28.04.1977        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


సదా సౌభాగ్యవంతుల గుర్తులు.

సదా సౌభాగ్య తిలకధారులు, శ్రేష్ఠ భాగ్యవంతులు, సర్వ ప్రాప్తి స్వరూప ఆత్మలతో బాబా మాట్లాడుతున్నారు -

బాప్ దాదా పిల్లల యొక్క సౌభాగ్యం మరియు భాగ్యాన్ని చూస్తున్నారు. సౌభాగ్యం యొక్క తిలకం మరియు భాగ్యం యొక్క ప్రకాశ కిరీటం. ఇలా కిరీటధారులు మరియు తిలకధారులు అంటే భాగ్యం మరియు సౌభాగ్యం కలిగినవారు. సదా సౌభాగ్యానికి గుర్తు - అవినాశి స్మృతి తిలకం, సదా భాగ్యానికి గుర్తు - పవిత్రత మరియు బాబా ద్వారా లభించిన సర్వ ప్రాప్తులు అంటే ప్రకాశ కిరీటం. స్మృతి తక్కువగా ఉంటే తిలకం కూడా స్పష్టంగా మెరుస్తూ కనిపించదు. మెరిసే తిలకం సదా బాబాతో పాటు ఉండే సౌభాగ్యానికి గుర్తు. ఇటువంటి సౌభాగ్య తిలకధారి లేదా సౌభాగ్యవంతులు కనుకనే సదా విశ్వం ముందు శ్రేష్ఠముగా అంటే ఉన్నతంగా కనిపిస్తారు. లౌకికంలో కూడా సౌభాగ్యవతులను శ్రేష్ఠ దృష్టితో చూస్తారు మరియు ప్రతి శ్రేష్ఠ కార్యంలో సౌభాగ్యవతులనే ముందు పెడతారు. లౌకికంలో కూడా సౌభాగ్యం పోతే సంసారమే పోయినట్లుగా భావిస్తారు. అదేవిధంగా అలౌకిక జీవితంలో కూడా ప్రతి ఆత్మ ఒకే ప్రియునికి ప్రేయసి అంటే సౌభాగ్యవతి. సదా మీ సౌభాగ్య తిలకాన్ని చూసుకుంటున్నారా? సదా ఒకని సంలగ్నతలోనే నిమగ్నమై ఉన్న దానికి గుర్తు స్మృతి తిలకం అంటే సౌభాగ్య తిలకం. తిలకం చెరిగిపోతే మీ సౌభాగ్యాన్ని పోగొట్టుకుంటారు.

స్వయాన్ని నేను సదా సౌభాగ్యవతినేనా? అని అడగండి. సదా సౌభాగ్యవతులు ఒక శ్వాసలో లేదా ఒక్క క్షణం కూడా తోడు వదిలిపెట్టరు. నీతోనే ఉంటాను, నీతోనే జీవిస్తాను, నీతోనే మరణిస్తాను.... ఇవే సౌభాగ్యవంతుల మనస్సు యొక్క మాటలు. సదా సౌభాగ్యవంతుల నయనాలలో, ముఖంలో ప్రియుని యొక్క ముఖం మరియు ముఖకవళికలే నిండి ఉంటాయి. చెవులలో కూడా ప్రియుని మాటలే వినిపిస్తూ ఉంటాయి. భక్తిలో కూడా ఆకాశవాణి వినాలని అభ్యాసం చేస్తారు. చాలా ప్రయత్నం చేసిన తర్వాత ఒకసారి అయినా ఒక మాట అయినా వినబడితే తమ భక్తి సఫలం అయినట్లు భావిస్తారు. భక్తి యొక్క ఈ ఆచార పద్ధతులన్నీ ఈ సమయంలోని ప్రత్యక్ష జీవితం నుండే కాపీ చేశారు. సదా సౌభాగ్యవంతులు అంటే వారి చెవులలో అనాది మహామంత్రం అయిన మన్మనాభవ అనే స్వరం మారు మ్రోగుతూ ఉంటుంది. బాబా ఈ మహామంత్రాన్ని మాటిమాటికి చెప్పి స్మృతి ఇప్పిస్తున్నట్లు అనుభవం చేసుకుంటారు. నడుస్తూ, తిరుగుతూ ఇదే ఆకాశవాణి అంటే అవినాశి మాట బాబా ఎదురుగా వెళ్ళి విన్నట్లుగా అనుభవం చేసుకుంటారు మరియు ఇతర ఏ ఆత్మల యొక్క మాటలు వింటూ కూడా వినరు. నీతోనే మాట్లాడతాను, నీవు చెప్పిందే వింటాను, నీవు చెప్పిందే చెప్తాను అనే స్థితి సదా సౌభాగ్యవంతులకి ఉంటుంది. ఇటువంటి సదా సౌభాగ్యవంతులు సంకల్పంలో కూడా ఇతరాత్మను ఒక్క సెకన్ కూడా స్మృతి చేయరు అంటే సంకల్పంలో కూడా ఏ దేహధారి యొక్క తగుల్పాటులోకి రారు. తగుల్పాటు అనేది పెద్దది కానీ కనీసం లొంగుబాటు కూడా ఉండదు. లౌకిక జీవితంలో కూడా పర పురుషుల గురించి సంకల్పం లేదా కలలో అయినా పర పురుషులు వస్తే సౌభాగ్యవంతులు మహాపాపంగా పరిగణిస్తారు. అదేవిధంగా అలౌకిక జీవితంలో కూడా ఒకవేళ సంకల్ప మాత్రంగానైనా, స్వప్నమాత్రంగానైనా ఏ దేహధారి ఆత్మ వైపు అయినా తగుల్పాటు ఉంటే సదా సౌభాగ్యవంతులు మహాపాపంగా భావిస్తారు. సదా సౌభాగ్యవంతులు అంటే ఒక్క బాబా తప్ప మరెవ్వరు లేరు. ఈ విధంగా సదా సౌభాగ్య తిలకం పెట్టబడి ఉందా? మాయ తిలకాన్ని చెరిపేయటం లేదు కదా? సదా సౌభాగ్యంతో పాటు భాగ్యం. కేవలం సౌభాగ్యమే కాదు, భాగ్యం కూడా మీకు ఉంది అంటే భాగ్యవంతులు కూడా. సదా భాగ్యవంతులకు గుర్తు - ప్రకాశ కిరీటం. లౌకిక ప్రపంచంలో భాగ్యానికి గుర్తు రాజ్యం అంటే రాజరికం మరియు రాజరికానికి గుర్తు కిరీటం. అదేవిధంగా ఈశ్వరీయ భాగ్యానికి గుర్తు ప్రకాశ కిరీటం. ఆ కిరీటం ప్రాప్తించడానికి ఆధారం పవిత్రత మరియు సర్వ ప్రాప్తి. సంపూర్ణ పవిత్రత అంటే మనస్సులో కూడా ఏ రకమైన వికారం అంశమాత్రంగా కూడా ఉండకూడదు. మరియు సర్వ ప్రాప్తులు అంటే జ్ఞానం, గుణాలు మరియు శక్తుల యొక్క ప్రాప్తి. ఒకవేళ ఏ ప్రాప్తి లోటుగా ఉన్నా ప్రకాశ కిరీటం స్పష్టంగా కనిపించదు. అపవిత్రత మరియు అప్రాప్తి యొక్క మేఘాలలో దాగి ఉన్నట్లు కనిపిస్తుంది. స్వయాన్ని సదా లైట్ అంటే ఆత్మిక రూపంగా అనుభవం చేసుకోలేరు. కర్మలో కూడా స్వయాన్ని లైట్ గా (తేలికగా) అనుభవం చేసుకోలేరు. మాటిమాటికి శ్రమ చేసిన తర్వాత లేదా ధ్యాస పెట్టుకునే అభ్యాసం చేసిన తర్వాత కొద్ది సమయానికి స్వయాన్ని డబల్ లైట్ గా అనుభవం చేసుకుంటారు. నేను ఆత్మను, ప్రకాశాన్ని అని అనుకుంటారు కానీ ఆత్మకి బదులు శరీరంగా అనుభవం చేసుకుంటారు. కనుక భాగ్యానికి ఆధారం - సర్వప్రాప్తులు. సర్వ ప్రాప్తులకు గుర్తు - అవినాశి సంతోషం. సదా భాగ్యవంతులు సదా సంతోషంగా ఉంటారు. భాగ్యం తక్కువ అయితే సంతోషం కూడా తక్కువ ఉంటుంది. సంతోషం తక్కువగా ఉంటే సదా భాగ్యవంతులు కాదు. సదా సౌభాగ్యవంతులు మరియు భాగ్యవంతుల గుర్తులు ఏమిటో అర్థమైందా? ఇప్పుడు ఈ అన్ని విషయాలను ఎదురుగా ఉంచుకుని నేనెవరు? అని స్వయాన్ని పరిశీలించుకోండి. మంచిది.

సదా సౌభాగ్య తిలకధారి శ్రేష్ఠ భాగ్యవంతులకు, సర్వ ప్రాప్తి స్వరూపులు, సదా బాబాకి తోడుగా ఉండే శ్రేష్ఠ ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.