15-12-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైనపిల్లలూ - ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి కావున దేహ సహితంగా దేహపు సంబంధాలన్నిటినీ మరచి నన్నొక్కరినే స్మృతి చేయండి మరియు పావనంగా అవ్వండి”

ప్రశ్న:-

ఆత్మకు సంబంధించిన ఏ ఒక్క సూక్ష్మమైన విషయాన్ని సూక్ష్మ బుద్ధి కలవారే అర్థము చేసుకోగలరు?

జవాబు:-

1.ఎలా అయితే సూది పై తుప్పు పడుతుందో, అలా ఆత్మపై నెమ్మది-నెమ్మదిగా తుప్పు పడుతూ వచ్చింది. స్మృతిలో ఉన్నప్పుడు అది తొలగిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే తుప్పు వదులుతుందో అనగా ఆత్మ తమోప్రధానము నుండి సతోప్రధానంగా అవుతుందో, అప్పుడు తండ్రి వైపు ఆకర్షణ కలుగుతుంది మరియు ఆత్మ తండ్రితో పాటు తిరిగి వెళ్ళగలుగుతుంది. 2. ఎంతగా తుప్పు వదులుతూ ఉంటుందో, అంతగా ఇతరులకు అర్థం చేయించడంలో ఆకర్షించగలుగుతారు. ఈ విషయాలు చాలా సూక్ష్మమైనవి, వీటిని మంద బుద్ధి కలవారు అర్థము చేసుకోలేరు.

ఓంశాంతి. భగవానువాచ. ఇప్పుడు బుద్ధిలోకి ఎవరు వచ్చారు? ఆ గీతా పాఠశాలలు మొదలైనవాటిలో భగవానువాచ అని అంటూనే శ్రీకృష్ణుడే బుద్ధిలోకి వస్తారు. ఇక్కడ పిల్లలైన మీకైతే ఉన్నతాతి ఉన్నతమైన తండ్రి గుర్తుకొస్తారు. ఇప్పుడిది సంగమయుగము, ఇది పురుషోత్తములుగా అయ్యే యుగము. దేహ సహితంగా దేహపు సంబంధాలన్నింటినీ వదిలి స్వయాన్ని ఆత్మగా భావించండి అని తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు. ఇది చాలా ముఖ్యమైన విషయము, దీన్ని సంగమయుగములో తండ్రి అర్థం చేయిస్తారు. ఆత్మయే పతితంగా అయ్యింది. మళ్ళీ ఆత్మయే పావనంగా అయ్యి ఇంటికి వెళ్ళాలి. పతితపావనుడిని స్మృతి చేస్తూ వచ్చారు కానీ వారి గురించి ఏమీ తెలియదు. భారతవాసులు పూర్తిగా ఘోరమైన అంధకారంలో ఉన్నారు. భక్తి రాత్రి, జ్ఞానము పగలు. రాత్రిలో అంధకారము, పగలులో ప్రకాశము ఉంటుంది. సత్యయుగము పగలు, కలియుగము రాత్రి. ఇప్పుడు మీరు కలియుగంలో ఉన్నారు, సత్యయుగంలోకి వెళ్ళాలి. పావన ప్రపంచంలో పతితులు అనే ప్రశ్నే లేదు. పతితులుగా అయినప్పుడు పావనంగా అయ్యే ప్రశ్న తలెత్తుతుంది. పావనంగా ఉన్నప్పుడు పతిత ప్రపంచము గుర్తు కూడా ఉండదు. ఇప్పుడిది పతిత ప్రపంచము కావున పావన ప్రపంచము గుర్తుకొస్తూ ఉంటుంది. పతిత ప్రపంచము చివరి భాగము, పావన ప్రపంచము మొదటి భాగము. అక్కడ పతితులెవ్వరూ ఉండజాలరు. ఎవరైతే పావనంగా ఉండేవారో, వారే మళ్ళీ పతితులుగా అయ్యారు. వారి 84 జన్మలే అర్థం చేయించడం జరుగుతుంది. ఇవన్నీ అర్థము చేసుకోవలసిన చాలా గుహ్యమైన విషయాలు. అర్ధకల్పము భక్తి చేశారు, అది అంత త్వరగా వదిలిపోదు. మనుష్యులు పూర్తిగా ఘోరమైన అంధకారంలో ఉన్నారు, కోట్లలో ఏ ఒక్కరో వెలువడుతారు. ఎవరో ఒకరి బుద్ధిలో కష్టంగా కూర్చుంటుంది. దేహ సంబంధాలన్నిటినీ మరచి నన్నొక్కరినే స్మృతి చేయండి అన్న ముఖ్యమైన విషయాన్ని తండ్రి చెప్తున్నారు. ఆత్మయే పతితముగా అయ్యింది, ఆత్మయే మళ్ళీ పవిత్రంగా అవ్వాలి. ఈ వివరణ కూడా తండ్రియే ఇస్తారు ఎందుకంటే ఈ తండ్రి ప్రిన్సిపల్, కంసాలి, డాక్టరు, బ్యారిస్టరు సర్వస్వమూ. ఈ పేర్లు అక్కడ ఉండవు. అక్కడ ఈ చదువు కూడా ఉండదు. ఇక్కడ ఉద్యోగం కోసం చదువుతారు. పూర్వము స్త్రీలు ఇంతగా చదువుకునేవారు కాదు. ఇవన్నీ తర్వాత నేర్చుకున్నారు. పతి మరణించినట్లయితే ఎవరు సంభాళిస్తారు? కావున స్త్రీలు కూడా అన్నీ నేర్చుకుంటూ ఉంటారు. సత్యయుగంలోనైతే ఈ విధంగా చింతన చేసే విషయాలేవీ ఉండవు. అటువంటి సమయం కోసమే ఇక్కడ మనుష్యులు ధనము మొదలైనవి పోగు చేసుకుంటూ ఉంటారు. అక్కడైతే ఇటువంటి చింతించవలసిన విషయాలేవీ ఉండవు. పిల్లలైన మిమ్మల్ని తండ్రి ఎంత ధనవంతులుగా తయారుచేస్తారు. స్వర్గంలో చాలా ఖజానా ఉంటుంది. వజ్ర-వైఢూర్యాల గనులన్నీ నిండుగా అయిపోతాయి. ఇక్కడ భూమి బంజరు భూమిగా అయిపోతుంది కావున ఆ శక్తి ఉండదు. అక్కడి పుష్పాలకు, ఇక్కడి పుష్పాలు మొదలైన వాటికి రాత్రికి, పగలుకు ఉన్నంత తేడా ఉంటుంది. ఇక్కడ అన్ని వస్తువుల నుండి శక్తి తొలగిపోయింది. అమెరికా మొదలైన స్థానాల నుండి ఎంత మంచి విత్తనాలు తీసుకువచ్చినా కానీ శక్తి తొలగిపోతూ ఉంటుంది. భూమియే అలా ఉంది, ఇందులో చాలా శ్రమ చేయవలసి ఉంటుంది. అక్కడైతే ప్రతి వస్తువు సతోప్రధానంగా ఉంటుంది. ప్రకృతి కూడా సతోప్రధానంగా ఉన్నందుకు అన్నీ సతోప్రధానంగా ఉంటాయి. ఇక్కడైతే అన్ని వస్తువులూ తమోప్రధానంగా ఉన్నాయి. ఏ వస్తువులోనూ శక్తి లేదు. ఈ వ్యత్యాసము కూడా మీరు అర్థం చేసుకున్నారు. సతోప్రధాన వస్తువులను ధ్యానములోనే చూస్తారు. అక్కడ పుష్పాలు మొదలైనవి ఎంత బాగుంటాయి. అక్కడి ధాన్యము మొదలైనవి కూడా మీకు కనిపించవచ్చు. బుద్ధి ద్వారా అర్థం చేసుకోగలరు. అక్కడి ప్రతి వస్తువులోనూ ఎంతటి శక్తి ఉంటుంది. కొత్త ప్రపంచము ఎవరి బుద్ధిలోకీ రానే రాదు. ఈ పాత ప్రపంచము గురించి అయితే ఇక అడగవద్దు. వ్యర్థ ప్రలాపాలు కూడా చాలా చేస్తారు, మనుష్యులు పూర్తిగా అంధకారములో నిద్రపోయారు. ఇంకా కొంత సమయము మాత్రమే మిగిలి ఉందని మీరు చెప్తే, కొంతమంది మిమ్మల్ని హేళన కూడా చేస్తారు. ఎవరైతే స్వయాన్ని బ్రాహ్మణులుగా భావిస్తారో, వారు యథార్థంగా అర్థము చేసుకుంటారు. ఇది కొత్త భాష, ఆత్మిక చదువు కదా. ఎప్పటి వరకైతే ఆత్మిక తండ్రి రారో, అప్పటి వరకు ఎవ్వరూ అర్థము చేసుకోలేరు. ఆత్మిక తండ్రి గురించి పిల్లలైన మీకు తెలుసు. వారు వెళ్ళి యోగము మొదలైనవి నేర్పిస్తారు కానీ వారికి ఎవరు నేర్పించారు? ఆత్మిక తండ్రి నేర్పించారనైతే చెప్పరు. తండ్రి ఆత్మిక పిల్లలకు మాత్రమే నేర్పిస్తారు. సంగమయుగ బ్రాహ్మణులైన మీరు మాత్రమే అర్థము చేసుకుంటారు. ఆది సనాతన దేవీ-దేవత ధర్మానికి చెందినవారు మాత్రమే బ్రాహ్మణులుగా అవుతారు. బ్రాహ్మణులైన మీరు ఎంత కొద్దిమంది ఉన్నారు. ప్రపంచంలో రకరకాల జాతులు ఎన్నో ఉన్నాయి. ప్రపంచంలో ఎన్ని ధర్మాలు, ఎన్ని భాషలు ఉన్నాయి అని తెలిపే పుస్తకమొకటి తప్పకుండా ఉంటుంది. అక్కడ ఇవన్నీ ఉండవని మీకు తెలుసు. సత్యయుగంలోనైతే ఒకే ధర్మము, ఒకే భాష ఉండేవి. మీరు సృష్టి చక్రాన్ని తెలుసుకున్నారు. కావున ఈ భాషలన్నీ కూడా ఉండవని మీరు తెలుసుకోగలరు. ఇంతమంది శాంతిధామానికి వెళ్ళిపోతారు. ఈ సృష్టి జ్ఞానము ఇప్పుడు పిల్లలైన మీకు లభించింది. మీరు మనుష్యులకు అర్థము చేయించినా కానీ వారు అర్థము చేసుకోలేరు. గొప్ప వ్యక్తులతో ప్రారంభోత్సవాన్ని ఎందుకు చేయిస్తారంటే వారు పేరు ప్రఖ్యాతి కలవారు. ఓహో! ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ ప్రారంభోత్సవము చేసారనే శబ్దము వ్యాపిస్తుంది. ఈ బాబా వెళ్తే, పరమపిత పరమాత్మ వచ్చి ప్రారంభోత్సవము చేశారని మనుష్యులు అర్థము చేసుకోరు, వారు అంగీకరించరు. ఎవరైనా గొప్ప వ్యక్తి, కమీషనరు మొదలైనవారు వస్తే, వారి వెనుక ఇతరులు కూడా పరుగెత్తి వస్తారు. కానీ వీరి వెనుక అయితే ఎవరూ పరిగెత్తరు కదా. ఇప్పుడు బ్రాహ్మణ పిల్లలైన మీరు చాలా కొద్దిమందే ఉన్నారు. ఎప్పుడైతే మీరు మెజారిటీగా అవుతారో, అప్పుడు అర్థము చేసుకుంటారు. ఇప్పుడే అర్థము చేసుకుంటే తండ్రి వద్దకు పరుగెత్తుకొని వస్తారు. మీకు ఎవరు నేర్పించారో, వారి వద్దకు మేము నేరుగా ఎందుకు వెళ్ళకూడదని ఒకరు అడిగారు. కానీ సూదిపై తుప్పు పట్టి ఉంటే అయస్కాంతం పట్ల ఆకర్షణ ఎలా కలుగుతుంది? ఎప్పుడైతే తుప్పు పూర్తిగా వదులుతుందో, అప్పుడు సూది అయస్కాంతాన్ని పట్టుకోగలదు. సూదికి ఒక మూలలో తుప్పు పట్టి ఉన్నా కానీ అంతగా ఆకర్షించలేదు. పూర్తి తుప్పు వదిలి పోవాలి, ఎప్పుడైతే చివర్లో అలా అవుతారో, అప్పుడు తండ్రితోపాటు తిరిగి వెళ్ళిపోతారు. ఇప్పుడైతే మేము తమోప్రధానంగా ఉన్నామని, తుప్పు పట్టి ఉందని చింత ఉంది. ఎంతగా స్మృతి చేస్తారో, అంతగా తుప్పు వదిలిపోతూ ఉంటుంది. మెల్ల-మెల్లగా తుప్పు వదిలిపోతూ ఉంటుంది. తుప్పు పట్టడం కూడా మెల్ల-మెల్లగా జరిగింది కదా, మళ్ళీ అలాగే వదిలిపోతుంది. ఎలా అయితే తుప్పు పట్టిందో, అలాగే అది మళ్ళీ వదిలిపోవాలి అంటే తండ్రిని స్మృతి కూడా చేయాలి. స్మృతి ద్వారా కొంతమంది తుప్పు ఎక్కువగా వదిలిపోయింది, కొంతమందిది తక్కువగా వదిలింది. ఎంత ఎక్కువగా తుప్పు వదలిపోతుందో, అంతగా వారు ఇతరులకు అర్థం చేయించడంలో ఆకర్షిస్తారు. ఇవి చాలా సూక్ష్మమైన విషయాలు. మందబుద్ధి కలవారు అర్థము చేసుకోలేరు. రాజ్య స్థాపన జరుగుతుందని మీకు తెలుసు. అర్థము చేయించేందుకు రోజు రోజుకు యుక్తులు వెలువడుతూ ఉంటాయి. ప్రదర్శినీలు, మ్యూజియంలు మొదలైనవి తయారవుతాయని ఇంతకుముందు తెలియదు కదా. మున్ముందు ఇంకా ఇటువంటివి వెలువడే అవకాశముంది. స్థాపన జరిగేందుకు ఇంకా సమయముంది. హార్ట్ ఫెయిల్ అవ్వకూడదు. కర్మేంద్రియాలను వశము చేసుకోలేకపోతే క్రింద పడిపోతారు. వికారాల్లోకి వెళ్తే సూదిపై చాలా తుప్పు పడుతుంది. వికారాల వలన ఎక్కువ తుప్పు పడుతూ ఉంటుంది. సత్య, త్రేతా యుగాలలో చాలా తక్కువ తుప్పు పడుతుంది, మిగిలిన అర్ధ కల్పములో త్వరత్వరగా తుప్పు పడుతుంది, క్రింద పడిపోతారు. అందుకే నిర్వికారులు, వికారులు అని గాయనము చేయబడతారు. నిర్వికారులైన దేవతల గుర్తులు ఉన్నాయి కదా. దేవీ దేవతా ధర్మము ప్రాయః లోపమైపోయింది అని తండ్రి అంటారు. దీని గుర్తులైతే ఉన్నాయి కదా. అన్నింటికంటే మంచి గుర్తు ఈ లక్ష్మీనారాయణుల చిత్రము. ఈ చిత్రాన్ని తీసుకుని మీరు పరిక్రమణ చేయవచ్చు ఎందుకంటే మీరు ఈ విధంగా అవుతారు కదా. రావణరాజ్య వినాశనము, రామరాజ్య స్థాపన జరుగుతుంది. అది రామరాజ్యము, ఇది రావణరాజ్యము, ఇది సంగమయుగము. అనేక పాయింట్లు ఉన్నాయి. డాక్టర్ల బుద్ధిలో ఎన్ని మందులు గుర్తు ఉంటాయి. బ్యారిస్టరు బుద్ధిలో కూడా అనేక రకాల పాయింట్లు ఉంటాయి. అనేక టాపిక్స్ తో మంచి పుస్తకము తయారవ్వవచ్చు. మళ్ళీ ఎప్పుడైనా భాషణ చేసేందుకు వెళ్ళినప్పుడు ఒక్కసారి ఆ పాయింట్లను చూసుకోండి. చురుకైన బుద్ధికలవారు వెంటనే చూసేస్తారు. ముందు మేము ఇలా-ఇలా అర్థం చేయిస్తామని వ్రాసుకోవాలి. భాషణ చేసిన తర్వాత కూడా ఈ విధంగా అర్థం చేయించి ఉంటే బాగుండేదని గుర్తుకు వస్తాయి కదా. ఈ పాయింట్లను ఇతరులకు అర్థం చేయిస్తే బుద్ధిలో కూర్చుంటాయి. టాపిక్స్ లిస్టు తయారుచేయబడి ఉండాలి. తర్వాత ఒక టాపిక్ ను తీసుకుని లోలోపల భాషణ చేయాలి లేక వ్రాయాలి. ఆ తర్వాత అన్ని పాయింట్లు వ్రాశానా అని చూసుకోవాలి. ఎంతగా కష్టపడితే అంత మంచిది. వీరు మంచి సర్జన్, వీరి బుద్ధిలో చాలా పాయింట్లు ఉన్నాయి అని తండ్రి అయితే అర్థము చేసుకుంటారు కదా. నిండుగా అయిపోతే, సేవ లేకుండా ఇక ఆనందమే కలగదు.

మీరు ప్రదర్శినీలు ఏర్పాటు చేసినప్పుడు, ఒక్కోచోట నుండి ఇద్దరు, నలుగురు వెలువడితే, మరోచోట నుండి ఆరుగురు, ఎనిమిది మంది వెలువడతారు. కొన్నిచోట్ల అయితే ఒక్కరు కూడా వెలువడరు. వేలాదిమంది చూస్తారు కానీ ఎంత కొద్దిమంది వెలువడతారు, కావున ఇప్పుడు పెద్ద-పెద్ద చిత్రాలను కూడా తయారుచేస్తూ ఉంటారు. మీరు చురుకుగా అవుతూ ఉంటారు. గొప్ప-గొప్ప వ్యక్తుల పరిస్థితి ఎలా ఉందో కూడా మీరు చూస్తారు. ఎవరికి ఈ జ్ఞానమివ్వాలి అని పరిశీలించాలని బాబా అర్థం చేయించారు. నా భక్తులుగా ఉన్నవారి నాడిని చూడాలి. గీతను చదివేవారికి ముఖ్యంగా ఒక విషయాన్ని అర్థము చేయించండి - భగవంతుడని ఉన్నతాతి ఉన్నతమైనవారినే అంటారు. వారు నిరాకారుడు. దేహధారులైన మనుష్యులెవ్వరినీ భగవంతుడని అనలేరు. పిల్లలైన మీకిప్పుడు అంతా అర్థమయ్యింది. సన్యాసులు కూడా ఇంటిని సన్యసించి పారిపోతారు. కొంతమంది బ్రహ్మచారులే వెళ్ళిపోతారు. అటువంటివారు మరుసటి జన్మలో కూడా అలాగే అవుతారు. తప్పకుండా తల్లి గర్భము ద్వారానే జన్మ తీసుకుంటారు. వివాహము జరగనంత వరకు బంధనముక్తులుగా ఉంటారు, అంతగా సంబంధీకులు మొదలైనవారు ఎవరూ గుర్తుకురారు. వివాహము చేసుకున్న తర్వాత సంబంధీకులు గుర్తుకొస్తారు. సమయం పడుతుంది, త్వరగా బంధనముక్తులుగా అవ్వలేరు. తమ జీవిత కథ గురించి అయితే అందరికీ తప్పకుండా తెలుస్తుంది కదా. మొదట మేము గృహస్థులుగా ఉండేవారము, తర్వాత సన్యసించామని సన్యాసులు కూడా భావిస్తారు. మీది చాలా గొప్ప సన్యాసము, అందుకే శ్రమ ఉంటుంది. ఆ సన్యాసులు విభూతి పూసుకుంటారు, వెంట్రుకలు తీసేసి వేషాన్ని మార్చుకుంటారు. కానీ మీరు అలా చేయవలసిన అవసరం లేదు. ఇక్కడ వస్త్రాలు మార్చవలసిన విషయం కూడా లేదు. మీరు తెల్ల చీరను ధరించకపోయినా పర్వాలేదు. ఇది బుద్ధి యొక్క జ్ఞానము. నేను ఆత్మను, తండ్రిని స్మృతి చేయాలి, దీని ద్వారానే తుప్పు వదులుతుంది మరియు నేను సతోప్రధానంగా అవుతాను. అందరూ తిరిగి వెళ్ళాల్సిందే. కొందరు యోగబలముతో పావనంగా అవుతారు, కొందరు శిక్షలు అనుభవించి వెళ్తారు. పిల్లలైన మీరు తుప్పు వదిలించుకునేందుకు శ్రమ చేయవలసి ఉంటుంది కావున దీనిని యోగాగ్ని అని కూడా అంటారు. ఈ అగ్ని ద్వారా పాపాలు భస్మమౌతాయి. మీరు పవిత్రంగా అయిపోతారు. కామచితిని కూడా అగ్ని అని అంటారు. కామాగ్నిలో తగలబడి నల్లగా అయిపోయారు. ఇప్పుడు తెల్లగా అవ్వండి అని తండ్రి చెప్తున్నారు. ఈ విషయాలు బ్రాహ్మణులైన మీ బుద్ధిలో తప్ప మరెవ్వరి బుద్ధిలోను కూర్చోవు. ఈ విషయాలే అతీతమైనవి. వీరు శాస్త్రాలను కూడా అంగీకరించరు, నాస్తికులుగా అయిపోయారని మీ గురించి అంటారు. అప్పుడు వారికి - మేము శాస్త్రాలు చదివేవారము కానీ తర్వాత తండ్రి వచ్చి జ్ఞానమిచ్చారని చెప్పండి. జ్ఞానము ద్వారా సద్గతి లభిస్తుంది. భగవానువాచ - వేదాలు, ఉపనిషత్తులు మొదలైనవి చదివి దానపుణ్యాదులు చేసినా ఎవ్వరూ నన్ను పొందలేరు. నా ద్వారానే నన్ను పొందగలరు. తండ్రియే వచ్చి అర్హులుగా తయారుచేస్తారు. ఆత్మపై తుప్పు పట్టినప్పుడు, వచ్చి పావనంగా చేయమని తండ్రిని పిలుస్తారు. తమోప్రధానమైన ఆత్మ సతోప్రధానంగా అవ్వాలి, తమోప్రధానము నుండి తమో, రజో, సతో, మళ్ళీ సతోప్రధానంగా అవ్వాలి. మధ్యలో ఏదైనా తేడా జరిగితే మళ్ళీ తుప్పు పడుతుంది.

తండ్రి మనల్ని ఎంత ఉన్నతంగా తయారుచేస్తారు, కావున ఆ సంతోషము ఉండాలి కదా. విదేశాలలో చదువుకునేందుకు సంతోషంగా వెళ్తారు కదా. ఇప్పుడు మీరు ఎంత వివేకవంతులుగా అవుతారు. కలియుగంలో ఎంత తమోప్రధానంగా, వివేకహీనులుగా అయిపోతారు. ఎంతగా ప్రేమిస్తారో, అంతగా ఇంకా ఎదిరిస్తూనే ఉంటారు. మన రాజధాని స్థాపనౌతుందని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. ఎవరైతే బాగా చదువుకుంటారో, స్మృతిలో ఉంటారో, వారు మంచి పదవిని పొందుతారు. భారతదేశము నుండే అంటు కట్టబడుతుంది. రోజు-రోజుకూ వార్తాపత్రికలు మొదలైనవాటి ద్వారా మీ పేరు ప్రఖ్యాతి అవుతూ ఉంటుంది. వార్తాపత్రికలు అన్ని వైపులకు వెళ్తూ ఉంటాయి. ఆ వార్తాపత్రికల వారు అప్పుడప్పుడూ బాగా వ్రాస్తారు, అప్పుడప్పుడు చెడుగా వ్రాస్తారు, వారు కూడా చెప్పుడు మాటలపైనే నడుస్తారు కదా. ఎవరు ఏది వినిపిస్తే, అది వ్రాసేస్తారు. చెప్పుడు మాటలపై చాలా మంది నడుస్తారు, దానిని పరమతమని అంటారు. పరమతము ఆసురీ మతము. తండ్రిది శ్రీమతము. ఎవరైనా తప్పుడు విషయాలు చెప్తే, ఇక రావడమే మానేస్తారు. ఎవరైతే సేవలో ఉంటారో, వారికి అన్నీ తెలుస్తూ ఉంటాయి. ఇక్కడ మీరు ఏ సేవ అయితే చేస్తారో, అది నంబరువన్ సేవ. ఇక్కడ మీరు సేవ చేస్తారు, అక్కడ మీకు ఫలము లభిస్తుంది. ఇక్కడ తండ్రితో కలిసి కర్తవ్యము చేస్తారు కదా. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఆత్మ రూపీ సూదికి తుప్పు పట్టి ఉంది, దానిని యోగబలముతో తొలగించుకుని, సతోప్రధానంగా అయ్యే శ్రమ చేయాలి. ఎప్పుడు కూడా చెప్పుడు మాటలు విని చదువును విడిచిపెట్టకూడదు.

2. బుద్ధిని జ్ఞాన పాయింట్లతో నిండుగా ఉంచుకుని సేవ చేయాలి. నాడిని చూసి జ్ఞానమునివ్వాలి. చాలా చురుకైన బుద్ధి కలవారిగా అవ్వాలి.

వరదానము:-

ఆది మరియు అనాది స్వరూపపు స్మృతి ద్వారా తమ నిజ స్వధర్మాన్ని అలవరచుకునే పవిత్ర మరియు యోగీ భవ

బ్రాహ్మణుల నిజమైన స్వధర్మము పవిత్రత, అపవిత్రత పర ధర్మము. ఏ పవిత్రతను అలవరచుకోవడాన్ని మనుష్యులు కష్టంగా భావిస్తారో, అది పిల్లలైన మీకు చాలా సహజము, ఎందుకంటే నా వాస్తవిక ఆత్మిక స్వరూపము సదా పవిత్రత అనే స్మృతి కలిగింది. అనాది స్వరూపం పవిత్రమైన ఆత్మ మరియు ఆది స్వరూపం పవిత్రమైన దేవత. ఇప్పుటి ఈ అంతిమ జన్మ కూడా పవిత్రమైన బ్రాహ్మణ జీవితం, కావున పవిత్రతయే బ్రాహ్మణ జీవితం యొక్క పర్సనాలిటీ. పవిత్రంగా ఉన్నవారే యోగులు.

స్లోగన్:-

సహజయోగులము అని అంటూ నిర్లక్ష్యాన్ని తీసుకురాకండి, శక్తి రూపులుగా అవ్వండి.