ఓంశాంతి. దూరదేశమని దేనినంటారు అనేది పిల్లలకు తెలుసు. ఈ విషయము ప్రపంచములోని మనుష్యులు ఒక్కరికీ కూడా తెలియదు. ఎంత గొప్ప విద్వాంసులైనా గాని, పండితులైనా గాని దీని అర్థము తెలియదు. పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు. ఓ భగవంతుడా అని ఏ తండ్రినైతే మనుష్యమాత్రులందరూ గుర్తు చేసుకుంటారో..... వారు తప్పకుండా పైన మూలవతనములో ఉన్నారు, ఇది ఇతరులెవ్వరికీ తెలియదు. ఈ డ్రామా రహస్యాన్ని కూడా ఇప్పుడు పిల్లలైన మీరు అర్థము చేసుకుంటారు. ప్రారంభము నుండి మొదలుకొని ఇప్పటివరకు ఏదైతే జరిగిందో, ఏదైతే జరుగనున్నదో, అదంతా బుద్ధిలో ఉంది. ఈ సృష్టి చక్రమెలా తిరుగుతుంది అనేది బుద్ధిలో ఉండాలి కదా. పిల్లలైన మీలో కూడా నంబరువారుగా అర్థము చేసుకుంటారు. విచార సాగర మథనము చెయ్యరు, అందుకే సంతోషపు పాదరసం కూడా ఎక్కదు. కూర్చుంటూ-లేస్తూ మేము స్వదర్శన చక్రధారులమని బుద్ధిలో ఉండాలి. ఆత్మనైన నాకు ఆది నుండి అంతిమము వరకు మొత్తం సృష్టి చక్రం గురించి తెలుసు. మీరిక్కడ కూర్చుని ఉన్నా, బుద్ధిలో మూలవతనము గుర్తుకొస్తుంది. అది స్వీట్ సైలెన్స్ హెూమ్, నిర్వాణధామము, సైలెన్స్ ధామము, అక్కడ ఆత్మలు ఉంటాయి. ఈ విషయాలు పిల్లలైన మీ బుద్ధిలోకి వెంటనే వచ్చేస్తాయి, ఇతరులెవ్వరికీ వీటిని గురించి తెలియవు. శాస్త్రాలు మొదలైనవి ఎన్ని చదువుతూ, వింటూ ఉన్నా కానీ లాభమేమీ లేదు. వారందరూ దిగే కళలో ఉన్నారు. మీరిప్పుడు ఎక్కుతున్నారు. తిరిగి వెళ్ళేందుకు స్వయం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ పాత వస్త్రాన్ని వదిలి మనము ఇంటికి వెళ్ళాలి. సంతోషము ఉంటుంది కదా! ఇంటికి వెళ్ళేందుకు అర్థకల్పము భక్తి చేశాము. మెట్లు క్రిందికి దిగుతూనే వచ్చాము. ఇప్పుడు బాబా మనకు సహజంగా అర్థము చేయిస్తారు. పిల్లలైన మీకు సంతోషముండాలి. భగవంతుడైన తండ్రి మనల్ని చదివిస్తున్నారు అనే ఈ సంతోషం చాలా ఉండాలి. తండ్రి సమ్ముఖంలో చదివిస్తున్నారు. అందరికీ తండ్రి అయిన బాబా మనల్ని మళ్ళీ చదివిస్తున్నారు. అనేకసార్లు చదివించారు. మీరు చక్రం తిరిగి పూర్తి చేసినప్పుడు తండ్రి మళ్ళీ వస్తారు. ఈ సమయంలో మీరు స్వదర్శన చక్రధారులు. మీరు విష్ణుపురి యొక్క దేవతలుగా అయ్యేందుకు పురుషార్థము చేస్తున్నారు. ప్రపంచంలో ఇతరులెవ్వరూ ఈ జ్ఞానమును ఇవ్వలేరు. శివబాబా మనల్ని చదివిస్తున్నారు అనే ఈ సంతోషము ఎంతగా ఉండాలి. ఈ శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గానికి చెందినవి, ఇవి సద్గతి కోసం కాదని పిల్లలకు తెలుసు. భక్తి మార్గపు సామాగ్రి కూడా కావాలి కదా. ఎంతో సామాగ్రి ఉంది. దీనితో మీరు పడిపోతూనే వచ్చారని తండ్రి అంటారు. ప్రతి ముంగిటలోనూ ఎంతగానో భ్రమించారు. ఇప్పుడు మీరు శాంతిగా అయి కూర్చున్నారు. మీరు ఎదురుదెబ్బలు తినడము నుండి విముక్తులయ్యారు. ఇంకా కొద్ది సమయమే మిగిలి ఉంది అని మీకు తెలుసు, ఆత్మను పవిత్రంగా తయారుచేసేందుకు తండ్రి ఇదే మార్గాన్ని తెలియజేస్తున్నారు. నన్ను స్మృతి చేసినట్లయితే మీరు తమోప్రధానము నుండి సతోప్రధానంగా అయిపోతారు, తర్వాత సతోప్రధాన ప్రపంచములోకి వచ్చి రాజ్యం చేస్తారు అని తండ్రి చెప్తారు. తండ్రి ఈ మార్గాన్ని కల్ప-కల్పము అనేకసార్లు తెలియజేసారు. మరి మీ స్థితిని కూడా చూసుకోవాలి, విద్యార్థులు పురుషార్థము చేసి తమను తాము తెలివైనవారిగా చేసుకుంటారు కదా. చదువు యొక్క రిజిస్టరు కూడా ఉంటుంది మరియు నడవడిక యొక్క రిజిస్టరు కూడా ఉంటుంది. ఇక్కడ మీరు కూడా దైవీగుణాలను ధారణ చెయ్యాలి. ఈ రోజంతా ఎటువంటి ఆసురీ కర్మలు చేయలేదు కదా అని ప్రతిరోజూ మీ లెక్కాపత్రాన్ని పెట్టుకుంటే చాలా ఉన్నతి జరుగుతుంది. మనమైతే దేవతలుగా అవ్వాలి. లక్ష్మీ-నారాయణుల చిత్రము ఎదురుగా పెట్టారు. ఇది ఎంత సింపుల్ చిత్రము. పైన శివబాబా ఉన్నారు. ప్రజాపిత బ్రహ్మా ద్వారా ఈ వారసత్వాన్ని ఇస్తారంటే తప్పకుండా సంగమయుగంలో బ్రాహ్మణ బ్రాహ్మణీలుంటారు కదా. దేవతలు సత్యయుగంలో ఉంటారు. బ్రాహ్మణులు సంగమయుగంలో ఉంటారు. కలియుగములో శూద్ర వర్ణము వారుంటారు. విరాట రూపాన్ని కూడా బుద్ధిలో ధారణ చెయ్యండి. ఇప్పుడు మనము బ్రాహ్మణులము, పిలక వంటి వారము, తర్వాత దేవతలుగా అవుతాము. దేవతలుగా తయారుచేసేందుకు తండ్రి బ్రాహ్మణులను చదివిస్తున్నారు కనుక దైవీగుణాలు కూడా ధారణ చెయ్యాలి, అంత మధురంగా తయారవ్వాలి. ఎవ్వరికీ దుఃఖమునివ్వకూడదు. ఎలాగైతే శరీర నిర్వహణ కోసం ఏదో ఒక పని చేయడం జరుగుతుందో, అలాగే ఇక్కడ కూడా యజ్ఞసేవను చెయ్యాలి. ఎవరైనా అనారోగ్యం పాలైతే, సేవ చేయలేకపోతే, వారి సేవ కూడా చేయవలసి ఉంటుంది. ఎవరైనా అనారోగ్యము చెంది శరీరాన్ని వదిలేస్తే మీరు దుఃఖపడవలసిన లేక ఏడవవలసిన విషయము లేదు. మీరైతే పూర్తిగా శాంతిగా బాబా స్మృతిలో ఉండాలి. ఎలాంటి శబ్దమూ ఉండకూడదు. వారైతే శ్మశానానికి తీసుకువెళ్ళినప్పుడు రామ నామము తోడుగా ఉంది అని శబ్దము చేస్తూ వెళ్తారు. మీరైతే ఏమీ అనకూడదు. మీరు సైలెన్స్ ద్వారా విశ్వంపై విజయము పొందుతారు. వారిది సైన్సు, మీది సైలెన్స్.
పిల్లలైన మీకు జ్ఞానం మరియు విజ్ఞానం యొక్క యథార్థమైన అర్థము కూడా తెలుసు. జ్ఞానమంటే వివేకము మరియు విజ్ఞానమంటే అంతా మర్చిపోవడం, జ్ఞానము కన్నా అతీతమైనది. కనుక జ్ఞానము కూడా ఉంది, విజ్ఞానము కూడా ఉంది. నేను శాంతిధామ నివాసిని అని ఆత్మకు తెలుసు, ఇంకా జ్ఞానము కూడా ఉంది. రూప్ మరియు బసంత్. బాబా కూడా రూప్-బసంత్ కదా. వారు రూప్ కూడా మరియు వారిలో మొత్తం సృష్టిచక్ర జ్ఞానము కూడా ఉంది. వారు విజ్ఞాన భవనమని పేరు పెట్టారు కానీ దాని అర్థమేమీ తెలియదు. ఈ సమయంలో సైన్సు వలన దుఃఖము కూడా ఉంది మరియు సుఖము కూడా ఉందని పిల్లలైన మీకు తెలుసు. అక్కడ సుఖమే సుఖముంటుంది. ఇక్కడ అల్పకాలిక సుఖము ఉంటుంది, మిగిలింది దుఃఖమే దుఃఖము. ఇంట్లో మనుష్యులు ఎంత దుఃఖితులుగా ఉంటారు. చనిపోతే ఈ దుఃఖపు ప్రపంచము నుండి ముక్తులైపోతామని భావిస్తారు. బాబా మనల్ని స్వర్గవాసులుగా చేసేందుకు వచ్చి ఉన్నారని పిల్లలైన మీకు తెలుసు. మరి ఎంత పులకరింపు ఉండాలి. మనల్ని స్వర్గవాసులుగా చేసేందుకు బాబా కల్ప-కల్పమూ వస్తారు, మరి ఇటువంటి తండ్రి మతంపైనే నడవాలి కదా.
తండ్రి అంటారు - మధురమైన పిల్లలూ, ఎప్పుడూ ఎవ్వరికీ దుఃఖమునివ్వకండి. గృహస్థ వ్యవహారములో ఉంటూ పవిత్రంగా అవ్వండి. మనము సోదరీ-సోదరులము, ఇది ప్రేమ యొక్క సంబంధము. వేరే ఏ దృష్టి ఉండకూడదు. ప్రతి ఒక్కరికీ వారి వారి జబ్బులు ఉన్నాయి, వాటి అనుసారంగానే సలహాలు కూడా ఇస్తూ ఉంటారు. బాబా, ఇలాంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి, ఈ పరిస్థితులలో ఏమి చేయాలి అని అడుగుతారు. సోదరీ-సోదరుల దృష్టి అసభ్యంగా ఉండకూడదని బాబా అర్థం చేయిస్తారు. ఎటువంటి గొడవలు ఉండకూడదు. నేను ఆత్మలైన మీకు తండ్రిని కదా. శివబాబా బ్రహ్మా తనువు ద్వారా మాట్లాడుతున్నారు. ప్రజాపిత బ్రహ్మా శివబాబాకు కుమారుడు, వారు సాధారణ శరీరములోనే వస్తారు కదా. విష్ణువైతే సత్యయుగానికి చెందినవారు. నేను వీరిలో ప్రవేశించి కొత్త ప్రపంచాన్ని రచించేందుకు వచ్చానని తండ్రి చెప్తారు. మీరు విశ్వ మహారాజా-మహారాణిగా అవుతారా అని బాబా అడుగుతారు. అవును బాబా, ఎందుకు అవ్వము. అవును, ఇందులో పవిత్రంగా ఉండవలసి ఉంటుంది. ఇదైతే కష్టము. అరే, మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా తయారుచేస్తాను, మీరు పవిత్రంగా ఉండలేరా? సిగ్గు అనిపించడం లేదా? లౌకిక తండ్రి కూడా అశుద్ధమైన పనులు చేయవద్దని అర్థం చేయిస్తారు కదా. ఈ వికారాల గురించే విఘ్నాలు కలుగుతాయి. ప్రారంభము నుండి మొదలుకొని ఈ విషయంలో గొడవలు జరుగుతూ వచ్చాయి. తండ్రి అంటారు - మధురమైన పిల్లలూ, దీనిపై విజయం పొందాలి. నేను పవిత్రంగా తయారుచేయడానికి వచ్చాను. పిల్లలైన మీకు రైట్-రాంగ్, మంచి-చెడుల గురించి ఆలోచించే బుద్ధి లభించింది. ఈ లక్ష్మీ-నారాయణులు మీ లక్ష్యము-ఉద్దేశ్యము. స్వర్గవాసులలో దైవీగుణాలున్నాయి, నరకవాసులలో అవగుణాలున్నాయి. ఇప్పుడిది రావణ రాజ్యము, ఇది కూడా ఎవ్వరూ అర్థము చేసుకోలేరు. రావణుడిని ప్రతి సంవత్సరము కాలుస్తారు. శత్రువు కదా. కాలుస్తూనే వస్తారు కానీ అతడెవరు అన్నది అర్థం చేసుకోరు. మనమంతా రావణ రాజ్యానికి చెందినవారము కదా కనుక తప్పకుండా మనము అసురులుగా ఉన్నాము. కానీ స్వయాన్ని ఎవ్వరూ అసురులుగా భావించరు. ఇది రాక్షస రాజ్యమని చాలామంది అంటారు కూడా. యథా రాజా రాణి తథా ప్రజ. కానీ ఈ మాత్రము కూడా వివేకం ఉండదు. రామ రాజ్యము వేరుగా ఉంటుంది, రావణ రాజ్యము వేరుగా ఉంటుందని తండ్రి కూర్చుని అర్థము చేయిస్తారు. ఇప్పుడు మీరు సర్వగుణ సంపన్నులుగా అవుతున్నారు. మందిరాలకు వెళ్ళి దేవతలను పూజించే నా భక్తులకు జ్ఞానము వినిపించండి అని తండ్రి చెప్తారు. అంతేకానీ, రకరకాల వ్యక్తుల వెనుక తల బాదుకోకండి. మందిరాలలో మీకు చాలామంది భక్తులు లభిస్తారు. నాడి కూడా చూడవలసి ఉంటుంది. డాక్టర్లు చూడడంతోనే వారి జబ్బు ఏమిటి అన్నది వెంటనే చెప్పేస్తారు. ఢిల్లీలో అజ్మల్ ఖాన్ అనే ఒక ప్రసిద్ధమైన వైద్యుడుండేవారు. తండ్రి అయితే మిమ్మల్ని 21 జన్మల కోసం సదా ఆరోగ్యవంతులుగా, ధనవంతులుగా తయారుచేస్తారు. ఇక్కడైతే అందరూ రోగులుగా, అనారోగ్యులుగా ఉన్నారు. అక్కడ ఎప్పుడూ రోగము ఉండదు. మీరు సదా ఆరోగ్యవంతులుగా, సదా ధనవంతులుగా అవుతారు. మీరు మీ యోగబలముతో మీ కర్మేంద్రియాలపై విజయము పొందుతారు. మిమ్మల్ని ఈ కర్మేంద్రియాలెప్పుడూ మోసము చేయలేవు. మంచి రీతిగా స్మృతిలో ఉన్నట్లయితే, దేహీ-అభిమానులుగా ఉన్నట్లయితే కర్మేంద్రియాలు మోసము చెయ్యవని బాబా అర్థం చేయించారు. ఇక్కడే మీరు వికారాలపై విజయం పొందుతారు. అక్కడ చెడు దృష్టి ఉండదు, రావణ రాజ్యమే ఉండదు. అది ఉన్నదే అహింసాయుత దేవీ దేవతా ధర్మము. యుద్ధం మొదలైనవాటి విషయమేమీ ఉండదు. ఈ యుద్ధము కూడా అంతిమములో, ఆఖరుగా జరగవలసి ఉంది. దీని ద్వారానే స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయి. తర్వాత ఎప్పుడూ యుద్ధాలు జరగవు. యజ్ఞము కూడా ఇదే చివరిది. తర్వాత అర్థకల్పము ఎటువంటి యజ్ఞము ఉండదు. ఇందులో చెత్త అంతా స్వాహా అయిపోతుంది. ఈ యజ్ఞము ద్వారానే వినాశ జ్వాల వెలువడింది, మొత్తం శుభ్రమైపోతుంది. తర్వాత పిల్లలైన మీకు సాక్షాత్కారాలు కూడా చేయించడం జరిగింది, అక్కడి శూబీరసము మొదలైనవి కూడా చాలా రుచికరంగా, ఫస్ట్ క్లాస్ గా ఉంటాయి. ఇప్పుడు మీరు ఆ రాజ్యాన్ని స్థాపన చేస్తున్నారంటే ఎంత సంతోషముండాలి.
మీ పేరే శివశక్తి భారతమాతలు. కేవలం స్మృతి ద్వారానే మీరు శివుడి నుండి శక్తి తీసుకుంటారు. ఎదురు దెబ్బలు తినే విషయమేమీ లేదు. ఎవరైతే భక్తి చెయ్యరో, వారు నాస్తికులని వారు భావిస్తారు. ఎవరికైతే తండ్రి గురించి మరియు రచన గురించి తెలియదో, వారు నాస్తికులని మీరంటారు. మీరిప్పుడు ఆస్తికులుగా అయ్యారు. త్రికాలదర్శులుగా కూడా అయ్యారు. మూడు లోకాల గురించి, మూడు కాలాల గురించి తెలుసుకున్నారు. ఈ లక్ష్మీ నారాయణులకు తండ్రి నుండి ఈ వారసత్వము లభించింది. ఇప్పుడు మీరు అలా తయారవుతారు. ఈ విషయాలన్నీ తండ్రియే అర్థం చేయిస్తారు. నేను వీరిలో ప్రవేశించి అర్థము చేయిస్తానని శివబాబా స్వయంగా చెప్తారు. లేకపోతే నిరాకారుడినైన నేను ఎలా అర్థము చేయిస్తాను. ప్రేరణ ద్వారా చదువు సాగుతుందా? చదివించేందుకు నోరు కావాలి కదా. వీరు గోముఖము కదా. వీరు పెద్ద తల్లి కదా, హ్యూమన్ మాత (మానవ మాత). నేను వీరి ద్వారా పిల్లలైన మీకు సృష్టి ఆదిమధ్యాంతాల రహస్యాన్ని అర్థము చేయిస్తాను, యుక్తులు తెలియజేస్తానని బాబా అంటారు. ఇందులో ఆశీర్వాదాల విషయమేమీ లేదు. డైరెక్షన్ పై నడుచుకోవాలి. శ్రీమతము లభిస్తుంది. కృప యొక్క మాటే లేదు. బాబా, పదే పదే మర్చిపోతున్నాము, కృప చూపించండి అని అంటారు. అరే, స్మృతి చేయడం మీ పని. నేనేమి కృప చూపిస్తాను. నాకైతే అందరూ పిల్లలే. కృప చూపిస్తే అందరూ సింహాసనంపై కూర్చోవాలి. చదువు అనుసారంగానే పదవిని పొందుతారు. చదవాల్సింది మీరే కదా. పురుషార్థము చేస్తూ ఉండండి. అతి ప్రియమైన తండ్రిని స్మృతి చేయాలి. పతితాత్మలు తిరిగి వెళ్ళలేవు. మీరు ఎంతగా స్మృతి చేస్తారో, అంతగా స్మృతి చేస్తూ-చేస్తూ పావనంగా అయిపోతారని తండ్రి అంటారు. పావనాత్మలు ఇక్కడ ఉండలేవు. పవిత్రంగా అయినట్లయితే కొత్త శరీరము కావాలి. పవిత్రాత్మలకు అపవిత్ర శరీరము లభించడమనే నియమము లేదు. సన్యాసులు కూడా వికారాలతోనే జన్మ తీసుకుంటారు కదా. ఈ దేవతలు వికారాల ద్వారా జన్మ తీసుకోరు, వారు తిరిగి సన్యాసం చేయవలసిన అవసరం ఉండదు. కావున వారు ఉన్నతమైన వారు కదా. సదా సంపూర్ణ నిర్వికారులుగా ఉన్న వీరే సత్యాతి-సత్యమైన మహాత్ములు. అక్కడ రావణ రాజ్యము ఉండదు. అది ఉన్నదే సతోప్రధాన రామ రాజ్యము. వాస్తవానికి రాముడు అని కూడా అనకూడదు. వారు శివబాబా కదా. దీనిని రాజస్వ అశ్వమేధ అవినాశీ రుద్ర జ్ఞాన యజ్ఞమని అంటారు. రుద్రుడు అన్నా లేక శివుడు అన్నా ఒక్కరే. కృష్ణుడి పేరు లేదు. శివబాబా వచ్చి జ్ఞానము వినిపిస్తారు, వారు మళ్ళీ రుద్ర యజ్ఞాన్ని రచించినప్పుడు మట్టి లింగాన్ని మరియు సాలిగ్రామాలను తయారుచేస్తారు. వాటిని పూజించి మళ్ళీ పగలగొట్టేస్తారు. బాబా దేవీల ఉదాహరణ ఇస్తారు కదా, ఎలాగైతే దేవీలను అలంకరించి, తినిపించి, తాగించి, పూజించి మళ్ళీ ముంచేస్తారు కదా, అలాగే శివబాబాను మరియు సాలిగ్రామాలను చాలా ప్రేమతో మరియు శుద్ధితో పూజించి తర్వాత సమాప్తము చేసేస్తారు. ఇదంతా భక్తి యొక్క విస్తారము. ఎంతగా తండ్రి స్మృతిలో ఉంటారో, అంతగా సంతోషంగా ఉంటారని ఇప్పుడు తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తారు. ఏ తప్పు చేయలేదు కదా అని ప్రతిరోజు రాత్రి మీ లెక్కాపత్రాన్ని చూసుకోవాలి. బాబా, ఈ రోజు నా ద్వారా ఈ తప్పు జరిగింది, క్షమించండి అని మీ చెవులు పట్టుకోవాలి. సత్యము వ్రాసినట్లయితే సగం పాపం తొలగిపోతుందని బాబా అంటారు. తండ్రి అయితే కూర్చుని ఉన్నారు కదా. మీ కళ్యాణము చేసుకోవాలనుకుంటే శ్రీమతంపై నడవండి. లెక్కాపత్రం పెట్టుకున్నట్లయితే చాలా ఉన్నతి జరుగుతుంది. ఖర్చు అయితే ఏమీ లేదు. ఉన్నత పదవిని పొందాలంటే మనసా-వాచా-కర్మణా ఎవ్వరికీ దుఃఖమునివ్వకూడదు. ఎవరైనా ఏమైనా అంటే వినీ విననట్లుగా ఉండాలి. ఈ శ్రమ చేయాలి. పిల్లలైన మీ దుఃఖాలను దూరం చేసి సదా కొరకు సుఖమునిచ్చేందుకే తండ్రి వస్తారు కనుక పిల్లలు కూడా అలాగే తయారవ్వాలి. మందిరాలలో అన్నింటికన్నా మంచి సేవ జరుగుతుంది. అక్కడ ధార్మిక మనస్కులు చాలా మంది మీకు దొరుకుతారు. ప్రదర్శినీలో చాలామంది వస్తారు. ప్రొజెక్టరు కన్నా ప్రదర్శినీలలో, మేళాలలో సేవ బాగా జరుగుతుంది. మేళాలలో ఖర్చవుతుంది అంటే మరి తప్పకుండా లాభము కూడా ఉంటుంది కదా. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. తండ్రి రైట్-రాంగ్ ను అర్థము చేసుకునే బుద్ధినిచ్చారు, ఆ బుద్ధి ఆధారంగా దైవీగుణాలను ధారణ చెయ్యాలి, ఎవ్వరికీ దుఃఖమునివ్వకూడదు. పరస్పరములో సోదరీ-సోదరుల సత్యమైన ప్రేమ ఉండాలి, ఎప్పుడూ చెడు దృష్టి ఉండకూడదు.
2. తండ్రి యొక్క ప్రతి డైరెక్షన్ పై నడుచుకుని బాగా చదువుకుని మీపై మీరే కృప చూపించుకోవాలి. మీ ఉన్నతి కోసం లెక్కాపత్రము పెట్టుకోవాలి, ఎవరైనా దుఃఖమునిచ్చే మాటలు మాట్లాడితే వినీ-విననట్లుగా ఉండాలి.