07.03.1984        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


''కర్మాతీతంగా, వానప్రస్థులుగా ఉన్న ఆత్మలే తీవ్రగతి సేవకు నిమిత్తంగా అవుతారు''

మధువనము వరదాన భూమి, సమర్థ భూమి, శ్రేష్ఠ సాంగత్య భూమి సహజంగా పరివర్తన అయ్యే భూమి, సర్వ ప్రాప్తులను అనుభవం చేయించే భూమి. ఇలాంటి భూమి పైకి వచ్చి అందరూ స్వయాన్ని సంపన్నంగా అనగా అన్ని విషయాలలో నిండుగా అనుభవం చేస్తున్నారా? ఏ అప్రాప్తి అయితే లేదు కదా? లభించిన సర్వ ఖజానాలను సదాకాలం కొరకు ధారణ చేశారా? ఇక్కడి నుండి సేవాస్థానానికి వెళ్ళి మహాదానిగా అయ్యి ఈ శక్తులను, సర్వ ప్రాప్తులను సర్వులకు ఇచ్చేందుకు నిమిత్తంగా అవుతాము అని భావిస్తున్నారా? సదాకాలం కొరకు స్వయాన్ని విఘ్న వినాశకులుగా, సమాధాన స్వరూపులుగా అనుభవం చేశారా? స్వంత సమస్యలు వేరుగా ఉన్నాయి. కానీ ఇతర ఆత్మల సమస్యలకు కూడా సమాధాన స్వరూపులుగా అవ్వాలి.

సమయానుసారం ఇప్పుడు బ్రాహ్మణ ఆత్మలు సమస్యలకు వశమవ్వడం నుండి అతీతంగా అయ్యారు. సమస్యలకు వశమవ్వడం అనగా అది బాల్యావస్థ. ఇప్పుడు బ్రాహ్మణ ఆత్మల బాల్యావస్థ సమయము సమాప్తమైపోయింది. యువ స్థితిలో మాయాజీత్ అయ్యే పద్ధతితో మహావీరులుగా అవ్వాలి. సేవలో చక్రవర్తులుగా అవ్వాలి. అనేకమంది ఆత్మలకు వరదానులుగా, మహాదానులుగా అవ్వాలి. అనేక రకాల అనుభవాలు చేస్తూ మహారథులుగా అవ్వాలి. ఇప్పుడు కర్మాతీత, వానప్రస్థ స్థితిలోకి వెళ్లే సమయం వచ్చేసింది. కర్మాతీత వానప్రస్థ స్థితి ద్వారానే విశ్వంలోని సర్వాత్మలను అర్ధకల్పపు కర్మబంధనాల నుండి ముక్తులుగా చేయించి ముక్తిలోకి పంపించాలి. ముక్తులుగా ఉన్న ఆత్మలే సెకండులో ముక్తిని వారసత్వంగా తండ్రి నుండి ఇప్పించగలరు. మెజారిటీ ఆత్మలు ముక్తిని భిక్షగా వేడుకునేందుకు కర్మాతీత, వానప్రస్థ, మహాదానీ, వరదానీ పిల్లలైన మీ వద్దకే వస్తారు. ఇప్పుడు మీ జడ చిత్రాల ముందుకు కొంతమంది మందిరాలకు వెళ్ళి ప్రార్థన చేసి సుఖ-శాంతులు కావాలని వేడుకుంటారు. కొంతమంది తీర్థ స్థానాలకు వెళ్ళి వేడుకుంటారు. కొంతమంది ఇంట్లో కూర్చొని వేడుకుంటారు. ఎవరికి ఎంత శక్తి ఉంటే అంత వరకు చేరుకుంటారు. కానీ యథాశక్తి యథాఫలాన్ని ప్రాప్తి చేసుకుంటారు. కొంతమంది దూరంగా కూర్చొని ఉన్నా హృదయపూర్వకంగా చేస్తారు, కొంతమంది మూర్తి ముందుకు తీర్థ స్థానాలు లేక మందిరాలకు వెళ్ళి కూడా చూపించడానికి చేస్తారు. స్వార్థానికి వశమై చేస్తారు. ఆ లెక్కలన్నిటి అనుసారంగా ఎలాంటి కర్మలో, ఎలాంటి భావన ఉంటుందో అలాంటి ఫలం లభిస్తుంది. అలా ఇప్పుడు సమయ ప్రమాణంగా మహాదానీ, వరదానీ చైతన్య ఆత్మలైన మీ ముందు ప్రార్థన చేస్తారు. కొంతమంది సేవాస్థానాలనే మందిరాలకు చేరుకుంటారు, కొంతమంది మహాతీర్థమైన మధువనానికి చేరుకుంటారు, మరి కొంతమంది ఇంటిలో కూర్చొని సాక్షాత్కారం చేసుకుంటూ దివ్యబుద్ధి ద్వారా ప్రత్యక్షతను అనుభవం చేస్తారు. సన్ముఖంలోకి రాకపోయినా స్నేహము మరియు దృఢ సంకల్పం ద్వారా ప్రార్థన చేస్తారు. మనసులో చైతన్య ఫరిస్తాలైన మిమ్ములను ఆహ్వానం చేసి ముక్తి వారసత్వపు దోసిలిని అడుగుతారు. త్వరలో సర్వాత్మలకు వారసత్వాన్ని ఇప్పించే కార్యాన్ని తీవ్ర వేగంతో చేయాల్సి పడ్తుంది.

ఎలాగైతే వినాశన సాధనాలు రిఫైన్ గా ఉన్న కారణంగా తీవ్ర వేగంతో సమాప్తికి నిమిత్తంగా అవుతాయో, అలా వరదానీ, మహాదానీ ఆత్మలైన మీరు తమ కర్మాతీత ఫరిస్తా స్వరూపం యొక్క సంపూర్ణ శక్తిశాలీ స్వరూపం ద్వారా సర్వుల ప్రార్థనకు బదులుగా ముక్తి వారసత్వాన్ని ఇప్పిస్తారు. తీవ్ర వేగంతో జరగాల్సిన ఈ కార్యము కొరకు మాస్టర్ సర్వ శక్తివంతులు, శక్తుల భండారము, జ్ఞాన భండారము, స్మృతి స్వరూపులైన మీరు రెడీగా ఉన్నారా? వినాశనం చేసే మిషినరీ, వరదానాలు ఇచ్చే మిషినరీ రెండూ తీవ్ర వేగంగా జత జతలో నడుస్తాయి.

చాలాకాలం నుండి అనగా ఇప్పటి నుండే ఎవర్రెడీగా ఉండాలి. తీవ్రగతితో ఉన్నవారు సదా కర్మాతీతులుగా, సమాధాన స్వరూపులుగా ఉండే అభ్యాసం చెయ్యకుంటే తీవ్రగతి సమయంలో ఇచ్చేవారిగా అయ్యేందుకు బదులు చూచేవారిగా అవ్వవలసి వస్తుంది. చాలాకాలం నుండి తీవ్ర పురుషార్థం చేయువారు తీవ్రవేగంతో సేవ చేసేందుకు నిమిత్తంగా అవ్వగలరు. ఇది వానప్రస్థము అనగా సర్వబంధన ముక్తులు, అతీతము మరియు తండ్రితో పాటు తీవ్రగతిలో సేవ చేసే ప్రియమైన అవస్థ. కనుక ఇప్పుడు ఇచ్చేవారిగా అయ్యే సమయము. ఇప్పుడు కూడా స్వయం పట్ల, సమస్యల పట్ల తీసుకునేవారిగా అయ్యే సమయం కాదు. ఇప్పుడు స్వంత సమస్యలలో చిక్కుకునే సమయం సమాప్తమైపోయింది. సమస్య కూడా మీ బలహీనతలనే రచన. ఎవరి ద్వారా అయినా లేక ఏ పరిస్థితుల ద్వారా వచ్చిన సమస్య అయినా వాస్తవానికి తమ బలహీనత కారణంగానే వస్తుంది. ఎక్కడ బలహీనత ఉంటుందో, అక్కడ వ్యక్తి ద్వారా లేక పరిస్థితుల ద్వారా సమస్యలు యుద్ధం చేస్తాయి. బలహీనత లేకపోతే సమస్యల యుద్ధం కూడా ఉండదు. వచ్చిన సమస్యకు బదులుగా సమాధాన రూపంలో అనుభవీగా చేస్తుంది. ఇది తమ బలహీనత ద్వారా ఉత్పన్నమైన మిక్కీ-మౌస్. ఇప్పుడైతే అందరూ నవ్వుతున్నారు. కాని సమస్య వచ్చినప్పుడు ఏం చేస్తారు? స్వయం మీరే మిక్కీమౌస్ అవుతారు. దీనితో ఆడుకోండి కానీ భయపడకండి. కానీ ఇది కూడా బాల్యావస్థలోని ఆటయే. రచన చెయ్యకండి, సమయాన్ని పోగొట్టుకోకండి. దీనికి అతీతమైన స్థితిలో వానప్రస్థులుగా అయిపోండి. అర్థమయిందా!

సమయం ఏం చెప్తూ ఉంది? తండ్రి ఏం చెప్తున్నారు? ఇప్పుడు కూడా బొమ్మలతో ఆడుకోవడం బాగుంటుందా? ఉదాహరణానికి కలియుగ మానవుల రచన కూడా ఎలా తయారయ్యింది? మురళిలో వింటున్నారు కదా! తేళ్ళు, మండ్రగబ్బలుగా అయిపోయారు. కనుక ఈ బలహీనతల ద్వారా రచింపబడిన సమస్యలు కూడా తేళ్లు, మండ్రగబ్బల సమానంగా కాటేస్తాయి, శక్తిహీనంగా చేస్తాయి. అందువలన అందరూ మధువనం నుండి సంపన్నమై, స్వంత సమస్యనైతే సమాప్తం చేసుకున్నాము కాని ఇప్పటి నుండి ఇతరులకు కూడా సమస్యా స్వరూపంగా అవ్వము, అంతేకాక స్వయం పట్ల, సర్వుల పట్ల సదా సమాధాన స్వరూపులుగా ఉంటాము అని దృఢ సంకల్పం చేసి వెళ్లండి. స్వయం పట్ల, సర్వుల పట్ల సదా సమాధాన స్వరూపంగా ఉంటారు. అర్థమయిందా!

ఇంత ఖర్చు చేసి కష్టపడి వచ్చారు కనుక కష్టానికి ఫలితం ఈ దృఢ సంకల్పం ద్వారా సులభంగా సదా లభిస్తూ ఉంటుంది. ఎలాగైతే ముఖ్య విషయమైన పవిత్రత కొరకు మరణిస్తాము, సహిస్తాము కాని ఈ వ్రతాన్ని స్థిరంగా ఉంచుకుంటాము, స్వప్నంలో లేక సంకల్పంలో కూడా ఈ విషయంలో హెచ్చు-తగ్గులైతే పాపంగా భావిస్తారో, అలా సమస్యా స్వరూపులుగా అవ్వడం లేక సమస్యకు వశమైపోవడం కూడా పాప ఖాతా అవుతుంది. పాపానికి నిర్వచనం తెలుసు, పాపాన్ని గుర్తించగలరు. ఎక్కడైతే పాపం ఉంటుందో అక్కడ తండ్రి స్మృతి ఉండదు, తండ్రి తోడు ఉండదు. పాపము మరియు తండ్రి రాత్రి మరియు పగలు వంటివారు. కనుక సమస్య వచ్చినప్పుడు ఆ సమయంలో తండ్రి స్మృతి వస్తుందా? తండ్రి స్మృతి మర్చిపోతారు కదా? మళ్లీ దు:ఖము కలిగినప్పుడు తండ్రి గుర్తుకొస్తారు. అది కూడా భక్తుల రూపంలో స్మృతి చేస్తారు. అధికారుల రూపంలో స్మృతి చేయరు. శక్తినివ్వండి, సహాయము చేయండి, దాటించండి అని వేడుకుంటారు. అధికారి రూపంలో, సాథీ రూపంలో సమానంగా అయ్యి స్మృతి చేయరు. కనుక ఇప్పుడేం చేయాలో అర్థమయ్యిందా! సమాప్తి సమారోహం జరుపుకోవాలి కదా. సమస్యల సమాప్తి సమారోహం జరుపుకుంటారు కదా లేక కేవలం డ్యాన్స్ చేస్తారా? మంచి మంచి నాటకాలు చేస్తారు కదా. ఇప్పుడు ఈ ఫంక్షన్(ఉత్సవము) చేయాలి. ఎందుకంటే ఇప్పుడు సేవ కొరకు చాలా సమయం కావాలి. అక్కడ పిలుస్తున్నారు, ఇక్కడ కదులుతున్నారు. ఇది బాగలేదు కదా! వారు వరదానులారా, మహాదానులారా అని అంటూ స్మృతి చేస్తున్నారు. మీరేమో మూడ్ఆఫ్అయ్యి ఏడుస్తున్నారు. కనుక ఫలము ఎలా ఇస్తారు? మీ వేడి వేడి కన్నీరు వారి వద్దకు కూడా చేర్తాయి. వారు కూడా భయపడ్తూ ఉంటారు. ఇప్పుడు మేము బ్రహ్మాబాబాతో పాటు పూజ్య ఇష్ట దేవీ దేవతా ఆత్మలు అని గుర్తుంచుకోండి. మంచిది.

సదా చాలాకాలపు తీవ్ర పురుషార్థులు, తీవ్ర వేగంతో సేవ చేసేందుకు ఎవర్రెడీగా ఉన్న పిల్లలకు, సదా విశ్వ పరివర్తన ద్వారా సమస్యా పరివర్తకులు, సమాధాన స్వరూపులైన పిల్లలకు, సదా దయాహృదయము గలవారై భక్తాత్మలు మరియు బ్రాహ్మణాత్మలకు స్నేహీలుగా, సహయోగులుగా ఉండే శ్రేష్ఠ ఆత్మలకు, సదా సమస్యలకు అతీతంగా ఉండేవారికి, కర్మాతీత, వానప్రస్థ స్థితిలో స్థితమయ్యే సంపన్న స్వరూప పిల్లలకు బాప్దాదా యాద్ ప్యార్ ఔర్ నమస్తే.

న్యూయార్క్ పార్టీతో :- అందరూ స్వయాన్ని తండ్రికి విశేష ఆత్మనని అనుభవం చేస్తున్నారా? ఎలాగైతే తండ్రి సదా శ్రేష్ఠంగా ఉన్నారో, అలా పిల్లలైన మేము కూడా తండ్రి సమానంగా శ్రేష్ఠంగా ఉన్నామనే సంతోషము సదా ఉంటుందా? ఈ స్మృతి ద్వారా సదా ప్రతి కర్మ శ్రేష్ఠమైపోతుంది. సంకల్పమెలా ఉంటుందో, కర్మ అలా ఉంటుంది. కనుక మీరు సదా స్మృతి ద్వారా శ్రేష్ఠ స్థితిలో స్థితమై ఉండే విశేష ఆత్మలు. సదా మాకు ఈ శ్రేష్ఠ జన్మ లభించిందని సంతోషాలు జరుపుకుంటూ ఉండండి. ఎంత శ్రేష్ఠ జన్మ అంటే మొత్తం కల్పంలో ఎప్పుడూ జరగని జన్మ. ఈ జన్మ ద్వారా భగవంతుని పిల్లలుగా అయిపోయారు. 5 వేల సంవత్సరాలలో కేవలం ఈ సమయంలోనే ఈ అలౌకిక జన్మ జరుగుతుంది. సత్యయుగంలో కూడా ఆత్మల పరివారంలోకే వస్తారు. కాని ఇప్పుడు పరమాత్ముని సంతానంగా అయ్యారు. కనుక ఈ విశేషతను సదా గుర్తుంచుకోండి. సదా అత్యంత ఉన్నతమైన ధర్మము, కర్మ మరియు పరివారానికి చెందిన బ్రాహ్మణాత్మను అనే స్మృతి ద్వారా ప్రతి అడుగులో ముందుకు సాగుతూ వెళ్లండి. పురుషార్థ వేగం సదా తీవ్రంగా ఉండాలి. ఎగిరేకళ సదా మాయాజీతులుగా, నిర్బంధనులుగా చేస్తుంది. ఎప్పుడైతే తండ్రిని మీ వారిగా చేసుకున్నారో ఇంకా కావలసినదేముంది! ఉండేది ఒక్కరే కదా! ఆ ఒక్కరిలోనే అన్నీ ఇమిడి ఉన్నాయి. ఒక్కరి స్మృతిలో, ఏకరస స్థితిలో స్థితమైనందున శాంతి, శక్తి, సుఖాలు అనుభవమవుతూ ఉంటాయి. ఎక్కడైతే ఒక్కరే ఉంటారో, అక్కడ 1వ నంబరు ఉంటుంది. కనుక అందరూ నంబరు వన్అయ్యారు కదా. ఒక్కరినే స్మృతి చేయడం సులభమా లేక చాలామందిని స్మృతి చేయడం సులభమా? తండ్రి కేవలం దీనినే అభ్యాసము చేయిస్తారు. ఇంకేదీ చేయించరు. 10 వస్తువులు ఎత్తడం సహజమా? లేక ఒక వస్తువును ఎత్తడం సులభమా? కనుక బుద్ధి ద్వారా ఒక్కరి స్మృతిని ధారణ చేయడం చాలా సులభము. అందరి లక్ష్యము చాలా బాగుంది. లక్ష్యము బాగుంటే లక్షణాలు కూడా బాగవుతూ ఉంటాయి. మంచిది.

అవ్యక్త మహావాక్యాలు - సంకల్ప శక్తిని కంట్రోల్(అదుపు) చేయండి

సమాయనుసారం శీతలతా శక్తి ద్వారా ప్రతి పరిస్థితిలో మీ సంకల్పాల వేగాన్ని, మాటలను శీతలంగా, నెమ్మదిగా చేసుకోండి. సంకల్పాల వేగం ఎక్కువగా ఉంటే చాలా సమయం వ్యర్థంగా పోతుంది. అదుపు చేయలేరు. అందువలన శీతలతా శక్తిని ధారణ చేసుకుంటే వ్యర్థము నుండి లేక ప్రమాదాల నుండి రక్షింపబడ్తారు. ఇది ఎందుకు, ఏమిటి, ఇలా కాదు అలా..... ఈ వ్యర్థ ప్రశ్నల వేగము నుండి విడుదలైపోతారు. కొంతమంది పిల్లలు అప్పుడప్పుడు చాలా ఆటలు చూపిస్తారు. వ్యర్థ సంకల్పాలు ఎంత ఫోర్సుగా వస్తాయంటే వాటిని అదుపు చేయలేరు. ఆ సమయంలో ఏం చేయాలి, జరిగిపోయింది అని అంటారు. ఆపుకోలేరు. ఏం తోస్తే అది చేసేస్తారు. కాని వ్యర్థము కొరకు కంట్రోలింగ్ పవర్స్ కావాలి. ఎలాగైతే ఒక సమర్థ సంకల్పానికి పదమా రెట్ల ఫలితము లభిస్తుందో, అలా ఒక వ్యర్థ సంకల్పానికి లెక్కాచారము - ఉదాసులుగా అవ్వడం, వ్యాకులపడడం లేక సంతోషం మాయమవ్వడం. ఇది కూడా ఒకటికి అనేక రెట్ల లెక్కాచారం ద్వారా అనుభవమవుతుంది.

ప్రతిరోజూ తమ దర్బారును పెట్టుకోండి మరియు తమ కార్యకర్తలైన కర్మచారులను వారి స్థితి-గతులను గురించి అడగండి. తమ సూక్ష్మ శక్తులైన మంత్రులు మరియు మహామంత్రిని తమ ఆర్డర్ ప్రమాణంగా నడిపించండి. ఇప్పటి నుండే రాజ్యదర్బార్ మంచిగా ఉన్నట్లయితే ధర్మరాజు దర్బారులోకి వెళ్ళరు. ధర్మరాజు కూడా స్వాగతం చేస్తారు. కానీ నియంత్రణ చేసుకునే శక్తి(కంట్రోలింగ్పవర్) లేకుంటే అంతిమ ఫలితంలో ఫైన్(అపరాధ రుసుము) చెల్లించేదుకు ధర్మరాజ పురిలోకి వెళ్ళవలసి వస్తుంది. ఫైన్అనగా ఈ శిక్షలే. రిఫైన్(స్వచ్ఛం)గా అయితే ఫైన్ కట్టవలసిన అవసరం లేదు.

వర్తమానము భవిష్యత్తుకు దర్పణము వంటిది. వర్తమాన స్థితి అనగా దర్పణం ద్వారా మీ భవిష్యత్తును స్పష్టంగా చూడగలరు. భవిష్యత్తులో రాజ్య అధికారులుగా అయ్యేందుకు వర్తమానంలో నాలో రూలింగ్ పవర్ ఎంతవరకు ఉంది అని చెక్ చేసుకోండి. మొదట విశేష కార్యకర్తలైన సూక్ష్మ శక్తులు - సంకల్ప శక్తి పైన, బుద్ధి పైన మరియు సంస్కారాల పైన పూర్తి అధికారం ఉండాలి. విశేషించి ఈ మూడు శక్తులు రాజ్య వ్యవహారాన్ని నడిపించే ముఖ్య సహయోగులుగా ఉండే కార్యకర్తలు. ఈ మూడు కార్యకర్తలు ఆత్మలైన మీ సూచనలు అనగా రాజ్యాధికారి రాజుల సూచనల అనుసారం నడుస్తూ ఉంటే ఆ రాజ్యం సదా యదార్థ రీతిలో నడుస్తుంది. రాజు స్వయం ఏ కార్యము చెయ్యడు కాని చేయిస్తాడు. చేసే రాజ్యపు యంత్రాంగం(రాజ్య వ్యవహారం చేసేవారు) వేరుగా ఉంటారు. రాజ్య వ్యవహారము చేసేవారు మంచిగా లేకపోతే రాజ్యము కదులుతూ హెచ్చు-తగ్గులుగా ఉంటుంది. ఈ విధంగా ఆత్మ కూడా కరావన్ హార్(చేయించే శక్తి), చేసేది విశేషించి ఈ త్రిమూర్తి శక్తులు. మొదట వీటి పైన రూలింగ్ పవర్ఉంటే ఈ సాకార కర్మేంద్రియాలు వాటి ఆధారంతో స్వత:గానే సరైన మార్గంలో నడుస్తాయి. ఎలాగైతే సత్యయుగ సృష్టిలో ఒకే రాజ్యము, ఒకే ధర్మము ఉంటాయని అంటారో, అలాగే ఇప్పటి స్వరాజ్యములో కూడా ఒకే రాజ్యము అనగా స్వంత(ఆత్మ) సూచనల ప్రకారం అన్నీ నడుస్తూ ఉండాలి. మనసు తన ఇష్ట ప్రకారంగా ఆత్మను నడిపించరాదు. బుద్ధి తన నిర్ణయశక్తి ద్వారా ఆందోళన కలిగించరాదు. సంస్కారము ఆత్మను నాట్యం చేయించేదిగా ఉండరాదు. అప్పుడు ఒకే ధర్మము, ఒక్కటే రాజ్యము అని అంటారు. కనుక ఇలాంటి నియంత్రణా శక్తిని(కంట్రోలింగ్పవర్ను) ధారణ చెయ్యండి.

గౌరవనీయంగా పాసయ్యేందుకు లేక రాజ్యాధికారిగా అయ్యేందుకు సూక్ష్మ శక్తి అయిన మనసు అదుపులో ఉండాలి. అనగా ఆజ్ఞానుసారం పని చెయ్యాలి. ఏది ఆలోచిస్తారో, అది ఆర్డర్లోనే ఉండాలి. ఆగిపో అని చెప్తే ఆగిపోవాలి. సేవ గురించి ఆలోచిస్తే సేవలో నిమగ్నమవ్వాలి. పరంధామం గురించి ఆలోచిస్తే పరంధామానికి చేరుకోవాలి. ఇలాంటి నియంత్రణా శక్తిని ఇప్పుడు పెంచుకోండి. చిన్న చిన్న సంస్కారాలలో, యుద్ధంలో సమయం పోగొట్టుకోకండి. కంట్రోలింగ్ పవర్ ధారణ చేసినట్లయితే కర్మాతీత స్థితికి సమీపంగా చేరుకుంటారు. ఇతర సంకల్పాలన్నీ శాంతిగా అయినప్పుడు కేవలం ఒక్క బాబా మరియు మీరు. కేవలం ఈ మిలనపు అనుభూతి యొక్క సంకల్పం మాత్రమే ఉంటుంది. దీనినే శక్తిశాలీ యోగమని అంటారు. దీని కొరకు ఇముడ్చుకునే శక్తి మరియు సర్దుకునే శక్తి కావాలి. ఆగిపో అంటూనే సంకల్పాలు ఆగిపోవాలి. పూర్తి బ్రేకు పడాలి. వదులుగా ఉండరాదు. శక్తిశాలీ బ్రేక్(పవర్ఫుల్బ్రేక్) ఉండాలి, నియంత్రణా శక్తి(కంట్రోలింగ్పవర్) ఉండాలి. ఒక్క సెకండుకు బదులు ఎక్కువ సమయం పట్టినట్లయితే ఇముడ్చుకునే శక్తి బలహీనంగా ఉన్నట్లవుతుంది. చివర్లో ఫైనల్ పేపర్లోని ప్రశ్న - సెకండ్లో ఫుల్ స్టాప్ పెట్టడం, ఇందులోనే నెంబరు లభిస్తుంది. సెకండ్ కంటే ఎక్కువ అయితే ఫెయిల్అయిపోతారు. ఒక్క తండ్రి మరియు నేను మూడవ ఏ విషయము రాకూడదు. ఇది చెయ్యాలి, ఇది చూడాలి, ఇది అయ్యింది, ఇది కాలేదు,....... అని ఉండరాదు. ఇది ఎందుకయ్యింది, ఇది ఏమైంది - ఇలా ఏ ప్రశ్న వచ్చినా ఫెయిల్అయిపోతారు. ఏ విషయంలో అయినా ఎందుకు, ఏమిటి అనే క్యూ ఏర్పడ్తే ఆ క్యూను సమాప్తం చెయ్యడంలో చాలా సమయం గడిచిపోతుంది. రచనను రచించినట్లయితే పాలన కూడా చెయ్యవలసి వస్తుంది. పాలన చెయ్యకుండా తప్పించుకోలేరు. సమయం, శక్తి ఇవ్వవలసి వస్తుంది. అందువలన ఈ వ్యర్థ రచన చెయ్యకుండా బర్త్ కం ట్రోల్ చెయ్యండి.

ఎవరైతే తమ సూక్ష్మ శక్తులను హ్యాండిల్ చెయ్యగలరో, వారు ఇతరులను కూడా హ్యాండిల్ చెయ్యగలరు. కనుక స్వయం పై గల కంట్రోలింగ్ పవర్, రూలింగ్ పవర్అందరి కొరకు యథార్థమైన హ్యాండ్లింగ్ పవర్ గా అవుతుంది. అజ్ఞానీ ఆత్మలను సేవ ద్వారా హ్యాండిల్ చేస్తున్నా, బ్రాహ్మణ పరివారంలో స్నేహ సంపన్నమైన, సంతుష్టతా సంపన్నమైన వ్యవహారం చేస్తున్నా రెండిటిలో సఫలంగా అవ్వగలరు.