26.06.1974        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


సర్వసిద్ధుల ప్రాప్తి యొక్క ఆత్మిక నషాలో సదా స్థితులై ఉండండి.

సర్వాత్మల యొక్క జాతకం తెలిసినవారు, సర్వ సిద్ధుల యొక్క దాత, విశ్వంలో కెల్లా సర్వశక్తివంతుడు అయిన శివబాబా అన్నారు -

ఈ రోజు జ్ఞాన సూర్యుడైన బాబా ప్రతి సితార యొక్క మస్తకంలో అదృష్టరేఖను చూస్తున్నారు. లౌకిక రీతిలో కూడా భక్తుల ద్వారా హస్తరేఖలతో జాతకాన్ని చూస్తారు, దానిలో ముఖ్యంగా నాలుగు విషయాలు చూస్తారు. ఇక్కడైతే చేతుల ద్వారా కాదు, మస్తకం ద్వారా ముఖ్యమైన నాలుగు విషయాలను చూస్తున్నారు. 1. బుద్ది లైన్ ఎంత స్పష్టంగా మరియు విశాలంగా ఉంది? 2. ప్రతి సమయం జ్ఞాన ధనాన్ని ధారణ చేయటంలో తనువు యొక్క కర్మభోగంతో నిర్విఘ్నంగా మరియు మనస్సుతో ఏకరస సంలగ్నతలో నిమగ్నమయ్యే రేఖ ఇప్పటి వరకు ఎంత నిర్విఘ్నంగా కొనసాగుతూ వచ్చింది? 3. ఈ శ్రేష్ట బ్రాహ్మణ జన్మ యొక్క స్మృతి యొక్క ఆయుష్షు దీర్ఘంగా ఉందా, తక్కువగా ఉందా? స్మృతి అంటే జీవించటం, విస్మృతి అంటే చనిపోయే పరిస్థితికి చేరటం. ఇలా మాటిమాటికి జీవిస్తూ మరియు చనిపోయే స్థితికి చేరటం. ఈ లెక్క ప్రకారంగా చూస్తే ఆయుష్షు చిన్నదా లేక దీర్ఘంగా ఉందా అనేది లెక్కించటం జరుగుతుంది. 4. మరజీవ జన్మ తీసుకుంటున్నారు కనుక స్నేహం, సంబంధం, సంపర్కం మరియు సర్వశక్తులలో ఎంత వరకు అదృష్టవంతులుగా ఉన్నారు? అదృష్టరేఖలో శాతం లేకుండా తెగిపోకుండా ఉందా? వెనువెంట చదువు మరియు సంపాదనలో సదా సఫలతామూర్తిగా, సదా మరియు సరైన విధంగా ఎంత వరకు ఉన్నారు? ఎంతమంది ఆత్మల పట్ల మహదాని, వరదాని, కళ్యాణకారిగా అయ్యారు అంటే దానపుణ్యాల రేఖ చిన్నదా పెద్దదా? ఈ విషయాలన్నింటి ద్వారా ప్రతి సితార యొక్క వర్తమానం మరియు భవిష్యత్తుని చూస్తున్నారు.

మీరందరు మీ మస్తకంలోని రేఖలను తెలుసుకోగలుగుతున్నారా లేదా చూసుకోగలుగుతున్నారా? కానీ ఏవిధంగా? బాబా యొక్క హృదయసింహసనాధికారిగా అయ్యి, స్మృతి తిలకధారిగా అయ్యి, జ్ఞాన సాగరులుగా, శక్తిశాలి స్థితిలో స్థితులై చూస్తే స్పష్టంగా తెలుసుకోగలరు. మీ స్థితిని వదిలేసి మాయ యొక్క వ్యతిరేక స్థితిలో స్థితులై కూర్చుని స్వయాన్ని లేదా ఇతరులని చూస్తే స్పష్టంగా చూడలేరు. మీ స్థితి ఏది? మీ స్థితి ఏమిటి; దానిలో అన్ని విషయాలు వచ్చేస్తాయి. మీ స్థితి - మాస్టర్ సర్వశక్తివాన్ స్థితి. సదా ఇదే స్థితిలో ఉంటూ ప్రతి కర్మ చేయండి. అప్పుడు ఈ స్థితి అనేది మాయ యొక్క సర్వ విఘ్నాల నుండి అతీతంగా, నిర్విఘ్నంగా తయారుచేస్తుంది. లౌకికంగా కూడా ఏదైనా అధికారం ఉన్నవారిని ఎదుర్కునేటందుకు ఎవరూ సాహసించరు. ఒకవేళ ఎవరైనా తమ అధికారాన్ని ఉపయోగించుకోవడానికి బదులు అధికారాన్ని వదులుకుంటే అటువంటి వారిని సామాన్య మనిషి కూడా ఎదుర్కోవడానికి లేదా వారిని భంగపర్చడానికి లేదా విఘ్నం వేయడానికి అవకాశం తీసుకుంటారు. అదేవిధంగా ఇక్కడ కూడా మీ అధికారాలను, లభించిన సర్వశక్తులను, వరదానాలను ఉపయోగించుకోవడానికి బదులు వదులుకుంటున్నారు. అందువలనే ప్రతి సమయం మాయ మిమ్మల్ని ఎదుర్కోవడానికి సాహసిస్తుంది. మనస్సులో, వాచాలో, కర్మలో, సంబంధంలో, సంపత్తిలో అన్నింటిలోను తలదూర్చడానికి ప్రయత్నిస్తుంది. ఏ విషయంలోను వదలదు ఎందుకంటే మీరు మీ స్థితి నుండి క్రిందకి దిగిపోయి సాధారణంగా అయిపోతున్నారు.

మామూలుగా కూడా సాధారణ ఆత్మలు ఎవరైనా అల్పకాలిక సిద్ధిని పొందితే ఎంత అధికారికంగా ఉంటారు! ఇక్కడ అయితే సర్వసిద్ధులు ప్రాప్తించాయి. 1. సదా నిరోగిగా అయ్యే సిద్ధి 2. ఏ ప్రకృతి తత్వాన్ని అయినా వశం చేసుకునే సిద్ధి 3. దుఃఖి, బీద, అశాంతి ఆత్మను అవినాశి ధనవంతులుగా లేదా సదా సుఖిగా చేసే సిద్ధి 4. నిర్బలులని మహ బలవంతులుగా చేసే సిద్ధి 5.సంకల్పాలను ఒక్క సెకండులో ఎక్కడ మరియు ఎలా నిలపాలంటే అలా సంకల్పాలను కూడా వశం చేసుకునే సిద్ధి 6. పంచవికారాల రూపి మహభూతాలను వశం చేసుకునే సిద్ధి 7.నయనహీనులను త్రినేత్రిగా తయారుచేసే సిద్ది 8. అనేక పరిస్థితుల అలజడిలో మూర్చితం అయిన ఆత్మను స్వ స్థితి ద్వారా సృహలోకి తీసుకువచ్చే లేదా ప్రాణదానం ఇచ్చే సిద్ది 9. భ్రమించే ఆత్మకు సదాకాలిక గమ్యాన్నిచ్చే సిద్ధి 10. జన్మజన్మాంతరాలకు ఆయుష్హును పెంచుకునే సిద్ది 11. అకాల మృత్యువు నుండి రక్షించుకునే సిద్ది 12.రాజ్యభాగ్యం లేదా కిరీటం, సింహసనం ప్రాప్తింప చేసుకునే సిద్ది. ఈ విధంగా సర్వ సిద్ధులను విధి ద్వారా ప్రాప్తింప చేసుకునే ఆత్మలు ఎంత నషాలో ఉండాలి?

మిమ్మల్ని మీరు ఎందుకు మర్చిపోతున్నారు? తీసుకోవలసింది బాబా తోడు అయితే అయ్యేది బాబా నుండి వేరుగా. నావికుడిని వదిలేసి ఒడ్డు గురించి వెతికితే ఒడ్డు దొరుకుతుందా లేక సమయం వ్యర్ధం అవుతుందా? ఇటువంటి అమాయక పిల్లలను చూసి బాప్ దాదాకి దయ వస్తుంది. కానీ ఎంత వరకు? ఎంత వరకు అయితే బాబా నుండి దయ తీసుకోవలసిన అవసరం లేదా కోరిక ఉంటుందో, అంత వరకు ఇతరాత్మల పట్ల దయాహృదయులుగా కాలేరు. స్వయమే తీసుకునేవారిగా ఉంటే అటువంటి వారు ఇతరులకు ఇచ్చే దాతగా ఉండలేరు. బికారి అయిన వారు బికారిని సంపన్నంగా చేయలేరు కదా! అల్పకాలికంగా కొన్ని శక్తుల ఆధారంగా ఇతరులపై కొద్ది సమయం వరకు ప్రభావాన్ని వేయగలరు. కాని సదాకాలికంగా సర్వులను సంపన్నంగా తయారుచేయలేరు. మంచిది, మంచిది అని అనేటంత వరకు అనుభవం చేయించగలరు. కానీ కోరికంటే ఏమిటో తెలియని స్థితి వరకు తీసుకురాలేరు. మంచిది, మంచిది అని అనేటంత వరకు ఉంటారు, సర్వ ప్రాప్తుల యొక్క కోరిక పూర్తి అవ్వదు. ఎందుకంటే స్వయమే బాబా ద్వారా లేదా సర్వ సహయోగి ఆత్మల ద్వారా సహయోగం, స్నేహం, ధైర్యం, ఉత్సాహ ఉల్లాసాలు తీసుకోవాలనే కోరిక ఉన్నవారు మరియు ఏ రకమైన ఆధారాన్ని అయినా తీసుకునేవారు సర్వాత్మల కొరకు నిమిత్త ఆధారమూర్తిగా కాలేరు. ప్రకృతికి లేదా పరిస్థితికి లేదా వ్యక్తికి లేదా వైభవానికి ఆధీనంగా ఉండే ఆత్మ ఇతరాత్మలను కూడా సర్వాధికారిగా తయారుచేయలేదు. అందువలన మీ సర్వసిద్ధుల గురించి తెలుసుకుని వాటిని ఉపయోగించండి. కానీ నిమిత్తమాత్రంగా అయ్యి ఉపయోగించండి. నాది అనే భావనను మర్చిపోయి శ్రీమతం ఆధారంగా ప్రతి సిద్ధిని ఉపయోగించండి. ఒకవేళ నాది అనే భావనలోకి వచ్చేసి ఏ సిద్ధిని అయినా ఉపయోగించారంటే ఏమవుతుంది? శ్రేష్ట పదవికి బదులు శిక్షకి అర్హులవుతారు. సాక్షి స్థితి లేకపోతే శిక్ష అనుభవించవలసి ఉంటుంది. అందువలన సదా స్మృతి స్వరూపంగా మరియు సిద్ది స్వరూపంగా అవ్వండి.