14.11.1979        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


బ్రాహణ జీవితానికి గుర్తు సదా సంతోషం యొక్క మెరుపు.

ఒకటికి లెక్కలేనంత ఫలితాన్నిచ్చే సదా దాత భోళానాథ్ శివబాబా మాట్లాడుతున్నారు-

ఈ రోజు బాప్ దాదా పిల్లలందరి యొక్క అంతిమ స్థితి అనగా వికర్మాజీత్ స్థితి, వికల్పాలు లేదా వ్యర్థ సంకల్పాల నుంచి ముక్త స్థితిని చూస్తున్నారు. ఈ అంతిమ స్థితికి చేరుకునేటందుకు అందరూ పురుషార్థం అయితే చేస్తున్నారు. కానీ పురుషార్థీలలో రెండు రకాలైన పిల్లల్ని చూశారు. ఒకరు ఏదైతే పురుషార్థం చేస్తున్నారో ఆ పురుషార్థం యొక్క ప్రాలబ్దాన్ని అనగా ప్రాప్తిని వెనువెంట అనుభవం చేసుకుంటూ వెళ్తున్నారు. రెండవ వారు కేవలం పురుషార్థంలోనే నిమగ్నం అయి ఉన్నారు. శ్రమ ఎక్కువ, ప్రాప్తి తక్కువగా అనుభవం అవుతోంది. అందువలన నడుస్తూ... నడుస్తూ అలసిపోతున్నారు కూడా. యథార్ధ పురుషార్థీలు ఎప్పుడూ కూడా అలసటను అనుభవం చేసుకోరు. కారణం ఏమిటి? ఇద్దరి పురుషార్థంలో కేవలం ఒక విషయాన్ని అర్థం చేసుకోవడంలో తేడా ఉంది. అందువలన వారు భ్రమలో ఉంటున్నారు. రెండవ వారు ప్రేమలో నిమగ్నమై ఉంటున్నారు. ఏ సంకల్పంలో తేడా ఉంది తెలుసా? తేడా చిన్నదే ఒకరు అనుకుంటున్నారు, మేము నడుస్తున్నాము లేదా నడవాల్సి వస్తుంది, ఎదుర్కోవలసి వస్తుందని. ఇంకొకరు సదా సంకల్పంలో కూడా అర్పణ అయిపోతున్నారు. అందువలన మమ్మల్ని బాప్ దాదా నడిపిస్తున్నారని వారు అనుభవం చేసుకుంటున్నారు. శ్రమ అనే పాదంతో కాదు, స్నేహం అనే ఒడిలో నడుస్తూ ఉన్నారు, వారు స్నేహమనే పాదంతో నడుస్తున్నారు. కనుక దానిలో అలసట ఉండదు. స్నేహం యొక్క ఒడిలో లేదా ఊయలలో సర్వ ప్రాప్తుల యొక్క అనుభూతి కారణంగా వారు నడవడం లేదు కాని ఎగురుతున్నారు. సదా సంతోషంలో ఆంతరంగిక సుఖంలో సర్వ శక్తులతో ఎగురుతూ ఉన్నారు.
ఇప్పుడు మిమ్మల్ని మీరు అడగండి మేము ఎవరు? సంగమయుగీ బ్రాహ్మణ పిల్లలు. ప్రతి అడుగు స్నేహమనే ఒడిలో నడుస్తారు మరియు జీవిస్తారు. బ్రాహ్మణ జీవితానికి గుర్తు సదా సంతోషం యొక్క మెరుపు ప్రత్యక్ష రూపంలో కనిపిస్తుంది. సంతోషం లేకపోతే బ్రాహ్మణ జీవితం కూడా లేదు.

సంగమ యుగం యొక్క గొప్పతనం:-

సంగమయుగం పురుషార్థీ జీవితం మరియు భవిష్య జన్మలో ప్రాలబ్దం యొక్క జన్మలని కొంత మంది పిల్లలు భావిస్తున్నారు. ఒకటి ఇవ్వండి లక్ష పొందండి అని బాప్ దాదా ఏదైతే ప్రతిజ్ఞ చేసారో ఆ ప్రతిజ్ఞ భవిష్యత్తు కోసం అని అనుకుంటున్నారు కానీ కాదు. ఈ ప్రతిజ్ఞ సంగమయుగానిదే. ఎలా అయితే ఇది సర్వ శ్రేష్ఠ సమయమో, సర్వ శ్రేష్ఠ జన్మయో, సర్వ శ్రేష్ఠత టైటిల్స్ ఉన్నాయో అదే విధంగా సర్వ ప్రాప్తుల యొక్క అనుభవం అన్ని ప్రతిజ్ఞల యొక్క ప్రాప్తి ఈ సమయంలోనే లభిస్తుంది. భవిష్యత్తులోనూ ఉంటుంది కానీ భవిష్యత్తు కంటే కూడా వర్తమానం శ్రేష్ఠం. ఈ సమయంలో ఒక అడుగు వేస్తున్నారు అనగా బాబా నేను నీ వాళ్లం అని ఒక సంకల్పం పిల్లలు చేస్తున్నారు. దానికి బదులుగా బాబా ప్రతి సంకల్పం, మాట మరియు కర్మలో నేను నీవాడిని అని అనుభవం చేయిస్తున్నారు. అనగా బాబా నీ వారు. ఒక్క సంకల్పానికి బదులుగా సంగమయుగం అంతా జీవితమంతా బాబా నీ వారిగా అయిపోయారు. ఒకటికి కేవలం లక్ష రెట్లు లభించడం లేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎలా కావాలంటే అలా ఏది కావాలంటే అది బాబా సేవాధారీ రూపంలో బంధించబడి ఉన్నారు. కనుక ఒకటికి లక్ష రెట్లు కాదు కానీ అనేక సార్లు ఫలితం ఇస్తున్నారు. నడుస్తూ... నడుస్తూ వర్తమాన సమయం యొక్క గొప్పతనాన్ని మరిచిపోతున్నారు. ఈ సంగమ యుగానికి వరదానం ఉంది అది ఏమిటో తెలుసా! స్వయం వరదాతయే నీ వారు. ఎప్పుడైతే వరదాతయే నీ వారైపోయారో ఇక ఏం మిగిలింది? బీజం నీ చేతిలో ఉంది, ఆ బీజం ద్వారా సెకెనులో ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. కేవలం సంకల్పం చేయాలంతే. శక్తి కావాలి, సుఖం కావాలి, ఆనందం కావాలి అన్ని మీకోసం హాజరవుతాయి. ఎందుకంటే స్వయం భగవంతుడే నీ వారు. స్థూల సేవాధారులు పిలవడంతోనే ఎలా హాజరవుతారో అలాగే ఈ సర్వ ప్రాప్తులు సంకల్పం చేయగానే హాజరైపోతాయి. కానీ భగవంతుడు నీ వారై ఉండాలి, అప్పుడు అన్నీ హాజరవుతాయి. బీజం నీదైనప్పుడు ఈ ఫలాలన్నీ నీవే.

సంతోషం మాయమైపోవడానికి కారణం :-

నడుస్తూ.. నడుస్తూ.. ఏం చేస్తున్నారు. రెండు లడ్డూలను ఒకే చేతిలోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, తీసుకోవడానికి తయారైపోతున్నారు. కానీ వదలాల్సినవి కూడా తిరిగి తీసేసుకుంటున్నారు. అందువలన విస్తారంలోకి వెళ్లడం వలన సారాన్ని వదిలేస్తున్నారు. మధ్యలో బీజం జారిపోతోంది, ఇది తెలియడం లేదు. అందువలన ఖాళీ అయిపోతున్నారు. తిరిగి నిండుగా అవడానికి శ్రమిస్తున్నారు, కాని బీజాన్ని వదిలేస్తున్న కారణంగా ప్రత్యక్ష ఫలం యొక్క ప్రాప్తిని పొందలేక పోతున్నారు. అందువలన అలసిపోతున్నారు. భవిష్యత్తుపై నమ్మకంతో తమను తాము నడిపించుకుంటున్నారు. ప్రత్యక్ష ఫలానికి బదులు భవిష్యత్తు ఫలం ఆశపెట్టుకుని నడుస్తున్నారు. అందువలన సంతోషం యొక్క మెరుపు సదా కనిపించడం లేదు. శ్రమ యొక్క రేఖలు ఎక్కువగా కనిపిస్తున్నాయి, ప్రాప్తి యొక్క రేఖలు తక్కువగా కనిపిస్తున్నాయి, త్యాగం యొక్క అనుభూతి ఎక్కువగా ఉంది, భాగ్యం యొక్క అనుభూతి తక్కువగా ఉంది.

ఇప్పుడేం చేయాలి వర్తమాన సమయంలో ఎవరైతే ఈ సంప్రదింపుల్లోకి వస్తున్నారో వారు కూడా సమయాన్ని అనుసరించి ఇదే మాట అంటున్నారు - మీ త్యాగం చాలా గొప్పదని, కానీ మీ భాగ్యం చాలా గొప్పది అనాలి. వారికి త్యాగం కనిపిస్తుంది ఇప్పటి వరకు భాగ్యం కనిపించలేదు. ఇప్పుడు భాగ్యం గుప్తంగా ఉంది. త్యాగాన్ని చాలా మహిమ చేస్తున్నారు. కానీ అంతగానే భాగ్యం యొక్క మహిమ చేయాలి, అప్పుడు సెకెనులో స్వయం యొక్క భాగ్యం కూడా తెరవబడుతుంది. త్యాగాన్ని చూసి ఆలోచనలో పడుతున్నారు. భాగ్యం చూసి స్వయం కూడా భాగ్యశాలీ అయిపోతారు. ఏం మార్చుకోవాలో ఇప్పుడు అర్థమైందా! శ్రమ నుంచి తొలగి స్నేహం యొక్క, ప్రేమ యొక్క ఒడిలోకి వచ్చేయండి. నడుస్తున్నాము అనకండి. నడిపిస్తున్నారని అనాలి (కరెంటు పోయింది) పిల్లలు అంధకారంలో ఉండటం చూసి నా పిల్లలు ఇలాంటి ప్రపంచంలో ఉంటున్నారా అని బాబాకి కూడా ప్రత్యక్షంగా అనుభవం అవుతోంది. మంచిది ఏం చేయాలో ఇప్పుడు అర్థమైందా? భవిష్య ఫలం కంటే ముందు ప్రత్యక్ష ఫలం తినండి. సదా భగవంతుడిని బుద్ధిలో హాజరుగా పెట్టుకోండి. అప్పుడు సర్వ ప్రాప్తులు కూడా సదా చిత్తం ప్రభూ అని అంటాయి. భగవంతుడు హాజరుగా ఉంటే సర్వ ప్రాప్తులూ అయస్కాంతం వలే వాటికవే ఆకర్షితం అయి వస్తాయి. అర్థమైందా! పిల్లల శ్రమ చూసి బాప్ దాదా సహించలేకపోతున్నారు. ఎంతటి శ్రేష్ఠ ఆత్మలు, స్వయం బీజం నుంచి వచ్చిన కాండం యొక్క స్వరూపులు. అటువంటి శ్రేష్ఠ పిల్లలు సహజంగా సర్వ ప్రాప్తుల యొక్క అనుభవీగా అవ్వాలి. మంచిది

ఈ విధంగా సర్వ సహజ ప్రాప్తి పొందేవారికి, సదా సాగరుని సమానంగా అన్నింటిలోకి సంపన్నులకు, సదా బీజాన్ని తోడుపెట్టుకునే వారికి, బీజరూప స్థితిలో స్థితులయ్యేవారికి, వికర్మాజీత్, వికల్పాజీత్ అనే లక్ష్యాన్ని పొందేవారికి, సదా నిశ్చయబుద్ధి మరియు నిశ్చింతగా ఉండే పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.