18.06.1974        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


లైట్‌హౌస్(ప్రకాశగృహం) మరియు మైట్‌హౌస్(శక్తి గృహం)గా అయ్యి క్రొత్త ప్రపంచాన్ని తయారు చేసేవారిగా అవ్వండి.

సర్వాత్మలను సర్వశక్తులతో సంతుష్టం చేసేటువంటి క్రొత్త ప్రపంచ నిర్మాత లేదా విశ్వకళ్యాణకారి శివపిత మాట్లాడుతున్నారు-

స్వయాన్ని లైట్‌హౌస్ మరియు మైట్‌హౌస్ గా భావించి నడుస్తున్నారా? కేవలం లైట్‌గా మరియు మైట్‌గా భావించి నడవటం కాదు. కానీ లైట్‌హౌస్ మరియు మైట్‌హౌస్ అంటే లైట్ మరియు మైట్ ఇచ్చేటువంటి దాత హౌస్ గా ఎప్పుడు అవుతారంటే స్వయం పట్ల స్టాక్ జమ చేసుకున్నప్పుడు. ఒకవేళ స్వయం సదా లైట్ స్వరూపంగా కాకపోతే లేదా లైట్ స్వరూపంలో సదా స్థితులవ్వకపోతే వారు ఇతరాత్మలకు లైట్ హౌస్ గా అయ్యి లైట్ ఇవ్వలేరు. ఎవరైతే స్వయం మాస్టర్ సర్వశక్తివంతులు అయ్యుండి, స్వయం పట్ల కూడా సర్వశక్తులు ఉపయోగించుకోకపోతే వారు మైట్‌హౌస్ గా అయ్యి ఇతరాత్మలకు సర్వశక్తులను ఎలా దానం ఇవ్వగలరు? ఒకవేళ ఏ ఆత్మ అయినా ఏదైనా శక్తి పొందాలనే కోరికతో మీ ఎదురుగా వస్తే ఆ ఆత్మకు ఆ శక్తి ఇవ్వగలరా? ఒకవేళ సహనశక్తి లేదా నిర్ణయించే శక్తి యొక్క కోరికతో ఎవరైనా వచ్చారు, వారికి మీరు ఇముడ్చుకునే శక్తి లేదా పరిశీలించే శక్తి దానం ఇచ్చారు, కానీ ఆ సమయంలో ఆ ఆత్మకు సహనశక్తి అవసరం. అది మీరు ఇవ్వలేదు అంటే అటువంటి ఆత్మను మహదాని, వరదాని లేదా విశ్వకళ్యాణి అని అంటారా? ఒకవేళ స్వయంలోనే ఏదో ఒక శక్తి యొక్క లోపం ఉంటే ఇతరులను సర్వశక్తివంతుని బాబా యొక్క వారసత్వానికి అధికారిగా లేదా మాస్టర్ సర్వశక్తివాన్‌గా ఎలా తయారుచేయగలరు?

సూర్యవంశీయులు సర్వశక్తివంతులు మరియు చంద్రవంశీయులు శక్తివంతులు. ఒకవేళ ఒక శక్తి యొక్క లోపం ఉన్నా సర్వశక్తివంతులు అని అనడానికి బదులు శక్తివంతులు అని అంటారు. సర్వశక్తివంతులే సర్వగుణ సంపన్నంగా, 16 కళా సంపూర్ణంగా అయ్యేటందుకు అధికారిగా అవుతారు. తక్కువ శక్తి ఉన్నవారు కళ్యాణిగా అవుతారు, కానీ విశ్వకళ్యాణిగా కాలేరు. ఒకవేళ ఏ ఆత్మకైనా ఇముడ్చుకునే శక్తి కావాలి వారికి మీరు విస్తారం చేసే శక్తి ఇవ్వండి, లేదా ఇంకా ఇతర శక్తులు ఇవ్వండి, కానీ వారికి కావలసినది ఇవ్వకపోతే ఆ ఆత్మ తృప్తి అవుతుందా? మిమ్మల్ని విశ్వకళ్యాణి అని అంగీకరిస్తారా? ఎలా అయితే ఎవరైనా నీరు కోసం దాహంతో ఉన్నారు, వారికి మీరు 36 రకాల పిండివంటలతో భోజనం పెడితే నీటి యొక్క దాహంతో ఉన్నవారు 36 రకాల భోజనంతో సంతుష్టం అవుతారా, మీకు ధన్యవాదాలు చెప్తారా? నీటికి బదులు వారికి మీరు వజ్రాలు ఇవ్వండి, కానీ ఆ సమయంలో ఆ ఆత్మకు నీటి బిందువు యొక్క విలువ అనేక వజ్రాల కంటే విలువైనది. అలాగే మీ దగ్గర సర్వశక్తుల స్టాక్ జమ అయ్యి లేకపోతే సర్వాత్మలను సంతుష్టం చేసే సంతుష్టమణిగా కాలేరు. సర్వాత్మలు మిమ్మల్ని ప్రాణదాతగా, సర్వశక్తుల దాతగా అంగీకరించరు. విశ్వం యొక్క సర్వాత్మల ద్వారా విశ్వకళ్యాణిగా, గౌరవనీయంగా కాలేరు. గౌరవనీయంగా అవ్వకుండా పూజ్యనీయంగా కూడా కాలేరు. సంతుష్టమణిగా కాకుండా బాప్ దాదా యొక్క మస్తకమణిగా కాలేరు. ఇలా లోతైన పరిశీలన చేసుకుంటున్నారా లేదా? ఇప్పటి వరకు ముఖ్య విషయాలలో పరిశీలన చేసుకోవటం కూడా కష్టంగా అనుభవం అవుతుందా? ఒకవేళ పరిశీలన చేసుకోవటం రావటం లేదు లేదా ఆలోచిస్తున్నప్పటికి నిజసంస్కారం తయారవ్వటం లేదు. వారికి ఒక టైటిల్ తక్కువ అయిపోతుంది అది ఏమిటి? ఒక్కొక్క సబ్జెక్టుకి ఒక్కొక్క టైటిల్ ఉంది. నాలుగు సబ్జెక్టులకి నాలుగు టైటిల్స్ ఏమిటి? మొదట జ్ఞాన సబ్జక్టులోప్రవీణ ఆత్మ యొక్క టైటిల్ - మాస్టర్ జ్ఞానసాగర్ లేదా నాలెజ్డ్ ఫుల్, స్వదర్శనచక్రధారి ఇవన్నీ ఒకటే. రెండవది - స్మృతియాత్రలో యదార్ధ యుక్తీయుక్తంగా, యోగయుక్తంగా ఉండేవారికి టైటిల్ - శక్తిశాలి. ఎందుకంటే స్మృతి ద్వారా సర్వశక్తుల వరదానం లభిస్తుంది. కనుక స్మృతియాత్రలో యదార్థరీతిలో నడిచేవారి టైటిల్ - పవర్‌ఫుల్. మూడవ సబ్జక్టు - దివ్యగుణాలు దివ్యగుణ మూర్తులకు ఏ టైటిల్ ఇస్తారు? వారి టైటిల్ ఏమిటంటే దివ్యగుణాల సువాసనను వ్యాపింపచేసే ఎసెన్స్ ఫుల్ అంటే సారయుక్త ఆత్మలు. ఎలా అయితే సారం ఎంత దూరంలో పెట్టినప్పటికీ తన ప్రభావాన్ని వేస్తూ ఉంటుంది. అంటే సువాసనను వ్యాపింపచేస్తుంది. అలాగే దివ్యగుణాల యొక్క సువాసన యొక్క విస్తారం కలిగిన ఆత్మిక సారయుక్తులుగా అయ్యారా? ఇప్పుడు స్వయాన్ని పరిశీలన చేసుకోండి - నాలుగు సబ్జక్టుల యొక్క నాలుగు టైటిల్స్ యొక్క ధారణాయోగ్యంగా అయ్యానా? అని. ఒకవేళ పరిశీలన చేసుకోవటం కనుక రాకపోతే ఏ టైటిల్ కట్ అయిపోతుంది?

కొంతమంది పిల్లలు పరిశీలన చేసుకోవాలి అనుకుంటున్నాము కానీ తోయటం ద్వారా బండి నడుస్తుంది అని అంటున్నారు. నిజ సంస్కారం సదాకాలికంగా ఉండటంలేదు, దీనిలో ఏ లోపం అని అంటారు? ఇది చేయాలి అనే జ్ఞానమైతే ఉంది. త్రికాలదర్శిస్థితి యొక్క జ్ఞానమైతే, లభించింది కదా? జ్ఞానసాగరులుగా అయ్యారా? ఇప్పుడు ఒకవేళ ఏదైనా బలహీనతకు వశమైనా. ఆ బలహీనత గురించి తెలుసుకుంటున్నారు కూడా, దాని వర్ణన కూడా చేస్తున్నారు మరియు దానిని తొలగించుకునే పాయింట్స్ కూడా వర్ణన చేస్తున్నారు. వర్ణన చేస్తున్నప్పటికీ ఏది చేయాలనుకుంటున్నారో అది చేయలేకపోతున్నారు. జ్ఞానమైతే బుద్దిలో పూర్తిగా ఉంది కానీ, ఎంత జ్ఞానసాగరులుగా ఉన్నారో అంతగా వెనువెంట శక్తిశాలిగా కూడా ఉన్నారా? ఈ సమానత, మంచిగా లేని కారణంగా తెలుసుకుంటున్నప్పటికీ చేయలేకపోతున్నారు. ఎవరైతే పరిశీలన చేసుకోరో ఆ ఆత్మలకు సమానతలో ఉండే బ్లెస్ ఫుల్(ఆశీర్వాదాల) టైటిల్ కట్ అయిపోతుంది. వారు స్వయానికి ఆశీర్వాదం ఇచ్చుకోలేరు మరియు బాబా నుండి తీసుకోలేరు మరియు ఇతరాత్మలకు కూడా ఇవ్వలేరు. ఎందుకంటే పరిశీలన అనేది నిజ సంస్కారంగా అవ్వటంలేదు. పరిశీలన ఉండటం లేదు మరియు పరివర్తన కూడా ఉండటం లేదు. పరిశీలకులుగా కానివారు నిర్మాతలుగా కూడా కాలేరు. స్వయం యొక్క, ఇతరాత్మల యొక్క మరియు విశ్వం యొక్క నిర్మాతలుగా కాలేరు. క్రొత్త ప్రపంచాన్ని తయారు చేసేవారు మరియు క్రొత్త జీవితాన్ని ఇచ్చేవారు అనే ఈ ఆ మహిమకు అధికారిగా కాలేరు. అందువలన ఇప్పుడు పరిశీలకులుగా అవ్వండి. ఎలా అయితే అమృతవేళ యొక్క ముఖ్య విషయాన్ని అందరు కలిసి ధృడసంకల్పం ఆధారంగా స్వయాన్ని మరియు సర్వ సహయోగులను సఫలతామూర్తిగా తయారుచేసారో, అలాగే ఈ విషయాన్ని కూడా ముఖ్యంగా తెలుసుకుని ఒకరికొకరు సహయోగిగా అయ్యి సఫలతామూర్తిగా అవ్వండి. అప్పుడే అన్ని కార్యాలు సంపన్నం అవుతాయి.

వర్తమాన సమయంలో విశేషంగా ఎక్కువ మందిలో రెండు బలహీనతలు కనిపిస్తున్నాయి. వాటి యొక్క సమాప్తి లేదా ఆ రెండు విషయాలల్లో ఎప్పుడైతే సఫలతామూర్తిగా అవుతారో అప్పుడే ఈ విషయాన్ని సఫలం చేసుకోగలరు. ఆ రెండు బలహీనతలు ఏమిటంటే - సోమరితనం మరియు బద్దకం. వీటిని తొలగంచుకునే సాధనం - పరిశీలకులుగా అవ్వాలి. 99శాతం పురుషార్థులలో ఏదోక రూపంలో సోమరితనం మరియు బద్ధకం అంశ రూపంలో అయినా, వంశ రూపంలో అయినా ఉన్నాయి. మహరథులలో అంశ రూపం ఏమిటి? గుఱ్ఱపు సవారిలలో వంశ రూపం ఏమిటి? దానిని తెలుసుకుంటున్నారా? అంశరూపం అంటే నా స్వబావం లేదా నా సంస్కారం అనటం. ఇది నా భావన కాదు అంటారు. కానీ మాట లేదా నయనాలు, నడవడిక, రేఖలు అలా ఉంటాయి, రూపం అలా ఉండదు. ఇది అంశమాత్రం. సంపూర్ణ విజయీ అవ్వటంలో సోమరితనం మరియు రాయల్ రూపం యొక్క బద్దకం ఇవే విఘ్నాలు. గుఱ్ఱపుసవారీలలో లేదా రెండవ డివిజన్లో పాస్ అయ్యే ఆత్మలలో ఏ వంశ రూపంలో ఉంటుంది? వారి రూపంలో ఏమిటంటే - ప్రతి విషయంలో, ప్రతి మాటలో ఒక సాధారణమైన మాట ఉంటుంది. సోమరితనం మరియు బద్దకానికి సంబంధించిన మాట ఏమిటి? వారు సదా స్వయాన్ని రక్షించుకునే పాయింట్స్ చెప్పటంలో లేదా విషయాలు తయారు చేయటంలో చాలా ప్రావీణులుగా ఉంటారు. స్వయాన్ని నిర్దోషిగా మరియు ఇతరులపై దోషం పెట్టటంలో తెలివైనవారిగా ఉంటారు. న్యాయవాదులుగా ఉంటారు, కానీ నియమ స్వరూపంగా ఉండరు. ఎలా అయితే న్యాయవాదులు అసత్యకేసుని సత్యంగా ఋజువు చేసి నిర్దోషిని దోషిగా చేస్తారో, అలాగే రెండవ డివిజన్ వారు ఎప్పుడు కూడా స్వయాన్ని దోషిగా తెలుసుకున్నప్పటికీ దోషిగా ప్రసిద్ధం అవ్వరు. అందువలనే న్యాయవాదులుగా ఉంటారు, కానీ నియమ స్వరూపులుగా ఉండరు. వారి నోటి నుండి ఇవే మాటలు వస్తాయి - నేను ఇది చేసానా? నేను ఇది మాట్లాడానా? నా మనస్సులో అయితే ఏమీ లేనే లేదు అలా వచ్చేసింది అంటే ఏమయ్యింది? అలా జరిగిపోతే ఏమయ్యింది? మంచిగా చేసుకుంటాను. తర్వాత ఏమిటి అనే మాట మాట్లాడుతూ ఉంటారు. ఎలా అయితే సృష్టిచక్రం గురించి చెప్పేటప్పుడు తర్వాత ఏమిటి, తర్వాత ఏమిటి అంటూ మొత్తం కథ చెప్తారు కదా! సత్యయుగం తర్వాత ఏమయ్యింది, త్రేతాయుగం వచ్చింది, తర్వాత ఏమయ్యింది, ద్వాపరయుగం వచ్చింది..... తర్వాత ఏమిటి అనే మాటతో మొత్తం చక్రం యొక్క కథ వినిపిస్తున్నారు. అలాగే ఆ న్యాయవాది ఆత్మలు తర్వాత ఏమయ్యింది అనే మాట ఆధారంగా ఇతరులపై మొత్తం చక్రం నడిపించేస్తారు. స్వయాన్ని సాక్షిగా చేసేసుకుంటారు లేదా అతీతంగా చేసేసుకుంటారు లేదా విడిపించేసుకుంటారు. తర్వాత ఏమిటి అనే మాటతో అంటే ఈ ఒక సంకల్పంతో సోమరితనం మరియు రాయల్ బద్దకం యొక్క అంశం లోలోపలే పెరిగిపోతూ ఉంటుంది మరియు ఆ ఆత్మను శక్తిశాలిగా చేయడానికి బదులు నిర్బలంగా తయారుచేసేస్తారు. ఇది రెండవ డివిజన్ అంటే గుఱ్ఱపుసవారీ ఆత్మలలో సోమరితనం మరియు బద్దకం వంశ రూపంలో ఉంటుంది. ఈ అంశం లేదా వంశాన్ని సమాప్తి చేసుకునేటందుకు పరిశీలకులుగా అవ్వటం చాలా అవసరం. 8 రోజులల్లో ఒక రోజు పరిశీలకులుగా అవుతున్నారు, మిగతా 7 రోజులు సోమరిగా ఉంటున్నారు. అంటే 7 రోజులది సంస్కారంగా అవుతుందా లేక ఒక రోజుది సంస్కారంగా అవుతుందా? అందువలనే జాగత్రగా ఉండడానికి బదులు సహజంగా మరియు సోమరిగా అయిపోతున్నారు. వారి ఫలితం ఎలా ఉంటుంది? వారు విశ్వకళ్యాణకారిగా, సర్వశక్తుల మహదానిగా, వరదానిగా అవుతారా? అందువలన ఇప్పుడు ఈ రెండు విషయాలను అంశరూపంలో మరియు వంశరూపంలో ఏ రూపంలో ఉన్నా వాటిని ఇప్పటి నుండి తొలగించుకుంటేనే చాలా సమయం విజయీగా అయ్యే సంస్కారంతో విజయీమాలలో మణిగా అవుతారు.

ఇలా వినటం మరియు స్వరూపంగా అయ్యేవారికి, సంకల్పాన్ని ఒక సెకనులో సాకారంలోకి తీసుకువచ్చేవారికి, సర్వాత్మలకు లైట్ హౌస్ గా మరియు మైట్‌ హౌస్ గా అయ్యి సర్వశక్తులతో సంతుష్టం చేసేవారికి, సంతుష్టమణులకు, మస్తకమణులకు, సదా స్వయంపై మరియు ప్రతి సంకల్పంపై పరిశీలకులుగా అయ్యేవారికి, క్రొత్త ప్రపంచ నిర్మాతలకు మరియు విశ్వకళ్యాణి ఆత్మలకు పరమాత్మ మరియు సర్వశ్రేష్ట ఆత్మ అయిన బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు శుభరాత్రి మరియు నమస్తే.