18.11.1981        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


సంపూర్ణత యొక్క సమీపతకు గుర్తు.

సదా మనస్సుతో సంతోషంగా ఉండే మరియు అదృష్టవంతులైన పిల్లలతో బాప్ దాదా మాట్లాడుతున్నారు -

ఈరోజు మనోభిరాముడైన బాబా తన హృదయసింహాసనాధికారి పిల్లలతో మనస్సు యొక్క విషయాలు మాట్లాడేటందుకు వచ్చారు. మనోభిరాముని యొక్క మనస్సులో ఏ ఒక్క విషయం ఉంటుంది అనేది పిల్లలందరికీ తెలుసు. సదా సర్వులకు విశ్రాంతిని ఇచ్చే మనోహరమైన పిల్లలే సదా బాబా మనస్సులో ఉంటారు. బాబా మనస్సులో పిల్లలందరి గురించి ఒక విషయం ఉంది - ప్రతి ఒక్క బిడ్డ విశేష ఆత్మ మరియు విశ్వానికి యజమానిగా అవ్వాలి. విశ్వరాజ్యభాగ్యానికి అధికారిగా అవ్వాలి. ప్రతి ఒక్క పిల్లవాడు ఒకరి కంటే ఒకరు శ్రేష్టంగా అలంకరించబడి, గుణసంపన్నంగా, శక్తి సంపన్నంగా నెంబర్ వన్ గా అవ్వాలి. ప్రతి ఒక్కరి విశేషత ఒకరి కంటే ఒకరిది ఎక్కవ ఆకర్షితం చేయాలి, అది చూసి విశ్వం మీ ప్రతి ఒక్కరి గుణాల మహిమ చేయాలి. ప్రతి ఒక్కరు విశ్వానికి లైట్‌హౌస్, మైట్‌హౌస్, భూమిపై మెరిసే నక్షత్రాలు. ప్రతి ఒక్క సితార శ్రేష్టకర్మ, శ్రేష్ట సంకల్పం ద్వారా జమ చేసుకున్న విశేషతలు లేదా ఖజానా ఎంత నిండుగా ఉండాలంటే ప్రతి ఒక్క సితారలో తన యొక్క విశేష ప్రపంచం కనిపించాలి. ప్రతి ఒక్కరు అది చూసి తమ దు:ఖాన్ని మర్చిపోయి సుఖం యొక్క అనుభూతి చేసుకుని సంతోషం అవ్వాలి. ప్రతి ఒక్కరి సర్వప్రాప్తుల యొక్క అలౌకిక ప్రపంచాన్ని చూసి ఓహో! ఓహో! అనే పాటలు పాడాలి. ఇదే మనోభిరాముని మనస్సులోని విషయం.

ఇప్పుడు పిల్లల యొక్క మనస్సులో ఏముంది, ప్రతి ఒక్కరికి ఎవరి మనస్సు గురించి వారికి బాగా తెలుసు కదా? ఇతరుల మనస్సు గురించి కూడా తెలుసా? లేక కేవలం మీ గురించే తెలుసా? పరస్పరం ఆత్మిక సంభాషణ చేసుకుంటున్నప్పుడు మీ మనస్సు యొక్క ఉత్సాహ, ఉల్లాసాల గురించి చెప్తారు కదా! దానిలో ముఖ్యంగా ఏమి వర్ణన చేస్తారు? అందరి యొక్క విశేష సంకల్పం ఇదే ఉంటుంది - బాబా ఏదైతే చెప్తున్నారో అది చేసి చూపించాలి. బాబా సమానంగా అయ్యే తీరుతాం, అంటే బాబా యొక్క మనస్సులోని విషయం, పిల్లల యొక్క మనస్సులోని విషయం ఒకటే అయ్యింది కదా! అయినప్పటికీ నెంబర్‌వారీ పురుషార్థులు ఎందువలన? అందరు నెంబర్ వన్‌గా ఎందుకు అవ్వటం లేదు? అందరు నెంబర్‌ వన్‌గా కాగలరా? అందరు విశ్వరాజుగా కాగలరా లేక ఇది కూడా అవ్వరా? కేవలం ఒకరే విశ్వమహారాజుగా అవుతారా లేక తమ తమ సమయాలలో మరికొందరు అవుతారా? మరి అయితే మేము విశ్వం యొక్క రాజ్యభాగ్యం తీసుకుంటున్నాం అని, విశ్వరాజ్యాధికారి అవుతాము అని అందరూ ఎందుకు అంటున్నారు? రాజ్యంలోకి వస్తారా లేక రాజ్యం చేస్తారా? కొందరు చేసేవారిగా మరికొందరు రాజ్యంలోకి వచ్చేవారిగా అవుతారా లేక అందరూ రాజ్యం చేసేవారిగానే అవుతారా? ఏమి అవుతారు? ప్రజలు అయితే ఇంకా ఎక్కువమంది వస్తారు. దాని గురించి చింతించకండి. కేవలం రాజ్యంలోకి రావడానికే ఇంత శ్రమ చేస్తున్నారా? రాజ్యం పొందడానికి కాదా? రాజ్యంలోకి రావడానికేనా? అందరు రాజ్యం చేస్తారు కదా? ప్రతి ఒక్కరు నేను అయితే చేస్తాను కానీ మిగిలిన వారు వస్తారా, చేస్తారా అనేది వారికి తెలుస్తుంది అంటారా? రాజయోగం నేర్చుకుంటున్నారు కదా? రాజుగా అయ్యే యోగం నేర్చుకుంటున్నారా లేక రాజ్యంలోకి వచ్చే యోగం నేర్చుకుంటున్నారా? రాజయోగులు కదా? రాజ్యంలోకి వచ్చే యోగులు కాదు కదా? ఇలా అందరు నెంబర్ వన్ అవుతారా లేక అంతిమం వరకు నెంబర్ వారీగా ఉంటారా?

ఇంతకు ముందు చెప్పాను కదా - ప్రతి ఒక్కరు తమ స్థితిని అనుసరించి, తమ లెక్కననుసరించి నెంబర్‌ వన్‌గా అయితే అవుతారు కదా! వారికి అదే నెంబర్ వన్ గోల్డెన్ స్థితి అవుతుంది కదా! అందరికంటే నెంబర్ వన్ శ్రేష్టస్థితి కూడా ఆ లెక్కతో అంతిమంలో అయితే తయారైపోతారు కదా! తన యొక్క లెక్కతో సంపన్నంగా మరియు సంపూర్ణంగా అయిపోతుంది. మొత్తం కల్పంలో ఆ ఆత్మకి అదే నెంబర్ వన్ శ్రేష్టస్థితి ఉంటుంది కదా! ప్రతి ఒక్క ఆత్మకి తన యొక్క సంపూర్ణస్థితి ఉంటుంది. ఏవిధంగా అయితే బ్రహ్మాబాబా యొక్క పురుషార్థ స్థితి మరియు సంపూర్ణ స్థితి రెండింటినీ చూసారు మరియు సంపూర్ణత ద్వారా పొందిన ఏయే విశేషతలు అవ్యక్తరూపం ద్వారా కూడా పాత్రలోకి తీసుకువస్తున్నారో అనుభవం చేసుకుంటున్నారు కదా! ఏవిధంగా అయితే బ్రహ్మాబాబా యొక్క పురుషార్థి స్వరూపం మరియు సంపూర్ణ స్థితి రెండింటిలో తేడాను అనుభవం చేసుకుంటున్నారో అదేవిధంగా ప్రతి ఒక్క బ్రాహ్మణాత్మకి కూడా సంపూర్ణస్థితి యొక్క స్వరూపం ఉంటుంది. దీనిని అవ్యక్త వతనంలో ప్రత్యక్షం చేసి బాప్ దాదా చూస్తూ ఉంటారు మరియు చూపించగలరు కూడా. బాబా సంపూర్ణ స్వరూపాన్ని చూస్తూ ప్రతి ఒక్కరి స్వరూపం ఎంత ఆత్మిక మెరుపుతో లేదా వెలుగుతో ఉందో చూస్తున్నారు. ఇప్పుడు సంపూర్ణతను పొందుతున్నారు మరియు తప్పకుండా పొందవలసిందే. కానీ కొంతమంది పిల్లలకు సంపూర్ణ స్థితి సమీపంగా ఉంది. దీనికి గుర్తు బ్రహ్మాబాబాని చూసారు కదా - సదా తన యొక్క సంపూర్ణస్థితి మరియు భవిష్య ప్రాలబ్ధం, అంటే ఫరిస్తా రూపం మరియు దేవతా పదవి యొక్క స్వరూపం రెండూ చాలా స్పష్టంగా స్మృతిలో ఉండేవి. దాని ద్వారా ఎదురుగా వెళ్ళినవారు పురుషార్థీ స్వరూపంలో ఉన్నా కానీ బాబా ద్వారా ఫరిస్తా రూపాన్ని మరియు భవిష్య శ్రీకృష్ణుని రూపాన్ని చూసేవారు మరియు వర్ణన చేసేవారు. అదేవిధంగా పిల్లలలో కూడా సంపూర్ణత యొక్క సమీపతకు గుర్తు స్వయం కూడా సమీపత యొక్క అనుభవం చేసుకుంటారు మరియు ఇతరులకు కూడా అనుభవం అవుతుంది. వ్యక్తంలో ఉంటూ అవ్యక్త రూపం యొక్క అనుభవం అవుతుంది. దీని ద్వారా ఎదురుగా వచ్చిన ఆత్మలు కూడా వ్యక్తభావాన్ని మర్చిపోయి అవ్యక్తస్థితిని అనుభవ చేసుకుంటారు. ఇదే సమీపతకు గుర్తు. మరి కొంతమంది పిల్లలకు ఇప్పుడు సంపూర్ణత మరియు సమీపత స్పష్టంగా అనుభవం అవ్వదు, వారి గుర్తు ఏమిటి? స్పష్టమైన వస్తువుని, సమీపమైన వస్తువుని అనుభవం చేసుకోవటం సహజం. దూరవస్తువుని అనుభవం చేసుకోవాలి అంటే దాని కొరకు విశేష బుద్ధి ఉపయోగించవలసి ఉంటుంది. అదేవిధంగా ఈ ఆత్మలు కూడా జ్ఞానం ఆధారంగా, బుద్ధి యోగం ద్వారా శ్రమతో సంపూర్ణ స్థితిని తెచ్చుకుని స్థితులు అవుతారు.

రెండవ విషయం - ఇటువంటి ఆత్మలకి సంపూర్ణ స్థితి స్పష్టంగా కనిపించని కారణంగా అవ్వాలి కానీ కాగలమా? అనే సంకల్పం కూడా అప్పుడప్పుడు ఉత్పన్నం అవుతుంది. అంటే స్వయం పట్ల కొంచెం అయినా, సంకల్ప రూపంలో అనుమానం వచ్చింది అంటే అది సంశయం యొక్క సూక్ష్మ రూపం. కొద్దిపాటి అల రూపంలో అనుభవం వచ్చింది అంటే పోయినట్లే. నిశ్చయబుద్ధి విజయంతి అందువలన స్వప్న మాత్రపు సంకల్పం అయినా లేదా కొద్దిపాటి అల మాదిరి సంకల్పం అయినా అంతిమ నెంబరుని దూరం చేసేస్తుంది. అటువంటి ఆత్మల యొక్క విశేష సంస్కారం లేదా స్వభావం ఏమిటంటే వారు ఇప్పుడిప్పుడే చాలా ఉత్సాహ - ఉలాసాలతో ఎగిరేవారిగా ఉంటారు మరియు ఇప్పుడిప్పుడే స్వయం బలహీనం అయిపోతారు. జీవితంలో మాటిమాటికి ఈ మెట్లు ఎక్కుతూ దిగుతూ ఉంటారు. ఇలా మానసిక సంతోషం మరియు మానసిక బలహీనతకి కారణం ఏమిటి? వారి సంపూర్ణ స్థితి స్పష్టంగా మరియు సమీపంగా లేదు. అయితే ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు సంపూర్ణ స్థితిని సమీపంగా తీసుకురండి. ఎలా తీసుకువస్తారు? దాని యొక్క విధి కూడా మీకు తెలుసు. తెలుసా? అవ్వటానికి అయితే నవ్వు వచ్చే విషయం. బాప్ దాదా ఏమి చూస్తున్నారు? కొంతమంది పిల్లలు, అలాగని అందరూ కాదు కానీ ఎక్కువ మంది పిల్లలు ఏమి చేస్తున్నారు? ఉన్నతోన్నతమైన తండ్రి యొక్క గారాబ పిల్లలు అయిన కారణంగా ఒకొక్కసారి అతి గారాబం అయిపోతున్నారు. అందువలన నాజూకుగా అయిపోతున్నారు. నాజూకు అయినవారు వయ్యారాలు చూపిస్తారు కదా! అయితే ఏమి వయ్యారాలు చూపిస్తున్నారు? బాబా విషయాలను తిరిగి బాబాకే చెప్తున్నారు. నాజూకుగా అయిపోయి బాబా మా తరపున నీవే చేయాలి అంటున్నారు. సహనశక్తి యొక్క గట్టితనం తక్కువగా ఉంది. సర్వ విఘ్నాల నుండి రక్షించుకునే కవచం సహనశక్తి, కవచం ధరించని కారణంగా నాజూకు అయిపోతున్నారు. నేను చేయాలి అనే పాఠంలో బాగా బలహీనంగా ఉన్నారు. ఇతరులు చేయాలి లేదా బాబా చేయాలి అనే పాఠం నాజూకుగా తయారు చేస్తుంది. అందువలన సోమరితనం యొక్క పరదా అడ్డు వచ్చేస్తుంది. సంపూర్ణ స్థితి స్పష్టంగా మరియు సహజంగా కనిపించటం లేదు. అందువలన మూడు లోకాలు తిరగడానికి బదులు ఈ ప్రపంచంలోనే అంటే సంతోషం మరియు బలహీనత యొక్క విషయాలనే మెట్లు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. అందువలన ఏమి చేయాలి? గారాబంగా అవ్వండి కానీ సోమరితనం కల్గిన గారాబంగా అవ్వకండి. అప్పుడు ఏమి అవుతుంది? మీ సంపూర్ణతను సహజంగా పొందగలరు. ముందు సంపూర్ణ స్థితి మిమ్మల్ని వరించాలి అంటే సదా ఉత్సాహ - ఉల్లాసాలు అనే వరమాల వేయాలి. అప్పుడు లక్ష్మిని వరిస్తారు లేదా నారాయణుని వరిస్తారు. పురుషార్థులు అయిన మిమ్మల్ని మీ సంపూర్ణ స్థితి ఆహ్వానిస్తుంది. మీరందరూ సంపూర్ణంగా అయినప్పుడే సంపూర్ణ బ్రహ్మ మరియు బ్రాహ్మణాత్మలు అందరూ వెనువెంట బ్రహ్మలోకం (ఇంటికి) వెళ్ళగలరు మరియు తిరిగి రాజ్యంలోకి రాగలరు. మంచిది.

ఈ విధంగా సంపూర్ణస్థితికి సమీపంగా ఉండేవారికి, బ్రహ్మాబాబాతో పాటూ సంపూర్ణ స్థితిని వరించేవారికి, సదా తమ యొక్క సంపూర్ణ స్థితి యొక్క అనుభూతి ద్వారా ఇతరులకు కూడా సంపూర్ణంగా అవ్వాలనే ప్రేరణ ఇచ్చేవారికి, స్పష్టత ద్వారా దర్పణంగా అయ్యి సంపూర్ణ స్థితిని స్పష్టంగా సాక్షాత్కారం చేయించేవారికి, సదా మనస్సుతో సంతోషంగా ఉండేవారికి, ఇటువంటి అదృష్టవంతులైన పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.