ఓంశాంతి. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు. కేవలం పిల్లలైన మీకు మాత్రమే కాదు, ప్రజాపిత బ్రహ్మా ముఖవంశావళికి చెందిన ఆత్మిక పిల్లలందరికీ తెలుసు. బ్రాహ్మణులైన మనకే తండ్రి అర్థం చేయిస్తారు. మొదట మీరు శూద్రులుగా ఉండేవారు, మళ్ళీ వచ్చి బ్రాహ్మణులుగా అయ్యారు. తండ్రి వర్ణాల లెక్కను కూడా అర్థం చేయించారు. ప్రపంచములో వర్ణాల గురించి కూడా అర్థం చేసుకోరు, కేవలం గాయనముంది. ఇప్పుడు మీరు బ్రాహ్మణ వర్ణానికి చెందినవారిగా ఉన్నారు, మళ్ళీ దేవతా వర్ణానికి చెందినవారిగా అవుతారు. ఈ విషయం సరైనదేనా అని ఆలోచించండి. జడ్జ్ యువర్ సెల్ఫ్ (మీకు మీరే నిర్ణయించుకోండి). నా మాటలు వినండి మరియు పోల్చి చూసుకోండి. జన్మ జన్మాంతరాలుగా వింటూ వచ్చిన శాస్త్రాలను మరియు జ్ఞానసాగరుడైన తండ్రి ఏవైతే అర్థం చేయిస్తారో, దానిని పోల్చి చూడండి - ఏది సరైనది? బ్రాహ్మణ ధర్మాన్ని మరియు కులాన్ని పూర్తిగా మర్చిపోయారు. మీ వద్ద విరాటరూపం యొక్క చిత్రము సరిగ్గా తయారుచేయబడింది, దీనిపై అర్థము చేయించబడుతుంది. అయితే ఇన్ని భుజాలున్న చిత్రాలను ఏవైతే తయారుచేసారో మరియు దేవీలకు ఆయుధాలు మొదలైనవేవైతే ఇచ్చారో, అవన్నీ తప్పు. అవి భక్తి మార్గపు చిత్రాలు. ఈ కళ్ళ ద్వారా అన్నీ చూస్తారు కానీ అర్థము చేసుకోరు. ఎవరి కర్తవ్యము గురించి తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీకు మీ ఆత్మ గురించి తెలిసింది మరియు 84 జన్మల గురించి కూడా తెలిసింది. తండ్రి పిల్లలైన మీకు ఎలాగైతే అర్థం చేయిస్తున్నారో, అలా మీరు ఇతరులకు అర్థము చేయించాలి. శివబాబా అయితే అందరి వద్దకు వెళ్ళరు. తప్పకుండా తండ్రికి సహాయకులు కావాలి కదా, కావున మీది ఈశ్వరీయ మిషన్. మీరు అందరినీ ఈశ్వరునికి చెందినవారిగా చేస్తారు. వారు ఆత్మలైన మనకు అనంతమైన తండ్రి అని మీరు అర్థము చేయిస్తారు. వారి నుండి అనంతమైన వారసత్వము లభిస్తుంది. లౌకిక తండ్రినెలాగైతే స్మృతి చేయడం జరుగుతుందో, అలా వారి కంటే ఎక్కువగా పారలౌకిక తండ్రిని స్మృతి చేయవలసి ఉంటుంది. లౌకిక తండ్రి అల్పకాలికమైన సుఖమునిస్తారు. అనంతమైన తండ్రి అనంతమైన సుఖమునిస్తారు. ఈ జ్ఞానము ఆత్మలకిప్పుడు లభిస్తుంది. ముగ్గురు తండ్రులున్నారని మీకిప్పుడు తెలుసు. లౌకిక, అలౌకిక మరియు పారలౌకిక తండ్రులు. అనంతమైన తండ్రి, అలౌకిక తండ్రి ద్వారా మీకు అర్థము చేయిస్తున్నారు. ఈ తండ్రి గురించి ఎవరికీ తెలియదు. బ్రహ్మా జీవిత చరిత్ర గురించి ఎవరికీ తెలియదు. వారి కర్తవ్యము గురించి కూడా తెలుసుకోవాలి కదా. శివుని మహిమను, కృష్ణుని మహిమను గాయనము చేస్తారు, మరి బ్రహ్మా మహిమను ఎక్కడ చేశారు? అమృతమునిచ్చేందుకు నిరాకార తండ్రికి తప్పకుండా నోరు కావాలి కదా. భక్తి మార్గములో తండ్రిని ఎప్పుడూ యథార్థమైన రీతిలో స్మృతి చేయలేరు. వీరు శివబాబా రథమని ఇప్పుడు మీకు తెలిసింది. రథాన్ని కూడా అలంకరిస్తారు కదా. ఉదాహరణకు మహమ్మద్ గుర్రాన్ని కూడా అలంకరిస్తారు. పిల్లలైన మీరు మనుష్యులకు ఎంత బాగా అర్థం చేయిస్తారు. మీరు అందరినీ మహిమ చేస్తారు. మీరు దేవతలుగా ఉండేవారని, 84 జన్మలు తీసుకొని తమోప్రధానంగా అయ్యారని మీరు చెప్తారు. ఇప్పుడు మళ్ళీ సతోప్రధానంగా అవ్వాలంటే యోగము కావాలి. కానీ ఈ విషయాన్ని చాలా కష్టం మీద ఎవరైనా అర్థము చేసుకుంటారు. అర్థము చేసుకుంటే సంతోషమనే పాదరసం పైకెక్కుతుంది. అర్థము చేయించే వారికైతే పాదరసం ఇంకా పైకెక్కుతుంది. అనంతమైన తండ్రి పరిచయాన్నివ్వడం ఏమైనా తక్కువ విషయమా? అర్థము చేసుకోలేరు. ఇది ఎలా సాధ్యమని అని అంటారు. మీరు అనంతమైన తండ్రి జీవిత కథను వినిపిస్తారు.
పిల్లలూ, పవిత్రంగా అవ్వండి అని ఇప్పుడు తండ్రి అంటున్నారు. ఓ పతితపావనా! రండి, అని మీరు పిలిచేవారు కదా. గీతలో కూడా మన్మనాభవ అనే పదముంది కానీ దాని వివరణ ఎవరి వద్దా లేదు. తండ్రి ఆత్మ జ్ఞానాన్ని కూడా ఎంత స్పష్టంగా అర్థము చేయిస్తారు. ఈ విషయాలు ఏ శాస్త్రాలలోనూ లేవు. అయితే ఆత్మ బిందువని, భృకుటి మధ్యలో ఉండే నక్షత్రమని అంటారు కానీ యథార్థ రీతిగా ఎవరి బుద్ధిలోనూ లేదు. అది కూడా తెలుసుకోవలసి ఉంటుంది. కలియుగంలో అధర్మయుక్తంగా ఉంటారు. సత్యయుగంలో అందరూ ధర్మయుక్తంగా ఉంటారు. భక్తి మార్గములో ఇవన్నీ ఈశ్వరుడిని కలుసుకునేందుకు మార్గాలని మనుష్యులు భావిస్తారు, కావున మీరు మొదట - ఇక్కడకు ఎందుకు వచ్చారు అని ఫార్మ్ నింపిస్తారు. దీని ద్వారా కూడా మీరు అనంతమైన తండ్రి పరిచయమునివ్వాలి. ఆత్మకు తండ్రి ఎవరు అని వారిని మీరు అడుగుతారు. సర్వవ్యాపి అని అనడం ద్వారా అందులో అర్థమేమీ వెలువడదు. అందరి తండ్రి ఎవరు? ఇది ముఖ్యమైన విషయము. మీ-మీ ఇళ్ళలో కూడా మీరు అర్థము చేయించవచ్చు. ఒకటి-రెండు ముఖ్యమైన చిత్రాలు - మెట్ల చిత్రం, త్రిమూర్తి, వృక్షము చాలా అవసరము. వృక్షం ద్వారా తమ ధర్మము ఎప్పుడు ప్రారంభమవుతుంది అనేది అన్ని ధర్మాలవారు అర్థము చేసుకోవచ్చు. ఈ లెక్కలో మనం స్వర్గంలోకి వెళ్ళగలుగుతామా? ఎవరైతే వెనుక వస్తారో, వారు స్వర్గములోకి వెళ్ళలేరు కానీ శాంతిధామములోకి వెళ్ళగలరు. వృక్షము ద్వారా కూడా చాలా స్పష్టమవుతుంది. ఏయే ధర్మాలైతే చివర వచ్చాయో, వారి ఆత్మలు తప్పకుండా పైకి వెళ్ళి విరాజమానమవుతాయి. మీ బుద్ధిలో మొత్తం పునాది అంతా వేయబడుతుంది. ఆది సనాతన దేవీ దేవతా ధర్మము యొక్క అంటు అయితే కట్టబడింది, అలాగే వృక్షం యొక్క ఆకులను కూడా మీరే తయారుచేయాలి, ఆకులు లేకుండా వృక్షముండదు అని తండ్రి అంటారు, కావున తమ సమానంగా తయారుచేసేందుకు బాబా పురుషార్థం చేయిస్తూ ఉంటారు. ఇతర ధర్మాలవారికి ఆకులను తయారుచేసే అవసరముండదు. వారు పై నుండి వస్తారు, పునాది వేస్తారు. తర్వాత ఆకులు వారి వెనుక పై నుండి వస్తూ ఉంటాయి. మీరు మళ్ళీ వృక్షాన్ని వృద్ధి చేసేందుకు ఈ ప్రదర్శినీలు మొదలైనవి తయారుచేస్తారు, దీనితో ఆకులు వస్తాయి, మళ్ళీ తుఫానులు రావడంతో పడిపోతారు, వాడిపోతారు. ఈ ఆది సనాతన దేవీదేవతా ధర్మము స్థాపన అవుతుంది. ఇందులో యుద్ధాలు మొదలైనవాటి విషయమేమీ లేదు. కేవలం తండ్రిని స్మృతి చేయాలి మరియు చేయించాలి. మిగిలిన రచన అంతటినీ వదిలేయండని మీరు అందరికీ తెలుపుతారు. రచన ద్వారా ఎప్పుడూ వారసత్వము లభించదు. రచయిత అయిన తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి. ఇంకెవ్వరి స్మృతి కలగకూడదని చెప్పండి. తండ్రికి చెందినవారిగా అయ్యి, జ్ఞానంలోకి వచ్చి ఎవరైనా అటువంటి పని చేస్తే దాని భారము తలపై ఎంతగానో పడుతుంది. తండ్రి పావనంగా చేసేందుకు వస్తారు, మళ్ళీ ఏదైనా అటువంటి పనులు చేస్తే ఇంకా ఎక్కువగా పతితులుగా అయిపోతారు, కావున అలాంటి నష్టము కలిగించే పనులేవీ చేయకండి అని బాబా చెప్తున్నారు. తండ్రి యొక్క నింద జరుగుతుంది కదా. వికర్మలు ఎక్కువగా తయారయ్యే పనులేవీ చేయకండి. పథ్యమును కూడా ఉంచాలి. మందులో కూడా పథ్యమును ఉంచుతారు. ఈ పులుపు మొదలైనవి తినకూడదని డాక్టర్లు చెప్తే మీరు వినాలి కదా. కర్మేంద్రియాలను వశం చేసుకోవాలి. ఒకవేళ దాచుకొని తింటూ ఉన్నట్లయితే మందుల ప్రభావం ఉండదు. దీనిని ఆసక్తి అని అంటారు. ఇది చేయకండి అని తండ్రి కూడా శిక్షణనిస్తారు. వారు సర్జన్ కదా. బాబా, మనసులో చాలా సంకల్పాలు వస్తున్నాయి అని వ్రాస్తారు. అప్రమత్తంగా ఉండాలి. అశుద్ధమైన స్వప్నాలు, మనసులో సంకల్పాలు మొదలైనవి చాలా వస్తాయి, వాటికి భయపడకూడదు, సత్య-త్రేతా యుగాలలో ఈ విషయాలు ఉండవు. మీరు ఎంతగా సమీపంగా వస్తూ ఉంటారో, వెండి యుగం వరకూ ఎప్పుడైతే మీ స్థితి చేరుకుంటుందో, అప్పుడు కర్మేంద్రియాల చంచలత్వం సమాప్తమైపోతుంది. కర్మేంద్రియాలు వశమైపోతాయి. సత్య-త్రేతా యుగాలలో ఇవి వశమై ఉండేవి కదా. ఎప్పుడైతే ఆ త్రేతాయుగపు స్థితి వరకు చేరుకుంటారో, అప్పుడు అవి వశమవుతాయి. తర్వాత సత్యయుగపు స్థితి వరకు వచ్చినప్పుడు సతోప్రధానమైపోతారు, అప్పుడు కర్మేంద్రియాలన్నీ పూర్తిగా వశమైపోతాయి. కర్మేంద్రియాలు అప్పుడు వశమై ఉండేవి కదా. ఇది కొత్త విషయమేమీ కాదు. ఈ రోజు కర్మేంద్రియాలకు వశమై ఉన్నారు, పురుషార్థము చేసి, రేపు మళ్ళీ కర్మేంద్రియాలను వశం చేసుకుంటారు. మీరు 84 జన్మలుగా దిగుతూ వచ్చారు. ఇప్పుడిది రిటర్న్ జర్నీ (తిరుగు ప్రయాణము), అందరూ సతోప్రధాన స్థితి వరకు వెళ్ళాలి. మేము ఎన్ని పాపాలు చేశాము, ఎన్ని పుణ్యాలు చేశామని మీ చార్టును చూసుకోవాలి. తండ్రిని స్మృతి చేస్తూ-చేస్తూ ఇనుప యుగము నుండి వెండి యుగము వరకు చేరుకుంటే కర్మేంద్రియాలు వశమైపోతాయి. ఇప్పుడిక ఏ తుఫానులు రావని అప్పుడు మీకు అనుభవమవుతుంది. ఆ స్థితి కూడా వస్తుంది. తర్వాత బంగారు యుగములోకి వెళ్ళిపోతారు. శ్రమ చేసి పావనంగా అయితే సంతోషపు పాదరసం కూడా ఎక్కుతుంది. ఎవరు వచ్చినాసరే వారికి తాము ఏ విధంగా 84 జన్మలను తీసుకున్నారు అనేది అర్థం చేయించాలి. ఎవరైతే 84 జన్మలు తీసుకున్నారో, వారే అర్థము చేసుకుంటారు. ఇప్పుడు తండ్రిని స్మృతి చేసి యజమానులుగా అవ్వాలి అని అంటారు. 84 జన్మలు అర్థము కాకపోతే, ఇంతకుముందు కూడా రాజ్యానికి అధికారులుగా అవ్వలేదేమో. నేనైతే ధైర్యాన్ని కలిగిస్తాను, మంచి విషయాలను వినిపిస్తాను. అయినా మీరు కింద పడిపోతారు. ఎవరైతే 84 జన్మలు తీసుకొని ఉంటారో, వారికి వెంటనే స్మృతి కలుగుతుంది. మీరు శాంతిధామంలో పవిత్రంగా ఉండేవారు కదా అని తండ్రి అంటారు. ఇప్పుడు మళ్ళీ శాంతిధామానికి, సుఖధామానికి వెళ్ళే మార్గాన్ని మీకు తెలియజేస్తాను. ఇతరులెవ్వరూ మార్గాన్ని తెలియజేయలేరు. శాంతిధామంలోకి కూడా పావనాత్మలే వెళ్ళగలుగుతాయి. ఎంతగా మురికి తొలగిపోతూ ఉంటుందో, ఎవరెంతగా పురుషార్థం చేస్తారో, అంత ఉన్నతపదవి లభిస్తుంది. ప్రతి ఒక్కరి పురుషార్థమునైతే మీరు చూస్తున్నారు, బాబా కూడా చాలా బాగా సహాయం చేస్తారు. ఇతను పాత బిడ్డ. మీరు ప్రతి ఒక్కరి నాడిని అర్థము చేసుకుంటారు కదా. తెలివైనవారు వెంటనే అర్థము చేసుకుంటారు. అనంతమైన తండ్రి నుండి స్వర్గ వారసత్వము తప్పకుండా లభించాలి. ఒకప్పుడు లభించింది, ఇప్పుడు లేదు, అది మళ్ళీ లభిస్తుంది. లక్ష్యము మీ ఎదురుగా ఉంది. తండ్రి స్వర్గ స్థాపన చేసినప్పుడు మీరు స్వర్గానికి యజమానులుగా ఉండేవారు. తర్వాత 84 జన్మలు తీసుకుని మీరు క్రిందికి దిగుతూ వచ్చారు. ఇప్పుడు ఇది మీ అంతిమ జన్మ. చరిత్ర తప్పకుండా రిపీట్ అవుతుంది కదా. మీరు మొత్తం 84 జన్మల లెక్కను తెలియజేస్తారు. ఎంతమందైతే అర్థము చేసుకుంటారో, అన్ని ఆకులు తయారవుతూ ఉంటాయి. మీరు కూడా అనేకులను తమ సమానంగా తయారుచేస్తారు కదా. విశ్వమంతటినీ మాయ సంకెళ్ళ నుండి విడిపించేందుకు మేము వచ్చామని మీరు అంటారు. నేను అందరినీ రావణుని నుండి విడిపించేందుకు వస్తానని తండ్రి అంటారు. తండ్రి జ్ఞానసాగరులని పిల్లలైన మీరు కూడా అర్థం చేసుకున్నారు. మీరు కూడా జ్ఞానాన్ని ప్రాప్తి చేసుకొని మాస్టర్ జ్ఞానసాగరులుగా అవుతారు కదా. జ్ఞానము వేరు, భక్తి వేరు. భారతదేశపు ప్రాచీన రాజయోగము తండ్రి మాత్రమే నేర్పిస్తారని మీకు తెలుసు. ఇతర మనుష్యులెవ్వరూ నేర్పించలేరు. కానీ ఈ విషయాన్ని అందరికీ ఎలా అర్థం చేయించాలి? ఇక్కడ అసురుల విఘ్నాలు కూడా ఎన్నో కలుగుతాయి. ఈ విషయాన్ని ఇంతకుముందు ఏదో చెత్త వేసారేమోనని భావించేవారు. ఆ విఘ్నాలను ఎలా కలిగిస్తున్నారు అనేది ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. నథింగ్ న్యూ (కొత్తేమీ కాదు). ఇది కల్పక్రితము కూడా జరిగింది. మీ బుద్ధిలో ఈ పూర్తి చక్రమంతా తిరుగుతూ ఉంటుంది. బాబా మనకు సృష్టి ఆదిమధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయిస్తున్నారు, బాబా మనకు లైట్ హౌస్ అనే టైటిల్ కూడా ఇస్తారు. ఒక కంటిలో ముక్తిధామము, రెండవ కంటిలో జీవన్ముక్తిధామము. మీరు శాంతిధామములోకి వెళ్ళి మళ్ళీ సుఖధామంలోకి రావాలి. ఇది దుఃఖధామము. ఈ కళ్ళ ద్వారా మీరు ఏదైతే చూస్తున్నారో, అదంతా మర్చిపోండి అని తండ్రి అంటారు. మీ శాంతిధామాన్ని స్మృతి చేయండి. ఆత్మ తన తండ్రిని స్మృతి చేయాలి, దీనినే అవ్యభిచారి యోగమని అనడం జరుగుతుంది. జ్ఞానము కూడా ఒక్కరి నుండే వినాలి. ఇది అవ్యభిచారి జ్ఞానము. స్మృతి కూడా ఒక్కరినే చేయండి. నాకు ఒక్కరు తప్ప ఇంకెవ్వరూ లేరు. ఎంతవరకు స్వయాన్ని ఆత్మగా నిశ్చయము చేసుకోరో, అంతవరకు ఆ ఒక్కరి స్మృతి కలగదు. నేను ఒక్క బాబాకు చెందినవానిగానే అవుతాను అని ఆత్మ అంటుంది. నేను బాబా వద్దకు వెళ్ళాలి. ఈ శరీరము పురాతనమైనది, శిథిలావస్థలో ఉంది, దీనిపై కూడా మమకారం ఉంచుకోకూడదు. ఇది జ్ఞానము యొక్క విషయము. అలాగని శరీరాన్ని సంభాళించకూడదని కాదు. ఇది పాత శరీరము, దీనిని ఇప్పుడు వదిలేయాలని లోలోపల అర్థం చేసుకోవాలి. మీది అనంతమైన సన్యాసము. వారైతే అడవులలోకి వెళ్ళిపోతారు. మీరు ఇంట్లో ఉంటూ స్మృతి చేయాలి. స్మృతిలో ఉంటూ-ఉంటూ మీరు కూడా శరీరాన్ని వదిలివేయవచ్చు. ఎక్కడ ఉన్నా, మీరు తండ్రిని స్మృతి చేయండి. స్మృతిలో ఉంటూ స్వదర్శన చక్రధారులుగా అయినట్లైతే మీరు ఎక్కడ ఉన్నా ఉన్నత పదవిని పొందుతారు. ఎంతగా వ్యక్తిగతంగా శ్రమ చేస్తారో, అంతగా పదవిని పొందుతారు. ఇంట్లో ఉంటూ కూడా స్మృతియాత్రలో ఉండాలి. ఇప్పుడు ఫైనల్ రిజల్టుకు కొంత సమయముంది. మళ్ళీ కొత్త ప్రపంచము కూడా తయారవ్వాలి కదా. ఇప్పుడే కర్మాతీత స్థితి ఏర్పడినట్లయితే, సూక్ష్మవతనంలో ఉండవలసి ఉంటుంది. సూక్ష్మవతనంలో ఉన్నా కూడా మళ్ళీ జన్మ తీసుకోవలసి వస్తుంది. మున్ముందు మీకు అన్నీ సాక్షాత్కారమవుతాయి. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఒక్క తండ్రి ద్వారానే వినాలి. ఒక్కరి అవ్యభిచారి స్మృతిలోనే ఉండాలి. ఈ శరీరాన్ని కూడా సంభాళించాలి కానీ మమకారం పెట్టుకోకూడదు.
2. తండ్రి ఏ పథ్యమునైతే తెలియజేసారో, దానిని పూర్తిగా పాలన చేయాలి. తండ్రిని నింద చేయించే, పాప ఖాతాను తయారుచేసే కర్మలేవీ చేయకూడదు. స్వయాన్ని నష్టపరచుకోకూడదు.