11-12-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైనపిల్లలూ - మధుబన్ హోలియస్ట్ ఆఫ్ ది హోలీ (పవిత్రాతి పవిత్రమైన) తండ్రి ఇల్లు, ఇక్కడికి మీరు పతితులెవ్వరినీ తీసుకురాలేరు”

ప్రశ్న:-

ఈ ఈశ్వరీయ మిషన్ లో ఎవరైతే పక్కా నిశ్చయబుద్ధి కలవారు ఉన్నారో, వారి గుర్తులేమిటి?

జవాబు:-

1. వారు స్తుతి-నింద..... అన్నింటిలోనూ ఓర్పుతో వ్యవహరిస్తారు, 2. క్రోధం చేయరు. 3. ఎవ్వరినీ దైహిక దృష్టితో చూడరు. ఆత్మనే చూస్తారు, ఆత్మగా అయి మాట్లాడుతారు, 4. స్త్రీ-పురుషులు కలిసి ఉంటూ కమలపుష్ప సమానంగా ఉంటారు, 5. ఏ రకమైన కోరికలు పెట్టుకోరు.

గీతము:-

దీపపు పురుగులు ఎందుకు ఆహుతి కాలేదు..... (జలే న క్యూ పర్వానా.....)

ఓంశాంతి. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థము చేయిస్తున్నారు అనగా భగవంతుడు ఆత్మిక విద్యార్థులను చదివిస్తున్నారు. ఆ స్కూళ్ళలో ఏ పిల్లలైతే చదువుకుంటారో, వారిని ఆత్మిక విద్యార్థులని అనరు. వారు ఆసురీ వికారీ సంప్రదాయానికి చెందినవారు. ఇంతకుముందు మీరు కూడా ఆసురీ అనగా రావణ సంప్రదాయానికి చెందినవారిగా ఉండేవారు. ఇప్పుడు రామ రాజ్యములోకి వెళ్ళేందుకు పంచ వికారాల రూపీ రావణునిపై విజయము పొందే పురుషార్థము చేస్తున్నారు. ఈ జ్ఞానాన్ని ప్రాప్తి చేసుకోని వారికి, మీరు రావణ రాజ్యములో ఉన్నారని అర్థం చేయించవలసి వస్తుంది. వారు స్వయం అర్థము చేసుకోరు. మేము అనంతమైన తండ్రి ద్వారా చదువుకుంటున్నామని మీరు మీ మిత్ర-సంబంధీకులు మొదలైన వారితో చెప్తారు, అలాగని వారు నిశ్చయం ఏర్పర్చుకుంటారని కాదు. ఎంతగా తండ్రి అని చెప్పినా లేక భగవంతుడు అని చెప్పినా కూడా వారు నిశ్చయము ఏర్పర్చుకోరు. కొత్తవారికైతే ఇక్కడికి వచ్చేందుకు అనుమతి లేదు. లెటరు లేకుండా లేక అడగకుండా ఎవ్వరూ రాలేరు. కానీ అక్కడక్కడ కొంతమంది వచ్చేస్తారు, ఇది కూడా నియమాన్ని ఉల్లంఘించడమే. ఒక్కొక్కరి పూర్తి సమాచారము, పేరు మొదలైనవి రాసి, వీరిని పంపవచ్చా అని అడగాలి. ఆ తర్వాత బాబా పంపించమని చెప్తారు. ఒకవేళ ఆసురీ పతిత ప్రపంచములోని విద్యార్థులుగా ఉన్నట్లయితే, ఆ చదువును వికారీ పతితులు చదివిస్తారు, దీన్ని ఈశ్వరుడు చదివిస్తారని తండ్రి అర్థం చేయిస్తారు. ఆ చదువు ద్వారా పైసకు విలువ చేసే హోదా లభిస్తుంది. ఎవరైనా చాలా పెద్ద పరీక్షను పాస్ అయినా కూడా, వారు ఎంతవరకు సంపాదిస్తూ ఉంటారు. వినాశనము అయితే ఎదురుగా నిలబడి ఉంది. ప్రకృతి వైపరీత్యాలు కూడా ఎన్నో రానున్నాయి. ఇది కూడా మీరు అర్థం చేసుకుంటారు, ఎవరైతే అర్థము చేసుకోరో వారిని బయట విజిటింగ్ రూమ్ లో కూర్చోబెట్టి అర్థము చేయించవలసి ఉంటుంది. ఇది ఈశ్వరీయ చదువు, ఇందులో నిశ్చయబుద్ధి కలవారే విజయము పొందుతారు అనగా విశ్వముపై రాజ్యం చేస్తారు. రావణ సంప్రదాయము వారికైతే ఇది తెలియదు. ఇందులో చాలా జాగ్రత్త కావాలి. అనుమతి లేకుండా ఎవ్వరూ లోపలికి రాలేరు. ఇదేమీ విహరించే స్థానము కాదు. ఇంకొద్ది సమయములో నియమాలు కఠినమైపోతాయి ఎందుకంటే ఇది హోలియస్ట్ ఆఫ్ ది హోలీ (పవిత్రాతి పవిత్రమైన) స్థానము. శివబాబాను ఇంద్రుడని కూడా అంటారు కదా. ఇది ఇంద్ర సభ. నవరత్నాల ఉంగరాన్ని కూడా ధరిస్తారు కదా. ఆ రత్నాలలో నీలమణి కూడా ఉంటుంది, మరకతం, మాణిక్యము కూడా ఉంటాయి. ఈ పేర్లన్నీ పెట్టారు. దేవకన్యలకు కూడా పేర్లు ఉన్నాయి కదా. దేవదూతల్లా మీరు ఎగిరిపోయే ఆత్మలు. మీ వర్ణనయే ఉంది. కానీ మనుష్యులు ఈ విషయాలను ఏ మాత్రమూ అర్థము చేసుకోరు.

ఉంగరములో కూడా రత్నాలను పొదిగేటప్పుడు, వాటిలో పుష్యరాగము, నీలమణి, పేరూజ్ కూడా ఉంటాయి. కొన్నిటి విలువ వెయ్యి రూపాయలుంటే కొన్నిటి విలువ 10-20 రూపాయలు ఉంటుంది. పిల్లలలో కూడా నంబరువారుగా ఉన్నారు. కొంతమంది చదువుకుని యజమానులుగా అవుతారు. కొంతమంది చదువుకుని దాస-దాసీలుగా అవుతారు. రాజధాని స్థాపన అవుతుంది కదా. కనుక తండ్రి కూర్చొని చదివిస్తారు. ఇంద్రుడు అని కూడా వారినే అంటారు. ఇది జ్ఞాన వర్షము. జ్ఞానము తండ్రి తప్ప మరెవ్వరూ ఇవ్వలేరు. ఇదే మీ లక్ష్యము ఉద్దేశ్యము. ఒకవేళ ఈశ్వరుడు చదివిస్తున్నారని నిశ్చయం ఏర్పడితే, ఇక ఆ చదువును విడిచిపెట్టరు. ఎవరైతే రాతి బుద్ధి కలవారిగా ఉంటారో, వారికి ఎప్పుడూ బాణము తగలదు. నడుస్తూ-నడుస్తూ మళ్ళీ పడిపోతారు. పంచ వికారాలు అర్థకల్పపు శత్రువులు. మాయ దేహాభిమానములోకి తీసుకొచ్చి చెంపదెబ్బ వేస్తుంది, తర్వాత ఆశ్చర్యం కలిగేలా వింటారు, వర్ణిస్తారు, పారిపోతారు. ఈ మాయ చాలా శక్తివంతమైనది, ఒక్క దెబ్బతో పడేస్తుంది. మేమెప్పుడూ పడిపోమని భావిస్తారు అయినా మాయ చెంపదెబ్బ వేస్తుంది. ఇక్కడ స్త్రీ-పురుషులివురినీ పవిత్రంగా తయారుచేయడం జరుగుతుంది. అది కూడా ఈశ్వరుడు తప్ప ఎవ్వరూ తయారుచేయలేరు. ఇది ఈశ్వరీయ మిషన్.

తండ్రిని నావికుడని కూడా అంటారు, మీరు నావలు. నావికుడు అందరి నావలను తీరం చేర్చేందుకు వస్తారు. సత్యమైన నావ కదులుతుంది కానీ మునగదని కూడా అంటారు. ఎన్ని లెక్కలేనన్ని మఠాలు, ఆశ్రమాలు ఉన్నాయి. జ్ఞానము మరియు భక్తికి యుద్ధము జరిగినట్లుగా ఉంటుంది. అప్పుడప్పుడు భక్తి విజయము కూడా జరుగుతుంది, చివరకు జ్ఞానం యొక్క విజయమే జరుగుతుంది. భక్తి వైపు ఎంత గొప్ప గొప్ప యోధులున్నారో చూడండి. జ్ఞానమార్గము వైపు కూడా ఎంతో గొప్ప గొప్ప యోధులున్నారు. అర్జునుడు, భీముడు మొదలైన పేర్లు పెట్టారు. ఇవన్నీ కథలుగా తయారుచేశారు. నిజానికి ఆ గాయనము అయితే మీదే. ఇప్పుడు మీ హీరో-హీరోయిన్ల పాత్ర నడుస్తుంది. ఈ సమయంలోనే యుద్ధము జరుగుతుంది. మీలో కూడా ఈ విషయాలను ఏ మాత్రం అర్థము చేసుకోని వారు చాలామంది ఉన్నారు. మంచి-మంచి వారికి మాత్రమే బాణము తగులుతుంది. థర్డ్ క్లాసువారు అయితే కూర్చోలేరు. రోజు రోజుకు చాలా కఠినమైన నియమాలు ఏర్పడుతూ ఉంటాయి. ఏ మాత్రం అర్థము చేసుకోని రాతిబుద్ధి కలవారు ఇక్కడ కూర్చోవడం కూడా నియమ విరుద్ధమే.

ఈ హాల్ హోలియస్ట్ ఆఫ్ హోలీ అయినది (పవిత్రాతి పవిత్రమైనది). పోపును హోలీ (పవిత్రుడు) అని అంటారు. ఈ తండ్రి అయితే హోలియస్ట్ ఆఫ్ హోలీ (పవిత్రాతి పవిత్రమైనవారు). నేను వీరందరి కళ్యాణము చేయాలి అని తండ్రి అంటారు. వీరంతా వినాశనమైపోయేవారే. ఇది కూడా అందరూ ఏమీ అర్థము చేసుకోరు. వింటారు కానీ ఒక చెవితో విని మరో చెవితో వదిలేస్తారు. ఏమీ ధారణ చేయరు, చేయించరు. ఇలాంటి మూగవారు-చెవిటివారు కూడా చాలామంది ఉన్నారు. చెడు వినవద్దు..... అని తండ్రి అంటారు, వాళ్ళు అయితే కోతి చిత్రాలను చూపిస్తారు కానీ ఇది మనుష్యుల గురించే చెప్పబడుతుంది. ఈ సమయంలో మనుష్యులు కోతి కన్నా నీచంగా ఉన్నారు. నారదుని కథను కూడా కూర్చుని తయారుచేశారు. నీవు నీ ముఖము చూసుకో..... లోలోపల పంచ వికారాలు లేవు కదా అని వారికి చెప్పారు. మీకు సాక్షాత్కారము జరిగినట్లుగా వారికి కూడా హనుమంతుని సాక్షాత్కారము జరుగుతుంది కదా. ఇది కల్ప-కల్పము జరుగుతుందని తండ్రి అంటారు. సత్యయుగంలో ఈ విషయాలేవీ ఉండవు. ఈ పాత ప్రపంచమే సమాప్తమైపోతుంది. ఎవరైతే పక్కా నిశ్చయబుద్ధి కలవారు ఉన్నారో, వారు కల్పక్రితము కూడా మేము ఈ రాజ్యము చేశామని భావిస్తారు. తండ్రి అంటారు - పిల్లలూ, ఇప్పుడు దైవీ గుణాలను ధారణ చేయండి. నియమ విరుద్ధమైన పనులేవీ చేయకండి. స్తుతి-నింద అన్నిటిలోనూ ఓర్పును ధారణ చేయాలి. క్రోధం ఉండకూడదు. మీరు ఎంత ఉన్నతమైన విద్యార్థులు, భగవంతుడైన తండ్రి చదివిస్తున్నారు. వారు డైరెక్టుగా చదివిస్తున్నారు, అయినా ఎంతమంది పిల్లలు మర్చిపోతారు ఎందుకంటే ఇది సాధారణ తనువు కదా. తండ్రి అంటారు - దేహధారిని చూసినట్లయితే మీరు అంత ఉన్నతంగా అవ్వలేరు. ఆత్మను చూడండి. ఆత్మ ఇక్కడ భృకుటి మధ్యలో ఉంటుంది. ఆత్మ విని తల ఊపుతుంది. ఎల్లప్పుడూ ఆత్మతోనే మాట్లాడండి. ఆత్మలైన మీరు శరీరం రూపీ సింహాసనముపై కూర్చొని ఉన్నారు. మీరు తమోప్రధానంగా ఉండేవారు, ఇప్పుడు సతోప్రధానంగా అవ్వండి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయడంతో దేహ భానము తొలగిపోతుంది. అర్థకల్పపు దేహాభిమానం ఉండిపోయింది. ఈ సమయంలో అందరూ దేహాభిమానులుగా ఉన్నారు.

దేహీ అభిమానులుగా అవ్వండి అని ఇప్పుడు తండ్రి అంటారు. ఆత్మయే అన్నీ ధారణ చేస్తుంది. తినడం-త్రాగడం, అన్నీ ఆత్మయే చేస్తుంది. తండ్రినైతే అభోక్త అని అంటారు. వారు నిరాకారుడు. ఈ శరీరధారి అన్నీ చేస్తారు. వారు తినరు-తాగరు, వారు అభోక్త. దీనిని వారు కూర్చుని కాపీ చేస్తారు. మనుష్యులను ఎంతగా మోసగిస్తారు. ఇప్పుడు మీ బుద్ధిలో మొత్తం జ్ఞానం ఉంది, ఎవరైతే కల్పక్రితము అర్థము చేసుకున్నారో, వారే అర్థము చేసుకుంటారు. నేనే కల్ప-కల్పము వచ్చి మిమ్మల్ని చదివిస్తాను మరియు సాక్షీగా అయి చూస్తాను అని తండ్రి అంటారు. ఇంతకుముందు నంబరువారు పురుషార్థానుసారంగా ఏదైతే చదివారో, అదే చదువుతారు. సమయం పడుతుంది. కలియుగానికి ఇప్పుడు ఇంకా 40 వేల సంవత్సరాలు మిగిలి ఉందని అంటారు. మరి ఘోర అంధకారములో ఉన్నట్లే కదా. దీనిని అజ్ఞానాంధకారమని అంటారు. భక్తి మార్గానికి మరియు జ్ఞాన మార్గానికి రాత్రికి-పగలుకు ఉన్నంత తేడా ఉంది. ఇవి కూడా అర్థము చేసుకోవలసిన విషయాలు. పిల్లలు చాలా సంతోషంలో మునిగి ఉండాలి. అన్నీ ఉన్నాయి, ఏ కోరిక లేదు. కల్పక్రితము వలె మన మనోకామనలన్నీ పూర్తవుతాయని మీకు తెలుసు కనుక కడుపు నిండుగా ఉంటుంది. ఎవరికైతే జ్ఞానము ఉండదో, వారి కడుపు నిండి ఉండదు. సంతోషము వంటి ఔషధం లేదని అంటారు. జన్మ-జన్మాంతరాల రాజ్యం లభిస్తుంది. దాస దాసీలుగా అయ్యేవారికి ఇంత సంతోషం ఉండదు. పూర్తి మహావీరులుగా అవ్వాలి. మాయ కదిలించలేని విధంగా ఉండాలి.

కళ్ళను చాలా సంభాళించుకోవాలి అని తండ్రి అంటారు. క్రిమినల్ (వికారీ) దృష్టి వెళ్ళకూడదు. స్త్రీని చూస్తూనే చంచలమైపోతారు. అరే, మీరైతే సోదరీ-సోదరులు, కుమారీ-కుమారులు కదా. మరి కర్మేంద్రియాలు ఎందుకు చంచలమౌతున్నాయి! పెద్ద-పెద్ద లక్షాధికారులను, కోటీశ్వరులను కూడా మాయ సమాప్తము చేసేస్తుంది. పేదవారిని కూడా మాయ పూర్తిగా హతమార్చేస్తుంది. అప్పుడు బాబా, మేము దెబ్బ తిన్నామని అంటారు. అరే, 10 సంవత్సరాల తర్వాత కూడా ఓడిపోయావా, ఇప్పుడు మళ్ళీ పాతాళంలో పడిపోయావు. లోలోపల వారి స్థితి ఎలా ఉంది అనేది మీకు అర్థమవుతుంది. కొంతమందైతే చాలా మంచి సేవ చేస్తారు. కన్యలు కూడా భీష్మపితామహుడు మొదలైనవారిపై బాణాలు వేశారు కదా. గీతలో ఎంతో కొంత ఉంది. ఇది ఉన్నదే భగవానువాచ. ఒకవేళ కృష్ణ భగవానుడు గీతను వినిపించినట్లయితే, మరి నేను ఎవరినో ఎలా ఉంటానో, అలా ఏ ఒక్కరో అరుదుగా తెలుసుకుంటారు అని ఈ విధంగా ఎందుకంటారు. కృష్ణుడు ఇక్కడ ఉండి ఉంటే ఏమి చేసేవారో తెలియదు. కృష్ణుని శరీరమైతే సత్యయుగంలోనే ఉంటుంది. కృష్ణుని అనేక జన్మల అంతిమ శరీరంలో నేను ప్రవేశిస్తానని వారికి తెలియదు. కృష్ణుడు ఇక్కడ ఉంటే, అతని ముందుకు వెంటనే అందరూ పరుగెత్తుకుంటూ వచ్చేస్తారు. పోపు మొదలైనవారు వచ్చినప్పుడు ఎంత గుంపులు గుంపులుగా పోగవుతారు. ఈ సమయంలో అందరూ పతితంగా, తమోప్రధానంగా ఉన్నారని మనుష్యులకు తెలియదు. ఓ పతితపావనా రండి అని కూడా అంటారు కానీ మేము పతితంగా ఉన్నామని భావించరు. తండ్రి పిల్లలకు ఎంత బాగా అర్థం చేయిస్తారు. బాబా బుద్ధి అయితే అన్ని సెంటర్లలోని అనన్యమైన పిల్లల వైపుకు వెళ్ళిపోతుంది. అనన్యమైన పిల్లలు ఇక్కడకు వచ్చినప్పుడు ఇక్కడ చూస్తాను, లేకపోతే బయట ఉన్న పిల్లలను గుర్తు చేసుకోవలసి వస్తుంది. వారి ముందు జ్ఞాన డాన్స్ చేస్తాను. మెజారిటీ జ్ఞానీ ఆత్మలున్నట్లయితే ఎంతో ఆనందం కూడా కలుగుతుంది. లేదంటే పిల్లలపై ఎన్ని అత్యాచారాలు జరుగుతూ ఉంటాయి. కల్ప-కల్పము సహనం చేయవలసి ఉంటుంది. జ్ఞానములోకి రావడంతో మళ్ళీ భక్తి కూడా తొలగిపోతుంది. ఇంట్లో మందిరమున్నది అనుకోండి, స్త్రీ-పురుషులిరువురూ భక్తి చేస్తారు, స్త్రీకి జ్ఞానం పట్ల అభిరుచి కలిగి భక్తిని వదిలేస్తే ఎంత హంగామా జరుగుతుంది. వికారాలలోకి కూడా వెళ్ళకుండా, శాస్త్రాలు మొదలైనవి కూడా చదవకుండా ఉంటే గొడవలు జరుగుతాయి కదా. ఇందులో చాలా విఘ్నాలు కలుగుతాయి, ఇతర సత్సంగాలకు వెళ్ళేందుకు అడ్డగించరు. ఇక్కడ ఉండేది పవిత్రత యొక్క విషయము. పురుషులు ఉండలేకపోతే అడవుల్లోకి వెళ్ళిపోతారు, స్త్రీలు ఎక్కడికి వెళ్ళాలి. స్త్రీ నరకానికి ద్వారమని వారు భావిస్తారు. కానీ వీరు స్వర్గానికి ద్వారాలు అని తండ్రి అంటారు. పిల్లలైన మీరిప్పుడు స్వర్గ స్థాపన చేస్తారు. ఇంతకుముందు నరకానికి ద్వారంగా ఉండేవారు. ఇప్పుడు స్వర్గ స్థాపన జరుగుతుంది. సత్యయుగము స్వర్గానికి ద్వారము, కలియుగము నరకానికి ద్వారము. ఇది అర్థము చేసుకునే విషయము. పిల్లలైన మీరు కూడా నంబరువారు పురుషార్థానుసారంగా అర్థము చేసుకుంటారు. పవిత్రంగా అయితే ఉంటారు కానీ జ్ఞాన ధారణ నంబరువారుగా జరుగుతుంది. మీరు అక్కడ నుండి బయటపడి ఇక్కడకు వచ్చి కూర్చున్నారు కానీ ఇప్పుడు గృహస్థ వ్యవహారంలో ఉండాలని అర్థం చేయించడం జరుగుతుంది. వారికి కష్టంగా ఉంటుంది. ఇక్కడ ఉండేవారికైతే ఏ కష్టమూ లేదు. కమల పుష్ప సమానంగా గృహస్థ వ్యవహారములో ఉంటూ పవిత్రంగా ఉండండి అని తండ్రి అర్థం చేయిస్తారు. ఇది కూడా ఈ అంతిమ జన్మ విషయము. గృహస్థ వ్యవహారములో ఉంటూ స్వయాన్ని ఆత్మగా భావించండి. ఆత్మయే వింటుంది, ఆత్మయే ఇలా అయ్యింది. ఆత్మయే జన్మ జన్మాంతరాలుగా రకరకాల డ్రెస్సులు ధరిస్తూ వచ్చింది. ఇప్పుడు ఆత్మలమైన మనము తిరిగి వెళ్ళాలి. తండ్రితో యోగము జోడించాలి. ముఖ్యమైన విషయము ఇదే. నేను ఆత్మలతో మాట్లాడుతానని తండ్రి అంటారు. ఆత్మ భృకుటి మధ్యలో ఉంటుంది. ఈ ఇంద్రియాల ద్వారా వింటుంది. ఆత్మ ఇందులో లేకపోతే శరీరము శవమైపోతుంది. తండ్రి వచ్చి ఎంత అద్భుతమైన జ్ఞానమునిస్తారు. పరమాత్మ తప్ప ఈ విషయాలను ఎవ్వరూ అర్థము చేయించలేరు. సన్యాసులు మొదలైన వారెవ్వరూ ఆత్మను చూడరు. వారు ఆత్మనే పరమాత్మగా భావిస్తారు. అలాగే ఆత్మకు ఏమీ అంటదు అని మరోవైపు అంటారు. శరీరాన్ని శుభ్రము చేసుకునేందుకు గంగ వద్దకు వెళ్తారు. ఆత్మయే పతితంగా అవుతుందని అర్థం చేసుకోరు. ఆత్మయే అన్నీ చేస్తుంది. తండ్రి అర్థము చేయిస్తూ ఉంటారు, నేను ఫలానాను, వీరు ఫలానా..... అని భావించకండి. అందరూ ఆత్మలే. జాతి మొదలైనవాటి భేదాలేవీ ఉండకూడదు. స్వయాన్ని ఆత్మగా భావించండి. గవర్నమెంట్ ఏ ధర్మాన్ని నమ్మదు. ఈ ధర్మాలన్నీ దేహానికి సంబంధించినవి. కానీ ఆత్మలందరికీ తండ్రి అయితే ఒక్కరే. ఆత్మనే చూడవలసి ఉంటుంది. ఆత్మలందరి స్వధర్మము శాంతి. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. పనికి రాని విషయాలను ఒక చెవితో విని మరొక దానితో వదిలేయాలి, చెడు వినకండి..... తండ్రి ఇచ్చే శిక్షణలను ధారణ చేయాలి.

2. హద్దు కోరికలేవీ పెట్టుకోకూడదు. కళ్ళను చాలా సంభాళించుకోవాలి. వికారీ దృష్టి ఉండకూడదు. ఏ కర్మేంద్రియము చంచలంగా అవ్వకూడదు. సంతోషంతో నిండుగా ఉండాలి.

వరదానము:-

అటెన్షన్ రూపీ నెయ్యి ద్వారా ఆత్మిక స్వరూపపు సితారలోని మెరుపును పెంచే ఆకర్షణామూర్త భవ

తండ్రి ద్వారా, జ్ఞానము ద్వారా ఆత్మిక స్వరూపపు సితార మెరిసినట్లయితే అది ఇక ఆరిపోదు, కానీ మెరుపు యొక్క శాతము తక్కువ-ఎక్కువ కావచ్చు. ఎప్పుడైతే ప్రతిరోజు అమృతవేళలో అటెన్షన్ రూపీ నేతిని వేస్తూ ఉంటారో, అప్పుడు ఈ సితార సదా మెరుస్తూ అందరినీ ఆకర్షిస్తుంది. ఏ విధంగా దీపంలో నేతిని వేసినట్లయితే అది ఏకరసంగా వెలుగుతుందో, అదే విధంగా సంపూర్ణ అటెన్షన్ ఇవ్వడమంటే తండ్రి యొక్క సర్వ గుణాలను మరియు శక్తులను స్వయంలో ధారణ చెయ్యడము. ఈ అటెన్షన్ ద్వారానే ఆకర్షణామూర్తులుగా అవుతారు.

స్లోగన్:-

అనంతమైన వైరాగ్య వృత్తి ద్వారా సాధన యొక్క బీజాన్ని ప్రత్యక్షం చేయండి.