11.05.1984        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


''బ్రాహ్మణుల ప్రతి అడుగు, సంకల్పము, కర్మ ద్వారా విధాన నిర్మాణము''

విశ్వ రచయిత విశ్వ నవ నిర్మాణము చేసి నూతన విశ్వములోకి వచ్చే తమ భాగ్యశాలీ పిల్లలను చూస్తున్నారు. శ్రేష్ఠ భాగ్యశాలీ పిల్లలైన మీ భాగ్యమే విశ్వము యొక్క భాగ్యము. మీరు నూతన విశ్వానికి ఆధార స్వరూపమైన శ్రేష్ఠమైన పిల్లలు. మీరు నూతన విశ్వ రాజ్య భాగ్యానికి అధికారులైన విశేష ఆత్మలు. మీ నూతన జీవితము విశ్వ నవ నిర్మాణాన్ని చేస్తుంది. విశ్వాన్ని శ్రేష్ఠాచారిగా సుఖ-శాంతి సంపన్నంగా చేయాల్సిందే. మీ అందరి ఈ శ్రేష్ఠ దృఢ సంకల్పమనే వేలు ద్వారా కలియుగ దు:ఖమయ ప్రపంచం మారి సుఖమయ ప్రపంచంగా అవుతుంది. ఎందుకంటే సర్వశక్తివంతుడైన తండ్రి శ్రీమతానుసారం సహయోగులుగా అయ్యారు. కావున తండ్రితో పాటుగా మీ అందరి సహయోగము, శ్రేష్ఠ యోగము విశ్వాన్ని పరివర్తన చేసేస్తుంది. ఈ సమయంలోని శ్రేష్ఠ ఆత్మలైన మీ సహజయోగీ, రాజయోగి జీవితములోని ప్రతి అడుగు, ప్రతి కర్మ కొత్త విశ్వానికి విధానంగా అవుతుంది. బ్రాహ్మణుల విధి సదా కాలానికి విధానంగా అవుతుంది. కావున దాత పిల్లలైన మీరు దాతలు, విధాతలు మరియు విధి విధాతలుగా అవుతారు. ఈ రోజు అంతిమ జన్మ వరకు కూడా దాత పిల్లలైన మీ చిత్రాల ద్వారా భక్త జనులు వేడుకుంటూనే ఉంటారు. మీరు ఎటువంటి విధి-విధాతలుగా అవుతారంటే ఈ నాటి వరకు చీఫ్ జస్టిస్(న్యాయాధిపతి) కూడా అందరితో ప్రమాణము చేయించే సమయంలో ఈశ్వరుడు లేక ఇష్ట దేవతల స్మృతి స్వరూపంగా చేసి ప్రమాణము చేయిస్తారు. చివరి జన్మలో కూడా విధానములో విధి-విధాతలగు పిల్లలైన మీ శక్తియే కొనసాగుతోంది. తమ పైన ప్రమాణం చేయరు, తండ్రికి, మీకు మహత్వమును ఉంచుతారు. సదా వరదానీ స్వరూపులు కూడా మీరే. అనేక రకాల వరదానాలను, భిన్న-భిన్న దేవతలు మరియు దేవీల ద్వారా మీ చిత్రాల ద్వారానే కోరుకుంటారు. కొందరు శక్తుల దేవతలు, మరి కొందరు విద్యాదేవీలు. వరదాని స్వరూపులుగా మీరే అయ్యారు. అందుకే నేటి వరకు భక్తి పరంపర ఆది నుండి కొనసాగుతూ వస్తోంది. బాప్దాదా ద్వారా సదా సర్వ ప్రాప్తి స్వరూపులుగా, ప్రసన్న చిత్తులుగా, ప్రసన్న స్వరూపులుగా అయ్యారు. కావున ఇప్పటివరకూ కూడా స్వయాన్ని ప్రసన్నంగా చేసుకునేందుకు వీరే మమ్ములను సదాకాలానికి ప్రసన్నంగా చేయగలరని దేవీ దేవతలను ప్రసన్నం చేస్తారు. అన్నిటికంటే అతి గొప్ప సంతుష్టతా ఖజానాను తండ్రి ద్వారా మీరందరూ పొందారు. అందుకే సంతుష్టతను తీసుకునేందుకు సంతోషీ దేవిని పూజిస్తూ ఉంటారు. అందరూ సంతుష్ట ఆత్మలైన సంతోషి మాతలే కదా! అందరూ సంతోషీలే కదా! సంతుష్ట ఆత్మలైన మీరందరూ సంతోషి మూర్తులే. బాప్దాదా ద్వారా సఫలతను జన్మ సిద్ధ అధికార రూపములో పొందారు. అందువలన సఫలతా దానము, వరదానమును మీ చిత్రాల నుండి వేడుకుంటారు. అల్పబుద్ధి గలవారిగా, నిర్బల ఆత్మలుగా, భికారి ఆత్మలుగా అయిన కారణంగా కేవలం అల్పకాలిక సఫలతనే కోరుకుంటారు. ఎలాగైతే భికారులు ఎప్పుడూ వేయి రూపాయిలు ఇవ్వండి అని అనరు. ఏవో కొన్ని పైసలు ఇవ్వండి, ఒక్క రూపాయి, రెండు రూపాయిలు ఇవ్వండని మాత్రమే అంటారో అలా ఆత్మలు కూడా సుఖ-శాంతి, పవిత్రతల భికారులు, అల్పకాలికమైన సఫలతను వేెడుకుంటారు. ఈ పని అయిపోతే చాలు, ఇందులో సఫలత పొందితే చాలు అని వేడుకుంటారు. కానీ సఫలతా స్వరూప ఆత్మలైన మీ నుండే కోరుకుంటారు. హృదయాభిరాముడైన తండ్రి పిల్లలైన మీరు, హృదయ రాముడైన తండ్రికి మీ హృదయ స్థితి-గతులన్నీ వినిపిస్తారు. మీ మనసులోని మాటలు చెప్పుకుంటారు. ఏ ఆత్మతోనూ చెప్పుకోలేని విషయాలను తండ్రితో చెప్పుకుంటారు. సత్యమైన తండ్రికి సత్యమైన పిల్లలుగా అవుతారు. ఇప్పటికి కూడా మీ చిత్రాల ముందు అందరూ వారి మానసిక స్థితి గతులన్నీ చెప్పుకుంటూ ఉంటారు. దాచి ఉంచుకోవలసిన తమ విషయాలేవైనా ఉంటే తమ స్నేహితులు, బంధువుల నుండి దాచిపెట్తారు కానీ దేవీ దేవతల ముందు దాచరు. ప్రపంచం ముందు నేను ఇలాంటివాడను, సత్యమైనవాడిని, గొప్పవాడిని అని చెప్పుకుంటారు. కానీ దేవతల ముందు ఏమంటారు? నేను ఎలా ఉన్నానంటే - కామిగా ఉన్నాను, అలాగే కపటిగా కూడా ఉన్నానని చెప్పుకుంటారు. కావున మీరు ఇటువంటి కొత్త విశ్వానికి భాగ్యశాలురు. ప్రతి ఒక్కరి భాగ్యములో పావన విశ్వరాజ్య భాగ్యము ఉంది.

మీరు ఇటువంటి విధాత, వరదాత, విధి-విధాతలైన సర్వ శ్రేష్ఠ ఆత్మలు. ప్రతి ఒక్కరి శ్రేష్ఠ మతమనే చేతులతో స్వర్గమనే స్వరాజ్య గోళముంది. ఇదే ఆ వెన్న - రాజ్యభాగ్యమనే వెన్న. ప్రతి ఒక్కరి శిరస్సు పై మహోన్నతమైన పవిత్రతా ప్రకాశ కిరీటముంది. మీరు హృదయ సింహాసనాధికారులు, స్వరాజ్య తిలకధారులు. కనుక 'నేను ఎవరు' అన్నది అర్థం చేసుకున్నారా? నేను ఎవరిని అన్న చిక్కు ప్రశ్నను పరిష్కరించడానికి వచ్చారు కదా? మొదటిరోజు నేను ఎవరు? అనే పాఠమును చదివారు కదా! నేను ఇది కాదు, నేను ఇది అని చదువుకున్నారు కదా. ఇందులోనే జ్ఞానసాగరుని జ్ఞానమంతా ఇమిడి ఉంది. అంతా తెలుసుకున్నారు కదా! ఇదే ఆత్మిక నషా సదా తోడుగా ఉండాలి. మీరు ఇంత శ్రేష్ఠమైన ఆత్మలు. ఇంత మహోన్నతమైనవారు. మీ ప్రతి అడుగు, ప్రతి సంకల్పము, ప్రతి కర్మ స్మృతి చిహ్నముగా అవుతోంది, విధానంగా అవుతోంది. ఇదే శ్రేష్ఠ స్మృతితో వారిని పైకి ఎత్తండి. అర్థమయ్యిందా? మొత్తం విశ్వమంతటి దృష్టి ఆత్మలైన మీ వైపు ఉంది. నేను ఏదైతే చేస్తానో, అది విశ్వం కొరకు విధానంగా మరియు స్మృతిచిహ్నంగా అవుతుంది. నేను అలజడిలోకి వచ్చినట్లయితే ప్రపంచం అలజడిలోకి వస్తుంది. నేను తృప్తిగా, ప్రసన్నంగా ఉంటే ప్రపంచం సంతుష్టంగా, ప్రసన్నంగా అవుతుంది. విశ్వ నవ నిర్మాణానికి నిమిత్తమైన ప్రతి ఒక్కరి పై ఇంత బాధ్యత ఉంది. కానీ ఎంత పెద్దదో అంత తేలికైనది. ఎందుకంటే సర్వ శక్తివంతులైన తండ్రి తోడుగా ఉన్నారు. మంచిది.

ఇటువంటి సదా పస్రన్నచిత్తులైన ఆత్మలకు, సదా మాస్టర్ విధాత, వరదాతలైన పిల్లలకు, సర్వ పాప్త్రి స్వరూప సంతుష్ట ఆత్మలకు, సదా స్మృతి ద్వారా పత్రి కర్మకు స్మృతిచిహ్నాన్ని తయారు చేసుకునే పూజ్య మహాన్ఆత్మలకు, విధాత, వరదాత అయిన బాప్దాదాల పియ్రస్మృతులు మరియు నమస్తే.

వేరు వేరు కుమారుల గ్రూపులతో అవ్యక్త బాప్దాదాల కలయిక :-

1. అందరూ శ్రేష్ఠ కుమారులే కదా! సాధారణ కుమారులు కాదు, శ్రేష్ఠ కుమారులు. శారీరిక శక్తిని, మానసిక శక్తులనన్నిటిని శ్రేష్ఠ కార్యములో వినియోగించేవారు. ఏ శక్తినీ వినాశీ కార్యములో వినియోగించేవారు కాదు. వికారీ కార్యము వినాశకారీ కార్యము, శ్రేష్ఠ కార్యము ఈశ్వరీయ కార్యము. కనుక మీరు సర్వ శక్తులను ఈశ్వరీయ కార్యములో వినియోగించే శ్రేష్ఠ కుమారులు. ఎక్కడా వ్యర్థ ఖాతాలో అయితే ఏ శక్తిని వినియోగించడం లేదు కదా? ఇప్పుడు మీ శక్తులను ఎక్కడ వినియోగించాలో ఈ వివేకము లభించింది. ఈ వివేకముతోనే సదా శ్రేష్ఠ కార్యాలు చేయండి. ఇటువంటి శ్రేష్ఠ కార్యములో సదా ఉండేవారు శ్రేష్ఠ ప్రాప్తికి అధికారులుగా అవుతారు. ఇటువంటి అధికారులుగా అయ్యారా? శ్రేష్ఠ ప్రాప్తి అవుతోందని అనుభవం చేస్తున్నారా? లేక ఇంకా అవ్వాలా? ప్రతి అడుగులో పదమాల సంపాదన జమ అవుతోంది అన్న అనుభవము ఉంది కదా? ఎవరికైతే ఒక అడుగులో పదమాల సంపాదన జమ అవుతుందో వారెంత శ్రేష్ఠమైనవారు. ఎవరికైతే ఇంత సంపద జమ అవుతుందో వారికెంత సంతోషముంటుంది! ఈ రోజుల్లో లక్షాధికారులు, కోటీశ్వరులకు కూడా వినాశి సంతోషముంటుంది. మీది అవినాశి ప్రాపర్టి(ఆస్తి). శ్రేష్ఠ కుమారుల పరిభాషను(నిర్వచనాన్ని) అర్థం చేసుకున్నారా? ప్రతి శక్తిని సదా శ్రేష్ఠ కార్యంలో వినియోగించేవారు. వ్యర్థ ఖాతా సదాకాలానికి సమాప్తమై, శ్రేష్ఠ ఖాతా జమ అయ్యిందా లేక రెండూ కొనసాగుతున్నాయా? ఒకటి సమాప్తమయ్యింది. ఇప్పుడు రెండిటిని నడిపించే సమయము కాదు. ఇప్పుడు అది సదాకాలానికి సమాప్తం. రెండూ ఉంటే ఎంత జమ అవ్వాలో అంత అవ్వదు. పోగొట్టుకోకుండా జమ అవుతే ఎంత జమ అవుతుంది! కావున వ్యర్థ ఖాతా సమాప్తమయ్యింది, సమర్థ ఖాతా జమ అయ్యింది.


2. కుమారుల జీవితము శక్తిశాలి జీవితము. కుమార్లు జీవితములో ఏది కావాలనుకుంటే అది చేయగలరు. స్వయాన్ని శ్రేష్ఠంగా అయినా చేసుకోవచ్చు లేక స్వయాన్ని కింద పడేసుకోవచ్చు. ఈ కుమార్ జీవతమే ఉన్నతంగా లేక నీచంగా అయ్యే జీవితము. ఇటువంటి జీవితములో మీరు తండ్రికి చెందినవారిగా అయ్యారు. వినాశి జీవిత సహచరుల(సాథీల) కర్మబంధనంలో బంధింపబడేందుకు బదులుగా సత్యమైన జీవిత సాథీని తీసుకున్నారు. మీరెంత భాగ్యశాలురు! ఇప్పుడు వచ్చినప్పుడు ఒంటరిగా వచ్చారా లేక కంబైండుగా వచ్చారా?(కంబైండు). టికెట్టుకి అయితే ఖర్చు పెట్టలేదు కదా! కనుక ఇది కూడా పొదుపే అయ్యింది. ఒకవేళ శారీరికంగా తోడును తీసుకొని వచ్చినట్లయితే టికెట్టుకి ఖర్చు చేసేవారు. వారి సమాను కూడా మోయవలసి వచ్చేది అంతేకాక సంపాదించి రోజూ తినిపించవలసి వచ్చేది. ఈ సాథీ అయితే తినను కూడా తినరు. కేవలం వాసన(భావన) తీసుకుంటారు. మీ రొట్టెలు తగ్గిపోవు, ఇంకా వాటిలో శక్తి నిండుతుంది. ఎటువంటి ఖర్చు లేకుండా శ్రమ లేకుండా అవినాశి తోడును(సాథీని) పొందుతారు. వారి సహయోగము కూడా పూర్తిగా లభిస్తుంది. మీ నుండి శ్రమ తీసుకోరు. ఇంకా సహయోగము చేస్తారు. ఏదైనా కష్టమైన కార్యము వస్తే స్మృతి చేయగానే సహయోగము లభిస్తుంది. మీరు ఇటువంటి అనుభవం ఉన్నవారే కదా! భక్తులకు కూడా భక్తికి ఫలమును ఇచ్చేవారైనప్పుడు జీవిత సహచరులుగా అయ్యేవారికి సహాయమునివ్వరా? కుమారులు కంబైండుగా అయితే అయ్యారు అయితే ఈ కంబైండుగా ఉండడంతో నిశ్చింత చక్రవర్తులుగా అయ్యారు. ఎటువంటి జంజాటము(కష్టము) లేదు. నిశ్చింతగా ఉన్నారు. ఈ రోజు కొడుకు అనారోగ్యంగా ఉన్నాడు, ఈ రోజు స్కూలుకు వెళ్ళలేదు..... ఇలాంటి భారాలేవీ లేవు. సదా నిర్బంధనులు. ఒక్కరి బంధనంలో బంధింపబడి ఉండడం ద్వారా అనేక బంధనాల నుండి విముక్తులైపోయారు. తినండి, త్రాగండి, ఆనందించండి. ఇంకే పని ఉంది? మీ చేతులతో తయారు చేసుకుంటారు, తింటారు. ఏది కావాలనుకుంటే అది తినండి. మీరు స్వతంత్రులు ఎంత శ్రేష్ఠంగా అయ్యారు! ప్రపంచం లెక్కలో కూడా బాగున్నారు. ప్రపంచ జంజాటాల నుండి రక్షింపబడ్డామని అర్థము చేసుకున్నారు కదా! ఆత్మ విషయాన్ని వదలండి. శారీరిక కర్మబంధనాల లెక్క నుండి రక్షింపబడ్డారు. ఇంత సురక్షితంగా ఉన్నారు. ఎవరైనా జ్ఞానీ ఆత్మను తోడుగా(సాథీగా) చేసుకోవాలని ఎప్పుడూ అనిపించడం లేదు కదా! ఏ కుమారి కళ్యాణమునైనా చేయాలని మనసు ఇష్టపడ్తోందా? ఇది కళ్యాణము కాదు, అకళ్యాణము. ఎందుకు? ఒక్క బంధనంలో బంధించుకుంటే అనేక బంధనాలు ప్రారంభమవుతాయి. ఈ ఒక్క బంధనము అనేక బంధనాలను ఉత్పన్నం చేస్తుంది కనుక సహాయము లభించదు, భారమవుతుంది. చూసేందుకు సహాయంగా ఉంటుంది కానీ ఇది అనేక విషయాల భారము. ఎంత భారమంటే అంత భారము. కనుక అనేక భారాల నుండి రక్షింపబడ్డారు. ఎప్పుడూ స్వప్నంలో కూడా ఇలా ఆలోచించకండి. లేకుంటే ఎటువంటి భారము అనుభవమవుతుందంటే ఇక లేవడమే కష్టమైపోతుంది. స్వతంత్రంగా ఉంటూ బంధనంలో బంధింపబడినట్లయితే పదమా రెట్ల భారము ఏర్పడిపోతుంది. పాపం! వారు తెలియక బంధింపబడ్డారు. మీరు అన్నీ తెలిసి తెలిసి బంధించుకుంటే పశ్చాత్తాప భారము ఏర్పడ్తుంది. ఎవ్వరూ కచ్ఛాగా(అపరిపక్వంగా) అయితే లేరు కదా? కచ్ఛాగా ఉన్నవారికి గతి ఉండదు. వారు ఇక్కడి వారిగానూ ఉండరు, అక్కడి వారిగానూ ఉండరు. మీకైతే సద్గతి లభించేసింది కదా! సద్గతి అనగా శ్రేష్ఠమైన గతి. కొద్దిగా సంకల్పం వస్తోందా? ఫోటో తీయబడుతోంది. ఒకవేళ కొంచెం పైకి - క్రిందకు అయినా అది ఫోటోలోకి వచ్చేస్తుంది. ఎంత పక్కాగా(పరిపక్వంగా) అవుతారో అంతగా వర్తమానము మరియు భవిష్యత్తు శ్రేష్ఠంగా ఉంటుంది.

3. అందరూ సమర్థ కుమారులగా ఉన్నారు కదా? సమర్థులేనా? సమర్థ ఆత్మలు సదా ఏ సంకల్పము చేసినా, ఏమి మాట్లాడినా, ఏ కర్మలు చేసినా అవి సమర్థంగానే ఉంటాయి. సమర్థులు అనగా వ్యర్థమును సమాప్తము చేసేవారు. వ్యర్థ ఖాతాను సమాప్తం చేసి సమర్థ ఖాతాను సదా జమ చేసుకునేవారు. ఎప్పుడూ వ్యర్థము నడవడం లేదు కదా? వ్యర్థ సంకల్పాలు చేయడం లేక వ్యర్థమైన మాటలు మాట్లాడడం లేక సమయాన్ని వ్యర్థం చేయడం. ఒకవేళ ఒక్క సెకండు పోయినా ఎంతో పోతుంది. సంగమ యుగంలోని సెకండు ఎంత పెద్దది. అది సెకండు కాదు. ఒక్క సెకండు ఒక జన్మకు సమానమైనది. ఒక్క సెకండు కాదు ఒక్క జన్మ పోయింది. మీరు ఇటువంటి మహత్వమును తెలుసుకున్న సమర్థ ఆత్మలు కదా! సదా మేము సమర్థుడైన తండ్రి పిల్లలము, సమర్థ ఆత్మలము, సమర్థ కార్యానికి నిమిత్తులము అన్న స్మృతి ఉండాలి. ఇటువంటి స్మృతి ఉంటే సదా ఎగిరే కళను అనుభవం చేస్తూ ఉంటారు. బలహీనులు ఎగురలేరు. సమర్థులు సదా ఎగురుతూ ఉంటారు. కావున మీరు ఏ కళలోని వారు? ఎగిరేకళ వారా లేక ఎక్కేకళ వారా? ఎక్కడంలో ఆయాసమొస్తుంది, అలసిపోతారు కూడా. ఎగిరేకళ వారు సెకనులో గమ్యాన్ని చేరుకొని సఫలతా స్వరూపులుగా అవుతారు. ఎక్కేకళ వారైతే తప్పకుండా అలసిపోతారు, ఆయాసం కూడా వస్తుంది. ఏం చేయాలి, ఎలా చేయాలి అంటూ ఆయాసపడ్తారు. ఎగిరేకళలో అన్నిటిని దాటిపోతారు. ఇది చేయాలని టచింగ్ వస్తుంది. ఇది జరిగే ఉందని అనిపిస్తుంది. కావున సెకండులో సఫలతా గమ్యమును పొందేవారిగా ఉంటారు. వారినే సమర్థ ఆత్మలని అంటారు. అందరూ ఎగిరేకళలో ఉన్న పిల్లలని తండ్రికి ఎంతో సంతోషమవుతుంది. వీరు ఎందుకు శ్రమ చేయాలి? పిల్లలు శ్రమ నుండి ముక్తులుగా ఉండాలని తండ్రి అంటారు. తండ్రి మార్గమును చూపిస్తున్నప్పుడు, డబల్ లైట్ గా చేస్తున్నప్పుడు మళ్లీ క్రిందకు ఎందుకు వచ్చేస్తారు? ఏమవుతుంది, ఎలా అవుతుంది అనేది భారము. సదా కళ్యాణం జరుగుతుంది, సదా శ్రేష్ఠంగా అవుతుంది, సదా సఫలత జన్మ సిద్ధ అధికారమనే స్మృతితో నడవండి.

4. కుమారులు పరీక్షలు ఇచ్చేందుకు యుద్ధం చేయవలసి ఉంటుంది. పవిత్రంగా అవ్వాలనే సంకల్పం చేయగానే మాయ యుద్ధం చేయడం ప్రారంభిస్తుంది. కుమార్ల జీవితము శ్రేష్ఠమైన జీవితం. మీరు మహాన్ఆత్మలు. ఇప్పుడు కూమారులు అద్భుతం చేసి చూపించాలి. తండ్రి సమానంగా అయ్యి తండ్రికి సహచరులుగా చేయడమే అన్నిటికంటే అత్యంత గొప్ప అద్భుతము. ఎలాగైతే మీరు తండ్రికి సహచరులుగా అయ్యారో అలా ఇతరులను కూడా సహచరులుగా చేయాలి. మాయకు సహచరులుగా ఉన్నవారిని తండ్రికి సహచరులుగా చేయాలి. ఇటువంటి సేవాధారులుగా అవ్వాలి. మీ వరదానీ స్వరూపము ద్వారా శుభ భావన మరియు శుభ కామనల ద్వారా తండ్రికి చెందినవారిగా తయారు చేయాలి. ఇదే విధి ద్వారా సదా సిద్ధిని ప్రాప్తి చేసుకోవాలి. ఎక్కడైతే శ్రేష్ఠమైన విధి ఉంటుందో అక్కడ సిద్ధి తప్పకుండా ఉంటుంది. కుమారులు అనగా సదా అచలంగా ఉండేవారు, అలజడిలోకి వచ్చేవారు కాదు. అచలంగా ఉండే ఆత్మలు ఇతరులను కూడా అచలంగా చేస్తారు.

5. అందరూ విజయీ ఆత్మలే కదా? ఎక్కడైతే తండ్రి తోడు ఉంటుందో అక్కడ సదా విజయముంటుంది. సదా తండ్రి తోడు ఆధారంతో ఏ పని చేసినా తక్కువ శ్రమతో ఎక్కువ ప్రాప్తి అనుభవమవుతుంది. తండ్రి నుండి కొద్దిగా పక్కకు తప్పుకున్నా శ్రమ ఎక్కువగా, ప్రాప్తి తక్కువగా ఉంటుంది. కావున శ్రమ నుండి ముక్తులయ్యేందుకు సాధనము - ప్రతి సెకను, ప్రతి సంకల్పములో తండ్రి తోడు ఉండాలి. ఈ తోడు ద్వారా సఫలత లభించి తీరుతుంది. మీరు తండ్రికి ఇటువంటి సాథీలుగా ఉన్నారు కదా! తండ్రి ఆజ్ఞ ఏదైతే ఉందో ఆ ఆజ్ఞానుసారం అడుగు వేయాలి. తండ్రి అడుగు వెనుక అడుగు వేయాలి. ఇక్కడ అడుగు వేయాలా లేక వేయరాదా? ఇది సరైనదా లేక తప్పా? అని ఆలోచించవలసిన అవసరం కూడా లేదు. ఏదైనా కొత్త దారి అయితే ఆలోచించవలసి ఉంటుంది, కానీ అడుగు పైన అడుగు ఉంచవలసినప్పుడు ఆలోచించే పనే లేదు. సదా తండ్రి అడుగు పైన అడుగు వేసి నడుస్తూ ఉంటే గమ్యము సమీపంగానే ఉంది. తండ్రి ఎంత సహజతరం చేశారు! శ్రీమతమే అడుగు. శ్రీమతం అనే అడుగు పై అడుగు వేస్తూ ఉంటే శ్రమ నుండి సదా ముక్తులుగా ఉంటారు. అన్ని సఫలతలు అధికార రూపంలో లభిస్తాయి. చిన్న కుమారులు కూడా చాలా సేవ చేయవచ్చు. ఎప్పుడూ పరిహాసం(ఎగతాళి) చేయరాదు. మీ నడవడిక, మాటలు, వ్యవహారము ఎలా ఉండాలంటే మిమ్ములను చూసినవారు వీరు ఏ స్కూలులో చదువుతున్నారు? అని అడగాలి. అప్పుడు సేవ జరుగుతుంది కదా! మంచిది.