20-12-2020 ప్రాత:మురళి ఓంశాంతి 'బాప్దాదా' 20-03-87


"స్నేహము మరియు సత్యతల అథారిటీ యొక్క బ్యాలెన్స్”

ఈ రోజు సత్ (సత్య) బాబా, సత్ శిక్షకుడు, సత్ గురువు సత్యత యొక్క శక్తిశాలురైన తమ సత్యమైన పిల్లలను కలిసేందుకు వచ్చారు. అన్నింటికంటే అతి పెద్ద శక్తి లేక అథారిటీ సత్యతయే. సత్ కు రెండు అర్థాలు చెప్తారు. ఒకటి - సత్ అనగా సత్యము. రెండవది - సత్ అనగా అవినాశి. రెండు అర్థాలలో సత్యతా శక్తి అన్నింటికంటే పెద్దది. బాబాను సత్ బాబా అని అంటారు. తండ్రులు అయితే అనేకమంది ఉంటారు కానీ సత్యమైన తండ్రి ఒక్కరే. సత్ శిక్షకుడు, సత్ గురువు ఒక్కరే. సత్యమునే పరమాత్మ అని అంటారు అనగా పరమ ఆత్మ యొక్క విశేషత సత్యత అనగా సత్యము. సత్య హీ శివ్ హై (సత్యమే శివుడు)..... అని మీ పాట కూడా ఉంది. ప్రపంచములో కూడా సత్యం-శివం-సుందరం అని అంటారు. అలాగే తండ్రి అయిన పరమాత్మ గురించి సత్-చిత్-ఆనంద స్వరూపుడు అని అంటారు. ఆత్మలైన మిమ్మల్ని సత్-చిత్-ఆనంద స్వరూపులని అంటారు. ‘‘సత్’’ అన్న మాటకు ఎంతో గాయనము ఉంది. మరియు ఎప్పుడైనా ఏదైనా కార్యములో అథారిటీతో మాట్లాడినప్పుడు నేను సత్యము చెప్తున్నాను, అందుకే అథారిటీతో మాట్లాడుతున్నాను అని అంటారు. సత్యము యొక్క నావ అటూ ఇటూ ఊగిసలాడుతుంది కానీ మునిగిపోదు అని సత్యము కోసం గాయనము ఉంది. సత్యమున్న చోట మనసు ఆనందముతో నాట్యము చేస్తుంది అని మీరు కూడా అంటారు. సత్యము అనగా సత్యతా శక్తి కలవారు సదా నాట్యము చేస్తూ ఉంటారు, ఎప్పుడూ వాడిపోరు, చిక్కుకుపోరు, భయపడరు, బలహీనులవ్వరు. సత్యతా శక్తి కలవారు సదా సంతోషంలో నాట్యం చేస్తూ ఉంటారు. వారు శక్తిశాలిగా ఉంటారు, వారికి ఎదుర్కొనే శక్తి ఉంటుంది, అందుకే భయపడరు. సత్యత బంగారంలాంటిది అని అంటారు, అసత్యత మట్టిలాంటిది అని అంటారు. భక్తిలో కూడా ఎవరైతే పరమాత్మ వైపు శ్రద్ధ పెడతారో, వారిని సత్సంగి అని అంటారు, వారు సత్యము యొక్క సాంగత్యము చేసేవారు. మరియు చివర్లో ఎప్పుడైతే ఆత్మ శరీరాన్ని వదులుతుందో, అప్పుడు కూడా ఏమంటారు - సత్ నామ్ సంగ్ హై (సత్యము యొక్క పేరు మీతో ఉంది). కనుక సత్ అంటే అవినాశి, సత్ అంటే సత్యము. సత్యతా శక్తి మహాన్ శక్తి, వర్తమాన సమయంలో మెజారిటీ మిమ్మల్నందరినీ చూసి ఏమని అంటారు - వీరిలో సత్యతా శక్తి ఉంది, అందుకే ఇంత సమయము నుండి వృద్ధిని పొందుతున్నారు. సత్యత ఎప్పుడూ చలించదు, అచలంగా ఉంటుంది. వృద్ధిని ప్రాప్తి చేసుకునేందుకు విధి సత్యత, సత్యతా శక్తితోనే సత్యయుగాన్ని తయారుచేస్తారు, స్వయం కూడా సత్య నారాయణునిగా, సత్య లక్ష్మిగా తయారవుతారు. ఇది సత్యమైన జ్ఞానము, సత్యమైన తండ్రి యొక్క జ్ఞానము, అందుకే ప్రపంచానికి అతీతమైనది మరియు ప్రియమైనది.

కనుక, సత్య జ్ఞానము యొక్క సత్యతా అథారిటీని ఎంతవరకు ధారణ చేసారు అని ఈ రోజు బాప్ దాదా పిల్లలందరినీ చూస్తున్నారు. సత్యత ప్రతి ఆత్మను ఆకర్షిస్తుంది. నేటి ప్రపంచము అసత్య ఖండంగా ఉంది, అంతా అసత్యమే అనగా అంతటిలో అసత్యత కలిసి ఉంది, అయినా కూడా సత్యతా శక్తి కలవారు విజయులుగా అవుతారు. సత్యత యొక్క ప్రాప్తి సంతోషము మరియు నిర్భయత. సత్యము చెప్పేవారు సదా నిర్భయులుగా ఉంటారు. వారికి ఎప్పుడూ భయముండదు. ఎవరైతే సత్యంగా ఉండరో, వారికి తప్పకుండా భయముంటుంది. మరి మీరందరూ సత్యత కల శక్తిశాలి శ్రేష్ఠమైన ఆత్మలు. సత్యమైన జ్ఞానము, సత్యమైన తండ్రి, సత్యమైన ప్రాప్తి, సత్యమైన స్మృతి, సత్యమైన గుణాలు, సత్యమైన శక్తులు, సర్వ ప్రాప్తులు ఉన్నాయి. మరి ఇంతటి అథారిటీ యొక్క నషా ఉంటుందా? అథారిటీ యొక్క అర్థము అభిమానమని కాదు. ఎంతగా అతి పెద్ద అథారిటీనో, అంతగా వారి వృత్తిలో ఆత్మిక అథారిటీ ఉంటుంది. వాణిలో స్నేహము మరియు నమ్రత ఉంటాయి - ఇదే అథారిటీ యొక్క గుర్తు. మీరు వృక్షము యొక్క ఉదాహరణను ఇస్తారు కదా. ఎప్పుడైతే వృక్షానికి సంపూర్ణ ఫలము యొక్క అథారిటీ వస్తుందో, అప్పుడు వృక్షము వంగుతుంది అనగా నిర్మానముగా అయ్యే సేవ చేస్తుంది. అలాగే, ఆత్మిక అథారిటీ కల పిల్లలు ఎంత పెద్ద అథారిటీనో, అంత నిర్మానులుగా మరియు సర్వుల స్నేహీలుగా ఉంటారు. కానీ సత్యతా అథారిటీ కలవారు నిరహంకారులుగా ఉంటారు. కనుక అథారిటీ కూడా ఉండాలి, నషా కూడా ఉండాలి మరియు నిరహంకారులుగా కూడా ఉండాలి - దీనినే సత్య జ్ఞానము యొక్క ప్రత్యక్ష స్వరూపమని అంటారు.

ఈ అసత్య ఖండములో బ్రహ్మా బాబా యొక్క సత్యతా అథారిటీ యొక్క ప్రత్యక్ష సాకార స్వరూపమును చూసారు కదా. అథారిటీతో కూడిన వారి మాటలు ఎప్పుడూ కూడా అహంకార భావనను కలిగించవు. మురళీ వినేటప్పుడు అవి ఎంత అథారిటీ కల మాటలుగా ఉంటాయి కానీ అభిమానము కలవిగా ఉండవు. అథారిటీ కల మాటలలో స్నేహము ఇమిడి ఉంది, నిర్మానత ఉంది, నిరహంకారిత ఉంది, అందుకే ఆ అథారిటీ కల మాటలు ప్రియంగా అనిపిస్తాయి. కేవలము ప్రియమైనవిగానే కాకుండా ప్రభావశాలిగా కూడా ఉంటాయి. ఫాలో ఫాదర్ చేస్తున్నారు కదా. సేవలో మరియు కర్మలో బ్రహ్మా బాబాను ఫాలో చెయ్యాలి ఎందుకంటే సాకార ప్రపంచములో సాకార ‘‘ఎగ్జాంపుల్’’ (ఉదాహరణ), శ్యాంపుల్. కనుక ఏవిధంగానైతే బ్రహ్మా బాబాను కర్మలో, సేవలో, ముఖములో, ప్రతి నడవడికలో నడుస్తూ-తిరుగుతూ ఉన్న అథారిటీ స్వరూపంగా చూసారో, అలా ఫాలో ఫాదర్ (తండ్రిని అనుసరించటం) చేసేవారిలో కూడా స్నేహము మరియు అథారిటీ, నిర్మానత మరియు మహానత - రెండూ ఒకేసారి కనిపించాలి. కేవలము స్నేహము కనిపించి, అథారిటీ మాయమైపోవటము లేక అథారిటీ కనిపించి స్నేహము మాయమైపోవటము, ఇలా కాదు. బ్రహ్మా బాబాను చూసారు మరియు ఇప్పుడు కూడా మురళీలు వింటారు. అది ప్రత్యక్ష ప్రమాణము. పిల్లలూ-పిల్లలూ అని కూడా అంటారు మరియు అథారిటీని కూడా చూపిస్తారు. స్నేహముతో పిల్లలు అని కూడా అంటారు మరియు అథారిటీతో శిక్షణను కూడా ఇస్తారు. సత్య జ్ఞానమును ప్రత్యక్షము కూడా చేస్తారు మరియు పిల్లలూ-పిల్లలూ అని అంటూ నూతన జ్ఞానాన్ని మొత్తము స్పష్టము చేసేస్తారు. దీనినే స్నేహము మరియు సత్యతల అథారిటీ యొక్క బ్యాలెన్స్ అని అంటారు. కనుక వర్తమాన సమయములో సేవలలో ఈ బ్యాలెన్సును అండర్లైన్ చెయ్యండి.

ధరణిని తయారుచేసేందుకు స్థాపన నుండి ఇప్పటివరకు 50 సంవత్సరాలు పూర్తయ్యాయి. విదేశములోని ధరణి కూడా ఇప్పుడు బాగా తయారైంది. విదేశాలలో 50 సంవత్సరాలు అవ్వలేదు కానీ రెడీగా తయారైయున్న సాధనాలున్న సమయంలో వచ్చారు కనుక ప్రారంభంలోని 50 సంవత్సరాలు మరియు ఇప్పటి 5 సంవత్సరాలు సమానము. మేము లాస్ట్ సో ఫాస్ట్ సో ఫస్ట్ (చివర్లో వచ్చినా తీవ్రగతితో ముందుకు వెళ్ళి ఫస్ట్ వచ్చే) వారిమి అని డబల్ విదేశీయులందరూ అంటారు. మరి సమయములో కూడా ఫాస్ట్ ఉండి ఫస్ట్ అవుతారు కదా. నిర్భయత యొక్క అథారిటీని తప్పకుండా పెట్టుకోండి. ఒక్క బాబా యొక్క నూతన జ్ఞానమే సత్యమైన జ్ఞానము, నూతన జ్ఞానము ద్వారా నూతన ప్రపంచము స్థాపన అవుతుంది - ఈ అథారిటీ మరియు నషా, స్వరూపములో ఇమర్జ్ అయ్యి ఉండాలి. 50 సంవత్సరాలైతే మర్జ్ చేసి ఉంచారు కానీ ఎవరు వచ్చినా కూడా వారికి ముందు నుండే నూతన జ్ఞానము యొక్క నూతన విషయాలను వినిపించి తికమక పడేటట్లు చేయమని దీని అర్థము కాదు. ఈ భావము కాదు, ధరణి, నాడి, సమయము, వీటన్నింటినీ చూసి జ్ఞానాన్ని ఇవ్వటము - ఇదే నాలెడ్జ్ ఫుల్ (జ్ఞాన సంపన్నత) కు గుర్తు. ఆత్మ యొక్క కోరికను చూడండి, నాడిని చూడండి, ధరణిని తయారుచెయ్యండి కానీ లోపల సత్యతకు చెందిన నిర్భయతా శక్తి తప్పకుండా ఉండాలి. లోకులు ఏమంటారు అన్న భయము ఉండకూడదు. నిర్భయులుగా అయ్యి ధరణిని బాగా తయారుచెయ్యండి. ఈ జ్ఞానమైతే కొత్తది, చాలామంది దీన్ని అర్థం చేసుకోలేరు అని చాలామంది పిల్లలు భావిస్తారు. కానీ అవివేకులకే కదా అర్థం చేయించాలి. ఎటువంటి వ్యక్తినో అటువంటి రూపురేఖలను తయారుచెయ్యవలసి ఉంటుంది - ఇది తప్పనిసరి, కానీ వ్యక్తి ప్రభావములోకి రాకండి. తమ సత్య జ్ఞానము యొక్క అథారిటీతో వ్యక్తిని పరివర్తన చెయ్యాల్సిందే - ఈ లక్ష్యమును మర్చిపోకండి.

ఇప్పటివరకు ఏదైతే చేసారో, అది బాగుంది. అది చెయ్యవలసే ఉంది, అది అవసరమైనది, ఎందుకంటే ధరణిని తయారుచేయవలసింది ఉంది కదా. కానీ ధరణిని ఎప్పటికి తయారుచేస్తారు? ఇంకెంత సమయము కావాలి? మందును ఇచ్చినప్పుడు కూడా ముందే ఎక్కువ శక్తి కల మందును ఇవ్వరు, ముందు కాస్త తేలికపాటిది ఇస్తారు. అలా అని శక్తి కల మందును ఇవ్వనే ఇవ్వకుండా తేలికపాటి దానితోనే నడిపించడమనేది చెయ్యకండి. బలహీనంగా ఉన్నవారికెవరికైనా హై పవర్ మందులను ఇచ్చినట్లయితే, అది కూడా తప్పు. పరిశీలించే శక్తి కూడా కావాలి. కానీ తమ సత్యమైన, నూతన జ్ఞానము యొక్క అథారిటీ తప్పకుండా కావాలి. మీ సూక్ష్మ అథారిటీ యొక్క వృత్తియే వారి వృత్తులను మారుస్తుంది. ఇటువంటి ధరణి తయారవుతుంది. మరియు విశేషంగా ఎప్పుడైతే మీరు వారి సేవ చేసి వారు మధువనము వరకు చేరుకుంటారో, కనీసం వారికి ఇది తప్పకుండా తెలియాలి. ఈ ధరణిపై వారి ధరణి కూడా తయారౌతుంది. ఎంతటి బంజరు భూమి అయినా కానీ, ఏ ధర్మానికి చెందినవారైనా కానీ, ఏ పొజిషన్లో ఉన్నవారైనా కానీ, ఈ ధరణిలో వారు కూడా కోమలంగా అయిపోతారు మరియు మెత్తటి ధరణి తయారైన కారణంగా, అందులో ఏ బీజాన్ని వేసినా, దాని ఫలము సహజంగా వెలువడుతుంది. కేవలము మీరు భయపడకండి, తప్పకుండా నిర్భయులుగా అవ్వండి. యుక్తితో ఇవ్వండి, వారు మీపై ఈ విధంగా ఫిర్యాదు చెయ్యకూడదు - ఈ ధరణికి మేము చేరుకున్నాము కూడా, కానీ పరమాత్మ జ్ఞానము అంటే ఏమిటి అన్నది తెలియలేదు. పరమాత్మ-భూమికి వచ్చి పరమ-ఆత్మ యొక్క ప్రత్యక్షత యొక్క సందేశమును తప్పకుండా తీసుకుని వెళ్ళాలి. లక్ష్యము అథారిటీతో కూడినదై ఉండాలి.

నేటి ప్రపంచము లెక్కలో కూడా నవీనతకు మహత్వము ఉంది. నూతన ఫ్యాషన్ పేరుతో అస్తవ్యస్తమైన ఫ్యాషన్ వచ్చినా కూడా దానిని ఫాలో చేస్తారు. ఒకప్పటి ఆర్ట్ ను చూడండి, ఎంత గొప్పగా ఉండేది! దానితో పోలిస్తే ఈ రోజుల్లోని ఆర్ట్ గీతల్లా అనిపిస్తుంది. కానీ మోడర్న్ ఆర్ట్స్ ను ఇష్టపడతారు. ప్రతి విషయములోనూ నవీనత ఉండటాన్ని మనుష్యులు ఇష్టపడతారు మరియు నవీనత అనేది స్వతహాగానే తనవైపుకు ఆకర్షిస్తుంది. అందుకే నవీనత, సత్యత, మహానత - వీటి నషాను తప్పకుండా పెట్టుకోండి. తర్వాత సమయము మరియు వ్యక్తిని చూసి సేవ చెయ్యండి. నూతన ప్రపంచము యొక్క నూతన జ్ఞానాన్ని తప్పకుండా ప్రత్యక్షము చెయ్యాలి అన్న ఈ లక్ష్యమును తప్పకుండా పెట్టుకోండి. ఇప్పుడు స్నేహము మరియు శాంతి ప్రత్యక్షమయ్యాయి, బాబా యొక్క ప్రేమ సాగరుని స్వరూపాన్ని, శాంతి సాగరుని స్వరూపాన్ని ప్రత్యక్షము చేసారు కానీ జ్ఞాన స్వరూప ఆత్మ మరియు జ్ఞాన సాగర తండ్రి, ఈ నూతన జ్ఞానాన్ని ఏ పద్ధతితో ఇవ్వాలి అన్నదాని ప్లాన్లు ఇప్పుడు తక్కువగా తయారుచేసారు. ఇది నూతన ప్రపంచము యొక్క నూతన జ్ఞానము - అని అందరి నోటి నుండి ఈ ధ్వని వెలువడే సమయము కూడా వస్తుంది. ఇప్పుడు కేవలము బాగుంది అనే అంటారు, కొత్తది అని అనరు. స్మృతి సబ్జెక్టును బాగా ప్రత్యక్షము చేసారు, అందుకే ధరణి బాగా తయారైంది మరియు ధరణిని తయారుచెయ్యటము అనే ఈ ముందుగా అవసరమైన కార్యము కూడా తప్పనిసరి. ఏదైతే చేసారో, అది చాలా బాగా చేసారు మరియు చాలా చేసారు, తనువు-మనసు-ధనములను పెట్టి చేసారు. దీనికోసం ధన్యవాదములు కూడా తెలుపుతున్నాము.

ఇంతకుముందు విదేశాలకు వెళ్ళినప్పుడు ఈ త్రిమూర్తి చిత్రముపై అర్థం చేయించటం ఎంత కష్టంగా భావించేవారు! ఇప్పుడు త్రిమూర్తి చిత్రానికే ఆకర్షితులవుతున్నారు. ఈ మెట్ల చిత్రాన్ని భారతదేశ కథగా భావించేవారు. కానీ విదేశములో ఈ చిత్రానికి ఆకర్షితులవుతారు. ఈ కొత్త విషయాలను ఏ పద్ధతిలో వినిపించాలి అనే ప్లాన్ ఏదైతే తయారుచేసారో, అలాగే ఇప్పుడు కూడా ఇన్వెన్షన్ చెయ్యండి (ఆవిష్కరించండి). ఇదైతే చెయ్యాల్సే వస్తుంది అని ఇలా ఆలోచించకండి. బాప్ దాదా లక్ష్యము కేవలము ఇదే - నవీనత యొక్క మహానతా శక్తిని ధారణ చెయ్యండి, దీనిని మర్చిపోవద్దు. ప్రపంచానికి అర్థం చేయించాలి. ప్రాపంచిక విషయాలకు భయపడకండి. మీ పద్ధతిని ఇన్వెంట్ చెయ్యండి (ఆవిష్కరించండి) ఎందుకంటే ఇన్వెంటర్లు (ఆవిష్కర్తలు) పిల్లలైన మీరే కదా. సేవా ప్లాన్లు పిల్లలకే తెలుసు. ఎటువంటి లక్ష్యాన్ని పెట్టుకుంటారో, అటువంటి ప్లాన్ చాలా-చాలా బాగా తయారైపోతుంది మరియు సఫలత అయితే జన్మ సిద్ధ అధికారంగా ఉండనే ఉన్నది, అందుకే నవీనతను ప్రత్యక్షము చెయ్యండి. జ్ఞానానికి చెందిన గుహ్యమైన విషయాలు ఏవైతే ఉన్నాయో, వాటిని స్పష్టము చేసే విధి మీ వద్ద చాలా బాగా ఉంది మరియు స్పష్టీకరణ కూడా ఉంది. ప్రతి ఒక్క పాయింట్ ను లాజికల్ (తార్కికం)గా స్పష్టం చేయగలరు. మీరు అథారిటీ కలవారు. ఇవేమీ మీ మనసులో సృష్టించినటువంటి లేక కల్పనకు చెందినటువంటి విషయాలైతే కావు. ఇవి యథార్థమైనవి. అనుభవము ఉంది. అనుభవము యొక్క అథారిటీ, నాలెడ్జ్ యొక్క అథారిటీ, సత్యత యొక్క అథారిటీ..... ఎన్ని అథారిటీలు ఉన్నాయి! కనుక అథారిటీ మరియు స్నేహము - ఈ రెండింటినీ ఒకేసారి కార్యములో పెట్టండి.

దేశములోనైనా, విదేశములోనైనా బాగా కష్టపడి సేవ చేస్తూ-చేస్తూ ఇంతగా వృద్ధిని పొందారు మరియు పొందుతూనే ఉంటారు అని బాప్ దాదాకు సంతోషంగా ఉంది. దేశములో కూడా వ్యక్తిని మరియు నాడిని చూసి సేవ చెయ్యటంతో సఫలత లభించింది. విదేశములో కూడా ఈ విధితోనే సఫలత సాధించారు. ముందుగా సంపర్కములోకి తీసుకువస్తారు - అప్పుడు ధరణి తయారవుతుంది. సంపర్కము తరువాత సంబంధములోకి తీసుకురండి, కేవలము సంపర్కము వరకే వదిలెయ్యకండి. సంబంధములోకి తీసుకువచ్చి వారిని బుద్ధి ద్వారా సమర్పితము చేయించండి - ఇది చివరి స్టేజ్. సంపర్కములోకి తీసుకురావటము కూడా అవసరమే, తర్వాత సంబంధములోకి తీసుకురావాలి. సంబంధములోకి వస్తూ-వస్తూ ‘‘బాబా ఏదైతే చెప్పారో, అదే సత్యము’’ అనే సమర్పణ బుద్ధి కలవారిగా అయిపోవాలి. తరువాత ఇక ప్రశ్నలు తలెత్తవు. బాబా ఏదైతే చెప్తారో, అదే సత్యము, ఎందుకంటే అనుభవము కలిగినట్లయితే ఇక ప్రశ్నలు సమాప్తమైపోతాయి. దీనినే సమర్పణ బుద్ధి అని అంటారు, దీనిలో అన్నీ స్పష్టంగా అనుభవమవుతాయి. సమర్పణ బుద్ధి వరకు తీసుకురావటము తప్పనిసరి అన్న లక్ష్యాన్ని పెట్టుకోండి. అప్పుడు మైక్ తయారైంది అని అంటారు. మైక్ ఏం శబ్దం చేస్తుంది? వీరి జ్ఞానము బాగుంది అని కేవలము ఇంతమాత్రమే కాదు. ఇది కొత్త జ్ఞానము, ఇదే కొత్త ప్రపంచాన్ని తీసుకువస్తుంది అన్న ఈ శబ్దము రావాలి, అప్పుడే కుంభకర్ణులు మేల్కొంటారు కదా! లేదంటే కేవలము కళ్ళు తెరుస్తారు, చాలా బాగుంది, చాలా బాగుంది అని అంటారు, మరల నిద్రలోకి జారిపోతారు. అందుకే, ఏవిధంగానైతే స్వయం బాలకుల నుండి యజమానులుగా అయ్యారో, అలా తయారుచెయ్యండి. పాపం వారిని కేవలము సాధారణ ప్రజల వరకే తీసుకురాకండి, కానీ రాజ్య అధికారులుగా తయారుచెయ్యండి. దాని కోసం ప్లాన్ తయారుచెయ్యండి - ఏ విధితో అయితే చేస్తారో, ఆ విధిలో తికమక కూడా ఉండకూడదు మరియు సమర్పణ బుద్ధి కలవారిగా కూడా అయిపోవాలి. నవీనత కూడా అనిపించాలి, అయోమయాన్ని కూడా అనుభవం చెయ్యకూడదు. స్నేహము మరియు నవీనతల అథారిటీగా అనిపించాలి.

ఇప్పటివరకు ఏదైతే రిజల్టు ఉందో, సేవ విధి, బ్రాహ్మణుల వృద్ధి ఏదైతే ఉందో, అది చాలా బాగుంది. ఎందుకంటే ముందు బీజాన్ని గుప్తంగా పెట్టారు, అది కూడా తప్పనిసరి. బీజాన్ని గుప్తంగా పెట్టవలసి ఉంటుంది, బయట పెడితే ఫలాలను ఇవ్వదు. భూమి లోపల బీజాన్ని పెట్టవలసి ఉంటుంది కానీ అది భూమి లోపలే ఉండిపోకూడదు, బయటకు ప్రత్యక్షమవ్వాలి, ఫల స్వరూపంగా అవ్వాలి - ఇది తరువాత స్టేజ్. అర్థమైందా? కొత్తగా చెయ్యాలి అన్న లక్ష్యమును పెట్టుకోండి. ఈ సంవత్సరమే అయిపోతుంది అని కాదు. కానీ లక్ష్యమనేది బీజాన్ని కూడా బయటకు ప్రత్యక్షము చేస్తుంది. అలాగని నేరుగా వెళ్ళిపోయి భాషణ చెయ్యటం ప్రారంభించడము కూడా కాదు. ముందుగా సత్యతా శక్తి యొక్క అనుభూతిని కలిగించే భాషణను చెయ్యవలసి ఉంటుంది. ‘‘చివరకు ఆ రోజు వచ్చింది’’ - అన్న ఈ మాట అందరి నోటి నుండి రావాలి. డ్రామాలో ఇలా చూపిస్తారు కదా - అన్ని ధర్మాలవారు కలిసి - మేము ఒక్కరము, ఒక్కరికి చెందినవారము అని అంటారు. వారు డ్రామాలో చూపిస్తారు, ఇక్కడ ప్రాక్టికల్ గా స్టేజ్ పై అన్ని ధర్మాలవారు కలిసి ముక్త కంఠంతో అనాలి. ఒక్క బాబా, ఒక్కటే జ్ఞానము, ఒక్కటే లక్ష్యము, ఒక్కటే ఇల్లు, అది ఇదే - ఇప్పుడు ఇటువంటి శబ్దము కావాలి. ఎప్పుడైతే ఇటువంటి దృశ్యము అనంతమైన స్టేజ్ పైకి వస్తుందో, అప్పుడు ప్రత్యక్షతా జెండా ఎగురుతుంది మరియు ఈ జెండా కింద అందరూ ఈ పాటనే పాడుతారు. అందరి నోటి నుండి ఒకే మాట వెలువడుతుంది - ‘‘బాబా మా వారు’’. ప్రత్యక్ష రూపంలో శివరాత్రిని జరుపుకున్నారు అని అప్పుడే అంటారు. అంధకారము పోయి గోల్డెన్ మార్నింగ్ (స్వర్ణిమ శుభోదయ) దృశ్యం కనిపిస్తుంది. దీనిని నేడు మరియు రేపు యొక్క ఆట అని అంటారు. నేడు అంధకారము, రేపు గోల్డెన్ మార్నింగ్. ఇదే చివరి పరదా. అర్థమైందా?

ఇకపోతే, ఏవైతే ప్లాన్లు తయారుచేసారో, అవి బాగున్నాయి. ప్రతి ఒక్క స్థానములోని ధరణి ప్రమాణంగా ప్లాను తయారుచెయ్యవలసే ఉంటుంది. ఒకవేళ ధరణి ప్రమాణంగా విధిలో ఏవైనా మార్పులు చెయ్యవలసి వచ్చినా ఫర్వాలేదు. అందరూ తయారై చివర్లో మధువన ధరణిలో తప్పకుండా ముద్ర వెయ్యాలి. భిన్న-భిన్న వర్గాలను తయారుచేసి తప్పకుండా స్టాంప్ (ముద్ర) వెయ్యాలి. పాస్పోర్ట్ పై కూడా స్టాంప్ వేయించకపోతే వెళ్ళనివ్వరు కదా. కావున స్టాంప్ ఇక్కడ మధువనములోనే పడుతుంది.

వీరందరూ సరెండర్ అయినవారు (సమర్పితులు), ఒకవేళ వీరు సరెండర్ కాకపోతే సేవకు నిమిత్తులుగా ఎలా అవుతారు! సరెండర్ అయినవారు కావుననే బ్రహ్మాకుమారులు, బ్రహ్మాకుమారీలుగా అయ్యి సేవకు నిమిత్తులుగా అయ్యారు. దేశములోనైనా లేక విదేశములోనైనా ఎవరైనా క్రిస్టియన్ కుమారిగా లేక బౌద్ధ కుమారిగా అయ్యి సేవ చెయ్యరు కదా? బి.కె.లుగా అయ్యి సేవ చేస్తారు కదా! కావున అందరూ సరెండర్ బ్రాహ్మణుల లిస్ట్ లో ఉన్నారు. ఇప్పుడు ఇతరులను అలా తయారుచేయాలి. మరజీవులుగా అయ్యారు. బ్రాహ్మణులుగా అయ్యారు. పిల్లలు ‘‘మేరా బాబా (నా బాబా)’’ అని అంటే, ‘‘నీవానిగా అయిపోయాను’’ అని బాబా అంటారు. మరి సరెండర్ అయినట్లు కదా. ప్రవృత్తిలో ఉన్నా లేక సెంటర్లో ఉన్నా కానీ - మనస్ఫూర్తిగా ‘‘మేరా బాబా (నా బాబా)’’ అని అన్నవారిని బాబా తమవారిగా చేసుకున్నారు. ఇది మనసు యొక్క వ్యాపారము. నోటి యొక్క స్థూల వ్యాపారము కాదు, ఇది మనసుకు చెందినది. సరెండర్ అనగా శ్రీమతము అండర్లో ఉండేవారు. మొత్తము సభ అంతా సరెండర్ అయినవారే కదా, అందుకే ఫోటో కూడా తీసారు కదా. ఇప్పుడు ఫోటోలోకి వచ్చేసారు కావున ఇక మారిపోలేరు. పరమాత్మ ఇంటిలోని ఫోటోగా అవ్వటము అనేది తక్కువ భాగ్యము కాదు. ఇది స్థూలమైన ఫోటో కాదు కానీ బాబా మనసులో తీసిన ఫోటో. అచ్ఛా!

సత్యతా అథారిటీ కల సర్వ శ్రేష్ఠ ఆత్మలకు, నవీనత మరియు మహానతలను ప్రత్యక్షము చేసే సర్వ సత్యమైన సేవాధారీ పిల్లలకు, స్నేహం మరియు అథారిటీ యొక్క బ్యాలెన్స్ పెట్టే వారందరికీ, ప్రతి అడుగులోనూ తండ్రి ద్వారా ఆశీర్వాదాలను తీసుకునే అధికారి శ్రేష్ఠ ఆత్మలకు, సత్యమైన అనగా అవినాశీ రత్నాలందరికీ, అవినాశీ పాత్రను అభినయించేవారికి, అవినాశీ ఖజానాలకు బాలకుల నుండి యజమానులుగా అయ్యేవారికి, విశ్వ రచయిత అయిన సత్యమైన బాబా, సత్యమైన శిక్షకుడు, సద్గురువు యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.

వరదానము:-

మనసు యొక్క మౌనం ద్వారా సేవలో కొత్త ఇన్వెన్షన్ (ఆవిష్కరణలు) లను చేసే సిద్ధి స్వరూప భవ

ఏ విధంగా మొదట్లో మౌన వ్రతం పెట్టుకున్నప్పుడు అందరూ ఫ్రీ అయిపోయారో, సమయం చాలా మిగిలిందో, అలాగే ఇప్పుడు వ్యర్థ సంకల్పాలు రానే రాని విధంగా మనసు యొక్క మౌనం పెట్టుకోండి. ఎలా అయితే నోటి నుండి శబ్దం రాదో, అలాగే మనసు నుండి వ్యర్థ సంకల్పాలు రాకూడదు - ఇదే మనసు యొక్క మౌనము. అప్పుడు సమయం మిగులుతుంది. ఈ మనసు యొక్క మౌనంతో సేవలో ఎటువంటి కొత్త ఇన్వెన్షన్ (ఆవిష్కరణ) వెలువడుతుందంటే, దాని ద్వారా సాధన తక్కువ మరియు సిద్ధి ఎక్కువగా ఉంటుంది. ఎలా అయితే సైన్సు సాధనాలు సెకండులో విధిని ప్రాప్తి చేయిస్తాయో, అలాగే ఈ సైలెన్సు సాధనాల ద్వారా సెకండులో విధి ప్రాప్తిస్తుంది.

స్లోగన్:-

ఎవరైతే స్వయం సమర్పిత స్థితిలో ఉంటారో, వారి ఎదురుగా సర్వుల సహయోగము కూడా సమర్పితమవుతుంది.

 

సూచన:- ఈ రోజు మాసములోని మూడవ ఆదివారము, రాజయోగి తపస్వీ సోదర సోదరీలందరూ సా. 6.30 గం.ల నుండి 7.30 వరకు, విశేషంగా యోగాభ్యాస సమయంలో తమ లైట్ మైట్ స్వరూపంలో స్థితులై, భృకుటి మధ్యకు బాప్ దాదాను ఆహ్వానించి, కంబైన్డు స్వరూపాన్ని అనుభవం చేయండి మరియు నలువైపులా లైట్ మైట్ కిరణాలను వ్యాపింపజేసే సేవను చేయండి.