13.03.1969        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


ప్రేమ మరియు శక్తి రెండు గుణాల యొక్క సమానత.

 ఆత్మాభిమానియై స్మృతియాత్రలో కూర్చున్నారా? స్మృతియాత్రలో కూడా ముఖ్యంగా ఏ గుణంలో స్థితులయ్యారు? స్మృతియాత్రలో ఉంటూ కూడా ముఖ్యంగా ఏ గుణ స్వరూపంగా ఉన్నారు? ఈ సమయంలో మీ ముఖ్య గుణం ఏమిటి? (అందరు తమ తమ ఆలోచన చెప్పారు). ఈ సమయంలో అందరూ విశేషంగా ప్రేమ స్వరూప స్థితిలో స్థితులై ఉన్నారు. కానీ ప్రేమతో పాటు వెనువెంట వర్తమాన సమయం యొక్క పరిస్థితులు అనుసరించి ఎంత ప్రేమ స్వరూపమో అంత శక్తి స్వరూపంగా కూడా ఉండాలి. దేవీల చిత్రంలో చూస్తే ముఖ్యంగా ఏ విశేషత ఉంటుంది? మీ చిత్రాన్ని ఎప్పుడూ ధ్యాసగా చూసుకోలేదా? దేవీల చిత్రం తయారుచేసేటప్పుడు కాళికాదేవికి తప్ప మిగిలిన దేవతల నయనాలు సదా ప్రేమతో చెమ్మగిల్లినట్లు చూపిస్తారు. ప్రేమలో మునిగియున్న నయనాలు చూపిస్తారు మరియు వెనువెంట వారి ముఖం ఏదైతే తయారుచేస్తారో ఆ ముఖంలో శక్తి సంస్కారం కనిపిస్తుంది. కానీ నయనాలలో ప్రేమ, దయ, శీతలత కనిపిస్తాయి. తల్లి స్థితి యొక్క ప్రేమ సంస్కారం నయనాలలో కనిపిస్తుంది. వారి వాహనం లేదా అస్త్రశస్త్రాలు వారి శక్తి రూపాన్ని ప్రకటిస్తాయి. అలాగే శక్తులైన మీలో కూడా రెండు గుణాలు సమానంగా ఉండాలి. ఎంత శక్తి స్వరూపమో అంత ప్రేమ స్వరూపంగా ఉండాలి. కానీ ఇప్పటి వరకు రెండూ లేవు. అప్పుడప్పుడు ప్రేమ యొక్క అలలలో, అప్పుడప్పుడు శక్తి రూపంలో స్థితులవుతున్నారు. రెండూ వెనువెంట మరియు సమానంగా ఉండాలి. ఇది శక్తిస్థితి యొక్క అంతిమ సంపూర్ణతకు గుర్తు. ఇప్పుడు బాప్ దాదాకి తన పిల్లల మస్తకంలో ఏమి కనిపిస్తుంది? మీ మస్తకంలో చూసుకున్నారా? ప్రాలబ్దాన్ని చూసుకుంటున్నారా? లేక వర్తమాన సౌభాగ్యం యొక్క సితార చూసుకుంటున్నారా? లేక ఇంకేదైనా చూసుకుంటున్నారా? (ప్రతి ఒక్కరు తమ ఆలోచన చెప్పారు) మూడు సంబంధాల ద్వారా మూడు విషయాలు కనిపిస్తున్నాయి. అందువలనే మీకు త్రిశూలం కానుకగా పంపారు. మూడు సితారలు కనిపిస్తున్నాయి. 1. భవిష్య సితార 2. వర్తమాన సౌభాగ్య సితార 3. పరంధామంలో మీ ఆత్మ యొక్క సంపూర్ణస్థితి యొక్క సీతార...మూడు సితారలు కనిపిస్తున్నాయి. ఈ మూడు సితారలు చూసుకుంటూ ఉండాలి. అప్పుడప్పుడు సితారల మధ్యలో మేఘాలు వస్తాయి. అప్పుడప్పుడు సితారలు స్థానం మారతాయి. అప్పుడప్పుడు రాలిపోతాయి. ఇక్కడ కూడా అలాగే సితారలు స్థానం మార్చుకుంటున్నాయి. ఒకొక్కసారి రాలిపోతున్నాయి. అప్పుడప్పుడు చూస్తే చాలా పైన, అప్పుడప్పుడు మధ్యలో, అప్పుడప్పుడు చాలా క్రింద కనిపిస్తున్నాయి. ఇప్పుడు స్థానం కూడా మారకూడదు. ఒకవేళ మారాలంటే ముందుకు వెళ్ళండి, కానీ క్రిందకి దిగకండి. అవినాశి సంపూర్ణ స్థితిలో సదా పైకి ఎక్కుతూ ఉండండి. పడిపోవటం అనే విషయమే లేదు. మంచి పురుషార్థులందరూ కూర్చున్నారు. ఇప్పుడు కేవలం స్థానం మారటం అనే విషయం మార్చుకోవాలి. కుమారీల ఫలితం ఎలా ఉంది? ఏమని భావిస్తున్నారు? విశేషంగా ఏ విషయంలో ఉన్నతి జరిగిందని భావిస్తున్నారు? (ప్రతి ఒక్కరు తమ తమ విషయాలు చెప్పారు) స్మృతియాత్రలో లోపం ఉంది. అందువలన అంత అనుభూతి ఉండటం లేదు. అమృతవేళ స్మృతియాత్ర యొక్క అనుభవం అంతగా ఉండటం లేదు. సాకార బ్రహ్మాబాబా బయట చల్లగాలిలో విహరింపచేసేవారు, లక్ష్యం కూడా ఇచ్చేవారు, యోగం యొక్క అనుభూతిని కూడా చేయించేవారు. ఈ విధంగా ఎవరైతే కుమారీలకు నిమిత్త టీచర్స్ ఉన్నారో వారు వారిని అరగంట ఏకాంతంలో విహరించనివ్వాలి. ఎలా అయితే ఆదిలో మీరు వేర్వేరుగా కూర్చునేవారు, కొందరు సాగరపు ఒడ్డున, కొందరు అక్కడ, కొందరు ఇక్కడ అలా కూర్చునేవారు. ఈవిధంగా అభ్యాసం చేయించండి. స్థానాలు కూడా ఇక్కడ చాలా పెద్దవిగా ఉన్నాయి. సాయంత్రం సమయం కూడా 7గం|| నుండి 7.30 ని॥లు వరకు సమయం విశేషంగా మంచిగా ఉంటుంది. ఎలా అయితే అమృతవేళ సతోగుణి సమయమో అలాగే సాయంత్రం 5గం|| సమయం కూడా అలాగే ఉంటుంది. విహరించడానికి కూడా ఈ సమయాన్నే తీస్తారు. ఈ సమయంలో సంఘటనగా యోగం చేయించండి. మధ్యమధ్యలో అవ్యక్తరూపంలో మాట్లాడుతూ ఉండండి. అప్పుడు ఎవరి బుద్ధియోగం అటుఇటు వెళ్ళకుండా ధ్యాస ఉంటుంది. యోగా సబక్టులో చాలా లోపం ఉంది. ఉపన్యాసం చెప్పటం, ప్రదర్శినిలో చెప్పటం ఇదైతే ఈ రోజుల్లోని స్కూల్ కుమారీలకు ట్రైనింగ్ ఇస్తే చాలా బాగా చెప్తారు. కానీ జీవితంలో అతీంద్రియ సుఖం యొక్క అనుభవం చేసుకోవాలి కదా! కనుక ఆ సమయంలో బాప్ దాదా యొక్క ఆహ్వానంపై వెళ్తున్నాను అని భావించండి. ఎలా అయితే బాప్ దాదా షైర్ చేస్తారో అలాగే మీరు కూడా బుద్ధి యోగబలం ద్వారా షైర్ చేయగలరు. ఎప్పుడైతే స్మృతియాత్ర యొక్క అనుభవం చేసుకుంటారో అప్పుడు అవ్యక్త స్థితి యొక్క ప్రభావం మీ నయనాల ద్వారా, నడవడిక ద్వారా ప్రత్యక్షంగా కనిపిస్తుంది. మరలా వారి ద్వారా మాల తయారు చేయిస్తారు. ఆదిలో మీరే స్వయం మాల తయారుచేసేవారు కదా!

ఈ గ్రూపుకి ఉత్సాహ ఉల్లాసాలు మంచిగా ఉన్నాయి. ఇక ఒక విషయం విశేషంగా ధ్యాసలో ఉంచుకోవాలి - ఒకరి సంస్కారాలు ఒకరు తెలుసుకుని ఒకరి స్నేహంలో ఒకరు పూర్తిగా కలవాలి. ఎవరి పైనైనా విశేష స్నేహం ఉంటే వారితో ఎలా కలిసిపోతారో అలాగే అందరు ఒకరికొకరు కలవాలి. ఎప్పుడైతే ఇలా కుమారీలు ప్రత్యక్షం చేసి చూపిస్తారో అప్పుడు ఇతర కుమారీలు కూడా సేవ చేయడానికి నిమిత్తమవుతారు. మరియు ఎవరైతే నిమిత్తంగా అవుతారో వారికి ఫలం కూడా లభిస్తుంది. అనేక కుమారీలకు ఉత్సాహ ఉల్లాసాలు ఇవ్వడానికి, వారిలో ఉన్నతి తీసుకురావడానికి మీరు షోపీస్. ఎంత ఉత్సాహంతో సాకారుడు, నిరాకారుడు కలిసి ఈ ప్రోగ్రామ్ తయారుచేశారో అంతగానే దీని యొక్క కాంతిని చూపించాలి. అప్పుడు అనేక కుమారీల ఉన్నతికి నిమిత్తమవుతారు, మీ తోటివారిని కూడా రక్షించగలరు.

కుమారీలంటే బాప్ దాదాకి విశేష స్నేహం. ఎందుకంటే బాప్ దాదా పరమ పవిత్రుడు మరియు కుమారీలు కూడా పవిత్రమైనవారు. కనుక పవిత్రత, పవిత్రతను ఆకర్షిస్తుంది. వర్తమాన సమయంలో ఇదే ముఖ్య విశేషత ఉండాలి - ప్రతి ఒక్క మహారథి యొక్క కర్తవ్యం తమ గుణాలను ఇతరులలో నింపాలి. ఎలా అయితే జ్ఞానదానం చేస్తున్నారో అలాగే గుణదానం చేయాలి.. జ్ఞానరత్నాలను దానం చేయటం ద్వారా మహారథిగా పిలవబడుతున్నారు. అలాగే గుణాల దానం కూడా చాలా గొప్పదానం, జ్ఞానం ఇవ్వటం సహజమే, గుణదానం చేయటంలో కొంచెం శ్రమ ఉంది. గుణాలు దానం చేయడంలో మహారధీలలో మొదటి నెంబరు ఎవరు? జానకి దాది. ఈ గుణం వారిలో విశేషంగా ఉంది. ఇలా ఒకరి నుండి ఒకరు గుణాలు తీసుకోవాలి.

(ఆబూ మ్యూజియం తయారీ విషయంలో బాప్ దాదాని అడిగారు)

దూరదేశీ మరియు విశాలబుద్ధి గల వారిగా అయ్యి మ్యూజియం తయారుచేయాలి. మొదటే భవిష్యత్తుని ఆలోచించి సమయాన్ని సఫలం చేసే గుణాన్ని ధారణ చేయాలి మరియు సమయానికి తయారవ్వాలి. త్వరగా మరియు సంపూర్ణంగా అయితే అద్భుతంగా ఉంటుంది. ఒకవేళ ఏదైనా లోపం ఉంటే లోపం వైపు అందరి దృష్టి వెళ్తుంది. ఇలా లోపం ఉండకూడదు. అందరి నోటి నుండి అద్భుతం అని రావాలి. మొత్తం దైవి పరివారం మీ ముఖాన్ని మ్యూజియం అనే దర్పణంలో చూస్తారు.