21-09-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


“మధురమైన పిల్లలూ -
సంగమయుగములో ప్రేమ సాగరుడైన తండ్రి మీకు ప్రేమ యొక్క వారసత్వమునే ఇస్తారు, కనుక మీరందరికీ ప్రేమనివ్వండి, కోపం చేయకండి”

ప్రశ్న:-
తమ రిజిస్టరును సరిగ్గా ఉంచుకునేందుకు బాబా మీకు ఏ మార్గాన్ని తెలియజేశారు?

జవాబు:-
ప్రేమ యొక్క మార్గాన్నే తండ్రి మీకు తెలియజేస్తున్నారు. వారు శ్రీమతమునిస్తున్నారు - పిల్లలూ, ప్రతి ఒక్కరితో ప్రేమగా నడుచుకోండి. ఎవ్వరికీ దుఃఖమునివ్వకండి. కర్మేంద్రియాలతో ఎప్పుడూ ఎటువంటి విరుద్ధమైన కర్మ చేయకండి. నాలో ఎటువంటి ఆసురీ గుణము అయితే లేదు కదా? మూడీగా లేను కదా? ఏ విషయంలోనూ డిస్టర్బ్ అవ్వడం లేదు కదా? అని సదా చెక్ చేసుకోండి.

గీతము:-
ఈ సమయం వెళ్ళిపోతుంది......

ఓంశాంతి.
మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలు పాటను విన్నారు. రోజు-రోజుకూ మన ఇల్లు, మన గమ్యము సమీపిస్తూ ఉంటుంది. ఇప్పుడు శ్రీమతము ఏదైతే చెప్తుందో, అందులో పొరపాటు చేయకండి. అందరికీ సందేశమునివ్వమని తండ్రి డైరక్షన్ లభిస్తుంది. లక్షల కోట్ల మందికి ఈ సందేశమునివ్వాలని పిల్లలకు తెలుసు. ఇక తర్వాత వారు ఏదో ఒక సమయంలో వచ్చేస్తారు. ఎక్కువ మంది అయినప్పుడు చాలా మందికి సందేశాన్నిస్తారు. అందరికీ తండ్రి సందేశము లభించాలి. సందేశము చాలా సహజమైనది. కేవలం స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయాలి మరియు మనసా-వాచా-కర్మణా ఏ కర్మేంద్రియం ద్వారా ఎటువంటి చెడు కర్మ చేయకూడదు. మొదట మనసులో వస్తుంది, తర్వాత వాచాలోకి వస్తుంది. ఇది పుణ్య కార్యం, ఇది చేయాలి అని మీకిప్పుడు రైట్-రాంగ్ ను అర్థము చేసుకునే బుద్ధి కావాలి. కోపము చేయాలని మనసులో సంకల్పం వస్తుంది, ఒకవేళ కోపము చేసినట్లయితే అది పాపమవుతుంది అని ఇప్పుడు బుద్ధి లభించింది. తండ్రిని స్మృతి చేసినట్లయితే పుణ్యాత్మగా అవుతారు. అచ్ఛా, ఇప్పుడు కోపం వచ్చింది, ఇక మళ్ళీ చేయము అని కాదు. ఇలా మళ్ళీ-మళ్ళీ అని అంటూ ఉంటే అలవాటు అయిపోతుంది. మనుష్యులు అటువంటి కర్మలు చేసినప్పుడు ఇది పాపము కాదని భావిస్తారు. వికారాలను పాపంగా భావించరు. ఇది చాలా పెద్ద పాపము, దీనిపై విజయం పొందాలి అని ఇప్పుడు తండ్రి తెలియజేస్తున్నారు, మరియు నన్ను స్మృతి చేయండి, మృత్యువు ఎదురుగా నిలబడి ఉందని తండ్రి చెప్తున్నారు అని అందరికీ తండ్రి సందేశాన్నివ్వాలి. ఎవరైనా మరణించేటప్పుడు గాడ్ ఫాదర్ ను స్మృతి చేయమని వారికి చెప్తారు. రిమెంబర్ గాడ్ ఫాదర్ అని చెప్తారు ఎందుకంటే వారు గాడ్ ఫాదర్ వద్దకు వెళ్తారని అనుకుంటారు. కానీ, గాడ్ ఫాదర్ ను గుర్తు చేసినట్లయితే ఏమవుతుంది? ఎక్కడికి వెళ్తారు? అన్నది వారికి తెలియదు. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటుంది. గాడ్ ఫాదర్ వద్దకు ఎవ్వరూ వెళ్ళలేరు. కనుక ఇప్పుడు పిల్లలైన మీకు అవినాశీ తండ్రి యొక్క అవినాశీ స్మృతి ఉండాలి. తమోప్రధానంగా, దుఃఖితులుగా అయినప్పుడు ఒకరికొకరు గాడ్ ఫాదర్ ను స్మృతి చేయమని చెప్పుకుంటారు, ఆత్మలందరూ ఒకరికొకరు చెప్పుకుంటారు, చెప్తుంది ఆత్మనే కదా. పరమాత్మ చెప్తున్నారు అని కాదు. తండ్రిని స్మృతి చేయమని ఆత్మ, ఆత్మకు చెప్తుంది. ఇది ఒక సాధారణ పద్ధతి. మరణించే సమయంలో ఈశ్వరుడిని స్మృతి చేస్తారు. ఈశ్వరుడి పట్ల భయముంటుంది. మంచి లేదా చెడు కర్మల ఫలితాన్ని ఈశ్వరుడే ఇస్తారు, చెడు కర్మలు చేస్తే ఈశ్వరుడు ధర్మరాజు ద్వారా చాలా శిక్షలు ఇస్తారని భావిస్తారు, అందుకే భయముంటుంది, కర్మలనైతే తప్పకుండా అనుభవించవలసి ఉంటుంది కదా. పిల్లలైన మీరిప్పుడు కర్మ-అకర్మ-వికర్మల గతిని అర్థం చేసుకున్నారు. ఆ కర్మలు అకర్మలుగా ఉంటాయని తెలుసు. ఏ కర్మలనైతే స్మృతిలో ఉండి చేస్తారో, అవి బాగా చేస్తారు. రావణరాజ్యములో మనుష్యులు చెడు కర్మలే చేస్తారు. రామరాజ్యంలో చెడు కర్మలు ఎప్పుడూ జరగవు. ఇప్పుడైతే శ్రీమతము లభిస్తూ ఉంటుంది. ఎక్కడి నుండైనా పిలుపు వస్తే, ఇది చేయవచ్చా లేదా చేయకూడదా అని ప్రతి విషయములో అడుగుతూ ఉండండి. ఎవరైనా పోలీసు ఉద్యోగం చేస్తున్నారనుకోండి, వారికి కూడా - మీరు మొదట ప్రేమగా అర్థము చేయించండి అని చెప్పడం జరుగుతుంది. సత్యము చెప్పకపోతే తర్వాత కొట్టండి. ప్రేమతో అర్థం చేయిస్తే వారు మాట వినవచ్చు కానీ ఆ ప్రేమలో కూడా యోగబలము నిండి ఉన్నట్లయితే, ఆ ప్రేమ యొక్క శక్తితో ఎవరికైనా అర్థం చేయించినా అర్థం చేసుకుంటారు, వీరు ఈశ్వరుని వలె అర్థం చేయిస్తున్నారని భావిస్తారు. మీరు ఈశ్వరుని పిల్లలు, యోగులు కదా. మీలో కూడా ఈశ్వరీయ శక్తి ఉంది. ఈశ్వరుడు ప్రేమసాగరుడు, వారిలో శక్తి ఉంది కదా. వారు అందరికీ వారసత్వాన్నిస్తారు. స్వర్గములో చాలా ప్రేమ ఉంటుందని మీకు తెలుసు. ఇప్పుడు మీరు ప్రేమ యొక్క వారసత్వాన్ని పూర్తిగా తీసుకుంటున్నారు. తీసుకుంటూ-తీసుకుంటూ నంబరువారుగా పురుషార్థం చేస్తూ-చేస్తూ ప్రియంగా అయిపోతారు.

ఎవ్వరికీ దుఃఖమునివ్వకూడదు, అలా చేస్తే దుఃఖితులై మరణిస్తారని తండ్రి చెప్తున్నారు. తండ్రి ప్రేమ యొక్క మార్గాన్ని తెలియజేస్తున్నారు. మనసులోకి వచ్చినట్లయితే అది ముఖములో కూడా వచ్చేస్తుంది. కర్మేంద్రియాల ద్వారా చేసినట్లయితే రిజిస్టరు పాడైపోతుంది. దేవతల నడవడికను గాయనం చేస్తారు కదా, అందుకే దేవతల పూజారులకు అర్థం చేయించండి అని బాబా చెప్తున్నారు. మీరు సర్వగుణ సంపన్నులు, 16 కళా సంపూర్ణులు అని వారి మహిమను పాడుతారు మరియు వారి నడవడిక గురించి కూడా వినిపిస్తారు. కనుక వారికి, మీరు ఆ విధంగా ఉండేవారు, ఇప్పుడు లేరు, మళ్ళీ తప్పకుండా అవుతారు, మీరు అటువంటి దేవతగా అవ్వాలంటే మీ నడవడికను ఆ విధంగా ఉంచుకోండి, అప్పుడు అలా అవుతారు అని అర్థం చేయించండి. నేను సంపూర్ణ నిర్వికారీగా ఉన్నానా? నాలో ఎటువంటి ఆసురీ గుణం అయితే లేదు కదా? నేను ఏ విషయములోనూ గొడవపడడం లేదు కదా, మూడీగా అవ్వడం లేదు కదా? అని స్వయాన్ని చెక్ చేసుకోవాలి. మీరు చాలా సార్లు పురుషార్థము చేశారు. మీరు ఆ విధంగా తయారవ్వాలని తండ్రి చెప్తున్నారు. తయారుచేసేవారు కూడా హాజరై ఉన్నారు. కల్ప-కల్పము మిమ్మల్ని ఆ విధంగా తయారుచేస్తాను అని చెప్తున్నారు. కల్పక్రితం జ్ఞానం తీసుకున్నవారు తప్పకుండా వచ్చి తీసుకుంటారు. పురుషార్థము కూడా చేయించడం జరుగుతుంది మరియు నిశ్చింతగా కూడా ఉంటారు. డ్రామాలో ఆ విధంగా నిర్ణయించబడింది. డ్రామాలో నిర్ణయించబడి ఉంటే తప్పకుండా చేస్తామని కొందరు అంటారు. మంచి చార్టు ఉన్నట్లయితే డ్రామా చేయిస్తుంది. అప్పుడు వారి భాగ్యములో లేదని అర్థము చేసుకోవడం జరుగుతుంది. ప్రారంభంలో ఒకరు ఆ విధంగా గొడవపడ్డారు, వారి భాగ్యములో లేదు - డ్రామాలో ఉంటే డ్రామా నా చేత పురుషార్థము చేయిస్తుంది అని అన్నారు. అంతే, విడిచిపెట్టేసారు. మీకు కూడా ఇటువంటివారు చాలామంది కలుస్తారు. మీ లక్ష్యం ఉద్దేశ్యం అయితే ఇక్కడ నిలబడి ఉంది, బ్యాడ్జి అయితే మీ వద్ద ఉంది, మీ లెక్కాపత్రాన్ని ఎలాగైతే చూసుకుంటారో, అదే విధంగా బ్యాడ్జిని కూడా చూసుకోండి, మీ నడవడికను కూడా చూసుకోండి. ఎప్పుడూ వికారీ దృష్టి ఉండకూడదు. నోటి ద్వారా ఎటువంటి చెడు మాటలు రాకూడదు. చెడు మాట్లాడేవారే లేకపోతే చెవులు ఎలా వింటాయి? సత్యయుగములో అందరూ దైవీగుణాలు కలిగినవారే ఉంటారు. చెడు విషయాలే ఉండవు. వీరు కూడా తండ్రి నుండే ప్రారబ్ధాన్ని పొందారు. తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమౌతాయని అందరికీ చెప్పండి. ఇందులో నష్టము యొక్క విషయమేమీ లేదు. ఆత్మ సంస్కారాన్ని తీసుకువెళ్తుంది. సన్యాసులైతే మళ్ళీ సన్యాస ధర్మములోకి వచ్చేస్తారు. వారి వృక్షము వృద్ధి చెందుతూ ఉంటుంది కదా. ఈ సమయంలో మీరు పరివర్తన అవుతున్నారు. మనుష్యులే దేవతలుగా అవుతారు. అందరూ ఒక్కసారిగా రారు. మళ్ళీ నంబరువారుగా వస్తారు, డ్రామాలో పాత్రధారులు వారి సమయం రాకుండా స్టేజి పైకి రారు. లోపలే కూర్చొని ఉంటారు. సమయం వచ్చినప్పుడు బయటకు స్టేజి పైకి పాత్రను అభినయించేందుకు వస్తారు. అది హద్దు యొక్క నాటకం, ఇది అనంతమైనది. పాత్రధారులైన మేము మా సమయానికి వచ్చి మా పాత్రను అభినయించాలని బుద్ధిలో ఉంది. ఇది అనంతమైన పెద్ద వృక్షము. నంబరువారుగా వస్తూ ఉంటారు. మొట్టమొదట ఒకే ధర్మముండేది, అన్ని ధర్మాల వారు ప్రారంభంలోనే రారు.

పాత్రను అభినయించేందుకు మొదట దేవీదేవతా ధర్మమువారే వస్తారు, అది కూడా నంబరువారుగా వస్తారు. వృక్షం యొక్క రహస్యాన్ని కూడా అర్థము చేసుకోవాలి. తండ్రియే వచ్చి మొత్తం కల్పవృక్ష జ్ఞానాన్ని వినిపిస్తారు. దీనిని నిరాకారీ వృక్షముతో పోల్చడం జరుగుతుంది. మనుష్య సృష్టి రూపీ వృక్షానికి నేను బీజాన్ని అని ఒక్క తండ్రి మాత్రమే చెప్తారు. బీజములో వృక్షము ఇమిడి ఉండదు కానీ వృక్షం యొక్క జ్ఞానము ఇమిడి ఉంటుంది. ప్రతి ఒక్కరికీ తమ-తమ పాత్ర ఉంది. ఇది చైతన్య వృక్షము కదా. వృక్షం యొక్క ఆకులు కూడా నంబరువారుగా వెలువడతాయి. ఈ వృక్షాన్ని ఎవ్వరూ అర్థము చేసుకోరు, దీని బీజము పైన ఉంది కనుక దీనిని తలక్రిందులుగా ఉన్న వృక్షమని అంటారు. రచయిత అయిన తండ్రి పైన ఉన్నారు. మనము ఇంటికి వెళ్ళాలని, అక్కడ ఆత్మలుంటాయని మీకు తెలుసు. ఇప్పుడు మనము పవిత్రంగా అయి వెళ్ళాలి. మీ ద్వారా యోగబలముతో మొత్తం విశ్వము పవిత్రంగా అవుతుంది. మీ కోసమైతే పవిత్ర సృష్టి కావాలి కదా. మీరు పవిత్రంగా అయినప్పుడు ప్రపంచాన్ని కూడా పవిత్రంగా చేయవలసి ఉంటుంది. అందరూ పవిత్రంగా అయిపోతారు. ఆత్మలోనే మనసు-బుద్ధి ఉంటాయని మీ బుద్ధిలో ఉంది కదా. ఆత్మ చైతన్యమైనది. ఆత్మనే జ్ఞానాన్ని ధారణ చేయగలదు. మనం పునర్జన్మలు ఎలా తీసుకుంటాము అన్నదానికి సంబంధించిన మొత్తం రహస్యం మధురాతి-మధురమైన పిల్లల బుద్ధిలో ఉండాలి. మీ 84 జన్మల చక్రము పూర్తయినప్పుడు అందరిదీ పూర్తవుతుంది. అందరూ పావనంగా అయిపోతారు. ఇది అనాది తయారైన డ్రామా. ఒక్క సెకండు కూడా ఆగదు. ప్రతి క్షణం ఏదైతే జరుగుతుందో, అదే మళ్ళీ కల్పము తర్వాత జరుగుతుంది. ప్రతి ఒక్క ఆత్మలో అవినాశీ పాత్ర నిండి ఉంది. ఆ పాత్రధారులు 2 - 3 గంటల పాత్రను అభినయిస్తారు. ఇది ఆత్మకు లభించిన సహజమైన పాత్ర కనుక పిల్లలకు ఎంత సంతోషం ఉండాలి. అతీంద్రియ సుఖం ఇప్పటి సంగమయుగానిదే గాయనం చేయబడింది. బాబా వచ్చి, 21 జన్మలకు మనల్ని సదా సుఖవంతులుగా చేస్తారు. ఇది సంతోషపడే విషయం కదా. ఎవరైతే బాగా అర్థము చేసుకుంటారో మరియు అర్థము చేయిస్తారో, వారు సేవలో తత్పరులై ఉంటారు. ఒకవేళ పిల్లలు ఎవరైనా స్వయమే క్రోధులుగా ఉంటే, అది ఇతరులలో కూడా ప్రవేశిస్తుంది. రెండు చేతులతోనే చప్పట్లు మోగుతాయి. అక్కడ ఈ విధంగా ఉండదు. ఇక్కడ పిల్లలైన మీకు శిక్షణ లభిస్తుంది - ఎవరైనా క్రోధము చేస్తే, మీరు వారిపై పుష్పాలను వేయండి. ప్రేమగా అర్థము చేయించండి. ఇది కూడా ఒక భూతము, చాలా నష్టపరుస్తుంది. ఎప్పుడూ క్రోధము చేయకూడదు. నేర్పించేవారిలోనైతే క్రోధం అసలు ఉండకూడదు. నంబరువారుగా పురుషార్థము చేస్తూ ఉంటారు. కొందరిది తీవ్ర పురుషార్థంగా ఉంటుంది, కొందరిది చల్లగా ఉంటుంది. చల్లగా ఉండే పురుషార్థము చేసేవారు తప్పకుండా స్వయానికి చెడ్డ పేరు తెచ్చుకుంటారు. ఎవరిలోనైనా క్రోధముంటే, వారు ఎక్కడకు వెళ్ళినా అక్కడ నుండి తొలగించేస్తారు. ఎటువంటి చెడు నడవడిక ఉన్నవారు ఉండలేరు. పరీక్ష పూర్తయినప్పుడు ఎవరెవరు ఏమవుతారో, అందరికీ తెలుస్తుంది, అన్నీ సాక్షాత్కారమవుతాయి. ఎవరు ఎటువంటి పని చేస్తారో, వారికి అటువంటి మహిమ జరుగుతుంది.

పిల్లలైన మీకు డ్రామా యొక్క ఆదిమధ్యాంతాలు తెలుసు. మీరందరూ అంతర్యాములు. ఈ సృష్టిచక్రము ఎలా తిరుగుతుందో ఆత్మకు ఆంతరికంగా తెలుసు. మొత్తం సృష్టిలోని మనుష్యుల నడవడిక గురించి, అన్ని ధర్మాల గురించి మీకు జ్ఞానము ఉంది. వారిని అంతర్యామి అని అంటారు. ఆత్మకు అంతా తెలిసిపోయింది. భగవంతుడు ప్రతి చోటా ఉన్నారు, వారిని తెలుసుకోవలసిన అవసరమేముంది అని అనుకోకూడదు. ఎవరు ఎలాంటి పురుషార్థము చేస్తారో, అటువంటి ఫలము పొందుతారు అని వారైతే ఇప్పుడు కూడా చెప్తారు. నాకు తెలుసుకోవలసిన అవసరమేముంది. ఎవరైతే చేస్తారో, దానికి శిక్ష కూడా స్వయం పొందుతారు. అటువంటి నడవడిక నడిచినట్లయితే, అధమ గతిని పొందుతారు. పదవి చాలా తగ్గిపోతుంది, ఆ స్కూలులో ఫెయిల్ అయితే మళ్ళీ ఇంకో సంవత్సరం చదువుతారు. ఈ చదువు కల్ప-కల్పాంతరాల కోసం ఉంటుంది. ఇప్పుడు చదవకపోతే కల్ప-కల్పాంతరాలు చదవరు. ఈశ్వరీయ లాటరీని పూర్తిగా తీసుకోవాలి కదా. ఈ విషయాలు పిల్లలైన మీరు అర్థము చేసుకోగలరు. భారత్ సుఖధామంగా ఉన్నప్పుడు మిగిలినవారంతా శాంతిధామంలో ఉంటారు. ఇప్పుడు మన సుఖం యొక్క రోజులు వస్తున్నాయని పిల్లలకు సంతోషం ఉండాలి. దీపావళి రోజు సమీపంగా వస్తున్నప్పుడు ఇంకా ఇన్ని రోజులున్నాయి, తర్వాత క్రొత్త దుస్తులు ధరిస్తామని అంటారు కదా. స్వర్గము వస్తుంది, మేము స్వయాన్ని అలంకరించుకున్నట్లయితే మళ్ళీ స్వర్గములో మంచి సుఖాన్ని పొందుతామని మీరు కూడా అంటారు. షావుకారులకు షావుకారీతనం యొక్క నషా ఉంటుంది. మనుష్యులు పూర్తిగా ఘోరమైన నిద్రలో ఉన్నారు, తర్వాత వీరు సత్యము చెప్పారని అకస్మాత్తుగా తెలుస్తుంది. సత్యం యొక్క సాంగత్యమున్నప్పుడే సత్యమును తెలుసుకోగలరు. ఇప్పుడు మీరు సత్యమైన సాంగత్యంలో ఉన్నారు. సత్యమైన తండ్రి ద్వారా మీరు సత్యంగా అవుతారు. వారంతా అసత్యము ద్వారా అసత్యంగా అవుతారు. ఇప్పుడు భగవంతుడు ఏమి చెప్తున్నారు మరియు మనుష్యులు ఏమి చెప్తున్నారు అన్న వ్యత్యాసాన్ని కూడా ప్రింట్ చేయిస్తున్నారు. మ్యాగజీనులో కూడా వేయవచ్చు. ఆఖరికి విజయం మీదే అవుతుంది, ఎవరైతే కల్పక్రితం పదవిని పొందారో, వారు తప్పకుండా పొందుతారు. ఇది ఖచ్చితం. అక్కడ అకాల మృత్యువు ఉండదు. ఆయుష్షు కూడా ఎక్కువగా ఉంటుంది. పవిత్రత ఉన్నప్పుడు ఆయుష్షు ఎక్కువగా ఉండేది. పతిత-పావనుడు పరమాత్మ తండ్రి కనుక తప్పకుండా వారే పావనంగా చేసి ఉంటారు. కృష్ణుడు చేసారన్న విషయం శోభించదు. పురుషోత్తమ సంగమయుగంలో కృష్ణుడు మళ్ళీ ఎక్కడ నుండి వస్తారు. అవే ముఖకవళికలు ఉన్న మనుష్యులు మళ్ళీ ఉండరు. 84 జన్మలు, 84 ముఖ కవళికలు, 84 కర్తవ్యాలు - ఇది తయారై-తయారవుతున్న ఆట. ఇందులో తేడా రాదు. డ్రామా ఎంత అద్భుతంగా రచింపబడి ఉంది. ఆత్మ చిన్న బిందువు, అందులో అనాది పాత్ర నిండి ఉంది - దీనినే ప్రాకృతికం అని అంటారు. మనుష్యులు విని ఆశ్చర్యపోతారు. కానీ మొదట తండ్రిని స్మృతి చేయాలనే సందేశమునివ్వాలి. వారే పతిత-పావనుడు, సర్వుల సద్గతిదాత. సత్యయుగంలో దుఃఖపు విషయమేమీ ఉండదు. కలియుగంలో ఎంత దుఃఖముంది. కానీ ఈ విషయాలను అర్థము చేసుకునేవారు నంబరువారుగా ఉన్నారు. తండ్రి అయితే రోజూ అర్థము చేయిస్తూ ఉంటారు. శివబాబా మనల్ని చదివించేందుకు వచ్చారు, మళ్ళీ తమతోపాటు తీసుకువెళ్తారని పిల్లలైన మీకు తెలుసు. బాబాతో ఉన్నవారి కన్నా బంధనంలో ఉన్నవారు ఎక్కువగా స్మృతి చేస్తారు. వారు ఉన్నత పదవిని పొందవచ్చు. ఇది కూడా అర్థము చేసుకునే విషయం కదా. బాబా స్మృతిలో చాలా తపిస్తూ ఉంటారు. పిల్లలూ, స్మృతియాత్రలో ఉండండి, దైవీగుణాలను కూడా ధారణ చేయండి, అప్పుడు బంధనాలు తొలగిపోతూ ఉంటాయి అని తండ్రి చెప్తున్నారు. పాపం యొక్క కుండ సమాప్తమవుతుంది. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. మీ నడవడికను దేవతల వలె తయారుచేసుకోవాలి. నోటి ద్వారా ఎటువంటి చెడు మాటలు మాట్లాడకూడదు. ఈ కళ్ళు ఎప్పుడూ క్రిమినల్ (వికారి)గా అవ్వకూడదు.

2. క్రోధమనే భూతము చాలా నష్టపరుస్తుంది. రెండు చేతులతోనే చప్పట్లు మోగుతాయి కనుక ఎవరైనా క్రోధం చేస్తే వారి నుండి దూరంగా వెళ్ళిపోవాలి, వారికి ప్రేమగా అర్థము చేయించాలి.

వరదానము:-
అవ్యక్త స్వరూప సాధన ద్వారా శక్తిశాలి వాయుమండలాన్ని తయారుచేసే అవ్యక్త ఫరిస్తా భవ

వాయుమండలాన్ని శక్తిశాలిగా తయారుచేసేందుకు సాధనం మీ అవ్యక్త స్వరూపం యొక్క సాధన. దీనిపై పదే-పదే అటెన్షన్ ఉంచాలి ఎందుకంటే ఏ విషయాన్ని అయితే సాధన చేస్తారో, ఆ విషయంపైనే ధ్యానం ఉంటుంది. కనుక అవ్యక్త స్వరూప సాధన అనగా పదే-పదే అటెన్షన్ గల తపస్సు ఉండాలి, అందుకే 'అవ్యక్త ఫరిస్తా భవ' అనే వరదానాన్ని స్మృతిలో ఉంచుకొని శక్తిశాలి వాయుమండలాన్ని తయారుచేసే తపస్సు చేయండి, అప్పుడు మీ ఎదురుగా ఎవరు వచ్చినా వారు వ్యక్తము మరియు వ్యర్థ విషయాల నుండి అతీతంగా అయిపోతారు.

స్లోగన్:-
సర్వ శక్తివంతుడైన తండ్రిని ప్రత్యక్షము చేసేందుకు ఏకాగ్రతా శక్తిని పెంచండి.