30-12-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైనపిల్లలూ - సంగమయుగంలో సత్యమైన తండ్రి ద్వారా మీకు సత్యత యొక్క వరదానము లభిస్తుంది కావున మీరు ఎప్పుడూ అసత్యము చెప్పడానికి వీల్లేదు”

ప్రశ్న:-

నిర్వికారులుగా అయ్యేందుకు పిల్లలైన మీరు ఏ శ్రమను తప్పకుండా చేయాలి?

జవాబు:-

ఆత్మాభిమానులుగా అయ్యే శ్రమను తప్పకుండా చేయాలి. భృకుటి మధ్యలో ఆత్మనే చూసే అభ్యాసము చేయండి. ఆత్మగా అయి ఆత్మతో మాట్లాడండి, ఆత్మగా అయి వినండి. దేహము వైపు దృష్టి వెళ్ళకూడదు - ఇదే ముఖ్యమైన శ్రమ, ఈ శ్రమలోనే విఘ్నాలు కలుగుతాయి. ఎంత వీలైతే అంత "నేను ఆత్మను, నేను ఆత్మను” అనే అభ్యాసము చెయ్యండి.

గీతము:-

ఓం నమః శివాయ.....

ఓంశాంతి. మధురమైన పిల్లలకు, ఈ సృష్టి చక్రము ఎలా తిరుగుతుందనేది తండ్రి స్మృతిని కలిగించారు. మనము తండ్రి ద్వారా ఏదైతే తెలుసుకున్నామో, తండ్రి మనకు ఏ మార్గాన్నైతే తెలిపారో, అది ప్రపంచములోని వారెవ్వరికీ తెలియదని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. మీరే పూజ్యులు, మీరే పూజారులు అన్నదాని అర్థాన్ని కూడా మీకు అర్థం చేయించారు. ఎవరైతే పూజ్యులుగా, విశ్వానికి యజమానులుగా అవుతారో, వారే మళ్ళీ పూజారులుగా అవుతారు. పరమాత్మ గురించి అలా అనరు. ఇది ఖచ్చితంగా యథార్థమైన విషయమని ఇప్పుడు మీకు స్మృతి కలిగింది. సృష్టి ఆదిమధ్యాంతాల సమాచారము తండ్రియే వినిపిస్తారు, ఇతరులెవ్వరినీ జ్ఞానసాగరులని అనడం జరుగదు. ఈ మహిమ శ్రీకృష్ణునిది కాదు. ‘కృష్ణ’ అన్న పేరు శరీరానిదే కదా. వారు శరీరధారి, వారిలో పూర్తి జ్ఞానమంతా ఉండజాలదు. ఇప్పుడు కృష్ణుని ఆత్మ జ్ఞానము తీసుకుంటుందని మీరు అర్థం చేసుకున్నారు. ఇది అద్భుతమైన విషయము. తండ్రి తప్ప ఇతరులెవ్వరూ అర్థము చేయించలేరు. ఇలా ఎంతో మంది సాధు-సత్పురుషులు రకరకాల హఠయోగాలు మొదలైనవి నేర్పిస్తూ ఉంటారు. అదంతా భక్తి మార్గము. సత్యయుగములో మీరు ఎవ్వరినీ పూజించరు. అక్కడ మీరు పూజారులుగా అవ్వరు. వారు పూజ్య దేవీ-దేవతలుగా ఉండేవారు, ఇప్పుడు అలా లేరు అని అంటారు. ఆ పూజ్యులే ఇప్పుడు మళ్ళీ పూజారులుగా అయ్యారు. ఇతను కూడా పూజలు చేసేవారు కదా అని తండ్రి అంటారు. ఈ సమయంలో మొత్తం ప్రపంచమంతా పూజారిగా ఉంది. కొత్త ప్రపంచములో పూజ్య దేవీదేవతా ధర్మము ఒక్కటే ఉంటుంది. డ్రామా ప్లాను అనుసారంగా ఇది ఖచ్చితంగా సరైనదేనని పిల్లలకు స్మృతిలోకి వచ్చింది. ఇది తప్పకుండా గీతా ఎపిసోడ్ (అధ్యాయమే). కేవలం గీతలో పేరును మార్చేసారు. ఇది అర్థం చేయించేందుకే మీరు శ్రమిస్తారు. 2500 సంవత్సరాల నుండి గీత కృష్ణునిదని భావిస్తూ వచ్చారు, ఇప్పుడు ఈ ఒక్క జన్మలో గీతను నిరాకార భగవంతుడే వినిపించారని అర్థము చేసుకునేందుకు సమయమైతే పడుతుంది కదా. భక్తి గురించి కూడా, ఆ వృక్షము ఎంతగా వ్యాపించి ఉందని అర్థము చేయించారు కదా. తండ్రి మాకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారని మీరు వ్రాయవచ్చు. ఏ పిల్లలకైతే నిశ్చయం కలుగుతుందో, వారు నిశ్చయంతో ఇతరులకు కూడా అర్థము చేయిస్తారు. నిశ్చయము లేకపోతే - ఎలా అర్థం చేయించాలి, ఏదైనా గొడవ జరుగుతుందేమోనని స్వయమూ తికమకపడుతూ ఉంటారు. ఇంకా నిర్భయులుగా అవ్వలేదు కదా. ఎప్పుడైతే పూర్తి దేహీ-అభిమానులుగా అవుతారో అప్పుడు నిర్భయులుగా అవుతారు, భయపడడం అనేది భక్తి మార్గములో జరుగుతుంది. మీరందరూ మహావీరులు. మాయపై విజయాన్ని ఎలా పొందుతారు అనేది ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. పిల్లలైన మీకిప్పుడు స్మృతిలోకి వచ్చింది. ఇంతకు ముందు కూడా తండ్రి మన్మనాభవ అని అన్నారు. పతితపావనుడైన తండ్రియే వచ్చి అర్థము చేయిస్తారు, గీతలో పదాలైతే ఉన్నాయి కానీ ఈ విధంగా ఎవ్వరూ అర్థము చేయించరు. పిల్లలూ, దేహీ అభిమానీ భవ అని తండ్రి అంటారు. పిండిలో ఉప్పంత వలె గీతలో కొన్ని పదాలైతే ఉన్నాయి. ప్రతి ఒక్క విషయంలోనూ తండ్రి నిశ్చయమును ఏర్పరుస్తారు. నిశ్చయబుద్ధి కలవారే విజయులుగా అవుతారు.

మీరిప్పుడు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారు. గృహస్థ వ్యవహారములో కూడా తప్పకుండా ఉండాలని తండ్రి అంటారు. అందరూ ఇక్కడకు వచ్చి కూర్చునే అవసరము లేదు. సేవ చేయాలి, సెంటర్లు తెరవాలి. మీరు సాల్వేషన్ ఆర్మీ (ముక్తిదళం). మీది ఈశ్వరీయ మిషన్ కదా. ముందు శూద్ర, మాయావీ మిషన్ కు చెందినవారిగా ఉండేవారు, ఇప్పుడు మీరు ఈశ్వరీయ మిషన్ కు చెందినవారిగా అయ్యారు. మీకు ఎంతో మహత్యము ఉంది. ఈ లక్ష్మీ-నారాయణులకు ఏ మహిమ ఉంది. ఎలాంటి రాజులు ఉంటారో, అలాంటి రాజ్యం చేస్తారు. వీరిని సర్వగుణ సంపన్నులని, విశ్వానికి యజమానులని అంటారు ఎందుకంటే ఆ సమయంలో ఇంకే రాజ్యమూ ఉండదు. విశ్వానికి యజమానులుగా ఎలా అవ్వాలి అనేది ఇప్పుడు పిల్లలు అర్థము చేసుకున్నారు. ఇప్పుడు మనమే దేవతలుగా అవుతాము కావున మళ్ళీ వారి ముందు మనమెలా తల వంచగలము? మీరు నాలెడ్జ్ ఫుల్ గా అయ్యారు, ఎవరికైతే జ్ఞానం లేదో, వారు తల వంచి నమస్కరిస్తూ ఉంటారు. అందరి కర్తవ్యాలనూ మీరిప్పుడు తెలుసుకున్నారు. ఏ చిత్రాలు తప్పుగా ఉన్నాయి, ఏ చిత్రాలు సరైనవి అన్నది కూడా మీరు అర్థం చేయించవచ్చు. రావణ రాజ్యము గురించి కూడా మీరు అర్థము చేయిస్తారు. ఇది రావణ రాజ్యము, దీనికి నిప్పు అంటుకుంటుంది. ఈ అడవికి నిప్పు అంటుకోనున్నది, అడవి అని ఈ విశ్వాన్ని అంటారు. ఏ పదాలైతే ఇంతకు ముందు గాయనం చేయబడి ఉన్నాయో, వాటి గురించి అర్థం చేయిస్తారు. భక్తి మార్గములో అనేక చిత్రాలను తయారుచేశారు. వాస్తవానికి శివబాబా పూజయే జరుగుతుంది, తర్వాత బ్రహ్మా-విష్ణు-శంకరుల పూజ జరుగుతుంది. త్రిమూర్తి చిత్రము ఏదైతే తయారుచేశారో అది సరియైనది. ఆ తర్వాత ఈ లక్ష్మీనారాయణులు అంతే. త్రిమూర్తులలో బ్రహ్మా-సరస్వతులు కూడా వచ్చేస్తారు. భక్తి మార్గములో ఎన్ని చిత్రాలు తయారుచేస్తారు. హనుమంతుని పూజ కూడా చేస్తారు. మీరు మహావీరులుగా అవుతున్నారు కదా. మందిరాలలో కూడా కొందరు ఏనుగులపై స్వారీ, కొందరు గుర్రాలపై స్వారీ చేసినట్లు చూపించారు. ఇప్పుడు అటువంటి స్వారీ ఏదీ లేదు. తండ్రి మహారథి అని ఉంటారు. మహారథి అనగా ఏనుగుపై స్వారీ చేసేవారు. దానినే వారు ఏనుగుపై స్వారీ చేసినట్లుగా చూపించారు. గజమును మొసలి ఎలా తినేస్తుంది అనేది కూడా అర్థము చేయించారు. మహారథులను కూడా అప్పుడప్పుడు మాయా మొసలి మింగేస్తుంది అని తండ్రి అర్థము చేయిస్తారు. మీకిప్పుడు జ్ఞాన వివేచన లభించింది. మంచి-మంచి మహారథులను కూడా మాయ తినేస్తుంది. ఇవన్నీ జ్ఞానపు విషయాలు, వీటిని ఎవ్వరూ వర్ణించలేరు. నిర్వికారులుగా అవ్వాలి, దైవీ గుణాలను ధారణ చేయాలి అని తండ్రి అంటారు. కామము మహాశత్రువని కల్ప-కల్పము తండ్రి చెప్తారు. ఇందులోనే శ్రమ ఉంది. దీనిపై మీరు విజయం పొందుతారు. ప్రజాపితకు చెందినవారిగా అయ్యారు కావున పరస్పరంలో మీరు సోదరీ-సోదరులుగా అయ్యారు. వాస్తవానికి మీరు ఆత్మలు. ఆత్మ ఆత్మతో మాట్లాడుతుంది. ఆత్మనే ఈ చెవుల ద్వారా వింటుంది, ఇది గుర్తుంచుకోవలసి ఉంటుంది. మనము ఆత్మకు వినిపిస్తాము కానీ దేహానికి కాదు. నిజానికి ఆత్మలమైన మనమందరమూ సోదరులము, మళ్ళీ పరస్పరంలో సోదరీ-సోదరులము కూడా. సోదరునికి వినిపించడం జరుగుతుంది. దృష్టి ఆత్మ వైపుకు వెళ్ళాలి. నేను సోదరునికి వినిపిస్తున్నాను. అన్నయ్యా, వింటున్నారా? అవును, ఆత్మనైన నేను వింటున్నాను. బికనేర్ లో ఒక బిడ్డ సదా ఆత్మ-ఆత్మ అని వ్రాస్తూ ఉంటాడు. నా ఆత్మ ఈ శరీరము ద్వారా వ్రాస్తుంది, ఇది ఆత్మనైన నా ఆలోచన, నా ఆత్మ ఇది చేస్తుంది అని అంటాడు. కావున ఇలా ఆత్మాభిమానులుగా అవ్వడం శ్రమతో కూడుకున్న విషయము కదా. నా ఆత్మ నమస్కరిస్తుంది. బాబా కూడా ఆత్మిక పిల్లలూ అని అంటారు కదా, అప్పుడు భృకుటి వైపు చూడాలి. ఆత్మనే వింటుంది, నేను ఆత్మకే వినిపిస్తాను. మీ దృష్టి ఆత్మపై పడాలి. ఆత్మ భృకుటి మధ్యలో ఉంది. శరీరముపై దృష్టి పడితే విఘ్నాలు కలుగుతాయి. ఆత్మతో మాట్లాడాలి. ఆత్మనే చూడాలి. దేహాభిమానాన్ని వదిలేయండి. తండ్రి కూడా ఇక్కడ భృకుటి మధ్యలో కూర్చొని ఉన్నారని ఆత్మకు తెలుసు. వారికి మనం నమస్కరిస్తాము. నేను ఆత్మను, ఆత్మనే వింటుంది అన్న జ్ఞానం బుద్ధిలో ఉంది. ఈ జ్ఞానము ఇంతకు ముందు లేదు. ఈ దేహము పాత్రను అభినయించేందుకు లభించింది, కావున దేహానికే పేరు పెట్టడం జరుగుతుంది. ఈ సమయంలో మీరు దేహీ అభిమానులుగా అయి తిరిగి వెళ్ళాలి. పాత్రను అభినయించేందుకు ఈ పేరును పెట్టారు. పేరు లేకుండా కార్యవ్యవహారాలు జరగవు. అక్కడ కూడా కార్యవ్యవహారాలు జరుగుతాయి కదా. కానీ మీరు సతోప్రధానంగా అవుతారు కావున అక్కడ ఎటువంటి వికర్మలు తయారవ్వవు. వికర్మలుగా తయారయ్యేందుకు మీరు అటువంటి పనులే చెయ్యరు. అక్కడ మాయ రాజ్యమే ఉండదు. ఆత్మలైన మీరు తిరిగి వెళ్ళాలని ఇప్పుడు తండ్రి అంటున్నారు. ఇది పాత శరీరము, తర్వాత సత్య-త్రేతా యుగాలలోకి వెళ్తారు. అక్కడ జ్ఞానము అవసరమే లేదు. ఇక్కడ మీకు జ్ఞానమెందుకు ఇస్తారు? ఎందుకంటే మీరు దుర్గతిని పొందారు. అక్కడ కూడా కర్మలైతే చేయాలి కానీ అవి అకర్మలుగా అవుతాయి. హాథ్ కార్ డే, దిల్ యార్ డే... (చేతులు పని మీద, మనస్సు ప్రియుని మీద) అని ఇప్పుడు తండ్రి అంటారు. ఆత్మ తండ్రిని స్మృతి చేస్తుంది. సత్యయుగంలో మీరు పవిత్రంగా ఉన్నందున మీ కార్యవ్యవహారాలన్నీ పావనంగా ఉంటాయి. తమోప్రధాన రావణరాజ్యంలో మీ కార్య వ్యవహారాలు పనికిరానివిగా అయిపోతాయి, కావుననే మనుష్యులు తీర్థయాత్రలు మొదలైన వాటికి వెళ్తారు. సత్యయుగంలో తీర్థయాత్రలకు వెళ్ళవలసి వచ్చేందుకు, అక్కడ ఎటువంటి పాపాలూ చేయరు. అక్కడ మీరు ఏ పనులు చేసినా, అవి సత్యముగానే ఉంటాయి. సత్యత వరదానము లభించేసింది. అక్కడ వికారాల విషయమే ఉండదు. కార్య వ్యవహారాలలో కూడా అసత్యము యొక్క అవసరమే ఉండదు. ఇక్కడ లోభమున్నందుకు మనుష్యులు దొంగతనాలు, మోసాలు చేస్తారు, అక్కడ ఈ విషయాలు ఉండవు. డ్రామానుసారంగా మీరు ఇటువంటి పుష్పాలుగా అవుతారు. అది నిర్వికారీ ప్రపంచము, ఇది వికారీ ప్రపంచము. మొత్తం ఆటంతా మీ బుద్ధిలో ఉంది. ఈ సమయంలోనే పవిత్రంగా అయ్యేందుకు శ్రమించాలి. యోగబలముతో మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు, ముఖ్యమైనది యోగబలము. భక్తి మార్గపు యజ్ఞ, తపాదులతో ఎవ్వరూ నన్ను ప్రాప్తి చేసుకోలేరని తండ్రి అంటారు. సతో, రజో, తమోలలోకి వెళ్ళవలసిందే. జ్ఞానము చాలా సహజమైనది మరియు రమణీకమైనది, ఇందులో శ్రమ కూడా ఉంది. మహిమ అంతా ఈ యోగానిదే, దీని ద్వారా మీరు సతోప్రధానంగా తయారవ్వాలి. తమోప్రధానము నుండి సతోప్రధానంగా అయ్యే మార్గం తండ్రియే తెలియజేస్తారు. ఇతరులెవ్వరూ ఈ జ్ఞానమునివ్వలేరు. కొందరు చంద్రుని వరకు వెళ్తారు, కొందరు నీటిపై నడుస్తారు, కానీ అదేమీ రాజయోగము కాదు. వారు నరుని నుండి నారాయణునిగా అయితే అవ్వలేరు. మేము ఆది సనాతన దేవీ-దేవతా ధర్మానికి చెందినవారము, మళ్ళీ అలా తయారవుతున్నామని మీరిక్కడ భావిస్తారు. మీకు ఆ స్మృతి కలిగింది. తండ్రి కల్పక్రితము కూడా ఇది అర్థం చేయించారు. నిశ్చయబుద్ధి విజయంతి అని తండ్రి చెప్తారు. నిశ్చయము లేకపోతే వారు వినేందుకు కూడా రారు. నిశ్చయబుద్ధి కలవారి నుండి తిరిగి సంశయబుద్ధి కలవారిగా కూడా అవుతారు. ఎంతో మంచి-మంచి మహారథులు కూడా సంశయములోకి వచ్చేస్తారు. మాయ తుఫాను కొద్దిగా రావడంతో దేహాభిమానము వచ్చేస్తుంది.

ఈ బాప్ దాదాలు ఇరువురూ కంబైన్డ్ గా ఉన్నారు కదా. శివబాబా జ్ఞానమునిచ్చి వెళ్ళిపోతారా లేక ఏం జరుగుతుంది అనేది ఎవరు చెప్తారు. మీరు సదా ఉంటారా లేక వెళ్ళిపోతారా అని బాబాను అడుగుతారా? తండ్రినైతే అలా అడగలేరు కదా. పతితుల నుండి పావనంగా అయ్యే మార్గాన్ని నేను మీకు చూపిస్తాను అని తండ్రి అంటారు. వస్తాను, వెళ్తాను, నేను ఎన్నో పనులు చేయవలసి ఉంటుంది. పిల్లల వద్దకు కూడా వెళ్తాను, వారితో కార్యాలను చేయిస్తాను. ఇందులో ఎవరూ సంశయపడే విషయమేదీ తీసుకురాకూడదు. తండ్రిని స్మృతి చేయడమే మన కర్తవ్యము. సంశయం రావడంతో పడిపోతారు. మాయ జోరుగా చెంపదెబ్బ వేస్తుంది. అనేక జన్మల అంతిమ జన్మలో కూడా అంతిమంలో నేను ఇతడిలోకి వస్తానని తండ్రి చెప్పారు. తండ్రే మాకు ఈ జ్ఞానమిస్తున్నారు, ఇతరులెవ్వరూ ఇవ్వలేరని పిల్లలకు నిశ్చయముంది. అయినా ఈ నిశ్చయము నుండి ఎంతమంది కిందపడిపోతారు అనేది తండ్రికి తెలుసు. మీరు పావనంగా అవ్వాలంటే నన్నొక్కరినే స్మృతి చేయండి అని తండ్రి చెప్తారు, ఇంకే విషయాలలోనూ పడకండి. మీరు ఇలా మాట్లాడినట్లయితే, పక్కా నిశ్చయము లేదని అర్థమవుతుంది. మొదట ఒక్క విషయాన్ని అర్థం చేసుకోండి, దీని ద్వారా మీ పాపాలు నశిస్తాయి, మిగిలిన వ్యర్థ విషయాలు మాట్లాడవలసిన అవసరము లేదు. తండ్రి స్మృతితో వికర్మలు వినాశనమవుతాయి, ఇతర విషయాలలోకి ఎందుకు వెళ్తారు! ఎవరైనా ప్రశ్నొత్తరాలలో తికమకపడుతుంటే, మీరు ఈ విషయాలను వదిలి ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేసే పురుషార్థము చేయండని వారికి చెప్పండి. సంశయంలోకి వచ్చారంటే చదువునే వదిలేస్తారు, దానితో వారి కళ్యాణము జరగదు. నాడిని చూసి అర్థము చేయించాలి. సంశయమున్నట్లయితే ఒక్క పాయింటుపై నిలబెట్టాలి. చాలా యుక్తితో అర్థము చేయించవలసి ఉంటుంది. బాబా వచ్చారు, మనల్ని పావనంగా చేస్తున్నారు అన్న నిశ్చయం పిల్లలకు మొదట ఉండాలి. ఈ సంతోషం ఉంటుంది. చదవకపోతే ఫెయిల్ అయిపోతారు, వారికి సంతోషం ఎందుకు కలుగుతుంది? స్కూల్లో చదువు ఒక్కటే ఉంటుంది కానీ కొందరు చదువుకుని లక్షలు సంపాదిస్తారు, కొందరు 5-10 రూపాయలు మాత్రమే సంపాదిస్తారు. నరుని నుండి నారాయణునిగా అవ్వడమే మీ లక్ష్యం. రాజ్యము స్థాపనవుతుంది. మీరు మనుష్యుల నుండి దేవతలుగా అవుతారు. దేవతల రాజధాని చాలా పెద్దగా ఉంటుంది, అందులో ఉన్నత పదవిని పొందడం మీ చదువుపై మరియు నడవడిక పై ఆధారపడి ఉంటుంది. మీ నడవడిక చాలా బాగుండాలి. ఇప్పుడు కర్మాతీత స్థితి ఇంకా తయారవ్వలేదు అని బాబా తమను గురించి కూడా చెప్తున్నారు. నేను కూడా సంపూర్ణంగా అవ్వాలి, ఇప్పుడింకా తయారవ్వలేదు. జ్ఞానం చాలా సహజమైనది. తండ్రిని స్మృతి చేయడం కూడా సహజమే, కానీ అది చేయాలి కదా. అచ్ఛా!

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఏ విషయంలోనూ సంశయబుద్ధి కలవారిగా అయి చదువును వదిలేయకూడదు. మొదట పావనంగా అయ్యేందుకు ఒక్క తండ్రిని స్మృతి చేయాలి, ఇతర ఏ విషయాలలోకి వెళ్ళకూడదు.

2. శరీరముపై దృష్టి వెళ్ళడంతో విఘ్నాలు కలుగుతాయి, కావున భృకుటిలో చూడాలి. ఆత్మగా భావిస్తూ ఆత్మతో మాట్లాడాలి. ఆత్మాభిమానులుగా అవ్వాలి. నిర్భయులుగా అయి సేవ చేయాలి.

వరదానము:-

దృఢ సంకల్పం ద్వారా బలహీనతల రూపీ కలియుగ పర్వతాన్ని సమాప్తం చేసే సమర్థీ స్వరూప భవ

దుఃఖితులుగా అవ్వడం, ఏదైనా సంస్కారానికి లేక పరిస్థితికి వశమవ్వడం, వ్యక్తి లేక వైభవాల వైపు ఆకర్షితులవ్వడం - ఈ బలహీనతల రూపీ కలియుగ పర్వతాన్ని దృఢ సంకల్పమనే వేలుతో సదాకాలానికి సమాప్తం చేయండి అనగా విజయులుగా అవ్వండి. విజయం మా మెడలోని హారం - సదా ఈ స్మృతితో సమర్థ స్వరూపులుగా అవ్వండి. ఇదే స్నేహానికి రిటర్న్ ఇవ్వడం. ఎలాగైతే సాకార తండ్రి స్థితిలో స్తంభముగా అయి చూపించారో, అలా తండ్రిని అనుసరించి సర్వగుణాల స్తంభముగా అవ్వండి.

స్లోగన్:-

సాధనాలు సేవ కోసము ఉన్నాయి, విశ్రాంతి ప్రియులుగా అయ్యేందుకు కాదు.