17.03.1982        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


సంగమయుగము యొక్క విశేష వరదానము - 'అమర భవ'

బాప్ దాదా ఈరోజు తమ కల్పకల్పపు అధికారీ ఆత్మలను చూస్తున్నారు. శ్రేష్ట భాగ్యమునకు చెందిన అధికారులుగా ఎవరెవరు అయ్యారు అన్నదానిని చూసి హర్షితులవుతున్నారు. అధికారీ ఆత్మలను చూస్తూ బాప్ దాదా ఈరోజు పరస్పరములో ఆత్మిక సంభాషణ చేస్తూ హర్షితులయ్యారు. ఇటువంటి ఆత్మలు కూడా శ్రేష్టంగా అవ్వగలవు అన్న దానిని గురించి ఆలోచించటము కూడా అసంభవము అని ప్రపంచములోని వారు ఎవరి గురించైతే అనుకున్నారో అటువంటివారి పైకి మీ దృష్టి పోయింది అని బ్రహ్మాబాబా అన్నారు. ప్రపంచములోని వారి దృష్టిలో అతి సాధారణ ఆత్మలు, అటువంటి వారిని బాప్ దాదా తన కంటి ప్రకాశ రత్నాలుగా చేసుకున్నారు. పూర్తిగా నిరాశలో ఉన్న ఆత్మలను విశ్వము ముందు సర్వ శ్రేష్ట ఆత్మలుగా చేసారు. ఆల్ మైటీ అథారిటీ యొక్క పాండవసేనలో ఎవరెవరు మైదానములో ఉపస్థితులై ఉన్నారు అని బాప్ దాదా తన సేనలోని మహావీరులను, అస్త్రధారీ ఆత్మలను చూస్తుండినారు. ఏం చూసి ఉండవచ్చు? ఎంత అద్భుతమైన సేన! ప్రపంచము లెక్కలో చదువురానివారుగా కనిపిస్తారు కానీ పాండవసేనలో వారికే నాలెడ్జ్ ఫుల్ అన్న టైటిల్ లభించింది. అందరూ నాలెడ్జ్ ఫుల్ (జ్ఞాన సంపన్నులే) కదా? శరీరము నడవటము, లేవటము కూడా కష్టము కానీ పాండవ సేన లెక్కలో క్షణకాలములో పరంధామము వరకు చేరుకుని రాగలరు. వారైతే కేవలము ఒక్క హిమాలయము పైనే జెండా ఎగరవేస్తారు కానీ శివ శక్తి పాండవ సేన మూడు లోకాలలో తమ జెండాను ఎగురవేసారు. అమాయకులు కానీ ఎంత తెలివైనవారంటే వారు విచిత్రుడైన బాబాను కూడా తనవారిగా చేసుకున్నారు. మరి అటువంటి సేనను చూసి బాప్ దాదా హర్షితులవుతున్నారు. దేశములోనైనా, విదేశములోనైనా సత్యమైన బ్రాహ్మణులుగా సాధారణ ఆత్మలే అవుతారు. వర్తమాన సమయములో వి.ఐ.పి.లుగా పిలువబడతారు, అందరి దృష్టిలో ఉంటారు కానీ బాబా దృష్టిలో ఎవరు ఉంటారు? వారు ప్రసిద్ధులైన, కలియుగ ఆత్మల ద్వారా స్వార్థము కారణంగా గాయనము చేయబడతారు లేక గౌరవింపబడతారు. వారికి అల్పకాలికమైన కలియుగ ప్రపంచములో మహిమ ఉంటుంది. ఇప్పుడిప్పుడే మహిమ ఉండటము, ఇప్పుడిప్పుడే మహిమ లేకుండా ఉండటము. కానీ సంగమయుగ పాండవ సేనలోని పాండవులు మరియు శక్తుల మహిమ మొత్తము కల్పమంతా స్థిరంగా ఉంటుంది. ఎందుకంటే అవినాశీ తండ్రి నోటి నుండి ఏ మహిమ అయితే గాయనము చెయ్యబడుతుందో అది అవినాశిగా అవుతుంది. మరి ఎంత నషా ఉండాలి! నేటి ప్రపంచములో కూడా గురువు రూపంలో గౌరవింపబడుతున్న ఎవరైనా శ్రేష్ట ఆత్మ ఒకవేళ ఏదైనా విషయమును ఎవరికైనా చెప్పినట్లయితే గురువు చెప్పారు కనుక అది సత్యముగానే ఉంటుంది అని భావిస్తారు మరియు అదే నషాలో ఉంటారు. నిశ్చయము ఆధారంగా నషా ఉంటుంది. అలాగే, ఆలోచించండి - మీ మహిమను ఎవరు చేస్తారు? శ్రేష్ట ఆత్మలు అని ఎవరు అంటారు? మరి మీకు ఎంత నషా ఉండాలి!

వరదాత అనండి, విధాత అనండి, భాగ్యదాత అనండి, అటువంటి తండ్రి ద్వారా శ్రేష్ట ఆత్మలైన మీకు ఎన్ని టైటిల్స్ లభించి ఉన్నాయి! ప్రపంచములో ఎంత పెద్ద పెద్ద టైటిల్స్ ఉన్నాగానీ శ్రేష్ట ఆత్మలైన మీ ఒక్క టైటిల్ ముందు ఆ అనేక టైటిల్స్ కూడా ఏమీ లెక్కలేనట్లు. అటువంటి సంతోషము ఉంటుందా?

సంగమయుగము యొక్క విశేష వరదానము ఏంటి? అమర బాబా ద్వారా 'అమర భవ', సంగమయుగములోనే 'అమర భవ' అన్న వరదానము లభిస్తుంది. ఈ వరదానమును ఎల్లప్పుడు గుర్తు పెట్టుకుంటారా? నషా ఉంటుంది, సంతోషము ఉంటుంది, గుర్తు ఉంటుంది కానీ అమర భవ యొక్క వరదానులుగా అయ్యారా? ఏ యుగములో ఏ విశేషత ఉంటుందో, ఆ విశేషతను కార్యములో వినియోగిస్తున్నారా? ఒకవేళ ఇప్పుడు ఈ వరదానమును తీసుకోనట్లయితే మళ్ళీ మరెప్పుడూ ఈ వరదానము లభించజాలదు. కనుక సమయ విశేషతను తెలుసుకొని అమర భవ యొక్క వరదానులుగా అయ్యామా అని ఎల్లప్పుడూ పరిశీలించుకోండి. అమరము అని అన్నా అనండి, నిరంతరము అని అన్నా అనండి. కానీ ఈ విశేషమైన మాటను పదే-పదే అండర్ లైన్ చేసుకోండి. అమరనాధుడైన తండ్రి పిల్లలు ఒకవేళ అమర భవ యొక్క వారసత్వపు అధికారులుగా అవ్వనట్లయితే ఏమంటారు? చెప్పే అవసరముందా! కనుక మధువన వరదానీ భూమికి వచ్చి సదా వరదానీ భవ.అచ్ఛా!

ఇలా సదా బాప్ దాదా నయనాలలలో ఇమడియుండే ప్రకాశరత్నాలు, వరదాత ద్వారా సదా వరదానమును ప్రాప్తి చేసుకున్న వరదానీ మూర్తులు, భాగ్యవాన్ మూర్తులు, విశ్వము ముందు సదా ప్రకాశించే సితారలుగా అయ్యి విశ్వమును ప్రకాశింపచేసేవారు అయిన సంగమయుగ పాండవ శివ శక్తి సేనకు బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.

దీదీగారితో:- చక్రధారిగానైతే ఉన్నావు. చక్రధారితో పాటుగా చక్రవర్తిగా కూడా అయిపొయావు. డబల్ చక్కర్ చేస్తున్నావా? స్థూలంగా కూడా మరియు బుద్ధి ద్వారా కూడా. చక్రధారి సదా సర్వులకు వరదానపు దృష్టి ద్వారా, వాణి ద్వారా, కర్మల ద్వారా, వరదానాల ద్వారా ఒడిని నింపుతూ ఉంటుంది. మరి వర్తమాన సమయములో విధాత సంతానమైన విధాతవా లేక వరదాత తండ్రి సంతానమైన వరదానీమూర్తివా? ఎక్కువగా ఏ పాత్ర నడుస్తుంటుంది? దాతదా లేక వరదాతదా? మహాదానిదా లేక వరదానిదా? రెండు పాత్రలూ నడుస్తుంటాయా లేక రెండింటిలోనూ విశేషంగా ఒక్క పాత్రనే నడుస్తుందా? చివరి పాత్ర ఏది? విధాతదా లేక వరదానీదా? వరదానాన్ని తీసుకోవటమైతే సహజము కానీ ఇచ్చేవారిని అంతిమ ప్రాప్తి స్వరూపపు స్థితిలో ఉంచవలసి ఉంటుంది. తీసుకొనేవారికి వరదానము ఒక బంగారు లాటరీ ఎందుకంటే చివరలో ఎవరైతే పూర్తిగా బలహీన ఆత్మలుగా ఉంటారో ఆ ఆత్మలే వస్తారు. సమయము తక్కువ మరియు బలహీనత ఎక్కువ. కనుక తీసుకునేందుకు కూడా ధైర్యము ఉండదు. గుండె బలహీనంగా ఉన్నవారికి ఎంత మంచి వస్తువును ఇచ్చినా వారు తీసుకోలేరు. చాలా మంచిది అని అనుకున్నాగానీ తీసుకోలేరు. అలా చివరలో వచ్చే ఆత్మలు అన్ని విషయాలలో బలహీనంగా ఉంటారు. కనుక వరదానీ పాత్ర ఎక్కువగా నడుస్తుంది. ఎవరైతే స్వయమునకు సంపన్నంగా అయిపోయారో, అటువంటి సంపన్న ఆత్మలే వరదానులుగా అవ్వగలరు. సంపన్నంగా అవ్వటము - ఇదే వరదానీ స్థితి. ఒకవేళ స్వయములో ఏదైనా ఉండిపోయినట్లయితే ఇతరులను చూడటంతోనే స్వయము వైపుకు అటెన్షన్ పోతుంది మరియు స్వయములో నింపుకోవటానికి సమయము పడుతుంది. కనుక స్వయము సర్వ ప్రాప్తులతో సంపన్నంగా ఉన్నప్పుడే వరదానులుగా అవ్వగలరు. అచ్ఛా!

పార్టీలతో మిలనము:-

1. సత్యమైన బ్రాహ్మణుల అదృష్టము యొక్క పొడవైన రేఖ - 21 జన్మల కొరకు.
భగవంతునితోటే పిక్నిక్ చేస్తున్నారు! ఎంత భాగ్యవంతులు! ఇటువంటి రోజు ఒకటి వస్తుందని ఎప్పుడైనా కనీసం ఆలోచన అయినా చేసారా? సాకార రూపములో భగవంతునితోటి తింటాము, ఆడుకుంటాము, నవ్వుకుంటాము..... అని స్వప్నములో కూడా రాజాలదు. కానీ మీది ఎంత శ్రేష్ట భాగ్యమంటే దానిని సాకారములో అనుభవము చేస్తున్నారు. సర్వ ప్రాప్తి సంపన్నమైన ఎంత శ్రేష్ట అదృష్టరేఖ! మామూలుగా కూడా ఎవరికైనా అదృష్టాన్ని గురించి చెయ్యి చూపించినప్పుడు వీరి వద్ద సంతానము ఉంది, ధనము ఉంది, ఆయుష్షు ఉంది కానీ అల్పాయుష్షు... ఇది అవుతుంది, అది కాదు అని చెప్తుంటారు. కానీ మీ అదృష్టరేఖ ఎంత పొడవుగా ఉంది! 21 జన్మల వరకు సర్వ ప్రాప్తుల అదృష్టపు రేఖ. 21 జన్మలు గ్యారంటి, తరువాత కూడా అంత ఎక్కువగా దుఃఖమేమీ ఉండదు. మొత్తము కల్పములో మూడొంతులైతే సుఖమే లభిస్తుంది. ఈ చివరి జన్మలో కూడా అతి దుఃఖితుల లిస్ట్ లోకైతే రారు. మరి మీరు ఎంత శ్రేష్ట అదృష్టవంతులైపోయారు! ఈ శ్రేష్ట అదృష్టాన్ని చూసి సదా హర్షితంగా ఉండండి.

2. ప్రేమ సాగరుని నుండి ప్రేమను పొందే విధి - అతీతంగా అవ్వండి.
స్మృతిలో అయితే ఉంటాము కానీ బాబా నుండి ప్రేమ లభించటం లేదు అన్నది చాలామంది పిల్లల కంప్లైంట్. ఒకవేళ ప్రేమను పొందటం లేదంటే ప్రేమను పొందే విధిలో తప్పకుండా లోపము ఉన్నట్లు. ప్రేమ సాగరుడు బాబా, వారితో యోగమును పెట్టుకున్నవారు ప్రేమ నుండి వంచితులుగా ఉండిపోవటము జరగజాలదు. కానీ ప్రేమను పొందేందుకు సాధనము - అతీతులుగా అవ్వండి. ఎప్పటివరకైతే దేహము మరియు దేహ సంబంధీకులనుండి అతీతులుగా అవ్వరో అప్పటివరకు ప్రేమ లభించదు. కనుక వేటిపైనా ఆకర్షణ, కోరిక ఉండకూడదు. సంబంధము ఉండాలంటే అది సర్వ సంబంధీకుడైన ఒక్క బాబాతోనే. ఒక్క బాబా తప్ప ఇతరులెవ్వరూ లేరు... అని దీనిని కేవలము అనటం కాదు కానీ అనుభవము చెయ్యాలి. తినండి, తాగండి, నిద్రించండి... బాబాకు ప్రియమైనవారిగా అయ్యి చెయ్యండి అనగా అతీతులుగా అయ్యి చెయ్యండి. దేహధారులతో అనుబంధము పెట్టుకోవటము వలన దుఃఖము, అశాంతియే ప్రాప్తించాయి. అన్నింటినీ విని, రుచి చూసినప్పుడు మరల ఆ విషాన్ని ఇంకోసారి ఎలా తినగలరు? కనుక సదా అతీతంగా మరియు బాబాకు ప్రియమైనవారిగా అవ్వండి.

3. కష్టమునుండి విడుదల అవ్వడానికి విధి - మేరాపన్(నాది అన్నదానిని) సమాప్తము చెయ్యండి.
పిల్లలందరినీ కష్టమునుండి విడిపించేందుకు బాప్ దాదా వచ్చారు. అర్థకల్పము చాలా కష్టపడ్డారు, ఇప్పుడు కష్టము సమాప్తము. అందుకు సహజవిధిని వినిపించారు - కేవలము ఒక్క మాటను గుర్తుంచుకోండి - ''మేరా(నా) బాబా''. మేరా బాబా అని అనేందుకు ఎటువంటి కష్టము లేదు. మేరా బాబా అని అన్నట్లయితే దుఃఖాన్ని ఇచ్చే మేరా, మేరా(నాది నాది అనేవి) అంతా సమాప్తమైపోతాయి. అనేకమైన మేరాలు ఉంటే కష్టము, ఒక్క మేరా అయిపోయినట్లయితే అన్నీ సహజమైపోతాయి. బాబా-బాబా అని అంటూపోయినా కూడా సత్యయుగములోకి వచ్చేస్తారు. నా మనుమళ్ళు, నా ముని మనవళ్ళు, నా ఇల్లు, నా కోడలు......ఈ మేరే-మేరే(నా-నా) అన్న ఈ పొడవాటి లిస్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు దానిని సమాప్తము చెయ్యండి. అనేకులను మర్చిపోయి ఒక్క బాబాను గుర్తు చేసినట్లయితే కష్టము నుండి విడుదలై విశ్రాంతిగా సంతోషపు ఊయలలో ఊగుతూ ఉంటారు. సదా బాబా స్మృతి యొక్క విశ్రాంతిలో ఉండండి. అచ్ఛా -

డబల్ ఫారెనర్స్ తో - మంచి గ్రూప్. డబల్ ఫారెనర్స్ ను చూస్తుంటే బాప్ దాదాకు తన ఒక పేరు గుర్తు వస్తుంది. ఏ పేరు? విశ్వ కల్యాణకారి. మీరు లేకుండా ఉంటే బాప్ దాదా భారత కల్యాణకారిగానే ఉండిపోయేవారు, మీరు వచ్చినప్పటినుండే బాప్ దాదా విశ్వ కల్యాణకారిగా అయ్యారు. మరి ఈ అద్భుతము ఎవరిది? మీ అద్భుతమే కదా! ఇంకా చాలా కష్టపడుతున్నారు కూడా, సాకారములో మీ బ్యాక్ బోన్ చాలా తెలివైనవారు, కూర్చోనివ్వరు. ఏ మూలా మిగిలిపోకూడదు అన్న ఈ లగ్నము మంచిగా ఉంది. కేవలము సేవలో నిర్విఘ్నత - ఇది సేవ సఫలత. ఏ సేవను ప్రారంభించినా, అది దేశములో అయినా, విదేశములో అయినా సరే, బాప్ దాదా ఇదే అంటారు - సహచరులలో, సేవలో, వాయుమండలములో ఏక మతము, ఏక బలము, ఏక భరోసా మరియు ఏకత ఉండాలి. కొబ్బరికాయను క్టొటి ఎలా ఉద్ఘాటన చేస్తారో, రిబ్బన్ చేసి ఎలా ఉద్ఘాటన చేస్తారో అలా ముందుగా ఈ నాలుగు విషయాలనే రిబ్బన్ను కత్తిరించండి, తరువాత సర్వుల సంతుష్టత, ప్రసన్నతలనే కొబ్బరికాయను కొట్టండి. ఆ నీటిని ధరణి(భూమి)పై పోయండి. కార్యమనే ధరణి, అందులో మొదటగా ఈ కొబ్బరి నీటిని పొయ్యండి, తరువాత ఇక చూడండి ఎంత సఫలత ఉంటుందో. లేనట్లయితే ఏదో ఒక విఘ్నము తప్పకుండా వస్తుంది. సేవను అందరూ చేస్తారు కానీ ఎవరైతే నిర్విఘ్న సేవాధారులో వారి నంబరే బాప్ దాదా వద్ద రిజస్టర్ లో నోట్ అవుతుంది. అటువంటి సేవాధారుల లిస్ట్ బాప్ దాదా వద్ద ఉంది, కానీ ఇప్పుడు చాలా కొద్దిమంది ఉన్నారు, లిస్ట్ పొడవుగా లేదు, భాషణ చేసేవారి లిస్ట్ కూడా మీ వద్ద చాలా పెద్దదిగా ఉంది. బాప్ దాదా వారిని భాషణ చేసేవారు అని అంటారు. వీరు మొదట భాసన(భావన)ను ఇవ్వాలి, తరువాత భాషణ చెయ్యాలి. ఈరోజుల్లో స్కూల్, కాలేజ్ లోని అమ్మాయిలు, అబ్బాయిలు కూడా చాలా మంచిగా భాషణనిస్తున్నారు, చప్పట్లు మ్రోగుతూ ఉంటాయి. కానీ ఎవరైతే నిర్విఘ్నులో, అందరినీ ప్రసన్నము చేసేవారో, సంతుష్టపరిచేవారో వారి లిస్ట్ బాప్ దాదా వద్ద ఉంది. కనుకనే మాలలో చేతులు ఎత్తలేదు. డబల్ విదేశీయుల సేవలో పెద్ద పెద్ద విఘ్నాలేమీ రావు, కానీ కొంచెము-కొంచెము మనసు విఘ్నాలైతే వస్తాయి. ఇకపోతే మెజారిటీవారు మంచిగా ఉన్నారు. మనసులోని సంకల్పాలు, మనసు స్థితి అచలంగా, స్థిరంగా ఉంది. విన్నారా - డబల్ విదేశీయులు మంచి సేవ చేస్తున్నారు. వృద్ధి చేస్తున్నందుకు అభినందనలు. అచ్ఛా!