ఓంశాంతి. మొట్టమొదట స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి అని మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు తండ్రి ప్రతిరోజూ అర్థం చేయిస్తారు. అటెన్షన్ ప్లీజ్ అని అంటారు కదా. కావున ఒకటేమో తండ్రి వైపు అటెన్షన్ పెట్టాలి అని తండ్రి చెప్తున్నారు. తండ్రి ఎంత మధురమైనవారు, వారిని ప్రేమ సాగరుడు, జ్ఞాన సాగరుడు అని అంటారు. కావున మీరు కూడా ప్రియంగా తయారవ్వాలి. మనసా-వాచా-కర్మణా ప్రతి విషయంలోనూ మీకు సంతోషము ఉండాలి. ఎవ్వరికీ దుఃఖమునివ్వకూడదు. తండ్రి కూడా ఎవ్వరినీ దుఃఖితులుగా చేయరు. తండ్రి మిమ్మల్ని సుఖవంతులుగా చేసేందుకే వచ్చారు. మీరు కూడా ఎవ్వరికీ, ఏ రకమైన దుఃఖము ఇవ్వకూడదు. అటువంటి కర్మలేవీ చేయకూడదు. ఇది మనస్సులో కూడా రాకూడదు. కానీ ఈ స్థితి మీకు చివర్లో ఉంటుంది. కర్మేంద్రియాలతో ఏదో ఒక పొరపాటు జరుగుతుంది. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఇతరులను కూడా ఆత్మ సోదరునిగా చూసినట్లయితే, అప్పుడు ఎవ్వరికీ దుఃఖమునివ్వరు. శరీరాన్నే చూడకపోతే దుఃఖమెలా ఇస్తారు. ఇందులో గుప్తమైన శ్రమ ఉంది. ఇదంతా బుద్ధితో చేసే పని. ఇప్పుడు మీరు పారసబుద్ధి కలవారిగా అవుతున్నారు. మీరు పారసబుద్ధి కలవారిగా ఉన్నప్పుడు చాలా సుఖాన్ని చూశారు. మీరే సుఖధామానికి యజమానులుగా ఉండేవారు కదా. ఇది దుఃఖధామము. ఇది చాలా సాధారణమైన విషయము. ఆ శాంతిధామము మన మధురమైన ఇల్లు. తర్వాత అక్కడ నుండి పాత్రను అభినయించేందుకు ఇక్కడకు వచ్చాము, దుఃఖపు పాత్రను చాలా సమయము అభినయించాము, ఇప్పుడు సుఖధామములోకి వెళ్ళాలి కావున పరస్పరంలో ఒకరినొకరు సోదరులుగా భావించాలి. ఆత్మ ఆత్మకు దుఃఖమునివ్వలేదు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఆత్మలతో మాట్లాడుతున్నారు. ఆత్మనే సింహాసనంపై విరాజమానమై ఉంది. ఇది కూడా శివబాబా రథమే కదా. మేము శివబాబా రథాన్ని అలంకరిస్తున్నాము, శివబాబా రథానికి తినిపిస్తున్నాము అని పిల్లలు అంటారు. కావున శివబాబానే గుర్తుంటారు. వారు కళ్యాణకారుడైన తండ్రి. నేను 5 తత్వాలకు కూడా కళ్యాణము చేస్తానని వారు అంటారు. అక్కడ ఎప్పుడూ ఏ వస్తువూ ఇబ్బంది కలిగించదు. ఇక్కడైతే ఒక్కోసారి తుఫానులు, ఒక్కోసారి చలి, ఒక్కోసారి ఒకొక్కటి జరుగుతూ ఉంటుంది. అక్కడైతే సదా వసంత ఋతువే ఉంటుంది. దుఃఖమన్న పేరే ఉండదు. అది ఉన్నదే స్వర్గము. మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా చేసేందుకు తండ్రి వచ్చారు. వారు ఉన్నతోన్నతమైన భగవంతుడు, ఉన్నతోన్నతమైన తండ్రి, ఉన్నతోన్నతమైన సుప్రీమ్ టీచరు కూడా కావున వారు తప్పకుండా ఉన్నతోన్నతంగానే తయారుచేస్తారు కదా. మీరే ఈ లక్ష్మీనారాయణులుగా ఉండేవారు కదా. ఈ విషయాలన్నీ మీరు మర్చిపోయారు. ఇవన్నీ తండ్రే కూర్చొని అర్థము చేయిస్తారు. మీరు రచయిత మరియు రచనల గురించి ఋషులు, మునులను అడిగినప్పుడు నేతి-నేతి (తెలియదు-తెలియదు) అని అనేవారు, వారికే ఈ జ్ఞానం లేనప్పుడు ఇది మరి పరంపరగా ఎలా కొనసాగుతుంది. ఈ జ్ఞానాన్ని నేను ఇప్పుడు మాత్రమే ఇస్తాను అని తండ్రి అంటున్నారు. మీకు సద్గతి లభించిన తర్వాత ఈ జ్ఞానము అవసరముండదు. అక్కడ దుర్గతి జరగనే జరగదు. సత్యయుగాన్ని సద్గతి అని అంటారు. ఇక్కడ ఉన్నది దుర్గతి. కానీ ఇప్పుడు దుర్గతిలో ఉన్నామన్నది కూడా ఎవ్వరికీ తెలియదు. తండ్రి గురించి ముక్తిదాత, మార్గదర్శకుడు, నావికుడు అని గాయనం చేస్తారు. వారు విషయ సాగరము నుండి అందరి నావలను దాటిస్తారు, దానిని క్షీర సాగరమని అంటారు. విష్ణువును క్షీర సాగరములో చూపిస్తారు. ఇదంతా భక్తిమార్గములోని గాయనము. పెద్ద సరస్సు ఉంది, అందులో విష్ణువు యొక్క పెద్ద చిత్రాన్ని చూపిస్తారు. విశ్వమంతటిపై మీరే రాజ్యము చేశారు అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. అనేక సార్లు ఓడిపోయారు మరియు గెలుపొందారు. కామము మహాశత్రువు, దానిపై విజయం పొందినట్లయితే జగత్ జీతులుగా అవుతారు, కావున సంతోషంగా అలా తయారవ్వాలి కదా అని తండ్రి అంటున్నారు. గృహస్థ వ్యవహారంలో, ప్రవృత్తి మార్గంలో ఉండండి కానీ కమలపుష్ప సమానంగా పవిత్రంగా ఉండండి. ఇప్పుడు మీరు ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతున్నారు. ఇది ముళ్ళ అడవి అని మీకు అర్థమవుతుంది, ఒకరినొకరు ఎంతగా విసిగించుకుంటూ ఉంటారు, కొట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు మీ అందరిదీ వానప్రస్థ అవస్థ అని మధురాతి మధురమైన పిల్లలతో తండ్రి అంటున్నారు. చిన్న-పెద్ద అందరిదీ వానప్రస్థ అవస్థయే. మీరు శబ్దము నుండి అతీతంగా వెళ్ళేందుకు చదువుకుంటారు కదా. మీకిప్పుడు సద్గురువు లభించారు. వారు మిమ్మల్ని వానప్రస్థములోకి తప్పకుండా తీసుకువెళ్తారు. ఇది విశ్వవిద్యాలయము. భగవానువాచ కదా. నేను మీకు రాజయోగాన్ని నేర్పించి రాజులకే రాజులుగా తయారుచేస్తాను. ఎవరైతే పూజ్య రాజులుగా ఉండేవారో, వారే పూజారి రాజులుగా అవుతారు. కావున - పిల్లలూ, మంచి రీతిలో పురుషార్థము చేయండి అని తండ్రి అంటున్నారు. దైవీ గుణాలు ధారణ చేయండి. బాగా తినండి, తాగండి, శ్రీనాథ ద్వారానికి వెళ్ళండి. అక్కడ నేతితో తయారుచేసిన వస్తువులు చాలా లభిస్తాయి, నేతి బావులే తయారుచేయబడి ఉన్నాయి. అవన్నీ ఎవరు తింటారు? పూజారులు. శ్రీనాథుడిని, జగన్నాథుడిని, ఇరువురినీ నల్లగా తయారుచేశారు. జగన్నాథ మందిరంలో దేవతల అశుద్ధమైన చిత్రాలున్నాయి, అక్కడ అన్నము పెద్ద-పెద్ద అండాలలో వండుతారు. అది ఉడికిన తర్వాత నాలుగు భాగాలుగా అవుతుంది. కేవలం బియ్యముతో తయారుచేసినవే నైవేద్యంగా పెడతారు, ఎందుకంటే ఇప్పుడంతా సాధారణంగా ఉంది కదా. ఇటువైపు పేదవారు, అటువైపు ధనవంతులు. ఇప్పుడెంత పేదవారిగా ఉన్నారో చూడండి. తినేందుకు-తాగేందుకు ఏమీ లభించదు. సత్యయుగంలోనైతే అన్నీ ఉంటాయి. కావున తండ్రి కూర్చుని ఆత్మలకు అర్థము చేయిస్తున్నారు. శివబాబా చాలా మధురమైనవారు. వారు నిరాకారుడు. ఆత్మను ప్రేమించడం జరుగుతుంది కదా. ఆత్మనే పిలవడం జరుగుతుంది. శరీరమైతే కాలిపోయింది. వారి ఆత్మను పిలుస్తారు, జ్యోతిని వెలిగిస్తారు ఎందుకంటే ఆత్మ అంధకారములో ఉందని భావిస్తారు. ఆత్మ శరీరం లేకుండా ఉంటుంది, అటువంటప్పుడు అంధకారము మొదలైనవాటి విషయము ఎలా ఉండగలదు? అక్కడ ఈ విషయాలు ఉండవు. ఇదంతా భక్తి మార్గము. తండ్రి ఎంత బాగా అర్థం చేయిస్తారు. జ్ఞానము చాలా మధురమైనది. ఇక్కడ కళ్ళు తెరుచుకొని వినాల్సి ఉంటుంది. తండ్రినైతే చూస్తారు కదా. ఇక్కడ శివబాబా విరాజమానమై ఉన్నారని మీకు తెలిసినప్పుడు కళ్ళు తెరచుకొని కూర్చోవాలి కదా. అనంతమైన తండ్రిని చూడాలి కదా. ఇంతకుముందు బాబాను చూసేసరికే పిల్లలు ధ్యానములోకి వెళ్ళేవారు, పరస్పరములో కూడా కూర్చొని-కూర్చొనే ధ్యానములోకి వెళ్ళేవారు. కళ్ళు మూసుకొని పరుగెడుతూ ఉండేవారు. అది అద్భుతము కదా. ఒకరినొకరు చూసినప్పుడు నేను సోదరునితో (ఆత్మతో) మాట్లాడుతున్నాను, సోదరునికి అర్థం చేయిస్తున్నాను అని భావించండి - అని తండ్రి అర్థం చేయిస్తూ ఉంటారు. మీరు అనంతమైన తండ్రి సలహాను పాటించరా? ఈ అంతిమ జన్మలో మీరు పవిత్రంగా అయితే పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారు. బాబా అనేకమందికి అర్థము చేయిస్తారు. కొందరైతే వెంటనే - బాబా, మేము తప్పకుండా పవిత్రంగా అవుతామని అంటారు. పవిత్రంగా ఉండడం మంచిది. కుమారీ పవిత్రంగా ఉన్నప్పుడు అందరూ ఆమెకు తల వంచి నమస్కరిస్తారు. వివాహము చేసుకున్నట్లయితే పూజారిగా అయిపోతుంది. ఆమే అందరికీ తల వంచి నమస్కరించాల్సి వస్తుంది. కావున పవిత్రత మంచిది కదా. పవిత్రత ఉన్నట్లయితే సుఖ-శాంతులు ఉంటాయి. అంతా పవిత్రత పైనే ఆధారపడి ఉంది. ఓ పతితపావనా, రండి అని కూడా పిలుస్తారు. పావన ప్రపంచములో రావణుడు ఉండనే ఉండడు. అది రామ రాజ్యము. అందరూ క్షీరఖండం (పాలు-పంచదార) వలె కలిసి-మెలిసి ఉంటారు. అది ధర్మయుక్తమైన రాజ్యము, మరి రావణుడు ఎక్కడ నుండి వచ్చాడు. రామాయణము మొదలైనవి ఎంత ప్రేమగా కూర్చుని వినిపిస్తారు. ఇదంతా భక్తి. పిల్లలు సాక్షాత్కారములో నాట్యము చేయడం మొదలుపెడతారు. సత్యమైన నావ కదులుతుంది కానీ మునగదు అన్న గాయనం ఉంది. ఇతర సత్సంగాలకు వెళ్ళేందుకు ఎవ్వరూ ఆటంకాలు కలిగించరు. కానీ ఇక్కడకు వచ్చేందుకు ఎంతగా ఆపుతారు. తండ్రి మీకు జ్ఞానమిస్తారు. మీరు బి.కె.లుగా అవుతారు. బ్రాహ్మణులుగా అయితే తప్పకుండా అవ్వాలి. తండ్రి స్వర్గ స్థాపన చేసేవారు, కావున మనము కూడా తప్పకుండా స్వర్గానికి యజమానులుగా అవ్వాల్సిందే. మనమిక్కడ నరకంలో ఎందుకు పడి ఉన్నాము. మనము కూడా ఇంతకుముందు పూజారులుగా ఉండేవారము, ఇప్పుడు మళ్ళీ 21 జన్మలకు పూజ్యులుగా అవుతాము, 63 జన్మలు పూజారులుగా అయ్యాము, ఇప్పుడు మళ్ళీ మనము పూజ్యులుగా, స్వర్గానికి యజమానులుగా అవుతాము అని ఇప్పుడు అర్థమవుతుంది. ఇది నరుని నుండి నారాయణునిగా అయ్యే జ్ఞానము. భగవానువాచ - నేను మిమ్మల్ని రాజులకే రాజులుగా తయారుచేస్తాను. పతిత రాజులు పావన రాజులకు నమస్కరిస్తారు. ప్రతి మహారాజు ఉండే మహల్ లో మందిరము తప్పకుండా ఉంటుంది. అది కూడా రాధా-కృష్ణులది లేక లక్ష్మి నారాయణులది లేక సీతా-రాములది అయ్యి ఉంటుంది. ఈ రోజుల్లో అయితే వినాయకుడు, హనుమంతుడు మొదలైనవారి మందిరాలు కూడా తయారుచేస్తూ ఉంటారు. భక్తి మార్గములో ఎంతో అంధశ్రద్ధ ఉంది. మేము రాజ్యపాలన చేశాము, ఆ తర్వాత వామమార్గములో పడిపోయామని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు, ఇది మీ అంతిమ జన్మ అని ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు. మధురాతి మధురమైన పిల్లలూ, ముందు మీరు స్వర్గములో ఉండేవారు. తర్వాత కిందకు దిగుతూ-దిగుతూ పూర్తిగా నేలపై పడిపోయారు. మేము చాలా ఉన్నతంగా ఉండేవారము, మళ్ళీ తండ్రి మమ్మల్ని ఉన్నతంగా తయారుచేస్తున్నారు అని మీరంటారు. మనము ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత చదువుతూనే వచ్చాము. దీనినే ప్రపంచ చరిత్ర-భూగోళాలు పునరావృతమవ్వడం అని అంటారు.
నేను పిల్లలైన మిమ్మల్ని విశ్వానికి అధికారులుగా తయారుచేస్తానని బాబా అంటారు. పూర్తి విశ్వంపై మీ రాజ్యం ఉంటుంది. బాబా, మీరు ఇచ్చే రాజ్యాన్ని ఇతరులెవ్వరూ లాక్కోలేరు అని పాటలో కూడా ఉంది కదా. ఇప్పుడు ఎన్ని విభజనలున్నాయి. నీటి గురించి, భూమి గురించి గొడవలు జరుగుతూ ఉంటాయి. తమ-తమ ప్రాంతాలను సంభాళించుకుంటూ ఉంటారు. కాపాడుకుంటూ ఉంటారు. అలా కాపాడుకోకపోతే, యువకులు (పిల్లలు) రాళ్ళు వేయడం మొదలుపెడతారు. ఈ నవ యువకులు, శక్తిశాలిగా అయి భారతదేశ రక్షణ చేస్తారని వారు భావిస్తారు. అందువలన ఇప్పటి నుండే శక్తిని చూపిస్తూ ఉంటారు. ప్రపంచ పరిస్థితి ఎలా ఉందో చూడండి. ఇది రావణరాజ్యము కదా.
ఇది ఆసురీ సంప్రదాయమని తండ్రి అంటున్నారు. మీరిప్పుడు దైవీ సంప్రదాయానికి చెందినవారిగా అవుతున్నారు. దేవతలు మరియు అసురులకు యుద్ధము ఎలా జరుగుతుంది. మీరైతే డబల్ అహింసకులుగా అవుతారు. వారు డబల్ అహింసకులు. దేవీ-దేవతలను డబల్ అహింసకులని అంటారు. అహింసా పరమో దేవీ-దేవతా ధర్మమని అంటారు. మాటలతో దుఃఖమివ్వడం కూడా హింసయే అని బాబా అర్థము చేయిస్తున్నారు. మీరు దేవతలుగా అవుతారు కనుక ప్రతి మాటలోనూ రాయల్టీ (హుందాతనము) ఉండాలి. అన్నపానాదులు చాలా గొప్పగానూ ఉండకూడదు, చాలా తక్కువరకంగానూ ఉండకూడదు. ఏకరసంగా ఉండాలి. రాజులు మొదలైనవారు చాలా తక్కువగా మాట్లాడతారు. ప్రజలకు కూడా రాజు అంటే చాలా ప్రేమ ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. ఎన్ని విప్లవాలు జరుగుతున్నాయి. ఇటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు నేను వచ్చి విశ్వములో శాంతిని స్థాపన చేస్తానని తండ్రి అంటున్నారు. అందరూ కలిసి ఒక్కటిగా అవ్వాలని ప్రభుత్వము కోరుకుంటుంది. అందరూ సోదరులే, కానీ ఇది ఒక ఆట కదా. మీరు ఏమీ చింతించకండి అని తండ్రి పిల్లలకు చెప్తున్నారు. ఇప్పుడు ధాన్యము విషయంలో చాలా కష్టమవుతుంది. అక్కడ ఎంత ధాన్యముంటుందంటే, ధనం వెచ్చించకుండానే ఎంత కావాలంటే అంత లభిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ దైవీ రాజధానిని స్థాపన చేస్తున్నారు. మనము ఎప్పుడూ ఎటువంటి రోగమూ కూడా రాకుండా ఉండే విధంగా ఆరోగ్యాన్ని తయారుచేసుకుంటాము, ఇది గ్యారంటీ. మన స్వభావాన్ని కూడా ఈ దేవతల వలె తయారుచేసుకుంటాము. ఎటువంటి మినిస్టర్లు వస్తే, వారికి తగినట్లుగా అర్థము చేయించవచ్చు. యుక్తిగా అర్థము చేయించాలి. అభిప్రాయాలు రాసే పుస్తకములో చాలా బాగా వ్రాస్తారు. కానీ అరే, మీరు కూడా అర్థము చేసుకోండి కదా అని అంటే, మాకు తీరిక లేదని అంటారు. మీలాంటి పెద్దవారు ఏదైనా శబ్దం చేసినట్లయితే పేదలకు కూడా మేలు జరుగుతుంది అని వారికి చెప్పాలి.
ఇప్పుడు అందరి తలపై మృత్యువు నిలబడి ఉందని తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఈ రోజు, రేపు అంటూ-అంటూ మృత్యువు తినేస్తుంది. మీరు కుంభకర్ణుని వలె అయిపోయారు. ఇతరులకు అర్థము చేయించడంలో పిల్లలకు చాలా సంతోషము కూడా కలుగుతుంది. ఈ చిత్రాలు మొదలైనవి బాబానే తయారుచేయించారు. దాదాకు ఈ జ్ఞానం లేదు. మీకు లౌకిక మరియు పారలౌకిక తండ్రుల నుండి వారసత్వము లభిస్తుంది. అలౌకిక తండ్రి నుండి వారసత్వము లభించదు. వీరు కేవలం మధ్యవర్తి మాత్రమే, వీరి నుండి వారసత్వము ఉండదు. ప్రజాపిత బ్రహ్మాను స్మృతి చేయకూడదు. నా ద్వారా మీకు ఏమీ లభించదు. నేను కూడా చదువుకుంటాను, ఒకటేమో హద్దు వారసత్వము, మరొకటి అనంతమైన తండ్రికి చెందినది. ప్రజాపిత బ్రహ్మా ఏ వారసత్వాన్నిస్తారు. నన్నొక్కరినే స్మృతి చేయండి, ఇది రథము కదా అని తండ్రి అంటున్నారు. రథాన్ని స్మృతి చేయకూడదు కదా. ఉన్నతోన్నతమైన వారు భగవంతుడు అని అంటారు. తండ్రి కూర్చొని ఆత్మలకు అర్థము చేయిస్తున్నారు. ఆత్మనే అంతా చేస్తుంది కదా. ఒక శరీరము వదిలి మరొకటి తీసుకుంటుంది. సర్పము ఉదాహరణ కూడా ఉంది. భ్రమరములు కూడా మీరే. జ్ఞానాన్ని భూ-భూ చేయండి. జ్ఞానము వినిపిస్తూ-వినిపిస్తూ మీరు ఎవరినైనా విశ్వానికి యజమానులుగా చేయగలరు. విశ్వానికి యజమానులుగా చేసే తండ్రిని ఎందుకు స్మృతి చేయరు. ఇప్పుడు తండ్రి వచ్చారు కనుక మీరు వారసత్వాన్ని ఎందుకు తీసుకోకూడదు. తీరిక లభించదని ఎందుకంటారు. మంచి-మంచి పిల్లలైతే ఈ విషయాలను ఒక్క సెకెండులో అర్థము చేసుకుంటారు. మనుష్యులు లక్ష్మిని పూజిస్తారు, ఇప్పుడు లక్ష్మి ద్వారా ఏం లభిస్తుంది, అంబ ద్వారా ఏం లభిస్తుంది? లక్ష్మి స్వర్గానికి దేవి. వారి నుండి ధనము కావాలని భిక్షం అడుగుతారు. అంబ విశ్వానికి యజమానులుగా చేస్తారు. అన్ని కోరికలను పూర్తి చేసేస్తారు. శ్రీమతము ద్వారా కోరికలన్నీ పూర్తవుతాయి. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఈ కర్మేంద్రియాలతో ఎటువంటి పొరపాటు జరగకూడదు, దీని కోసం 'నేను ఆత్మను' అనే స్మృతిని పక్కా చేసుకోవాలి. శరీరాన్ని చూడకూడదు. ఒక్క తండ్రి వైపే ధ్యానముంచాలి.
2. ఇప్పుడు మీది వానప్రస్థ అవస్థ. అందుకే శబ్దము నుండి దూరంగా వెళ్ళే పురుషార్థము చేయాలి. తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. సత్యమనే నావ కదులుతుంది కానీ మునగదు అని బుద్ధిలో ఉండాలి. అందుకే విఘ్నాలకు భయపడకూడదు.