26.12.1984        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


'' సత్యతా శక్తి ''

సర్వశక్తివంతుడైన తండ్రి ఈ రోజు విశేషంగా రెండు అధికారాలను(సత్తాలను) చూస్తున్నారు. ఒకటి రాజ్యాధికారము, రెండవది ఈశ్వరీయ అధికారము. ఇప్పుడు సంగమ యుగములో రెండు అధికారాల విశేష పాత్ర నడుస్తూ ఉంది. రాజ్యాధికారము అలజడిలో ఉంది. ఈశ్వరీయ అధికారము సదా అచంచలంగా, అవినాశిగా ఉంది. ఈశ్వరీయ అధికారాన్ని సత్యతా శక్తి అని అంటారు. ఎందుకంటే ఇచ్చేవారు సత్యమైన తండ్రి, సత్యమైన శిక్షకుడు, సద్గురువు. అందువలన సత్యతా శక్తి సదా శ్రేష్ఠంగా ఉంది. సత్యతా శక్తి ద్వారా సత్యయుగాన్ని సత్య ఖండాన్ని స్థాపన చేస్తున్నారు. సత్యం అనగా అవినాశి కూడా. కావున సత్యతా శక్తి ద్వారా అవినాశి వారసత్వం, అవినాశి పదవిని ప్రాప్తి చేసుకునే చదువు, అవినాశి వరదానాలను ప్రాప్తి చేసుకున్నారు. ఈ ప్రాప్తి నుండి ఎవ్వరూ మిమ్ములను తొలగించలేరు. సత్యతా శక్తి ద్వారా మొత్తం విశ్వమంతా సత్యతా శక్తి కలిగిన మిమ్ములను భక్తిమార్గము ఆది నుండి అంత్యము వరకు అవినాశి గాయనము మరియు పూజ చేస్తూ వస్తోంది. అనగా గాయనము, పూజ కూడా అవినాశిగా సత్యంగా అవుతుంది. సత్‌ అనగా సత్యము కావున అన్నిటికన్నా ముందు ఏం తెలుసుకున్నారు? మిమ్ములను మీరు సత్యమైన ఆత్మగా తెలుసుకున్నారు. సత్యమైన తండ్రి యొక్క సత్యమైన పరిచయాన్ని తెలుసుకున్నారు. ఈ సత్యమైన పరిచయంతో, సత్య జ్ఞానంతో సత్యతా శక్తి స్వత:గానే సత్యం అవుతుంది. సత్యతా శక్తి ద్వారా అసత్యం అనే అంధకారము, అజ్ఞానమనే అంధకారము స్వత:గానే సమాప్తి అవుతాయి. అజ్ఞానం సదా అసత్యంగా ఉంటుంది. జ్ఞానము సత్యము. సత్యముగా ఉన్నందువలన భక్తులు తండ్రి మహిమలో కూడా 'సత్యం శివం సుందరం' అని అన్నారు. సత్యతా శక్తి సహజంగానే ప్రకృతీజీత్‌గా, మాయాజీత్‌గా తయారు చేస్తుంది. ఇప్పుడు మిమ్ములను మీరు, ''సత్యమైన తండ్రికి సంతానంగా అయితే సత్యతా శక్తిని ఎంతవరకు ధారణ చేశాము?'' అని ప్రశ్నించుకోండి. సత్యతా శక్తికి గుర్తు - వారు సదా నిర్భయంగా ఉంటారు. సత్యంగా ఉంటూ నాట్యము చేస్తూ ఉంటారని మురళిలో విన్నారు కదా! అనగా సత్యతా శక్తి గలవారు సదా నిశ్చింతగా ఉన్న కారణంగా నిర్భయులుగా ఉన్న కారణంగా సంతోషంగా నాట్యము చేస్తూ ఉంటారు. ఎక్కడ భయం ఉంటుందో, చింత ఉంటుందో అక్కడ సంతోషంలో నాట్యం చెయ్యడం ఉండదు. తమ బలహీనతల గురించి కూడా చింత ఉంటుంది. తమ సంస్కారాలు లేక సంకల్పాలు బలహీనంగా ఉంటే సత్య మార్గమైన కారణంగా మనసులో తమ బలహీనతల చింతన తప్పకుండా నడుస్తుంది. బలహీనత మానసిక స్థితిని తప్పకుండా అలజడిలోకి తీసుకొస్తుంది. ఎంత మిమ్ములను మీరు దాచుకున్నా లేక కృత్రిమంగా, అల్పకాలిక సమయ ప్రమాణంగా, పరిస్థితి ప్రమాణంగా బయటకు చిరునవ్వుతో కనిపించినా, సదా సత్యతా శక్తి స్వయానికి తప్పకుండా అనుభవం చేయిస్తుంది. తండ్రితో మరియు స్వయంతో దాచుకోలేరు. ఇతరుల వద్ద దాచగలరు. సోమరితనం కారణంగా అప్పుడప్పుడు స్వయానికి అనుభవం అవుతున్నా అలాగే నడిపిస్తారు. అయినా సత్యతాశక్తి మనసులో అలజడి రూపంలో, ఉదాసీనత రూపంలో, వ్యర్థ సంకల్పాల రూపంలో తప్పకుండా వస్తుంది. ఎందుకంటే సత్యత ముందు అసత్యం నిలవలేదు. ఎలాగైతే భక్తిమార్గంలో సముద్రం మధ్యలో పాము పైన నాట్యం చేస్తున్నట్లుగా చిత్రం చూపించారు కదా. అది పాము అయినా సత్యతాశక్తి ద్వారా పాము కూడా నాట్యం చేసేందుకు స్టేజ్‌గా మారిపోయింది. ఎలాంటి భయంకర పరిస్థితి అయినా, మాయ భయంకర రూపం అయినా, సంబంధ-సంపర్కాల వారు బాధపెట్టేవారు అయినా, వాతావరణం ఎంత విషపూరితం అయినా సత్యతాశక్తి గలవారు వీటన్నిటినీ సంతోషంగా నాట్యం చేసే స్టేజ్‌గా చేసుకుంటారు. కావున ఈ చిత్రం ఎవరిది? మీ అందరిది కదా! అందరూ కృష్ణుడిగా అయ్యేవారే కదా! దీనిలో అందరూ చేతులెత్తుతారు కదా! రాముని చరిత్రలో ఇలాంటి విషయాలు లేవు. వారికి ఇప్పుడిప్పుడే వియోగం, ఇప్పుడిప్పుడే సంతోషం ఉంటాయి. కావున కృష్ణుడిగా అయ్యే ఆత్మలు ఇలాంటి స్థితి అనే స్టేజ్‌ పైన సదా నాట్యం చేస్తూ ఉంటారు. ఏ ప్రకృతి లేక మాయ లేక వ్యక్తి వైభవాలు వారిని కదిలించలేవు. మాయనే తమ స్టేజ్‌గా లేక శయ్యగా (పాన్పుగా) తయారు చేసుకుంటారు. ఈ చిత్రం చూశారు కదా! సర్పాన్ని శయ్యగా చేసుకున్నారు అనగా విజయీగా అయ్యారు. కావున సత్యతాశక్తికి గుర్తు - సత్యంగా ఉంటే నాట్యం చేస్తారు. ఈ చిత్రం కూడా ఉంది. సత్యతాశక్తి గలవారు ఎప్పుడూ మునిగిపోరు. సత్యతా నావ అటూ ఇటూ ఊగే ఆట చేస్తుంది కానీ మునిగిపోదు. ఊగడం కూడా ఆటగా అనుభవం చేస్తారు. ఈ రోజులలో ఆటలు కూడా కావాలని పైకి క్రిందకు కదిలించేలా చేస్తున్నారు కదా! పడిపోయేలాగా ఉంటుంది కానీ ఆట అయిన కారణంగా విజయీగా అనుభవం చేస్తారు. ఎంత అలజడి ఉన్నా ఆట ఆడేవారు నేను విజయాన్ని ప్రాప్తి చేసుకున్నాను అని భావిస్తారు. ఇలా సత్యతాశక్తి అనగా, ''విజయీ వరదానిగా'' స్వయాన్ని భావిస్తున్నారా? తమ విజయీ స్వరూపాన్ని సదా అనుభవం చేస్తున్నారా? ఒకవేళ ఇప్పటి వరకు ఇంకా ఏదైనా అలజడి, భయం ఉంటే సత్యతతో పాటు అసత్యం ఇంకా మిగిలి ఉంది. అందువలన అలజడిలోకి తీసుకొస్తూ ఉంది. కావున సంకల్పాలు, దృష్టి, వృత్తి, మాట మరియు సంబంధ-సంపర్కాలలో సత్యతాశక్తి అచలంగా ఉందా? అని పరిశీలించుకోండి. మంచిది ఈ రోజు కలుసుకునేవారు చాలామంది ఉన్నారు. అందువలన ఈ సత్యతాశక్తితో బ్రాహ్మణ జీవితంలో విశేషత సంపన్నంగా అయ్యి ఎలా నడవగలరో విస్తారంగా తర్వాత మరోసారి వినిపిస్తాను. అర్థమయిందా? డబల్‌ విదేశీ పిల్లలు క్రిస్‌మస్‌ జరుపుకున్నారు. ఈ రోజు కూడా క్రిస్‌మస్‌ కదా! బ్రాహ్మణ పిల్లల కొరకు సంగమయుగం జరుపుకునే యుగము. కావున రోజూ నాట్యం చెయ్యండి, పాడండి, సంతోషంతో జరుపుకోండి. కల్పం లెక్కతో సంగమ యుగము కొన్ని రోజులకే సమానం కదా! అందువలన సంగమయుగములోని ప్రతిరోజు గొప్ప రోజే(బడాదిన్‌). మంచిది. సత్యతాశక్తి స్వరూపులకు, సత్యమైన తండ్రి ద్వారా సత్యమైన వరదానం లేక వారసత్వాన్ని పొందేవారు, సదా సత్యతాశక్తి ద్వారా విజయీ ఆత్మలకు, సదా ప్రకృతిజీత్‌, మాయాజీత్‌, సంతోషంగా నాట్యం చేసేవారు - ఇటువంటి సత్యమైన పిల్లలకు సత్యమైన తండ్రి, శిక్షకుడు మరియు సద్గురువు యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే. దాది చంద్రమణిగారు బాప్‌దాదాతో శెలవు తీసుకొని పంజాబ్‌ వెళ్తున్నారు - పంజాబ్‌ నివాసుల నుండి మధువన నివాసులుగా అయిన పిల్లలందరూ ప్రియస్మృతులు స్వీకరించండి. పిల్లలందరు సదా నిశ్చింత చక్రవర్తులుగా అవుతున్నారు, ఎందుకు? యోగయుక్తులైన పిల్లలు సదా ఛత్రఛాయలోనే ఉన్నారు. యోగీ పిల్లలు పంజాబ్‌లో ఉండరు, కానీ బాప్‌దాదా ఛత్రఛాయలో ఉంటారు. పంజాబ్‌లో ఉండవచ్చు, ఎక్కడైనా ఉండవచ్చు కానీ ఛత్రఛాయ మధ్యలో ఉండే పిల్లలు సదా సురక్షితంగా ఉంటారు. అలజడిలోకి వస్తున్నట్లయితే ఏదో ఒక దెబ్బ తగులుతుంది కానీ అచలంగా ఉంటే దెబ్బలు తగిలే స్థానంలో ఉన్నా వెంట్రుక కూడా కదిలించలేరు. అందువలన బాప్‌దాదా చెయ్యి ఉంది, తోడు ఉంది కావున నిశ్చింత చక్రవర్తులుగా అయ్యి ఉండండి. అంతేకాక ఇలాంటి వాతావరణంలో శాంతి కిరణాలను బాగా వ్యాపింపజేయండి. నిరాశావాదులకు ఈశ్వరీయ ఆధారం అనే ఆశను ఇప్పించండి. అలజడిలో ఉన్నవారికి అవినాశి తోడు ఉందనే స్మృతిని ఇప్పించి అచంచలంగా తయారుచెయ్యండి. ఇదే సేవ పంజాబ్‌వారు విశేషంగా చెయ్యాలి. ఇంతకు ముందు కూడా చెప్పాను, పంజాబ్‌ వారు పేరును ప్రసిద్ధం చేసుకునే అవకాశం కూడా మంచిగా ఉంది. నలువైపులా ఏ ఆధారము కనిపించడం లేదు. ఇలాంటి సమయంలో మనసుకు విశ్రాంతి ఇచ్చేవారు, మనసుకు శాంతిని ఆధారంగా ఇచ్చేవారు ఈ శ్రేష్ఠమైన ఆత్మలే అని అనుభవం చేయాలి. అశాంతి సమయంలో శాంతికి మహత్వం ఉంటుంది కనుక ఇలాంటి సమయంలో శాంతి అనుభవం చేయడం కూడా ప్రత్యక్షతకు నిమిత్త ఆధారంగా అవుతుంది. కావున పంజాబ్‌వారు భయపడరాదు. కానీ ఇలాంటి సమయంలో అందరూ భయపెట్టేవారు కానీ వీరు ఆధారమునిచ్చేవారు అని అనుభవం చెయ్యాలి. ఏదైనా మీటింగ్‌ చేసి ప్లాన్‌ తయారుచేయండి. ఎవరైతే అశాంతి ఆత్మలున్నారో వారి సంఘటనలోకి వెళ్ళి శాంతిని అనుభవం చేయించండి. ఒకరు ఇద్దరికైనా శాంతిని అనుభూతి చేయిస్తే ఒకరి నుండి మరొకరికి అల వ్యాపిస్తూ ఉంటుంది, అంతేకాక శబ్ధము కూడా ప్రసిద్ధమవుతుంది. మీటింగ్‌ చేస్తున్నారు, చాలా మంచిది. ధైర్యం కలిగినవారు, ఉత్సాహం కలిగినవారు సదా ప్రతి కార్యంలో సహయోగిగా, స్నేహీగా, తోడుగా ఉన్నారు, ఇకముందు కూడా సదా ఉంటారు. పంజాబ్‌ నంబర్‌ వెనుక లేదు ముందు ఉంది. పంజాబ్‌ సింహం అని అంటారు. సింహం వెనుక ఉండదు, ముందు ఉంటుంది. ఏ ప్రోగ్రామ్‌ లభించినా అందులో హాజీ హాజీ(అలాగేనండి) అని అంటూ ఉంటే అసంభవం కూడా సంభవమవుతుంది. మంచిది, పిల్లలందరినీ కలుసుకున్న తర్వాత ఉదయం గం||5:30ని||లకు బాప్‌దాదా సద్గురువారం నాడు ప్రియస్మృతులు ఇచ్చారు. సత్యాతి సత్యమైన తండ్రి, సత్య శిక్షకుడు, సద్గురువు నుండి నలువైపులా అతిసమీపంగా, స్నేహీలుగా, సదా తోడుగా ఉన్న పిల్లలందరూ సద్గురువారం రోజు చాలా చాలా ప్రియస్మృతులు స్వీకరించండి. ఈ రోజు సద్గురువారం నాడు బాప్‌దాదా అందరికీ సదా సఫలతా స్వరూపులుగా ఉండండి, సదా ఉత్సాహ-ఉల్లాసాలతో ఉండండి, సదా తండ్రి ఛత్రఛాయలో సురక్షితంగా ఉండండి, సదా ఒకే బలం, ఒకే నమ్మకంలో స్థితులై ఉండి, సాక్షిగా అయ్యి అన్ని దృశ్యాలు చూస్తూ సంతోషంగా ఉండండి - విశేష స్నేహంతో నిండిన ఇలాంటి వరదానాలు ఇస్తున్నారు. ఈ వరదానాలను సదా స్మృతిలో ఉంచుకుంటూ సమర్థంగా ఉండండి. సదా గుర్తుండాలి మరియు సదా స్మృతిలో ఉండండి. మంచిది. అందరికి శుభోదయం మరియు సదా ప్రతిరోజుకు శుభాకాంక్షలు. మంచిది.విశేషంగా ఎన్నుకోబడిన అవ్యక్త మహా వాక్యాలు స్మృతిని జ్వాలా స్వరూపంగా చేసుకోండి :- మీ స్మృతి జ్వాలా స్వరూపంగా అయినప్పుడే తండ్రి సమానంగా పాపకటేశ్వరుడు లేక పాపహరిణిగా అవ్వగలరు. ఈ స్మృతియే మీ దివ్య దర్శనీయ మూర్తిని ప్రత్యక్షం చేస్తుంది. దీని కొరకు ఏ సమయం కూడా సాధారణ స్మృతి ఉండరాదు. సదా జ్వాలా స్వరూపం, శక్తి స్వరూప స్మృతిలో ఉండండి. స్నేహంతో పాటు శక్తిరూపం కంబైండ్‌గా ఉండాలి.వర్తమాన సమయంలో సంఘటిత రూపంలో జ్వాలా స్వరూపం అవసరముంది. జ్వాలా స్వరూప స్మృతియే శక్తిశాలి వాయుమండలాన్ని తయారు చేస్తుంది. అంతేకాక నిర్బల ఆత్మలన్నీ శక్తి సంపన్నంగా అవుతాయి. విఘ్నాలన్నీ సహజంగా సమాప్తి అయిపోతాయి, పాత ప్రపంచం యొక్క వినాశ జ్వాల ప్రజ్వలితం అవుతుంది. ఎలాగైతే సూర్యుడు విశ్వానికి ప్రకాశాన్ని ఇస్తూ అనేక వినాశీ ప్రాప్తుల అనుభూతి చేయిస్తాడో, అలా పిల్లలైన మీరు తమ మహాన్‌ తపస్వీ రూపం ద్వారా ప్రాప్తించిన కిరణాలను అనుభూతి చేయించండి. దీని కొరకు మొదట జమా ఖాతాను పెంచుకోండి. ఎలాగైతే సూర్యుని కిరణాలు నలువైపులా వ్యాపిస్తాయో అలా మీరు మాస్టర్‌ సర్వశక్తివంతుల స్థితిలో ఉన్నట్లయితే శక్తులు లేక విశేషతలు అనే కిరణాలు నలువైపులా వ్యాపిస్తున్న అనుభవం చేస్తారు. జ్వాలా రూపంగా అయ్యేందుకు ముఖ్యమైన సహజ పురుషార్థము - '' ఇప్పుడు ఇంటికి వెళ్లాలి అంతేకాక అందరినీ జతలో తీసుకెళ్లాలి '' అనే ధ్యాస సదా ఉండాలి. ఈ స్మృతి ద్వారా స్వత:గానే సర్వ సంబంధాలు, ప్రకృతి సర్వ ఆకర్షణల నుండి అతీతంగా అనగా సాక్షిగా అవుతారు. సాక్షిగా అయినందున సహజంగా తండ్రికి తోడుగా లేక తండ్రి సమానంగా అవ్వగలరు.జ్వాలా స్వరూప స్మృతి అనగా లైట్‌హౌస్‌ మరియు మైట్‌హౌస్‌(ప్రకాశ నిలయం మరియు శక్తి నిలయం) స్థితిని అర్థం చేసుకుంటూ ఇదే పురుషార్థంలో ఉండండ.ి విశేషించి జ్ఞాన స్వరూపం యొక్క అనుభవీలుగా అయ్యి శక్తిశాలిగా అవ్వండి. దీని ద్వారా శ్రేష్ఠ ఆత్మలైన మీ శుభ వృత్తి లేక కళ్యాణ వృత్తి మరియు శక్తిశాలి వాతావరణం ద్వారా తపిస్తున్న, భ్రమిస్తున్న, ఆర్తనాదాలు చేస్తున్న అనేక మంది ఆత్మలకు ఆనందము, శాంతి మరియు శక్తుల అనుభూతి కలగాలి. ఎలాగైతే అగ్నిలో ఏ వస్తువు వేసినా దాని నామ రూప గుణాలు అన్నీ మారిపోతాయో, అలా తండ్రి స్మృతి యొక్క లగ్నము అనే అగ్నిలో పడినందున పరివర్తన అవుతారు. మనుష్యుల నుండి బ్రాహ్మణులుగా అవుతారు. తర్వాత మళ్లీ బ్రాహ్మణుల నుండి ఫరిస్తాలుగా, దేవతలుగా అవుతారు. ఎలాగైతే పచ్చి మట్టిని అచ్చులో వేసి నిప్పులో పెట్టినట్లయితే ఇటుక తయారవుతుందో అలాగే ఇది కూడా పరివర్తన అవుతుంది. అందువలన ఈ స్మృతిని జ్వాలారూపమని అంటారు. సేవాధారి కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఒకే బలం, ఒకే నమ్మకం కలిగినవారు కావచ్చు ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ మాస్టర్‌ సర్వ శక్తివాన్‌ స్థితి అనగా లైట్‌ మైట్‌హౌస్‌ స్థితి ఈ స్థితిలోకి రావాలి. స్మృతి జ్వాలా రూపంగా అయినట్లయితే అందరూ మీ ముందు దీపపు పురుగుల్లాగా తిరగడం మొదలుపెడ్తారు.

జ్వాలా స్వరూపం స్థితి కొరకు మనస్సు మరియు బుద్ధి రెండిటికి, ఒకటి శక్తిశాలి బ్రేక్‌ కావాలి మరియు మలుచుకునే శక్తి కూడా కావాలి. దీనితో బుద్ధి శక్తి లేక ఏ శక్తి కూడా వృథా అవ్వకుండా జమ అవుతూ ఉంటుంది. ఎంత జమ అవుతుందో అంత పరిశీలనా శక్తి, నిర్ణయం చేసే శక్తి పెరుగుతాయి. దీని కొరకు ఇప్పుడు సంకల్పాల విస్తారాన్ని సమాప్తి చేస్తూ వెళ్ళండి అనగా సర్దుకునే శక్తిని ధారణ చెయ్యండి. ఏ కార్యము చేస్తున్నా లేక మాట్లాడుతున్నా మధ్య మధ్యలో సంకల్పాల ట్రాఫిక్‌ను స్టాప్‌ చెయ్యండి. ఒక్క నిమిషం కొరకు మనసులోని సంకల్పాలను, శరీరం ద్వారా చేస్తున్న కర్మను మధ్యలో ఆపి కూడా ఈ అభ్యాసం చేసినప్పుడు బిందురూపం యొక్క శక్తిశాలి స్థితిలో స్థితమవ్వగలరు. ఎలాగైతే అవ్యక్త స్థితిలో స్థితులై ఉంటూ కార్యం చెయ్యడం సరళంగా అవుతూ ఉందో అలాగే ఈ బిందురూప స్థితి కూడా సహజమవుతుంది.

ఏ కీటాణువులనైనా చంపేందుకు డాక్టర్లు కరెంట్‌ కిరణాలు(లేజర్‌ కిరణాలు) ఇస్తారు. అలాగే స్మృతి యొక్క శక్తిశాలి కిరణాలు ఒక్క సెకండులో అనేక వికర్మలనే కీటాణువులను భస్మం చేస్తాయి. వికర్మలు భస్మం అయిపోయినట్లయితే స్వయాన్ని తేలికగా మరియు శక్తిశాలిగా అనుభవం చేస్తారు.

నిరంతర సహజ యోగిగా అయితే ఉన్నారు. కేవలం ఈ స్మృతి యొక్క స్టేజ్‌ను మధ్య మధ్యలో శక్శిశాలిగా చేసేందుకు అటెన్షన్‌ అనే బలాన్ని నింపుతూ ఉండండి. పవిత్రత ధారణ సంపూర్ణ రూపంలో ఉంటే తమ శ్రేష్ఠ సంకల్పాల శక్తి, లగనం అనే అగ్నిని ప్రజ్వలితం చేస్తుంది. ఆ అగ్నిలో మొత్తం చెత్త అంతా భస్మం అయిపోతుంది. తర్వాత ఏది ఆలోచిస్తే అదే జరుగుతుంది. సేవ విహంగ మార్గంలో స్వత:గానే జరుగుతుంది.

జ్వాలతో అసురులను భస్మం చేశారు అని దేవీల స్మృతి చిహ్నంలో చూపిస్తారు. అసురులను కాదు, అసురీ శక్తులను సమాప్తి చేసేశారు. ఇది ఇప్పటి స్మృతి చిహ్నమే. ఇప్పుడు జ్వాలాముఖీగా అయ్యి రాక్షస స్వభావాలన్నిటిని భస్మం చెయ్యండి. ప్రకృతి మరియు ఆత్మల లోపల ఉన్న తమోగుణాన్ని భన్మం చేసేవారిగా అవ్వండి. ఇది చాలా పెద్ద పని. వేగంగా చేసినట్లయితే పూర్తవుతుంది.ఏ లెక్కాచారమైనా ఈజన్మది కావచ్చు వెనుకటి జన్మలది కావచ్చు, లగ్నమనే అగ్ని స్వరూప స్థితి లేకుండా భస్మమవ్వదు. సదా అగ్ని స్వరూప స్థితి అనగా జ్వాలా స్వరూప శక్తిశాలి స్మృతి. బీజరూప లైట్‌హౌస్‌ మైట్‌హౌస్‌ స్థితిలో పాత లెక్కాచారాలన్నీ భస్మం అవుతాయి. అంతేకాక మిమ్ములను మీరు డబల్‌ లైట్‌గా అనుభవం చేస్తారు. స్మృతి లింక్‌ సదా జోడింపబడి ఉన్నప్పుడే శక్తిశాలి జ్వాలా స్వరూప స్మృతి ఉంటుంది. ప్రతిసారి లింక్‌ తెగిపోతూ ఉంటే దానిని జోడించేందుకు సమయం పడ్తుంది, శ్రమ కూడా అవుతుంది మరియు శల్తిశాలిగా అయ్యేందుకు బదులు బలహీనంగా అవుతారు.

స్మృతిని శక్తిశాలిగా తయారు చేసుకునేందుకు విస్తారంలోకి వెళ్తూ సార స్థితి అభ్యాసము తక్కువ అవ్వరాదు. విస్తారములో సారమును మర్చిపోరాదు. తినండి, త్రాగండి, సేవ చెయ్యండి కాని అతీతత్వాన్ని మర్చిపోకండి. సాధన అనగా శక్తిశాలి స్మృతి. నిరంతరం తండ్రితో పాటు హృదయపూర్వక సంబంధం ఉండాలి. కేవలం యోగంలో కూర్చుంటే దానిని సాధన అని అనరు. ఎలాగైతే శరీరంతో కూర్చుంటారో అలా హృదయం, మనసు, బుద్ధి అన్నీ ఒక్క తండ్రి వైపు ఉంచి తండ్రితో పాటు కూర్చోవాలి. ఇలాంటి ఏకాగ్రత జ్వాలను ప్రజ్వలితం చేస్తుంది. మంచిది. ఓం శాంతి.