22-12-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైనపిల్లలూ - మీకిప్పుడు తండ్రి ద్వారా దివ్యదృష్టి లభించింది, ఆ దివ్యదృష్టి ద్వారానే మీరు ఆత్మ మరియు పరమాత్మను చూడగలరు”

ప్రశ్న:-

డ్రామాలోని ఏ రహస్యాన్ని అర్థము చేసుకున్నవారు ఏ సలహాను ఎవ్వరికీ ఇవ్వరు?

జవాబు:-

డ్రామాలో ఏదైతే గతించిపోయిందో, మళ్ళీ యథార్థంగా రిపీట్ అవుతుందని అర్థము చేసుకున్నవారు, ఎప్పుడూ ఎవ్వరికీ భక్తిని వదిలి పెట్టమని సలహా ఇవ్వరు. ఎప్పుడైతే వారి బుద్ధిలో జ్ఞానము బాగా కూర్చుంటుందో, నేను ఒక ఆత్మను, నేను అనంతమైన తండ్రి నుండి వారసత్వము తీసుకోవాలని అర్థం చేసుకుంటారో, ఎప్పుడైతే అనంతమైన తండ్రిని గుర్తిస్తారో, అప్పుడు హద్దు విషయాలు స్వతహాగానే సమాప్తమైపోతాయి.

ఓంశాంతి. మీ ఆత్మ స్వధర్మములో కూర్చున్నారా? ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలను అడుగుతున్నారు ఎందుకంటే అనంతమైన తండ్రి ఒక్కరినే రూహ్ (ఆత్మికమైన) అని అంటారని పిల్లలకు తెలుసు. కేవలం వారిని సుప్రీమ్ అని అంటారు. సుప్రీమ్ రూహ్ లేక పరమ ఆత్మ అని అంటారు. పరమాత్మ తప్పకుండా ఉన్నారు, పరమాత్మ లేనే లేరని కాదు. పరమ ఆత్మ అనగా పరమాత్మ. ఇది కూడా అర్థం చేయించడం జరిగింది, ఇందులో తికమకపడకూడదు ఎందుకంటే 5 వేల సంవత్సరాల క్రితము కూడా మీరు ఈ జ్ఞానాన్ని విన్నారు. ఆత్మయే వింటుంది కదా. ఆత్మ చాలా చిన్నది, సూక్ష్మమైనది. ఎంత చిన్నదంటే దానిని ఈ కనులతో చూడలేము. ఆత్మను ఈ కనులతో చూసిన మనుష్యులు ఎవ్వరూ ఉండరు. అది కనిపిస్తుంది కానీ దివ్యదృష్టితోనే కనిపిస్తుంది. అది కూడా డ్రామా ప్లాను అనుసారముగా జరుగుతుంది. అచ్ఛా, ఎవరికైనా ఆత్మ సాక్షాత్కారము జరిగిందనుకోండి, అది కూడా ఇతర వస్తువులు కనిపించినట్లే కనిపిస్తుంది. భక్తి మార్గములో కూడా ఏదైనా సాక్షాత్కారము జరిగితే, అది కూడా ఈ కనుల ద్వారానే జరుగుతుంది. అప్పుడు దివ్యదృష్టి లభిస్తుంది కావున చైతన్యములో చూస్తారు. ఆత్మకు జ్ఞాన చక్షువు లభిస్తుంది, దాని ద్వారా చూడగలరు, కానీ ధ్యానములో చూస్తారు. భక్తి మార్గములో చాలా భక్తి చేసినప్పుడు సాక్షాత్కారము జరుగుతుంది. మీరాకు సాక్షాత్కారం జరిగినప్పుడు, ఆమె నాట్యము చేసేవారు, అప్పుడు వైకుంఠమైతే లేదు. ఇది 5-6 వందల సంవత్సరాల క్రితము జరిగి ఉంటుంది, ఆ సమయంలో వైకుంఠము లేదు. ఏదైతే గతించిపోయిందో, దానిని దివ్యదృష్టితో చూడటం జరుగుతుంది. చాలా భక్తి చేస్తూ-చేస్తూ పూర్తిగా భక్తిమయమైనప్పుడు సాక్షాత్కారమవుతుంది, కానీ దాని వలన ముక్తి లభించదు. ముక్తి-జీవన్ముక్తుల మార్గము భక్తి మార్గానికి పూర్తిగా అతీతమైనది. భారతదేశములో ఎన్ని మందిరాలున్నాయి. శివలింగాన్ని పెడతారు. పెద్ద లింగాన్ని కూడా పెడతారు, చిన్నదానిని కూడా పెడతారు. ఆత్మ ఎలా ఉంటుందో, పరమపిత పరమాత్మ కూడా అలాగే ఉంటారని పిల్లలైన మీకిప్పుడు తెలుసు. అందరి సైజు ఒక్కటే ఉంటుంది. తండ్రి ఎలా ఉంటారో, పిల్లలు కూడా అలాగే ఉంటారు. ఆత్మలందరూ పరస్పరంలో సోదరులు. ఆత్మలు పాత్రను అభినయించేందుకు ఈ శరీరాలలోకి వస్తాయి, ఇవి అర్థము చేసుకోవలసిన విషయాలు. ఇవి భక్తి మార్గపు కట్టుకథలేమీ కాదు. జ్ఞాన మార్గము యొక్క విషయాలను కేవలం ఒక్క తండ్రి మాత్రమే అర్థము చేయిస్తారు. అనంతమైన తండ్రి అయిన నిరాకారుడే మొట్టమొదట అర్థము చేయించేవారు, వారిని పూర్తిగా ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. వారు సర్వవ్యాపి అని అంటారు. ఇదేమీ రైటు కాదు. తండ్రిని పిలుస్తారు, చాలా ప్రేమగా పిలుస్తారు. బాబా, మీరు వచ్చినప్పుడు మేము మీ పై పూర్తిగా బలిహారమవుతాము, నాకైతే మీరు తప్ప మరెవ్వరూ లేరు అని అంటారు. మరి వారిని తప్పకుండా స్మృతి చేయవలసి ఉంటుంది. వారు కూడా స్వయంగా, ఓ పిల్లలూ అని అంటారు. వారు ఆత్మలతోనే మాట్లాడుతారు. దీనిని ఆత్మిక జ్ఞానమని అంటారు. ఆత్మ మరియు పరమాత్మ చాలా కాలము వేరుగా ఉన్నారు అని గాయనం కూడా జరుగుతుంది. ఈ లెక్కను కూడా తెలియజేశారు. చాలా కాలము నుండి ఆత్మలైన మీరు వేరుగా ఉన్నారు, మీరే ఈ సమయంలో మీ రాజయోగమును నేర్చుకునేందుకు మళ్ళీ తండ్రి వద్దకు వచ్చారు. ఈ టీచరు సేవకుడు. టీచరు ఎల్లప్పుడూ వినయ విధేయతలు గల సేవకునిగా ఉంటారు. నేను పిల్లలందరికీ సేవకుడినని తండ్రి కూడా అంటారు. ఓ పతితపావనా, మీరు వచ్చి మమ్మల్ని పావనంగా చేయండని మీరు ఎంత అధికారముతో పిలుస్తారు. అందరూ భక్తులే. ఓ భగవంతుడా రండి, మమ్మల్ని మళ్ళీ పావనంగా చేయండని అంటారు. స్వర్గమును పావన ప్రపంచమని, నరకమును పతిత ప్రపంచమని అంటారు. ఇవన్నీ అర్థము చేసుకునే విషయాలు. ఇది కాలేజ్ లేక గాడ్ ఫాదర్లీ వరల్డ్ యూనివర్సిటీ. మనుష్యులను దేవతలుగా తయారుచేయడం దీని లక్ష్యము-ఉద్దేశ్యము. మేము ఇలా తయారవ్వాలని పిల్లలు నిశ్చయం ఏర్పరచుకుంటారు. ఎవరికైతే నిశ్చయమే ఉండదో, వారు స్కూల్లో కూర్చుంటారా? లక్ష్యము-ఉద్దేశ్యము అయితే బుద్ధిలో ఉంది. మనం బ్యారిస్టరుగా లేక డాక్టరుగా అవ్వనున్నప్పుడు చదువుకుంటాము కదా. నిశ్చయం లేకపోతే రానే రారు. మేము మనుష్యుల నుండి దేవతలుగా, నరుని నుండి నారాయణునిగా అవుతామని మీకు నిశ్చయముంది. ఇది నరుని నుండి సత్యనారాయణునిగా అయ్యే సత్యాతి-సత్యమైన కథ. వాస్తవానికి ఇది చదువు, కానీ దీనిని కథ అని ఎందుకంటారు? ఎందుకంటే 5 వేల సంవత్సరాల క్రితము కూడా దీనిని విన్నారు. ఇది గతించిపోయింది. గతించినదానిని కథ అని అంటారు. ఇది నరుని నుండి నారాయణునిగా తయారయ్యే శిక్షణ. కొత్త ప్రపంచములో దేవతలు, పాత ప్రపంచములో మనుష్యులుంటారని పిల్లలు హృదయపూర్వకంగా అర్థము చేసుకుంటారు. దేవతలలో ఉన్న గుణాలు మనుష్యులలో లేవు, అందుకే వారిని దేవతలని అంటారు. మనుష్యులు దేవతల ఎదురుగా నమస్కరిస్తారు. మీరు సర్వ గుణసంపన్నులు..... అని అంటూ స్వయాన్ని మళ్ళీ మేము పాపులము, నీచులము అని అనుకుంటారు. మనుష్యులే అంటారు, దేవతలు ఇలా అనరు. దేవతలు సత్యయుగంలో ఉంటారు, వారు కలియుగంలో ఉండరు. కానీ ఈ రోజుల్లో అందరినీ శ్రీ శ్రీ అని అనేస్తారు. శ్రీ అనగా శ్రేష్ఠమైనవారు. భగవంతుడే సర్వ శ్రేష్ఠంగా తయారుచేయగలరు. శ్రేష్ఠమైన దేవతలు సత్యయుగంలో ఉండేవారు, ఈ సమయంలో మనుష్యులెవ్వరూ శ్రేష్ఠంగా లేరు.

పిల్లలైన మీరిప్పుడు అనంతమైన సన్యాసము చేస్తారు. ఈ పాత ప్రపంచము సమాప్తమవ్వనున్నది అని మీకు తెలుసు, అందుకే వీటన్నిటిపైనా మీకు వైరాగ్యము ఉంది. వారు హఠయోగీ సన్యాసులు. ఇళ్ళు-వాకిళ్ళను వదిలి వెళ్ళి, మళ్ళీ వచ్చి మహళ్ళలో కూర్చున్నారు. లేకపోతే కుటీరానికి ఖర్చు ఏమీ ఉండదు. ఏకాంతము కోసం కుటీరంలో కూర్చోవలసి ఉంటుంది, మహళ్ళలో కాదు. బాబాకు కూడా కుటీరము తయారు చేయబడింది. కుటీరములో అన్ని సుఖాలున్నాయి. ఇప్పుడు పిల్లలైన మీరు పురుషార్థము చేసి మనుష్యుల నుండి దేవతలుగా తయారవ్వాలి. ఏదైతే డ్రామాలో గతించిపోయిందో, అది మళ్ళీ యథార్థంగా పునరావృతమవుతుందని మీకు తెలుసు, అందుకే భక్తి వదిలేయమని ఎవ్వరికీ ఇటువంటి సలహానివ్వకూడదు. నేను ఒక ఆత్మను, నేనిప్పుడు అనంతమైన తండ్రి నుండి వారసత్వము తీసుకోవాలి అన్న జ్ఞానము బుద్ధిలోకి వచ్చినప్పుడు అర్థము చేసుకుంటారు. అనంతమైన తండ్రిని గుర్తించినప్పుడు హద్దు విషయాలు సమాప్తమైపోతాయి. గృహస్థ వ్యవహారములో ఉంటూ కేవలం బుద్ధియోగాన్ని తండ్రితో జోడించాలని తండ్రి అంటారు. శరీర నిర్వహణ కోసం కర్మలు కూడా చేయాలి, భక్తిలో కూడా కొంతమంది ఎంతో నవ విధ భక్తిని చేస్తారు. రోజూ వెళ్ళి నియమానుసారంగా దర్శనము చేసుకుంటారు. దేహధారుల వద్దకు వెళ్తారు, అదంతా దైహికమైన యాత్ర. భక్తి మార్గములో ఎన్ని ఎదురుదెబ్బలు తినవలసి ఉంటుంది. ఇక్కడ ఎటువంటి ఎదురుదెబ్బలు ఉండవు. ఎవరు వచ్చినా వారికి అర్థం చేయించేందుకు కూర్చోబెట్టడం జరుగుతుంది. అంతేకానీ, స్మృతి కోసం ఏదైనా ఒక్క స్థానంలోనే కూర్చుండిపోవడం కాదు. భక్తి మార్గములో కొందరు కృష్ణుని భక్తులుంటారు, వారు నడుస్తూ-తిరుగుతూ కృష్ణుడిని స్మృతి చేయలేరు అని కాదు, అందుకే చదువుకున్నవారు, కృష్ణుని చిత్రము ఇంట్లోనే ఉంది కదా, మళ్ళీ మీరు మందిరాలకు ఎందుకు వెళ్తున్నారు అని అంటారు. కృష్ణుని చిత్రానికి మీరు ఎక్కడైనా పూజ చేయవచ్చు. అచ్ఛా, చిత్రము పెట్టుకోకపోయినా, స్మృతి చేస్తూ ఉండండి. ఒక్కసారి దేనినైనా చూస్తే అది గుర్తుంటుంది. శివబాబాను మీరు ఇంట్లో కూర్చుని స్మృతి చేయలేరా అని మీకు కూడా ఇదే చెప్తారు. ఇది కొత్త విషయము. శివబాబా గురించి ఎవ్వరికీ తెలియదు. వారి నామ, రూప, దేశ, కాలాలు గురించే తెలియదు, అందుకే సర్వవ్యాపి అనేస్తారు. ఆత్మను పరమాత్మ అని అనరు. ఆత్మకు తండ్రి స్మృతి కలుగుతుంది. కానీ తండ్రి గురించి తెలియదు కనుక 7 రోజులు అర్థం చేయించాల్సి ఉంటుంది. తర్వాత విస్తారమైన పాయింట్లు కూడా అర్థం చేయించడం జరుగుతుంది. తండ్రి జ్ఞానసాగరుడు కదా. ఎంత సమయం నుండి వింటూ వచ్చారు ఎందుకంటే ఇది జ్ఞానము కదా. మాకు మనుష్యుల నుండి దేవతలుగా తయారయ్యే జ్ఞానము లభిస్తుందని అర్థము చేసుకుంటారు. మీకు కొత్త-కొత్త గుహ్యమైన విషయాలను వినిపిస్తానని తండ్రి అంటారు. మీకు మురళీ లభించకపోతే మీరు ఎంతగా బాధపడతారు. మీరు తండ్రిని స్మృతి అయితే చేయండి అని తండ్రి అంటారు. మురళీని చదువుతారు, మళ్ళీ మర్చిపోతారు. నేను ఆత్మను, ఇంత చిన్న బిందువును అని మొట్టమొదట ఇది గుర్తుంచుకోవాలి. ఆత్మను కూడా తెలుసుకోవాలి. వీరి ఆత్మ బయటకు వచ్చి మరొకరిలో ప్రవేశించిందని అంటారు. ఆత్మలైన మనమే జన్మలు తీసుకుంటూ-తీసుకుంటూ ఇప్పుడు పతితంగా, అపవిత్రంగా అయిపోయాము. మొదట మీరు పవిత్రమైన గృహస్థ ధర్మానికి చెందినవారిగా ఉండేవారు. లక్ష్మీ-నారాయణులు ఇరువురూ పవిత్రంగా ఉండేవారు. మళ్ళీ ఇరువురూ అపవిత్రంగా అయ్యారు, మళ్ళీ ఇరువురూ పవిత్రంగా అవుతారు, మరి వారు అపవిత్రుల నుండి పవిత్రులుగా అయ్యారా లేక పవిత్ర జన్మ తీసుకున్నారా? మీరెలా పవిత్రంగా ఉండేవారు, తర్వాత వామమార్గములోకి వెళ్ళడంతో ఎలా అపవిత్రంగా అయ్యారు అన్నది తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. పూజారులను అపవిత్రులని, పూజ్యులను పవిత్రులని అంటారు. ప్రపంచమంతటి చరిత్ర-భూగోళాలు మీ బుద్ధిలో ఉన్నాయి. ఎవరెవరు రాజ్యం చేసేవారు, ఎలా వారికి రాజ్యము లభించింది అనేది మీకు తెలుసు, ఇవి తెలిసినవారు మరెవ్వరూ లేరు. మీ వద్ద కూడా ఇంతకుముందు ఈ రచన మరియు రచయితల ఆదిమధ్యాంతాల జ్ఞానము లేదు, అనగా నాస్తికులుగా ఉండేవారు. ఇంతకుముందు తెలియదు. నాస్తికులుగా అవ్వడం వలన ఎంత దుఃఖితులుగా అయిపోతారు. ఇప్పుడు మీరు దేవతలుగా అయ్యేందుకు ఇక్కడకు వచ్చారు. అక్కడ ఎంత సుఖం ఉంటుంది. దైవీగుణాలను కూడా ఇక్కడే ధారణ చేయాలి. ప్రజాపిత బ్రహ్మా సంతానము సోదరీ-సోదరులవుతారు కదా. వికారీ దృష్టి ఉండకూడదు, ఇందులోనే శ్రమ ఉంది. కళ్ళు చాలా వికారీగా ఉంటాయి. అన్ని ఇంద్రియాల కన్నా వికారీ అయినవి ఈ కళ్ళే. అర్థకల్పము వికారీగా, అర్థకల్పము శుద్ధముగా ఉంటాయి. సత్యయుగములో వికారీగా ఉండవు. కళ్ళు వికారీగా ఉన్నట్లయితే అసురులని పిలవబడతారు. నేను పతిత ప్రపంచములోకి వస్తానని తండ్రి స్వయంగా చెప్తున్నారు. ఎవరైతే పతితంగా అయ్యారో, వారే పావనంగా అవ్వాలి. వీరు తనను భగవంతుడని చెప్పుకుంటున్నారని మనుష్యులంటారు. వృక్షములో పూర్తిగా తమోప్రధాన ప్రపంచము యొక్క అంతిమంలో నిలబడి ఉన్నారు చూడండి, వారే మళ్ళీ తపస్సు చేస్తున్నారు. సత్యయుగం నుండి లక్ష్మీనారాయణుల వంశం కొనసాగుతుంది. ఈ లక్ష్మీ-నారాయణుల నుండే శకము లెక్కించబడుతుంది, అందుకే తండ్రి అంటున్నారు, లక్ష్మీ-నారాయణుల రాజ్యాన్ని చూపించినప్పుడు, ఇప్పటి నుండి 1250 సంవత్సరాల తర్వాత త్రేతా యుగము వస్తుందని వ్రాయండి. శాస్త్రాలలో లక్షల సంవత్సరాలని వ్రాసేశారు. రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది కదా. అర్థకల్పము బ్రహ్మా రాత్రి, అర్థకల్పము బ్రహ్మా పగలు - ఈ విషయాలను తండ్రియే అర్థం చేయిస్తారు. అయినా బాబా అంటారు - మధురమైన పిల్లలూ, స్వయాన్ని ఆత్మగా భావించండి, తండ్రిని స్మృతి చేయండి. వారిని స్మృతి చేస్తూ-చేస్తూ మీరు పావనంగా అయిపోతారు, తర్వాత అంతమతి సో గతి ఏర్పడుతుంది. ఇక్కడే కూర్చుండిపోండి అని తండ్రి ఈ విధంగా చెప్పరు. సర్వీసబుల్ పిల్లలనైతే కూర్చోబెట్టరు. సెంటర్లు, మ్యూజియంలు మొదలైనవి తెరుస్తూ ఉంటారు. మీరు వచ్చి దైవీ జన్మసిద్ధ అధికారమైన విశ్వ రాజ్యాధికారాన్ని తీసుకోండి అని ఎంతమందికి ఆహ్వానాలు పంచుతూ ఉంటారు. మీరు తండ్రి పిల్లలు. తండ్రి స్వర్గ రచయిత కనుక మీకు కూడా స్వర్గ వారసత్వముండాలి. నేను ఒక్కసారి మాత్రమే స్వర్గ స్థాపన చేసేందుకు వస్తాను అని తండ్రి అంటారు. ప్రపంచము ఒక్కటే, దాని చక్రము తిరుగుతూ ఉంటుంది. మనుష్యులకైతే అనేక మతాలు, అనేక విషయాలున్నాయి. ఎన్ని మత-మతాంతరాలున్నాయి, దీనిని అద్వైత మతమని అంటారు. వృక్షము ఎంత పెద్దది. ఎన్ని కొమ్మలు-రెమ్మలు వెలువడుతాయి. ఎన్ని ధర్మాలు వ్యాపిస్తున్నాయి, మొదట ఒకే మతము, ఒకే రాజ్యముండేది. మొత్తం విశ్వమంతటిపై వీరి రాజ్యముండేది. ఇది కూడా మీకు ఇప్పుడే తెలిసింది. మనమే విశ్వమంతటికీ యజమానులుగా ఉండేవారిమి. 84 జన్మలు అనుభవించిన తర్వాత మళ్ళీ నిరుపేదలుగా అయ్యాము. ఇప్పుడు మీరు కాలుడి పై విజయము పొందుతారు, అక్కడ ఎప్పుడూ అకాల మృత్యువు ఉండదు. ఇక్కడైతే చూడండి, కూర్చుని-కూర్చుని అకాల మృత్యువు జరుగుతూ ఉంటుంది. నలువైపులా మృత్యువే మృత్యువు ఉంది. అక్కడ అలా జరగదు, జీవితం పూర్ణాయుష్షు వరకు కొనసాగుతుంది. భారతదేశములో పవిత్రత, శాంతి, సంపద ఉండేవి. సుమారుగా 150 సంవత్సరాల ఆయుష్షు ఉండేది, ఇప్పుడు ఎంత ఆయుష్షు ఉంటుంది?

ఈశ్వరుడు మీకు యోగము నేర్పించారు కనుక మిమ్మల్ని యోగేశ్వరులని అంటారు. అక్కడ అలా అనరు. ఈ సమయంలో మీరు యోగేశ్వరులు, మీకు ఈశ్వరుడు రాజయోగము నేర్పిస్తున్నారు. తర్వాత రాజ రాజేశ్వరులుగా అవ్వాలి. ఇప్పుడు మీరు జ్ఞానేశ్వరులు, తర్వాత రాజేశ్వరులు అనగా రాజులకే రాజుగా అవుతారు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. కనులను శుద్ధముగా తయారు చేసుకునేందుకు శ్రమ చేయాలి. మేము ప్రజాపిత బ్రహ్మా పిల్లలము, పరస్పరంలో సోదరీ-సోదరులము, వికారీ దృష్టి పెట్టుకోకూడదని సదా బుద్ధిలో ఉండాలి.

2. శరీర నిర్వహణార్థం కర్మలు చేస్తూ బుద్ధి యోగాన్ని ఒక్క తండ్రితో జోడించాలి, హద్దు విషయాలన్నీ వదిలి అనంతమైన తండ్రిని స్మృతి చేయాలి. అనంతమైన సన్యాసులుగా అవ్వాలి.

వరదానము:-

సదా అతీంద్రియ సుఖమనే ఊయలలో ఊగే సంగమయుగపు సర్వ అలౌకిక ప్రాప్తులతో సంపన్న భవ

ఏ పిల్లలైతే అలౌకిక ప్రాప్తులతో సదా సంపన్నంగా ఉంటారో, వారు అతీంద్రియ సుఖమనే ఊయలలో ఊగుతూ ఉంటారు. ఏ విధంగా గారాబాల పిల్లలను ఊయలలో ఊపుతారో, అదే విధంగా సర్వ ప్రాప్తి సంపన్న బ్రాహ్మణుల ఊయల అతీంద్రియ సుఖము యొక్క ఊయల, ఈ ఊయలలో సదా ఊగుతూ ఉండండి. ఎప్పుడూ దేహాభిమానములోకి రాకండి. ఎవరైతే ఊయల నుండి దిగి భూమిపై పాదం మోపుతారో వారు మలినమవుతారు. ఉన్నతాతి ఉన్నతమైన తండ్రి యొక్క స్వచ్ఛమైన పిల్లలు సదా అతీంద్రియ సుఖమనే ఊయలలో ఊగుతారు, మట్టిలో పాదం మోపజాలరు.

స్లోగన్:-

‘‘నేను త్యాగిని’’ ఈ అభిమానం యొక్క త్యాగమే సత్యమైన త్యాగము.