06.02.1969        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


మహిమ వినటం వదలండి, మహాన్‌గా అవ్వండి.

అందరు స్మృతియాత్రలో కూర్చున్నారా? చదువు యొక్క సారం అయితే అర్ధమైంది కదా! ఆ సారాన్ని జీవితంలోకి తీసుకువచ్చి ప్రపంచానికి ఆ రహస్యాన్ని చెప్పాలి. రచయిత మరియు రచన యొక్క జ్ఞానాన్ని తెలుసుకున్నారు. చాలా విన్నారు. కానీ ఏదైతే విన్నారో ఆ స్వరూపంగా అయ్యి అందరికి చూపించాలి. ఎలా చూపిస్తారు? మీ ప్రతి నడవడిక ద్వారా బాబా మరియు దాదా యొక్క చరిత్ర కనిపించాలి. మీ కళ్ళలో బాబాని చూడాలి. మీ మాట ద్వారా బాబా యొక్క జ్ఞానం వినాలి. ప్రతి నడవడికలో చరిత్ర నిండి ఉండాలి. కేవలం బాబా యొక్క చరిత్ర కాదు, కానీ బాబా చరిత్రను చూసి పిల్లలు కూడా చరిత్రవంతులుగా అవ్వాలి. మీ చిత్రంలో ఈ అలౌకిక చిత్రం చూడాలి. మీ వ్యక్త రూపంలో అవ్యక్తమూర్తి కనిపించాలి. ఇలాంటి పురుషార్ధం చేసి బాప్ దాదా ఏదైతే శ్రమ చేశారో దానికి ఫలస్వరూపం చూపించాలి. అజ్ఞానకాలంలో కూడా కొంతమంది పిల్లలలో తండ్రి కనిపిస్తారు. వారి మాటలు, నడవడిక వారి తండ్రి వలె ఉంటాయి. అదేవిధంగా ఎవరైతే అనన్య పిల్లలు ఉన్నారో ఆ ఒకొక్క బిడ్డ ద్వారా బాబా గుణాలు ప్రత్యక్షం అవ్వాలి మరియు అవుతాయి. ఎలా అవుతాయి? దాని కొరకు ముఖ్య ప్రయత్నం ఏమిటి? ముఖ్య విషయం - సాకారరూపం ద్వారా కూడా చెప్పాను అదే స్మృతియాత్ర, అవ్యక్త స్థితిలో స్థితులై ప్రతి కర్మ చేయాలి. ఇప్పుడు పిల్లలు చాలా ఎదుర్కోవాలి. కానీ సమర్థుడు అయిన బాబా వెంట ఉన్నారు. అందువలన కష్టం ఏమీ లేదు. అందరు కేవలం ఒక విషయం ధ్యాసలో ఉంచుకోవాలి. ఎదుర్కోవటంలో మధ్యలో ఏదో ఒక విఘ్నం వస్తుంది. ఎదుర్కోవడానికి మధ్యలో ఏ విఘ్నం వస్తుందో తెలుసా? (దేహాభిమానం) దేహాభిమానం అనేది ముఖ్యమైనది కానీ ఎదుర్కోవడానికి మధ్యలో కోరిక విఘ్నం వేస్తుంది. అది ఏమిటి? నాకు పేరు కావాలి, నేను అలా ఉంటాను, నా సలహా ఎందుకు తీసుకోలేదు, నాకు విలువ ఎందుకు ఇవ్వలేదు? ..... ఇలా అనేక రకాల కోరికలు ఎదుర్కోవడంలో విఘ్నరూపంగా అవుతాయి. కనుక మాకు ఏ కోరిక ఉండకూడదు, ఎదుర్కోవాలి అని స్మృతిలో ఉంచుకోవాలి. మీకు ఒకవేళ ఏ కోరిక ఉన్నా ఎదుర్కోలేరు. అవ్యక్తస్థితిలోకి మహాగా అవ్వడానికి ఒక విషయం ఏదైతే చెప్తున్నానో దానిని ధారణ చేస్తే చాలా త్వరగా మరియు సహజంగా అవ్యక్త స్థితిలో స్థితులు కాగలరు. ఆ విషయం ఏమిటి? మేము అతిథులం అని భావించటం ద్వారా మహాన్ స్థితిలో స్థితులు కాగలరు. అతిధికి బదులు కొంచెం అయినా, ఒక మాటలో అయినా తేడా వచ్చినా పడిపోతారు, ఆ మాట ఏమిటి? అతిధిగా (మెహమాన్) భావించాలి కానీ మహిమలోకి రాకూడదు. మహిమలోకి వస్తే అతిధిగా కాలేరు. అతిధిగా భావిస్తే మహాన్‌గా అవుతారు. మెహమాన్ మరియు మహిమ రెండింటిలో తేడా కొంచెమే, కానీ కొంచెం తేడా వచ్చినా స్థితి అలజడి అయిపోతుంది. మీరు అందరికి ఏ జ్ఞానం ఇస్తారు? త్రిమూర్తి జ్ఞానం ఇస్తారు కదా! ఎలా అయితే త్రిమూర్తి జ్ఞానం ఇతరులకి ఇస్తారో అలాగే మీకు కూడా మూడు విషయాల జ్ఞానం ఉండాలి. మూడు విషయాలను వదలండి మరియు మూడు విషయాలను ధారణ చేయండి. మూడు విషయాలు వదిలినప్పుడే స్వరూపంలో స్థితులవుతారు. ఏవైతే సేవలో విఘ్నాలు వేస్తాయో వాటిని వదలాలి. 1. ఎప్పుడూ కూడా ఏ సాకు చెప్పకూడదు. 2.ఎప్పుడూ సేవ కొరకు ఇతరులచే చెప్పించుకోకూడదు 3. సేవ చేస్తూ వాడిపోకూడదు. ఈ మూడు విషయాలను వదలాలి. మరి ఏ మూడు విషయాలను ధారణ చేయాలి? త్యాగం, తపస్సు మరియు సేవ. ఈ మూడు విషయాలను ధారణ చేయాలి. తపస్సు అంటే స్మృతియాత్ర మరియు సేవ లేకుండా జీవితం కూడా తయారవ్వదు. ఈ విషయాల యొక్క సఫలత త్యాగం లేకుండా జరగదు. అందువలన మూడు విషయాలను వదలాలి మరియు మూడు విషయాలను ధారణ చేయాలి.

ఈ మూడు విషయాలు ధారణ చేయటం ద్వారా ఏవిధంగా అవుతారు? మీకు ఏదైతే మహిమ జరుగుతుందో ఆ స్వరూపంగా తయారవుతారు. ఇక్కడ ఆబూలో కూడా ఏ రూపంలో మరియు ఏ స్మృతి చిహ్న రూపంలో మీకు మహిమ జరుగుతుంది? (దిల్వాడా మందిరం). తపస్సుతో పాటు ఇంకా ఏ రూపానికి స్మతిచిహ్నం ఉంది? ఎవరైతే దిల్వాడా మందిరం ధ్యాసగా చూసారో వారికి జ్ఞాపకం ఉంటుంది. తపస్వితో పాటు త్రినేత్రిగా కూడా చూపించారు. తనస్సుతో పాటు వెనువెంట త్రిమూర్తి స్మృతి ఉండాలి. త్రినేత్రి స్మృతిచిహ్నం ఉంది కదా, అలా తయారవ్వాలి. అయితే మూడవ నేత్రం అంటే ఏమిటి? జ్ఞాన నేత్రం. జ్ఞానం యొక్క మూడవ నేత్రాన్నే స్మృతిచిహ్న రూపంలో చూపించారు. తపస్వి మరియు త్రినేత్రిగా అవ్వాలి. మూడవనేత్రం స్థిరంగా ఉంటేనే తపస్వీ కాగలరు. జ్ఞాననేత్రం మాయం అయితే తపస్సు ఉండదు. అందువలన ఇప్పుడు త్రిమూర్తి మాటని కూడా స్మృతి చేస్తూ ధారణలో నడిస్తే అలా తయారవుతారు. అప్పుడు ఏదైతే శక్తుల మహిమ మరియు ప్రభావం ఉందో అది ప్రత్యక్షం అవుతుంది. ఇప్పుడు గుప్తంగా ఉంది. ఇప్పటి వరకు శక్తులు ఎందుకు గుప్తంగా ఉన్నారు? ఎందుకంటే ఇప్పటి వరకు మీ స్వమానం, మీ సేవ మరియు మీ శ్రేష్టతలు మీలోనే గుప్తంగా ఉన్నాయి. మీతో మీరే గుప్తంగా ఉన్న కారణంగా సృష్టిలో కూడా గుప్తంగా ఉన్నారు. ఎప్పుడైతే మీలో ప్రత్యక్షత వస్తుందో అప్పుడు సృష్టిలో కూడా ప్రత్యక్షం అవుతారు.

ఇప్పుడు శివరాత్రి ఉత్సవం వస్తుంది కదా! శివరాత్రిని చాలా అట్టహాసంగా జరుపుకోవాలి. చాలా ఉత్సాహం మరియు ఉల్లాసంతో పరిచయం ఇవ్వాలి. ఎందుకంటే బాబా పరిచయంలోనే పిల్లల పరిచయం కూడా వచ్చేస్తుంది. బాబా పరిచయం మీరు ఇస్తే బాబా మరలా అవ్యక్తంలో పిల్లల పరిచయం, పిల్లల సాక్షాత్కారం ఆత్మలకి చేయిస్తారు. కనుక ఈ శివరాత్రికి ఏదో ఒక నవీనత చూపించాలి. ఏ నవీనత చూపిస్తారు? ఇప్పటి వరకు ఏదైతే ఉపన్యాసం చెప్పారో అది యోగం మరియు శక్తిననుసరించి మంచిగానే చెప్పారు కానీ ఇప్పుడు విశేషంగా శక్తి రూపంతో ఉపన్యాసం చెప్పాలి. శక్తిరూపం యొక్క ఉపన్యాసం ఎలా ఉంటుంది? సవాలు చేయాలి. ఏ సవాలు చేస్తారు. ఇంకా ఎక్కువ శక్తిరూపంతో సమయం యొక్క గ్రహింపునివ్వండి. మరియు బాబా కర్తవ్యం ఇప్పుడు ఎక్కువ సమయం నడవదు అని మాటిమాటికి చెప్పాలి. కొంచెం సమయం చేతులారా పోగొట్టుకున్నారు. కానీ ఏదైతే కొద్ది సమయం ఉందో దానిని కూడా పోగొట్టుకోకండని శక్తిశాలిగా సమయం యొక్క గ్రహింపునివ్వండి. ఎలా అయితే ఈ రోజులలో సైన్స్ వాళ్ళు బాంబులు తయారు చేస్తున్నారు. తమ స్థానంలో కూర్చుని కూడా, దూరం నుండే ఎక్కడ బాంబు వేయాలో అక్కడ వేయగలరు. విజ్ఞానశక్తి కంటే శాంతిశక్తి శ్రేష్టమైనది. ఎలా అయితే విజ్ఞానం వారు బాంబులు తయారు చేస్తున్నారో అలాగే ఇప్పుడు శక్తులని శాంతి శక్తితో బాంబు వలె ప్రయోగించాలి. ఆదిలో శక్తుల సవాలు నడిచేది. ఆదిలో వలె ఇప్పుడు సవాలు లేదు. ఇప్పుడు విస్తారంలోకి వచ్చేశారు. విస్తారంలోకి రావటం ద్వారా సవాలు చేసే రూపం గుప్తం అయిపోతుంది. ఇప్పుడు మరలా బీజరూప స్థితిలో స్థితులై సవాలు చేయండి. ఆ సవాలు ద్వారా కొంతమందిలో బీజం పడుతుంది. కానీ బీజరూప స్థితిలో స్థితులైతే అనేక ఆత్మలలో సమయం యొక్క గ్రహింపు మరియు బాబా యొక్క గ్రహింపు అనే బీజం పడుతుంది. ఒకవేళ బీజరూప స్థితిలో స్థితులవ్వకుండా కేవలం విస్తారంలోకి వెళ్ళటం ద్వారా ఏమవుతుంది? ఎక్కువ విస్తారం వలన కూడా విలువ ఉండదు. వ్యర్థం అయిపోతుంది. అందువలన బీజరూప స్థితిలో స్థితులై, బీజరూపి బాబా యొక్క స్మృతిలో స్థితులై బీజం వేయండి. అప్పుడు చూడండి - బీజం యొక్క ఫలం ఎంత మంచిగా మరియు సహజంగా లభిస్తుందో! ఇప్పటి వరకు శ్రమ ఎక్కువ చేశారు, ప్రత్యక్షఫలం తక్కువగా ఉంది. ఇప్పుడు శ్రమ తక్కువ చేయండి, ప్రత్యక్షఫలం ఎక్కువ చూపించండి.

స్నేహం అయితే అందరికీ ఉంది కానీ స్నేహం యొక్క స్వరూపం కూడా కొంచెం చూపించాలి. వాస్తవానికి సదా ఈ స్థితిలో ఉండాలి కానీ విశేషంగా శివరాత్రి వరకు ప్రతి ఒక్కరు ఈ స్థితిలో ఉండాలి. ఎలా అయితే ఆదిలో పిల్లల కొరకు భట్టి ప్రోగ్రామ్ నడిచేదో అలాగే ప్రతి ఒక్కరు శివరాత్రి వరకు స్మృతియాత్ర అనే ఈ భట్టీలోనే ఉండాలి. పూర్తిగా అవ్యక్త స్థితిలో ఉండేటందుకు, మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకునే ధ్యాస ఉంచుకోండి. తర్వాత అవ్యక్తస్థితి యొక్క ప్రభావం బాగా వస్తుంది. కష్టం కాదు, చాలా సహజం. కార్య వ్యవహారంలోకి వస్తూ కూడా భట్టి చేయగలరు. ఇది ఆంతరంగిక స్థితి. ఆంతరంగిక స్థితి యొక్క ప్రభావం ఎక్కువగా పడుతుంది. అందరూ అమృతవేళ ఆత్మిక సంభాషణ చేస్తున్నారా? ఇప్పటి వరకు ఇలాంటి వాయుమండలం చేరలేదు. ఇప్పటి వరకు మధువనం వారు కూడా స్నేహం యొక్క ప్రత్యక్షత ఇవ్వలేదు. నలువైపులా చాలా తక్కువమంది పిల్లలు స్నేహం యొక్క ప్రత్యక్షతను ఇచ్చారు. బాబాకి పిల్లలపై ఎంత స్నేహం ఉండేది? ఆ స్నేహానికి ప్రత్యక్షతగా పిల్లల కొరకు ఎంతో సమయాన్ని ఉపయోగించేవారు. ప్రత్యక్షతను ఎలా ఇచ్చేవారు? జ్ఞాపకం ఉందా? తను ఆరోగ్యం కూడా చూసుకోకుండా ఏ ప్రత్యక్షతను ఇచ్చారు? తన శారీరక శక్తిని కూడా చూసుకోకుండా ఎంతో సమయం ఎక్కువగా శక్తి ఇస్తూ ఉండేవారు. ఎంతో సమయం స్నేహం యొక్క ప్రత్యక్షతను ఇచ్చేవారు. మీరు శరీరంపై ప్రభావం పడుతుంది అని చెప్పినా కానీ బాబా తన శరీరం గురించి చూసుకున్నారా? ఇదీ స్నేహం యొక్క ప్రత్యక్షత! బాబా ఏ కర్మ చేసి చూపించారో అదే చేయాలి. అమృతవేళ బాబా ఎలా చేసి చూపించారో పిల్లలు కూడా అదేవిధంగా చేయాలి. ఇప్పటి వరకు ఈ ఫలితం చూశారు - ఈ విషయంలో మీ మనస్సుని సంతోషం చేసుకుంటున్నారు. లేచాము మరియు కూర్చున్నాము అనుకుంటున్నారు. కానీ ఆత్మీయత శక్తి స్వరూపంతో నిండిన స్మృతి ఉండటం లేదు. శక్తిరూపానికి బదులు ఏమి కలిసిపోతుంది? సోమరితనం. సోమరితనం కలవటం వలన సంభాషణ చేస్తున్నా కాని లైన్ స్పష్టంగా ఉండటం లేదు. అందువలన ఆత్మిక సంభాషణలో ఏదైతే అనుభవం చేసుకోవాలో అది చేసుకోవటం లేదు. కల్తీ ఉంది. కనుక ఇక్కడ ప్రారంభిస్తే మధువన నివాసీయులని చూసి అందరు చేస్తారు. మధువన నివాసీయులలో ఎవరైతే విశేష స్నేహిలు ఉన్నారో వారు పరిశీలన చేయాలి. స్నేహంలో స్వతహాగానే అర్పణ చేయగలరు. మంచిది.