ఓంశాంతి. స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకుని కూర్చొండి, తండ్రిని స్మృతి చేసినట్లయితే మీ దుఃఖాలన్నీ దూరమైపోతాయి అన్న మొట్టమొదటి ముఖ్యమైన విషయాన్ని ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. వారు ఆశీర్వదిస్తారు కదా. పిల్లలూ, మీ దుఃఖాలన్నీ దూరమైపోతాయి, మీరు కేవలం స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి అని ఈ తండ్రి కూడా అంటారు. ఇది అతి సహజమైన విషయం. ఇది భారతదేశపు ప్రాచీన సహజ రాజయోగము. ప్రాచీనము అన్నదానికి కూడా సమయమైతే ఉండాలి కదా. లాంగ్ లాంగ్ (చాలాకాలము క్రితం) అని అన్నా అది కూడా ఎంతవరకు? పూర్తిగా 5 వేల సంవత్సరాల క్రితము ఈ రాజయోగాన్ని నేర్పించాను అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. దీనిని తండ్రి తప్ప మరెవ్వరూ అర్థము చేయించలేరు మరియు పిల్లలు తప్ప ఇంకెవ్వరూ అర్థము చేసుకోలేరు. ఆత్మలైన పిల్లలు మరియు పరమాత్మ తండ్రి చాలా కాలము నుండి వేరుగా ఉన్నారు..... అని గాయనము కూడా ఉంది. మీరు మెట్లు దిగుతూ-దిగుతూ పతితులుగా అయిపోయారు, ఇప్పుడు స్మృతి కలిగింది అని తండ్రియే అంటారు. ఓ పతితపావనా..... అని అందరూ ఆర్తనాదాలు చేస్తారు, కలియుగములో పతితులే ఉంటారు. సత్యయుగంలో పావనమైనవారు ఉంటారు. అది పావన ప్రపంచము. ఈ పాత పతిత ప్రపంచము నివసించేందుకు యోగ్యంగా లేదు. కానీ మాయ ప్రభావము కూడా తక్కువేమీ లేదు. ఇక్కడ చూసినట్లయితే 100-125 అంతస్థుల పెద్ద-పెద్ద భవనాలను తయారుచేస్తూ ఉంటారు. దీనిని మాయ ఆర్భాటము అని అంటారు. మాయ సత్తా ఎటువంటిదంటే, పదండి, స్వర్గానికి వెళ్దాము అని అంటే, మా కోసం ఇక్కడే స్వర్గముంది అని అంటారు. దీనిని మాయ సత్తా అని అనడం జరుగుతుంది. కానీ ఇది పురాతన గ్రామము, దీనిని నరకము అని అంటారు, పాత ప్రపంచమంటే రౌరవ నరకమని పిల్లలైన మీకైతే తెలుసు. సత్యయుగాన్ని స్వర్గమని అంటారు. ఈ పదాలైతే ఉన్నాయి కదా. దీనిని వికారీ ప్రపంచమని అందరూ అంటారు. స్వర్గము నిర్వికారీ ప్రపంచముగా ఉండేది. స్వర్గాన్ని నిర్వికారీ ప్రపంచమని అంటారు, నరకాన్ని వికారీ ప్రపంచమని అంటారు. ఇంత సహజమైన విషయాలు కూడా ఎవరి బుద్ధిలోకి ఎందుకు రావు! మనుష్యులెంత దుఃఖితులుగా ఉన్నారు. ఎన్ని యుద్ధాలు-గొడవలు మొదలైనవి జరుగుతూ ఉంటాయి. రోజురోజుకూ బాంబులు మొదలైనవి ఎలా తయారుచేస్తూ ఉంటారంటే, అవి వేయగానే మనుష్యులంతా సమాప్తమైపోతారు. కానీ తుచ్ఛబుద్ధి కల మనుష్యులు ఇప్పుడు ఏం జరగనున్నది అన్నది అర్థం చేసుకోవడం లేదు. ఈ విషయాలను తండ్రి తప్ప ఏం జరగనున్నది అని మరెవ్వరూ అర్థం చేయించలేరు? పాత ప్రపంచ వినాశనము జరగనున్నది మరియు కొత్త ప్రపంచ స్థాపన కూడా గుప్తంగా జరుగుతుంది.
పిల్లలైన మిమ్మల్ని గుప్త వారియర్స్ (యోధులు) అని అంటారు. మీరు యుద్ధము చేస్తున్నారని ఎవరైనా భావిస్తారా? 5 వికారాలతోనే మీ యుద్ధము. పవిత్రంగా అవ్వండి అని మీరు అందరికీ చెప్తారు. మీరు ఒక్క తండ్రి పిల్లలు కదా. ప్రజాపిత బ్రహ్మా పిల్లలందరూ సోదరీ-సోదరులవుతారు కదా! అర్థము చేయించేందుకు మంచి యుక్తులు కావాలి. ప్రజాపిత బ్రహ్మాకు ఎంతోమంది పిల్లలున్నారు, ఒక్కరే కాదు. వారి పేరే ప్రజాపిత. లౌకిక తండ్రిని ఎప్పుడూ ప్రజాపిత అని అనరు. ప్రజాపిత బ్రహ్మా ఉన్నారంటే వారి పిల్లలంతా పరస్పరములో సోదరీ-సోదరులు, బ్రహ్మాకుమార-బ్రహ్మాకుమారీలు అయినట్లే కదా. కానీ అర్థము చేసుకోరు. రాతిబుద్ధి కలవారిగా ఉంటారు, అర్థము చేసుకునే ప్రయత్నము కూడా చేయరు. ప్రజాపిత బ్రహ్మా పిల్లలు పరస్పరములో సోదరీ-సోదరులవుతారు. వికారాలలోకి వెళ్ళజాలరు. మీ బోర్డుపై కూడా ప్రజాపిత అన్న పదము తప్పకుండా ఉండాలి. ఈ పదాన్ని తప్పకుండా రాయాలి. కేవలం బ్రహ్మా అని రాసినట్లయితే అంతగా ప్రభావముండదు. కావున బోర్డుపై కూడా సరైన పదాలను రాసి సరిచేయవలసి ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైన పదము. బ్రహ్మా అనే పేరైతే స్త్రీలకు కూడా ఉంటుంది. పేర్లు తరిగిపోతూ ఉంటే పురుషుల పేర్లను స్త్రీలకు పెట్టేస్తున్నారు. ఇన్ని పేర్లు ఎక్కడ నుండి తీసుకురావాలి? అంతా డ్రామా ప్లాను అనుసారంగానే జరుగుతుంది. తండ్రికి నమ్మకస్థులుగా, ఆజ్ఞాకారులుగా అవ్వడం పిన్నమ్మ ఇంటికి వెళ్ళినంత సులువేమీ కాదు. బాబా మరియు దాదా, ఇరువురు కలిసే ఉన్నారు కదా. వీరు ఎవరు అనేది అర్థము చేసుకోలేరు. అప్పుడు, నా ఆజ్ఞను కూడా మీరు అర్థం చేసుకోలేరు అని శివబాబా అంటారు. తప్పు చెప్పినా లేక ఒప్పు చెప్పినా, అది శివబాబా చెప్పారని మీరు భావించినట్లయితే వారే రెస్పాన్సిబుల్ (బాధ్యులు) అవుతారు. ఇతను చెప్పడం వలన ఏదైనా నష్టం జరిగినా సరే, బాధ్యులు వారే కావున, వారు అంతా సరి చేస్తారు. శివబాబాయే చెప్తున్నారని భావిస్తూ ఉన్నట్లయితే, మీ ఉన్నతి ఎంతగానో జరుగుతుంది. కానీ అలా భావించరు. కొందరు తమ మతముపైనే నడుస్తూ ఉంటారు. పిల్లలైన మీకు డైరెక్షన్ ఇచ్చేందుకు, అర్థం చేయించేందుకు తండ్రి ఎంత దూరము నుండి వస్తారు. మరెవ్వరి వద్ద ఈ స్పిరిచువల్ (ఆధ్యాత్మిక) జ్ఞానము లేదు. మనుష్యులు అర్థము చేసుకునే విధంగా ఏమి రాయాలి అని రోజంతా ఈ చింతన జరుగుతూ ఉండాలి. మనుష్యుల దృష్టి పడే విధంగా స్పష్టమైన పదాలను వ్రాయాలి. ఎటువంటి ప్రశ్నలు అడగవలసిన అవసరమే రాని విధంగా మీరు అర్థం చేయించండి. స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చేసినట్లయితే మీ దుఃఖాలన్నీ దూరమవుతాయని తండ్రి చెప్తున్నారని చెప్పండి. ఎవరైతే బాగా స్మృతిలో ఉంటారో, వారే ఉన్నతమైన పదవిని పొందుతారు. ఇది సెకండు యొక్క విషయము. మనుష్యులు ఏమేమో అడుగుతూ ఉంటారు, మీరు ఏమీ చెప్పకండి. ఎక్కువగా ప్రశ్నించకండి, ముందు ఒక విషయంపై నిశ్చయం ఏర్పరచుకోండి, ఎక్కువగా ప్రశ్నల అడవిలో చిక్కుకున్నట్లయితే మళ్ళీ బయటపడే దారి లభించదు అని వారికి చెప్పండి. ఏ విధంగా పొగ మంచులో మనుష్యులు తికమకపడితే మళ్ళీ బయటికి రాలేరో, ఇది కూడా అలాంటిదే, మనుష్యులు ఎక్కడ నుండి ఎక్కడికో మాయ వైపుకు వెళ్ళిపోతారు. అందుకే మొదట మీరు అందరికీ ఒకే మాట చెప్పండి - మీరు అవినాశీ ఆత్మ. తండ్రి కూడా అవినాశీ, పతితపావనుడు. మీరు పతితులు. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి లేక కొత్త ప్రపంచములోకి వెళ్ళాలి. పాత ప్రపంచములో చివరి వరకు వస్తూనే ఉంటారు. ఎవరైతే పూర్తిగా చదువుకోరో, వారు తప్పకుండా చివర్లో వస్తారు. లెక్క ఎంతగా ఉంది మరియు చదువు ద్వారా మొదట ఎవరు వెళ్తారు అన్నది కూడా అర్థం చేసుకోవడం జరుగుతుంది. స్కూల్లో కూడా లక్ష్యాన్ని చూపిస్తారు కదా. పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ ముట్టుకుని రండి అని చెప్తారు. మొదట నంబరు లభించినవారికి బహుమతి లభిస్తుంది. ఇది అనంతమైన విషయము. అనంతమైన బహుమతి లభిస్తుంది. స్మృతియాత్రలో ఉండండి అని తండ్రి చెప్తారు. దైవీగుణాలను ధారణ చేయాలి. సర్వగుణ సంపన్నులుగా ఇక్కడే తయారవ్వాలి కావున చార్టు పెట్టమని తండ్రి చెప్తారు. స్మృతియాత్ర చార్టు కూడా పెట్టినట్లయితే మనము లాభంలో ఉన్నామా లేక నష్టములో ఉన్నామా అని తెలుస్తుంది. కానీ పిల్లలు చార్టు పెట్టరు. బాబా చెప్తారు కానీ పిల్లలు చేయరు. చాలా కొద్దిమంది చేస్తారు కావున మాల కూడా చాలా కొద్దిమందిదే తయారవుతుంది. 8 మంది చాలా పెద్ద స్కాలర్షిప్ తీసుకుంటారు, తర్వాత 108 మంది ప్లస్ లో ఉంటారు. ప్లస్ లోకి ఎవరు వెళ్తారు? రాజులు మరియు రాణులు. ఇరువురికీ చాలా కొద్ది తేడాయే ఉంటుంది.
మొదట స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి - ఇదే స్మృతియాత్ర అని తండ్రి చెప్తున్నారు. కేవలం తండ్రి సందేశాన్ని ఇవ్వాలి. ఎక్కువగా విస్తారములోకి వెళ్ళవలసిన అవసరం లేదు, మన్మనాభవ. దేహపు సర్వ సంబంధాలను వదిలి, పాత ప్రపంచములోని వారందరినీ బుద్ధితో త్యాగము చేయాలి, ఎందుకంటే ఇప్పుడు తిరిగి వెళ్ళాలి, అశరీరులుగా అవ్వాలి. ఇక్కడ బాబా స్మృతిని కలిగిస్తారు, మళ్ళీ రోజంతటిలో కొంచెం కూడా స్మృతి చేయరు, శ్రీమతముపై నడవరు. బుద్ధిలో కూర్చోదు. కొత్త ప్రపంచములోకి వెళ్ళాలంటే తమోప్రధానం నుండి సతోప్రధానంగా అవ్వాలని తండ్రి చెప్తారు. బాబా మనకు రాజ్య భాగ్యాన్నిచ్చారు, మళ్ళీ 84 జన్మలు తీసుకుని ఈ విధంగా పోగొట్టుకున్నాము. లక్షల సంవత్సరాల విషయం కాదు, చాలా మంది పిల్లలు అల్ఫ్ ను (భగవంతుడు) తెలుసుకోని కారణంగా చాలా ప్రశ్నలడుగుతూ ఉంటారు. మొదట నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే పాపము తొలగిపోతుంది, మరియు దైవీ గుణాలను ధారణ చేసినట్లయితే దేవతలుగా తయారవుతారు, ఇంకేమీ అడగవలసిన అవసరము లేదు అని తండ్రి అంటారు. అల్ఫ్ ను (భగవంతుడు) అర్థము చేసుకోకుండా బే (వారసత్వము) గురించి చెప్తూ ఉంటే స్వయం కూడా తికమకపడతారు, తర్వాత విసిగిపోతారు. మొదట అల్ఫ్ గురించి తెలుసుకోవడం ద్వారా అన్నీ అర్థము చేసుకోగలరు అని తండ్రి అంటారు. నా ద్వారా నన్ను తెలుసుకోవడంతో మీరు అన్నీ తెలుసుకుంటారు. ఇక తెలుసుకోవలసినవేవీ ఉండవు. కావున 7 రోజులు పెట్టడం జరుగుతుంది. 7 రోజుల్లో చాలా అర్థము చేసుకోవచ్చు. కానీ అర్థము చేసుకునేవారు నంబరువారుగా ఉంటారు. కొందరైతే ఏమీ అర్థము చేసుకోరు. వారేమి రాజా-రాణులుగా అవుతారు? ఒక్కరిపై రాజ్యము చేస్తారా ఏమిటి? ప్రతి ఒక్కరు తమ ప్రజలను తయారుచేసుకోవాలి. ఎంతో సమయాన్ని చాలా వ్యర్థము చేసుకుంటారు. తండ్రి అయ్యో పాపం అని అంటారు. వారు ఎంత గొప్ప పదవి కలవారైనా, ఇవన్నీ మట్టిలో కలిసిపోయేవే అని తండ్రికి తెలుసు. ఇంకా కొద్ది సమయము మాత్రమే ఉంది. వినాశకాలే విపరీత బుద్ధికలవారి వినాశనం జరగనున్నది. ఆత్మలైన మనకు ఎంత ప్రీతి బుద్ధి ఉంది అనేది అర్థము చేసుకోగలరు. ఒకటి-రెండు గంటలు స్మృతి ఉంటుందని కొందరు అంటారు! లౌకిక తండ్రితో మీరు కేవలం ఒకటి-రెండు గంటలు మాత్రమే ప్రీతి కలిగి ఉంటారా? పూర్తి రోజంతా బాబా-బాబా అని అంటూ ఉంటారు. ఇక్కడ బాబా-బాబా అని అంటారు కానీ అంతటి లోతైన ప్రీతి లేదు. శివబాబాను స్మృతి చేస్తూ ఉండండి అని పదే-పదే చెప్తారు. సత్యముగా స్మృతి చేయాలి. చతురత నడవదు. మేము శివబాబాను ఎంతో స్మృతి చేస్తామని చాలా మంది అంటారు, అలా అయితే వారు ఎగురుతూ ఉంటారు. బాబా, మేమిప్పుడు అనేకుల కళ్యాణము చేసే సర్వీసు చేసేందుకు వెళ్తామని అంటారు. ఎంత ఎక్కువ మందికి సందేశము ఇస్తే, అంత స్మృతిలో ఉంటారు. చాలామంది పిల్లలు బంధనముందని అంటారు. అరే, బంధనమైతే ప్రపంచమంతటికీ ఉంది, బంధనాన్ని యుక్తిగా తెంచుకోవాలి. యుక్తులు చాలా ఉన్నాయి, రేపు మరణించినట్లయితే పిల్లలను ఎవరు సంభాళిస్తారు? సంభాళించేందుకు తప్పకుండా ఎవరో ఒకరు వెలువడుతారు. అజ్ఞాన కాలంలో అయితే రెండవ వివాహము చేసుకుంటారు. ఈ సమయంలో వివాహము కూడా సమస్యనే. ఎవరికైనా కొద్దిగా డబ్బును ఇచ్చి పిల్లలను సంభాళించమని చెప్పండి. ఇది మీ మరజీవా జన్మ కదా. జీవిస్తూ మరణించినట్లయితే మీ వెనుక ఎవరు సంభాళిస్తారు? కావున తప్పకుండా నర్సును పెట్టుకోవలసి ఉంటుంది. డబ్బుంటే ఏం జరగదు. తప్పకుండా బంధనముక్తులుగా అవ్వాలి. సేవ చేయాలనే అభిరుచి ఉన్నవారు తమకుతామే పరుగెత్తుతారు. ప్రపంచముతో మరణించారు కదా. ఇక్కడైతే, మిత్ర-సంబంధీకులు మొదలైన వారిని కూడా ఉద్ధరించండి అని తండ్రి అంటారు. మన్మనాభవ అన్న సందేశాన్ని అందరికీ ఇవ్వాలి, దీని ద్వారా తమోప్రధానము నుండి సతోప్రధానంగా అవుతారు. ఇది తండ్రియే చెప్తారు, ఇతరులైతే పై నుండి వస్తారు. వారి ప్రజలు కూడా వారి వెనుక వస్తారు. ఉదాహరణకు క్రీస్తు అందరినీ క్రిందకు తీసుకొస్తారు! క్రింద పాత్రను అభినయిస్తూ ఎప్పుడైతే అశాంతిగా అయిపోతారో, అప్పుడు మాకు శాంతి కావాలి అని అంటారు. వారు శాంతిలో కూర్చునేవారు, కానీ ధర్మ స్థాపకుని వెనుక రావలసి ఉంటుంది. మళ్ళీ, ఓ పతిత పావనా, రండి అని అంటారు. ఈ ఆట ఏ విధంగా రచింపబడి ఉంది. వారు అంతిమంలో వచ్చి లక్ష్యాన్ని తీసుకుంటారు. పిల్లలు సాక్షాత్కారాన్ని పొందారు. వారు వచ్చి మన్మనాభవ అన్న లక్ష్యాన్ని తీసుకుంటారు. మీరిప్పుడు బెగ్గర్ టూ ప్రిన్స్ (బికారుల నుండి రాకుమారులు) గా అవుతారు. ఈ సమయంలో ఎవరైతే షావుకార్లుగా ఉన్నారో, వారు బికారులుగా అవుతారు. ఇది అద్భుతము. ఈ ఆట గురించి ఎవ్వరికీ కొద్దిగా కూడా తెలియదు. పూర్తి రాజధాని స్థాపనవుతూ ఉంది. కొందరు పేదవారిగా కూడా అవుతారు కదా! ఇవి చాలా దూరదృష్టి కల బుద్ధితో అర్థము చేసుకోవలసిన విషయాలు. మనమెలా ట్రాన్స్ఫర్ అవుతాము అనేది చివర్లో అన్నీ సాక్షాత్కారమవుతాయి. మీరు కొత్త ప్రపంచము కోసం చదువుకుంటారు. ఇప్పుడు సంగమయుగంలో ఉన్నారు. చదువుకుని పాస్ అయితే దైవీ కులములోకి వెళ్తారు. ఇప్పుడు బ్రాహ్మణ కులములో ఉన్నారు. ఈ విషయాలను ఎవ్వరూ అర్థము చేసుకోలేరు. భగవంతుడు చదివిస్తున్నారన్నది కొద్దిగా కూడా ఎవరి బుద్ధిలోనూ కూర్చోదు. నిరాకారుడైన భగవంతుడు తప్పకుండా వస్తారు కదా! ఈ డ్రామా చాలా అద్భుతంగా తయారై ఉంది, దీని గురించి మీరు తెలుసుకున్నారు మరియు పాత్రను అభినయిస్తున్నారు. త్రిమూర్తి చిత్రంపై కూడా బ్రహ్మా ద్వారా స్థాపన అని అర్థము చేయించవలసి ఉంటుంది. వినాశనమైతే ఆటోమెటిక్ గా జరగనున్నది. కేవలం పేరును పెట్టేసారు. ఇది కూడా డ్రామాలో తయారై ఉంది. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసినట్లయితే తుప్పు తొలగిపోతుంది అన్నది ముఖ్యమైన విషయము. స్కూల్లో ఎంత బాగా చదివితే, అంత ఎక్కువ ఆదాయముంటుంది. మీకు 21 జన్మల కోసం ఆరోగ్యము, ఐశ్వర్యము లభిస్తాయి, ఇదేమైనా తక్కువ విషయమా. ఇక్కడ సంపద ఉన్నా కానీ పిల్లలు-మనవళ్ళు మొదలైనవారు తినేంతటి సమయము లేదు. తండ్రి తన సర్వస్వాన్ని ఈ సేవలో సవర్పితం చేశారు కావున వారికి ఎంతగా జమా అయ్యింది. అందరిదీ అలా జమా అవ్వదు. ఎంతోమంది లక్షాధికారులున్నారు, ఆ డబ్బు ఎందుకూ పనికి రాదు. అది తీసుకుంటే తిరిగి ఇవ్వవలసి వస్తుంది కావున తండ్రి వారిది తీసుకోనే తీసుకోరు. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. బంధనాలను తెంచుకునేందుకు యుక్తులు రచించాలి. తండ్రిపై లోతైన ప్రీతినుంచాలి. తండ్రి సందేశాన్ని అందరికీ ఇచ్చి, అందరి కళ్యాణము చేయాలి.
2. దూరదృష్టి కల బుద్ధితో ఈ అనంతమైన ఆటను అర్థము చేసుకోవాలి. బెగ్గర్ టూ ప్రిన్స్ (బికారి నుండి రాకుమారునిగా) అయ్యే చదువు పట్ల చాలా గమనముంచాలి. సత్యాతి-సత్యమైన స్మృతి చార్టును పెట్టాలి.