10.12.1978        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


విస్తారాన్ని చూడకుండా సారాన్ని అంటే బిందువుని చూడండి.

మధువన నివాసి త్యాగీ, తపస్వీ పిల్లలతో బాప్ దాదా మాట్లాడుతున్నారు -

మధువన నివాసీయులు అంటే మధురత అనే సాగరంలో సదా తేలియాడుతూ ఉండేవారు. బాప్ దాదా యొక్క విశేష కర్మ భూమి, చరిత్ర భూమి, మధుర కలయిక భూమి, మహాన్ పుణ్యభూమి అటువంటి భూమి యొక్క నివాసీయులు ఎంత గొప్ప ఆత్మలు? నిరాకారి బాబాకి కూడా సాకార భూమి అంటే విశేష స్నేహం ఉంది. అటువంటి భూమి యొక్క నివాసీయులు అయిన మీరు కూడా అలా అనుభవం చేసుకుంటున్నారా? మధువనం అంటే మధుర భూమి. వృత్తిలో కూడా మధురత, మాటలో కూడా మధురత, ప్రతి కర్మలో కూడా మధురత ఉండాలి. భూమి ఎలాంటిదో ఆ భూమిలో ఉండేవారు కూడా అంత మహాన్ ఆత్మలు. మధువనంలో అనుభవం చేసుకున్న ఆత్మలు కూడా ఏమంటారు? మధువనం అంటే సంగమయుగీ స్వర్గం అంటే మీరు స్వర్గ భూమిలో ఉండేవారు. ఇప్పుడు కూడా స్వర్గంలో ఉన్నారు మరియు భవిష్యత్తులో కూడా స్వర్గంలో ఉంటారు. డబుల్ స్వర్గానికి అధికారులు. ఎంత విశేషంగా అయ్యారు. బాప్ దాదా ఈరోజు విశేషంగా మధువన నివాసీయులను కలుసుకోవటానికి వచ్చారు. బాబా అడుగుతున్నారు - స్వర్గం యొక్క విశేషత లేదా స్వర్గం యొక్క మహిమ ఏమిటి? స్వర్గం యొక్క విశేష మహిమ సదా సంపన్నత అంటే స్వర్గం యొక్క ఖజానాలో అప్రాప్తి వస్తువు ఏదీ ఉండదు. సంగమయుగీ స్వర్గం మరియు భవిష్య స్వర్గం రెండింటికి ఒకే విశేష మహిమ ఉంది. మధువనం నివాసీయులు అంటే సంగమయుగీ స్వర్గ నివాసీయులు. ఇలా సంపన్న స్థితిని అనుభవం చేసుకుంటున్నారా? దీనితో మేము సదా తృప్తి ఆత్మలం అని అనుభవం అవుతుంది. కోరిక అంటే తెలియని స్థితి యొక్క సంస్కారం భవిష్య స్వర్గంలో స్వతహాగా ఉంటుంది. అలాగే మధువన నివాసీయులకు ఈ సంస్కారం స్వతహాగా ఉందా? స్వర్గవాసీయులు అంటే ఈ అన్ని విషయాలలో స్వతహా, సంస్కార స్వరూపులుగా ఉన్నారా? ఎవరైనా మీరు ఎక్కడి నివాసీయులు అని అడిగితే చాలా సంతోషంతో, నిశ్చయంతో మేము మధువన నివాసీయులం అని చెప్తారు కదా! మధువన నివాసీయులు అని ఎలాగైతే ముద్ర పడిపోయిందో అలాగే స్థానంతో పాటూ స్థితికి కూడా ముద్ర పడాలి కదా! ఏదైనా చల్లని గదిలోకి వెళ్ళగానే అటువంటి స్థితి స్వతహాగానే వస్తుంది కదా! అలాగే మధువనానికి ఏదైతే మహిమ ఉందో అటువంటి సంస్కారం తయారయ్యిందా? సాకార రూపంలో లక్ష్య స్వరూపంగా అందరి ముందు మధువనం ఉంది. అందరు మధువనాన్నే కాపీ చేస్తారు. ఎవరి స్థితిలో అయినా అలజడి వస్తే అచంచల ఇల్లు (అచల్ ఘర్) అయిన మధువనమే జ్ఞాపకం వస్తుంది కదా! మధువనం అనే అచంచల ఇంటిలోకి రాగానే అందరు అచంచలంగా అయిపోతారు. ఇటువంటి భావనతో, శుభ కామనతో అందరు మధువనం వస్తారు. అనేకుల అలజడులను తొలగించే స్థానం అచంచల ఇల్లు మధువనం అయితే మధువనంలో ఉండేవారు కూడా సదా అచంచలంగా ఉంటారు కదా! ఇటువంటి స్థితి అనేకులకు మార్గదర్శకంగా ఉంటుంది. ఎందుకంటే మధువనం అనేది లైట్ హౌస్. సర్వ సేవాకేంద్రాల వారికి సహయోగం ఇచ్చేవారు మధువన నివాసియులు సదా సంకల్పం, మాట, కర్మతో ఒకరికొకరు సహయోగి అయితే తోడుగా ఉండేవారు కూడా సహయోగి అవుతారు కదా! పిల్లలందరికి ఫలితం కొరకు ఒక సంవత్సరం లభించింది. ఈ ఒక్క సంవత్సరంలో ఏమి పరివర్తన తీసుకువచ్చారు? ఆ అనుభవం ఇతరులకి వినిపిస్తే వారు కూడా పరివర్తన అయిపోవాలి. ఒక్కొక్కసారి మనం చూస్తూ ఉంటాం - కొంతమంది ఆత్మలు సత్యమైన మనస్సుతో, ఉల్లాసంగా బాబాపై స్నేహంతో అనుభవం వినిపిస్తారు. ఆ అనుభవం వింటూ కొంతమంది ఆత్మలు పరివర్తన అయిపోతారు. ఒకరి పరివర్తన అనేక ఆత్మల పరివర్తనకు ఆధారం అవుతుంది. ఇలా పరివర్తన అయ్యారా? అది అనేకులకు ఉదాహరణగా ఉండాలి. ఈ ఒక్క సంవత్సరంలో ఇలాంటి అద్భుతమైన అనుభవం ఏమైనా అయ్యిందా? ఎవరెవరిని హైజంప్ చేయించారు? ఎవరు లిఫ్ట్ యొక్క బహుమతి తీసుకున్నారు?

ఎలాగైతే ఈ రోజుల్లో టి.వీలో ఒక స్థానం యొక్క చిత్రం నలువైపుల కనిపిస్తుంది. మధువనం కూడా టి.వి స్టేషన్. నలువైపుల సెట్ పెట్టబడి ఉంది. టి.వి స్టేషన్లో ఏ పాత్ర జరుగుతుందో అది స్వతహాగా నలువైపుల కనిపిస్తుంది. మధువన నివాసీయుల ప్రతి సంకల్పం కూడా నలువైపుల కనిపిస్తుంది అంటే వ్యాపిస్తుంది. ఎందుకంటే నలువైపుల టి.వి సెట్స్ పెట్టబడి ఉన్నాయి. ఎలాగైతే ఈ రోజుల్లో విజ్ఞాన సాధనాల ద్వారా సంకల్పాల యొక్క గతిని లేదా మానసిక స్థితిని పరిశీలించగలుగుతున్నారో అదేవిధంగా మధువన నివాసీయుల సంకల్పాల వేగాన్ని లేదా మానసిక స్థితిని పరిశీలిస్తున్నారు. అలాగే మధువన నివాసీయుల సంకల్పాల వేగం లేదా మానసిక స్థితి నలువైపుల వ్యాపిస్తుంది. అందువలన ప్రతి సంకల్పంపై ధ్యాస ఉండాలి. దీనిలో సోమరితనం ఉండకూడదు. మధువన నివాసీయులు మధువనంలో కూర్చుని కూడా విశేష సంకల్పం ద్వారా ఈ ఒకే స్థానంలో కూర్చుని కూడా తరంగాలను నలువైపులకు పంపవచ్చు. ఎలాగైతే స్థూలమైన వస్తువు యొక్క సువాసన నలువైపుల వ్యాపిస్తుందో అలాగే ఈ తరంగాలు కూడా సంకల్పం ద్వారా నలువైపుల వ్యాపిస్తాయి. మధువన నివాసీయులకు ఇది విశేషమైన సేవ. మధువనంలో ఏదైనా విశేష భట్టీ చేస్తే దాని తరంగాలు నలువైపుల వ్యాపిస్తాయి కదా! ఉత్తరాల ద్వారా సమాచారం అందకపోయినా సూక్ష్మ తరంగాలు చాలా సహజంగా నలువైపులకు వ్యాపిస్తాయి. అయితే ఇటువంటి సేవ కూడా చేస్తున్నారా లేక కేవలం యజ్ఞాన్ని సంభాళించే సేవయే చేస్తున్నారా? కర్మ ద్వారా కర్మణా సేవ చేయాలి కానీ దానితో పాటు మనసా సేవ యొక్క బాధ్యత ఉందా? బాప్ దాదా అయితే ఈ సంవత్సరం యొక్క ఫలితాన్ని చూడటానికి వచ్చారు కదా! ఎవరైతే సదా సమీపంగా ఉంటున్నారో వారు ఎంత వరకు గౌరవయుక్తంగా పాస్ అయ్యారు (పాస్ విత్ ఆనర్) అని? ఎవరైతే సదా మహాన్ ఆత్మలతో ఉంటున్నారో, స్థానం కూడా గొప్పది మరి అటువంటి ఆత్మల ప్రాలబ్దం ఎలా ఉంటుంది? మరియు సాకారంలో సమీపంగా ఉంటున్నారు. ఇటువంటి ఆత్మల యొక్క ప్రాలబ్దం ఏమిటి? శాస్త్రాలలో కూడా మధువనం యొక్క మహిమ విశేషంగా కీర్తించబడింది. కనుక మధువన నివాసీయులు అంటే ప్రతి విషయంలో విశేషాత్మలు. ప్రతి సమయం ఏదోక విశేషత చూపించేవారు. ఏ గ్రూప్ వారు వచ్చినా మధువన నివాసీయులు ఈ విశేషతను అనుభవం చేసుకుంటారు. మధువన స్వర్గంలో ప్రతి ఆత్మ సదా తృప్తి ఆత్మ మరియు సంపన్న మూర్తులు. దీనికి ఆధారం - సదా ఒకే లక్ష్యం ఉండాలి - 'మేము దాత పిల్లలుగా అయ్యి సర్వాత్మలకి ఇవ్వాలి కానీ తీసుకోకూడదు' అని. వీరు చేస్తే నేను చేస్తాను అని కాదు. ప్రతి ఒక్కరు దాత యొక్క భావన ఉంచుకుంటే అందరు ఇచ్చేవారిగా అంటే సంపన్న ఆత్మగా అయిపోతారు. సంపన్నంగా కాకపోతే ఇవ్వలేరు. ఎవరైతే సంపన్న ఆత్మగా అవుతారో వారు సదా తప్పకుండా తృప్తి ఆత్మగా ఉంటారు. నేను ఇచ్చేటటువంటి దాత యొక్క సంతానాన్ని. అందువలన ఇవ్వటమే తీసుకోవటం అనుకోవాలి. ఎంత ఇస్తామో అంతా తీసుకోవటమే. ప్రత్యక్షంగా తీసుకునేవారిగా కాదు, ఇచ్చేవారిగా అవ్వాలి. దాత యొక్క భావన సదా నిర్విఘ్నంగా, కోరికంటే ఏమిటో తెలియని స్థితిని అనుభవం చేయిస్తుంది. సదా ఒకే లక్ష్యం వైపు దృష్టి ఉండాలి. ఆ లక్ష్యం-బిందువు. ఒకే లక్ష్యం అంటే సదా బిందువు వైపు చూడాలి, ఇక ఇతర విషయాలు చూస్తూ కూడా చూడకూడదు. మన దృష్టి ఒక బిందువు వైపే ఉండాలి. స్మృతిచిహ్నంలో కూడా చూపిస్తారు కదా - అర్జునునికి చేప వైపు కాకుండా కన్ను యొక్క బిందువు వైపే దృష్టి ఉంది. చేప అంటే విస్తారం. సారం అంటే బిందువు. విస్తారాన్ని చూడలేదు సారం అంటే ఒకే బిందువుని చూసాడు. అదేవిధంగా ఇతర విషయాలు చూస్తే విఘ్నాలు వస్తాయి మరియు సారం అంటే ఒక బిందువునే చూస్తే బిందురూప స్థితి తయారవుతుంది మరియు బిందువు పెట్టగలుగుతారు. కర్మలో కూడా ఫుల్ స్టాప్ అంటే బిందువు. స్మృతిలో కూడా బిందువు అంటే బీజరూప స్థితి ఉంటుంది. ఈ విశేష అభ్యాసం చేయాలి. విస్తారాన్ని చూస్తూ కూడా చూడకూడదు. వింటూ కూడా వినకూడదు. ఇది ఇప్పటి నుండి కావాలి. అంతిమంలో నలువైపుల అలజడుల ధ్వని చాలా దు:ఖమయంగా ఉంటుంది, దృశ్యాలు కూడా చాలా భయంకరంగా ఉంటాయి. వాటితో పోలిస్తే ఇప్పటి విషయాలు ఏమీ కాదు. ఒకవేళ ఇప్పటి నుండి వింటూ వినకుండా, చూస్తూ చూడకుండా ఉండే అభ్యాసం లేకపోతే అంతిమంలో విరాఠ దృశ్యాలను చూసి ఒక సెకను యొక్క పరిక్షలో సదాకాలిక ఫెయిల్ మార్క్స్ వస్తాయి. అందువలన ఈ అభ్యాసం కూడా విశేషంగా ఉండాలి. సాకార శరీరం కూడా ఆకారీ శరీరంగా అనుభవం అవ్వాలి. ఇటువంటి స్థితి ఉండాలి. ఎలా అయితే సాకారంగా చూశారు కదా! సాకారీ శరీరం కూడా ఆకారీ ఫరిస్తా రూపంగా అనుభవం అయ్యేది. నడుస్తూ, తిరుగుతూ, ప్రతి కర్మ చేస్తూ ఫరిస్తాగా అనుభవం చేసుకునేవారు. శరీరం అదే కానీ స్థూల శరీరం యొక్క అభిమానం సమాప్తి అయిపోయిన కారణంగా స్థూల శరీరం ఉన్నా కానీ ఆకారీ రూపాన్ని అనుభవం చేసుకునేవారు. ఇటువంటి అభ్యాసం మీ అందరికి ఉండాలి. కర్మేంద్రియాల ద్వారా కర్మ జరుగుతూ ఉండాలి. కానీ మనసా శక్తి ద్వారా వాయుమండలాన్ని శక్తి శాలిగా, స్నేహ సంపన్నంగా, సర్వులకి సహయోగం ఇచ్చే తరంగాలు వ్యాపింపచేయాలి. ఏ స్థానానికి వెళ్ళినా ఫరిస్తా రూపం కనిపించాలి. కర్మ చేస్తున్నారు కానీ ఒకే సమయంలో కర్మ మరియు మనస్సు రెండింటి సమానత ఉండాలి. ఆదిలో అభ్యాసం చేయించేవారు. కర్మ సాధారణంగా ఉన్నా కానీ స్థితి ఎంత మహాన్ గా ఉండాలంటే సాధారణ కర్మ చేస్తున్నా కానీ సాక్షాత్కార మూర్తిగా కనిపించాలి అని. స్థూల పని అంటే బట్టలు ఉతుకుతున్నా, సామానులు తోముతున్నా, బండారీలో సేవ చేస్తున్నా కానీ స్థితి మహాన్ గా ఉండాలి. చూసేవారు. 'ఇంత మహాన్ ఆత్మలు ఫరిస్తా రూపంతో కార్యం చేస్తున్నారు అని' వర్ణన చేసే సమయం కూడా ఎదురుగా వస్తుంది. కార్యం సాధారణమైనది అయినా కానీ స్థితి అతి శ్రేష్టంగా ఉండాలి. సత్య యుగీ రాజ్యాధికారి ఆత్మలు మీ భవిష్య రూపాన్ని ప్రత్యక్షంగా చూసి మహారాజా, మహారాణీ ఆత్మలు ఈ కార్యం చేస్తున్నారా అని ఆశ్చర్యపోతారు. విశ్వ మహారాజులు భోజనం తయారు చేస్తున్నారా? అనుకుంటారు. అలాగే కాబోయే భక్తులు కూడా మా శ్రేష్ట పూజ్య ఇష్ట దేవతలు ఈ కార్యం చేస్తున్నారు అని ఆశ్చర్యపోతారు. నడుస్తూ, తిరుగుతూ ఇష్ట దేవతల సాక్షాత్కారం స్పష్టంగా కనిపిస్తుంది. అంతిమంలో పూజ్య స్వరూపం ప్రత్యక్షంగా కనిపిస్తుంది మరియు ఫరిస్తారూపం కూడా ప్రత్యక్షంగా కనిపిస్తుంది. అర్జునునికి మహిమ ఉంది కదా సాధారణ స్నేహితుని రూపం కాకుండా వాస్తవిక రూపాన్ని సాక్షాత్కారం చేసుకున్న తర్వాత నీవెవరు అని వర్ణన చేస్తాడు. ఉన్నది సాధారణ స్నేహితుని రూపంలో అయినా కానీ ఇంత శ్రేష్టమా అని అనుకుంటాడు. అదేవిధంగా నడుస్తూ, తిరుగుతూ మీ సాక్షాత్కారాలు కూడా అవుతాయి. దివ్యదృష్టిలోకి వెళ్ళి చూస్తే అది వేరే విషయంగా అనిపిస్తుంది. ఆదిలో నడుస్తూ, తిరుగుతూ కూడా దివ్యదృష్టి ద్వారా చూసేవారు. అలా ఇది కూడా ధ్యానంలోకి వెళ్ళి చూసే విషయం కాదు. ఎలా అయితే ఆదిలో ఒక సాకార బాబా ద్వారా ఎలాగైతే అనుభవాలు చేసుకున్నారో అలాగే అంతిమంలో మీ అందరి యొక్క సాక్షాత్కారాలు అవుతాయి. మీ సాధారణ రూపం మాయం అయిపోయి ఫరిస్తా రూపం, పూజ్య రూపం చూస్తారు. ఆదిలో ఆకారి బ్రహ్మ మరియు శ్రీకృష్ణుడు ఇద్దరు సాక్షాత్కారం అయ్యేవారు. అలాగే ఇప్పుడు కూడా ఈ సాధారణ రూపం చూసినా కానీ కనిపించదు. మీ పూజ్య దేవీ, దేవతా రూపాన్ని లేదా ఫరిస్తా రూపాన్ని చూస్తారు. కానీ ఇది ఎప్పుడు జరుగుతుందంటే ఎప్పుడైతే మీరు చూస్తూ కూడా చూడనట్లుగా ఉండే పురుషార్ధం చేస్తారో అప్పుడు జరుగుతుంది. కళ్ళు తెరచి ఉండగానే ఒక్క సెకనులో సాక్షాత్కారం అవుతుంది. ఇటువంటి స్థితి తయారు చేసుకునేటందుకు విశేష అభ్యాసం - వింటూ కూడా వినకూడదు, చూస్తూ కూడా చూడకూడదు. ఒకే విషయం వినండి మరియు ఒక బిందువునే చూడండి. విస్తారాన్ని చూడకుండా సారాన్ని చూడండి. విస్తారాన్ని వినకుండా సదా సారాన్నే వినండి. ఇటువంటి గారడీ నగరంగా మధువనం అవుతుంది. విన్నారా! మధువనం యొక్క మహత్యం అంటే మధువన నివాసీయుల యొక్క మహత్యం.

మధువనం అంటే శక్తి సేన అంటే విశేషాత్మల సేన. ప్రతి ఒక్కరు తమ విశేషత గురించి మంచిగా తెలుసుకుంటున్నారు కదా! విశేషత కారణంగానే విశేష భూమి యొక్క నివాసీయులుగా అయ్యారు. ఈ సంతోషం ఉంటుందా? వెనుకటి ఖాతా అయితే ప్రతి ఒక్కరిది ఎవరిది వారిది, అది పూర్తవుతూ ఉంటుంది. కానీ దానితో పాటు డ్రామానుసారం ఏదోక విశేషత కూడా ఉంటుంది. దీని కారణంగానే విశేష పాత్ర లభించింది. సదా పుణ్య భూమిలో మరియు శ్రేష్ట ఆత్మల సాంగత్యంలో ఉండటం ఇది కూడా విశేష పాత్ర మరియు ఇది కూడా తక్కువ భాగ్యం కాదు. జడచిత్రాల మందిరాలకు పూజారులు అయిన వారు స్వయాన్ని ఎంత గొప్పగా భావిస్తారు!వారు పూజారులే కానీ ఎంత నషా ఉంటుంది! ఎందుకంటే మేము విగ్రహానికి సమీపంగా ఉండే వాళ్ళం అని భావిస్తారు. జడ చిత్రాల యొక్క పూజారులే ఇంత నషాగా ఉంటే ఇక్కడ పూజారులు అన్న విషయమే ఉండదు. ఇక్కడ సంపర్కంలో, సాంగత్యంలో ఉండే సహయోగులకు ఎంత నషా మరియు ఎంత సంతోషం ఉండాలి? ఈశ్వరీయ పరివారంలోకి వచ్చిన ఆత్మకి ఏ విశేషత లేకపోవటం అనేది ఉండదు. అందువలన మీ విశేషతను తెలుసుకుని కార్యంలో ఉపయోగించండి. ఏ గుణం లేదా విశేషతను అయినా కర్మణాలో అయినా, మధురతా గుణం అయినా, స్నేహం యొక్క గుణం అయినా దానిని కార్యంలోకి తీసుకురండి. ఎలా అయితే లోహం పారసాన్ని అంటుకుంటే అది కూడా పారసంగా అయిపోతుంది. అలాగే ఒక గుణాన్ని లేదా విశేషతను సేవలో ఉపయోగిస్తే దానికి ఫలితంగా ఒకటికి లక్ష రెట్లు లభించటం ద్వారా ఆ ఒక విశేషత అనేక సమయాలలో ఫలం ఇవ్వటానికి యోగ్యంగా అవుతుంది. ఎలా అయితే ఒక విత్తనం వేస్తే చాలా ఫలాలు వస్తాయో అలాగే ఒక విశేషతను కార్యంలో ఉపయోగించటం అంటే భూమిలో బీజం వేయటం, కనుక మీరు ఎంత అదృష్టవంతులో అర్థమైందా! బ్రాహ్మణ పరివారంలో జన్మ తీసుకున్నారు అంటే జన్మతో పాటు ఏదోక విశేషత యొక్క అదృష్టాన్ని వెంట తీసుకునే వచ్చారు. కానీ దానిని కార్యంలో ఎంత వరకు ఉపయోగిస్తున్నారు అనే దానిలోనే కూడా తేడా ఉంటుంది. జన్నయే భాగ్యం కానీ భాగ్యాన్ని కర్మలో లేదా సేవలో ఉపయోగించటం వలన అనేక సమయాలలో భాగ్యం యొక్క ఫలం రావాలి. కానీ విత్తనం నాటే పద్దతి రావాలి. ఫలం తప్పకుండా వస్తుంది. బీజం వేయటం అంటే విశేషత రూపీ బీజాన్ని సేవలో ఉపయోగించటం. ఇక్కడ అయితే అందరు భాగ్యం యొక్క సింహాసనాధికారులే. ఈ భాగ్యం కోసమే కల్ప పూర్వం యొక్క స్మృతిచిహ్నంలో కూడా ఇప్పటి వరకు ఒక్క సెకను సమీపంగా ఉండటం కూడా గొప్పగా భావిస్తారు. కానీ మీరు ప్రత్యక్షంగా ఉన్నారు కనుక మీ సంతోషం, భాగ్యం, ఎంత శ్రేష్టమైనది! శ్రేష్టతను ఎదురుగా ఉంచుకోవటం ద్వారా వ్యర్థ విషయాలు సమాప్తి అయిపోతాయి. మంచిది.

పాండవులు అంటే సదా విజయీలు. విజయం కారణంగానే పాండవుల పేరు ప్రసిద్ధమైంది. పాండవ సేన అంటే విశేషంగా సాగరుని యొక్క ఒడ్డులో శ్రేష్ట సాంగత్యంలో ఉండేవారు. ఇలా పాండవ సేనగా, సదా విజయీగా ఉన్నారా? విజయం యొక్క ఆట సదా నడుస్తుందా లేక గెలుపు, ఓటమిల ఆట నడుస్తుందా? ఇప్పటి సమయం మరియు సహయోగం అనుసరించి డ్రామానుసారం లభించిన భాగ్యానుసారం సదా విజయం యొక్క ఆట నడవాలి.

డ్రామానుసారం ఏదైతే విశేషత లభించిందో దానిని సదా కార్యంలో ఉపయోగిస్తే అప్పుడు ఇతరులకి కూడా ఆ విశేషత కనిపిస్తుంది. విశేషతలను చూడకుండా విషయాలను చూస్తున్నారు. అందువలనే ఓడిపోతున్నారు. ప్రతి ఒక్కరి విశేషతను స్మృతిలో ఉంచుకోండి. ఒకరికొకరు నమ్మకంగా ఉండండి. అప్పుడు వారి విషయాల యొక్క భావం మారిపోతుంది. పరస్పరం ఎవరైనా ఇద్దరు స్నేహితులుంటే వారి మధ్యలో ఎవరైనా వచ్చి ఏదైనా నింద చేసినా వారు వారి భావనను కూడా మార్చేస్తారు కదా! ఎవరికైనా బ్రహ్మబాబా గురించి వీరు ఎవరు అని అన్నప్పుడు మీరు వారిని నిందిస్తారు. వారు అడిగితే ఇది నింద కాదు, ఇది స్పష్టీకరణ అని నిశ్చయంతో చెప్తారు కదా! నిశ్చయం ఉన్న చోట మాటల యొక్క భావం మారిపోయి సాధారణ విషయంగా అయిపోతుంది. ప్రతి ఒక్కరి విశేషతను చూస్తే అప్పుడు అనేకులు ఉన్నా కానీ ఒక్కరిగానే కనిపిస్తారు. ఏకమత సంఘటనగా అయిపోతుంది. ఎవరు ఎవరి గురించి అయినా గ్లాని విషయాలు వినిపిస్తే మీరు దానికి ప్రోత్సాహం ఇవ్వడానికి బదులు ఆ విన్పించేవారి రూపాన్ని పరివర్తన చేయండి. అంటే భావనను పరివర్తన చేయండి. ఈ అభ్యాసం ఉండాలి లేకపోతే ఒకరి విషయం ఇంకొకరితో, ఇంకొకరి విషయం మరలా ఇంకొకరితో ఇలా చెప్పటం వలన వ్యర్థ విషయాలు వాతావరణంలో వ్యాపిస్తాయి. దీని కారణంగా శక్తిశాలి వాతావరణం తయారవ్వటంలేదు, సాక్షాత్కారమూర్తిగా కూడా కాలేకపోతున్నారు. అందువలన సదా సర్వులపట్ల శుభ భావన కళ్యాణకారి భావన ఉండాలి. ఒకరికొకరు గ్లాని చేసే విషయాలు వినటం అంటే సమయాన్ని వ్యర్థం చేసుకోవటం. సంపాదన నుండి వంచితం అయిపోవటం. ఒకవేళ మీరు వారిని పరివర్తన చేయగలిగితే వినండి లేదంటే వింటూ కూడా వినకండి.

ప్రతీ ఒక్కరి విశేషతను వర్ణన చేయండి. మేం ఇలా చూశాం అని ఎవరైనా అన్నా కానీ మీ నోటి నుండి మాత్రం ఇటువంటి విషయాలు రాకూడదు. మీరు వారి విశేషతను వినిపించి ఆ విషయాన్ని మార్చండి. ప్రతి ఒక్కరి నోటి నుండి ప్రతి ఒక్కరి గురించి ఓహో ఓహో అనే రావాలి. అప్పుడే బాబా యొక్క ఓహో ఓహో అనే మహిమ వస్తుంది. ఏదైనా విషయం పైకి, క్రిందికి అయినా దానిని చూసినా, వినినా దానిని మనస్సులో ఉంచుకోవద్దు. విన్నారు అయిపోయింది. స్వయాన్ని సదా ఖాళీగా, తేలికగా ఉంచుకోండి. ఒకవేళ మనస్సులో ఏ విషయాలైనా ఉంటే ఆ విషయాలు ఉన్న చోట బాబా ఉండరు.
ఎవరి అవగుణాలను ఒకరి ముందు ఒకరు వర్ణన చేయకూడదు. ఎందుకంటే దానిని వర్ణన చేయటం అంటే రోగం యొక్క కీటాణువులు వ్యాపింపచేయటం. ఇలా ఏవైనా రోగం యొక్క కీటాణువులు ఉంటే ఆ సమయంలోనే మంచి శక్తిశాలి మందు వేసి సమాప్తి చేసేస్తారు. ఎవరైనా ఫలానా వారు ఎలా ఉన్నారు అని అడిగితే మనస్సుతో చాలా బావున్నారు అని రావాలి. అనేక భావాలతో, అనేక ఆత్మలు వస్తారు కానీ మీ నుండి శుభభావన యొక్క విషయాలే తీసుకువెళ్ళాలి. భావన శుభంగా ఉండాలి. ఒకే భావన, ఒకే కామన, ఒకే సంలగ్నతలో నిర్విఘ్నంగా ఉండాలి. వ్యర్థ విషయాల యొక్క ఖాతా సమాప్తి అయిపోవాలి మరియు సంతోష విషయాల యొక్క ఖాతా జమ అవ్వాలి. సంతోషంతో ఊగే ఆత్మలుగా అందరికీ కనిపించాలి. ప్రతి మాటలో ఆత్మీయత ఉండాలి. ఆత్మీయత అనే మాట చాలా మధురంగా ఉంటుంది. సమయానుసారం స్థితి కూడా చాలా ఉన్నతంగా ఉండాలి. ఏక్కేకళ అంటే మొదట ఉన్న స్థితిని దాటి వెళ్ళిపోవాలి. సాక్షాత్కారమూర్తిగా కనిపించాలి, అటువంటి స్థితి ఉండాలి. అప్పుడు మీ ముందు ఎంత గుంపు ఉంటుందో చూడండి. మీ స్థితి సదా ఏకాగ్రంగా ఉండాలి. అప్పుడే పేరు ప్రసిద్ధమవుతుంది. వృత్తిని, దృష్టిని, స్వభావాన్ని అన్నింటిని పరిశీలించేవారు వస్తారు కానీ వారికి సత్య జ్ఞానం యొక్క పరిచయం లభిస్తుంది. మంచిది.