వచ్చి ఉన్నారని మీకిప్పుడు తెలుసు. ఈ శరీరానికి తన ఆత్మ కూడా ఉంది, అలాగే పరమపిత పరమాత్మ అంటున్నారు - నేను వీరి రథములో విరాజమానమై ఉన్నాను, అందుకే బాప్ దాదా అని అంటారు. ఇప్పుడు దాదానైతే ఈ కళ్ళతో చూస్తారు, తండ్రిని చూడరు. బాబా జ్ఞానసాగరుడని తెలుసు, వారు ఈ శరీరము ద్వారా మనకు జ్ఞానము వినిపిస్తున్నారు. వారు జ్ఞానసాగరుడు, పతిత-పావనుడు. నిరాకారుడు మార్గాన్ని ఎలా తెలియజేస్తారు? ప్రేరణ ద్వారానైతే ఏ పనీ జరగదు. భగవంతుడు వస్తారని ఎవ్వరికీ తెలియదు. శివజయంతిని కూడా జరుపుకుంటారు కనుక తప్పకుండా ఇక్కడకే వచ్చి ఉంటారు కదా. వారిప్పుడు మనల్ని చదివిస్తున్నారని మీకు తెలుసు. బాబా వీరిలోకి వచ్చి చదివిస్తున్నారు. తండ్రిని పూర్తిగా గుర్తించని కారణంగా, నిశ్చయబుద్ధి కలవారిగా లేని కారణంగా 8-10 సంవత్సరాల తర్వాత కూడా విడాకులిచ్చేస్తారు. మాయ పూర్తిగా అంధులుగా చేసేస్తుంది. తండ్రికి చెందినవారిగా అయి మళ్ళీ వదిలేస్తే పదభ్రష్టులైపోతారు. ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి పరిచయము లభించింది కనుక ఇతరులకు కూడా ఇవ్వాలి. ఋషులు-మునులు మొదలైనవారు అందరూ తెలియదు-తెలియదు అని అంటూ వెళ్ళిపోయారు. ఇంతకుముందు మీకు కూడా తెలియదు. అవును, మాకు తెలుసు అని ఇప్పుడు మీరంటారు అంటే ఆస్తికులుగా అయిపోయారు. సృష్టిచక్రము ఎలా తిరుగుతుందో కూడా మీకు తెలుసు. మొత్తం ప్రపంచము మరియు స్వయం మీరు, ఈ చదువుకు ముందు నాస్తికులుగా ఉండేవారు. ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు కనుక మీరు, మాకు పరమపిత పరమాత్మ తండ్రి అర్థం చేయించారు, ఆస్తికులుగా చేశారని అంటారు. ఇంతకుముందు మనకు రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతాల గురించి తెలియదు. తండ్రి రచయిత, తండ్రియే సంగమయుగంలో వచ్చి కొత్త ప్రపంచాన్ని స్థాపన కూడా చేస్తారు మరియు పాత ప్రపంచాన్ని వినాశనము కూడా చేస్తారు. పాత ప్రపంచ వినాశనము కోసం ఈ మహాభారత యుద్ధము జరుగుతుంది, ఆ సమయంలో కృష్ణుడు ఉన్నారు అని భావిస్తారు. కానీ ఆ సమయంలో నిరాకార తండ్రి ఉన్నారు అని మీకిప్పుడు తెలుసు, వారిని చూడలేము. కృష్ణునికైతే చిత్రముంది కావున చూడగలము. శివుడిని చూడలేము. కృష్ణుడైతే సత్యయుగం యొక్క రాకుమారుడు. అవే ముఖకవళికలు మళ్ళీ ఉండవు. కృష్ణుడు ఎప్పుడు ఎలా వస్తారు అనేది కూడా ఎవ్వరికీ తెలియదు. కృష్ణుడిని కంసుని జైలులో చూపిస్తారు. కంసుడు సత్యయుగంలో ఉండేవాడా? ఇది ఎలా సాధ్యము. అసురుడిని కంసుడని అంటారు. ఈ సమయంలో అందరూ ఆసురీ సంప్రదాయస్థులే కదా. ఒకరినొకరు హతమార్చుకుంటూ ఉన్నారు. దైవీ ప్రపంచముండేదని మర్చిపోయారు. ఈశ్వరీయ దైవీ ప్రపంచాన్ని ఈశ్వరుడు స్థాపన చేసారు. ఇది కూడా నెంబరువారు పురుషార్థానుసారంగా మీ బుద్ధిలో ఉంది. ఇప్పుడు మీది ఈశ్వరీయ పరివారము, మళ్ళీ అక్కడ దైవీ పరివారముంటుంది. ఈ సమయంలో ఈశ్వరుడు మిమ్మల్ని స్వర్గములో దేవీ దేవతలుగా చేసేందుకు అర్హులుగా చేస్తున్నారు. తండ్రి చదివిస్తున్నారు. ఈ సంగమయుగము గురించి ఎవ్వరికీ తెలియదు. ఏ శాస్త్రములోనూ ఈ పురుషోత్తమ యుగము గురించి ఉండదు. పురుషోత్తమ యుగమనగా పురుషోత్తములుగా తయారయ్యే సమయము. సత్యయుగాన్ని పురుషోత్తమ యుగమని అంటారు. ఈ సమయంలో మనుష్యులు పురుషోత్తములుగా లేరు. వీరిని కనిష్ఠులు, తమోప్రధానమైనవారు అని అంటారు, ఈ విషయాలన్నీ బ్రాహ్మణులైన మీరు తప్ప ఇంకెవ్వరూ అర్థము చేసుకోలేరు. ఇది ఆసురీ, భ్రష్టాచారీ ప్రపంచము అని తండ్రి చెప్తున్నారు. సత్యయగములో ఇటువంటి వాతావరణము ఏమీ ఉండదు. అది శ్రేష్ఠాచారి ప్రపంచము. అక్కడ ఉండేవారి చిత్రాలున్నాయి. వారు తప్పకుండా శ్రేష్ఠాచారీ ప్రపంచానికి యజమానులుగా ఉండేవారు. భారత్ లో రాజులుండి వెళ్ళిపోయారు, వారే పూజింపబడుతున్నారు. పూజ్యులుగా, పవిత్రంగా ఉండేవారే, వారే మళ్ళీ పూజారులుగా అయ్యారు. భక్తి మార్గమును పూజారులని, జ్ఞాన మార్గమును పూజ్యులని అంటారు. పూజ్యుల నుండి పూజారులుగా, పూజారుల నుండి మళ్ళీ పూజ్యులుగా ఎలా అవుతారు. ఈ ప్రపంచంలో పూజ్యులు ఒక్కరు కూడా లేరని మీకు తెలుసు. పరమపిత పరమాత్మను మరియు దేవతలను మాత్రమే పూజ్యులని అంటారు. పరమపిత పరమాత్మ అందరికీ పూజ్యులు. అన్ని ధర్మాల వారు వారిని పూజిస్తారు. అటువంటి తండ్రి యొక్క జన్మకు ఇక్కడే గాయనం జరుగుతుంది. శివజయంతి ఉంది కదా. కానీ వారి జన్మ భారత్ లో జరుగుతుందని మనుష్యులకు ఏమీ తెలియదు, ఈ రోజులలో శివజయంతికి సెలవు కూడా ఇవ్వరు. జయంతిని జరుపుకున్నా, జరుపుకోకపోయినా, అది మీ ఇష్టము. అఫీషియల్ సెలవు ఇవ్వడం లేదు. శివజయంతిని నమ్మనివారు, తమ పనికి వెళ్ళిపోతారు. అనేక ధర్మాలున్నాయి కదా. సత్యయుగంలో ఇటువంటి విషయాలేవీ ఉండవు. అక్కడ ఇటువంటి వాతావరణమే ఉండదు. సత్యయుగము అంటేనే కొత్త ప్రపంచము, ఒకే ధర్మము. మా తర్వాత చంద్రవంశ రాజ్యము వస్తుందని అక్కడ వారికి తెలియదు. గతంలో ఏమేమి జరిగింది అన్నది ఇక్కడ మీకు అంతా తెలుసు. మీరు సత్యయుగములో ఉంటారు, అక్కడ ఏ గతమును స్మృతి చేస్తారు? అప్పటికి గతించినదైతే కలియుగము. దాని చరిత్ర-భూగోళము వినడం వలన లాభమేమిటి.

ఇక్కడ మనము బాబా వద్ద కూర్చున్నామని మీకు తెలుసు. బాబా టీచరు కూడా, సద్గురువు కూడా. అందరికీ సద్గతినిచ్చేందుకు తండ్రి వచ్చారు. వారు ఆత్మలందరినీ తప్పకుండా తీసుకువెళ్తారు. మనుష్యులైతే దేహాభిమానములోకి వచ్చి, అంతా మట్టిలో కలిసిపోతుందని అంటారు. ఆత్మలు వెళ్ళిపోతాయి, ఇక ఈ శరీరం మట్టితో తయారుచేయబడినది కనుక ఈ పాత శరీరము సమాప్తమైపోతుందని వారికి తెలియదు. ఆత్మలైన మనం ఒక శరీరము వదిలి వెళ్ళి మరొకటి తీసుకుంటాము. ఇది ఈ ప్రపంచంలో మన అంతిమ జన్మ, ఇక్కడ అందరూ పతితంగా ఉన్నారు, సదా పావనంగా ఎవ్వరూ ఉండలేరు. సతోప్రధాన, సతో, రజో, తమోలు తప్పకుండా ఉంటాయి. వారైతే అందరూ ఈశ్వరుని రూపాలే అని అంటారు, ఈశ్వరుడు ఆట ఆడేందుకు తన అనేక రూపాలు తయారుచేసారని అంటారు. కొంచెము కూడా లెక్కాచారము గురించి తెలియదు. ఆట ఆడే వారిని గురించి కూడా తెలియదు. తండ్రియే కూర్చొని ప్రపంచ చరిత్ర-భూగోళము అర్థము చేయిస్తారు. ఆటలో ప్రతి ఒక్కరి పాత్ర వేర్వేరుగా ఉంటుంది. అందరి పొజిషన్ వేర్వేరుగా ఉంటుంది, ఎవరు ఎటువంటి పొజిషన్ లో ఉంటారో, వారికి అటువంటి మహిమ ఉంటుంది. ఈ విషయాలన్నీ తండ్రి సంగమయుగములోనే అర్థము చేయిస్తారు. సత్యయుగంలో మళ్ళీ సత్యయుగ పాత్ర నడుస్తుంది. అక్కడ ఈ విషయాలుండవు. ఇక్కడ మీకు సృష్టి చక్ర జ్ఞానము బుద్ధిలో తిరుగుతూ ఉంటుంది. మీ పేరే స్వదర్శన చక్రధారులు. లక్ష్మీనారాయణులకు స్వదర్శన చక్రము ఇవ్వడం జరగదు. ఇది ఇక్కడిదే. మూలవతనంలో కేవలం ఆత్మలుంటాయి, సూక్ష్మవతనంలో ఏమీ ఉండదు. మనుష్యులు, జంతువులు, పశు పక్ష్యాదులు మొదలైనవన్నీ ఇక్కడే ఉంటాయి. సత్యయుగములో నెమలి మొదలైనవి చూపిస్తారు. అలా అని అక్కడ నెమలి ఈకలు తీసుకుని ధరిస్తారని కాదు, నెమలికి దుఃఖము ఇవ్వరు. అలాగని కిందపడిన నెమలి ఈకలు కిరీటములో ధరిస్తారని కూడా కాదు. కిరీటములో కూడా అసత్యపు చిహ్నాలను చూపించారు. అక్కడ అన్నీ సుందరమైన వస్తువులుంటాయి. ఎటువంటి అశుద్ధమైన వస్తువులు యొక్క పేరు కూడా ఉండదు. చూస్తే అసహ్యం కలిగే వస్తువులేవీ ఉండవు. ఇక్కడైతే అసహ్యం కలుగుతుంది కదా. అక్కడ జంతువులకు కూడా దుఃఖముండదు. సత్యయుగము ఎంత ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది. దాని పేరే స్వర్గము, హెవెన్, కొత్త ప్రపంచము. ఇక్కడ చూడండి, పాత ప్రపంచములో వర్షాల కారణంగా ఇళ్ళు పడిపోతూ ఉంటాయి. మనుష్యులు మరణిస్తారు. భూకంపాలు వస్తాయి, అందరూ కూరుకుపోయి చనిపోతారు. సత్యయుగంలో చాలా కొద్ది మంది ఉంటారు, తర్వాత వృద్ధి చెందుతూ ఉంటుంది. మొదట సూర్య వంశీయులుంటారు. ప్రపంచం 25 శాతము పాతదిగా అయినప్పుడు చంద్రవంశీయులు ఉంటారు. సత్యయుగం 1250 సంవత్సరాలు. అది 100 శాతం కొత్త ప్రపంచము. అక్కడ దేవీ దేవతలు రాజ్యం చేస్తారు. మీలో కూడా చాలామంది ఈ విషయాలను మర్చిపోతారు. రాజధాని అయితే స్థాపన అవ్వాల్సిందే. హార్ట్ ఫెయిల్ అవ్వకూడదు. ఇది పురుషార్థం యొక్క విషయము. తండ్రి పిల్లలందరి చేత ఒకే రకంగా పురుషార్థము చేయిస్తారు. మీరు మీ కోసం విశ్వముపై స్వర్గ రాజ్యాన్ని స్థాపన చేస్తారు. నేను ఏమవుతాను అని స్వయాన్ని పరిశీలించుకోవాలి. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఈ పురుషోత్తమ యుగంలో స్వర్గము యొక్క దేవీ దేవతలుగా అయ్యే చదువును చదువుకుని స్వయాన్ని అర్హులుగా చేసుకోవాలి. పురుషార్థములో హార్ట్ ఫెయిల్ అవ్వకూడదు.

2. ఈ అనంతమైన ఆటలో ప్రతి పాత్రధారి యొక్క పాత్ర మరియు పొజిషన్ వేర్వేరుగా ఉంటాయి, పొజిషన్ బట్టి వారికి గౌరవము లభిస్తుంది, ఈ రహస్యాలన్ని అర్థము చేసుకొని ప్రపంచ చరిత్ర-భూగోళాలను స్మరణ చేసి స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి.

వరదానము:-

శ్రీమతము ద్వారా మన్మతము మరియు జనమతము యొక్క కల్తీని సమాప్తం చేసే సత్యమైన స్వ కళ్యాణీ భవ

తండ్రి పిల్లలకు స్వ కళ్యాణము మరియు విశ్వ కళ్యాణం కోసం అన్ని ఖజానాలు ఇచ్చారు కానీ వాటిని వ్యర్థము వైపు ఉపయోగించడం, అకళ్యాణ కార్యంలో ఉపయోగించడం, శ్రీమతంలో మన్మతము మరియు జనమతముల కల్తీ చేయడం - ఇది తాకట్టులో మోసము చేయడం వంటిది. ఇప్పుడు ఈ మోసమును మరియు కల్తీని సమాప్తం చేసి ఆత్మికతను మరియు దయను ధారణ చేయండి. మీపై మరియు సర్వులపై దయ చూపించి స్వ కళ్యాణకారులుగా అవ్వండి. స్వయాన్ని చూసుకోండి, తండ్రిని చూడండి, ఇతరులను చూడకండి.

స్లోగన్:-

ఎవరైతే ఎటువైపు ఆకర్షింపబడరో వారే సదా హర్షితంగా ఉండగలరు.