26.04.1984        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


''ఆత్మిక విచిత్ర మేళాలో సర్వ ఖజానాల ప్రాప్తి''

ఈ రోజు బాప్దాదా మిలనము చేయాలనే పిల్లల లగ్నమును చూస్తున్నారు. అందరూ దూర-దూరాల నుండి దేని కొరకు వచ్చారు? మిలనము జరుపుకునేందుకు అనగా మేళాలోకి వచ్చారు. ఈ ఆత్మిక మేళా విచిత్రమైన మేళా. ఈ మేళాలోని మిలనము కూడా విచిత్రమే ఎందుకంటే విచిత్ర ఆత్మలు విచిత్రుడైన తండ్రిని కలుసుకుంటాయి. ఇది సాగరము మరియు నదుల మేళా. ఈశ్వరీయ పరివారము కలుసుకునే మేళా. ఒక్కసారి జరిగే ఈ మేళా అనేకసార్లు సర్వ ప్రాప్తులను కలిగించే మేళా. ఈ మేళాలో భండారాలు, ఖజానాలు తెరవబడి ఉంటాయి. ఎవరికి ఏ ఖజానా కావాలనుకుంటే, ఎంత కావాలనుకుంటే అంత ఎటువంటి ఖర్చు లేకుండా అధికారముతో తీసుకోవచ్చు. ఇది లాటరీ కూడా. భాగ్యము యొక్క శ్రేష్ఠ లాటరీని ఎంత కావాలనుకుంటే అంత తీసుకోవచ్చు. ఇప్పుడు లాటరీ తీసుకుంటే నెంబరు తర్వాత వెలువడ్తుందని కాదు. ఏది తీసుకోవాలనుకుంటే దానిని ఎంతగా భాగ్యరేఖను గీసుకోవాలనుకుంటే అంతగా దృఢ సంకల్పము ద్వారా ఇప్పుడే గీసుకోగలరు. సెకండులో లాటరి తీసుకోగలరు. ఈ మేళాలో జన్మ-జన్మల కొరకు రాజ్య పదవి యొక్క అధికారాన్ని తీసుకోగలరు అనగా ఈ మేళాలో రాజయోగుల నుండి జన్మ-జన్మల కొరకు విశ్వానికి రాజులుగా అవ్వగలరు. ఎంత పెద్ద ప్రాప్తి యొక్క సీటు కావాలనుకుంటే అంత పెద్ద సీటును బుక్ చేసుకోగలరు. ఈ మేళాలో విశేషంగా అందరికి ఒక స్వర్ణిమ అవకాశము కూడా లభిస్తుంది. అదేమంటే హృదయ పూర్వకంగా 'మేరా బాబా(నా తండ్రి)' అని అనండి, తండ్రి హృదయ సింహాసనాధికారులుగా అవ్వండి. ఈ మేళాలో ఒక విశేషమైన కానుక కూడా లభిస్తుంది. అదేమంటే 'చిన్న సుఖమయమైన సంపన్న ప్రపంచము.' ఈ ప్రపంచంలో ఏది కావాలనుకుంటే అది అంతా సదా ప్రాప్తిస్తుంది. అది చిన్నదైన ప్రపంచం, తండ్రిలోనే ఈ ప్రపంచం. ఈ ప్రపంచంలో ఉండేవారు ప్రాప్తుల, సంతోషాల, అలౌకిక ఊయలలో సదా ఊగుతారు. ఈ ప్రపంచంలో ఉండేవారు సదా ఈ దేహమనే మట్టి రూపీ మైలకు దూరంగా పైన ఫరిస్తాలుగా అయ్యి ఎగిరేకళలో ఎగురుతూ ఉంటారు. సదా రత్నాలతో ఆడుకుంటారు, సదా పరమాత్మ తోడును అనుభవం చేస్తారు. ''మీతోనే తింటాము, మీ నుండే వింటాము, మీతోనే మాట్లాడ్తాము, మీతోనే సర్వ సంబంధాల ప్రీతి యొక్క రీతిని నిభాయిస్తాము, మీ శ్రీమతము పై, ఆజ్ఞ పై ప్రతి అడుగు వేస్తాము'' అంటూ ఉల్లాస-ఉత్సాహాలతో సంతోషంలో పాటలు పాడుతూ ఉంటారు. ఇటువంటి ప్రపంచం ఈ మిలన మేళాలోనే లభిస్తుంది. తండ్రి లభించారు, ప్రపంచం లభించింది. ఇది ఇటువంటి శ్రేష్ఠమైన మేళా. కావున ఇటువంటి మేళాలోకి వచ్చారు కదా. మేళాను చూస్తూ చూస్తూ ఒకే ప్రాప్తిలో ఎంతగానో మగ్నమైపోయి మిగిలిన సర్వ ప్రాప్తులు మిగిలిపోయేలా అవ్వడం కాదు. ఈ ఆత్మిక మేళాలో సర్వ ప్రాప్తులను పొంది వెళ్ళాలి. ఎంతో లభించిందని ఇందులోనే సంతోషపడిపోయి వెళ్లకండి. అలా చేయకండి. పూర్తిగా పొంది వెళ్లండి. మేళాలో సర్వ ప్రాప్తులు పొందామా అని ఇప్పుడు కూడా చెక్ చేసుకోండి. తెరచి ఉంచిన ఖజానాలు ఉన్నప్పుడు సంపన్నంగా అయ్యే వెళ్లాలి. మళ్లీ అక్కడకు వెళ్లి, 'ఇది కూడా చేయవలసింది, ఎంతగా చేయవలసిందో అంతగా చేయలేదు' అని అనకండి. అలా అయితే అనరు కదా! కనుక ఈ మేళా మహత్వమును అర్థం చేసుకున్నారా? మేళా జరుపుకోవడం అనగా మహాన్ గా అవ్వడం. కేవలం రావడం, పోవడం కాదు. సంపన్నమైన ప్రాప్తి స్వరూపులుగా అవ్వాలి. ఈ విధంగా మేళాను జరుపుకున్నారా? నిమిత్తంగా ఉన్న సేవాధారులు ఏమని భావిస్తున్నారు? వృద్ధి విధిని కూడా మార్చేస్తుంది. వృద్ధి జరగడం కూడా అవసరమే. అంతేకాక ప్రతి విధిలోనూ సంతోషంగా, సంతుష్టంగా ఉండడం కూడా అవసరమే. ఇప్పుడైతే కనీసం తండ్రి మరియు పిల్లల సంబంధంతోనైనా కలుసుకుంటున్నారు, సమీపంగా వస్తున్నారు. తర్వాత కేవలం దర్శనం మాత్రమే ఉంటుంది. మంచిది.

ఆత్మిక మిలన మేళా జరుపుకునే వారందరికి, సర్వ ప్రాప్తుల సంపూర్ణ అధికారము పొందేవారికి, సదా సుఖమయమైన, సంపన్నమైన ప్రపంచంలోకి వెళ్లేవారికి, సదా ప్రాప్తుల, సంతోషాల పాటను పాడేవారికి, శ్రేష్ఠ మతం పై సదా నడిచే ఆజ్ఞాకారీ సుపుత్రులైన పిల్లలకు బాప్దాదా ప్రియస్మృతులు మరియు నమస్తే.

టీచర్లతో :- మీరు సదా స్మృతి మరియు సేవల బ్యాలెన్సు(సమతుల్యం) ఉంచేవారు మరియు తండ్రి బ్లెస్సింగ్స్(ఆశీర్వాదాలను) తీసుకునేవారు. ఎక్కడైతే బ్యాలెన్స్ఉంటుందో అక్కడ తండ్రి ద్వారా స్వత:గా ఆశీర్వాదాలే కాదు వరదానాలు కూడా ప్రాప్తిస్తాయి. ఎక్కడైతే బ్యాలెన్స్ఉండదో అక్కడ వరదానాలు కూడా ఉండవు. ఎక్కడైతే వరదానాలు ఉండవో అక్కడ కష్టపడవలసి వస్తుంది. వరదానాలు ప్రాప్తించడం అనగా సర్వ ప్రాప్తులు సహజంగా లభిస్తున్నాయని అర్థం. ఇటువంటి వరదానాలను పొందే సేవాధారులుగా ఉన్నారు కదా! మీరు సదా ఒకే తండ్రి, ఏకరస స్థితి మరియు ఐకమత్యంతో నడుచుకునేవారు. మీరు ఇటువంటి సమూహమే కదా! ఎక్కడైతే ఒకే మతం ఉంటుందో అక్కడ సదా సఫలత ఉంటుంది. కావున సదా ప్రతి అడుగులో వరదాత అయిన తండ్రి ద్వారా వరదానాలు పొందేవారు. మీరు ఇటువంటి సత్యమైన సేవాధారులు. సదా స్వయాన్ని డబల్ లైటుగా భావిస్తూ సేవ చేస్తూ ఉండండి. ఎంత తేలికగా ఉంటారో అంత సేవలో తేలికతనం ఉంటుంది. సేవలో ఎంత తేలికతనం ఉంటుందో అంత సహజంగా అందరూ ఎగురుతారు, అందరినీ ఎగిరేలా చేస్తారు. డబుల్ లైటుగా అయ్యి సేవ చేయడం, స్మృతిలో ఉంటూ సేవ చేయడం ఇదే సఫలతకు ఆధారము. అటువంటి సేవకు ప్రత్యక్ష ఫలం తప్పకుండా లభిస్తుంది.

పార్టీలతో అవ్యక్త బాప్దాదా మిలనము :- సంగమ యుగము సదా సర్వ ప్రాప్తులను పొందే యుగము. సంగమ యుగము శ్రేష్ఠంగా అయ్యి, ఇతరులను కూడా శ్రేష్ఠంగా తయారుచేసే యుగము. ఇటువంటి యుగములో పాత్రను అభినయించే ఆత్మలు ఎంత శ్రేష్ఠమైనవారు! కావున సదా మేము సంగమయుగ శేష్ఠ ఆత్మలము అన్న స్మృతి ఉంటుందా? సర్వ ప్రాప్తులు అనుభవం అవుతున్నాయా? తండ్రి ద్వారా ఏ ప్రాప్తులైతే లభిస్తాయో ఆ ప్రాప్తుల ఆధారము పై సదా స్వయాన్ని సంపన్నమైన నిండు (భర్పూర్) ఆత్మలుగా భావిస్తున్నారా? ఎంతగా నిండుగా అవ్వాలంటే స్వయం మీరు కూడా తింటూ ఉండండి, ఇతరులకు కూడా పంచండి. భండారాలన్నీ నిండి ఉంటాయని ఎలాగైతే తండ్రి గురించి అంటారో అలాగే పిల్లలైన మీ భండారాలు కూడా సదా నిండుగా ఉంటాయి. అవి ఎప్పుడూ ఖాళీ అవ్వజాలవు. ఎవరికైనా ఎంతగా ఇస్తూ ఉంటారో అంతగా అవి పెరుగుతూ ఉంటాయి. సంగమయుగ విశేషత ఏదైతే ఉందో అది మీ విశేషత. మేము సంగమయుగ సర్వ ప్రాప్తి స్వరూప ఆత్మలము అన్న స్మృతిలో ఉండండి. సంగమ యుగము పురుషోత్తమ యుగము. ఈ యుగములో పాత్రను అభినయించేవారు కూడా పురుషోత్తములే అవుతారు కదా! ప్రపంచములోని సర్వాత్మలు మీ ముందు సాధారణమైనవారే. మీరు అలౌకికమైన మరియు అతీతమైన ఆత్మలు. వారు అజ్ఞానులు, మీరు జ్ఞానులు. వారు శూద్రులు, మీరు బ్రాహ్మణులు. వారు దు:ఖధామములోని వారు, మీరు సంగమ యుగములోని వారు. సంగమ యుగము కూడా సుఖధామమే. ఎన్ని దు:ఖాల నుండి రక్షింపబడ్డారు. ప్రపంచము ఎంత దు:ఖితముగా ఉందో, దానితో పోలిస్తే మీరు ఎంత సుఖవంతులుగా ఉన్నారో ఇప్పుడు సాక్షిగా అయ్యి చూస్తారు. తేడా అయితే తెలుస్తోంది కదా! కావున సదా మేము పురుషోత్తమ యుగములోని పురుషోత్తమ ఆత్మలము, సుఖ స్వరూప శ్రేష్ఠ ఆత్మలము అన్న స్మృతిలో ఉండండి. సుఖము లేకపోతే శ్రేష్ఠత లేకపోతే జీవితమే లేదు.

సదా స్మృతి యొక్క సంతోషములో ఉంటున్నారు కదా! సంతోషమే అన్నిటికంటే పెద్ద దీవెన మరియు ఔషధము(మందు). సదా ఈ సంతోషమనే మందును మరియు దీవెనలను తీసుకుంటూ ఉంటే సదా సంతోషంగా ఉన్న కారణంగా శారీరిక లెక్కాచారాలు కూడా తమవైపుకు ఆకర్షించవు. అతీతంగా, ప్రియంగా అయ్యి శరీరిక లెక్కాచారాన్ని తీర్చుకుంటారు. ఎంత కఠినమైన కర్మభోగమైనా అది కూడా శూలము నుండి ముల్లుగా అయిపోతుంది. ఏమంత పెద్ద విషయంగా అనిపించదు. ఇవన్నీ లెక్కాచారాలు అని అర్థమయ్యింది. కనుక లెక్కాచారాలను సంతోషంగా చుక్త చేసుకునే వారికి అన్నీ సహజమైపోతాయి. అజ్ఞానులు అయ్యో అయ్యో అని ఆర్తనాదాలు చేస్తారు, జ్ఞానులు సదా 'ఓహో! నా మధురమైన తండ్రి, ఓహో! నా మధురమైన డ్రామా' అన్న స్మృతిలో ఉంటారు. సదా సంతోషము యొక్క పాటనే పాడండి అంతేకాక జీవితములో ఏదైతే పొందాలో అది పొందేశాము అని గుర్తుంచుకోండి. ఏ ప్రాప్తులైతే కావాలో ఆ ప్రాప్తులన్నీ లభించేశాయి. సర్వ ప్రాప్తులతో నిండి ఉన్న భండారము ఉంది. ఎక్కడైతే సదా భండారము నిండుగా ఉంటుందో అక్కడ దు:ఖము, బాధలు అన్నీ సమాప్తమైపోతాయి. 'ఓహో! నా శ్రేష్ఠ భాగ్యము' అంటూ సదా మీ భాగ్యమును చూస్తూ హర్షిస్తూ ఉండండి. మనసులో సదా ఇదే పాట పాడుతూ ఉండండి. మీ భాగ్యము ఎంత గొప్పది! ప్రపంచములోని వారికైతే భాగ్యములో సంతానము లభిస్తుంది, ధనము లభిస్తుంది, సంపద లభిస్తుంది కానీ ఇక్కడ ఏం లభిస్తుంది? స్వయం భాగ్యవిధాతయే భాగ్యంగా లభిస్తారు. ఎప్పుడైతే భాగ్యవిధాత మీవారిగా అయిపోయారో అప్పుడిక మిగిలిందేముంది? ఈ అనుభవముంది కదా! కేవలం ఎవరో విని వినిపించిన మాటల పై నడవలేదు కదా! భాగ్యం లభిస్తుందని పెద్దవారు చెప్పినప్పుడు ఆ మార్గములో మీరు నడిస్తే అప్పుడు దానిని విని వినిపించిన మార్గంలో నడవడం అని అంటారు. కనుక మీరు వినడం ద్వారా అర్థం చేసుకున్నారా లేక అనుభవం ద్వారా అర్థం చేసుకున్నారా? అందరూ అనుభవజ్ఞులేనా? సంగమ యుగము అనుభవం చేసుకునే యుగం. ఈ యుగములో సర్వ ప్రాప్తులు అనుభవం చేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే అనుభవం చేసుకుంటున్నారో అది సత్యయుగములో ఉండదు. ఇక్కడ ఏ స్మృతి అయితే ఉందో అది సత్యయుగములో మర్జ్ అయిపోతుంది. ఇక్కడ బాబా లభించారు అని అనుభవం చేసుకుంటారు కానీ అక్కడ బాబా విషయమే ఉండదు. సంగమ యుగమే అనుభవం చేసుకునే యుగము. కావున ఈ యుగములో అందరూ అనుభవజ్ఞులుగా అయిపోయారు. అనుభవీ ఆత్మలు ఎప్పుడూ మాయతో మోసగించబడరు. మోసపోవడం ద్వారానే దు:ఖము కలుగుతుంది. అనుభవం యొక్క అథారిటి ఉన్నవారు ఎప్పుడూ మోసపోజాలరు. సదా సఫలతను పొందుతూ ఉంటారు, సదా సంతోషంగా ఉంటారు. కావున ''మీరు సర్వ ప్రాప్తి స్వరూప సంతుష్ట ఆత్మలు అంతేకాక సంతుష్టంగా(తృప్తిగా) తయారు చేసేవారు'' అన్న వర్తమాన సీజనులోని వరదానాన్ని గుర్తుంచుకోండి. మంచిది.

బాప్దాదా ఎదురుగా ఇన్ కమ్ టాక్స్ ఆఫీసరు కూర్చొని ఉన్నారు, వారిని ఉద్దేశించి ఉచ్ఛరించిన మధుర మహావాక్యాలు :- మీరు మీ ఇంటికి వచ్చారని భావిస్తున్నారు కదా! ఈ ఇల్లు ఎవరిది? పరమాత్ముని ఇల్లు, అందరి ఇల్లు అయ్యింది కదా! మరి మీ ఇల్లు కూడా అవుతుంది కదా! ఇంట్లోకి వచ్చారు. చాలా మంచిపని చేశారు. ఇప్పుడిక ఇంకా శ్రేష్ఠమైన ఏ పనిని చేస్తారు? శ్రేష్ఠాతి శ్రేష్ఠమైనది చేయాలి మరియు ఉన్నతోన్నతంగా అవ్వాలి అన్న లక్ష్యం మీ జీవితంలో ఉండనే ఉంటుంది. ఇప్పుడు అత్యంత మంచి పని ఏది చేయాలి? ఏ పాఠమునైతే ఇప్పుడు వినిపించడం జరిగిందో ఆ ఒక్క పాఠాన్ని పక్కా చేసుకున్నట్లయితే, ఆ ఒక్క పాఠములోనే చదువు అంతా ఇమిడి ఉంది. ఇది అద్భుతమైన విశ్వ విద్యాలయము. చూసేందుకు ఇది ఇల్లు కూడా కాని తండ్రియే సత్యమైన శిక్షకుడు. ఇది ఇల్లు మరియు విద్యాలయము కూడా. అందుకే ఇది ఇల్లా లేక విద్యాలయమా అన్నది చాలామంది అర్థం చేసుకోలేరు. కానీ ఇది ఇల్లు మరియు విద్యాలయము కూడా. ఇక్కడ అన్నిటికంటే శ్రేష్ఠమైన చదువు ఏదైతే ఉందో అది చదివించబడ్తుంది. కాలేజిలో గాని లేక స్కూలులో గాని ఏ లక్ష్యంతో చదువుకుంటారు? చరిత్రవంతులుగా అవ్వాలి, సంపాదనకు యోగ్యులుగా అవ్వాలి, పరివారమును మంచిగా పాలన చేసేవారిగా అవ్వాలి అనే లక్ష్యంతోనే కదా! కావున ఇక్కడ ఈ లక్ష్యాలన్నీ పూర్తి అవ్వనే అవుతాయి. ఒక్కొక్కరు చరిత్రవంతులుగా అయిపోతారు.

భారతదేశ నేతలు ఏం కోరుకుంటారు? భారతదేశ బాపూజీ ఏం కోరుకునేవారు? భారతదేశము లైట్ హౌస్ గా అవ్వాలనే కోరుకునేవారు కదా. భారతదేశము ప్రపంచానికి ఆధ్యాత్మిక శక్తి కేంద్రంగా అవ్వాలనే కోరుకునేవారు. అదే కార్యము ఇక్కడ గుప్త రూపంలో జరుగుతోంది. ఒక్కరు సీతా-రాములు సమానంగా అయినట్లయితే ఆ ఒక్క సీతా-రాముల కారణంగా రామరాజ్యం ఏర్పడింది. మరి ఇంతమంది మీరంతా సీతా-రాముల సమానంగా అయిపోతే ఏమవుతుంది? ఈ పాఠం కష్టమైనది ఏమీ కాదు. ఇది చాలా సహజమైనది. ఈ పాఠాన్ని పక్కా చేసినట్లయితే మీరు కూడా సత్యమైన శిక్షకుని ద్వారా ఆత్మిక సర్టిఫికెట్ ని తీసుకుంటారు. అంతేకాక సంపాదనకు ఆధారమైన గ్యారెంటీని కూడా తీసుకుంటారు. కానీ ఇదైతే తప్పకుండా విచిత్రమైనదే. తాత, ముత్తాతలు కూడా ఇక్కడే చదువుకుంటారు. అలాగే మనవళ్లు, మునిమనవళ్లు కూడా ఇక్కడే చదువుకుంటారు. ఒకే క్లాసులో ఇరువురూ చదువుకుంటారు. ఎందుకంటే ఇక్కడ ఆత్మలను చదివించడం జరుగుతుంది. శరీరాలను చూడరు. ఆత్మను చదివించడం జరుగుతుంది. ఇక్కడ 5 సంవత్సతాల చిన్న పిల్లలు కూడా ఈ పాఠాన్ని చదవగలరు కదా. పిల్లలు ఇంకా ఎక్కువ పని చేయగలరు. అలాగే ఎవరైతే వృద్ధులుగా అయిపోయారో వారి కొరకు ఈ చదువు ఎంతో అవసరం. లేకపోతే జీవితంలో నిరాశగా అయిపోతారు. చదువుకోని మాతలకు కూడా శ్రేష్ఠ జీవితమైతే కావాలి కదా! అందువలన సత్యమైన శిక్షకుడు అందరినీ చదివిస్తారు. ఎంత పెద్ద వి.వి.వి.ఐ.పి అయినా సత్యమైన శిక్షకుని ముందు అందరూ విద్యార్థులే. ఈ ఒక్క పాఠమునే అందరికీ చదివిస్తారు. మరి మీరు ఏం చేస్తారు? ఈ పాఠాన్ని చదువుతారు కదా. దీని వల్ల మీకే లాభం కలుగుతుంది. ఎవరైతే చేస్తారో వారే పొందుతారు. ఎంత చేస్తారో అంత లాభం కలుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఒకటికి పదమా రెట్లుగా అయ్యి లభిస్తుంది. అక్కడ వినాశీ చదువులో అలా ఉండదు. అవినాశీ చదువులో ఒకటికి పదమారెట్లుగా అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ దాత ఉన్నారు కదా! మంచిది.

రాజస్థాన్ జోన్ తో బాప్దాదా మిలనము :- రాజస్థాన్ జోన్ విశేషత ఏమిటి? రాజస్థాన్లోనే ముఖ్య కేంద్రముంది. కావున ఎలాగైతే జోన్కు విశేషత ఉందో, అలా రాజస్థాన్ నివాసులకు కూడా విశేషత ఉంటుంది కదా. ఇప్పుడు రాజస్థాన్లో ఏదైనా విశేషమైన వజ్రాన్ని వెలికి తీశారా? లేక మీరే విశేషమైన వజ్రాలా? మీరు అందరికంటే విశేషమైనవారే కాని సేవాక్షేత్రములో ప్రపంచ దృష్టిలో ఎవరైతే విశేషమైనవారో వారిని కూడా సేవలో నిమిత్తంగా చేయాలి. ఇటువంటి సేవను చేశారా? రాజస్థాన్ అన్నిటికంటే నెంబర్ వన్ గా అవ్వాలి. సంఖ్యలో, క్వాలిటీలో, సేవ యొక్క విశేషతలో అన్నింటిలో నెంబర్వన్ గా అవ్వాలి. ముఖ్యకేంద్రమైతే నెంబర్వన్ గానే ఉంది. కానీ దాని ప్రభావము మొత్తం రాజస్థాన్ అంతటా ఉండాలి. ఇప్పుడు సంఖ్యలో మహారాష్ట్ర జోన్ను, గుజరాత్ జోన్ను నెంబర్వన్ గా లెక్కిస్తున్నారు. ఇప్పుడిక అన్నిటికంటే నెంబర్వన్ గా రాజస్థాన్నే లెక్కించాలి. ఇప్పుడు ఈ సంవత్సరం అందుకు ఏర్పాట్లు చేయండి. వచ్చే సంవత్సరానికి మహారాష్ట్ర మరియు గుజరాత్ కన్నా నెంబర్వన్ గా ముందుకు వెళ్లాలి. నిశ్చయబుద్ధి గలవారు విజయులుగా అవుతారు. ఎంతటి మంచి మంచి అనుభవీ రత్నాలున్నారు! సేవను ముందుకు తీసుకెళ్తారు. తప్పకుండా సేవ వృద్ధి చెందుతుంది. మంచిది.