26-09-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైన పిల్లలూ - ఏ తండ్రి అయితే మిమ్మల్ని వజ్ర సమానంగా తయారుచేస్తారో, వారిపై మీకు ఎప్పుడూ సంశయము కలగకూడదు, సంశయబుద్ధి కలవారిగా అవ్వడమంటే స్వయాన్ని నష్టపరచుకోవడం”

ప్రశ్న:-

మనుష్యుల నుండి దేవతలుగా తయారయ్యే చదువులో ఉత్తీర్ణులయ్యేందుకు ముఖ్యమైన ఆధారమేమిటి?

జవాబు:-

నిశ్చయము. నిశ్చయబుద్ధి కలవారిగా అయ్యేందుకు సాహసం కావాలి. మాయ ఈ సాహసాన్ని తెంచేస్తుంది. సంశయబుద్ధి కలవారిగా తయారుచేస్తుంది. నడుస్తూ-నడుస్తూ ఒకవేళ చదువుపై లేక చదివించే సుప్రీమ్ టీచర్ పై సంశయము వచ్చినట్లయితే స్వయానికి మరియు ఇతరులకు చాలా నష్టము కలిగిస్తారు.

గీతము:-

నీవు ప్రేమసాగరుడవు...... (తూ ప్యార్ కా సాగర్ హై......)

ఓంశాంతి. ఆత్మిక పిల్లలకు శివబాబా అర్థం చేయిస్తున్నారు, పిల్లలైన మీరు తండ్రిని - నీవు ప్రేమసాగరుడవు అని మహిమ చేస్తారు. వారిని జ్ఞానసాగరుడని కూడా అంటారు. జ్ఞానసాగరుడు ఒక్కరే కావున మిగిలిన వారిని అజ్ఞానులని అంటారు, ఎందుకంటే ఇది జ్ఞానము మరియు అజ్ఞానముల ఆట. జ్ఞానం పరమపిత పరమాత్మ వద్ద మాత్రమే ఉంది. ఈ జ్ఞానం ద్వారా కొత్త ప్రపంచము స్థాపనవుతుంది. ఎవరో కొత్త ప్రపంచాన్ని తయారుచేస్తారని కాదు. ఈ ప్రపంచము అయితే అవినాశీగానే ఉంది. కేవలము పాత ప్రపంచాన్ని మార్చి కొత్తదిగా చేస్తారు. ప్రళయం జరుగుతుందని కాదు. మొత్తం ప్రపంచం ఎప్పటికీ వినాశనమవ్వదు. పాతదిగా ఉన్నది మారి కొత్తదిగా అవుతుంది. మీరు కూర్చుని ఉన్నది పాత ఇల్లు అని తండ్రి అర్థం చేయించారు. కొత్త ఇంటికి వెళ్తామని మీకు తెలుసు. పాత ఢిల్లీ ఉంది. ఇప్పుడు పాత ఢిల్లీ సమాప్తమై, దానికి బదులుగా కొత్త ఢిల్లీ తయారవ్వాలి. ఇప్పుడు కొత్తదిగా ఎలా అవుతుంది? మొదట అక్కడ ఉండేందుకు యోగ్యులైన వారు కావాలి. కొత్త ప్రపంచంలో సర్వగుణ సంపన్నులు...... ఉంటారు. పిల్లలైన మీకు ఈ ముఖ్యమైన లక్ష్యము-ఉద్దేశ్యము కూడా ఉంది. పాఠశాలలో ముఖ్యమైన లక్ష్యము-ఉద్దేశ్యము ఉంటుంది కదా. చదువుకునేవారికి నేను డాక్టరవుతాను, న్యాయవాదినవుతాను...... అని తెలిసి ఉంటుంది. ఇక్కడ మేము మనుష్యుల నుండి దేవతలుగా అయ్యేందుకు వచ్చామని మీకు తెలుసు. పాఠశాలలో ముఖ్యమైన లక్ష్యము-ఉద్దేశ్యము లేకుండా ఎవ్వరూ కూర్చోలేరు. కానీ ఇది ఎటువంటి అద్భుతమైన పాఠశాల అంటే ఆ ముఖ్యమైన లక్ష్యము-ఉద్దేశ్యమును తెలుసుకుని కూడా చదువుతూ-చదువుతూ చదువును వదిలేస్తారు. ఈ చదువు తప్పు, ఇది ముఖ్యమైన లక్ష్యము కాదు, ఇలా ఎప్పటికీ సాధ్యము కాదు అని భావిస్తారు. చదివించేవారిపై కూడా సంశయము వచ్చేస్తుంది. ఆ చదువులో, చదువుకోలేకపోయినా, చదువుకునేందుకు ధనము లేకపోయినా, ధైర్యము లేకపోయినా చదువును వదిలేస్తారు. అంతేకానీ, న్యాయశాస్త్రమే తప్పు లేక చదివించేవారే తప్పు అని ఎప్పుడూ అనరు. ఇక్కడ మానవుల బుద్ధి అద్భుతమైనది. చదువులో సంశయమొస్తే ఈ చదువే తప్పు అని అంటారు. భగవంతుడు చదివించనే చదివించరు, చక్రవర్తి పదవి మొదలైనవి ఏవీ లభించవు...... ఇవన్నీ వ్యర్థ ప్రలాపాలు అని అంటారు. ఇలా కూడా అనేక మంది పిల్లలు చదువుతూ-చదువుతూ మధ్యలో వదిలేస్తారు. మమ్మల్ని భగవంతుడే చదివిస్తున్నారు, దాని ద్వారా మేము మనుష్యుల నుండి దేవతలుగా అవుతున్నాము అని మీరు అనేవారు కదా, మరి ఇప్పుడు ఏమయింది అని వారిని అడుగుతారు. అప్పుడు వారు, లేదు, లేదు, ఇవన్నీ వ్యర్థ ప్రలాపాలు, ఈ ముఖ్యమైన లక్ష్యము-ఉద్దేశ్యము మాకు అర్థమవ్వడం లేదు అని అంటారు. కొంతమంది నిశ్చయంతో చదివేవారు, సంశయము వస్తూనే చదువును వదిలేసారు. నిశ్చయము ఎలా కలిగింది, తర్వాత సంశయబుద్ధి కలవారిగా ఎవరు తయారుచేశారు? వాళ్ళు కనుక చదువుకుని ఉంటే చాలా శ్రేష్ఠమైన పదవిని పొందేవారు అని మీరంటారు. చాలా మంది చదువుకుంటూ ఉంటారు. బ్యారిస్టరీ చదువుతూ-చదువుతూ మధ్యలో వదిలేస్తారు, కొంతమంది బాగా చదువుకుని బ్యారిస్టర్ గా అవుతారు. కొందరు చదువుకుని పాస్ అవుతారు, కొందరు ఫెయిల్ అయిపోతారు...... ఇక తరువాత ఏదో ఒక తక్కువ పదవిని పొందుతారు. ఇది చాలా పెద్ద పరీక్ష. ఇందులో చాలా సాహసము కావాలి. ఒకటేమో నిశ్చయబుద్ధి కలవారిగా ఉండే సాహసము కావాలి. మాయ ఎటువంటిదంటే ఇప్పుడిప్పుడే నిశ్చయబుద్ధి కలవారిగా, ఇప్పుడిప్పుడే సంశయబుద్ధి కలవారిగా చేస్తుంది. చదువుకోవడానికైతే చాలా మందే వస్తారు కానీ కొంతమంది మందబుద్ధి కలవారు ఉంటారు. నంబరువారుగా పాస్ అవుతారు కదా. వార్తాపత్రికలలో కూడా లిస్టు వెలువడుతుంది. ఇక్కడ కూడా అలాగే ఉంది, చదువుకునేందుకు చాలా మంది వస్తారు. కొందరు మంచిబుద్ధి కలవారు ఉన్నారు, కొందరు మందబుద్ధి కలవారు ఉన్నారు. మందబుద్ధి కలవారిగా ఉంటూ-ఉంటూ ఏదో ఒక సంశయం వచ్చి వదిలేస్తారు. అటువంటివారు ఇతరులకు కూడా నష్టము కలిగిస్తారు. సంశయబుద్ధి వినశ్యంతి అని అంటారు కదా. ఇక వారు ఉన్నతమైన పదవిని పొందలేరు. నిశ్చయం కూడా ఉంది కానీ పూర్తిగా చదువుకోకపోతే పాస్ అవ్వలేరు ఎందుకంటే బుద్ధి ఇక దేనికీ పనికిరాదు. ధారణ జరగదు. మేము ఆత్మలమని మర్చిపోతారు. నేను ఆత్మలైన మీకు పరమపితను అని తండ్రి చెప్తున్నారు. తండ్రి వచ్చి ఉన్నారని పిల్లలైన మీకు తెలుసు. ఎవరికైనా ఎక్కువ విఘ్నాలు వస్తే, వారికి సంశయం కలుగుతుంది. మాకు ఫలానా బ్రాహ్మణి వలన నిశ్చయం కలగడం లేదు అని అంటారు. అరే! బ్రాహ్మణి ఎలా ఉన్నా మీరైతే చదువుకోవాలి కదా. టీచరు సరిగ్గా చదివించకపోతే వారిని చదువు చెప్పడం నుండి తొలగించాలని ఆలోచిస్తారు. కానీ మీరైతే చదువుకోవాలి కదా. ఇది తండ్రి యొక్క చదువు. చదివించేవారు ఆ సుప్రీమ్ టీచర్. బ్రాహ్మణి కూడా ఆ సుప్రీమ్ టీచర్ జ్ఞానాన్నే వినిపిస్తారు కావున మీ అటెన్షన్ అనేది చదువుపై ఉండాలి కదా. చదువుకోకుండా పరీక్షలో పాస్ అవ్వలేరు. కానీ తండ్రిపై ఉన్న నిశ్చయమే తొలగిపోతే ఇక చదువునే వదిలేస్తారు. చదువుకుంటూ-చదువుకుంటూ ఈ టీచరు ద్వారా ఈ పదవి లభిస్తుందా అని టీచరుపై సంశయము వస్తే ఇక చదువును వదిలేస్తారు. ఇతరులను కూడా పాడు చేస్తారు, నింద చేసినట్లయితే ఇంకా నష్టం జరుగుతుంది. చాలా నష్టము కలుగుతుంది. ఇక్కడ ఎవరైనా పాపం చేస్తే వారికి వంద రెట్ల శిక్ష పడుతుంది అని తండ్రి చెప్తున్నారు. చాలా మందిని పాడు చేసేందుకు ఒకరు నిమిత్తమౌతారు. కావున ఎంతైతే పుణ్యాత్ములుగా అయ్యారో, ఇక మళ్ళీ పాపాత్ములుగా అయిపోతారు. ఈ చదువు ద్వారానే పుణ్యాత్ములుగా అవుతారు, పుణ్యాత్ములుగా చేసేవారు ఒక్క తండ్రి మాత్రమే. ఒకవేళ ఎవరైనా చదవలేకపోతే వారిలో తప్పకుండా ఏదో ఒక దోషము ఉంది. అదృష్టంలో ఏముంటుందో అదే అవుతుంది, నేనేమి చేయాలి అని అనేస్తారు. హార్ట్ ఫెయిల్ అయినట్లు అయిపోతారు. ఎవరైతే ఇక్కడకు వచ్చి మరజీవులుగా అయ్యారో, వారే మళ్ళీ వెళ్ళి రావణ రాజ్యములో మరజీవులుగా అవుతారు. అటువంటివారు వజ్ర సమానమైన జీవితాన్ని తయారుచేసుకోలేరు. మనుష్యులు హార్ట్ ఫెయిల్ అయితే వెళ్ళి మరో జన్మ తీసుకుంటారు. ఇక్కడ హార్ట్ ఫెయిల్ అయితే ఆసురీ సంప్రదాయంలోకి వెళ్ళిపోతారు. ఇది మరజీవా జన్మ. కొత్త ప్రపంచములోకి వెళ్ళేందుకు తండ్రికి చెందినవారిగా అవుతారు. ఆత్మలే వెళ్తాయి కదా. ఆత్మనైన నేను ఈ శరీర భానాన్ని వదిలినప్పుడు, నేను దేహీ-అభిమాని అని భావిస్తారు. నేను వేరు, శరీరము వేరు. ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటున్నారంటే తప్పకుండా మనము వేరు అనే కదా. ఆత్మలైన మనము శ్రీమతమును అనుసరించి ఈ భారతదేశములో స్వర్గ స్థాపన చేస్తున్నామని మీకు తెలుసు. మనుష్యులను దేవతలుగా చేసే ఈ కళను నేర్చుకోవాలి. సత్యమైన సాంగత్యము ఎవరిదీ లేదని కూడా పిల్లలకు అర్థము చేయించడం జరిగింది. సత్యము అని ఒక్క పరమాత్మనే అంటారు. వారి పేరు శివ, వారే సత్యయుగాన్ని స్థాపిస్తారు. కలియుగ ఆయువు తప్పకుండా పూర్తవ్వనున్నది. పూర్తి ప్రపంచ చక్రము ఎలా తిరుగుతుందో ఈ సృష్టి చక్ర చిత్రములో స్పష్టంగా ఉంది. దేవతలుగా అయ్యేందుకు సంగమయుగములో తండ్రికి చెందినవారిగా అవుతాము. తండ్రిని వదిలినట్లయితే మళ్ళీ కలియుగములోకి వెళ్ళిపోతారు. బ్రాహ్మణత్వములో సంశయము కలిగినట్లయితే వెళ్ళి శూద్రవంశంలో పడతారు. ఇక వారు మళ్ళీ దేవతలుగా అవ్వలేరు.

ఇప్పుడు స్వర్గ స్థాపనకు పునాది ఎలా పడుతుంది అని తండ్రి అర్థము చేయిస్తున్నారు. ఇప్పుడు శంఖు స్థాపన, తర్వాత ప్రారంభోత్సవము, రెండూ జరుగుతాయి. ఇక్కడ గుప్తంగా జరుగుతాయి. మేము స్వర్గము కొరకు తయారవుతున్నామని మీకు తెలుసు. ఇక తర్వాత నరకము పేరే ఉండదు. అంతిమము వరకు, ఎప్పటివరకైతే జీవించి ఉంటామో, అప్పటివరకు తప్పకుండా చదువుకోవాలి. పావనంగా తయారుచేసే పతితపావనుడు ఒక్క తండ్రి మాత్రమే.

ఇది సంగమయుగమని పిల్లలైన మీకు తెలుసు, ఈ యుగములోనే తండ్రి పావనంగా తయారుచేసేందుకు వస్తారు. పురుషోత్తమ సంగమయుగంలో మనుష్యులు నరుని నుండి నారాయణునిగా అవుతారని వ్రాయాలి. ఇది మీ ఈశ్వరీయ జన్మ సిద్ధ అధికారమని కూడా వ్రాయబడి ఉంది. తండ్రి మీకిప్పుడు దివ్య దృష్టినిస్తారు. మా 84 జన్మల చక్రము ఇప్పుడు పూర్తి అయ్యిందని ఆత్మకు తెలుసు. ఆత్మలకు తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. ఆత్మ చదువుతుంది, కానీ దేహాభిమానము పదే-పదే వచ్చేస్తుంది ఎందుకంటే అర్థకల్పపు దేహాభిమానము కదా. కావున దేహీ-అభిమానులుగా అయ్యేందుకు సమయం పడుతుంది. తండ్రి కూర్చుని ఉన్నారు, సమయం లభించి ఉంది. బ్రహ్మా ఆయువు 100 సంవత్సరాలని చెప్తారు లేక తక్కువైనా ఉండవచ్చు. ఒకవేళ బ్రహ్మా వెళ్ళిపోయారనుకోండి, ఇక స్థాపన జరగదు అని అయితే కాదు. సైన్యమైన మీరు కూర్చుని ఉన్నారు కదా. చదువుకోవాలి అని తండ్రి మంత్రమునిచ్చేశారు. సృష్టి చక్రము ఎలా తిరుగుతుందో, ఇది కూడా మీ బుద్ధిలో ఉంది. స్మృతియాత్రలో ఉండాలి. స్మృతి ద్వారానే వికర్మలు వినాశనమౌతాయి. భక్తిమార్గములో అందరి ద్వారా వికర్మలు జరిగాయి. పాత ప్రపంచము మరియు కొత్త ప్రపంచము, ఈ రెండు గోళములు మీ ఎదురుగా ఉన్నాయి. కావున మీరు పాత ప్రపంచము రావణ రాజ్యము ముర్దాబాద్, కొత్త ప్రపంచము జ్ఞాన మార్గము రామరాజ్యము జిందాబాద్ అని వ్రాయవచ్చు. ఎవరైతే పూజ్యులుగా ఉండేవారో, వారే పూజారులుగా అయ్యారు. కృష్ణుడు కూడా పూజ్యులుగా, సుందరంగా ఉండేవారు, తర్వాత రావణ రాజ్యంలో పూజారిగా నల్లగా అయిపోతారు. ఇది అర్థము చేయించడం సహజము. మొట్టమొదట పూజలు మొదలైనప్పుడు పెద్ద పెద్ద వజ్రాలతో లింగాన్ని తయారుచేస్తారు. అది చాలా విలువకలదిగా ఉంటుంది, ఎందుకంటే తండ్రి మిమ్మల్ని ఇంత షావుకారుగా తయారుచేశారు కదా. వారు స్వయంగా వజ్రము, వారు ఆత్మలను కూడా వజ్ర సమానంగా తయారుచేస్తారు, కావున వారి రూపాన్ని వజ్రాలతో తయారుచేసి పెట్టికోవాలి కదా. వజ్రాన్ని ఎప్పుడూ మధ్యలోనే పెడతారు. వజ్రంతో పోలిస్తే పుష్యరాగము మొదలైనవాటికి అంత విలువ ఉండదు, అందుకే వజ్రాన్ని మధ్యలో పెట్టడం జరుగుతుంది. వీరి ద్వారా 8 రత్నాలు విజయ మాలలోని మణులుగా అవుతారు, అన్నిటికంటే ఎక్కువ విలువ వజ్రానిదే. మిగిలినవారు నంబరువారుగా తయారవుతారు. అలా తయారుచేసేవారు శివబాబాయే. ఈ విషయాలన్నీ తండ్రి తప్ప మరెవ్వరూ అర్థం చేయించలేరు. చదువుకుంటూ-చదువుకుంటూ ఆశ్చర్యంతో 'బాబా బాబా' అని అంటారు, మళ్ళీ వెళ్ళిపోతారు. శివబాబాను బాబా అని అన్నప్పుడు, వారిని ఎప్పుడూ వదలకూడదు. ఇక తర్వాత వారి తలరాత అని చెప్పబడుతుంది. ఎవరి అదృష్టంలోనైనా ఎక్కువ లేకపోతే, వాళ్ళు ఎటువంటి కర్మలు చేస్తారంటే దాని వలన వారికి వంద రెట్లు శిక్ష పడుతుంది. పుణ్యాత్ములుగా అయ్యేందుకు పురుషార్థము చేసి, మళ్ళీ పాపము చేస్తే వంద రెట్లు పాపమైపోతుంది, ఇక వారు మరుగుజ్జులుగానే ఉండిపోతారు, వృద్ధిని పొందలేరు. వంద రెట్లు శిక్ష అదనంగా పడేటప్పటికి ఇక స్థితి శక్తిశాలీగా అవ్వదు. ఏ తండ్రి ద్వారా అయితే మీరు వజ్ర సమానంగా తయారవుతున్నారో, వారిపై సంశయము ఎందుకు కలగాలి. ఏ కారణంగానైనా తండ్రిని వదిలేస్తే వారిని మూర్ఖులని అంటారు. మీరు ఎక్కడున్నాసరే, తండ్రిని స్మృతి చేస్తే శిక్షల నుండి ముక్తులవుతారు. ఇక్కడకు మీరు పతితుల నుండి పావనంగా అయ్యేందుకే వస్తారు. గతములో కూడా ఏవో అటువంటి కర్మలు చేసి ఉంటే శరీర కర్మభోగము కూడా ఎంతగా నడుస్తుంది. ఇప్పుడు మీరు అర్థకల్పము కొరకు దీని నుండి రక్షింపబడతారు. మేము ఎంతవరకు మా ఉన్నతిని చేసుకుంటున్నాము, ఇతరుల సేవ చేస్తున్నామా అని స్వయాన్ని పరిశీలించుకోండి. "ఇది విశ్వంలో శాంతి యొక్క రాజ్యము, ఇది ఇప్పుడు స్థాపనవుతూ ఉంది" అని లక్ష్మీనారాయణుల చిత్రములో కూడా పైన వ్రాయవచ్చు. ఇదే ముఖ్యమైన లక్ష్యము-ఉద్దేశ్యము. అక్కడ 100 శాతము పవిత్రత, సుఖ-శాంతులు ఉండేవి. వీరి రాజ్యములో వేరే ధర్మమేదీ ఉండదు కనుక ఇప్పుడున్న ధర్మాలన్నీ తప్పకుండా వినాశనమవుతాయి కదా. అర్థం చేయించేందుకు చాలా గొప్ప బుద్ధి కావాలి. లేదంటే మీ స్థితి అనుసారంగానే అర్థం చేయిస్తారు. చిత్రాల ఎదురుగా కూర్చుని ఆలోచనలు నడిపించాలి. వివరణ అయితే మీకు లభించి ఉంది. ఒకవేళ అర్థము చేసుకుని ఉంటే మరి ఇతరులకు అర్థం చేయించాలి, అందుకే బాబా మ్యూజియం లను తెరిపిస్తూ ఉంటారు. స్వర్గ ద్వారము (గేట్ వే టూ హెవెన్) అనే పేరు కూడా బాగుంది. అది ఢిల్లీ గేట్, ఇండియా గేట్. ఇది స్వర్గానికి గేట్. ఇప్పుడు మీరు స్వర్గ ద్వారాలను తెరుస్తున్నారు. భక్తిమార్గంలో భూల్ భులయ్యా ఆట (తికమక దారుల ఆట) లో వలె తికమకపడతారు. దారి ఎవ్వరికీ లభించదు. అందరూ లోలోపలే మాయా రాజ్యంలో చిక్కుకుంటారు. మళ్ళీ తండ్రి వచ్చి బయటకు తీస్తారు. కొందరికి బయటపడాలని లేకపోతే తండ్రి మాత్రం ఏమి చేస్తారు, అందుకే మహామూర్ఖులను చూడాలంటే కూడా ఇక్కడే చూడండి అని తండ్రి అంటారు, అటువంటివారు చదువును వదిలేస్తారు. సంశయబుద్ధి కలవారిగా అయి జన్మ-జన్మలకు తమను తామే హతమార్చుకుంటారు. అదృష్టము పాడైనప్పుడు అలా జరుగుతుంది. గ్రహచారము కూర్చున్నప్పుడు సుందరంగా అయ్యేందుకు బదులుగా నల్లగా అయిపోతారు. ఆత్మ గుప్తంగా చదువుకుంటుంది. ఆత్మనే శరీరము ద్వారా అంతా చేస్తుంది. ఆత్మ శరీరము లేకుండా ఏమీ చేయలేదు. ఆత్మ అని భావించడంలోనే శ్రమ ఉంది. ఆత్మ అని నిశ్చయం చేసుకోలేదంటే మళ్ళీ దేహాభిమానములోకి వచ్చేస్తారు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. సుప్రీమ్ టీచర్ యొక్క చదువు మనల్ని నరుని నుండి నారాయణునిగా తయారు చేసేటటువంటిది, ఈ నిశ్చయంతోనే అటెన్షన్ పెట్టి చదువును చదువుకోవాలి. చదివించే టీచరును చూడకూడదు.

2. దేహీ అభిమానులుగా అయ్యే పురుషార్థము చేయాలి, మరజీవులుగా అయ్యారు కావున ఈ శరీర భానాన్ని వదిలేయాలి. పుణ్యాత్మగా అవ్వాలి, ఎటువంటి పాపకర్మ చేయకూడదు.

వరదానము:-

'స్వ స్థితి' అనే సీటుపై స్థితులై పరిస్థితులపై విజయం ప్రాప్తి చేసుకునే మాస్టర్ రచయిత భవ

ఏ పరిస్థితి అయినా ప్రకృతి ద్వారా వస్తుంది, కావున పరిస్థితి రచన మరియు స్వస్థితిలో ఉండేవారు రచయిత. మాస్టర్ రచయిత లేక మాస్టర్ సర్వశక్తివంతులు ఎప్పుడూ ఓడిపోరు. అది అసంభవము. ఒకవేళ ఎవరైనా తమ సీటును వదిలితే ఓడిపోవడం జరుగుతుంది. సీటును వదలడం అనగా శక్తిహీనులుగా అవ్వడం. సీటు ఆధారంపై శక్తులు స్వతహాగా వస్తాయి. ఎవరైతే సీటు నుండి క్రిందకు వచ్చేస్తారో వారికి మాయ యొక్క ధూళి అంటుకుంటుంది. బాప్ దాదాకు ప్రియమైన, మరజీవా జన్మధారులైన బ్రాహ్మణులు ఎప్పుడూ దేహాభిమానమనే మట్టిలో ఆడుకోలేరు.

స్లోగన్:-

దృఢత కఠిన సంస్కారాలను కూడా మైనం వలె కరిగించేస్తుంది (సమాప్తం చేస్తుంది).