05.04.1981        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


సమర్థ కర్మలకు ఆధారం - ధర్మం.

ఈరోజు బాప్ దాదా విశ్వపరివర్తకులు, విశ్వకళ్యాణకారులైన తన పిల్లలను చూస్తున్నారు. ఎప్పుడైతే బ్రాహ్మణ జన్మ తీసుకున్నారో అప్పటినుండి ఈ మహాన్ కర్తవ్యం కొరకు సంకల్పం చేసారు. బ్రాహ్మణజీవితం యొక్క ముఖ్య కర్మయే ఇది. మానవ జీవితంలో ప్రతి ఒక ఆత్మకి విశేషంగా రెండు ధారణలు ఉన్నాయి. 1. ధర్మం 2. కర్మ. ధర్మంలో స్థితులవ్వాలి మరియు కర్మ చేయాలి. ధర్మం లేకుండా జీవితం యొక్క కర్మలో సఫలత లభించదు. ధర్మం అంటే విశేష ధారణ. నేను ఏమిటి? ఈ ధారణ అంటే ధర్మం ఆధారంగా నేను ఏమి చేయాలి అనేది బుద్ధిలో స్పష్టం అవుతుంది. యదార్థ ధర్మం అంటే ధారణ అయినా, అయదార్ధం అయినా అసమర్ధ కర్మ కూడా అసమర్థ ధారణగా అవుతుంది. అంటే నేను మానవుడిని, నా ధర్మమే మానవ ధర్మం అంటే దీనిని దేహాభిమానం అంటారు. ఈ ధర్మం ఆధారంగా కర్మ కూడా వ్యతిరేకంగా జరుగుతుంది. అదేవిధంగా బ్రాహ్మణ జీవితంలో యదార్థ ధారణ ఇదే - నేను శ్రేష్ఠ ఆత్మను. నేను ఆత్మను శాంతి, సుఖం, ఆనంద స్వరూపాన్ని. దీని ఆధారంగానే కర్మ మారిపోయింది. ఒకవేళ కర్మలో శ్రేష్ఠతకు బదులు సాధారణ కర్మ జరుగుతుంది అంటే నేను శ్రేష్ఠ ఆత్మను, శ్రేష్ఠ గుణాల యొక్క స్వరూపాన్ని అనే ధారణలో లోపం ఉన్నట్లే. కనుక పునాది ఏమి అయ్యింది? - ధర్మం. అందువలనే ధర్మాత్మ అనే మాటని వాడతారు. మీరందరు ధర్మాత్మలు కదా! ధర్మాత్మలకి స్వతహాగానే వ్యర్థం లేదా సాధారణ కర్మ సమాప్తి అయిపోతుంది. మొదట ఇది పరిశీలన చేసుకోండి - సదా ధర్మంలో స్థితులై ఉంటున్నానా? అని. అలా ఉంటే కర్మ స్వతహాగానే సమర్ధంగా నడుస్తుంది. ఇదే మొదటి పాఠం - నేను ఎవరు? ఈ నేనెవరు? అనే ప్రశ్నలోనే మొత్తం జ్ఞానం అంతా వస్తుంది. నేను ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం తీస్తే ఎంత పెద్ద జాబితా తయారవుతుంది! ఇప్పుడిప్పుడే ఒకవేళ స్మృతిలోకి తెచ్చుకుంటే ఎంత పెద్ద లిస్ట్ తయారవుతుంది! ఎందుకంటే కర్మ ఆధారంగా అందరికంటే ఎక్కువ టైటిల్స్ బాబాకి మరియు బాబాతో పాటు సహాయకారులైన మీ అందరికీ లభించాయి. అన్నింటిలో మాస్టర్ అయిపోయారు కదా! కల్పమంతటిలో మీ టైటిల్స్ యొక్క జాబితా తీస్తే ఇంకెవ్వరికీ ఇన్ని టైటిల్స్ ఉండవు. దేవతలకు కూడా ఉండవు. కేవలం మీ టైటిల్స్ వ్రాయటం ప్రారంభిస్తే చిన్న పుస్తకం తయారవుతుంది. ఈ సంగమయుగం యొక్క టైటిల్స్ యే మీ డిగ్రీ. వారి డిగ్రీ ఎంత పెద్దది అయినా మీ ముందు గొప్పది కాదు. ఇంత నషా ఉంటుందా? అయినప్పటికీ మాట ఇదే వస్తుంది - నేను ఎవరు? రోజూ క్రొత్త టైటిల్స్ స్మృతిలో ఉంచుకోండి అంటే ఆ టైటిల్ యొక్క ధారణా స్వరూప ధర్మాత్మ అయ్యి కర్మ చేయండి. కర్మ చేస్తూ ధర్మాన్ని వదలకండి. ధర్మం మరియు కర్మ కలిసి ఉండటమే సంగమయుగం యొక్క విశేషత.

తెగిపోయిన ఆత్మ మరియు పరమాత్మల సంబంధాన్ని బాబా ఏవిధంగా జోడించారో అదేవిధంగా కర్మ మరియు ధర్మం యొక్క సంబంధాన్ని జోడించండి. అప్పుడు ధర్మాత్మగా ప్రత్యక్షం అవుతారు. ఈ రోజు బాప్ దాదా పిల్లలందరి ఇదే ఆట చూస్తున్నారు - ఎవరు ధర్మం మరియు కర్మ కలిసి చేయగలుగుతున్నారు అని. లేక ఒకటి పట్టుకుని ఇంకొక దానిని వదిలేస్తున్నారా? కర్మయోగం అంటే కర్మ మరియు యోగం యొక్క కలయిక ఎలా ఉంటుందో అదేవిధంగా కర్మ మరియు ధర్మం రెండింటిలో ఒకటి వదిలివేస్తే... ఊయల ఊగేటప్పుడు రెండు త్రాళ్ళు తప్పని సరిగా ఉండాలి. ఒక త్రాడు తెగిపోయినా లేక పైకి క్రిందకి అయినా, లేక చిన్నది పెద్దది అయినా, సమానత పోయినా పరిస్థితి ఎలా ఉంటుంది? అదేవిధంగా కర్మ మరియు ధర్మం యొక్క కలయిక ద్వారా సర్వ ప్రాప్తుల యొక్క ఊయలలో ఊగుతూ ఉంటారు. పైకి క్రిందకి అవ్వటం ద్వారా ప్రాప్తి యొక్క ఊయల నుండి అప్రాప్తి స్వరూపాన్ని అనుభవం చేసుకుంటారు. నడుస్తూ, నడుస్తూనే పరిశీలించుకోవటం రావటం లేదు. అందువలన ఊగడానికి బదులు ఏమి చేయము, ఎలా చేయము? అని అరుస్తున్నారు. అజ్ఞానులకు మీరు చెప్తారు నేనెవరు? అనేది మొదట తెలుసుకోవటం లేదు అని. అదేవిధంగా మిమ్మల్ని మీరు అడగండి - నేనెవరు? అనేది మంచిగా తెలుసుకున్నానా? దీనిలో కూడా మూడు స్థితులు ఉన్నాయి. 1. తెలుసుకోవటం 2. అంగీకరించడం 3. అంగీకరించి నడవటం అంటే స్వరూపంగా అవ్వటం. ఏ స్థితి వరకు చేరుకున్నారు? తెలుసుకోవటంలో అందరు పాస్ అయిపోయారు, అంగీకరించడంలో కూడా అందరు పాస్ అయిపోయారు కానీ మూడవది అంగీకరించి నడవటం అంటే స్వరూపంగా అవ్వటం దీనిలో ఏమని భావిస్తున్నారు? స్వరూపంగా అయిపోతే ఎప్పుడూ ఆ స్వరూపాన్ని మర్చిపోరు. దేహ స్వరూపాన్ని ఎప్పుడైనా మర్చిపోతారా ఏమిటి? దేహం అని భావించడం వ్యతిరేకం అని తెలుసు కానీ స్వరూపంగా అయిపోయింది కనుక మర్చిపోవాలన్నా మర్చిపోగలుగుతున్నారా! అదేవిధంగా ఈ స్వరూపాలను ఎదురుగా పెట్టుకుని స్వరూపం వరకు ఎంత వరకు తీసుకువచ్చాను? అని పరిశీలన చేసుకోండి. బాబా రోజూ స్వదర్శన చక్రధారులు అనే టైటిల్ స్మృతి ఇప్పిస్తారు కనుక ఈ విధంగా పరిశీలన చేసుకోండి - స్వదర్శనచక్రధారి సంగమయుగం యొక్క స్వరూపం, ఇది తెలుసుకునే వరకు తీసుకువచ్చానా, అంగీకరించే వరకు తీసుకువచ్చానా లేక స్వరూపంలోకి తీసుకువచ్చానా? అని పరిశీలన చేసుకోండి. సదా స్వదర్శనం నడుస్తుందా లేక పరదర్శనం స్వదర్శనాన్ని మరిపింపచేస్తుందా? దేహాన్ని చూడటం కూడా పరదర్శనం. స్వయం ఆత్మ, దేహం అనేది పరాయిది. ప్రకృతి పరాయిది. ప్రకృతి యొక్క భావంలోకి రావటం కూడా ప్రకృతికి వశీభూతం అవ్వటం. ఇది కూడా పరదర్శనచక్రం. మీ దేహాన్ని చూడటమే పరదర్శనం అయినప్పుడు ఇతరులు దేహాన్ని చూడటాన్ని స్వదర్శనం అని ఎలా అంటారు? వ్యర్థసంకల్పాలు లేక పాత సంస్కారం ఇవి కూడా దేహాభిమానానికి సంబంధించినవి. ఆత్మిక స్వరూపం యొక్క సంస్కారం అంటే బాబా యొక్క సంస్కారమే ఆత్మయొక్క సంస్కారం. బాబా యొక్క సంస్కారాలు తెలుసు కదా! బాబా సదా విశ్వకళ్యాణకారి, పరోపకారి, దయాహృదయుడు, వరదాత.... ఇలా ఈ సంస్కారాలు స్వతహారూపంగా అయ్యాయా? సంస్కారంగా అవ్వటం అంటే సంకల్పం, మాట మరియు కర్మ స్వతహాగా దాని అనుసారంగా నడవాలి. సంస్కారం ఎలాంటిదీ అంటే ఆత్మను స్వతహాగా తన ప్రకారం నడిపించుకుంటుంది. సంస్కారం అనేది స్వతహాగా తాళంచెవి లాంటిది. దీని ఆధారంగానే నడుస్తారు. ఆటబొమ్మకి తాళంచెవి(కీ) ఉంటుంది అది త్రిప్పితే నాట్యం చేస్తూ ఉంటుంది, పడిపోయేది అయితే పడిపోతూనే ఉంటుంది. అదేవిధంగా జీవితానికి సంస్కారం అనేది తాళంచెవి.(కీ) కనుక బాబా యొక్క సంస్కారాలు నిజసంస్కారంగా చేసుకున్నారా? దీనినే మీరు మరో మాటలో, ఇది నా సంస్కారం అని అంటారు. బాబా సదా వరదాని, సదా ఉపకారి, సదా దయాహృదయుడు. ఇలా బాబా సమానమైన సంస్కారాలు తయారైపోవాలి. కనుక శ్రమ చేయవలసి వస్తుందా? నేను ఎవరు అనేది స్వరూపంలోకి తీసుకురండి, ఈ ధర్మాన్ని కర్మలోకి తీసుకు వచ్చినప్పుడే స్వరూపం వరకు తీసుకువచ్చినట్లు. లేకపోతే తెలుసుకుని అంగీకరించే వారి లిస్ట్ లోకి వెళ్ళిపోతారు. సదా స్మృతి ఉంచుకోండి - నా యొక్క ధర్మం ఇది అని. సదా ఈ ధర్మంలో స్థితులై ఉండండి. ఏమైపోయినా, వ్యక్తులైనా, ప్రకృతి అయినా, పరిస్థితి అయినా చలింపచేసినా మీ యొక్క స్లోగన్-భూమి బ్రద్దలైనా ధర్మం మాత్రం వదలకూడదు. ఈ స్లోగన్ లేక ప్రతిజ్ఞ స్మృతిలో ఉంచుకోండి.

ఈ సమయంలో కల్పపూర్వపు పాత పిల్లలు ఇప్పుడు క్రొత్తగా కలుసుకోవడానికి వచ్చారు. మీరు అతి పురాతనమైన వారు మరియు క్రొత్తవారు కూడా! క్రొత్త పిల్లలు అంటే అందరి కంటే చిన్నవారు మరియు అందరి కంటే గారాభమైనవారు. క్రొత్త ఆకులు అందరికీ సుందరంగా అనిపిస్తాయి కదా! కనుక భలే ఇప్పుడు క్రొత్తవారైనా అధికారంలో నెంబర్ వన్. ఈ విధంగా సదా పురుషార్థం చేస్తూ నడవండి. అన్నిటికంటే మొదటి అధికారం - పవిత్రత యొక్క అధికారం, దీని ఆధారంగా సుఖ, శాంతులు మరియు సర్వ అధికారాలు లభిస్తాయి. కనుక మొదట పవిత్రత యొక్క అధికారం తీసుకోవటంలో అందరు నెంబర్ వన్‌గా ఉండాలి. అప్పుడు ప్రాప్తిలో కూడా నెంబర్ వన్ గా అయిపోతారు. పవిత్రత యొక్క పునాదిని ఎప్పుడు బలహీనంగా చేసుకోకూడదు. అప్పుడే లాస్ట్ నుండి ఫాస్ట్ గా వెళ్ళగలరు. బాప్ దాదాకి కూడా పిల్లలను చూసి ఆనందంగా ఉంటుంది - పిల్లలు మరలా తమ అధికారం తీసుకోవడానికి బాబా దగ్గరకి చేరుకున్నారు అని. అందువలన ఎక్కువగా పరుగు పెట్టండి. ఇప్పుడు బాగా ఆలస్యం అయిపోయింది అనే బోర్డు పెట్టలేదు. అన్ని సీట్స్ ఖాళీగా ఉన్నాయి. ఇంకా నిర్ణయం అవ్వలేదు. ఎవరు కావాలంటే వారు నెంబర్ తీసుకోగలరు. ఇంత ధ్యాస పెట్టుకుని నడుస్తూ వెళ్ళండి, అధికారిగా అవ్వండి. యోగ్యతలను ధారణ చేసి యోగ్యమైన వారిగా అవ్వండి.

ఈవిధంగా బాబా సమానంగా సదా శ్రేష్ఠ ధర్మం మరియు శ్రేష్ఠ కర్మధారి, సదా ధర్మాత్మ, సదా స్వదర్శనచక్రధారి స్వరూపులకు, సదా సర్వప్రాప్తి స్వరూపులకు, ఈ విధమైన శ్రేష్ఠ ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.

మురళీ యొక్క సారం -

1. ధర్మం అంటే విశేష ధారణ, ధర్మంలో స్థితులై కర్మ చేయాలి. ధర్మం లేకుండా కర్మలో సఫలత లభించదు.

2. ధర్మం మరియు కర్మ యొక్క సంబంధాన్ని జోడించినప్పుడే ధర్మాత్మగా ప్రత్యక్షం అవుతారు. ధర్మం మరియు కర్మ రెండింటి కలయిక ద్వారా సర్వప్రాప్తుల యొక్క ఊయలలో ఊగుతారు.

3. భూమి బ్రద్దలైనా ధర్మాన్ని వదలకండి, ఏమైనా కానీ ధర్మంలో సదా స్థితులై ఉండాలి.

సర్వ బ్రాహ్మణ ఆత్మలకు ఈ సంవత్సరం కొరకు అవ్యక్త బాప్ దాదా యొక్క సైగ:-

ఈ సంవత్సరం ప్రతి ఒక్కరు ఈ ధ్యాస పెట్టుకోవాలి మేము మూడు సర్టిఫికెట్స్ తీసుకోవాలి అని. (మనస్సుకి ఇష్టమైన వారిగా, లోకానికి ఇష్టమైన వారిగా మరియు బాబాకి ఇష్టమైనవారిగా అవ్వాలి) మనస్సు యొక్క సర్టిఫికెట్ ఉందా, లేదా అనే పరిశీలన బాప్ దాదా యొక్క గదిలోకి వెళ్ళి చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ సమయంలో బాబా దర్పణంగా అవుతారు, ఆ దర్పణంలో ఏది ఉన్నా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ సమయంలో బాబా ఎదురుగా మీ మనస్సు - నేను మంచిగా ఉన్నాను అని సర్టిఫికెట్ ఇస్తే మీరు మంచిగా ఉన్నట్లే. ఒకవేళ ఇది మంచిది కాదు అనిపిస్తే వెంటనే పరివర్తన చేసుకోవాలి. ఏదైనా విషయం గురించి ఎక్కువ మంది మీకు సైగ చేస్తే ఆ సమయం మీకు తప్పు కాదు అనిపించినా కాని లోక సంగ్రహణార్థం పైవారి నుండి దీనిపై ధ్యాస పెట్టండి అని ఆజ్ఞ లభిస్తే మీరు ఆ ఆజ్ఞానుసారమే నడవాలి, కానీ మీ మతానుసారం నడవకూడదు. ఒకవేళ మీలో సత్యత శక్తి ఉంటే సత్యతనే మహానత అని అంటారు. ఎవరైతే స్వయం ఒంగి ఉంటారో వారినే మహాన్ అంటారు. ఒకవేళ కళ్యాణం కోసం వంగవలసి వచ్చినా అది వంగటం కాదు, కానీ అది మహానత, అనుకూల సేవ కోసం మహాన్ ఆత్మలు వంగవలసే ఉంటుంది. కనుక ఈ ధ్యాస ఎక్కువగా ఉంచుకోండి. దీనిలోనే సోమరితనం వస్తుంది. నేను మంచిగా ఉన్నాను అని భావిస్తున్నారు మంచిదే, కానీ మంచిగా ఉన్నవారు స్వయాన్ని కూడా మలచుకోగలరు. ఒకవేళ ఇతరులకు మీ యొక్క నడవడిక ద్వారా ఏదైనా సంకల్పం ఉత్పన్నం అవుతుంది అంటే దానిని మలచుకోవడంలో నష్టం ఏమి ఉంది? అందరి ఆశీర్వాదాలు అయితే లభిస్తాయి కదా!

ఈ ఆశీర్వాదాలు లాభమే కదా! ఎందుకు, ఏమిటి అనే దానిలోకి వెళ్ళకండి. ఇది ఎందుకు, ఇది ఇలా అవుతుంది, అలా అవుతుంది, వీటికి ఫుల్‌స్టాప్ పెట్టండి. ఇప్పుడు ఈ విశేషతను లైట్‌హౌస్ మాదిరిగా నలువైపుల వ్యాపింపచేయండి. దీనినే - ఒకరు చెప్పారు, రెండవవారు అంగీకరించారు అంటారు అంటే అనేకులకు సుఖం ఇవ్వడానికి నిమిత్తం అయ్యారు. దీనిలో నేను క్రిందకి దిగిపోయాను అని ఎప్పుడు ఆలోచించకండి. పొరపాటు చేసాను కనుక నేను పరివర్తన అవుతున్నాను అని భావించకండి. కానీ సేవ కోసం పరివర్తన అవుతున్నాను అని భావించండి. సేవ కోసం స్థూలంగా కూడా కొంచెం శ్రమ చేయవలసి ఉంటుంది కదా! కనుక శ్రేష్ఠ, మహాన్ ఆత్మగా అయ్యేటందుకు కొద్దిగా పరివర్తన అయితే ఏమైంది? దీనిలో ఓ అర్జునా!గా అవ్వండి. దీని ద్వారా వాతావరణం తయారవుతుంది. ఒకరి నుంచి ఇద్దరు, ఇద్దరి నుండి ముగ్గురు ఇలా తయారవుతారు. ఒకవేళ ఎవరైనా పొరపాటు చేస్తే దానిని అంగీకరిస్తే అదేమి పెద్ద విషయం కాదు, కానీ అది మీ పొరపాటు కాదు, కానీ లోకం కోసం చేసారు అంటే మహానత కదా! దీనిలో ఒకవేళ ఎవరైనా వీరు ఇది చేసారు. అంటే క్రిందకి దిగిపోయారు అని భావించినా పర్వాలేదు. ఎందుకంటే బాబా యొక్క లిస్టులో మీరు ముందు నెంబర్ లో ఉంటారు. దీనిని అణిచివేయటం అనరు. బ్రాహ్మణుల యొక్క భాష ఇలా కూడా ఉంటుంది కదా - ఎంతవరకు అణిగి ఉంటాము........ ఎంతవరకు చనిపోతాము.... ఎంతవరకు సహిస్తాము...... ఒకవేళ ఇక్కడ అణిగి ఉన్నా అనేక మంది మీ పాదాల క్రింద అణిగి ఉంటారు. ఇది అణిగి ఉండటం కాదు, అనేకులకు పూజ్యులుగా అవ్వటం, మహానుగా ఉండటం.
ఈ సంవత్సరం ఈ విధమైన క్రొత్త ప్లాన్ తయారు చేయండి - మోహజీత్ పరివారం యొక్క కథ వినిపిస్తారు కదా! ఏ సంబంధీకుల దగ్గరికి వెళ్ళినా వారికి జ్ఞానం వినిపించారు అని. కనుక పిల్లలైన మిమ్మల్ని కూడా ఎవరైనా కలుసుకోవడానికి వచ్చినా వారికి ఇదే అనుభవం అవ్వాలి - నేను ఏదో ఒక ఫరిస్తాను కలుసుకుంటున్నాను అని. రావటంతోనే వారికి గారడీ కనిపించాలి. ఆదిలో బాబాని చూసినా, మురళి విన్నా, పరివారాన్ని చూసినా లీనమైపోయేవారు. అదేవిధంగా ఇప్పుడు కూడా ఆలోచించి వచ్చినవారు దానికంటే కోటిరెట్లు ఎక్కువ అనుభవం చేసుకుని వెళ్ళాలి. ఇప్పుడు ఇటువంటి ప్లాన్ తయారుచేయండి. ధృఢసంకల్పంతో అన్ని జరుగుతాయి. ఒకవేళ ఒకరైనా ఇలాంటి అనుభవం చేయిస్తే అందరు దానిని అనుసరిస్తారు.

ఈ సంవత్సరం విశేషంగా ప్రతి ఒక్కరు సహనశీలత యొక్క గుణాన్ని ధారణ చేయాలి. సంఘటనలో ఒకవేళ ఎవరైనా ఒకరి కోసం ఏదైనా మాట్లాడుతున్నారు అనుకోండి, రెండవవారు నిశ్శబ్దంగా ఉండాలి. మాట్లాడేవారు ఎంత వరకు మాట్లాడుతారు! చివరికి నిశ్శబ్దం అయిపోతారు. కేవలం వారు అనేది పదిసార్లు వినే ధైర్యం ఉండాలి. ఇతరులను మార్చడానికి కొద్దిగా సహించవలసి వస్తుంది. రెండు సార్లు వినగానే బలహీనం అయిపోకండి. 10-12 సార్లు విన్నా సహించండి. బాబా ఎంతమంది పిల్లల సంస్కారాలను పరివర్తన చేసారు! బ్రహ్మ ఫస్ట్ అధికారి ఆత్మ అయినా కానీ ఆయన కూడా చిన్న పిల్లలతో విన్నారు. అజ్ఞానులతో విన్నారు. అగౌరవాన్ని సహించారు.

బ్రహ్మాబాబానే అగౌరవపరిస్తే ఇక మీరు ఎంత! బాబా అన్ని సహిస్తూ పరివర్తన చేసారు. కనుక ఈ విషయంలో బాబాని అనుసరించండి. కేవలం ధైర్యం ఉంటే అన్ని సహజం అయిపోతాయి. మొదట కొద్దిగా - ఎలా అవుతుంది, ఎంతవరకు సహిస్తాము? అనిపిస్తుంది... ధైర్యం మాత్రం వదలకుండా ఉంటే ఇప్పుడిప్పుడే అయిపోతుంది, ఎంతవరకు అని భవిష్యత్తు ఆలోచిస్తే అప్పుడు సంకల్పం బలహీనం అవుతుంది. ఎంతవరకు ఉంటుంది అని ఆలోచించకండి. సంకల్పంలో ధృఢత తీసుకురండి. భవిష్యత్తుపై వదిలేయటం ద్వారా వర్తమానం బలహీనం అయిపోతుంది.