ఓంశాంతి. అనంతమైన తండ్రి కూర్చొని అనంతమైన పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. అనంతమైన తండ్రి ఎవరు అని ఇప్పుడు ప్రశ్న తలెత్తుతుంది. అందరి తండ్రి ఒక్కరే, వారినే పరమపిత అని అంటారని మీకు తెలుసు. లౌకిక తండ్రిని పరమపిత అని అనరు. పరమపిత అయితే ఒక్కరే, వారిని పిల్లలందరూ మర్చిపోయారు, అందుకే దుఃఖహర్త, సుఖకర్త అయిన పరమపిత పరమాత్మ, ఆ తండ్రి మన దుఃఖాలను ఎలా హరిస్తున్నారు, ఆ తర్వాత సుఖ-శాంతులలోకి ఎలా వెళ్తాము అన్నది పిల్లలైన మీకు తెలుసు. అందరూ సుఖములోకి వెళ్ళరు. కొందరు సుఖములోకి, కొందరు శాంతిలోకి వెళ్తారు. కొందరు సత్యయుగములో పాత్రను అభినయిస్తారు, కొందరు త్రేతాయుగములో, కొందరు ద్వాపరయుగములో అభినయిస్తారు. మీరు సత్యయుగంలో ఉన్నప్పుడు మిగిలినవారంతా ముక్తిధామములో ఉంటారు. దానిని ఈశ్వరుని ఇల్లు అని అంటారు. ముసల్మానులు నమాజ్ చదివేటప్పుడు అందరూ కలిసి భగవంతుడిని ప్రార్థిస్తారు. ఎందుకు? స్వర్గము కోసమా లేక అల్లా వద్దకు వెళ్ళేందుకా. అల్లా ఇంటిని స్వర్గమని అనరు. అక్కడ ఆత్మలు శాంతిలో ఉంటాయి. అక్కడ శరీరాలుండవు. అల్లా వద్దకు శరీరముతో వెళ్ళలేము కానీ కేవలం ఆత్మలైన మనం వెళ్తామని వారికి తెలిసి ఉండవచ్చు. ఇప్పుడు కేవలం అల్లాను స్మృతి చేయడం ద్వారా ఎవరూ పవిత్రంగా అవ్వలేరు. అల్లా గురించి తెలియనే తెలియదు. తండ్రి సుఖ-శాంతుల వారసత్వమునిస్తున్నారని ఇప్పుడు ఈ మనుష్యులకు సలహా ఎలా ఇవ్వాలి. విశ్వంలో శాంతి ఎలా ఏర్పడుతుంది, విశ్వములో శాంతి ఎప్పుడుండేది అనే ఈ విషయాలను వారికి ఎలా అర్థము చేయించాలి. సర్వీసబుల్ పిల్లలుగా ఉన్నవారికి నంబరువారు పురుషార్థానుసారంగా ఈ చింతన నడుస్తుంది. బ్రహ్మా ముఖవంశావళి బ్రాహ్మణులైన మీకు మాత్రమే తండ్రి తమ పరిచయాన్నిచ్చారు, మొత్తం ప్రపంచములోని మనుష్యమాత్రులందరి పాత్రల పరిచయాన్ని కూడా ఇచ్చారు. ఇప్పుడు మనుష్యమాత్రులకు మనము తండ్రి మరియు రచనల పరిచయాన్ని ఎలా ఇవ్వాలి? స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను స్మృతి చేసినట్లయితే ఆ ఖుదా ఇంటికి వెళ్తారని తండ్రి అందరికీ చెప్తున్నారు. స్వర్ణిమయుగము లేక స్వర్గములోకి అందరూ వెళ్ళరు. అక్కడ ఒకే ధర్మముంటుంది. మిగిలినవారంతా శాంతిధామములో ఉంటారు, ఇందులో కోప్పడే విషయమేదీ లేదు. మనుష్యులు శాంతి కోరుకుంటారు, అది అల్లా లేక గాడ్ ఫాదర్ ఇంటిలో మాత్రమే లభిస్తుంది. ఆత్మలందరూ శాంతిధామము నుండి వస్తారు, నాటకం పూర్తయినప్పుడు మళ్ళీ అక్కడకు వెళ్తారు. పతిత ప్రపంచము నుండి అందరినీ తీసుకువెళ్ళేందుకే తండ్రి వస్తారు.
మనము శాంతిధామానికి వెళ్ళి మళ్ళీ సుఖధామంలోకి వస్తామని ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. ఇది పురుషోత్తమ సంగమయుగము. పురుషోత్తములనగా ఉత్తమోత్తమ పురుషులు. ఆత్మ పవిత్రంగా అవ్వనంతవరకు, ఉత్తమ పురుషులుగా అవ్వలేరు. నన్ను స్మృతి చేయండి మరియు సృష్టి చక్రాన్ని తెలుసుకోండి మరియు దానితో పాటు దైవీ గుణాలను కూడా ధారణ చేయండి అని ఇప్పుడు తండ్రి మీకు చెప్తున్నారు. ఈ సమయంలో మనుష్యులందరి క్యారెక్టర్లు పాడైపోయాయి. కొత్త ప్రపంచములోనైతే క్యారెక్టర్లు చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటాయి. భారతవాసులే ఉన్నతమైన క్యారెక్టర్ కలవారిగా అవుతారు. ఆ ఉన్నతమైన క్యారెక్టర్ కలవారికి తక్కువ క్యారెక్టర్ కలవారు తల వంచి నమస్కరిస్తారు. వారి క్యారెక్టర్లను వర్ణన చేస్తారు. ఇది పిల్లలైన మీరు మాత్రమే అర్థము చేసుకుంటారు. ఇప్పుడు ఇతరులకు ఎలా అర్థము చేయించాలి? ఎటువంటి సహజ యుక్తిని రచించాలి? ఇది ఆత్మల మూడవ నేత్రాన్ని తెరవడం. బాబా ఆత్మలో జ్ఞానముంది. నాలో జ్ఞానముందని మనుష్యులంటారు. ఇది దేహాభిమానము, ఇందులో ఆత్మాభిమానులుగా అవ్వాలి. సన్యాసుల వద్ద శాస్త్రాల జ్ఞానముంది. తండ్రి వచ్చి ఇచ్చినప్పుడే తండ్రి యొక్క జ్ఞానము లభిస్తుంది. యుక్తిగా అర్థము చేయించాలి. వారు కృష్ణుడిని భగవంతుడని భావిస్తారు. భగవంతుని గురించి తెలియనే తెలియదు, ఋషులు, మునులు కూడా మాకు తెలియదని అనేవారు. మనుష్యులు భగవంతునిగా కాలేరని భావిస్తారు. నిరాకార భగవంతుడే రచయిత. కానీ వారు ఎలా రచిస్తారు, వారి నామం, రూపం, దేశం, కాలం ఏమిటి? వారు నామ-రూపాలకు అతీతమైనవారని అంటారు. నామ-రూపాలకు అతీతమైన వస్తువు ఎలా ఉంటుంది, అసాధ్యమని కూడా అర్థము చేసుకోలేరు. ఒకవేళ రాయి-రప్పలు, తాబేలు-చేప అన్నిటిలో ఉన్నారని అంటే అవి నామ-రూపాలే అవుతాయి. ఒకసారి ఒకటి, మరోసారి మరొకటి చెప్తూ ఉంటారు. మనుష్యులకు మనం ఎలా అర్థము చేయించాలని పిల్లలకు రాత్రి-పగలు చాలా చింతన నడవాలి. ఇది మనుష్యుల నుండి దేవతలుగా అయ్యే పురుషోత్తమ సంగమయుగము. మనుష్యులు దేవతలకు నమస్కరిస్తారు. మనుష్యులు, మనుష్యులకు నమస్కరించరు, మనుష్యులు భగవంతుడికి లేక దేవతలకు నమస్కరించవలసి ఉంటుంది. ముసల్మానులు కూడా ప్రార్థిస్తారు, అల్లాను స్మృతి చేస్తారు. వారు అల్లా వద్దకు చేరుకోలేరని మీకు తెలుసు. అల్లా వద్దకు ఎలా చేరుకోవాలి అన్నది ముఖ్యమైన విషయము. తర్వాత అల్లా కొత్త సృష్టిని ఎలా రచిస్తారు. ఈ విషయాలన్నీ ఎలా అర్థము చేయించాలో, దీని కోసం పిల్లలు విచార సాగర మథనము చేయవలసి ఉంటుంది, తండ్రి అయితే విచార సాగర మథనము చేయవలసిన అవసరం లేదు. తండ్రి విచార సాగర మథనము చేసే యుక్తిని పిల్లలకు నేర్పిస్తారు. ఈ సమయంలో అందరూ ఇనుపయుగములో తమోప్రధానంగా ఉన్నారు. తప్పకుండా ఏదో ఒక సమయంలో స్వర్ణిమయుగము కూడా ఉంటుంది. స్వర్ణిమయుగాన్ని పవిత్రమైనదని అంటారు. పవిత్రత మరియు అపవిత్రత. బంగారంలో మాలిన్యము చేర్చబడుతుంది కదా. ఆత్మ కూడా మొదట పవిత్రంగా, సతోప్రధానంగా ఉండేది, ఆ తర్వాత అందులో మాలిన్యము చేరుతుంది. తమోప్రధానంగా అయినప్పుడు తండ్రి రావలసి వస్తుంది, తండ్రియే వచ్చి సతోప్రధానంగా, సుఖధామంగా తయారుచేస్తారు. సుఖధామములో కేవలం భారతవాసులే ఉంటారు. మిగిలినవారందరూ శాంతిధామంలోకి వెళ్తారు. శాంతిధామంలో అందరూ పవిత్రంగా ఉంటారు, మళ్ళీ ఇక్కడకు వచ్చి నెమ్మది-నెమ్మదిగా అపవిత్రంగా అయిపోతూ ఉంటారు. ప్రతి ఒక్క మనిషి సతో, రజో, తమోగా తప్పకుండా అవుతారు. మీరందరూ అల్లా ఇంటికి చేరుకోగలరు అని వారికిప్పుడు ఎలా తెలియజేయాలి. దేహం యొక్క సంబంధాలన్నీ వదిలి స్వయాన్ని ఆత్మగా భావించండి అని భగవానువాచ అయితే ఉంది. నన్ను స్మృతి చేయడం వలన ఈ 5 భూతాలు తొలగిపోతాయి. పిల్లలైన మీకు రాత్రి-పగలు ఇదే చింత ఉండాలి. తండ్రికి కూడా చింత కలిగింది, అందుకే నేను వెళ్ళాలి, వెళ్ళి అందరినీ సుఖవంతులుగా చెయ్యాలి అనే ఆలోచన వచ్చింది. దానితో పాటు పిల్లలు కూడా సహాయకులుగా అవ్వాలి. తండ్రి ఒంటరిగా ఏం చేయగలరు. ఇది పురుషోత్తమ సంగమయుగమని మనుష్యులు వెంటనే అర్థము చేసుకునే విధంగా ఏ ఉపాయం కనుగొనాలి అని విచార సాగర మథనము చేయండి. ఈ సమయంలో మాత్రమే మనుష్యులు పురుషోత్తములుగా అవ్వగలరు. మొదట ఉన్నతంగా ఉంటారు, తర్వాత కిందకు పడిపోతారు. మొట్టమొదటే పడిపోరు కదా. రావడంతోనే తమోప్రధానంగా ఉండరు. ప్రతి వస్తువు మొదట సతోప్రధానంగా, తర్వాత సతో, రజో, తమోగా అవుతుంది. పిల్లలు ఇన్ని ప్రదర్శనీలు మొదలైనవి చేస్తారు, అయినా మనుష్యులు ఏమీ అర్థము చేసుకోకపోతే మరి ఇంకే ఉపాయం రచించాలి. రకరకాల ఉపాయాలు రచించవలసి ఉంటుంది కదా. దాని కోసం సమయం కూడా లభించింది. ఒక్కసారిగా ఎవ్వరూ సంపూర్ణంగా అవ్వలేరు. చంద్రుడు కొద్ది-కొద్దిగా పెరుగుతూ చివరికి సంపూర్ణంగా అవుతాడు. మనము కూడా తమోప్రధానంగా అయిపోయాము, మళ్ళీ సతోప్రధానంగా అవ్వడంలో సమయం పడుతుంది. అదైతే జడము, ఇది చైతన్యము. మరి మనము ఎలా అర్థం చేయించాలి. మీరు ఈ నమాజ్ ఎందుకు చదువుతున్నారు, ఎవరి స్మృతిలో చదువుతున్నారు అని ముసల్మానుల మౌల్వీలకు (పెద్దలకు) కూడా అర్థం చేయించండి. ఇది విచార సాగర మథనము చేయాలి. విశేషమైన రోజులలో ప్రెసిడెంట్ మొదలైనవారు కూడా మసీదులకు వెళ్తారు. అక్కడ పెద్దవారితో కలుస్తారు. మసీదులన్నిటికీ మళ్ళీ ఒక పెద్ద మసీదు ఉంటుంది, అక్కడకు ఈద్ మూబారక్ (అభినందనలు) తెలిపేందుకు వెళ్తారు. ఎప్పుడైతే మనము అన్ని దుఃఖాల నుండి ముక్తులై సుఖధామంలోకి వెళ్తామో, అప్పుడు ముబారక్ అని చెప్పడం జరుగుతుంది. మనము శుభవార్తను వినిపిస్తాము. ఎవరైనా విజయం పొందినప్పుడు కూడా అభినందనలు తెలియజేస్తారు. ఎవరైనా వివాహం చేసుకున్నప్పుడు కూడా సదా సుఖంగా ఉండమని అభినందనలు తెలియజేస్తారు. మనము ఒకరికొకరు అభినందనలు ఎలా తెలుపుకోవాలో ఇప్పుడు బాబా మీకు అర్థం చేయించారు. ఈ సమయంలో మనము అనంతమైన తండ్రి ద్వారా ముక్తి, జీవన్ముక్తుల వారసత్వాన్ని తీసుకుంటున్నాము. కనుక మీకు అభినందనలు లభిస్తాయి. మీరు 21 జన్మలకు పదమపతులుగా అవుతున్నారు, మీకు అభినందనలు అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు మనుష్యులంతా తండ్రి నుండి వారసత్వాన్ని ఎలా తీసుకుంటారు, అందరికీ అభినందనలు ఎలా తెలియజేయగలము. ఇప్పుడు మీకు తెలిసింది కానీ మీకు మనుష్యులు అభినందనలు తెలుపలేరు. మీ గురించి తెలియనే తెలియదు. అభినందనలు తెలియజేసినట్లయితే స్వయం వారు కూడా తప్పకుండా అభినందనలు పొందే యోగ్యులుగా అవ్వగలరు. మీరు గుప్తంగా ఉన్నారు కదా. మీరు పరస్పరం ఒకరికొకరు అభినందనలు తెలుపుకోవచ్చు. అభినందనలు, మనం అనంతమైన తండ్రికి చెందినవారిగా అయ్యాము. మీరు ఎంత భాగ్యశాలులు, ఏదైనా లాటరీ లభించినప్పుడు లేక పుత్రుడు జన్మించినప్పుడు అభినందనలు తెలియజేస్తారు. పిల్లలు పాస్ అయినప్పుడు కూడా అభినందనలు తెలుపుతారు. మీకు మనసులో చాలా సంతోషముంటుంది, స్వయానికి అభినందనలు తెలుపుకుంటారు, మాకు బాబా లభించారు, వారి నుండి మేము వారసత్వం తీసుకుంటున్నాము.
దుర్గతిని పొందిన ఆత్మలైన మీరే ఇప్పుడు సద్గతిని పొందుతారని బాబా అర్థము చేయిస్తున్నారు. ఒకేలాంటి అభినందనలు అందరికీ లభిస్తాయి. చివర్లో అందరికీ తెలుస్తుంది, ఎవరైతే ఉన్నతాతి ఉన్నతంగా అవుతారో, వారికి కింద ఉన్నవారు అభినందనలు తెలుపుతారు. మీరు సూర్యవంశీ కులములో మహారాజా-మహారాణులుగా అవుతారు. ఎవరైతే విజయ మాలలో మణులుగా అవుతారో, వారికి తక్కువ కులమువారు అభినందనలు తెలుపుతారు. ఎవరైతే పాస్ అవుతారో వారికి అభినందనలు లభిస్తాయి, వారికే పూజ జరుగుతుంది. ఉన్నత పదవి పొందే ఆత్మలకు కూడా అభినందనలు లభిస్తాయి. తర్వాత భక్తిమార్గములో వారికే పూజ జరుగుతుంది. ఎందుకు పూజిస్తున్నారో మనుష్యులకు తెలియదు. వారికి ఎలా అర్థము చేయించాలి అని ఇదే చింత పిల్లలకు ఉంటుంది. మేము పవిత్రంగా అయ్యాము, ఇతరులను ఎలా పవిత్రంగా తయారుచేయాలి? ప్రపంచము అయితే చాలా పెద్దది కదా. ఇంటింటికీ సందేశం చేరుకునే విధంగా ఏం చేయాలి. కరపత్రాలు పై నుండి వేయడం ద్వారా అందరికీ లభించవు. ఇక్కడ ప్రతి ఒక్కరి చేతికీ సందేశం అందాలి ఎందుకంటే తండ్రి వద్దకు ఎలా చేరాలో వారికి అసలు తెలియదు. అన్ని మార్గాలు పరమాత్ముడిని చేరడానికే అని అంటారు. కానీ ఈ భక్తి, దాన-పుణ్యాలు అయితే జన్మ-జన్మాంతరాలుగా చేస్తూ వచ్చారు కానీ మార్గము ఎక్కడ లభించింది అని తండ్రి అంటారు. ఇవన్నీ అనాదిగా నడుస్తూ వచ్చాయని అంటారు, కానీ ఎప్పటి నుండి ప్రారంభమయ్యాయి? అనాది యొక్క అర్థమే తెలియదు. మీలో కూడా నంబరువారు పురుషార్థానుసారముగా అర్థము చేసుకుంటారు. జ్ఞానం యొక్క ప్రారబ్ధము 21 జన్మలు ఉంటుంది, అది సుఖము, తర్వాత దుఃఖము ఉంటుంది. ఎవరు ఎక్కువ భక్తి చేశారు అని పిల్లలైన మీకు లెక్కను అర్థం చేయించడం జరుగుతుంది. ఈ విస్తారమైన విషయాలన్నీ ఒక్కొక్కరికీ అర్థం చేయించలేరు. ఏమి చేయాలి, ఏదైనా వార్తాపత్రికలలో వేయాలి, అందుకు సమయం పడుతుంది. అందరికీ అంత త్వరగా సందేశం లభించదు. అందరూ పురుషార్థము చేయడం మొదలుపెడితే మళ్ళీ స్వర్గములోకి వచ్చేస్తారు. అలా జరగనే జరగదు. ఇప్పుడు మీరు స్వర్గము కోసం పురుషార్థము చేస్తున్నారు. ఇప్పుడు మన ధర్మమువారిని ఎలా వెలికి తీయాలి? ఎవరెవరు ట్రాన్స్ఫర్ అయ్యారో ఎలా తెలుస్తుంది? హిందూ ధర్మమువారు వాస్తవానికి దేవీ-దేవతా ధర్మానికి చెందినవారు, ఇది కూడా ఎవ్వరికీ తెలియదు. పక్కా హిందువులైతే తమ ఆది సనాతన దేవీదేవతా ధర్మాన్ని అంగీకరిస్తారు. ఈ సమయంలో అందరూ పతితులుగా ఉన్నారు. పతిత-పావనా రండి అని పిలుస్తారు. మీరు వచ్చి మమ్మల్ని పావన ప్రపంచంలోకి తీసుకువెళ్ళండి అని నిరాకారుడినే స్మృతి చేస్తారు. వీరు ఇంత పెద్ద రాజ్యాన్ని ఎలా తీసుకున్నారు? ఎవరినైనా జయించి రాజ్యాన్ని తీసుకునేందుకు భారత్ లో ఈ సమయంలో ఎలాంటి రాజ్యమూ లేదు. వారేమీ యుద్ధము చేసి రాజ్యాన్ని పొందలేదు. మనుష్యుల నుండి దేవతలుగా ఎలా తయారుచేయడం జరుగుతుంది అన్నది ఎవ్వరికీ తెలియదు. మీకు కూడా ఇప్పుడు తండ్రి ద్వారా తెలిసింది. ముక్తి-జీవన్ముక్తిని పొందడం గురించి ఇతరులకు ఎలా తెలియజేయాలి. స్వయాన్ని తెలుసుకుని అల్లాను స్మృతి చేయడానికి పురుషార్థం చేయించేవారు కావాలి కదా. మీరు ఈద్ ముబారక్ అని ఎవరికి చెప్తున్నారు! మీకు అల్లా వద్దకు వెళ్తున్నామని పక్కా నిశ్చయముందా? ఇందులో మీకు ఎంతో సంతోషం ఉంది. ఇదైతే మీరు సంవత్సరాలుగా చేస్తూ వచ్చారు. ఎప్పటికైనా ఖుదా వద్దకు వెళ్తారా లేక వెళ్ళరా అని అడగండి. అప్పుడు తికమకపడతారు. మనము ఏదైతే చదువుతున్నామో, చేస్తున్నామో, అది దేని కోసం. ఉన్నతాతి ఉన్నతమైనవారు ఒక్క అల్లా మాత్రమే, అల్లా సంతానమైన మీరు కూడా ఆత్మలే అని చెప్పండి. నేను అల్లా వద్దకు వెళ్ళాలని ఆత్మ కోరుకుంటుంది. మొదట పవిత్రంగా ఉన్న ఆత్మ, ఇప్పుడు పతితంగా అయిపోయింది. ఇప్పుడు దీనిని స్వర్గమని అనరు. ఆత్మలందరూ పతితంగా ఉన్నారు, అల్లా ఇంటికి వెళ్ళేందుకు పావనంగా ఎలా అవ్వాలి. అక్కడ వికారీ ఆత్మలు ఉండవు. నిర్వికారులుగా అవ్వాలి. ఆత్మ ఒక్కసారిగా వెంటనే సతోప్రధానంగా అవ్వదు. ఇదంతా విచార సాగర మథనము చేయాల్సి ఉంటుంది. బాబాకు విచార సాగర మథనము నడుస్తుంది, అందుకే అర్థం చేయిస్తారు కదా. ఎవరికైనా ఎలా అర్థం చేయించాలి అని యుక్తులను రచించాలి. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. నేను వెళ్ళి పిల్లలను దుఃఖాల నుండి విడిపించి, సుఖవంతులుగా చేయాలని తండ్రికి ఏ విధంగా సంకల్పం వచ్చిందో, అదే విధంగా బాబాకు సహాయకులుగా అవ్వాలి, ఇంటింటికి సందేశాన్ని చేర్చే యుక్తులను రచించాలి.
2. సర్వుల అభినందనలను ప్రాప్తి చేసుకునేందుకు విజయమాలలో మణులుగా అయ్యే పురుషార్థము చేయాలి. పూజ్యులుగా అవ్వాలి.