28-12-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైనపిల్లలూ - చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ (దానం ఇంటి నుండి ప్రారంభమవుతుంది) అనగా మొదట స్వయం ఆత్మాభిమానులుగా అయ్యే శ్రమ చేయండి, తర్వాత ఇతరులకు చెప్పండి, ఆత్మగా భావిస్తూ ఆత్మకు జ్ఞానం ఇచ్చినట్లయితే జ్ఞాన ఖడ్గానికి పదును వచ్చేస్తుంది”

ప్రశ్న:-

సంగమయుగంలో ఏ రెండు విషయాలపై శ్రమ చేసినట్లయితే సత్యయుగ సింహాసనానికి యజమానులుగా అవుతారు?

జవాబు:-

1. సుఖ-దుఃఖాలు, నింద-స్తుతులలో సమాన స్థితిలో ఉండేందుకు శ్రమ చేయండి. ఎవరైనా తప్పుగా మాట్లాడినా, క్రోధం చేసినా, మీరు మౌనంగా ఉండండి, ఎప్పుడూ నోటితో చప్పట్లు మ్రోగించకండి 2. కళ్ళను శుద్ధంగా చేసుకోండి, అశుద్ధమైన దృష్టి పూర్తిగా సమాప్తమైపోవాలి, ఆత్మలైన మనం సోదరులము, ఆత్మగా భావించి జ్ఞానమివ్వండి, ఆత్మాభిమానులుగా అయ్యేందుకు శ్రమ చేసినట్లయితే సత్యయుగ సింహాసనానికి యజమానులుగా అవుతారు. సంపూర్ణ పవిత్రంగా అయ్యేవారే సింహాసనాధికారులుగా అవుతారు.

ఓంశాంతి. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలతో మాట్లాడుతారు, ఆత్మలైన మీకు ఈ మూడవ నేత్రము లభించింది, దీనినే జ్ఞాన నేత్రమని కూడా అంటారు, దీని ద్వారా మీరు మీ సోదరులను చూస్తారు. మేము సోదరులను చూసినప్పుడు కర్మేంద్రియాలు చంచలమవ్వవు అని బుద్ధి ద్వారా అర్థం చేసుకుంటారు కదా. ఈ విధంగా చేస్తూ-చేస్తూ అశుద్ధంగా ఉన్న కళ్ళు శుద్ధంగా అయిపోతాయి. విశ్వానికి యజమానులుగా అవ్వాలంటే శ్రమ చేయాల్సి ఉంటుంది కదా అని తండ్రి అంటారు. కావున, ఇప్పుడు ఈ శ్రమ చేయండి. శ్రమ చేసేందుకు బాబా కొత్త-కొత్త గుహ్యమైన పాయింట్లను వినిపిస్తారు కదా. కావున ఇప్పుడు పరస్పరంలో సోదరులుగా భావిస్తూ జ్ఞానమునిచ్చే అలవాటును చేసుకోవాలి. అప్పుడు, వి ఆర్ ఆల్ బ్రదర్స్ (మనమంతా సోదరులము) అనే గాయనము ప్రాక్టికల్ అవుతుంది. ఇప్పుడు మీరు సత్యాతి-సత్యమైన సోదరులు, ఎందుకంటే మీకు తండ్రి గురించి తెలుసు. తండ్రి పిల్లలైన మీతో కలిసి సేవ చేస్తున్నారు. హిమ్మతే బచ్చే మదదే బాప్ (పిల్లలు ధైర్యము చేస్తే, తండ్రి సహాయము చేస్తారు). కావున తండ్రి వచ్చి సేవ చేసేందుకు ధైర్యమునిస్తారు. మరి ఇది సహజమే కదా. కావున రోజూ ఈ అభ్యాసము చేయవలసి ఉంటుంది, సోమరులుగా అవ్వకూడదు. ఇటువంటి కొత్త-కొత్త పాయింట్లు పిల్లలకు లభిస్తాయి, సోదరులమైన మాకు బాబా చదివిస్తున్నారని పిల్లలకు తెలుసు. ఆత్మలు చదువుకుంటాయి, ఇది ఆత్మిక జ్ఞానము, దీనిని ఆధ్యాత్మిక జ్ఞానమని అంటారు. కేవలం ఈ సమయంలోనే ఆత్మిక తండ్రి ద్వారా ఆత్మిక జ్ఞానము లభిస్తుంది, ఎందుకంటే సృష్టి పరివర్తన అయినప్పుడు సంగమయుగంలోనే తండ్రి వస్తారు, సృష్టి పరివర్తన అయినప్పుడే ఈ ఆత్మిక జ్ఞానము కూడా లభిస్తుంది. తండ్రి వచ్చి, స్వయాన్ని ఆత్మగా భావించండి అన్న ఈ ఆత్మిక జ్ఞానమునే ఇస్తారు. ఆత్మ నగ్నంగా (అశరీరిగా) ఇక్కడకు వచ్చింది, ఇక్కడకు వచ్చి శరీరాన్ని ధరిస్తుంది. ప్రారంభము నుండి మొదలుకుని ఇప్పటి వరకు ఆత్మ 84 జన్మలు తీసుకుంది. కాని నంబరువారుగా ఎవరెలా వచ్చి ఉంటారో, వారు అదే విధంగా జ్ఞాన-యోగాలలో శ్రమ చేస్తారు. కల్పక్రితము ఎవరు ఏ విధంగా పురుషార్థము చేశారో, శ్రమ చేశారో, వారు ఇప్పుడు కూడా అలాగే శ్రమ చేస్తూ ఉంటారని గమనించడం జరుగుతుంది. స్వయం కోసం శ్రమించాలి. ఇతరుల కోసం చేయవలసిన పని ఉండదు. కావున స్వయాన్నే ఆత్మగా భావించి స్వయం శ్రమించవలసి ఉంటుంది. ఇతరులు ఏం చేస్తున్నారు అన్నదాన్లో మనదేం పోతుంది. చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ (దానం ఇంటి నుండి ప్రారంభమవుతుంది) అనగా మొదట స్వయం శ్రమ చేసి, తర్వాత ఇతరులకు (సోదరులకు) చెప్పాలి. ఎప్పుడైతే మీరు స్వయాన్ని ఆత్మగా భావించి ఇతర ఆత్మలకు జ్ఞానమునిస్తారో, అప్పుడు మీ జ్ఞాన ఖడ్గములో పదును ఉంటుంది. ఇందులో శ్రమ అయితే ఉంది కదా. కావున తప్పకుండా ఎంతో కొంత సహనం చేయవలసి ఉంటుంది. ఈ సమయంలో సుఖ-దుఃఖాలు, నిందా-స్తుతులు, మానావమానాలు మొదలైనవన్నీ ఎంతో కొంత సహనం చేయవలసి ఉంటుంది. కావున ఎవరైనా ఏదైనా తప్పుగా మాట్లాడినప్పుడు మౌనంగా ఉండాలి అని చెప్తారు. ఎవరైనా మౌనంగా ఉంటే, వారిపై ఎవరైనా ఏమి కోపగించుకోగలరు. ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు, ఇంకొకరు కూడా మాట్లాడితే, నోటి చప్పట్లు మ్రోగుతాయి. ఒకవేళ ఒకరు నోటి చప్పట్లు మ్రోగించినా, మరొకరు శాంతిగా ఉంటే, అంతా ఆగిపోతుంది. అంతే, తండ్రి ఇదే నేర్పిస్తారు. ఎవరైనా ఎప్పుడైనా కోపగించుకున్నప్పుడు మౌనంగా ఉండండి, వారి క్రోధం దానంతటదే శాంతమైపోతుంది. ఇంకొకవైపు చప్పట్లు మ్రోగవు. ఒకవేళ చప్పట్లతో చప్పట్లు మ్రోగించినట్లయితే (వాదించినట్లయితే) గొడవైపోతుంది, కావున - పిల్లలూ, ఈ విషయాలలో మీరు ఎప్పుడూ చప్పట్లు మ్రోగించకండి. వికారాలు, కామము, క్రోధము, దేనికీ స్పందించకండి అని తండ్రి చెప్తారు.

పిల్లలు ప్రతి ఒక్కరి కళ్యాణము చేయవలసిందే, ఇన్ని సెంటర్లు దేనికి తయారుచేయబడి ఉన్నాయి? కల్పక్రితము కూడా ఇటువంటి సేవాకేంద్రాలు వెలువడే ఉంటాయి. దేవాదిదేవుడైన తండ్రి చూస్తూ ఉంటారు, చాలా మంది పిల్లలకు బాబా సెంటరు తెరవాలి అన్న ఆసక్తి ఉంటుంది. మేము సెంటర్లు తెరుస్తాము, ఖర్చు మేము భరిస్తాము అని అంటారు. కావున రోజురోజుకూ ఇలా జరుగుతూ ఉంటుంది, ఎందుకంటే ఎంతగా వినాశనపు రోజులు సమీపిస్తూ ఉంటాయో, అంతగా ఇటువైపు సేవ చేయాలనే ఆసక్తి కూడా పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు బాప్ దాదాలు ఇరువురూ కలిసి ఉన్నారు, కావున ప్రతి ఒక్కరినీ - వీరు ఏ పురుషార్థం చేస్తున్నారు, ఏ పదవిని పొందుతారు, ఎవరి పురుషార్థము ఉన్నతంగా ఉంది, ఎవరిది మధ్యమంగా ఉంది, ఎవరిది కనిష్ఠంగా ఉంది అని గమనిస్తూ ఉంటారు. స్కూల్లో టీచర్లు కూడా, విద్యార్థులు ఏయే సబ్జెక్టులలో పైకి-కిందికి అవుతున్నారని గమనిస్తూ ఉంటారు. ఇక్కడ కూడా అలాగే ఉన్నారు. కొందరు పిల్లలు బాగా అటెన్షన్ ఇస్తారు, వారు స్వయాన్ని ఉన్నతంగా భావిస్తారు. ఏ సమయంలోనైనా పొరపాటు జరిగితే, స్మృతిలో లేనట్లయితే తమను తాము తక్కువగా భావిస్తారు. ఇది స్కూలు కదా. బాబా, మేము అప్పుడప్పుడు చాలా సంతోషంగా ఉంటాము, అప్పుడప్పుడు సంతోషము తగ్గిపోతుంది అని పిల్లలు అంటారు. సంతోషంగా ఉండాలనుకుంటే ‘‘మన్మనాభవ’’, స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి అని బాబా ఇప్పుడు అర్థం చేయిస్తూ ఉంటారు. మీ ఎదురుగా పరమాత్మను చూడండి, వారు అకాల సింహాసనంపై కూర్చుని ఉన్నారు. ఈ విధంగా సోదరుల వైపు కూడా చూడండి, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ సోదరునితో మాట్లాడండి. నేను సోదరునికి జ్ఞానమునిస్తున్నాను. సోదరి కాదు, అందరూ సోదరులే. ఆత్మలకు జ్ఞానమునిస్తారు, మీకు ఈ అలవాటు అయినట్లయితే మిమ్మల్ని మోసము చేసే అశుద్ధమైన దృష్టి నెమ్మది-నెమ్మదిగా సమాప్తం అయిపోతుంది. ఆత్మ-ఆత్మతో ఏం చేస్తుంది? దేహాభిమానము వచ్చినప్పుడు కింద పడిపోతారు. బాబా, మా దృష్టి అశుద్ధంగా ఉందని చాలా మంది అంటారు. అచ్ఛా, అశుద్ధమైన దృష్టిని ఇప్పుడు శుద్ధంగా చేయండి. ఆత్మకు బాబా మూడవ నేత్రమునిచ్చారు. మూడవ నేత్రముతో చూస్తే దేహాన్ని చూసే మీ అలవాటు తొలగిపోతుంది. బాబా పిల్లలకు డైరెక్షన్లు ఇస్తూనే ఉంటారు, ఇతనికి (బ్రహ్మా) కూడా ఇలాగే చెప్తారు. ఈ బాబా కూడా దేహములో ఉన్న ఆత్మనే చూస్తారు. దీనినే ఆత్మిక జ్ఞానమని అంటారు. ఎంత ఉన్నత పదవిని పొందుతారో చూడండి. ఇది చాలా గొప్ప పదవి. కావున పురుషార్థము కూడా అలాగే చేయాలి. కల్పక్రితము వలె అందరి పురుషార్థము జరుగుతుందని బాబా కూడా భావిస్తారు. కొందరు రాజారాణులుగా అవుతారు, కొందరు ప్రజల్లోకి వెళ్ళిపోతారు. కావున ఇక్కడ కూర్చొని యోగము చేయించినప్పుడు కూడా, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఇతరుల భృకుటిలో కూడా ఆత్మనే చూస్తూ ఉంటే, వారి సేవ బాగా జరుగుతుంది. ఎవరైతే దేహీ-అభిమానులుగా అయి కూర్చుంటారో, వారు ఆత్మలనే చూస్తారు. ఈ అభ్యాసము ఎక్కువగా చేయండి. అరే, ఉన్నత పదవిని పొందాలంటే, ఎంతో కొంత శ్రమ చేయాలి కదా. కావున ఇప్పుడు ఆత్మలు ఈ శ్రమయే చేయాలి. ఈ ఆత్మిక జ్ఞానము ఒక్కసారి మాత్రమే లభిస్తుంది, మరెప్పుడూ లభించదు. కలియుగములో గాని, సత్యయుగములో గాని లభించదు, కేవలం సంగమయుగంలో, అది కూడా బ్రాహ్మణులకు మాత్రమే లభిస్తుంది. ఇది పక్కాగా గుర్తుంచుకోండి. బ్రాహ్మణులుగా అయినప్పుడు దేవతలుగా అవుతారు. బ్రాహ్మణులుగా అవ్వకపోతే దేవతలుగా ఎలా అవుతారు? ఈ సంగమయుగంలోనే ఈ శ్రమ చేస్తారు. స్వయాన్ని ఆత్మగా, ఇతరులను కూడా ఆత్మగా భావిస్తూ జ్ఞానమివ్వమని మరే సమయములోనూ చెప్పరు. తండ్రి అర్థం చేయించిన దానిపై విచార సాగర మథనము చేయండి. ఇది సరైనదేనా, నాకు లాభాన్ని కలిగించే విషయమేనా అని నిర్ణయించుకోండి. తండ్రి ఇచ్చే శిక్షణలను సోదరులకు ఇవ్వాలి అన్నది మనకు అలవాటైపోతుంది, స్త్రీలకూ ఇవ్వాలి, పురుషులకు కూడా ఇవ్వాలి. ఇవ్వవలసింది ఆత్మలకే కదా. ఆత్మనే పురుషునిగా, స్త్రీగా అవుతుంది. సోదరిగా, సోదరునిగా అవుతారు.

పిల్లలైన మీకు నేను జ్ఞానమునిస్తానని తండ్రి అంటారు. నేను పిల్లల వైపుకు, ఆత్మల వైపుకు చూస్తాను, మరియు ఆత్మలు కూడా - మా తండ్రి అయిన పరమాత్మ జ్ఞానాన్నిస్తున్నారని అర్థము చేసుకుంటారు, దీనినే రుహానీ అభిమానీ (ఆత్మాభిమానులుగా) అవ్వడమని అంటారు. దీనినే ఆత్మ-పరమాత్మతో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇచ్చి పుచ్చుకోవడం అని అంటారు. ఎవరైనా విజిటర్లు మొదలైనవారు వచ్చినప్పుడు, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఆ ఆత్మకు తండ్రి పరిచయమునివ్వాలి అని తండ్రి శిక్షణ ఇస్తున్నారు. ఆత్మలో జ్ఞానముంది, శరీరములో కాదు. కావున వారిని కూడా ఆత్మగా భావిస్తూనే జ్ఞానమునివ్వాలి. దీనితో వారికి కూడా బాగా అనిపిస్తుంది. ఇది మీ నోటిలో పదును ఉన్నట్లవుతుంది. ఈ జ్ఞాన ఖడ్గంలో పదును నిండుతుంది, ఎందుకంటే దేహీ-అభిమానులుగా ఉంటారు కదా. కావున ఇది కూడా అభ్యాసము చేసి చూడండి. బాబా అంటున్నారు - ఇది సరియైనదా కాదా అని మీరు నిర్ణయించండి. పిల్లల కోసం కూడా ఇది కొత్త విషయమేమీ కాదు, ఎందుకంటే తండ్రి చాలా సహజము చేసి అర్థం చేయిస్తారు. చక్రము తిరిగి వచ్చారు, ఇప్పుడు నాటకము పూర్తవుతుంది, ఇప్పుడు బాబా స్మృతిలో ఉంటారు. తమోప్రధానము నుండి సతోప్రధానంగా అయి, సతోప్రధాన ప్రపంచానికి యజమానులుగా అవుతారు, మళ్ళీ అలాగే మెట్లు దిగుతారు, ఎంత సహజంగా తెలియజేస్తున్నారో చూడండి. ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత నేను రావలసి ఉంటుంది. డ్రామా ప్లాను అనుసారంగా నేను బంధింపబడి ఉన్నాను. నేను వచ్చి పిల్లలకు చాలా సహజంగా స్మృతి యాత్రను నేర్పిస్తాను. తండ్రి స్మృతిలో అంత మతి సో గతి అవుతుంది (అంతిమ మతిని బట్టి గతి ఏర్పడుతుంది), ఇది ఈ సమయానికి సంబంధించినదే. ఇది అంతిమ కాలం. నన్నొక్కరినే స్మృతి చేస్తే సద్గతి లభిస్తుందని ఇప్పుడీ సమయంలో తండ్రి కూర్చొని యుక్తిని తెలియజేస్తున్నారు. చదువు ద్వారా ఈ విధంగా అవుతాను, ఫలానాగా అవుతాను అని పిల్లలు కూడా భావిస్తారు. నేను వెళ్ళి కొత్త ప్రపంచంలో దేవీ-దేవతగా అవుతానని ఇక్కడ కూడా భావిస్తారు. ఇదేమీ కొత్త విషయం కాదు, నథింగ్ న్యూ (కొత్తేమీ కాదు) అని తండ్రి పదే-పదే చెప్తారు. ఈ మెట్లు ఎక్కాలి మరియు దిగాలి, జిన్ను భూతం కథ ఉంది కదా. దానికి మెట్లు ఎక్కడం-దిగడం అనే పని ఇవ్వడం జరిగింది. ఈ నాటకమే ఎక్కడం మరియు దిగడానికి సంబంధించినది. స్మృతి యాత్రతో చాలా దృఢంగా అవుతారు, కావున - పిల్లలూ! ఇప్పుడు దేహీ-అభిమానులుగా అవ్వండి అని తండ్రి కూర్చుని పిల్లలకు రకరకాలుగా నేర్పిస్తారు. ఇప్పుడు అందరూ తిరిగి వెళ్ళాలి. ఆత్మలైన మీరు పూర్తి 84 జన్మలను తీసుకొని తమోప్రధానంగా అయిపోయారు. భారతవాసులే సతో, రజో, తమోగా అవుతారు. పూర్తిగా 84 జన్మలు తీసుకున్నారని ఇతర ఏ దేశాల వారిని అనరు. తండ్రి వచ్చి ప్రతి ఒక్కరి పాత్ర ఎవరిది వారికే ఉంటుందని తెలియజేశారు. ఆత్మ ఎంత చిన్నది. సైన్సు వారికి ఇంత చిన్న ఆత్మలో ఇంత అవినాశీ పాత్ర ఎలా నిండి ఉంది అన్నది అర్థమే కాదు. ఇది అన్నిటికంటే అద్భుతమైన విషయము. ఆత్మ ఎంత చిన్నది మరియు అది ఎంత గొప్ప పాత్రను అభినయిస్తుంది! అది కూడా అవినాశీ! ఈ డ్రామా కూడా అవినాశీ మరియు రచింపబడి ఉన్నది. ఇది ఎప్పుడు తయారయ్యింది అని ఎవరూ అనలేరు. ఇది కుదరత్ (ప్రాకృతికము). ఈ జ్ఞానం చాలా అద్భుతమైనది, ఈ జ్ఞానాన్ని ఎప్పుడూ, ఎవ్వరూ చెప్పలేరు. ఈ జ్ఞానాన్ని చెప్పగలిగే శక్తి ఇంకెవ్వరికీ లేదు.

కావున ఇప్పుడు పిల్లలకు తండ్రి ప్రతి రోజూ అర్థం చేయిస్తూ ఉంటారు. మేము మా సోదరాత్మలను మా సమానంగా తయారుచేసేందుకు జ్ఞానాన్ని ఇస్తున్నాము అన్న అభ్యాసమును ఇప్పుడు చేయండి. తండ్రి నుండి వారసత్వము తీసుకునేందుకు జ్ఞానాన్ని ఇస్తున్నాము ఎందుకంటే ఆత్మలందరికీ హక్కు ఉంది. ఆత్మలందరికీ తమ-తమ సుఖ-శాంతుల వారసత్వాన్ని ఇచ్చేందుకు బాబా వస్తారు. మనం రాజధానిలో ఉన్నప్పుడు మిగిలినవారంతా శాంతిధామంలో ఉంటారు. చివర్లో జయజయకారాలు జరుగుతాయి, ఇక్కడ సుఖమే సుఖముంటుంది కావున పావనంగా అవ్వాలి అని తండ్రి అంటున్నారు. ఎంతెంతగా మీరు పవిత్రంగా అవుతారో, అంతగా ఆకర్షణ ఉంటుంది. మీరు పూర్తిగా పవిత్రమైనప్పుడు సింహాసనాధికారులుగా అవుతారు. కావున ఈ అభ్యాసము చేయండి. కేవలం ఒక చెవితో విని మరో చెవితో వదిలేయడం అని ఇలా అనుకోకండి. ఈ ప్రాక్టీసు లేకుండా మీరు నడవలేరు. స్వయాన్ని ఆత్మగా భావించండి, ఎదుటివారు కూడా ఆత్మ, ఆ సోదరునికి కూర్చొని అర్థము చేయించండి. దీనిని ఆధ్యాత్మిక ఆత్మిక జ్ఞానము అని అంటారని ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఈ జ్ఞానాన్ని ఇచ్చేవారు ఆత్మిక తండ్రి. పిల్లలు ఎప్పుడైతే పూర్తిగా ఆధ్యాత్మికంగా అవుతారో, పూర్తిగా పవిత్రంగా అవుతారో, అప్పుడు సత్యయుగ సింహాసనానికి యజమానులుగా అవుతారు. ఎవరైతే పవిత్రంగా అవ్వరో, వారు మాలలో కూడా రారు. మాలకు కూడా ఏదో అర్థముంటుంది కదా. మాల రహస్యము ఇతరులెవ్వరికీ తెలియదు. మాలను ఎందుకు స్మరిస్తారు? ఎందుకంటే వారు తండ్రికి చాలా సహాయము చేశారు, మరి ఎందుకు స్మరింపబడరు. మీరు స్మరింపబడతారు, మీ పూజ కూడా జరుగుతుంది మరియు మీ శరీరాన్ని కూడా పూజించడము జరుగుతుంది. నాకైతే కేవలం ఆత్మకే పూజ జరుగుతుంది. చూడండి, నా కంటే ఎక్కువగా మీరు డబల్ పూజింపబడతారు. మీరు దేవతలుగా అయినప్పుడు, దేవతలను కూడా పూజిస్తారు కావున మీరు పూజలోనూ ముందున్నారు, స్మృతిచిహ్నంలోనూ ముందున్నారు మరియు రాజ్యాధికారంలోనూ మీరు ముందున్నారు. మిమ్మల్ని ఎంత ఉన్నతంగా తయారుచేస్తున్నానో చూడండి. పిల్లలు చాలా ప్రియంగా ఉంటే, వారిపై ఎక్కువ ప్రేమ ఉంటే, వారిని భుజాల పైకి, తల పైకి కూడా ఎక్కించుకుంటారు. బాబా పూర్తిగా తలపైకి ఎక్కించుకుంటారు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. గాయన యోగ్యంగా, పూజకు యోగ్యంగా అయ్యేందుకు ఆధ్యాత్మికంగా అవ్వాలి, ఆత్మను పవిత్రంగా చేసుకోవాలి. ఆత్మాభిమానులుగా అయ్యే శ్రమ చేయాలి.

2. ‘‘మన్మనాభవ’’ అభ్యాసము ద్వారా అపారమైన సంతోషంలో ఉండాలి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఆత్మతో మాట్లాడాలి, కళ్ళను పవిత్రంగా చేసుకోవాలి.

వరదానము:-

సదాకాలపు అటెన్షన్ ద్వారా విజయమాలలో కూర్చబడే బహుకాలపు విజయీ భవ

బహుకాలపు విజయులు, విజయమాలలోని మణులుగా అవుతారు. విజయులుగా అయ్యేందుకు సదా తండ్రిని మీ ఎదురుగా ఉంచుకోండి - తండ్రి ఏం చేశారో, అదే మేమూ చేయాలి. ప్రతి అడుగులోనూ తండ్రి సంకల్పమే పిల్లల సంకల్పము, తండ్రి మాటలే పిల్లల మాటలు - అప్పుడు విజయులుగా అవుతారు. ఈ అటెన్షన్ సదాకాలము ఉండాలి, అప్పుడు సదాకాలపు రాజ్యభాగ్యము ప్రాప్తిస్తుంది, ఎందుకంటే ఎటువంటి పురుషార్థమో అటువంటి ప్రారబ్ధము. పురుషార్థము సదా ఉన్నట్లయితే రాజ్యభాగ్యము కూడా సదా కోసం ఉంటుంది.

స్లోగన్:-

సేవలో సదా ‘‘జీ హాజిర్’’ (హాజరుగా ఉన్నాను) అనడము - ఇదే ప్రేమకు సత్యమైన ఋజువు.