26.05.1969        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


సంపూర్ణ స్నేహం యొక్క పరిశీలన

అందరు ఏ స్థితిలో కూర్చున్నారు? సంలగ్నతలో కూర్చున్నారా లేక మగ్న స్థితిలో కూర్చున్నారా? ఏ స్థితిలో ఉన్నారు? ఎక్కువ సమయం సంలగ్నత జోడించడంలో వెళ్ళిపోతుందా లేక మగ్నరూపంలో ఉన్నారా? మీ పరిశీలన అయితే చేసుకుంటున్నారు కదా. మంచిది! అందరికీ మా పేపర్ యొక్క ఫలితం తెలియాలి అనే కోరిక ఉంది. విశేషంగా అందరి మనస్సులో ఇదే సంకల్పం నడుస్తుంది. కనుక ఈరోజు మొత్తం ఫలితం చెప్తున్నాను. అందరు ఏదైతే శక్తిననుసరించి వ్రాసారో శక్తిననుసరించి మొత్తం ఫలితంలో బాబాపై ఎంత నిశ్చయం ఉందో అంతగానే బాబా మహావాక్యాలపై, ఆపై నిశ్చయబుద్ది అయ్యి నడవాలి. అది ఇప్పుడు పురుషార్ధంలో 50 శాతమే కనిపిస్తుంది. బాబాపై నిశ్చయం 100% ఉంది. కానీ బాబా యొక్క మహావాక్యం మరియు ఆజ్ఞలలో నిశ్చయబుద్ధి అయ్యి ఏ ఆజ్ఞ లభిస్తే అది చేయాలి. ఇలా ఆజ్ఞపై నిశ్చయబుద్ది అవ్వటంలో ఎక్కువమంది ఫలితం 50% కనిపిస్తుంది. అలాగే టీచర్ పై నిశ్చయం ఉంది కానీ ఆయన చెప్పే చదువు అనుసారంగా పూర్తిగా నడవటంలో తమతమ శాతాలలో ఫలితం ఉంది. అలాగే గురువు రూపంలో కూడా సద్గురువు అని పూర్తి నిశ్చయం ఉంది కానీ ఆయన శ్రీమతం పై నడవటంలో 50% నిశ్చయం ఉంది. కేవలం తండ్రి, టీచర్, సద్గురువుపై నిశ్చయమే కాదు కానీ ఆ నిశ్చయంతో పాటు ఆయన ఆజ్ఞ, చదువు మరియు శ్రీమతంపై కూడా సంపూర్ణ నిశ్చయబుద్ధి అయ్యి నడవాలి. దీనిలో లోపం ఉంది. దీనిని ఇప్పుడు పూరించుకోవాలి. స్నేహానికి గుర్తు ఏమిటి? సంపూర్ణ స్నేహిల పరిశీలన ఏమిటి? వారి ముఖ్య లక్షణాలు ఏవి? మీరు అందరు ఏవైతే వినిపించారో అవి అన్నీ సరే కానీ ఎవరికి, ఎవరితో స్నేహం ఉంటుందో వారి ముఖంలో ఆ స్నేహి ముఖమే కనిపిస్తుంది. వారి నయనాలలో అదే వెలుగు కనిపిస్తుంది. వారి నోటి నుండి కూడా స్నేహం యొక్క మాటలే వస్తాయి. వారి ప్రతి నడవడిక ద్వారా స్నేహం యొక్క చిత్రం కనిపిస్తుంది. వారి నయనాలలో వారే కనిపిస్తారు. వారిలో ఆ స్నేహియే ఇమిడి ఉంటారు. ఇలాంటి స్థితి ఉండాలి. ఇప్పుడు పిల్లలు మరియు బాబా సంస్కారాలలో చాలా తేడా ఉంది. ఎప్పుడైతే సమానం అయిపోతారో అప్పుడు ఇక మీ సంస్కారాలు కనిపించవు, అవే కనిపిస్తాయి. ఒకొక్కరిలో బాబాని చూస్తారు. మీ అందరి ద్వారా బాబా యొక్క సాక్షాత్కారం అవుతుంది. కానీ ఇప్పుడు అదే లోపంగా ఉంది. ఇలాంటి స్నేహీ అయ్యానా? అని మిమ్మల్ని మీరు అడగండి. స్నేహం జోడించటం కూడా సహజమే. స్నేహ స్వరూపంగా అవ్వటం అనేది అంతిమ స్థితి. కనుక పేపర్ యొక్క ఫలితం వినిపించాను. ఇది ఒక లోపం. రెండవ విషయం అందరు ఏదైతే వ్రాసారో దానిలో సహనశక్తి యొక్క ఫలితం చాలా తక్కువగా ఉంది. ఎంతటి సహనశక్తి ఉంటుందో అంత సేవలో సఫలత వస్తుంది. సంఘటనలో ఉండడానికి కూడా సహనశక్తి కావాలి. అంతిమ వినాశనం యొక్క పేపర్లో పాస్ అవ్వడానికి కూడా సహనశక్తి కావాలి. ఈ సహనశక్తి యొక్క ఫలితం చాలామందిలో తక్కువగా ఉంది. అందువలన ఇప్పుడు దీనిని పెంచుకోండి. ఎంతెంత స్నేహి అవుతారో అంత సహనశక్తి వస్తుంది. ఎంత, ఎవరి పట్ల స్నేహం ఉంటుందో ఆ స్నేహంలో శక్తి వస్తుంది. స్నేహంలో సహనశక్తి ఎలా వస్తుందో అనుభవం చేసుకున్నారా? పిల్లలకి ఆపద వస్తే తల్లికి పిల్లల పట్ల స్నేహం కారణంగా ఆ తల్లిలో సహనశక్తి వస్తుంది. పిల్లల కోసం అన్ని సహించడానికి సిద్ధమవుతుంది. ఆ సమయంలో స్నేహంతో తన తనువు లేదా తన పరిస్థితి గురించి కూడా చింతించదు. అలాగే ఒకవేళ నిరంతర స్నేహి అయితే ఆ స్నేహంలో సహించటం కష్టం అనిపించదు. స్నేహం తక్కువగా ఉన్న కారణంగా సహనశక్తి కూడా తక్కువగా ఉంది. ఇది మీ అందరి పేపర్ల ఫలితం. మరలా ఒక నెల తర్వాత ఫలితం చూస్తాను. మామూలుగా మూడు నెలలకు ఒకసారి పరీక్ష ఉంటుంది. కానీ ఇక్కడ ఒక నెల తర్వాత స్నేహ రూపంగా ఎంత వరకు అయ్యారు అనే ఫలితం చూస్తాను. ముఖ్యమైనది నిర్భయతా గుణం. అది పేపర్లో ఇవ్వలేదు. ఎందుకంటే ఇది చాలా లోపంగా ఉంది. ఒక నెల తర్వాత ఈ నిర్భయతా గుణాన్ని కూడా మీలో పూర్తిగా నింపుకోవడానికి ప్రయత్నం చేయాలి. నిర్భయత ఎలా వస్తుంది? దీని కొరకు ముఖ్య సాధనం ఏమిటి? నిరాకారిగా అవ్వాలి. ఎంత నిరాకారి స్థితిలో ఉంటారో అంత నిర్భయంగా అవుతారు. భయం అయితే శరీరం గురించి ఉంటుంది.

ఈ ఒక నెల యొక్క చార్ట్ ముందుగానే చెప్తున్నాను. కుమారీల ట్రైనింగ్ క్లాస్ అయిన తర్వాత సహనశక్తి, నిర్బయత మరియు నిశ్చయం ఎంతవరకు వచ్చాయి అని అడుగుతాను. ఈ మూడు విషయాల పేపర్ తర్వాత ఇస్తాను. కుమారీలపై బాప్ దాదాకి విశేష స్నేహం ఎందుకు ఉంటుంది? ఏ విషయం కారణంగా బాప్ దాదాకి ఎక్కువ స్నేహం ఉంటుంది? ఎందుకంటే బాప్ దాదా భావిస్తున్నారు, ఒకవేళ వీరికి ఈశ్వరీయ స్నేహం లభించకపోతే ఎవరొకరి స్నేహంలో తగులుకుని ఉండేవారు. బాబా దయాహృదయుడు కదా! దయ కారణంగానే స్నేహం ఉంది. భవిష్యత్తు రక్షణ కొరకు విశేష స్నేహం ఉంది. ఇప్పుడు బాప్ దాదా స్నేహానికి ఏమి జవాబు ఇస్తారో చూస్తాను. మిమ్మల్ని మీరు రక్షించుకోవటమే బాప్ దాదా స్నేహానికి జవాబు. ఏయే విషయాలలో మిమ్మల్ని మీరు రక్షించుకోవాలో తెలుసా? మనసా సహితంగా పవిత్రంగా ఉండాలి. మనస్సులో ఏ సంశయం రాకూడదు. నోటి నుండి కూడా సంశయం యొక్క మాటలు రాకూడదు. మనస్సులో మరియు వాక్కులో కూడా అదుపు ఉండాలి. సాకారంలో బాప్ దాదా సమానంగా మాట ఉండాలి. సాకార తనువు ద్వారా ఏదైతే కర్మ చేసి చూపించారో ఆవిధమైన కర్మ చేయాలి. ఇది కుమారీలు తీసుకోవలసిన జాగ్రత్త మరియు దేని నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి? సాంగత్యదోషం నుండి అయితే రక్షించుకోవాల్సిందే కానీ మరొక విశేష విషయం - ఇప్పుడు చాలా రూపాల ద్వారా ఆత్మ రూపం ద్వారా, శరీర రూపం ద్వారా మిమ్మల్ని ప్రక్కదారి పట్టించేవారు వస్తారు. కానీ వాటిలో భ్రమించకూడదు. చాలా పరీక్షలు వస్తాయి కానీ భయపడవలసినది లేదు. కానీ ఎవరికైతే పూర్తి పరిశీలన ఉంటుందో వారే పరీక్షలలో పాస్ అవుతారు. పరిశీలనా శక్తి తక్కువగా పెట్టుకుంటున్నారు. ఇది ఏ రకమైన విఘ్నం? మాయ ఏ రూపంలో వస్తుంది. నా ఎదురుగా ఈ విఘ్నం ఎందుకు వచ్చింది? దీని ఫలితం ఏమిటి? అనే పరిశీలన తక్కువగా ఉన్న కారణంగా ఫెయిల్ అయిపోతున్నారు. పరిశీలన బాగా ఉన్నవారే పరీక్షలలో పాస్ అవుతారు. మంచిది.